
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తదుపరి ట్రావెల్ బ్యాన్ ఏ దేశంపై ప్రయోగిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. పలు కొత్త, అదనపు దేశాలు ఈ జాబితాలో చోటుచేసుకోనున్నాయని ప్రచారం సాగుతోంది. అమెరికాతో సమాచారం పంచుకోని దేశాలపై ఈసారి వేటు పడవచ్చని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు పేర్కొన్నారు.నియంత్రణలు ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉండవచ్చని చెప్పారు. గతంలో ఆరు ముస్లిం ప్రాబల్య దేశాల విజిటర్లపై విధించిన 90 రోజుల నిషేధం ఆదివారంతో ముగుస్తున్న నేపథ్యంలో తాజా జాబితాపై పలు ఊహాగానాలు వెల్లడవుతున్నాయి.
ఈ జాబితాలో ఏయే దేశాలు, ఎన్ని దేశాలు ఉంటాయన్న సమాచారం వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. దీనిపై అధ్యక్షుడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు, అటార్నీ జనరల్, విదేశాంగ మంత్రి టిల్లర్సన్లతో ట్రంప్ సమావేశమై ఈ అంశంపై సంప్రదింపులు జరిపారని తెలిపారు. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత వస్తుందని వైట్హౌస్ ప్రతినిధి పేర్కొన్నారు.