
యూనిట్ అంతా కంటతడి పెట్టింది
కొన్ని చిత్రాల్లో ఎంత బలమైన సన్నివేశం అయినా కృత్రిమంగా అనిపిస్తాయి. మరి కొన్ని చిత్రాల్లో అది నటన అని తెలిసినా గుండెల్ని పిండించి కంట తడిపెట్టిస్తాయి. తాజాగా నాన్ అవళై సందిత్త పోదు చిత్రంలో చిత్ర యూనిట్నే కంటతడి పెట్టించిన సన్నివేశాన్ని దర్శకుడు ఇటీవల చిత్రీకరించారు. సినిమా ప్లాట్ఫాం పతాకంపై రితీష్కుమార్ నిర్మిస్తున్న చిత్రం నాన్ అవళై సందిత్తపోదు. దీనికి ఎల్జీ.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈయన ఇంతకు ముందు మాసాణి, ఐందామ్ తలైమురై సిద్ధవైద్య శిఖామణి చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. సంతోష్ ప్రతాప్, చాందిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు విన్సెంట్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో ఇమాన్ అన్నాచ్చి, జీఎం.కుమార్, రాధ, పరుత్తివీరన్ సుజాత, శ్రీరంజని, శ్యామ్,పీటీ. గజేంద్రన్, గోవిందమూర్తి నటిస్తున్నారు.
సినిమా నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ దర్శకుడు జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుంతోంది. చిత్రంలో హీరో తల్లి మరణించిన సన్నివేశాన్ని ఇటీవల దర్శకుడు చిత్రీకరించారు. తల్లి మరణంతో హీరో గుండె పగిలేలా ఏడ్చి నటించిన ఆ సన్నివేశం చిత్ర యూనిట్నే కంట తడి పెట్టిందని దర్శకుడు వెల్లడించారు. కుట్ర లం, అంబాసముద్రం, తెన్కాశీ పరిసర ప్రాంతాల్లో చిత్ర షూటింగ్ను ఏకదాటిగా నిర్వహిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. దీనికి హిదేశ్ మురుగన్ సంగీతాన్ని అందిస్తున్నారు.