![పుట్టుమచ్చలు చెరిపేశాడు](/styles/webp/s3/article_images/2017/09/5/61490035415_625x300.jpg.webp?itok=frlOjzpD)
పుట్టుమచ్చలు చెరిపేశాడు
పుట్టుకతో శరీరంపై వచ్చిన మచ్చలను మాయం చెయ్యొచ్చా? అనడిగితే... చేసేయొచ్చు. వైద్య రంగంలో వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ... లేజర్ చికిత్సతో పుట్టుమచ్చలను మాయం చేయవచ్చు. ఇప్పుడు తమిళ హీరో ధనుష్ ఆ పనే చేశాడని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అతడికి కోర్టులో చిక్కులు తప్పేట్లు కనిపించడం లేదు.
ధనుష్ తమ కుమారుడేనని తమిళనాడులోని మధురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మధురై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం... వాళ్ల వాదనల్లో నిజం లేదని ధనుష్ పేర్కొనడం తెలిసిన విషయాలే. పలుమార్లు విచారణ జరిపిన అనంతరం కదిరేశన్ దంపతులు కోరినట్టు ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు లేజర్ చికిత్స ద్వారా పుట్టుమచ్చలను రూపుమాపారని సోమవారం కోర్టుకు ఓ నివేదిక సమర్పించారు. దీంతో కదిరేశన్ దంపతుల వాదన నిజమే కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.