
హైదరాబాద్: సంక్రాంతికి భారీ సినిమాలుగా ధియేటర్లపైకి దండెత్తనున్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ దాదాపు ఒకే సమయంలో విడుదలవుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. బన్నీ, ప్రిన్స్లు సంక్రాంతి సమరంలో తలపడటంతో రెండు సినిమాలు ప్రేక్షకాభిమానులను అలరించేందుకు మేకర్లు శ్రమిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నిర్ధేశకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సామజవరగమన, రాములో రాములా అభిమానులు, ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. అల వైకుంఠపురములోకు ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా సెప్టెంబర్ 27న తొలి పాటగా సామజవరగమనను విడుదల చేయగా 7.7 కోట్ల వ్యూస్ రాబట్టి బెస్ట్ మెలడీగా నిలిచింది.
ఇక మరో నెల రోజుల తర్వాత దీపావళి కానుకగా అక్టోబర్ 27న రాములో రాములా పాటను చిత్ర బృందం విడుదల చేయగా యూట్యూబ్లో ఇప్పటికే 4.3 కోట్ల వ్యూస్ వచ్చాయి. రెండు పాటలు ప్రేక్షకాదరణను పొందడం సరిలేరు నీకెవ్వరు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్పై ఒత్తిడి పెంచుతోంది. అల వైకుంఠపురములో పాటలను మించి క్యాచీ ట్యూన్స్ను ఇచ్చేందుకు దేవి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెబుతున్నారు. కనీసం రెండు హిట్ పాటలైనా ఇవ్వాలని చిత్ర బృందం దేవిశ్రీని కోరుతున్నట్టు తెలిసింది. ఇక దేవిశ్రీ ఇప్పటికే సామజవరగమనకకు దీటైన మెలొడీని కంపోజ్ చేశారని సరిలేరు..బృందం త్వరలోనే దీన్ని ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. మరి ఈ పాట సామజవరగమన, రాములో రాములా సృష్టించిన మేనియాను తిరగరాస్తుందా అన్నది వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment