‘మనసును మాయ సేయకే’ పాటలు
‘‘మేం నిర్మించిన ‘నీకు నాకు డాష్ డాష్’ ద్వారా హీరోగా పరిచయమైన ప్రిన్స్ వరుసగా సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం అతను నటించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఆనంద్ప్రసాద్. ప్రిన్స్, రిచా పనయ్, దిశా పాండే, సేతు ముఖ్య తారలుగా ఫుల్హౌస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం ‘మనసును మాయ సేయకే’. సురేష్ పి. కుమార్ దర్శకత్వంలో జైసన్ పులికొట్టిల్, విన్స్ మాంగ్డన్ నిర్మిస్తున్నారు.
మణికాంత్ కద్రి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ వేడుకలో నవదీప్, సందీప్కిషన్, నవీన్చంద్ర, రమేష్ పుప్పాల, తిరుమలరెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఆడియో సీడీని నవదీప్, సందీప్కిషన్, నవీన్ ఆవిష్కరించారు. అతిథులందరూ ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రిన్స్ మాట్లాడుతూ - ‘‘నా మొదటి సినిమా నుంచి యువహీరోలందరూ సహకరించడం ప్రోత్సాహకరంగా ఉంది. మంచి కథ, పాటలు కుదిరాయి.
తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ఇలాంటి మంచి చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని రిచా, దిశా తెలిపారు. ఇంకా ఈ వేడుకలో దర్శక, నిర్మాతలతో పాటు యూనిట్ సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సంపత్.