
మైసూరులో టెన్షన్
శ్రీరామ సేన కార్యకర్త రాజు(39) హత్యతో మైసూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మైసూరు: శ్రీరామ సేన కార్యకర్త రాజు(39) హత్యతో మైసూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్ఎస్ఎస్ రాజుగా సుపరిచితుడైన అతడిని ఆదివారం ఉదయగిరి సిగ్నల్ దగ్గర గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. రోడ్డు పక్కన హోటల్ లో టీ తాగుతుండగా నలుగురు దుండగులు మారణాయుధాలతో దాడిచేశారు. ఆస్పత్రికి తరలించేసరికి అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బీజేపీ, హిందూ సంస్థలు సోమవారం మైసూరు బంద్ కు పిలుపునిచ్చాయి.
బంద్ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఆర్ఎస్ఎస్ రాజు హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు పహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలం సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీని పరిశీలిస్తున్నారు.