line of control
-
BSF: 150 మంది ఉగ్రవాదులు కాచుక్కూర్చున్నారు..
శ్రీనగర్: శీతాకాలం సమీపిస్తున్నండగా కశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి 150 మంది వరకు ఉగ్రవాదులు మన భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్(సరిహద్దు భద్రతా దళం) తెలిపింది. చొరబాటుదారులు చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ‘చొరబాటు యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ నిఘా విభాగాల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దుల్లో భద్రతపై అప్రమత్తంగా ఉన్నాం’అని బీఎస్ఎఫ్ ఐజీ(కశ్మీర్) అశోక్ యాదవ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ‘పాక్ వైపు సరిహద్దులకు సమీపంలోని స్థావరాల్లో ఉండే ముష్కరుల గురించిన అంచనాలను బట్టి, చొరబాటుయత్నాలను తిప్పికొట్టి, వారిపై పైచేయి సాధించేలా మా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం’అని యాదవ్ వివరించారు. ‘ఎల్వోసీకి సమీపంలోని స్థావరాల్లో కాచుకుని ఉండే ఉగ్రవాదుల సంఖ్య 130–150 మధ్య మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంతకంటే కాస్త ఎక్కువమందే ఉండొచ్చు’అని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎల్వోసీ వెంట ఉన్న తంగ్ధర్, కెరన్ సెక్టార్ల పరిధిలో డ్రగ్స్ అక్రమ రవాణాకు అవకాశాలున్నాయంటూ ఆయన..వీటిని అడ్డుకునేందుకు మొబైల్ బంకర్లు, మహిళా ట్రూపర్లను రంగంలోకి దించామని వెల్లడించారు. స్మగ్లర్లు డ్రగ్స్ కొరియర్లుగా మహిళలను వాడుకుంటున్నారని ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. -
ఎల్ఓసీ వద్ద పేలిన ల్యాండ్మైన్.. ఆర్మీ జవాన్ మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో ల్యాండ్మైన్పై కాలు పెట్టడంతో పేలుడు సంభవించి భారత ఆర్మీ జవాను ప్రాణాలు విడిచాడు. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం 10.30 గంటలకు జరిగింది. రాజౌరీ జిల్లా నౌషేరాలో నియంత్రణ రేఖ వెంబడి సైనికులు పెట్రోలింగ్లో ఉండగా ఒక జవాను ల్యాండ్మైన్పై అడుగు పెట్టడంతో ప్రమాదవశాత్తూ అది ట్రిగ్గర్ అయ్యింది. దీంతో పేలుడు సంభవించండో ముగ్గురు ఆర్మీ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఉధంపూర్లోని కమాండ్ ఆసుపత్రికి తరలించగా ఒక సైనికుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అయితే మరణించిన జవాన్ వివరాలను ఇంకా భారత ఆర్మీ వెల్లడించలేదు. -
ఎల్ఏసీ వెంట చైనా మోహరింపులు
వాషింగ్టన్: అది 2022 సంవత్సరం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ. ఆ సమయంలో చైనా చడీచప్పుడూ లేకుండా వాస్తవాదీన రేఖ వెంబడి అన్నిరకాలుగా బలపడే ప్రయత్నాలు చేస్తూ వచి్చంది. ముఖ్యంగా అరుణాచల్ప్రదేశ్ వెంబడి సైనిక మోహరింపులను విపరీతంగా పెంచేసింది. డోక్లాం వెంబడి భూగర్భ నిల్వ వసతులను పటిష్టపరుచుకుంది. మరెన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంది. పాంగాంగ్ లేక్ మీదుగా రెండో వంతెనతో పాటు డ్యుయల్ పర్పస్ ఎయిర్పోర్టు, మలి్టపుల్ హెలిపాడ్లను నిర్మించుకుంది. తూర్పు లద్దాఖ్ వెంబడి పలుచోట్ల కొన్నేళ్లుగా చైనా సైన్యం కయ్యానికి కాలుదువ్వడం, మన సైన్యం దీటుగా బదులివ్వడం తెలిసిందే. ముఖ్యంగా మూడేళ్లుగా అక్కడ ఇరు సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘చైనాలో సైనిక, భద్రతాపరమైన పరిణామాలు–2023’ పేరిట అమెరికా రక్షణ శాఖ తాజాగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. ‘2020 మే నుంచే భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర ఉద్రిక్త స్థాయికి చేరడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రెండు డివిజన్ల జిన్జియాంగ్, టిబెట్ మిలిటరీ డి్రస్టిక్ట్స్ దన్నుతో ఒక బోర్డర్ రెజిమెంట్నే ఏర్పాటు చేసింది. నాలుగు కంబైన్డ్ ఆర్మీ బ్రిగేడ్ (సీఏబీ) తదితరాలను 2022లో వాస్తవా«దీన రేఖ వెంబడి రిజర్వులో ఉంచింది. మరో మూడు సీఏబీలను ఇతర కమాండ్ల నుంచి తూర్పు సెక్టార్కు తరలించి సిద్ధంగా ఉంచింది. తర్వాత వీటిలో కొన్నింటిని వెనక్కు పిలిపించినా మెజారిటీ సేనలు ఇప్పటికీ వాస్తవా«దీన రేఖ వెంబడే మోహరించే ఉన్నాయి’ అని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2020 జూన్లో గల్వాన్ లోయలో ఇరు సైన్యాలు తీవ్ర ఘర్షణకు దిగడం తెలిసిందే. ఆ నేపథ్యంలో చైనా ఈ చర్యలకు దిగిందని నివేదిక వెల్లడించింది. ఈ మోహరింపులు ఇలాగే కొనసాగవచ్చని అభిప్రాయపడింది. ఇక భూటాన్ వెంబడి వివాదాస్పద ప్రాంత సమీపంలో చైనా ఏకంగా ఊళ్లనే ఏర్పాటు చేసిందని తెలిపింది. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు! ప్రయోగానికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్న అణు వార్ హెడ్లు చైనా వద్ద ఏకంగా 500 దాకా ఉన్నట్టు పెంటగాన్ నివేదిక పేర్కొంది. ‘గత రెండేళ్లలోనే ఏకంగా 100 వార్హెడ్లను తయారు చేసుకుంది. 2030 కల్లా వీటిని కనీసం 1,000కి పెంచడమే డ్రాగన్ దేశం లక్ష్యంగా పెట్టుకుంది’ అని నివేదిక వివరించింది. 300కు పైగా ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు తదితరాలు ఇప్పటికే చైనా అమ్ములపొదిలో చేరినట్టు వివరించింది. వాటిని దేశవ్యాప్తంగా మూడు చోట్ల అండర్గ్రౌండ్ వసతుల్లో అతి సురక్షితంగా ఉంచింది. ‘వీటితో పాటు సంప్రదాయ ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల తయారీని మరోసారి వేగవంతం చేసింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నావికా దళం ఇప్పటికే చైనా సొంతం. ఏడాదిలోనే 30 యుద్ధ నౌకలను నిర్మించుకుంది. దాంతో చైనా వద్ద మొత్తం యుద్ధ నౌకలు ఏకంగా 370కి చేరాయి. వీటిని 2025 కల్లా 400కు, 2030 కల్లా 450కి పెంచే యోచనలో ఉంది’ అని పేర్కొంది. ‘విదేశాల్లో సైనిక స్థావరాలను పెంచుకునేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేసింది. నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, బర్మా, సాల్మన్ దీవులు, థాయ్లాండ్, తజకిస్థాన్, ఇండొనేసియా, పపువా న్యూ గినియా వంటి దేశాల్లో వ్యూహాత్మక సైనిక స్థావరాలను పెంచుకునేలా కనిపిస్తోంది’ అని నివేదిక తెలిపింది. -
చొరబాటుకు యత్నించిన ముగ్గురు పాక్ తీవ్రవాదులు హతం
శ్రీనగర్: బారాముల్లా ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ముగ్గురు పాక్ తీవ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత భూభాగమైన యూరిలోకి చొరబడేందుకు ప్రయత్నించగా భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, గూఢచారి ఏజెన్సీలు చేసిన జాయింట్ ఆపరేషన్లో ముగ్గురూ మృతి చెందినట్లు చినార్ కార్ప్స్ ఇండియన్ ఆర్మీ ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించింది. ఇండియన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం బారాముల్లా వద్ద పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ముగ్గురు తీవ్రవాదులు వాస్తవాధీన రేఖను దాటుకుని యురి వైపుగా వస్తుండటాన్ని గమనించి సైనికులు అప్రమత్తమై కాల్పులు జరిపారని దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పాకిస్తాన్ దళాలు మాపై కాల్పులు జరపడంతో మరో మృతదేహాన్ని క్యాప్చర్ చేయడం సాధ్యపడలేదని తెలిపారు. మూడో మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్తుండగా పాక్ దళాలు కాల్పులు జరపడం 2021లో వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు విరమణకు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. యురి సెక్టార్లో ఇప్పటికీ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. Update Op Khanda, #Uri A Joint operation was launched today morning in Uri Sector. Contact established & firefight ensued. 03xTerrorists eliminated. 02xAK Rifles, 01xPistol, 07xHand Grenades, 01xIED and other war like stores along with Pak Currency Notes recovered. Joint… — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) September 16, 2023 ఇది కూడా చదవండి: మాటలు జాగ్రత్త.. విద్వేషాలను రెచ్చగొట్టకూడదు -
ఎల్ఓసీ వెంట చైనా దుశ్చర్య
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట పాకిస్తాన్ సైన్యం రక్షణపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఈ పనులకు పొరుగున ఉన్న దాని మిత్రదేశం చైనా సహకరిస్తోందని భారత ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, కమ్యూనికేషన్ టవర్లను పాకిస్తాన్కు చైనా అందజేస్తోందని చెప్పారు. భూగర్భæ కేబుళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పీఓకేలో చైనా స్థావరాలు పెరుగుతున్నాయని, వాటి రక్షణ కోసం పాక్ సైన్యానికి సాయం అందిస్తోందని అన్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న 155 ఎంఎం ఎస్హెచ్–15 శతఘ్నులను ఎల్ఓసీ వద్ద పాక్ మోహరించిందని పేర్కొన్నారు. పాక్ సైనిక పోస్టుల వద్ద చైనా సైనికాధికారులు తరచుగా కనిపిస్తున్నారని తెలియజేశారు. ఇదిలా ఉండగా, ఈ మొత్తం వ్యవహారంపై భారత సైన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తన ప్రయోజనాల కోసం చైనా చేస్తోందని నిపుణులంటున్నారు. -
ఎల్ఏసీ వద్ద పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చైనాతో సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో సమగ్రంగా చర్చ జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘సరిహద్దులు దాటి మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు. మన ఆర్మీ పోస్టులను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని మూడేళ్ల క్రితం గల్వాన్ ఘర్షణలు జరిగాక అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ చెప్పారు. చైనా సైనికులు సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చేందుకు, మన భూభాగంలో టెంట్లు వేసేందుకు ప్రయతి్నంచడంతో గల్వాన్ ఘటన జరిగిందంటూ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇవి రెండూ పరస్పర విరుద్ధ ప్రకటనలు’అని తివారీ తెలిపారు. అందుకే భారత్–చైనా సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపడంతోపాటు గత మూడేళ్లుగా ఎల్ఏసీ వెంట జరుగుతున్న వాస్తవ పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బాధ్యతాయుత ప్రతిపక్షంగా కాంగ్రెస్ కోరుతోందన్నారు. ‘ఎల్ఏసీ వెంట ఉన్న 65 పెట్రోలింగ్ పాయింట్లకు గాను 26 వరకు మన ఆర్మీ నియంత్రణలో లేవన్న విషయం నిజమా? చైనా ఆక్రమణలను మనం ఎందుకు ఆపలేకపోయాం?’అని తివారీ కేంద్రాన్ని నిలదీశారు. -
బోర్డర్లో రెచ్చిపోతున్న చైనా.. నివేదికలో పలు సంచలన అంశాలు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద డ్రాగన్ దేశం చైనా రెచ్చిపోతోంది. డ్రాగన్ సైన్యం భారత భూభాగంలోకి క్రమంగా చొచ్చుకొస్తూ సరిహద్దును సైతం మార్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన డీజీపీల సమావేశంలో చైనా వ్యవహారంపై అధికారులు సమర్పించిన ఓ నివేదికలో పలు సంచలన అంశాలు బహిర్గతమయ్యాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో భారత్–చైనా సైనికుల నడుమ మరిన్ని ఘర్షణలు జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక కథనాన్ని వెలువరించింది. భారత్–చైనాల మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలు, నిఘా సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ‘‘2013–14 తర్వాత రెండు మూడేళ్లకోసారి ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతల తీవ్రత పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సరిహద్దులో ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక బలగాలను పెంచుకుంటున్నాయి. చైనా చర్యల వల్ల తూర్పు లద్దాఖ్లో భారత్ ఇప్పటికే పలు కీలక గస్తీ పాయింట్లను కోల్పోయింది. చైనా దూకుడును అడ్డుకోవాలంటే సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలి. సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అని సూచించారు. -
భారత్-చైనా సరిహద్దు గస్తీపై చైనా అధ్యక్షుడు ఎంక్వైయిరీ
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆసక్తికర పరిణామానికి దారి తీశారు. తూర్పు లడఖ్లో భారత్-చైనా సరిహద్దులో ఉన్న చైనా సైనికులతో వీడియోకాల్లో ముచ్చటించారు. అక్కడ గస్తీ నిర్వహణపై ఎంక్వైయిరీ చేశారు. సరిహద్దు వెంబడి పరిస్థితుల గురించి సైనికులను అడిగి తెలుసుకున్నాడు. అలాగే అక్కడ నిరంతరం మారుతున్న పరిస్థితులు గురించి ఆరా తీశారు జిన్పింగ్. ఈ మేరకు ఆయన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి జిన్పింగ్ ఖుంజెరాబ్లోని సరిహద్దు రక్షణ స్థితిపై అక్కడ సైనికులను ఉద్దేశించి కాసేపు ప్రసంగించారు. అలాగే వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి గస్తీ కాస్తున్న సైనికులు తాము సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నామంటూ అధ్యక్షుడి జిన్పింగ్కి బదులిచ్చారు. సైనికులు అక్కడ ఎలా ఉంటున్నారో తెలుసుకోవడమే గాక వారి క్షేమ సమాచారాలను కూడా జిన్పింగ్ తెలుసుకున్నారు. వారు ఉన్న ప్రదేశాల్లో తాజా కూరగాయాలు దొరుకుతున్నాయో లేదా అని కూడా అడిగారు. అంతేగాదు జిన్పింగ్ సరిహద్దులో పోరాడేందకు వారికి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తామని కూడా సైనికులకు భరోసా ఇచ్చారు. కాగా, ఇదే తూర్పు లడఖ్ ప్రాంతంలో 2020,మే5న పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘర్షణ చెలరేగి భారత్ చైనాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. అదీగాక తూర్ప లడఖ్ సరిహద్దు స్టాండ్ ఆఫ్పై భారత్, చైనా ఇరుపక్షాలు 17 రౌండ్ల ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరిపాయి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి శాంతి, ప్రశాంతత అవసరమని భారత్ నొక్కి చెప్పింది. (చదవండి: పుతిన్ బతికే ఉన్నాడా! తెలియడం లేదు! జెలెన్స్కీ షాకింగ్ వ్యాఖ్యలు) -
‘చైనా పే చర్చ’ ఎప్పుడు ?
న్యూఢిల్లీ: ఛాయ్ పే చర్చా అంటూ ప్రతీసారి మాట్లాడే ప్రధాని మోదీ.. కీలకమైన చైనా అంశంపై ‘చైనా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిలదీశారు. ‘అరుణాచల్లో వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికుల చొరబాటు యత్నంతో దేశ ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించి వారిలో విశ్వాసం పాదుకొల్పేలా ఎప్పుడు మాట్లాడతారు ? అని ప్రధాని మోదీకి ఖర్గే సూటి ప్రశ్నవేశారు. ‘ దేశ ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే సింహద్వారం ‘సిలిగురి కారిడార్’ భద్రతకు మరింత ముప్పు వాటిల్లేలా చైనా డోక్లామ్లో శాశ్వత నిర్మాణాలు పూర్తిచేసినట్లు వార్తలొచ్చాయి. డోక్లామ్ నుంచి జంపేరీ రిట్జ్ వరకు నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది దేశ భద్రతను మరింత ప్రమాదంలోకి నెట్టేయడమే. ఇలాంటి కీలక తరుణంలో ‘చైనా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారు?’ అని ఖర్గే శనివారం ట్వీట్చేశారు. కాగా, ప్రధాని వీటికి సమాధానాలు చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పలు ప్రశ్నలు ట్వీట్చేశారు. 1. తూర్పు లద్దాఖ్లో 2020 జూన్ 20న భారత భూభాగంలోకి చైనా చొరబడలేదని ఎందుకు చెప్పారు ? 2. 2020 మే నెల ముందువరకు అక్కడి వేలాది కి.మీ.ల విస్తీర్ణంలో పహారా కాసే మన సేనలను ఆ తర్వాత చైనా సైన్యం అడ్డుకుంటే మీరేం చేశారు ? 3. కేబినెట్ ఆమోదించిన ‘పర్వతప్రాంత మెరుపు దాడి దళం’ కార్యరూపం ఎందుకు దాల్చలేదు? -
ఈశాన్యంలో వైమానిక విన్యాసాలు ప్రారంభం
న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంతంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ జెట్లతో సహా ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ పరిధిలోఉన్న సుఖోయ్–30 యుద్ధవిమానం, ఇతర అత్యాధునిక యుద్ధ విమానాలు ఇందులో పాల్గొంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికుల చొరబాటు యత్నం నేపథ్యంలో ఈ విన్యాసాలు ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఇవి జరుగుతున్నాయని, సైనికుల ఘర్షణతో వీటికి సంబంధం లేదని భారత వైమానిక దళం స్పష్టం చేసింది. విన్యాసాలు శుక్రవారం ముగియనున్నాయి. ఇదిలా ఉండగా, 36 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్కు చేరుకున్నాయని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. దీంతో ఒప్పందం మేరకు మొత్తం విమానాలు వచ్చినట్లయ్యిందని పేర్కొంది. -
గోగ్రా నుంచి మూడు రోజుల్లో సైన్యం వెనక్కి
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్లోని గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో సైన్యాన్ని వెనక్కి ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి ఈ నెల 12 సోమవారం వరకు గడువు ఉందని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి గత రెండేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న గోగ్రా–హాట్స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ 15 దగ్గర్నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియను మొదలు పెట్టామని భారత్, చైనా ప్రకటించిన ఒక్క రోజు తర్వాతే భారత్ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వచ్చేవారం ఉజ్బెకిస్తాన్లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఇతర అంశాలను కూడా పరిష్కరించుకొని సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్టుగా విదేశాంగ శాఖ అధికారప్రతినిధి అరిందమ్ బగాచి చెప్పారు. గురువారం ఉదయం 8.30 గంటలకు మొదలైన సైన్యం ఉపసంహరణ సోమవారంతో ముగియాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలనూ ధ్వంసం చేస్తున్నటు చెప్పారు. 2020 జూన్ గల్వాన్లోయలో ఘర్షణలు జరగడానికి ముందు ఎలా ఉండేదో అలా ఉండేలా ఇరు పక్షాలు చర్యలు తీసుకుంటాయన్నారు. -
సరిహద్దుల వద్ద 250 మంది ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్ర శిబిరాల్లో 250 ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. చొరబాట్లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి రవాణాతోపాటు సరిహద్దుల ఆవలి నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ ఆందోళన కలిగిస్తోందని డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. చలికాలం రానున్నందున 12 వేల అడుగుల ఎత్తులో గస్తీ విధుల నిర్వహణ మరింత కఠిన తరం కానుందన్నారు. నిఘా వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. ఇద్దరు ఉగ్రవాదులు హతం అనంత్నాగ్ జిల్లా పొష్క్రీరి ప్రాంతంలో భద్రతా బలగాలతో ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని డనిష్ భట్, బషరత్ నబీగా గుర్తించారు. -
కశ్మీర్ సరిహద్దుల్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో సమీపంలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ఉత్తర కశ్మీర్లోని బందిపొర జిల్లా గురేజ్ సెక్టార్లోని గజ్రాన్ నల్లాహ్ వద్ద ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం లైన్ ఆఫ్ కంట్రోల్కు అతి దగ్గర్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అస్వస్థతకు గురైన ఓ బీఎస్ఎఫ్ జవాన్ను తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో పైలట్, కో-పెలట్ ఉన్నట్లు తెలిపారు. An Indian Army Cheetah helicopter has crashed in the Baraum area of Gurez sector of Jammu and Kashmir. The search parties of the security forces are reaching the snow-bound area for the rescue of the chopper crew. More details awaited: Defence officials pic.twitter.com/LMFunz5c0a — ANI (@ANI) March 11, 2022 ల్యాండింగ్ కోసం హెలికాప్టర్ ప్రయత్నించినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో వెనక్కి మళ్లినట్లు ఓ అధికారి చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి రెస్క్యూ బృందాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా ప్రమాదంలో పైలట్ మృతిచెందినట్లు, కో పైలట్ గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: ఆమ్ ఆద్మీ పార్టీకి మోదీ అభినందనలు.. కేజ్రీవాల్ రిప్లై ఇదే -
చైనా నుంచి భారత్కు పెను సవాళ్లు
వాషింగ్టన్: భారత్కు ప్రధానంగా డ్రాగన్ దేశం చైనా నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా దుందుడుకు వైఖరి భారత్కు ఆందోళకరంగా పరిణమిస్తోందని పేర్కొంది. ఈ మేరకు ఇండో–పసిఫిక్ ప్రాంతంతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై జో బైడెన్ ప్రభుత్వ విధానాన్ని వివరిస్తూ శ్వేతసౌధం తన తొలి నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని ప్రభావవంతమైన దేశం భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకుంటామని నివేదికలో తెలియజేసింది. రెండు దేశాలు కలిసి పని చేస్తాయని అభిప్రాయపడింది. దక్షిణాసియాలో అస్థిరతకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్స్పేస్ తదితర కీలక రంగాల్లో అమెరికా, భారత్ పరస్పరం సహకరించుకోవాలని సూచించింది. ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని శ్వేతసౌధం తెలిపింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యానికి తలుపులు తెరవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఈ ప్రాంతంలో భారత్ ప్రబలమైన శక్తిగా ఎదిగేందుకు మద్దతిస్తామని ప్రకటించింది. భారత్ నాయకత్వ స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించింది. భారత్ తమ భాగస్వామ్య దేశమని ఉద్ఘాటించింది. దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతే పెద్దన్న అని స్పష్టం చేసింది. ఇండియాతో కలిసి పనిచేస్తాం.. ఆస్ట్రేలియా, తదితర దేశాల తరహాలో కాకుండా భారత్ భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉందని, పొరుగు దేశం చైనా నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని వైట్హౌజ్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎల్ఏసీ వద్ద చైనా ప్రవర్తన భారత్పై తీవ్ర ప్రభావం చూపుతున్న మాట వాస్తమేనని అన్నారు. గత ప్రభుత్వ(డొనాల్డ్ ట్రంప్ సర్కారు) హయాంలో భారత్–అమెరికా మధ్య సంబంధాలు చెప్పుకోదగిన స్థాయిలో విస్తృతమయ్యాయని గుర్తుచేశారు. ఈ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని బైడెన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. తమలాగే మరో ప్రజాస్వామ్య దేశమైన ఇండియాతో కలిసి పనిచేసే విషయంలో ఎన్నో అవకాశాలు కళ్లెదుట కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఇండియాతోపాటు ఇండోనేషియా, మలేసియా, మంగోలియా, న్యూజిలాండ్, సింగపూర్, తైవాన్, వియత్నాం, పసిఫిక్ దీవులతో సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ‘క్వాడ్’ మినిస్టీరియల్ సదస్సు జరిగిన రోజే ‘ఇండో–పసిఫిక్ ప్రాంతంతో వ్యూహాత్మక భాగస్వామ్యం’పై బైడెన్ ప్రభుత్వం తొలి నివేదికను విడుదల చేయడం విశేషం. -
మీ సైనికుడి మృతదేహాన్ని తీసుకెళ్లండి: ఇండియన్ ఆర్మీ
శ్రీనగర్: తమ దేశ సైనికుడి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని పాకిస్తాన్కు భారత్ ఆర్మీ తెలిపింది. శనివారం నియంత్రణ రేఖ వద్ద చోటు చేసుకున్న చొరుబాటును భారత్ ఆర్మీ ముందుగానే పసిగట్టి కాల్పులు జరిపింది. కెరాన్ సెక్టర్లో నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో పాక్ ఆర్మీ బోర్డర్ యాక్షన్ టీమ్కు చెందిన సైనికుడు మృతి చెందినట్లు మేజర్ జనరల్ ఏఎస్ పెంధార్కర్ పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి మహ్మద్ షబీర్ మాలిక్గా గుర్తించామని తెలిపారు. పాకిస్తాన్ వైపున భారత చొరబాటు నిరోధక వ్యవస్థ ఉన్న చోట ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. భారత్లోకి చొరబడటానికి ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. అయితే భారత్ సైనికులు జరిపిన కాల్పులో ఓ వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. అతని వద్ద ఏకే రైఫిల్, మందుగుండు సామాగ్రి, 7గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని స్పష్టంగా తెలుస్తోందని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని పాక్కు సమాచారం అందిచినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి వద్ద పాకిస్తాన్ జాతీయ గుర్తింపు కార్డు, పాక్ వైద్యశాఖ జారీ చేసిన కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు. అందులోని ఫోటోలో సదరు వ్యక్తి పాక్ ఆర్మీ దుస్తుల్లో కనిపిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఇరుదేశాల మధ్య ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘింగిచే చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. -
‘పక్కా’గా కట్టేస్తోంది
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం తన దురాక్రమణను యధేచ్ఛగా కొనసాగిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా ఏడాది కాలంలోనే వాస్తవాధీన రేఖ వెంబడి 60 భవనాల సముదాయాన్ని నిర్మించింది. అంతర్జాతీయ సరిహద్దులు, వాస్తవాధీన రేఖ మధ్యలో భారత్ భూభాగంలో 6 కి.మీ. పరిధిలో ఈ కొత్త భవనాలు వెలిశాయి. 2019లో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ ప్రాంతంలో భవనాలేవీ లేవు. ఎన్డీటీవీ వార్తా సంస్థ తాజాగా సంపాదించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ భవనాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరుణాచల్ సరిహద్దుల్లో 100 ఇళ్లతో కూడిన ఒక గ్రామాన్నే నిర్మించిన చైనా దానికి 93 కి.మీ. దూరంలో తూర్పున ఈ భవన సముదాయాన్ని నిర్మించింది. మరోవైపు భారత్ ఆర్మీ ఈ శాటిలైట్ చిత్రాలను చూసి వాస్తవాధీన రేఖకి ఉత్తరాన ఈ భవన నిర్మాణం జరిగిందని, ఆ ప్రాంతం చైనా వైపే ఉందని అంటోంది. అరుణాచల్ సీఎం ప్రేమ ఖాండూ ఇతర ప్రభుత్వ అధికారులెవరూ ఈ కొత్త నిర్మాణాలపై పెదవి విప్పడం లేదు. చైనా గత దశాబ్దకాలంగా సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలను పెంచుతోంది. నిఘా రెట్టింపు చేస్తోంది. భారత్తో కయ్యానికి కాలు దువ్వుతూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఏకంగా 100 ఇళ్లతో కూడిన గ్రామాన్నే నిర్మించినట్టు ఈ ఏడాది మొదట్లోనే ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడింది. ఇటీవల అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కూడా ఈ విషయాన్ని తన నివేదికలో ధ్రువీకరించింది. ఇలా ఇష్టారాజ్యంగా సరిహద్దుల్లో ఆక్రమణలు పెంచుకుంటూ వెళితే చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోమని భారత్ హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ చైనా ఏకపక్షంగా సరిహద్దుల్లో పౌరులు నివాసాలు ఏర్పరుచుకోవడానికి వీలుగా కొత్త భూ సరిహద్దు చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. భూటాన్లో 4 గ్రామాలు నిర్మించిన చైనా భూటాన్లో చైనా దురాక్రమణ జోరుగా సాగుతోంది. డోక్లాం పీఠభూమికి సమీపంలో ఇటీవల చైనా 4 గ్రామాలను నిర్మించింది. దీనికి సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను కాంగ్రెస్ నేతలు పలువురు గురువారం ట్వీట్చేశారు. ఈ ఏడాది మే–నవంబర్ మధ్య చైనా ఈ నిర్మాణాలను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇలా సరిహద్దుల్లో చైనా భూముల్ని ఆక్రమించడం దేశ భద్రతకు పెనుముప్పుగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. -
పీపీ–15 నుంచి వెనక్కి వెళ్లిపోండి: చైనాకు తెగేసి చెప్పిన భారత్
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. భారత్–చైనా మధ్య 13వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక చర్చలు ఆదివారం జరిగాయి. ఇరు దేశాల నడుమ చుషుల్–మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ చర్చలు రాత్రి 7 గంటలకు ముగిశాయని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. 8.30 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపాయి. భారత్ తరఫు బృందానికి లేహ్లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పి.జి.కె.వీునన్ నేతృత్వం వహించారు. ప్రధానంగా తూర్పు లద్దాఖ్ హాట్స్ప్రింగ్స్ ప్రాంతంలోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–15 నుంచి బలగాల ఉపసంహరణ గురించే చర్చించినట్లు తెలిసింది. గత ఏడాది మే నెలలో చోటుచేసుకున్న ఘర్షణ పురావృతం కాకుండా సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేపట్టాలని, ఇందుకోసం కొత్త ప్రోటోకాల్స్ రూపొందించుకోవాలని ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే, దీనిపై సైన్యం నుంచి అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. గోగ్రా నుంచి ఉపసంహరణ పూర్తి 2020 మే 5వ తేదీన తూర్పు లద్దాఖ్లో భారత్–చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరువైపులా పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా వివిధ స్థాయిల్లో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. రాజకీయ, దౌత్య, సైనిక పరమైన చర్చలు జరుగుతున్నాయి. 12వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఈ ఏడాది జూలై 31న జరిగాయి. ఈ చర్చల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గోగ్రా నుంచి తమ బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్, చైనా పూర్తి చేశాయి. ఇరు దేశాల నడుమ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడాలంటే డెస్పాంగ్తో సహా అన్ని వివాదాస్పద ప్రాంతాలపై ఒక ఒప్పందానికి రావాలని భారత్ నొక్కి చెబుతోంది. ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను అతిక్రమించి ఉత్తరాఖండ్లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో 13వ దఫా చర్చలు సాఫీగా సాగడం విశేషం. -
కుటుంబానికొక్కరు సైన్యంలోకి
న్యూఢిల్లీ: భారత్కు దీటుగా సరిహద్దుల్లో బలాన్ని పెంచుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని డ్రాగన్ దేశం చైనా వినియోగించుకుంటోంది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించడమే లక్ష్యంగా టిబెట్ యువతను సైన్యంలోకి తీసుకుంటోంది. టిబెట్లోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున సైన్యంలో చేరాల్సిందేనని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ, చైనా సైన్యం) ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నుంచి టిబెట్లోని యువతకు పీఎల్ఏ వివిధ విధేయత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని భారత నిఘావర్గాలు తెలిపాయి. వారికి మాండరిన్ బోధించడం, మిగతా అన్నిటి కంటే చైనా కమ్యూనిస్టు పార్టీయే మిన్న అని వారిలో నూరిపోయడం వంటివి చేపట్టిందని పేర్కొన్నాయి. ఎంపికైన వారికి కొండ ప్రాంతాల్లో, కఠిన శీతల పరిస్థితుల్లో విధి నిర్వహణపై శిక్షణ అందిస్తోందని వెల్లడించాయి. టిబెటన్లను సైన్యంలోకి తీసుకోవడం ద్వారా అనేక అనుకూలతలను సాధించాలని చైనా భావిస్తోంది. మొదటగా, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం, పీఎల్ఏ పట్ల యువతలో విధేయతను సాధించడం, టిబెట్ అటానమస్ రీజియన్లోని ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించడం. రెండోది..లద్దాఖ్ వంటి కఠిన పరిస్థితులుండే ప్రాంతంలో పీఎల్ఏకు భద్రత విధుల భారం తగ్గించడం. మూడోది, ముఖ్యమైంది.. కఠిన పరిస్థితులుండే లద్దాఖ్, హిమాచల్ప్రదేశ్లోని ఎల్ఏసీ వెంట భారత్లోని ప్రవాస టిబెటన్లు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో వారికి దీటుగా టిబెటన్లను అంతే స్థాయిలో ఎల్ఏసీ వెంట శాశ్వత ప్రాతిపదికన రంగంలోకి దించడం అని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది పాంగాంగో సో సరస్సు దక్షిణం వైపు ఎల్ఏసీ వెంట పీఎల్ఏ చొచ్చుకు వచ్చే అవకాశాలున్నాయని అనుమానించిన భారత్ టిటెటన్లతో కూడిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ను మొఖపరి, బ్లాక్ టాప్, ఇతర కొండ ప్రాంతాల్లో ఆక్రమించి చైనాకు షాకిచ్చింది. అప్పటి ఈ పరిణామమే చైనాను టిబెటన్ యువత వైపు మొగ్గేలా చేసిందని భావిస్తున్నారు. నేడు భారత్–చైనా 12వ రౌండ్ చర్చలు సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో దాదాపు మూడున్నర నెలల తర్వాత ఈనెల 31వ తేదీన భారత్, చైనాల సైనికాధికారులు చర్చలు జరపనున్నారు. తూర్పు లద్దాఖ్లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా హాట్ స్ప్రింగ్స్, గోగ్రాల నుంచి సైనికబలగాల ఉపసంహరణలో కొంత పురోగతి సాధించడంపై రెండు వర్గాలు దృష్టి పెడతాయని సైనిక వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు తూర్పు లద్దాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట చైనా భూభాగంలోని మోల్దో బోర్డర్ పాయింట్లో కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు మొదలు కానున్నాయి. రెండు దేశాల సైనికాధికారుల మధ్య భారత్ భూభాగంలోని చుషుల్ వద్ద ఏప్రిల్ 9వ తేదీన 11వ విడత చర్చలు జరిగాయి. 11వ విడత చర్చల తర్వాత ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా సానుకూలంగా లేకపో వడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. గత ఏడాది మే నెల నుంచి తూర్పు లద్దాఖ్లో రెండు దేశాలు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. -
దృఢ భారత్.. నేతాజీకి గర్వకారణం
కోల్కతా/సాక్షి, న్యూఢిల్లీ: బలమైన భారతదేశం నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) నుంచి వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వరకూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగు జాడల్లో నడుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నేతాజీ ఇప్పుడు జీవించి ఉంటే అన్ని విధాలా బలోపేతమైన భారత్ను చూసి గర్వపడేవారని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి మనమే సొంతంగా టీకాలు అభివృద్ధి చేసుకోవడం, ఇతర దేశాలకు సైతం టీకాలను అందజేయడం, మన దేశ సార్వభౌమత్వానికి సవాలు ఎదురైనప్పుడు దీటుగా జవాబు ఇవ్వడం చూసి నేతాజీ ఎంతగానో గర్వపడేవారని పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ‘పరాక్రమ్ దివస్’ వేడుకలను కేంద్ర ప్రభుత్వం శనివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఎల్ఏసీ నుంచి ఎల్ఓసీ వరకు బలమైన భారత్ రూపుదిద్దుకోవాలని నేతాజీ కలలుగన్నారని, ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తున్నామని తెలిపారు. అజేయమైన సైనిక శక్తి మన సొంతమని చెప్పారు. తేజస్, రఫేల్ వంటి అత్యాధునిక ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లను సమకూర్చుకున్నామని వివరించారు. దీవికి బోస్ పేరుపెట్టడం నా అదృష్టం ఆత్మనిర్భర్ భారత్, సోనార్ బంగ్లాను(బంగారు బెంగాల్) కలగనడానికి నేతాజీ గొప్ప స్ఫూర్తి అని నరేంద్ర మోదీ కొనియాడారు. బోస్ పేరు విన్నప్పుడల్లా తాను ఎంతగానో స్ఫూర్తి పొందుతానని చెప్పారు. ఆయన స్వాతంత్య్రం కోసం అర్థించలేదని, దాని కోసం పోరాటం సాగించారని శ్లాఘించారు. 2018లో అండమాన్లోని ఓ దీవికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా నామకరణం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బోస్కు సంబంధించిన ఫైళ్లను ప్రజల ముందుంచామని అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్ఏ) సభ్యులు సైతం గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి ఒక్క భారతీయుడు బోస్కు రుణపడి ఉన్నాడని ఉద్ఘాటించారు. 130 కోట్ల మందిలోని ప్రతి రక్తం చుక్క బోస్కు రుణపడి ఉంటుందన్నారు. గృహ నిర్బంధం నుంచి తప్పించుకొనే ముందు సుభాష్ చంద్రబోస్ తన మేనల్లుడు శిశిర్ బోస్ను ‘నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా?’ అంటూ ప్రశ్నించారని గుర్తుచేశారు. గుండెపై చెయ్యి వేసుకొని, నేతాజీ సమక్షంలో ఉన్నట్లు ఊహించుకుంటే అదే ప్రశ్న వినిపిస్తుందన్నారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించినట్లుగానే ఆత్మనిర్భర్ భారత్లోనూ బెంగాల్ ముఖ్యమైన పాత్ర పోషించాలన్నారు. జైశ్రీరామ్లో తప్పేముంది?: బీజేపీ మమతా బెనర్జీ తీరు పట్ల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వర్గియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఓ వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జైశ్రీరామ్ నినాదంలో తప్పేముందని నిలదీశారు. జైశ్రీరామ్ అనేది రాజకీయ నినాదం కాదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. ఈ నినాదంలో ఎలాంటి తప్పు లేదని, నేతాజీ జయంతిని రాజకీయం చేయొద్దని నేతాజీ బంధువు చంద్రకుమార్ బోస్ సూచించారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించారని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్రంజన్ చౌదరి ధ్వజమెత్తారు. ఒక మహిళను పది మందిలో అవమానించడం దారుణమన్నారు. ఈ ఘటన తమ రాష్ట్రానికే అవమానమని సీపీఎం సీనియర్ నేత బిమన్ బోస్ పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతుండగా నినాదాలు చేయడాన్ని టీఎంసీ ముఖ్య అధికార ప్రతినిధి డెరెక్ ఓ బ్రెయిన్ తప్పుపట్టారు. బోస్ నివాసంలో మోదీ కోల్కతాలో సుభాష్ చంద్రబోస్ నివాసం ‘నేతాజీ భవన్’ను ప్రధాని మోదీ సందర్శించారు. అనంతరం నేషనల్ లైబ్రరీలో నేతాజీపై నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్లో పాల్గొన్నారు. అక్కడ కళాకారులు, ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. నన్ను పిలిచి అవమానిస్తారా? బెంగాల్ సీఎం మమత విక్టోరియా మెమోరియల్ హాల్లో జరిగిన నేతాజీ జయంతి కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురయ్యింది. ప్రసంగించేందుకు ఆమె ఉద్యుక్తురాలు కాగానే కొందరు ప్రధాని సమక్షంలో జైశ్రీరామ్ అంటూ బిగ్గరగా నినదించారు. దీంతో అసహనానికి గురైన మమత ప్రసంగించేందుకు నిరాకరించారు. తనను ఈ వేడుకకు పిలిచి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమే తప్ప రాజకీయ కార్యక్రమం కాదన్నారు. ఇలాంటి చోట మర్యాద పాటించాలన్నారు. పిలిచి అవమానించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. తాను ఇక మాట్లాడబోనని, జై బంగ్లా, జైహింద్ అంటూ ముగించారు. -
పరాక్రమంతో తిప్పికొట్టాం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాక్లోని వాస్తవాధీన రేఖవద్ద, భారత సైనిక దళాలు అత్యంత ధైర్యంతో, పరాక్రమంతో చైనా బలగాలను తిప్పికొట్టాయని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ‘‘ చరిత్రలో తనకోసం తాను పోరాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు దేశం ఎవరితోనైనా పోరాడితీరుతుంది. మనుగడ కోసం ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధం అవుతుంది’’అని ఎఫ్ఐసీసీఐ వార్షిక సమావేశం సందర్భంగా రాజ్నాథ్సింగ్ అన్నారు. దేశంలో రైతాంగం చేస్తున్న ఆందోళనలను గురించి వ్యాఖ్యానిస్తూ రాజ్నాథ్ సింగ్ వ్యవసాయం ఒక ‘‘మాతృ విభాగం’’ అని, వ్యవసాయరంగాన్ని తిరోగమన దిశలో పయనింపజేసే ఎటువంటి చర్యలను చేపట్టే సమస్యేలేదని ఆయన నొక్కి చెప్పారు. కవ్వింపులకు బదులిస్తాం:రావత్ కోల్కతా: చైనా వైపు నుంచి ఎలాంటి కవ్వింపులు ఎదురైనా గట్టిగా బదులు చెప్పేందుకు భారత సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) టిబెట్లో పలు అభివృద్ధి పనుల్లో నిమగ్నమైందని అన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ లేదని అన్నారు. -
సరిహద్దుల్లో డ్రాగన్ మరో కుట్ర
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లోని భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం మరో కుట్రకు తెరలేపింది. మెక్మోహన్ రేఖ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సుమారు 65 చదరపు కిలోమీటర్ల భారత భూభాగం తమదేనంటూ వాదించేందుకు సరిహద్దులకు అత్యంత సమీపంలో మూడు వరకు గ్రామాలను నిర్మించింది. తూర్పు లద్దాఖ్లో ఒకవైపు భారత్తో కయ్యానికి కాలుదువ్వుతూనే మరోవైపు ఈ ప్రణాళికను అమలు చేసింది. భారత్–చైనా–భూటాన్ సరిహద్దులు కలిసే బూమ్లా కనుమకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతంలో ఈ గ్రామాలను ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ సహా అన్ని వసతులను కల్పించింది. అన్ని వేళలా ప్రయాణించేందుకు వీలుండే రహదారులను నిర్మించింది. హన్ చైనీయులు, టిబెట్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన పశుపోషకులను ఈ గ్రామాల్లోకి తరలించింది. 2017లో భారత్– చైనా బలగాల మధ్య డోక్లాం ప్రతిష్టంభన చోటు చేసుకున్న ప్రాంతానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో, భూటాన్ భూభాగంలో కొన్ని గ్రామాలను చైనా అక్రమంగా నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడైన వారానికే ఈ పన్నాగం బయటపడటం గమనార్హం. క్రమక్రమంగా సరిహద్దులకు సమీపంలోకి చొచ్చుకువచ్చి తిష్టవేసేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తోందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ 2017లోనే అప్పటి ఆర్మీ చీఫ్, ప్రస్తుత చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించడం గమనార్హం. అరుణాచల్ సరిహద్దుల వెంట ఉన్న భూభాగం అంతా తమదేనని వాదించేందుకు చైనా ఈ ఎత్తుగడలకు పాల్పడుతోందని విశ్లేషకుడు డాక్టర్ బ్రహ్మ చెల్లనీ అంటున్నారు. భారత్ మాత్రం మెక్మోహన్ రేఖే సరిహద్దులకు ప్రాతిపదిక అంటూ తిప్పికొడుతోంది. ఉపగ్రహ చిత్రాలు ఏం చెబుతున్నాయి? ప్లానెట్ ల్యాబ్స్ నుంచి ఎన్డీటీవీ సంపాదించిన నివేదికను బట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఉపగ్రహ చిత్రాన్ని బట్టి భారత సరిహద్దులకు సమీపంలోని కొండలపై 20 వరకు ఇళ్లున్న ఒకే ఒక్క గ్రామం ఉంది. నవంబర్ 28వ తేదీన ఉపగ్రహం పంపిన రెండో చిత్రంలో అక్కడికి సమీపంలోనే మరో 50 వరకు ఇళ్ల నిర్మాణాలు కనిపిం చాయి. మరో 10 ఇళ్ల నిర్మాణా లతో మరో ప్రాంతం కూడా అక్కడికి సమీపంలోనే ఉన్నట్లు ఎన్డీటీవీ తెలిపింది. మొత్తంగా చైనా ఆ ప్రాంతంలో కనీసం మూడు గ్రామాలను నిర్మించినట్లు తేలింది. చైనా అధికార గ్లోబల్ టైమ్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ గ్రామాల్లో ఉండే పశుపోషకులు సరిహద్దులను కాపలా కాస్తుంటారని కూడా పేర్కొంది. ఫిబ్రవరి 17న తీసిన తొలి చిత్రంలో కొత్తగా నిర్మించిన గ్రామాలు (వృత్తంలో) నవంబర్ 28 నాటి రెండో చిత్రంలో కొత్తగా వెలిసిన నివాసాలు (వృత్తంలో) -
ఈ సైనిక శిబిరాలు స్మార్ట్
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సైనికులు సమర్థంగా పనిచేయడానికి వీలుగా అత్యంత ఆధునిక వసతి సౌకర్యాలను కల్పించారు. కొద్ది రోజులుగా చైనాతో ఉద్రిక్తతలు నెలకొని ఉండడంతో శీతాకాలంలో సైనికుల ఆరోగ్యానికి పూర్తిగా రక్షణ కల్పించేలా స్మార్ట్ శిబిరాలను ఏర్పాటు చేశారు. నవంబర్ నుంచి ఈ ప్రాంతంలో రక్తం గడ్డకట్టే చలి మొదలవుతుంది. ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 40 డిగ్రీ సెల్సియస్కు పడిపోతాయి. 40 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోతుంది. ఇలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటూ దేశ రక్షణ కోసం కంటి మీద రెప్ప వేయకుండా కాపలా కాసే మన జవాన్ల కోసం నిర్మించిన ఈ స్మార్ట్ క్యాంపుల్లో అన్ని రకాల సదుపాయాలున్నాయి. చలిని తట్టుకోవడానికి శిబిరాల్లో హీటర్లు, 24 గంటలు వేడి నీళ్ల సదుపాయం, విద్యుత్, బెడ్లు, కబోర్డులు ఇలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ‘లద్దాఖ్లో గస్తీ ఉండే సైనికులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. వారు చలిని తట్టుకునేలా స్మార్ట్ శిబిరాల నిర్మాణం పూర్తయింది. దేశ రక్షణ కోసం పాటు పడే జవాన్లు శీతాకాలంలో సమర్థమంతంగా విధులు నిర్వహించడం కోసం మెరుగైన వసతి సదుపాయాలు కల్పించాం’అని భారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. స్మార్ట్ శిబిరాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేయడంతో అవి విస్తృతప్రచారం పొందాయి. గత నెలలోనే చైనా కూడా ఈ ప్రాంతంలో ఆధునిక సదుపాయాలతో సైనిక శిబిరాలు ఏర్పాటు చేసి, వాటి వీడియోల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. చైనా శిబిరాలకు ఏమాత్రం తీసిపోకుండా భారత్కి చెందిన స్మార్ట్ శిబిరాలు కూడా ఉండడం గమనార్హం. -
లద్దాఖ్లో పట్టుబడ్డ చైనా జవాను
న్యూఢిల్లీ: చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన సైనికుడు ఒకరు సోమవారం తూర్పు లద్దాఖ్లో భారత సైన్యానికి పట్టుబడ్డాడు. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) దాటి అతడు భారత భూభాగంలోకి ప్రవేశించడం సంచలనం రేపింది. ఈ ఘటనపై భారత సైన్యం స్పందించింది. ‘ఈ నెల 19వ తేదీన తూర్పు లద్దాఖ్ సెక్టార్లోని డెమ్చోక్ ప్రాంతంలో చైనా సైనికుడొకరు ఎల్ఏసీని దాటి భారత భూభాగంలోకి దారి తప్పి ప్రవేశించాడు. అతడి వద్ద ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా పీఎల్ఏ కార్పొరల్ వాంగ్ య లాంగ్గా తెలిసింది. స్వస్థలం చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్లోని షాంగ్జిఝెన్ పట్టణమని తేలింది. దీని వెనుక గూఢచర్యం ఉన్నట్లు భావించడం లేదు’ అని భారత ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘పర్వతమయమైన ఈ ప్రాంతంలో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య దారితప్పి వచ్చిన అతడికి ఆక్సిజన్, ఆహారంతోపాటు చలి నుంచి రక్షణ కల్పించే దుస్తులు అందించాం. తప్పిపోయిన తమ సైనికుడి ఆచూకీ కోసం పీఎల్ఏ నుంచి ఒక వినతి అందింది’అని భారత ఆర్మీ వెల్లడించింది. చైనాతో ఉన్న అవగాహనను అనుసరించి ఇతర లాంఛనాలన్నీ పూర్తయ్యాక చుషుల్–మోల్డో ప్రాంతంలో అతడిని తిరిగి చైనా సైనిక అధికారులకు అప్పగిస్తామని భారత సైన్యం స్పష్టం చేసింది. ‘భారత్–చైనా సరిహద్దులు దాటి భారత్లోకి అతడు ఎలా రాగలిగాడనే విషయం రాబట్టేందుకు అధికారులు ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం నాటికి అతడిని తిరిగి వెనక్కు పంపించే అవకాశాలున్నాయి’అని పేర్కొంది. భారత్, చైనాలు ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నాయని, పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాయని చైనా అధికార గ్లోబల్ టైమ్స్ తెలిపింది. సరిహద్దుల్లో ఇది మరో వివాదానికి తెరతీయబోదనీ, ఈ అంశం పరిష్కారం మరిన్ని ద్వైపాక్షిక చర్చలకు మార్గం సుగమం చేస్తుందని వ్యాఖ్యానించింది. పీఎల్ఏలో కార్పొరల్ హోదా భారత ఆర్మీలో నాయక్ స్థాయికి సమానం. కాగా, తూర్పు లద్దాఖ్లో ఎల్ఏసీ వెంట ఆరు నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. చైనాలో భాగంగా జమ్మూకశ్మీర్! జమ్మూకశ్మీర్ చైనాలో భాగం అంటూ ట్విట్టర్ చూపడం వివాదాస్పదంగా మారింది. ఈ పొరపాటును వెంటనే సరిచేసినట్లు ట్విట్టర్ చెబుతున్నప్పటికీ జమ్మూకశ్మీర్ను భారత్కు చెందినట్లు చూపకపోవడం, లేహ్ ప్రాంతాన్ని కశ్మీర్లో అంతర్భాగంగా పేర్కొనడం కొనసాగు తోందని నిపుణులు అంటున్నారు. జాతీయ భద్రతా వ్యవహారాల విశ్లేషకుడు నితిన్ గోఖలే ఆదివారం లేహ్లోని హాల్ ఆఫ్ ఫేంను గురించి ట్విట్టర్లో ఒక వీడియో పోస్టు చేశారు. అందులో లేహ్ను జమ్మూకశ్మీర్కు చెందినట్లు, జమ్మూకశ్మీర్ చైనాలో ఉన్నట్లు చూపుతోంది. సాంకేతిక లోపాల కారణంగా ఇలా జరిగిందని ట్విట్టర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. -
పాక్ కుట్రను తిప్పి కొట్టిన భారత్
శ్రీనగర్: భారత్లో పేలుళ్లే లక్ష్యంగా పాక్ పన్నిన కుట్రల్ని భారత ఆర్మీ భగ్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి కశ్మీర్లోని కెరాన్ సెక్టార్కు భారీ ఎత్తున ఆయుధాలు తరలించడానికి చేసిన ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టినట్టు సైనిక అధికారి ఒకరు వెల్లడించారు. కెరాన్ సెక్టార్లో నాలుగు ఏకే74 రైఫిళ్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కిషన్గంగ నది మీదుగా ఒక తాడు సాయంతో ఇద్దరు, ముగ్గురు దుండగులు ఒక పెద్ద ట్యూబులో ఆయుధాలను ఉంచి తరలిస్తుండగా జవాన్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి రైఫిల్స్, 8 మ్యాగజైన్స్తో పాటుగా రెండు పెద్ద సంచుల నిండా ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతమంతా అణువణువునా గాలిస్తున్నట్టుగా లెఫ్ట్నెంట్ జనరల్ బీఎస్ రాజు వెల్లడించారు. ‘అప్రమత్తంగా ఉంటూ పాక్ చేసిన ఏ పనినైనా తిప్పి కొడతాం’అని చెప్పారు. కెరాన్, టాంగ్ధర్, జమ్మూ, పంజాబ్ సెక్టార్లలో కశ్మీరీ యువతని ఉగ్రవాదం వైపు మళ్లించడానికి పాక్ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉందని ఆ కమాండర్ తెలిపారు. కాగా, కశ్మీర్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్ జిల్లాలోని చింగామ్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు సోదాలు చేపట్టాయి. నక్కి ఉన్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దదూరా ప్రాంతంలో ఇదే రీతిలో జరిగిన మరో ఎన్కౌంటర్లో కూడా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. -
చర్చలతో చైనా దారికి రాదు
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య గత అయిదారు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతలకు చర్చలతో పరిష్కారం లభించదని అమెరికా అభిప్రాయపడింది. డ్రాగన్ దేశంతో చర్చలు జరిపి ఇక లాభం లేదని భారత్కు హితవు పలికింది. ఇరుదేశాల మధ్యనున్న వాస్తవాధీన రేఖను చైనా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని స్పష్టం చేసింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియెన్ చైనాతో ఒప్పందాలు, చర్చలు అంటూ కాలయాపన చేయొద్దని, చర్చలతో పరిష్కారం దొరకదన్న విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా చైనా వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. భారత్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉత్తరంగా చైనా 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి కయ్యానికి కాలు దువ్వుతోందని అన్నారు. చైనాది దురాక్రమణ బుద్ధి కమ్యూనిస్టు పార్టీ దురాక్రమణ బుద్ధితో భారత్, తైవాన్ దేశాల సరిహద్దుల్ని ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతోం దని రాబర్ట్ ఓ బ్రియెన్ అన్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తైవాన్ సరిహద్దుల్లో నిరంతరాయంగా సైనిక విన్యాసాలకు దిగుతోందని అన్నారు. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) ప్రాజెక్టు కూడా ఇతర దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయడానికేనని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులైన కంపెనీలకు చైనా బలవంతంగా రుణాలు తీసుకునే పరిస్థితి కల్పిస్తుందని వాటిని చెల్లించలేక అవన్నీ డ్రాగన్ దేశానికి దాసోహం అంటాయని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కల్పించే మౌలిక సదుపాయాలు అంతిమంగా చైనాకే ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయన అన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని భారత్ ఇకనైనా చర్చలతో చైనా దారికి రాదు అన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు. క్వాడ్ దేశాలకు డ్రాగన్తో ముప్పు డ్రాగన్ దేశం అత్యంత హీనంగా వ్యవహరిస్తూ క్వాడ్ దేశాలకు ముప్పుగా మారిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంద న్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనాకు చెక్ పెట్టడానికి ఇండో పసిఫిక్ దేశాలు అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా క్వాడ్ గ్రూపుగా ఏర్పడ్డాయి. ఇటీవల ఈ దేశాల విదేశాంగ మంత్రులు టోక్యోలో సమావేశమై చర్చించారు. భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్తో ఫలప్రదమైన చర్చలు జరిపానని టోక్యో నుంచి వాషింగ్టన్కు తిరిగి వచ్చిన అనంతరం ఒక టీవీ చానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
సరిహద్దులో పాక్ బరితెగింపు.. తిప్పికొట్టిన భారత్
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి గురువారం ఉదయం పాకిస్థాన్ సైన్యం మరోసారి బరితెగించింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ముగ్గురు భారత సైనికులు అమరులు కాగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. కాగా పాక్ దుశ్చర్యలను భారత్ సైన్యం దీటుగా తిప్పికొట్టింది. భారత సైనిక పోస్ట్లను లక్ష్యంగా చేసుకుని దాయాది కాల్పులకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్ వద్ద పాకిస్థాన్ సైన్యం మోర్టార్లతో జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.. మరో నలుగురు గాయపడ్డారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. పూంచ్ సెక్టార్ ఎల్వోసీ వద్ద పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ చనిపోగా, మరో సైనికుడు గాయపడ్డాడు. పాక్ సైన్యం కాల్పుల్లో గాయపడిన సైనికులను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. పాక్ కాల్పులను భారత్ సమర్ధంగా తిప్పికొట్టింది. అటువైపున కూడా ప్రాణనష్టం జరిగినట్టు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ దీనిపై పాక్ ఎటువంటి ప్రకటన చేయలేదు. పాక్ కవ్వింపు చర్యలకు గట్టి జవాబిస్తోంది. గత 17 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పాకిస్థాన్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. కేవలం తొమ్మిది నెలల్లోనే 3,600 సార్లు కాల్పులకు తెగబడినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సరిహద్దుల్లో భారత్-పాకిస్థాన్ మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందానికి పాకిస్థాన్ తరుచూ తూట్లు పొడుస్తూనే ఉంది. గతేడాది ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత నుంచి దాయాది మరింత ఆక్రోశంతో రగిలిపోతోంది. ఉగ్రవాదులను దేశంలోకి పంపి విధ్వంసం సృష్టించేందుకు దాయాది చేయని ప్రయత్నం లేదు. అయితే, వీటిని సైనికులు సమర్ధంగా తిప్పికొడుతున్నారు. (చదవండి : బాబ్రీ విధ్వంసం వెనక పాక్ హస్తం!) -
ప్రతికూల వాతావ‘రణ’మైనా రెడీ!
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చెలరేగుతున్న తూర్పు లద్దాఖ్లో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్ సమాయత్తమైంది. చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కోవడానికి గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీగా యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని తరలించింది. వచ్చే నాలుగు నెలలు శీతాకాలంలో ఎత్తయిన పర్వత ప్రాంతమైన లద్దాఖ్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటాయి. అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో చలి మైనస్ 25 డిగ్రీల వరకు వెళుతుంది. ఆ సమయంలో డ్రాగన్ దేశం ఎలాంటి కుయుక్తులు పన్నినా దీటుగా ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ ఈ భారీ తరలింపు ప్రక్రియ చేపట్టింది. యుద్ధ ట్యాంకులు, భారీగా ఆయుధాలు, ఇంధనాన్ని తరలించినట్టు ఆర్మీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వాటితో పాటు సైనికులకు అవసరమైన ఆహారం దుస్తులు, బూట్లు తదితర సామగ్రిని చేరవేయడం దాదాపుగా పూర్తయింది. ఈ భారీ తరలింపు కసరత్తుని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నారవాణే, మరికొందరు కమాండర్లతో బృందంగా ఏర్పడి స్వయంగా పర్యవేక్షించారు. జూలై నుంచి మొదలు పెట్టిన ఈ ప్రక్రియని పకడ్బందీ ప్రణాళికతో నరవాణె రూపొందించి అమలయ్యేలా చూశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా ఆయుధాలు తూర్పు లద్దాఖ్లోని సమస్యాత్మక ప్రాంతాలైన చుషుల్, డెమ్చోక్లకు టీ–90, టీ–72 ట్యాంకులు, గన్స్, పదాతిదళానికి అవసరమయ్యే వాహనాలు ఇప్పటికే చేరుకున్నాయి. ఈ ఆపరేషన్లో భాగంగా 16 వేల అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతంలోని శిబిరాల్లో ఉండే జవాన్ల కోసం భారీగా ఆహార పదార్థాలు, దుస్తులు, టెంట్లు, కమ్యూనికేషన్ పరికరాలు, చమురు, చలి నుంచి రక్షణకి హీటర్లు తరలించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లద్దాఖ్లో సైనిక శిబిరాలకు ఈ స్థాయిలో సామగ్రిని చేరవేయడం ఇదే మొదటిసారి. ఈ తరలింపు అత్యంత భారీ స్థాయిలో జరిగింది’’అని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. రక్తం గడ్డ కట్టే చలి నుంచి రక్షణ కోసం యూరప్ దేశాల నుంచి దుస్తుల్ని తెప్పించి ఇప్పటికే సైనికులకి అందించారు. ఈ సామగ్రిని తరలించడానికి వైమానిక దళానికి చెందిన సి–130జే సూపర్ హెర్క్యులస్, సీ–17 గ్లోబ్మాస్టర్ హెలికాప్టర్లను వినియోగించారు. తూర్పు లద్దాఖ్లో ఉద్రిక్తతల నివారణ కోసం చైనాతో జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాకపోవడం, సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఆ దేశం అంగీకరించకపోవడంతో ముందు జాగ్రత్తగా భారత్ అన్ని రకాలుగా సిద్ధమైంది. అదనంగా మూడు సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. అక్కడ సైనికులకి అన్ని సదుపాయాలు కల్పించింది. -
దేనికైనా సిద్ధంగా ఉన్నాం: నరవణే
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత నెలకొందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యూహాత్మక మోహరింపులు చేశామని, మన సరిహద్దులను, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి పూర్తి సంసిద్ధులై ఉన్నామని తెలిపారు. దేశం తమపై పూర్తి విశ్వాసం ఉంచవచ్చన్నారు. లద్దాఖ్లో నరవణే శుక్రవారం రెండోరోజు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పలు ఆర్మీ పోస్టులను సందర్శించి... సైనికులు, సీనియర్ కమాండర్లతో మాట్లాడారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ‘మన సైనికులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దేశ భౌగోళిక సమగ్రతను కాపాడటానికి వారు పూర్తి సంసిద్ధంగా ఉన్నారనే విశ్వాసం నాకు కలిగింది’అని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన చర్చలతో సహా అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామన్నారు. ఐదురోజుల కిందట తూర్పు లద్ధాఖ్లోని పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో చైనా దుస్సాహసంతో అతిక్రమణకు దిగగా... భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. వేగంగా స్పందించిన భారత్ అదనపు బలగాలను, ఆయుధ సామగ్రిని ఈ ప్రాంతానికి తరలించి పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలోని కీలక పర్వత ప్రాంతాల్లో మోహరించింది. ఫింగర్ 2, ఫింగర్ 3 ప్రాంతాల్లో ఆర్మీపోస్టులను బలోపేతం చేసింది. కమాండర్ల చర్చల్లో దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా... తమ భూభాగంలోనే మోహరించామని, వెనక్కితగ్గే ప్రసక్తేలేదని భారత్ తేల్చిచెప్పింది. దశాబ్దాల్లో అతిపెద్ద సవాల్: ష్రింగ్లా లద్దాఖ్లో ఉద్రిక్తతలు గడిచిన కొన్ని దశాబ్దాల్లో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్గా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా అభివర్ణించారు. దేశ భౌగోళిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి పూర్తి కంకణబద్ధులమై ఉన్నామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధమని, అన్నిరకాలుగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. మరో దఫా మిలిటరీ చర్చలు భారత్– చైనాల మధ్య మరోదఫా మిలిటరీ చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి తూర్పు లద్దాఖ్లోని చుషుల్లో శుక్రవారం బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో పురోగతి ఏంటనేది వెంటనే తెలియరాలేదు. -
గల్వాన్ ఘటన దురదృష్టకరం: చైనా
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ ప్రాంతంలో భారత్, చైనా మధ్య జూన్లో జరిగిన ఘర్షణలపై డ్రాగన్ దేశం విచారం వ్యక్తం చేసింది. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొంది. అలా జరిగి ఉండాల్సింది కాదంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. చైనా, భారత్ యువత పాల్గొన్న ఒక వెబినార్కు బుధవారం హాజరైన భారత్లో చైనా రాయబారి సన్ వీడాంగ్ చరిత్ర పరంగా చూస్తే ఇది చాలా చిన్న ఘటన అని వ్యాఖ్యానించారు. రెండు దేశాలు ఘర్షణాత్మక వాతావరణాన్ని చూడాలని అనుకోవడం లేదని, ఇక మీదట ఇలా జరగకుండా రెండు దేశాలు సరైన దారిలో ప్రయాణిస్తున్నాయని అన్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఏప్రిల్ నుంచి అడపాదడపా మొదలైన ఉద్రిక్తతలు జూన్లో తారస్థాయికి వెళ్లాయి. అప్పుడు చోటు చేసుకున్న ఘటనలో భారత్ సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోతే, చైనా వైపు ప్రాణ నష్టం ఎంత జరిగిందో ఆ దేశం అధికారికంగా వెల్లడించలేదు. భారత్, చైనా మధ్య 70 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతు న్నాయని, ఎన్ని పరీక్షలు , అడ్డంకులు ఎదురైనా మళ్లీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు బలోపేతమవుతున్నాయని సన్ వీడాంగ్ అన్నారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం ఏ సమస్యకైనా చర్చల ద్వారా సరైన పరిష్కారం లభిస్తుందని రాయబారి వీడాంగ్ అన్నారు. చైనా భారత్ని ప్రత్యర్థి కంటే భాగస్వామిగానే చూస్తుందని, పొరుగు దేశం నుంచి ప్రమాదాలని కాకుండా అవకాశాలనే రాబట్టుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. భారత్, చైనా మధ్య ఆర్థికంగా కూడా సంబంధాలు అత్యంత దృఢంగా ఉన్నాయని సన్ వీడాంగ్ వివరించారు. -
22 నుంచి వైమానిక ఉన్నతాధికారుల భేటీ
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్–చైనా సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు వైమానిక దళం ఉన్నతాధికారులు ఈ నెల 22వ తేదీ నుంచి మూడు రోజులపాటు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, ఏడుగురు కమాండర్ ఇన్ చీఫ్లు పాల్గొంటారని భారత వైమానిక దళం ప్రతినిధి తెలిపారు. చైనా సరిహద్దుల్లో వైమానిక దళం ఇప్పటికే మోహరించింది. మిరేజ్–2000, సుఖోయ్–30, మిగ్–29 తదితర అత్యాధునిక యుద్ధ విమానాలను పలు బేస్ స్టేషన్లలో సిద్ధంగా ఉంచింది. మరోవైపు మొదటి దశ రఫేల్ ఫైటర్లు జెట్లు ఈ మాసాంతంలోనే ఫ్రాన్స్ నుంచి భారత్కు చేరుకోనున్నాయి. ఈ ఫైటర్ జెట్లను లద్ధాఖ్ సెక్టార్లో మోహరించాలని యోచిస్తున్నారు. ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. -
పాక్ దుశ్చర్య, కుటుంబంలో పెను విషాదం
శ్రీనగర్: నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గల ఎల్వోసీ సమీపంలో ఉండే ప్రాంతాలు, జనావాసాలపై పాకిస్తాన్ ఆర్మీ శుక్రవారం రాత్రి మోర్టార్ షెల్స్ ప్రయోగించింది. దాంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఖారీ కర్మారా సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైనికులు భారీగా మోర్టార్ షెల్స్ ప్రయోగించడంతో కర్మారా గ్రామంలోని ఇంటిపై ఒక షెల్ పడింది. ఈ దాడిలో మొహద్ రఫీక్ (58), అతని భార్య రఫియా బీ (50), కుమారుడు ఇర్ఫాన్ (15) అక్కడికక్కడే మరణించారు. (చదవండి: ప్రేయసి కోసం నడిచి పాకిస్తాన్కు..) అలాగే కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని, మరికొంత మంది గాయపడ్డారని రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఇక తాజా ఘటనపై భారత్ ఆర్మీ స్పందించిందని వారు వెల్లడించారు. పాక్కు సరైన గుణపాఠం చెప్పాలని భారత సైన్యానికి ఆదేశిలిచ్చినట్లు రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు .కాగా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ పర్యటనకు ఒకరోజు ముందే ఈ ఘటన జరగడం గమనార్హం. పాకిస్తాన్తో ఉన్న ఎల్వోసీ వెంట పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన శనివారం అక్కడ పర్యటించనున్నారు. జూన్ నెలలో పాక్ 411 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు సమాచారం. (నెటిజనుల ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్) -
సరిహద్దుల్లో అన్ని ప్రొటోకాల్స్ పాటించాలి
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి స్థాపన కోసం సరిహద్దుల నిర్వహణలో పరస్పరం అంగీకరించిన ప్రొటోకాల్స్ అన్నీ పాటించి తీరాలని చైనాకి భారత్ మిలటరీ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎక్కువ బాధ్యత తీసుకోవాలని గట్టిగా చెప్పింది. వాస్తవాధీన రేఖ వెంబడి వివాదాస్పద ప్రాంతాల్లో చైనా తమ సైన్యాన్ని ఉపసంహరిస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు 15 గంటల సేపు సుదీర్ఘంగా సాగాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా చెబుతున్న కొత్త సరిహద్దులపై ఆందోళన వ్యక్తం చేసిన భారత సైనిక బృందం, మే 5కి ముందు నాటి పరిస్థితుల్నే కొనసాగించాలని, ఆ నిబంధనలకు అనుగుణంగా పెట్రోలింగ్ నిర్వహించాలని గట్టిగా చెప్పింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు నాలుగో దఫా కమాండర్ స్థాయి చర్చల్లో పురోగతి సాధించినట్టుగా చైనా వెల్లడించింది. రేపు లద్దాఖ్కు రాజ్నాథ్ వివాదాస్పద ప్రాంతాల్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేలా భారత్, చైనా పరస్పరం అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్కు వెళ్లనున్నారు. సరిహద్దుల్లో పరిస్థితుల్ని పర్యవేక్షించనున్నారు. భారత సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలు తూర్పు లద్దాఖ్లో చైనా సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో త్రివిధ దళాలకు రక్షణ శాఖ బుధవారం ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. రూ.300 కోట్లతో అత్యవసరమైన కార్యకలాపాలకు అవసరమైన ఆయుధాలు కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. ఎన్ని ఆయుధాలు కొనాలన్న దానిపై ఎలాంటి పరిమితి లేదు. అయితే, మొత్తం ఖర్చు మాత్రం రూ.300 కోట్లు దాటకూడదు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
భారత్, చైనా శాంతి మంత్రం
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పూర్తిస్థాయిలో శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని భారత్, చైనా ఒక అంగీకారానికి వచ్చాయి. తూర్పు లద్దాఖ్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. ఇరు దేశాల దౌత్య ప్రతినిధులు మరోసారి శుక్రవారం ఆన్లైన్ ద్వారా చర్చలు జరిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిస్థాపన కోసం సరిహద్దుల్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఇరు దేశాల ప్రతినిధులు అంగీకరించారు. ఎల్ఏసీ వెంబడి సైనికుల ఉపసంహరణ పురోగతిపై సమీక్షించారు. భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం అమెరికా రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్తో చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్లో పరిస్థితిపై రాజ్నాథ్ సమీక్ష తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ అనంతర పరిస్థితులపై శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష జరిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియాతోపాటు పలువురు సీనియర్ సైనికాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణలో మొదటి దశ పూర్తయినట్లేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ అమ్ముల పొదిలో మరిన్ని ‘అపాచీ’లు భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్ల అందజేత పూర్తి చేసినట్లు అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ప్రకటించింది. ఒప్పందం ప్రకారం అపాచీ యుద్ధ హెలికాప్టర్లలోని చివరి ఐదింటిని ఇటీవల భారత వైమానిక దళానికి అందజేసినట్లు బోయింగ్ సంస్థ వెల్లడించింది. (చైనా హెచ్చరికలు.. ఖండించిన కజకిస్థాన్!) -
గల్వాన్ వంతెన నిర్మాణం విజయవంతం
చైనా కంటగింపునకు, గల్వాన్ ఘటనకు ప్రధాన కారణమైన గల్వాన్ వంతెన నిర్మాణాన్ని భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. గల్వాన్ ఘటనతో ఏమాత్రం వెనుకంజ వేయని భారత సైనికాధికారులు మంగళవారం ఉదయం.. ఆర్మీ కంబాట్ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ‘గల్వాన్ నదిపై తలపెట్టిన వంతెన నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి’ అనేది ఆ ఉత్తర్వుల సారాంశం. వెంటనే రంగంలోకి దిగిన ఇంజనీర్లు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం) ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా ఆ పనులను ఏకబిగిన 72 గంటల పాటు కొనసాగించి, గురువారం మధ్యాహ్నం కల్లా పూర్తి చేశారు. వంతెనపై రెండు గంటలపాటు వాహనాలను నడిపి విజయవంతంగా పరీక్షించి చూశారు. జూన్ 15వ తేదీన రెండు బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన ‘పెట్రోల్ పాయింట్ 14’కు ఈ వంతెన కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. 60 మీటర్ల పొడవైన ఈ బెయిలీ(ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే వీలున్న) వంతెనపై ఫిరంగి దళ వాహనాలతోపాటు ఇతర అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించవచ్చు. (చైనా ఆక్రమించినవి స్వాధీనం చేసుకుంటాం) వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు బలగాలు వేగంగా చేరుకునేందుకు ఈ వంతెన కీలకంగా మారనుంది. ఈ వంతెనతో దర్బాక్ నుంచి దౌలత్ బేగ్ ఓల్దీ వరకు 255 కిలోమీటర్ల మేర రహదారిని భారత్ కాపాడుకోగలదు. భారత్, చైనాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గల్వాన్ నది పరీవాహక ప్రాంతంలో మన దేశం చేపట్టిన నిర్మాణాల్లో ఈ వంతెన కూడా ఒకటి. సరిహద్దు ప్రాంతాల్లో భారత ఆర్మీ ఇంజనీర్ల సాయంతో బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్(బీఆర్వో) తలపెట్టిన మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు.. చైనా ఎన్ని కుట్రలు పన్నినా కొనసాగుతాయని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. (చైనా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..) -
సరి‘హద్దు’ దాటకండి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు అటు(చైనా) వైపే కార్యకలాపాలు కొనసాగించుకోవాలని చైనాకు భారత్ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో మార్పులు చేసే దిశగా ఏకపక్ష చర్యలకు తెగబడవద్దని తేల్చిచెప్పింది. అలాగే, గాల్వన్ లోయ ప్రాంతం తమదేనంటూ చైనా చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టింది. అలాంటి అహేతుక, సమర్థనీయం కాని వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికింది. తమదికాని భూభాగాన్ని తమదే అని.. ఎక్కువ చేసి చెప్పుకునే తీరును మార్చుకోవాలని పేర్కొంద జూన్ 6న ఇరుదేశాల ఉన్నతస్థాయి మిలటరీ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందానికి ఈ వ్యాఖ్య విరుద్ధంగా ఉందని పేర్కొంది. దేశ భౌగోళిక సమగ్రతను కాపాడుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం పేర్కొన్నారు. సోమవారం రాత్రి భారత్, చైనా సైనికుల మధ్య గాల్వన్ లోయ ప్రాంతంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణల సందర్భంగా భారతీయ సైనికులెవరూ గల్లంతు కాలేదని స్పష్టం చేశారు. ‘సరిహద్దుల నిర్వహణ విషయంలో భారత్ స్పష్టంగా ఉంది. తమ కార్యకలాపాలన్నీ ఎల్ఏసీకి ఇటు(భారత్) వైపే, భారత భూభాగంలోనే కొనసాగిస్తోంది. చైనా కూడా అదే తీరున వారి భూభాగంలోనే తమ కార్యకలాపాలు జరుపుకోవాలి’ అని పేర్కొన్నారు. సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్చలే మార్గమని భారత్ విశ్వసిస్తుంది.అదే సమయంలో, దేశ సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదు’ అన్నారు. జూన్ 23న జరిగే రిక్(రష్యా–ఇండియా–చైనా) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పాల్గొంటారన్నారు. కొనసాగుతున్న మేజర్ జనరల్ స్థాయి చర్చలు సరిహద్దు ఉద్రిక్తతలను తొలగించుకునే దిశగా భారత్, చైనాల మధ్య జరుగుతున్న మేజర్ జనరల్ స్థాయి చర్చలు గురువారం కొనసాగాయి. అయితే, మంగళ, బుధ వారాల్లో ఎలాంటి ఏకాభిప్రాయానికి రాకుండానే చర్చలు నిలిచిపోయాయి. కాగా, గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా సైనికులతో తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణల అనంతరం కొందరు భారత సైనికులు గల్లంతయ్యారని, సైనికులను చైనా బందీలుగా తీసుకువెళ్లిందని వచ్చిన వార్తలను ఇండియన్ ఆర్మీ తోసిపుచ్చింది. -
పాక్ కాల్పులు: భారత జవాను మృతి
కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. ఆదివారం జమ్ము కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో షాపూర్, కిర్ణి సెక్టార్ల పరిధిలో నియంత్రణ రేఖ(ఎల్ఓసి) వెంబడి కాల్పులు జరుపుతూ, మోర్టార్లు విసిరింది. ఈ దాడిలో ఒక భారత సైనికుడు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. కాగా సరిహద్దుల వెంబడి పాక్ పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని భారత రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనందర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. (సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు..) ఈ ఏడాది జూన్ మొదటి పది రోజుల్లోనే 114 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని వెల్లడించారు. గడిచిన ఆరునెలల్లో 2 వేల సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత పదహారేళ్లతో పోలిస్తే 2019లో అత్యధిక సార్లు(3168) పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. గత ఆరు రోజులుగా పూంచ్ సెక్టార్లో పాక్ బలగాలు సరిహద్దు గ్రామాల్లో మోర్టార్లు విసరడం సహా పదే పదే కాల్పులు జరుపుతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. (ఎల్వోసీ వద్ద కాల్పులు; 8 మంది ఉగ్రవాదుల హతం) -
ఎల్వోసీ వద్ద కాల్పులు; 8 మంది ఉగ్రవాదుల హతం
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్లోని కీరన్ సెక్టార్ పరిధిలో ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసి)కు ఎదురుగా ఉన్న దూద్నైల్లో ఇండియన్ ఆర్మీ పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టుంది. దూద్నైల్లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్ల వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులతో పాటు 15 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. అయితే ఈ కాల్పులు ఏప్రిల్10 వ తేదిన జరిగినట్లు వెల్లడించారు. కిషన్గంగా నది ఒడ్డున పాక్ ఉగ్రవాదులు కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ దూద్నైల్పై దాడులు జరిపి ప్రతీకార చర్యలు తీసుకోవాలని భావించింది. అయితే అప్పటికే సమాచారం అందుకున్న భారత మిలటరీ విభాగం కీరన్ సెక్టార్కు చేరుకుని ముందుగా 8 మంది ఉగ్రవాదులను కాల్చి చంపారు. మరణించిన వారిలో ముగ్గురు జమ్మూ కాశ్మీర్కు చెందినవారు కాగా మిగతా వారు జైష్-ఇ-మొహమ్మద్ నుంచి శిక్షణ పొందిన వారిగా గుర్తించారు. అయితే ఏప్రిల్ 10న కీరన్ సెక్టార్లో జరిగిన దాడిలో ఉగ్రవాదులతో పాటు 15 మంది పాకిస్తాన్ ఆర్మీ ట్రూపర్లతో కూడా మరణించినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. -
పాక్ దుస్సాహసాన్ని తిప్పికొట్టిన భారత సైన్యం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్ దుస్సాహసాన్ని తిప్పికొట్టిన వీడియోను భారత సైన్యం బుధవారం విడుదల చేసింది. అండర్ బారెల్ గ్రనేడ్ లాంఛర్లతో భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన చొరబాటుదారులు, పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలు, ఉగ్రవాదులను భారత సైన్యం గ్రనేడ్లు విసురుతూ నిరోధించిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. వీడియో ఆధారంగా ఈ ఘటన ఈనెల 12, 13 తేదీల్లో జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 10న పీఓకేలోని హజీపూర్ సెక్టార్లో పాక్ సైనికుడు సిపాయి గులాం రసూల్ను భారత దళాలు మట్టుబెట్టాయి. ఇక ఇదే ప్రాంతంలో సెప్టెంబర్ 12 అర్ధరాత్రి దాటిన తర్వాత భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల ప్రయత్నాలను భారత్ దళాలు తిప్పికొట్టాయి. ఈ క్రమంలో పాక్ ఉగ్రవాది ఒకరు భద్రతా దళాల చేతిలో మరణించాడు. కాగా భారత దళాలు ఇటీవల గురెజ్, హజీపూర్ సెక్టార్లో రెండు చొరబాటు యత్నాలను దీటుగా తిప్పికొట్టారు. -
లదాఖ్లో భారత్, చైనా బాహాబాహీ
న్యూఢిల్లీ: లదాఖ్లో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద భారత్, చైనా బలగాల మధ్య బుధవారం ఉద్రిక్తత తలెత్తింది. అయితే, చర్చల అనంతరం సాయంత్రానికి ఉద్రిక్తత సమసింది. పాంగోంగ్ త్సో సరస్సు ఒడ్డున బుధవారం ఉదయం భారత్ బలగాలు పహారా కాస్తుండగా చైనా సైనికులు అభ్యంతరం తెలిపారు. తర్వాత, చైనా బలగాలు పోట్లాటకు దిగాయి. దీంతో రెండు వైపులా పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతంలో బలగాలను మోహరించాయి. దీంతో రెండు దేశాల సైనిక ప్రతినిధులు చర్చించి ఓ అంగీకారానికి వచ్చారు. సాయంత్రానికి ఎవరికి వారు బలగాలను ఉపసంహరించుకోవడంతో ఉద్రిక్తత సడలింది. -
సరిహద్దుల్లో బరితెగించిన పాక్
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేని పాకిస్తాన్ కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తోంది. వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తన వక్రబుద్ధిని నిరూపించుకుంది. సరిహద్దు వెంబడి మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్ము కశ్మీర్లోని రాజౌరీ జిల్లా సుందర్బానీ ప్రాంతంలో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో కాల్పుల విరమణ ఉల్లంఘానికి తూట్లు పొడుస్తూ పాక్ సైన్యాలు భారీ షెల్స్ను ప్రయోగిస్తూ కాల్పులు జరిపాయి. దీన్ని భారత సైన్యం భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడంతో కాల్పులను ఆపివేశారు. ఈ దాడిలో భారత జవానుకు బుల్లెట్ తగిలి గాయాలపాలయ్యాడు. -
సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య : జవాన్ మృతి
శ్రీనగర్ : సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో దుందుడుకుగా వ్యవహరిస్తోంది. జమ్ము కశ్మీర్లోని పూంచ్ జిల్లా కృష్ణ గటి సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ మంగళవారం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలో ఓ సైనిక జవాన్ మరణించారు. భారత సైన్యం దీటుగా ప్రతిస్పందించడంతో పాక్ సైనిక శిబిరాలకు భారీ నష్టం వాటిల్లిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరు పక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో 36 ఏళ్ల భారత జవాన్ నాయక్ రవి రంజన్ కుమార్ సింగ్ మరణించారు.బిహార్లోని రోహ్తాస్కు చెందిన సింగ్కు భార్య రీతా దేవి ఉన్నారు. సింగ్ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే నిబద్ధతతో కూడిన సైనికుడని, ఆయన సమున్నత త్యాగాన్ని దేశం సదా స్మరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఇండో-పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇటీవల తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఘటనలు పెచ్చుమీరాయి. -
పాక్కు భారత ఆర్మీ సూచన..
న్యూఢిల్లీ : భారత్లో చొరబాటుకు యత్నించిన పాక్ సైన్యం ప్రయతాల్ని భారత ఆర్మీ సమర్దవంతంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. నియంత్రణ రేఖ వెంబడి జరిగిన కాల్పుల్లో పాక్ బోర్డర్ యాక్షన్ టీమ్(బీఏటీ) సభ్యులతో పాటు ఉగ్రవాదులు కూడా మృతిచెందారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్న వారి మృతదేహాలు అక్కడే పడివున్నాయి. పాక్ నుంచి చొరబాటు యత్నాలు ఎక్కువ కావడంతో భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి గస్తీని భారీగా పెంచింది. పాక్ సైన్యం నియంత్రణ రేఖ వైపు నిత్యం షెల్స్ ప్రయోగించడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. నియంత్రణ రేఖ వద్ద చనిపోయినవారి మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా పాక్ను కోరింది. ఇందుకోసం ఎటువంటి హింసకు పాల్పడకుండా తెల్లజెండాలు చూపించి భారత భూభాగం వైపు రావాలని సూచించింది. అయితే భారత సూచనపై ఇప్పటివరకు పాక్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాగా, జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో జూలై 31వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. వీరిలో నలుగురు పాక్ సైనికులతో పాటు, ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు కశ్మీర్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అమర్నాథ యాత్రికులను, సందర్శకులను తమ స్వస్థలాలకు పంపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చదవండి : పాక్ ‘బ్యాట్’ సైనికుల హతం -
పాక్ ‘బ్యాట్’ సైనికుల హతం
శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంబడి భారత్ సైనిక పోస్టులపైకి దాడికి దిగి, చొరబడేందుకు పాక్ సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో పాక్ బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ)లోని ఐదు నుంచి ఏడుగురు మృతి చెందారని సైన్యం తెలిపింది. జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో జూలై 31వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని సైన్యం అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. వీరిలో పాక్ కమాండోలతోపాటు ఉగ్రవాదులు కూడా ఉన్నారన్నారు. ఈ ఘటన అనంతరం పాక్ భారీగా సైన్యాన్ని మోహరించిందన్నారు. కశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణాన్ని, అమర్నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు పాక్ బలగాలు గత 36 గంటల్లో పలు ప్రయత్నాలు చేశాయని, అప్రమత్తమైన సైన్యం దీటుగా బదులిచ్చిందని కల్నల్ కాలియా చెప్పారు. అదేవిధంగా, శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో జైషే మొహమ్మద్కు చెందిన నలుగురు కరుడు గట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు. వారి నుంచి పాక్లో తయారైన స్నైపర్ రైఫిల్, ఐఈడీ మందుపాతరను స్వాధీనం చేసుకున్నామన్నా రు. బీఏటీలో సాధారణంగా పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్తోపాటు ఉగ్రవాదులు ఉంటారని ఆయన వివరించారు. నలుగురు జైషే ఉగ్రవాదుల హతం జమ్మూకశ్మీర్లోని బారాముల్లా, షోపియాన్ జిల్లాల్లో భద్రతా దళాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు జైషే మొహమ్మద్ (జేఎం) ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గత 36 గంటల్లో ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతమవ్వగా, మరో ఇద్దరు దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఆపరేషన్లో హతమైనట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. బారాముల్లా జిల్లా సోపోర్లోని వార్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా లభించిన సమాచారం మేరకు భద్రతా దళాలు శనివారం ఉదయం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. వారిలో ఒకరు బండిపోరాకు చెందిన ఉమర్ షాబాజ్గా గుర్తించారు. మరొకరి గుర్తింపు లభించలేదు. ఘటనా స్థలంనుంచి మందుగుండు సామగ్రి, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, షోపియాన్లోని పండూషన్ ప్రాంతంలో శుక్రవారం ప్రారంభమైన మరో ఆపరేషన్లో జైషే ఉగ్రవాదులు మంజూర్ భట్, జీనత్ ఇస్లాం నైకూలు హతమయ్యారని ఆ అధికారి తెలిపారు. నైకూ పాకిస్తాన్ జాతీయుడని, జైషే మహమ్మద్ జిల్లా కమాండర్గా వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు. -
సరిహద్దుల్లో బంకర్లు..
-
సరిహద్దుల్లో 14వేల బంకర్లు..
శ్రీనగర్: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి నివసిస్తున్న ప్రజల రక్షణ కోసం భారత ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘించి దాడులు జరిపినప్పుడల్లా సైన్యంతో పాటు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితి తల్తెతకుండా ఉండేందుకు సరిహద్దుల్లో నివసిస్తున్న కుటుంబాల కోసం దాదాపు 14వేలకు పైగా బంకర్లను భారత ప్రభుత్వం నిర్మిస్తుంది. తద్వారా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు, కాల్పులు జరిగినప్పుడు అక్కడి ప్రజలు బంకర్లలో రక్షణ పొందవచ్చు. కశ్మీర్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో వీటి నిర్మాణం జరుగుతుందని భారత రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. సరిహద్దుల్లో కాల్పులు జరిగిన ప్రతిసారి అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారని పూంచ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ రాహుల్ యాదవ్ తెలిపారు. బంకర్ల నిర్మాణం ద్వారా ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించవచ్చని ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పుడు అక్కడి ప్రజలను బంకర్లకు తరలించనున్నారు. కాగా, 60 మిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న ఈ బంకర్ల నిర్మాణం గతేడాది జూన్లో ప్రారంభించినట్టు ప్రభుత్వ ఇంజనీర్లు తెలిపారు. వీటిని చాలా దృఢంగా నిర్మిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు పేర్నొన్నారు. సాధారణంగా చేపట్టే ఇళ్ల నిర్మాణం కన్నా ఇవి పది రెట్లు మందంగా ఉంటాయని అన్నారు. వాటితో పోల్చితే 10 రెట్లు ఎక్కువ స్టీలు వీటి నిర్మాణంలో ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. -
కల్లోలానికి కశ్మీరే కారణం
కశ్మీర్ ఎవరిదనే వివాదంపై ఇప్పటివరకూ భారత్, పాకిస్తాన్ మధ్య రెండు యుద్ధాలు, లెక్కలేనన్ని ఘర్షణలు జరిగాయి. అణ్వాయుధాలున్న ఈ రెండు దేశాల మధ్య హిమాలయ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ కశ్మీరే కారణమవుతోంది. కశ్మీర్ ప్రాంతంలో అధీనరేఖగా పిలిచే సరిహద్దును భారీ ఆయుధాలతో మోహరించి ఉండే ఇరు దేశాల సైనిక దళాలుగానీ, వైమానిక దళాలుగానీ అరుదుగానే దాటాయని చెప్పవచ్చు. దక్షిణాసియాలోని ఈ రెండు దాయాది దేశాల మధ్య ఎత్తైన పర్యత ప్రాంతంలో జరిగిన కొన్ని ప్రధాన ఘర్షణల వివరాలు: 1947: భారత ఉపఖండాన్ని ఇండియా, పాకిస్తాన్గా విభజించాక కశ్మీర్ వివాదంపై మొదటి యుద్ధం జరిగింది. కశ్మీర్ మహారాజు (సంస్థానాధీశుడు) హరిసింగ్ తన రాజ్యాన్ని ఇండియాలో విలీనం చేశాక పాకిస్తాన్ నుంచి గిరిజన పోరాటయోధుల పేరుతో కశ్మీర్ భూభాగంపై దాడి చేశారు. 1965: మళ్లీ కశ్మీర్పైనే భారత్, పాకిస్తాన్ స్వల్పస్థాయి యుద్ధం చేశాయి. పోరు ముగిశాక కాల్పుల విరమణ ప్రకటించారు. 1971: భారత్, పాక్ మధ్య మరో యుద్ధం జరిగిందిగాని ఇది కశ్మీర్పై కాదు. అప్పటి తూర్పు పాకిస్తాన్ (తూర్పు బెంగాల్)పై ఇస్లామాబాద్(పశ్చిమ పాక్) పెత్తనం కారణంగా స్వాతంత్య్రం కోరుకున్న బంగ్లాదేశీయులకు భారత్ మద్దతు ఇచ్చింది. భారత వైమానిక దళం పాకిస్తాన్ భూభాగంపై దాడులు జరపగా, పాక్ ఆర్మీ లొంగిపోయింది. ఈ యుద్ధం బంగ్లాదేశ్ అవతరణకు దారితీసింది. 1984: పాక్ తనదని వాదించే కారకోరం పర్వత శ్రేణిలో మనుషులు నివసించే యోగ్యంకాని సియాచిన్ గ్లేసియర్ (హిమానీనదం)ను భారత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ తర్వాత ఇదే ప్రాంతంలో అనేక ఘర్షణలు జరగగా, 2003లో ఇక్కడ కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. 1999: పాకిస్తాన్ మద్దతుగల తీవ్రవాదులు కశ్మీర్ సరిహద్దు దాటి కార్గిల్ పర్వతాలపై ఉన్న భారత సైనిక పోస్టులను ఆక్రమించుకున్నాక పోరు మొదలైంది. చొరబాటుదారులను భారత సైనిక దళాలు వెనక్కి తరిమివేశాయి. పది వారాలు జరిగిన ఈ ఘర్షణలో ఉభయపక్షాలకు చెందిన వేయి మంది మరణించారు. 2016: భారత్లోని ఓ ఆర్మీ స్థావరంపై తీవ్రవాదుల దాడి జరిగింది. ఈ దాడి జరిగిన రెండు వారాలకు సెప్టెంబర్లో పాకిస్తానీ కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలున్న లక్ష్యాలపై ఇండియా మెరుపు దాడులు ప్రారంభించింది. కాని, ఈ దాడులు జరగలేదని పాకిస్తాన్ వాదించింది. -
పాక్ సైనికుల కుట్రను భగ్నం చేసిన ఆర్మీ
శ్రీనగర్ : సరిహద్దు వెంబడి గస్తీ కాసే భారత ఆర్మీ పోస్టుపై దాడి చేసేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ సరిహద్దు సాయుధ బలగాల కుట్రను భగ్నం చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పాకిస్తానీ సైనికులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఆర్మీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... నియంత్రణ రేఖ వెంబడి నవోగామ్ సెక్టార్ వద్ద మోర్టార్లు, రాకెట్లతో పాక్ సైనికులకు దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ చర్యలతో అప్రమత్తమైన భారత సైన్యం ఎదురుదాడి చేయడంతో వారు తప్పించుకున్నారన్నారు. ఈ క్రమంలో పాక్ అధికారులు వదిలివేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, ఇవన్నీ గమనిస్తుంటే భారీ స్థాయిలోనే కుట్రకు ప్రణాళిక రచించినట్లు అర్థమవుతోందన్నారు. నూతన సంవత్సరం వేడుకల్లో మునిగి ఉన్న వేళ భారత సైనికులను మట్టుబెట్టి, దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో చాకచక్యంగా వ్యవహరించి కుట్రను తిప్పికొట్టిన భారత సైనికుల ధీరత్వాన్ని ప్రశంసించారు. తమ సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకోవాల్సిందిగా పాక్ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేసినట్లు తెలిపారు. -
‘300 మంది ఉగ్రవాదులు రెడీగా ఉన్నారు’
జమ్మూ : భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) అవతల 300 మందికి పైగా ఉగ్రవాదులు రెడీగా ఉన్నారని బుధవారం భారత ఆర్మీ తెలిపింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులు చేయించడంలో పాకిస్తాన్ ఆర్మీ కీలక పాత్ర నిర్వహిస్తోందని కూడా తెలిపింది. లూటెనంట్ జనరల్ దేవరాజ్ అన్భు బుధవారం ఉదంపూర్లోని ఆర్మీ నార్తర్న్ కమాండ్ హెడ్క్వార్టర్లో మాట్లాడారు. పీర్ పంజల్ శ్రేణికి దక్షిణం నుంచి 185 నుంచి 220 మంది, ఉత్తరం వైపు నుంచి 190 నుంచి 225 మంది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కాపలా చాలా కష్టతరమైందని, చాలెంజింగ్ కూడిన విషయమన్నారు. శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు తమ వ్యూహాలు తమకు ఉన్నాయని చెప్పారు. భారత ఎదురు కాల్పుల్లో సుమారు 192 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని వెల్లడించారు. గత రెండు సంఘటనల్లో కేవలం ఆరేడుగురు మాత్రమే చనిపోయినట్లు పాకిస్తాన్ చెప్పుకుంటుందని, కానీ పెద్ద సంఖ్యలో పాక్ సైనికులు చనిపోయారని దేవరాజ్ అన్నారు. -
భారత్ మెరుపు దెబ్బ.. పాక్ సైనికుల ఏరివేత
శ్రీనగర్ : భారత సైన్యం మెరుపు దెబ్బ వేసి పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఫూంఛ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు పాక్ రేంజర్లను మట్టుపెట్టింది. సోమవారం ఉదయం నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద స్థితితో సంచరిస్తున్న పాక్ సైనికులను గమనించిన సిబ్బంది భారత సైన్యాన్ని అప్రమత్తం చేశారు. దీంతో జవాన్లు రంగంలోకి దిగగా.. పాక్ సైనికులు కాల్పులు ప్రారంభించారు. ఇక ప్రతిదాడి భాగంగా భారత సైన్యం వారిని కాల్చిచంపింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు యూరి సెక్టార్ వద్ద ఆరుగురు జేషే ఉగ్రవాదులను సైన్యం ఎన్కౌంటర్లో ఏరివేసిన సంగతి తెలిసిందే. కాగా, పాకిస్థాన్కు వాళ్లకు అర్థమయ్యే రీతిలోనే సమాధానమిస్తామని ఆర్మీ డే సందర్భంగా భారత్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ రెండు పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. -
ఆర్మీ మేజర్ను కాల్చి చంపిన జవాను!
శ్రీనగర్: భారత ఆర్మీలో మేజర్ ర్యాంకులో పనిచేస్తున్న వ్యక్తిని జవాను కాల్చిచంపినట్లు రిపోర్టులు వచ్చాయి. విధి నిర్వహణలో సెల్ఫోన్ను వినియోగిస్తున్న జవానును మేజర్ ప్రశ్నించగా.. కోపోద్రేకుడైన జవాను మేజర్పై కాల్పులు జరిపినట్లు సమాచారం. దాదాపు ఐదు బుల్లెట్లు మేజర్ శిఖర్ థాప శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఇరువురిని ఆర్మీ ఉడి ప్రాంతంలోని నియంత్రణ రేఖకు చేరువలో పికెటింగ్కు పంపినట్లు తెలిసింది. -
పాక్కు దీటైన జవాబు
భారత్ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికుల మృతి ► ఎల్వోసీ వెంట పాక్ ఆర్మీ పోస్టు ధ్వంసం ► పుల్వామాలో ఆర్మీ శిబిరంపై గ్రనేడ్ దాడి.. జవానుకు గాయాలు శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లోని నియం త్రణ రేఖ వెంట కాల్పుల మోత కొన సాగుతోంది. ఎలాంటి కవ్వింపు లేకుండా శని వారం ఉదయం నుంచి పాకిస్తాన్ బలగాలు కొనసాగిస్తున్న కాల్పుల్ని భారత భద్రతా దళాలు దీటుగా తిప్పికొట్టాయి. పాకిస్తాన్ పోస్టులే లక్ష్యంగా శనివారం రాత్రి, ఆదివారం భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పాకిస్తాన్ సైనికులు మరణించగా, మరో ఐదు గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 16 మంది గాయపడ్డారు. పాకి స్తాన్లోని పూంచ్ జిల్లా హజీరా సెక్టార్లోని సరిహద్దు గ్రామాల్లో ఈ మరణాలు సంభవిం చాయి. టెట్రినోట్ సెక్టార్లోని బహైరా, అబ్బాస్పూర్లోని సత్వాల్, దక్కీ చాఫర్, చత్రీలోని పొలాస్ ప్రాంతాల్లో పాకిస్తాన్కు నష్టం వాటిల్లినట్లు భారత ఆర్మీ వర్గాలు అనధికారికంగా పేర్కొన్నాయి. కాల్పుల్లో ఏడుగురు పాకిస్తానీ సైనికులు గాయపడ్డారని, వారిలో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. భారత్లోని చక్కా ద బాగ్, ఖారీ కమారా సెక్టార్లకు ఆవలివైపున పాకిస్తాన్ ‘24 ఫ్రాంటియన్ ఫోర్స్’ యూనిట్కు చెందిన సైనికులుగా వీరిని గుర్తించారు. భారత దళాల ఎదురుదాడిలో పాకిస్తాన్ ఆర్మీ పోస్టు పూర్తిగా ధ్వంసమైంది. అంతకుముందు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంతో భారత్కు చెందిన ఆర్మీ జవాన్ మహమ్మద్ షౌకత్, అతని భార్య సఫియా బీ మరణించారు. పూంచ్ జిల్లా కర్మారా గ్రామంలోని వారి ఇంటిపై శనివారం 120 ఎంఎం మోర్టార్ షెల్ పడడంతో ప్రాణాలు కోల్పోయారు. వారి ఇద్దరు కుమార్తెలతో పాటు, మరొకరు గాయపడ్డారు. శనివారం ఉదయం నుంచి పాక్ బలగాలు ఎల్వోసీ వెంట కవ్వింపుకు పాల్పడుతూనే ఉన్నాయి. వరుసగా రెండో రోజూ భారత్కు పాక్ నిరసన నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ వరుసగా రెండో రోజూ భారత డిప్యూటీ హై కమిషనర్కు పాకిస్తాన్ నిరసన తెలిపింది. ఎలాంటి కవ్వింపు లేకుండా భారత్ జరిపిన కాల్పుల్లో పౌరులు మరణించడంపై భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్కు నిరసన తెలిపామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత దళాల కాల్పుల్లో శనివారం ముగ్గురు పౌరులు మరణించారని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరోపించారు. దీంతో మృతిచెందిన పౌరుల సంఖ్య ఐదుకు చేరిందని, వారిలో నలుగురు మహిళలున్నారని ఆయన చెప్పారు. పూంచ్, క్రిష్ణఘట్టి సెక్టార్లలో మొదటగా పాకిస్తాన్ దళాలే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని, వాటిని భారత దళాలు ప్రతిఘటించాయని నిన్నటి సమావేశంలో పాక్కు జేపీ సింగ్ స్పష్టం చేశారు. వనీని పాక్ పొగడటంపై భారత్ నిరసన ఉగ్రవాది బుర్హాన్ వనీని పాకిస్తాన్ పొగడటాన్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న మద్దతును, ప్రోత్సాహాన్ని అందరూ ఖండించాలని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే ట్వీట్ చేశారు. వనీని పొగుడుతూ శనివారం పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ట్వీట్ చేశారు. కాగా జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలో భద్రతాదళాల శిబిరంపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడిలో ఒక సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడు. త్రాల్ పట్టణంలోని అరిబల్ వద్ద శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. గాయపడ్డ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వారు వెల్లడించారు. ఈ దాడికి బాధ్యులమని పేర్కొంటూ ఇంతవరకూ ఏ ప్రకటనా వెలువడలేదని చెప్పారు. -
నియంత్రణ రేఖ దాటిన 12ఏళ్ల పాక్ బాలుడు
జమ్ముకశ్మీర్: పాకిస్థాన్కు చెందిన పన్నెండేళ్ల బాలుడు నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి అడుగుపెట్టాడు. అనుమానాస్పదంగా అతడు సంచరిస్తుండటంతో భారత ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఇరు దేశాల మధ్య ఉన్న నియంత్రణ రేఖ గుండా గస్తీకి వెళుతుండగా అతడు కనిపించినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. వారు ప్రాథమికంగా తెలుసుకున్న సమాచారం ప్రకారం ఆ బాలుడు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని దంగర్ పేల్ అనే గ్రామానికి చెందిన ఓ పదవీ విరమణ పొందిన బాలోచ్ రెజిమెంట్ సోల్జర్ కుమారుడు. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్ వద్ద బాలుడు ఆర్మీకి తారస పడ్డాడు. రెక్కీ నిర్వహించేందుకే ఆ బాలుడిని పాక్ ఆర్మీ పంపించినట్లు తాము భావిస్తున్నామన్నారు. ఎక్కడెక్కడ చొరబాట్లకు అవకాశం ఉందో తెలుసుకునేందుకే ఆ బాలుడు వచ్చినట్లు అనుమానిస్తున్నామని అతడిని పోలీసులకు అప్పగించనున్నట్లు చెప్పారు. -
పాక్ ఆర్మీ దుందుడుకు చర్య
శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్లోని రజౌరి జిల్లా నౌషేరా సెక్టార్లో పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. సోమవారం ఉదయం నుంచి పాక్ సైన్యం కాల్పులు జరపుతుండటంతో.. అప్రమత్తమైన భారత భద్రతా సిబ్బంది వారికి ధీటుగా బదులిస్తోంది అని రక్షణశాఖ అధికారి మనీష్మెహతా తెలిపారు. భారత ఆర్మీ పోస్ట్లను లక్ష్యంగా చేసుకొని పాక్ కాల్పులకు పాల్పడుతోందని ఆయన వెల్లడించారు. పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఈ నెలలో ఇది ఆరోసారి కావడం గమనార్హం. -
మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
-
మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అఖ్నూర్ సెక్టార్ లోని బతాల్ సమీపంలో ఉన్న జనరల్ రిజర్వ్ ఇంజినీరింగ్ ఫోర్స్(జీఆర్ఈఎఫ్) ఆర్మీక్యాంపుపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో క్యాంపులో పనిచేసే ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఆర్మీ ఎదురుకాల్పులు ప్రారంభించింది. ప్రస్తుతం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఉగ్రదాడుల నేపథ్యంలో అఖ్నూర్ సెక్టార్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. బతాల్ గ్రామంలో తలదాచుకున్న ఉగ్రవాదులు సోమవారం వేకువజామున ఒక్కసారిగా ఆర్మీ క్యాంపుపై కాల్పులకు తెగబడ్డారు. కాగా, ఉగ్రవాదులును ఏరిపారేసేందుకు ఆర్మీ పటిష్ట చర్యలు తీసుకున్న నేపథ్యంలోనే ముష్కరులు ఈ దాడికి తెగబడ్డారని అధికారులు భావిస్తున్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్వోసీ)కి సరిహద్దుల్లో కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆర్మీ క్యాంపు ఉన్న విషయం తెలిసిందే. ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
భారత్ ప్రతీకార దాడి, పాక్ జవాన్లు హతం
న్యూఢిల్లీ: ఓ భారత జవాను తల నరికి, మరో ఇద్దరు జవాన్లను కాల్చి చంపడంతో భారత భద్రతా దళాలు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ పోస్టులపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 12మంది పాకిస్తాన్ జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది. భారత్ దాడులతో ఒక్కసారిగా షాక్ కు గురైన పాకిస్తాన్ మిలటరి ఇరు దేశాల కమాండర్లు సంప్రదింపులు జరపాలని కోరింది. బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర మధ్య ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ మిలటరీ పోస్టులపై దాడులు చేశాయి. మెషీన్ గన్స్, 120ఎంఎం హెవీ మోటార్లతో పాక్ పోస్టులను తునాతునకలు చేశాయి. దీంతో కంగుతిన్న పాక్ ఆర్మీ సంప్రదింపులు జరపాలని కోరింది. అయితే ఈ సంప్రదింపులు ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. లెఫ్టినెంట్ జనరల్ రణ్ బీర్ సింగ్ తో మాజ్ జనరల్ సహీర్ షంషాద్ మీర్జా మాట్లాడినట్లు భారత్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత దళాలు జరిపిన కాల్పుల్లో పాకిస్తాన్ పౌరులు ప్రయాణిస్తున్న ఓ బస్సుకు మంటలు అంటుకున్నట్లు మీర్జా పేర్కొన్నారని తెలిపింది. మీర్జా వ్యాఖ్యలకు స్పందించిన సింగ్.. భారత్ పై తరచూ కాల్పులకు పాల్పడుతున్న పాకిస్తాన్ పోస్టులపై మాత్రమే తాము దాడులు చేస్తున్నట్లు సమాధానం ఇచ్చారని చెప్పింది. పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్ లో చొరబాటుకు సాయం చేస్తున్నారని ఆరోపించినట్లు పేర్కొంది. ప్రతి మంగళవారం భారత్-పాకిస్తాన్ ఆర్మీ అధికారుల మధ్య సంభాషణలు జరుగుతున్నాయి. పెద్ద స్ధాయిలో కాకపోయినా అప్పటి పరిస్ధితిని బట్టి చర్చలు జరిపే అధికారులు స్ధాయి మారుతోంది. బుధవారం కాల్పులపై స్పందించిన పాకిస్తాన్ హై కమిషన్ భారతీయ డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ వరుసగా మూడో రోజు సమన్లు జారీ చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి ఉద్రిక్తలు లేకపోయినా భారతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సర్తాజ్ అజీజ్ అమృత్ సర్ జరగబోయే హార్ట్ ఆఫ్ ఏసియా సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిసింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించనున్నారు. ఆప్ఘనిస్తాన్ లో శాంతి, భద్రతల స్ధాపనపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో 40 దేశాల పత్రినిధులు పాల్గొంటారు. -
పాక్పై విరుచుకుపడ్డ భారత సైన్యం
పాక్ సైనిక బలగాలు భారతీయ సైనికుడి శరీరాన్ని ఛిద్రం చేయడం, మరో ఇద్దరిని హతమార్చిన ఘటన ఒక్కసారిగా భారత సైన్యం రక్తాన్ని ఉడికించింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్పై భారీ స్థాయిలో దాడులతో విరుచుకుపడ్డారు. దీటుగా సమాధానం ఇవ్వడం తమకు తెలుసని స్పష్టం చేశారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతం మొత్తం తుపాకుల మోతతో దద్దరిల్లింది. పూంఛ్, రాజౌరి, కేల్, మచిల్.. ఇలాంటి ప్రాంతాలన్నీ హాట్ జోన్లుగా మారిపోయాయి. మంగళవారం నాడు పాకిస్థానీ కమాండోలు ఒక సైనికుడి తల నరికి, మరో ఇద్దరిని కూడా హతమార్చారు. మచిల్ ప్రాంతంలో నియంత్రణరేఖను దాటి వచ్చి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఉత్తర కశ్మీర్లోని మచిల్ సెక్టార్లో పెట్రోలింగ్ చేస్తున్న సైనికులను పాక్ కమాండోలు చుట్టుముట్టారు. ఈ సెక్టార్లో భారత, పాకిస్థానీ సైనిక పోస్టులు దగ్గరగా ఉంటాయి. దానికితోడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు ఉండటంతో ఉగ్రవాదులు లేదా సైనికులు చొరబడటం సులభం అవుతుంది. మూడు వారాల క్రితమే అదే ప్రాంతంలో మరో సైనికుడిని కూడా తల నరికి చంపారు. ఈ పిరికిపందల చర్యకు గట్టి ప్రతీకారం ఉండి తీరుతుందని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. పాకిస్థానీ ఆర్మీ పోస్టుల మీద దాడికి భారత సైన్యం 120 ఎంఎం హెవీ మోర్టార్లను, మిషన్ గన్లను ఉపయోగించింది. అయితే, భారత సైన్యం తమమీద ఎలాంటి దాడి చేయలేదని పాకిస్థాన్ అంటోంది. -
పాకిస్థానే ఎక్కువ నష్టపోయింది!
వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దులు (ఐబీ) మీదుగా పౌరులే లక్ష్యంగా విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న పాకిస్థాన్కు దీటుగా బదులిస్తున్నామని బీఎస్ఎఫ్ ఐజీ డీకే ఉపాధ్యాయ బుధవారం వెల్లడించారు. పాక్ సైన్యం మన పౌరులు లక్ష్యంగా కాల్పులు, షెల్లింగ్ దాడులతో విరుచుకుపడుతుండగా.. తాము కేవలం సైనికులే లక్ష్యంగా నిర్దేశితమైన కచ్చితమైన దాడులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. భారత సైన్యం ఎప్పుడూ కూడా అటువైపున్న సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపలేదని, కాల్పులతో పెట్రేగుతున్న పాక్ రేంజర్లు లక్ష్యంగా కచ్చితమైన ప్రతి దాడి జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. తమ ప్రతిదాడిలో పెద్ద ఎత్తున పాక్ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయని, పాక్ సైన్యం పెద్దసంఖ్యలో నష్టపోయిందని చెప్పారు. ‘మేం వారి పోస్టుల లక్ష్యంగా కాల్పులు జరిపాం. వారివైపు నష్టం ఎక్కువగా సంభవించింది. అయితే, ఎంతమంది చనిపోయి ఉంటారనే సంఖ్యను మేం ధ్రువీకరించలేం’ అని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. పాక్ సైన్యం విచ్చలవిడి కాల్పులతో మంగళవారం ఎనిమిది మంది భారత పౌరులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో మరో 22మంది చనిపోయారు. దీంతో ప్రతిదాడులకు దిగిన భారత సైన్యం దీటుగా దెబ్బకొడుతూ 14 పాక్ సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాక్ రేంజర్లు చనిపోయినట్టు తెలుస్తోంది. -
పాక్ సైన్యాన్ని మేం ఎదుర్కోవడానికి రెడీ!
బోనియార్ (జమ్మూకశ్మీర్): పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాదులు ఎలాంటి దుశ్చర్యకు ఒడిగట్టినా.. దానిని ఎదుర్కోవడానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని భారత సైన్యం స్పష్టం చేసింది. ‘వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) మీదుగా మా సన్నద్ధత అత్యున్నత స్థాయిలో ఉంది. ఎల్వోసీ మీదుగా ఎలాంటి దుశ్చర్య ఎదురైనా దానిని ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధంగా ఉంది. ఇది నిత్యం ఎదురయ్యేదైనా, వేరే తరహాదైనా ఎదుర్కొంటాం’ అని శ్రీనగర్కు చెందిన 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెప్టినెంట్ జనరల్ సతీష్ దువా మంగళవారం బోనియార్లో విలేకరులకు తెలిపారు. ఎల్వోసీ మీదుగా భారీగా చొరబాటు ప్రయత్నాలు జరగుతున్నాయని, వాటిని చాలావరకు ఆర్మీ భగ్నం చేస్తున్నదని, ఎల్వోసీ మీదుగా తరచూ జరుగుతున్న ఎన్కౌంటర్లే ఇందుకు నిదర్శనం అని ఆయన చెప్పారు. చొరబాటు యత్నాలను భగ్నం చేస్తూ ఆర్మీ పలువురు మిలిటెంట్లను హతమార్చిందని, ఇది ఆర్మీ సన్నద్ధతను చాటుతోందని ఆయన చెప్పారు. అయితే, పీవోకేలో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్పై స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఈ విషయంలో సైన్యం, రాజకీయ అధినాయకత్వం చెప్పాల్సినదంతా చెప్పేసిందని, ఆ విషయంలో తనకు ఎలాంటి భిన్నమైన అభిప్రాయం లేదని తెలిపారు. కొందరు తప్పుదోవ పట్టిన యువకులే కశ్మీర్లోయలో జరుగుతున్న ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారని, మెజారిటీ యువత సైన్యం వైపే ఉందని ఆయన చెప్పారు. -
నియంత్రణ ‘హద్దు’ను దాటుతాం!
పీఓకేలోకి వెళ్లయినా ఉగ్రవాదులను వేటాడతాం • సర్జికల్ దాడులతో భారత వైఖరిలో భారీ మార్పు న్యూఢిల్లీ: పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదంపై భారత్ వైఖరి క్రమంగా మారుతోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు భారత్పై ఉగ్రదాడులు జరిగితే వాటిని తీవ్రంగా ఖండించడం, అవి పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు జరిపినవేనని సాక్ష్యాలు అందించటం, దాడుల కారకులకు శిక్ష పడేలా చూడాలని పాకిస్తాన్ను అభ్యర్థించడం.. ఇంతవరకే భారత్ పరిమితమయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోందనీ, రాయబారాన్ని దాటి దాడులు చేసేందుకు సిద్ధమవుతోందని కొందరు అధికారులు చెబుతున్నారు. నియంత్రణ రేఖ ఇక ఎంతమాత్రం అనుల్లంఘనీయం కాదనీ, పాక్ ఉగ్రవాదులను హద్దు దాటించి భారత్లోకి పంపిస్తూ ఉంటే తామూ చూస్తూ ఊరుకోమని సర్జికల్ దాడుల ద్వారా భారత్ గ ట్టి హెచ్చరికలే పంపింది. నియంత్రణ రేఖ దాటి పీఓకేలోకి అడుగుపెట్టైనా ఉగ్రవాదుల పీచమణచడానికి సిద్ధమని సెప్టెంబర్ 29 నాటి దాడితో భారత్ నిరూపించింది. నియంత్రణ రేఖను పాక్ ఆర్మీ, ఉగ్రవాదులు ఉల్లంఘిస్తుంటే.. వారిని వేటాడేందుకు తాము కూడా హద్దు దాటడానికి వెనుకాడమని పాక్కు అర్థమయ్యే భాషలోనే భారత్ చెప్పింది. సిద్ధంగా ఉండండి: ప్రభుత్వం పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్మీకి తగినన్ని ఆయుధాలను అందించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆయుధాలు సరఫరా చేసే వారిని కోరింది. ఉత్పత్తిని పెంచాలనీ, అడిగిన తర్వాత వీలైనంత తొందర్లో ఆయుధాలను చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కంపెనీలకు చెప్పినట్లు అధికారులు, కంపెనీల యజమానులు తెలిపారు. చిన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సుఖోయ్, మిరేగ్ యుద్ధవిమానాలకు అమర్చడానికి విడి భాగాలు, ఆయుధాలను ప్రభుత్వం కంపెనీలను కోరుతోంది. 1999 నాటి వైఖరికి విరుద్ధం భారత ప్రస్తుత వైఖరి 1999లో కార్గిల్ యుద్ధం నాటి దానికి పూర్తిగా విరుద్ధం. 1999లో పాక్ నియంత్రణ రేఖను కార్గిల్ వరకు గీయాలని యత్నించి, అంతర్జాతీయ సమాజం హెచ్చరికతో వెనక్కు తగ్గింది. అప్పటి అమెరికా ప్రధాని బిల్ క్లింటన్, సరిహద్దులను రక్తంతో తిరిగి గీయకూడదని వ్యాఖ్యానించారు. అయితే కొంతకాలంగా ఉల్లంఘనలు మళ్లీ తారాస్థాయికి చేరా యి. పాక్ ఉగ్రవాదులను భారత్పైకి ఉసిగొల్పుతూనే ఉంది. అయినా గత దశాబ్దకాలంగా భారత్ రాయబారం మాత్రమే నడుపుతోంది. అయితే ఇప్పుడు ఆ వైఖరిలో మార్పు కనపడుతోంది. తాము ‘హద్దు’ను దాటడానికీ వెనుకాడబోమని సంకేతాలిచ్చింది. -
ఉగ్రవాదులు మాటువేశారు.. జాగ్రత్త
న్యూఢిల్లీ: ఎల్వోసీ సమీపంలో పాకిస్థాన్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మాటువేశారని జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్.. ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశారు. ఉగ్రవాదులు ఎల్వోసీని దాటి భారత్లోకి చొరబడి దాడులు చేసే ప్రమాదం ఉందని దోవల్ చెప్పారు. ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు దోవల్ ఓ నివేదికను మోదీకి సమర్పించినట్టు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖల మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్తో పాటు అజిత్ దోవల్ పాల్గొన్నారు. భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసిన తర్వాత కేబినెట్ భద్రత కమిటీ సమావేశంకావడమిది రెండోసారి. సర్జికల్ దాడుల తర్వాత ఎల్వోసీ సమీపంలో పాక్ భూభాగంలో మోహరించిన 12 శిబిరాలను ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించినట్టు దోవల్ తెలియజేశారు. కశ్మీర్ లోయలో మళ్లీ హింస రాజేసేందుకు, భారత సైనికులపై దాడులు చేసేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులను పంపేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీకి వివరించారు. జమ్ము కశ్మీర్లోని ఉడీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 19 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత్ సైన్యం జరిపిన సర్జికల్ దాడుల్లో 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే తమ భూభాగంలో సర్జికల్ దాడులు జరగలేదని పాక్ చెబుతోంది. -
నిద్ర లేదు.. సెలవు లేదు...
ప్రస్తుతం సరిహద్దులో భారత సైనికుల పరిస్థితి న్యూఢిల్లీ: భారత జవాన్లకు ప్రస్తుతం నిద్ర లేదు.. సెలవులు లేవు... సరిహద్దు భూభాగంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశ జవాన్లు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులు దినదిన గండంగా సాగుతున్నాయి. సైనికులు అప్రమత్తంగా ఉంటున్నారు. విధులను నిర్వర్తిస్తున్నారు. ఉడీ ఉగ్ర దాడి అనంతరం భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ నుంచి ఎప్పుడు, ఏ రకంగా ముప్పు వాటిల్లుతుందోనని అత్యంత హైఅలర్ట్తో భారత్ సైన్యం మెలుగుతోంది. ఖాళీ సమయాల్లో చేసే అన్ని పనులకు మన జవాన్లు చెక్ చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించడమే ప్రస్తుతం వారి ముందున్న ప్రధాన విధి. సైనికులకు సెలవులు దొరకడం మాట అటుంచితే కనీసం సరిగా నిద్రపోవడానికి కూడా సమయం లేకుండా పోయింది. ఇదివరకు సైనికులు 6 గంటలు నిద్రపోయేవారు కానీ తాజా పరిస్థితుల్లో కనీసం 4 గంటలు కూడా నిద్రపోవడం లేదు. నిద్రాహారాలు మాని నియంత్రణ రేఖ వద్ద నిత్యం పెట్రోలింగ్ చేస్తూ సరిహద్దును కాపాడే పనిలో భారత ఆర్మీ పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. -
జై జవాన్!
నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి కొంతకాలంగా పాకిస్తాన్ వైపు నుంచి సాగుతున్న అరాచకానికి తొలిసారి భారత సైన్యం నుంచి దీటైన జవాబు వెళ్లింది. 1971నాటి యుద్ధం తర్వాత చరిత్రలో మొట్టమొదటిసారి ఎల్ఓసీని దాటి పాకిస్తాన్ భూభాగంలో మూడు కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి ఏడు చోట్ల గుర్తించిన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గురువారం వేకువజామున మన సైన్యం మెరుపు దాడుల్ని నిర్వహించింది. 38మందిని మట్టుబెట్టి మరి కొందర్ని అదుపులోకి తీసుకున్నారంటే... ఆ సంగతి మనం వెల్లడించేవరకూ ఇతర దేశాలతోపాటు పాకిస్తాన్కు కూడా తెలియదంటే ఈ మొత్తం ఆపరేషన్ ఎంత పకడ్బందీగా నిర్వహించారో అర్ధమవుతుంది. ఎంచుకున్న ప్రాంతంలో, అనుకున్న సమయానికి, ముందుగా నిర్ణయించిన విధంగా దాడులు జరపడం... ఉగ్రవాదులకు భారీ నష్టం కలిగించడం... అదే సమయంలో ఇటువైపు ఎలాంటి ప్రాణ నష్టమూ లేకుండా చూసుకోవడం మన సైనిక కమాండోల తిరుగులేని సామర్ధ్యాన్ని వెల్లడిస్తుంది. 250 కిలోమీటర్ల విస్తృతిలో ఎల్ఓసీ ఆవల హెలికాప్టర్లలో బలగాలను దించి ఈ ఆపరేషన్ను పూర్తి చేశారు. దీన్నంతటినీ ద్రోన్ కెమెరాలతో చిత్రించారు. వారం రోజులుగా ఎల్ఓసీలో పకడ్బందీ నిఘా పెట్టి, ఉగ్రవాద స్థావరాలను నిర్దిష్టంగా గుర్తించి ఈ దాడులు నిర్వహించారు. ఈ మాదిరి దాడులకు ఎంతో నైపుణ్యం, సమర్ధత కావాలి. అక్కడి సైనికుల జోలికెళ్తే మొత్తం ఆపరేషన్ను వక్రీకరించే ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ విషయంలో మన కమాండోలు అభినందనీయులు. ఏ దేశానికైనా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, అందుకు భంగం కలిగించే శక్తులపై దాడులు చేయడానికి సర్వహక్కులూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఎదురైనా మన దేశం నిగ్రహం పాటిస్తూ వచ్చింది. సరిహద్దు ఆవలినుంచి వచ్చిన ఉగ్రవాదులు వివిధ ప్రాంతాల్లో ఎన్నిసార్లు, ఎంత విధ్వంసం సృష్టించినా... దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబై నగరాన్ని నాలుగు రోజులపాటు గడగడలాడించి 164మందిని పొట్టన బెట్టుకున్నా ఓర్పుతో వ్యవహరించింది. సజీవంగా పట్టుబడిన ఉగ్రవాదినుంచి సేకరించిన సమాచారాన్ని పాకిస్తాన్కు అందజేసి కారకుల్ని పట్టి బంధించి అప్పగిం చాలని కోరింది. మొన్నటి పఠాన్కోట్ దాడి వరకూ ఇలా ఎప్పటికప్పుడు చెబు తున్నా బుకాయించడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. భారత్లో సాగు తున్న ఉగ్ర దాడులతో తమకు సంబంధమే లేదన్న బలహీనమైన వాదనను వినిపిం చడాన్ని అది రివాజుగా మార్చుకుంది. అయితే ఉడీ ఉగ్రవాద దాడిలో 18మంది జవాన్ల ప్రాణాలు తీసినప్పటినుంచీ దేశ ప్రజలు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెడితే ఇవి మున్ముందు మరింత మితిమీరడం ఖాయమన్న వాదనలు వచ్చాయి. ఏదో చేస్తామన్నారు... ఏం చేస్తున్నారని ఎన్డీఏ ప్రభుత్వంపై వివిధ పక్షాలు విమర్శలు కురిపించాయి. అందులో కాంగ్రెస్, వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. మరోపక్క పాకిస్తాన్ ఎప్పటిలానే ఉడీ దాడి ఉదంతాన్ని వక్రీకరించడం మొదలుపెట్టింది. దాంతో తమకు సంబంధమే లేదన్నట్టు ప్రవర్తిం చింది. పెపైచ్చు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్పై ఎదురుదాడికి దిగారు. వీటన్నిటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. అన్నివిధాలా ఆలోచించింది. పర్యవ సానంగా మన వైఖరిలో గుణాత్మకమైన మార్పు కనబడింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించారు. మనకు హాని తలపెట్టినవారికి నొప్పి తెలిసేలా చేస్తామని రక్షణ మంత్రి పరీకర్ హెచ్చరించారు. ఉడీ ఉగ్రవాద దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లను మరువబోమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘నీళ్లూ, నెత్తురూ కలిసి ప్రవహించలేవ’ని అంటూ సింధు నదీ జలాల ఒప్పందం పునఃసమీక్షకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇస్లామాబాద్లో జరిగే దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి(సార్క్) సమావేశాలకు గైర్హాజరవుతున్నట్టు మన దేశం ప్రకటించింది. బంగ్లా, భూటాన్, అఫ్ఘాన్లు తాము సైతం హాజరుకాబోమని తెలిపి ప్రపంచం ముందు పాక్ను దోషిగా నిలిపాయి. కానీ పాకిస్తాన్ దీన్నంతటినీ తేలిగ్గా తీసుకుంది. మా దగ్గర అణ్వాయుధాలు న్నాయి... ప్రయోగించడానికి వెనకాడబోమని హెచ్చరించడం మొదలెట్టింది. ఎన్ని కలకు ముందూ, అధికారంలోకొచ్చాక కొన్నాళ్లు సొంతంగా ఆలోచించినట్టు కనిపిం చిన నవాజ్ షరీఫ్ అక్కడి సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారారు. తనకు తిరుగు లేని ప్రజామోదం ఉన్నా మునుపటి ప్రధానుల మాదిరే బలహీనంగా వ్యవహరిం చడం మొదలుపెట్టారు. అసాధారణ రీతిలో తన పుట్టినరోజునాడు స్వయంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోదీ వ్యవహార శైలి చూశాకైనా ఆయన మారలేకపోయారు. పాకిస్తాన్ సైన్యం, దాని ఆధ్వర్యంలోని గూఢచార సంస్థ ఐఎస్ఐలు పెంచి పోషించిన ఉగ్రవాద మూకలు తమ దేశానికే ముప్పుగా పరిణ మించినా అక్కడి పౌర సమాజం మద్దతును కూడగట్టి సైన్యం చేష్టలను నియం త్రించడానికి షరీఫ్ ఏమాత్రం ప్రయత్నించలేదు. అమెరికా కూడా ఈ ధోరణుల విషయంలో చూసీచూడనట్టే వ్యవహరించింది. ఈ పరిణామాలపై కళ్లుమూసు కుంది. ఉడీ దాడిని ఖండించడం తప్ప బాధ్యులు మీరేనని పాక్కు చెప్పడంలో అది విఫలమైంది. మన దేశం కూడా ఎల్లకాలమూ చూస్తూ ఊరుకుంటుందనుకోవడం తెలివితక్కువతనం. ఇప్పుడు నిర్వహించిన దాడుల్ని ‘ప్రతీకార చర్య’గా కాక ఉగ్ర వాద చర్యలను నిరోధించడంలో భాగంగా సాగించినవేనని చెప్పడం ద్వారా మన దేశం ఎంతో పరిణతితో వ్యవహరించింది. దీన్ని పాకిస్తాన్ ఎలా చూస్తుందన్నది దాని ఇష్టం. దాడులు నిజంకాదని, ఆవలినుంచి కాల్పులు జరిగాయని తన పౌరు లను నమ్మింపజూస్తున్నది. అయితే అటునుంచి ఎదురయ్యే ఎలాంటి పరిణామా లనైనా ఎదుర్కొనడానికి మన సైన్యం సర్వసన్నద్ధంగా ఉంటుంది. అది తప్పనిసరి. ఈ దశలోనైనా పాకిస్తాన్కు వాస్తవ పరిస్థితులు అవగాహనకొచ్చేలా చేయాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలకూ, మరీ ముఖ్యంగా అమెరికా తదితర అగ్రరాజ్యాలకూ ఉంది. -
జమ్ముకాశ్మీర్ లో పాక్ మరోసారి కాల్పులు
జమ్ముకాశ్మీర్ : సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద, జమ్ముకాశ్మీర్ లోని మరికొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. పూంచ్ జిల్లాలో పాక్ సైన్యం కాల్పులు జరిపిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ మెహతా వెల్లడించారు. బాలాకోట్ ప్రాంతంలో కాల్పులు ప్రారంభించగానే మన సైన్యం ఎదురు దాడికి దిగగానే రాత్రి పది గంటల సమయంలో పాక్ కాల్పులు విరమించినట్లు తెలిపారు. కానీ పూంచ్ జిల్లాలో మాత్రం కొద్దిసేపు కాల్పులు ఆపి మళ్లీ రాత్రి 10 గంటల నుంచి 10:30 వరకు కొనసాగించారని మెహతా చెప్పారు. -
భారత్ స్థావరాలపై పాక్ కాల్పులు
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకాశ్మీర్లో సరిహద్దు వెంబడి భారత స్థావరాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ దాడులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కాల్పులు కొనసాగినట్టు రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ మనీష్ మెహతా చెప్పారు. పూంచ్, రాజౌళి జిల్లాలలోని సరిహద్దు వెంబడి భారత స్థావరాలపై దాడులకు దిగినట్టు తెలిపారు. ఈ దాడుల్లో భారత్కు చెందినవారికి ఎలాంటి ప్రమాదమూ జరగలేదని చెప్పారు. -
ముగ్గురు ముష్కరుల హతం
శ్రీనగర్: చొరబాటుదారులు, భారత సైన్యానికి మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు కలిగిన ఓ ముష్కరుల బృందం ఆదివారం ఉదయం కశ్మీర్ కుప్వారా జిల్లాలోని తగ్ధార్ సెక్టార్ వద్ద ఎల్వోసీ దాటి భారత్లోకి చొరబడేందుకు యత్నించింది. వీరిని గుర్తించి హెచ్చరికలు చేసిన భారత సైన్యంపైకి ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి సమయంలో సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు మృతి చెందారు. కడపటి వార్తలు అందేవరకు కూడా హోరాహోరీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. -
భారతీయ బాలుడిపై పాక్ సైన్యం ఔదార్యం
ఇస్లామాబాద్: తమ భూభాగంలోకి ప్రవేశించిన భారతీయ టీనేజీ బాలుడిని పాక్ సైన్యం తిరిగి భారత సైన్యానికి అప్పగించింది. కాశ్మీర్లోని ఝానగర్కు చెందిన మంజర్ హుస్సేన్ స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. అతడు నవంబర్ 14వ తేదీన అనుకోకుండా భారత్, పాక్ సరిహద్దుల్లోని అసల్ కాస్ నుల్లా వద్ద నియంత్రణ రేఖను దాటి పొరుగు దేశ భూభాగంలోకి ప్రవేశించాడు. దాంతో హుస్సేన్ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని ఉన్నతాధికారులకు అప్పగించారు. దాంతో హుస్సేన్ను ఉన్నతాధికారులు విచారించి ... మంగళవారం చకొటి -యూరి కేంద్రం వద్ద భారత్ సైన్యానికి హుస్సేన్ను అప్పగించినట్లు పాక్ సైన్యం తెలిపింది. -
బంకర్ కు నిప్పంటుకుని సైనికుడు మృతి
శ్రీనగర్: నియంత్రణ రేఖ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఓ సైనికుడు చనిపోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన జమ్మూ, కాశ్మీర్ లోని కుప్వారా వద్ద జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. తూట్ మార్ గలి ప్రాంతంలోని నవ్ గాం సెక్టర్ లోని నియంత్రణ రేఖ వద్ద బంకర్ కు నిప్పంటుకోవడంతో జాట్ రెజిమెంట్ కు చెందిన భారత సైనికుడు, మరో ఇద్దరు మరణించారని అధికారి తెలిపారు. గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగినపుడు బంకర్ లో కిరోసిన్, కోక్ హీటర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. -
హమీర్పూర్ వద్ద పాక్ సైన్యం కాల్పులు
జమ్మూ: పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూకాశ్మీర్ పూంఛ్ జిల్లాలోని హమీర్పూర్ సెక్టార్ సమీపంలో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత శిబిరాలే లక్ష్యంగా పాక్ జరిపిన కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టిందని రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని తెలిపారు. గత మూడు రోజులుగా హమీర్పూర్ ప్రాంతంలో వరుసగా కాల్పులకు పాక్ సైన్యం తెగబడుతుందని చెప్పారు. అక్టోబర్ 6వ తేదీన భారత్ సరిహద్దు వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించగా, 62 మంది గాయపడిన సంగతి తెలిసిందే. -
పాక్ కాల్పుల్లో అనంతపురం జవాను మృతి
శ్రీనగర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ పూంఛ్ జిల్లాలోని బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ శుక్రవారం కాల్పులు జరిపింది. అయితే పాక్ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. కాగా పాక్ సైన్యం కాల్పుల్లో అనంతపురం జిల్లాకు చెందిన ఓ జవాను మృతి చెందాడు. జవాను అనీల్ కుమార్ స్వస్థలం అనంతపురం జిల్లా తలుపుల మండలం తూపల్లి గ్రామం. గతరాత్రి అనీల్ కుమార్ కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మన సైన్యం సిద్ధంగా ఉంది: జైట్లీ
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గర్హించారు. పాక్ కుతంత్రాలను తిప్పికొట్టేందుకు భారత సైన్యం సర్వ సన్నద్దంగా ఉందని తెలిపారు. సరిహద్దు వెంబడి దాయాది దేశం సాగిస్తున్న దాడులకు మన రక్షణ దళాలు తగినరీతిలో స్పందించాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ దాడులు జరపడాన్ని ఆయన తప్పుబట్టారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సాగిస్తున్న మారణకాండలో అమాయకపౌరులు బలౌతున్నారని జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. -
సరిహద్దులో సొరంగం
అక్నూర్: భారత్-పాక్ సరిహద్దులో నియంత్రణ రేఖ వద్ద పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత భూభాగం వైపుగా తవ్విన ఓ సొరంగాన్ని సైన్యం శుక్రవారం కనుగొంది. జమ్మూలోని పల్లన్వాలా సెక్టార్లో చక్లా పోస్టు వద్ద తవ్విన ఈ సొరంగం రెండున్నర అడుగుల వెడల్పు, మూడున్నర అడుగుల ఎత్తు, 50 మీటర్ల పొడవు ఉన్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. రోజువారీ విధుల్లో భాగంగా గస్తీ తిరుగుతున్న భద్రతా బలగాలు ఈ సొరంగాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదుల చొరబాట్ల కోసమే ఈ సొరంగం తవ్వి ఉంటారని, అయితే భారత్ వైపు సొరంగం పూర్తి కాలేదు కాబట్టి.. ఇంతవరకూ దీనిద్వారా ఎలాంటి చొరబాట్లు జరగలేదన్నారు. కాగా, జూలై 22న ఉగ్రవాదుల చొరబాటును సైన్యం అడ్డుకున్న సందర్భంగా ఓ ఉగ్రవాదితో పాటు జవానూ చనిపోయారు. ప్రస్తుత సొరంగం ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉంది. 2008లో కూడా ఇదే ప్రాంతంలో ఓ సొరంగాన్ని సైన్యం కనుగొంది. -
పాక్ సరిహద్దులో సైన్యంతో సురేష్ రైనా!
శ్రీనగర్: పొరుగు దేశ సైన్యం దాడులను తిప్పుకొడుతూ.. దేశానికి రక్షణగా నిలిచిన సైనికుల్లో మనోధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు జమ్మూ,కాశ్మీర్ లోని సైనిక శిబిరాలను ఆదివారం భారత క్రికెటర్ సురేశ్ రైనా సందర్శించారు. కాశ్మీర్ లోని ఎల్ ఓసీ (నియంత్రణ రేఖ) సమీపంలోని ఫార్వర్డ్ పోస్ట్ ను సురేష్ రైనా సందర్శించారు. కాశ్మీర్ సరిహద్దులోని అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో నియమించిన సైనికుల్లో మానసిక ధైర్యాన్ని రైనా నింపారని కల్నల్ ఎన్ఎన్ జోషి మీడియాకు తెలిపారు. నియంత్రణారేఖ వద్ద సైనికులు ఎదుర్కొంటున్న సవాళ్లను రైనా అడిగి తెలుసుకున్నారు. ఎల్ ఓసి వద్ద భారత సైనికులు చేస్తున్న సేవను రైనా కొనియాడారు. సైనికులతో తన వ్యక్తిగత అనుభవాల్ని, ఆనందకరమైన అనుభవాలను సైనికులతో పంచుకోవడమే కాకుండా వారితో భోజనం కూడా చేశారు. కాశ్మీరి పండితుల కుటుంబానికి చెందిన రైనా కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా నివాసి. దేశీయ క్రికెట్ లో రంజీ ట్రోఫి పోటీలలో రైనా జమ్మూ, కాశ్మీర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. -
మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ పూంఛ్ జిల్లాలోని బింబర్ గాలి సబ్ - సెక్టార్పైకి పాక్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. దాంతో భారత్ జవాన్లు అప్రమత్తమైయ్యారు. పాక్ సైన్యం కాల్పులను భారత్ జవాన్లు తిప్పికోట్టారు. ఈ ఘటన గత రాత్రి చోటు చేసుకుందని డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ మెహతా తెలిపారు. పాక్ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఆస్తి నష్టం కానీ వాటిల్లలేదని చెప్పారు. పాక్ ప్రభుత్వం బీఎస్ఎఫ్ జవాన్ సత్యశీల్ యాదవ్ను భారత్కు అప్పగించిన కొన్ని గంటల్లోనే ఈ కాల్సులు చోటు చేసుకున్నాయని మెహతా వెల్లడించారు. ఇటీవల బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న నావ చీనబ్ నదిలో తిరగబడింది. ఆ ఘటనలో సత్యశీల్ అనే జవాన్ ఆ నదిలో కొట్టుకుని పోయాడు. ఆ క్రమంలో సియాల్ కోట్ వద్ద అతడ్ని పాక్ బలగాలు పట్టుకున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి సత్యశీల్ను భారత్ అప్పగించాలని పాక్కు కోరింది. దాంతో సత్యశీల్ను శుక్రవారం భారత్కు అప్పగించారు. సత్యశీల్ను భారత్కు అప్పగించి కొన్ని గంటల వ్యవధిలోనే పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం గమనార్హం. -
భారత జలాల్లో చొరబాటుకు చైనా యత్నాలు!
గట్టిగా తిప్పికొట్టిన భారత బలగాలు న్యూఢిల్లీ: చైనా సైనికులు మరోసారి నియంత్రణ రేఖను దాటేందుకు ప్రయత్నించారు. జమ్మూ కాశ్మీర్లోని తూర్పు లడఖ్ ప్రాంతంలో పాన్గాంగ్ సరస్సులో నియంత్రణ రేఖ దాటి భారత్వైపు వచ్చేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులు ప్రయత్నించగా... మనదేశ సైనికులు గట్టిగా తిప్పికొట్టారు. ఇది శుక్రవారం జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఆర్మీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈ నెల 27న పాన్గాంగ్ సరస్సులో నియంత్రణ రేఖగా భావించే ప్రాంతం దాటి చైనా సైనికులు పడవల్లో భారత్వైపునకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఇరు దేశాల సైనికులు పోటాపోటీగా తమ జాతీయ పతాకాలను ప్రదర్శించారు. ఇరువురు తమ ప్రాంతంగా సందేశమిచ్చుకున్నారు. ఈ సరస్సు మొత్తం విస్తీర్ణంలో 45 కిలోమీటర్లు భారత్లో, 90 కిలోమీటర్ల మేర చైనాలో ఉంటుంది. చైనా గస్తీ సైనికులు తరచూ నియంత్రణ రేఖను దాటే ప్రయత్నం చేస్తుండగా... మన దేశ సైనికులు అత్యాధునిక పడవల సాయంతో వారి యత్నాలను భగ్నం చేస్తూ వస్తున్నారని తెలుస్తోంది. -
మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన:భారత జవాన్ మృతి
జమ్మూకాశ్మీర్: భారత్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన పిదప పొరుగుదేశం పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రరణ రేఖ(ఎల్ఓసీ) వద్ద పాక్ భద్రతా దళాలు సోమవారం తెల్లవారుజాము ప్రాంతంలో కాల్పులు జరిపాయి. పాక్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో భారత్ సరిహద్దులోకి చేరుకుని కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భారత్ కూడా ఎదురుదాడి దిగింది. ఈ ఘటనలో ఒక భారత్ జవాన్ తో పాటు, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలైయ్యాయి. 2003లో భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా చేసుకున్న కాల్పుల ఒప్పందాన్ని ఈ ఏడాది మొదటి నుంచి పాక్ తరచుగా ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల సరిహద్దుల వెంబడి కాల్పులు జరగకుండా ఉండేందుకు కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
జమ్మూ సరిహద్దులో పాక్ కాల్పులు
జమ్మూ-పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ మరో సారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఉదయం 9.15 గంటల ప్రాంతంలో పాక్ సేనలు పూంఛ్ సెక్టర్ లోని షాహ్ పూర్ వద్ద మోహరించిన ఉన్న భారత సైనికులపై కాల్పులు జరిపాయి. దీనికి భారత జవాన్లు దీటైన జవాబిచ్చారు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులను భారత్ లోకి జొప్పించేందుకు, జవాన్ల దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ ఈ కాల్పులకు పాల్పడిందని భద్రతాధికారులు చెబుతున్నారు. -
జమ్మూ కాశ్మీర్లో చోరబాట్లపై కేంద్రం ఆందోళన
జమ్మూ కాశ్మీర్లో అక్రమంగా ప్రవేశిస్తున్న చోరబాటుదారులు సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరగడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది చోరబాట్ల సంఖ్య అంత లేవు, కానీ ఈ ఏడాది ఆ సంఖ్య అధికం కావడం పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తీవ్ర కలత చెందుతున్నట్లు వెల్లడించారు. భారత్, పాక్ దేశాల సరిహద్దు ప్రాంతమైన నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)లో షిండే మంగళవారం పర్యటించారు. ఈ సందర్బంగా సాంబ సెక్టర్లోని భద్రత దళాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... చోరబాట్ల సంఖ్య అధికమవడానికి గల కారణాలపై తమ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2003లో భారత్ - పాక్ దేశాల మధ్య చేసుకున్న కాల్పుల ఉల్లంఘన ఒప్పందాన్ని పాక్ తరుచుగా ఉల్లంఘిస్తుంది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 136 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. దాంతో ఆ అంశంలో జోక్యం చేసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీంతో షిండే మంగళవారం భారత్, పాక్ సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు. అలాగే సరిహద్దుల్లోని పహారా కాస్తున్న సెంట్రల్ ఆర్మడ్ పోలీసు ఫోర్స్ (సీఏపీఎఫ్) సిబ్బందికి మాజీ సైనికుల హోదా కల్పించేందుకు కృషి చేస్తానని షిండే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రధానితో సమావేశమై ఈ అంశంపై చర్చిస్తానని సీఏపీఎఫ్ సిబ్బందికి భరోసా ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల నాటికి ఆ విషయం బిల్లుగా రూపాంతరం చెందుతుందని షిండే ఆశాభావం వ్యక్తం చేశారు. -
పాక్ మరోసారి కాల్పుల ఉల్లంఘన
భారత్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాకిస్థాన్ దళాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతుందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ ఆర్. కే. పాల్టా మంగళవారం ఇక్కడ వెల్లడించారు. నిన్న సాయంత్రం బాగా పొద్దుపోయిన తరువాత ఎల్ఓసీ సమీపంలోని పూంచ్ జిల్లాలోని మెందార్ సెక్టర్పై పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. దాంతో భారత దళాలు అప్రమత్తమైనాయి. ఎదురు దాడికి దిగాయా. దాంతో ఇరువైపులా 10 నిముషాల పాటు కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాక్ కాల్పుల వల్ల భారత్ భద్రత దళాలకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. 2003లో భారత్, పాక్ దేశాలు ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఇటీవల కాలంలో తరుచుగా పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. -
ఎల్ఓసీ వద్ద మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన
అమెరికా పర్యటనలో భాగంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో భేటీ అయి తిరిగి స్వదేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్ చేరుకునే లోపు పొరుగుదేశం కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని మెందర్ సెక్టర్లో సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాక్ భద్రతా దళాలు కాల్పులు నిన్న మధ్నాహ్యం జరిపాయని రక్షణ శాఖ ప్రతినిధి కెప్టెన్ ఎస్.ఎన్. ఆచార్య బుధవారం వెల్లడించారు. పాక్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో భారత్ సరిహద్దు వెంబడి కాల్పులు జరిపాయని వివరించారు. అందుకు ప్రతిగా భారత్ కూడా ఎదురు దాడికి దిగిందని చెప్పారు. అయితే ఆ ఘటనలో ఇరువైపులా ఎటువంటి గాయాలు కానీ, ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. 2003లో భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా చేసుకున్న కాల్పుల ఒప్పందాన్ని ఈ ఏడాది మొదటి నుంచి పాక్ తరచుగా ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల సరిహద్దుల వెంబడి కాల్పులు జరగకుండా ఉండేందుకు మరింత శ్రద్ధ వహిస్తామని యూఎస్ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ప్రధానులు అంగీకరించారు. అయినా పాక్ కాల్పులకు తెగబడటం గమనార్హం.