
యోగ మనదే...
భాగ్యనగరం ‘యోగ’మంత్రం పఠించింది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మంగళవారం సిటీలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, దేవాలయాలు, పార్కులు, స్టేడియాలు, కాలనీలు, జైళ్లు...ఇలా అన్ని ప్రాంగణాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లల నుంచి ప్రముఖల వరకు అందరూ యోగాసనాలు వేసి ఆరోగ్య ప్రాధాన్యతను చాటారు.
గన్ఫౌండ్రీ : యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం ఎల్బి స్టేడియంలో పతంజలి యోగా సమితి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... యోగా మతానికి చెందినది కాదని, భారతీయ సంస్కతికి చిహ్నమన్నారు. అరబ్ దేశాల్లో సైతం యోగాను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. యోగాకు ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యోగాతో వ్యక్తిత్వ వికాసం, క్రమ శిక్షణ అలవడుతుందన్నారు. ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ... కొన్ని సంస్థలు, శక్తులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం యోగాపై దుష్ర్పచారం చేస్తున్నాయని ఆరోపించారు. అనంతరం పలు పాఠశాలలకు చెందిన విద్యార్ధుల యోగాసనాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, విశ్వహిందూ పరిషత్ రాష్ర్ట అధ్యక్షులు రామరాజు, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు.