
శ్రీనగర్: సరిహద్దు తుపాకుల మోతతో మరోసారి దద్దరిల్లిపోయింది. మంగళవారం ఉదయం ఉత్తర కశ్మీర్ జిల్లా గుర్జ్ లోయలోని నానే సెక్టార్ వద్ద చొరబాటుదారులను భారత సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలో భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదుల దాడిలో ఓ ఆర్మీ మేజర్, ముగ్గురు సైనికులు వీర మరణం పొందారు. మృతి చెందిన ఆర్మీ మేజర్ను కేపీ రాణేగా అధికారులు గుర్తించారు. సైనికులను హవాల్దార్స్ జెమై సింగ్, విక్రమ్జీత్, రైఫిల్మన్ మణిదీప్గా పేర్కొన్నారు.
సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మట్టికరిచినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు రెండు మృతదేహాలనే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 మంది మిలిటెంట్లు చొరబాటుకు యత్నించినట్లు తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం ప్రకటించింది. మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇదిలా ఉంటే సరిహద్దులో చొరబాట్లను ఊపేక్షించబోమని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రెండు రోజులకే ఈ కాల్పుల ఘటన చేసుకోవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment