
ఇంతకూ మణిరత్నం సినిమా ఎవరితో?
మణిరత్నం సినిమాలో ఊహించని ట్విస్టులు ఉండవు కానీ, ప్రస్తుతం ఆయన చేయాలనుకుంటున్న సినిమాకు మాత్రం బోలెడన్ని ట్విస్టులు ఎదురవుతున్నాయి.
మణిరత్నం సినిమాలో ఊహించని ట్విస్టులు ఉండవు కానీ, ప్రస్తుతం ఆయన చేయాలనుకుంటున్న సినిమాకు మాత్రం బోలెడన్ని ట్విస్టులు ఎదురవుతున్నాయి. నాగార్జున-మహేశ్బాబు కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. నాగ్ సరసన ఐశ్వర్యారాయ్, మహేశ్కి జోడీగా శ్రుతీహాసన్ నటించనున్నారని కూడా వివరాలు తెలిశాయి. మణిరత్నం సతీమణి, నటి సుహాసిని ఓ తమిళ టీవీ చానల్తో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ధ్రువీకరించారు కూడా. నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఆంగ్ల పత్రికతో ప్రస్తావించారు. అయితే మహేశ్బాబు మటుకు తనకు తాను ఎక్కడా ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పలేదు. ఆయన ఇప్పుడున్న బిజీలో ఈ సినిమా చేస్తారా అనేది పెద్ద డౌటే. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అనే సందేహాలు చాలామందిలో ముసురుకున్నాయి. ఒకవేళ ఈ హీరోలిద్దరూ రిజెక్ట్ చేస్తే మణిరత్నం పరిస్థితి ఏంటి? తాజాగా... ఫిలిమ్నగర్లో వినిపిస్తున్న కబురు ఏంటంటే... రాజకీయాల్లో ఉన్న ఓ అగ్ర కథానాయకునికి మణిరత్నం ఈ వారంలో కథ వినిపించనున్నారట. ఆయన కనుక ఓకే చేస్తే, వెంటనే ప్రాజెక్ట్ మొదలవుతుందట. అందులో ఆయనతో పాటు, ఆయన తనయుడు కూడా నటించే అవకాశం ఉందట.