
పెద్దమనసు చాటుకున్నఅమితాబ్
సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే బిగ్ బీ అమితాబ్ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తన కుటుంబానికి లభించే పెన్షన్ను వదులుకున్నాడు. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి ఖర్చు చేసే కార్యక్రమానికి బదిలీ చేయాల్సిందిగా యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం ప్రకారం.. ప్రతిష్ఠాత్మకమైన యశ్ భారతి సమ్మాన్ అవార్డు పొందిన వారికి నెలకు 50 వేల రూపాయల పెన్షన్ను జీవిత కాలం అందించనుంది. ఈ పథకం కింద అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ ఒక్కొక్కరు నెలకి 50,000 రూపాయల పెన్షన్ను పొందడానికి అర్హులయ్యారు. అయితే ఈ డబ్బును పేదలకోసం ఖర్చు చేయాల్సిందిగా తను, తన కుటుంబ సభ్యులు కోరుకుంటున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు లేఖ రాయనున్నట్లు అమితాబ్ వెల్లడించారు.