మళ్లీ విలన్‌గా బాబీ? Hero Bobby Simha turns Villon roles | Sakshi
Sakshi News home page

మళ్లీ విలన్‌గా బాబీ?

Published Tue, Jun 13 2017 5:57 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

మళ్లీ విలన్‌గా బాబీ?

కోలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నటుల్లో బాబీసింహా ఒకరని చెప్పవచ్చు. లఘు చిత్రాలతో నట జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తరువాత వెండితెరకు పరిచయమయ్యారు. మొదట్లో ప్రతి నాయకుడిగా నటించి గుర్తింపు పొందారు. జిగర్‌తండా చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకుగానూ జాతీయ అవార్డును గెలుచుకున్న బాబీసింహా ఆ తరువాత కథానాయకుడిగా అవతారమెత్తారు. అయితే హీరోగా పెద్దగా సక్సెస్‌ కాలేకపోయారనే చెప్పాలి. ప్రస్తుతం బాబీసింహా తిరుట్టుప్పయలే 2, వల్లవనుక్కు వల్లవన్‌ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు.

వీటిలో వల్లవనుక్కు వల్లవన్‌ చిత్రానికి ఆయనే నిర్మాత. ఈ యువ నటుడు మళ్లీ విలన్‌ వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తున్న కరుప్పన్‌ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది. అదే విధంగా హరి దర్శకత్వంలో విక్రమ్‌ కథానాయకుడిగా నటించనున్న సామి-2లో ప్రతినాయకుడిగా నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తాజా సమాచారం.

అయితే ఇందులో విలన్‌గా నటించడానికి బాబీసింహా భారీ పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు, అంత పారితోషికం ఇవ్వడానికి దర్శకుడు సుముఖంగా లేరని కోలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అన్నది త్వరలోనే తెలుస్తుందనుకోండి. మొత్తం మీద బాబీ విలన్‌గా మరోసారి తన సత్తా చాటనున్నారన్న మాట.

Advertisement
 
Advertisement
 
Advertisement