మళ్లీ విచారణ జరపండి | Fadnavis to Face Trial For Suppressing Pendency Of Criminal Cases in Poll Affidavit | Sakshi
Sakshi News home page

మళ్లీ విచారణ జరపండి

Published Wed, Oct 2 2019 2:59 AM | Last Updated on Wed, Oct 2 2019 2:59 AM

Fadnavis to Face Trial For Suppressing Pendency Of Criminal Cases in Poll Affidavit - Sakshi

న్యూఢిల్లీ/ముంబై: ఎన్నికల ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు మంగళవారం సుప్రీంకోర్టు షాకిచి్చంది. 2014 ఎన్నికల సమయంలో ఫడ్నవిస్‌ ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చారని ఆరోపిస్తూ దాఖలైన ఒక పిటిషన్‌ను మళ్లీ మొదటినుంచి విచారించాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించింది. ఆ ఎన్నికల్లో తనపై పెండింగ్‌లో ఉన్న రెండు క్రిమినల్‌ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో ఫడ్నవిస్‌ పేర్కొనలేదని పిటిషన్‌దారు ఆరోపించారు. ఆ ఆరోపణలను ట్రయల్‌ కోర్టు కొట్టేయగా, ట్రయల్‌ కోర్టు తీర్పును బొంబాయి హైకోర్టు సమర్థించింది. అయితే, సుప్రీంకోర్టు ఇచి్చన తాజా ఆదేశాలు ఈ నెల 21న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫడ్నవిస్‌ పోటీ చేయడానికి ఎలాంటి అడ్డు కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

సుప్రీంకోర్టు తాజా ఆదేశాలపై విపక్ష కాంగ్రెస్‌ స్పందించింది. తక్షణమే ఫడ్నవిస్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు, ఫడ్నవిస్‌కు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నేత, కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అఠవలే మద్దతు పలికారు. ఎన్నికల సంఘానికి తనపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలు ఇవ్వకుండా తప్పుడు అఫిడవిట్‌ ఇవ్వడంపై.. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫడ్నవిస్‌పై ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 125 ఏ కింద క్రిమినల్‌ కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ నాగపూర్‌లోని మెజిస్టీరియల్‌ కోర్టును సతిశ్‌ ఉకే అనే లాయర్‌ ఆశ్రయించారు. కోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టేయడంతో సెషన్స్‌ కోర్టుకెళ్లారు. ఈ పిటిషన్‌ను మళ్లీ విచారించాల్సిందిగా మెజిస్టీరియల్‌ కోర్టును ఆదేశిస్తూ సెషన్స్‌ కోర్టు తీర్పునిచి్చంది.

సెషన్స్‌ కోర్టు తీర్పుపై ఫడ్నవిస్‌ హైకోర్టుకు వెళ్లారు. సెషన్స్‌ కోర్టు తీర్పును పక్కనపెడుతూ హైకోర్టు 2018న తీర్పునిచ్చింది. దీనిపై సతీశ్‌ ఉకే సుప్రీంను ఆశ్రయించారు. తనపై ఉన్న క్రిమినల్‌ కేసుల విషయం తెలిసీ.. ఫడ్నవిస్‌ వాటిని అఫిడవిట్లో పొందుపర్చ లేదన్నారు. తర్వాత హైకోర్టు ఇచి్చన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేసును మళ్లీ విచారణ జరపాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించింది. నామినేషన్‌ సమయంలో తనపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలు తెలపకుండా అభ్యర్థి అఫిడవిట్‌ దాఖలు చేస్తే 6 నెలల జైలు శిక్ష, జరిమానా విధించే ప్రతిపాదన ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 125ఏ లో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement