
శీనుతో శ్రుతి
కొత్త హీరోల సరసన స్టార్ హీరోయిన్లను నటింపజేయడమంటే... ఇది వరకు తలకు మించిన పని. కానీ... ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సంస్థ, దర్శకుడు, పారితోషికం... ఈ మూడూ సరిగ్గా ఉంటే... కొత్తబ్బాయిలతో జతకట్టడానికి కూడా మన స్టార్ హీరోయిన్లు వెనుకాడటం లేదు. ఈ ట్రెండ్ బాలీవుడ్లో ఎప్పట్నుంచో ఉంది. దక్షిణాదికే కొత్త. ఈ మధ్య ‘అల్లుడుశీను’తో కలిసి సమంత, తమన్నా ఆడిపాడారు. ఇప్పుడు శ్రుతీ వంతు వచ్చింది.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందనున్న తదుపరి సినిమాలో కథానాయికగా నటించడానికి శ్రుతి పచ్చజెండా ఊపేశారని ఫిలింనగర్ సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే శ్రుతికి బోయ పాటి కథ వినిపించేశారట. శ్రుతీహాసన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్కి వెళ్లనుంది.