
ప్రసంగం అంతా అర్ధసత్యాలు, అసత్యాలే: ఉమ్మారెడ్డి
ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర ప్రగతి, ఎజెండా గురించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని, కానీ ప్రసంగం పూర్తిపాఠం చూస్తే అర్ధసత్యాలు, అసత్యాలు, అరచేతిలో వైకుంఠం చూపెట్టారు తప్ప వాస్తవాలు ప్రతిబింబించలేదని వైఎస్ఆర్సీపీ సీనియర్ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. వాస్తవ విరుద్ధమైన ప్రసంగం చేశారన్నారు. ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకోవాలన్నా.. గతంలో కేబినెట్ సమావేశంలోనే సీఎం ఓ విషయం చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రగతి రెండంకెల్లో సాధించాలని అనుకున్నామని, కానీ అవినీతి రెండంకెల్లో సాధించామని ఆయన కేబినెట్ భేటీలోనే ఒప్పుకున్నారన్నారు. కానీ ప్రసంగంలో మాత్రం అవినీతిని సమూలంగా తుడిచిపెట్టినట్లు చెప్పడం చూస్తే ఆత్మను చంపుకోవడమేనన్నారు.
జాతీయ వృద్ధిరేటు 7.31 శాతం ఉంటే ఇక్కడ మాత్రం 10.99 శాతం సాధించామని చెబుతుంటే అది ఎంతవరకు వాస్తవం, ప్రజలు ఎంతవరకు నమ్ముతారని ప్రశ్నించారు. ఓవైపు జీతాలు కూడా ఇవ్వలేకుండా ఇబ్బంది పడుతున్నామని చెబుతూ, మరోవైపు జాతీయ స్థాయి కంటే ఎక్కువ వృద్ధిరేటు సాధించినట్లు చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేన్నారు. వ్యవసాయ రంగంలో దిగుబడి ఎంత తగ్గిందో చెప్పలేదని మండిపడ్డారు. సాగు విస్తీర్ణం, రైతుల ఆదాయం అన్నీ తగ్గాయని, నిత్యావసరాల రేట్లు పెరిగినా అవేవీ చెప్పలేదన్నారు. ఇళ్ల నిర్మాణంలో తామిచ్చేది కేవలం లక్ష రూపాయలేనని, మిగిలినది రుణంగా అందజేస్తామని చెప్పారని ఎద్దేవా చేశారు. కరువు లేదని చెబుతున్నారు గానీ, అనంతపురం జిల్లా నుంచి 4 లక్షల మంది ఎందుకు వలస వెళ్లారని ప్రశ్నించారు. రుణమాఫీల గురించి ఎక్కడైనా మాట్లాడారా అని నిలదీశారు. కాబట్టి గవర్నర్ ప్రసంగం అర్ధసత్యాలు, అసత్యాలతోనే ఉందని ఉమ్మారెడ్డి మండిపడ్డారు.