అమెరికా వార్షిక బడ్జెట్ ఆమోదించడంలో ప్రతిష్టంభన ఏర్పడడంతో మొదలైన షట్డౌన్ ఐదో రోజూ కొనసాగింది. అత్యవసర సర్వీసులు మినహా మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగలేదు.
వాషింగ్టన్: అమెరికా వార్షిక బడ్జెట్ ఆమోదించడంలో ప్రతిష్టంభన ఏర్పడడంతో మొదలైన షట్డౌన్ ఐదో రోజూ కొనసాగింది. అత్యవసర సర్వీసులు మినహా మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగలేదు. అధికార డెమోక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో ఈ సంక్షోభానికి ఎప్పుడు తెరపడుతుందో తెలియడంలేదు. కాగా, తన మానసపుత్రిక ‘ఒబామాకేర్’ బీమా బిల్లుపై వెనక్కి తగ్గేది లేదని అధ్యక్షుడు బరాక్ ఒబామా తేల్చిచెప్పారు. ఏ విధమైన మార్పులు, చేర్పులు లేకుండా బిల్లును ఆమోదించాలని ప్రతిపక్షాలకు మరోసారి సూచించారు.
ప్రస్తుత షట్డౌన్ పరిస్థితి వల్ల రుణాలు చెల్లించకపోతే దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని, అందుకే బడ్జెట్ను ఆమోదించి ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని తన వారాంతపు సందేశంలో ప్రతిపక్షాలను కోరారు. మరోవైపు జీతాలు కోరకుండా పనిచేయాలని ఉద్యోగస్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని చట్టాల చట్రంలో ఎంతోకాలం బంధించలేరని, పుట్టబోయే బిడ్డని ఆపడం వారి వల్ల కాదని చెప్పారు. అయితే ఈ నెల 17 లోపు రుణపరిమితి పెంపుపై అమెరికా చట్టం చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా, షట్డౌన్ ముగిసిన తర్వాత సుమారు 8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులకు షట్డౌన్ కాలానికి జీతాలు చెల్లించేందుకు అమెరికా ప్రతినిధుల సభ అంగీకరించింది. రిపబ్లికన్ల ఆధిక్యం గల ప్రతినిధుల సభ శనివారం ఈ మేరకు ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది.