
జోధ్పూర్ ప్యాలెస్లో జాకీచాన్ స్టెప్పులు!
దుబాయ్: మార్షల్ ఆర్ట్స్ స్టార్ జాకీచాన్ హీరోగా తెరకెక్కుతోన్న ఇండో-చైనీస్ చిత్రం ‘కుంగ్ఫూ యోగా’. స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ తారలు 'లోఫర్' ఫేమ్ దిశా పాట్నీ, 'అనేకుడు' ఫేమ్ అమైరా దస్తర్ కథానాయికలు కాగా, విలన్ గా సోనూ సూద్ చేస్తున్నాడు. 'కుంగ్ ఫూ యోగా' మూవీ షూటింగ్ లో భాగంగా జాకీచాన్ సోమవారం (మార్చి 21న) భారత్ కు రానున్నాడు రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డులు 2016లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మాట్లాడుతూ... జాకీచాన్ తో కలిసి తాను నటిస్తున్నానని, ఆ మూవీ కోసం ఆయన భారత్ కు రానున్నారని తెలిపాడు. గతంలో 'ద మిత్' మూవీలో బాలీవుడ్ ఐటమ్ బాంబు మల్లికా షెరావత్, జాకీచాన్ తో కలిసి నటించింది. 2013లోనూ మూవీ షూటింగ్ కోసం జాకీచాన్ భారత్ కు వచ్చాడు.
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భారత్ తో మూడు సినిమాల కోసం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అందులో కుంగ్ ఫూ యోగా ఒకటి. కొన్ని వేల ఏళ్ల క్రితం పర్వత శ్రేణుల్లో దాగిన ఓ నిధి చుట్టూ సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్లో జాకీ పురావస్తు పరిశోధన విభాగ అధ్యాపకునిగా కనిపించనున్నారట. ఇందులో బాలీవుడ్ శైలిలో సాగే ప్రత్యేక గీతంలో అమైరా దస్తర్, దిశా పాట్నీలతో కలిసి జాకీచాన్ కాలు కదపనున్నారట. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జోధ్పూర్ ప్యాలెస్లో ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ జరగనుంది. ఈ 21న జాకీచాన్ ఇందు కోసం ఇండియా రానున్నాడు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పాటను మూడు వారాల పాటు చిత్రీకరిస్తారని సోనూ సూద్ వివరించాడు.