
సాక్షి, హైదరాబాద్ : సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం భేటీ అయ్యారు. నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాల్లో స్థలం సేకరించాలని ఈ సందర్భంగా మంత్రి తలసాని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కల్చరల్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాల సేకరణ చేయాలని సూచించారు. సినీ, టీవీ కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలన్నారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్లకు త్వరితగతిన అనుమతులు ఇస్తామని తెలిపారు. ఎఫ్డీసీ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పైరసీ నివారణకు ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
కాగా, కొద్ది రోజుల కిత్రమే చిరంజీవి, నాగార్జునలు మంత్రి తలసానితో భేటీ అయిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసంలో ఈ భేటీ జరిగింది. అయితే దానికి కొనసాగింపుగానే నేటి సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment