![ఎన్నెన్నో వర్ణాల హరివిల్లు](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/2/81416591727_625x300.jpg.webp?itok=REIABJWU)
ప్రేమించుకున్న మనుషులు దూరమైనా.. మనసులు మాత్రం కలిసే ఉంటాయని తెలిపే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ‘ఓనమాలు’ ఫేం క్రాంతిమాధవ్ దర్శకుడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ -‘‘మనసుల్ని మెలిపెట్టే పరిణతి చెందిన ప్రేమకథాచిత్రమిది.
ప్రేమ గొప్పతనాన్ని హృద్యంగా తెలియజెప్పాడు దర్శకుడు. సాహితి రచించిన ‘ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే...’ అనే పల్లవితో సాగే పాటకు స్వర్ణ మాస్టర్ నృత్య రీతుల్ని సమకూర్చగా, పాండిచ్చేరిలో హీరోహీరోయిన్లపై చిత్రీకరించాం. దీంతో షూటింగ్ పూర్తయింది. నిత్యామీనన్, శర్వానంద్ల జంట యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం, గోపీసుందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి అతి త్వరలో పాటల్ని, త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.