
నియంత్రణ రేఖ దాటిన 12ఏళ్ల పాక్ బాలుడు
జమ్ముకశ్మీర్: పాకిస్థాన్కు చెందిన పన్నెండేళ్ల బాలుడు నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి అడుగుపెట్టాడు. అనుమానాస్పదంగా అతడు సంచరిస్తుండటంతో భారత ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఇరు దేశాల మధ్య ఉన్న నియంత్రణ రేఖ గుండా గస్తీకి వెళుతుండగా అతడు కనిపించినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు.
వారు ప్రాథమికంగా తెలుసుకున్న సమాచారం ప్రకారం ఆ బాలుడు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని దంగర్ పేల్ అనే గ్రామానికి చెందిన ఓ పదవీ విరమణ పొందిన బాలోచ్ రెజిమెంట్ సోల్జర్ కుమారుడు. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్ వద్ద బాలుడు ఆర్మీకి తారస పడ్డాడు. రెక్కీ నిర్వహించేందుకే ఆ బాలుడిని పాక్ ఆర్మీ పంపించినట్లు తాము భావిస్తున్నామన్నారు. ఎక్కడెక్కడ చొరబాట్లకు అవకాశం ఉందో తెలుసుకునేందుకే ఆ బాలుడు వచ్చినట్లు అనుమానిస్తున్నామని అతడిని పోలీసులకు అప్పగించనున్నట్లు చెప్పారు.