గుజరాత్లో వింత సంఘటన జరిగింది. ముగ్గురి హత్య కేసులో పోలీసులు 18 మగ సింహాలను అరెస్టుచేసి, తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ 18 మంది 'నిందితుల' కాలి ముద్రలను తీసుకుని, వాటి ముఖాలను కూడా పరీక్షించి.. అప్పుడు నిజంగానే ఈ సింహాలు ఆ హత్యలు చేశాయో లేదో నిర్ధారించుకుంటారు. ఒకవేళ అవే నిందితులని తెలిస్తే.. వాటికి 'జీవితఖైదు' కూడా విధించే అవకాశం ఉందట. అంటే, దోషిగా తేలిన మగ సింహాన్ని శాశ్వతంగా జూకు పంపేస్తారన్నమాట. మిగిలిన ఏషియాటిక్ సింహాలను అడవుల్లోకి వదిలేస్తారు.
అసలైన దోషి ఏ సింహమో కూడా తమకు తెలిసిందని, అయితే మిగిలిన సింహాల విషయం కూడా తెలిసిన తర్వాతే దాన్ని జూకు తరలిస్తామని అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు. అధికారులు ప్రస్తుతం ఆ సింహాలన్నింటి ప్రవర్తనను కూడా పరిశీలిస్తున్నారని, సాధారణంగా మ్యాన్ ఈటర్లుగా మారినవి మనుషులను చూస్తే వెంటనే రెచ్చిపోతాయని వన్యప్రాణి నిపుణురాలు రుచి దవె తెలిపారు. అటవీ ప్రాంతం బాగా తగ్గిపోవడంతో ఇటీవలి కాలంలో సింహాలు, పులులు, చిరుతపులులు జనావాసాలలోకి వస్తున్నాయి. దాంతో మనుషుల మీద దాడులు కూడా పెరిగిపోతున్నాయి.
ముగ్గురి హత్యకేసులో 18 సింహాల 'అరెస్టు'
Published Wed, Jun 15 2016 2:26 PM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM
Advertisement
Advertisement