
పెరంబూరు: బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యంస్వామి ఆత్మపరిశీలన చేసుకోవాలని నటి కస్తూరి వ్యాఖ్యానించారు. ఇటీవల ఈమె సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయపరమైన అంశాల గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వార్తల్లో ఉంటున్నారనే చెప్పాలి. శనివారం ఉదయం మదురై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయరంగప్రవేశం చేస్తున్న నటుడు కమలహాసన్, రజనీకాంత్ల గురించి స్పందిస్తూ వారి విషయాన్ని ప్రజలు చూసుకుంటారని అన్నారు.
అయితే నటీనటులపై ఆరోపణలు చేస్తే ఏం పట్టించుకోరులే అన్న భావనతో బీజీపీ నాయకుడు సుబ్రహ్మణ్యంస్వామి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తారలు ఎవరో రాసిచ్చిన వాటిని వళ్లివేస్తారని సుబ్రమణ్యంస్వామి లాంటి వారు ఆరోపించే ముందు వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఆ తరవాతనే మాట్లాడాలని అన్నారు. నటుడు విజయకాంత్ మార్పు తీసుకొస్తారని భావించారని, అయితే ఆయన ఆరోగ్యపరమైన కారణాల రీత్యా జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. కమలహాసన్, రజనీకాంత్ విషయాన్ని ప్రజలు చూసుకుంటారని కస్తూరి పేర్కొన్నారు. అయితే సినీతారలు ఇంతకు ముందు రాజకీయ చరిత్రలో స్థానం సంపాదించారని, ఈ విషయాన్ని సుబ్రహ్మణ్యంస్వామి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె అన్నారు.