
అది ఏఎన్నార్ మ్యాజిక్: నాగార్జున
హైదరాబాద్: 'మనం' సినిమాలో బోర్ కొట్టించే సన్నివేశాలు లేవని అక్కినేని నాగార్జున తెలిపారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఇప్పటి ట్రెండ్కు తగినట్టుగా ఈ సినిమా తీశామని ఆయన వెల్లడించారు. తన మొదటి సినిమా విడుదలైన మే 23నే మనం కూడా విడుదలకానుండడం యాధృచ్చికమని చెప్పారు.
ఎన్నికలు ముగిసిన వారం తర్వాత విడుదల చేయాలన్న ఉద్దేశంతో 23వ తేదీని ఎంచుకున్నామని వివరించారు. ఇదే రోజు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పుట్టినరోజు కూడా అని చెప్పారు. అలాగే మనం పదాన్ని ఇంగ్లీషులో ఎటువైపు నుంచి చదివినా ఒకేలా ఉంటుందన్నారు. ఇవన్ని అనుకుని చేసివని కాదన్నారు. అది ఏఎన్నార్ మ్యాజిక్ అని నాగార్జున అన్నారు.
చివరి క్షణం వరకూ నటునిగానే కొనసాగాలన్న నాన్నగారి ఆశకు ప్రతిరూపమే ‘మనం’ సినిమా అని నాగార్జున అంతకుముందు చెప్పారు. నాన్నగారి చివరి సినిమా ‘మనం’ జన హృదయాల్లో కలకాలం గుర్తుండిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.