
గాంధీనగర్ : ఏసీ ఇప్పటికీ చాలామందికి ఖరీదైన వ్యవహారమే. అయితే ఇకపై ఏసీల కోసం అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదంటున్నారు మనోజ్ పటేల్. గుజరాత్లోని వడోదరలో తన పేరుతోనే ఓ డిజైన్ స్టూడియో నిర్వహిస్తున్న ఈ వ్యక్తి.. రూ.800తోనే ఏసీ తయారు చేశారు. ఒక్కసారి మట్టికుండలోని నీటి చల్లదనాన్ని గుర్తు చేసుకోండి. మట్టిలోని అతిసూక్ష్మ రంధ్రాల గుండా వెళ్లే నీరు ఆవిరి కావడం చల్లదనానికి కారణమని తెలిసిన విషయమే. సరిగ్గా ఇదే ఆలోచనతోనే మనోజ్ పటేల్ చిన్నసైజు ఏసీ తయారు చేశారు. కాకపోతే ఇందులో మట్టికి బదులుగా పింగాణీ ఉపయోగిస్తారు. ప్రస్తుతం మనోజ్ పటేల్ మూడు మోడళ్ల ఏసీని తయారు చేశారు. ఒకదాంట్లో పైన ట్యాంకులోని నీటి మోతాదును చెప్పేందుకు ఓ సూచికతో పాటు ఓ మొక్క పెంచేందుకు ఏర్పాట్లు ఉంటాయి.
ఆఫీసులు, ఇళ్లల్లో వాడుకోగల వ్యక్తిగత ఏసీ మూడోది. గది ఉష్ణోగ్రతలను 32 డిగ్రీల నుంచి 23 డిగ్రీల స్థాయికి తీసుకు రాగల ఈ ఏసీలకు విద్యుత్ అవసరమే ఉండదు. వ్యక్తిగత పింగాణీ ఏసీలో మాత్రం ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. పైగా ట్యాంకును ఒకసారి నింపితే 10–12 రోజుల వరకు ఆ నీటినే వాడుకోవచ్చు. పింగాణీ, రాళ్లు, మట్టి మాత్రమే వాడటం వల్ల ఖర్చు తక్కువగా ఉంటుందంటున్నారు మనోజ్.
Comments
Please login to add a commentAdd a comment