
ప్రభాస్ సరసన నూతన తార!
చెన్నై: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ప్రభాస్ నటించబోతున్నాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లో జరుపుకోనుందట. ప్రభాస్ హోం ప్రొడక్షన్స్ యువి క్రియేషన్స్, గోపీకృష్ణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
సరికొత్త కాన్సెప్ట్ లవ్ స్టోరీతో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ లోకేషన్లు కూడా ఇప్పటికే నిర్మాతలు ఫిక్స్ చేసేశారు. ఇక ప్రభాస్ సరసన నటించే కథానాయికి కోసం సెర్చింగ్ జరుగుతోందని దర్శకుడు రాధాకృష్ణ తెలిపారు. అయితే ఈ సినిమాలో నూతన తారను పరిచయం చేయటానికి ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించి ఆడిషన్ కార్యాక్రమం జరుగుతోందని తెలిపారు. మరికొద్దిరోజుల్లో హీరోయిన్ ఎంపిక ఫైనలైజ్ అవుతుందన్నారు.
కాగా కథ గురించి మాత్రం దర్శకుడు రాధాకృష్ణ పెదవి విప్పలేదు. అయితే ఈ చిత్రంలో హీరో చేయి చూసి జాతకాలు చెప్పేస్తుంటాడట. అలా చెప్పే విషయాలు అన్ని నిజం అవుతుంటాయట. ఆ విద్య వల్ల కథానాయకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ సినిమా కాన్సెప్ట్ అట. కాగా బాహుబలి-2 తర్వాత ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే రాధాకృష్ణ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.