
'జూన్ 18న అపూర్వఘట్టం రానుంది'
భారత నారీమణులు మరో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇప్పటి వరకు అన్ని రంగాల్లో రాణిస్తున్నవారు ఇకపై భారత వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్ పైలెట్లుగా అడుగుపెట్టనున్నారు.
న్యూఢిల్లీ: భారత నారీమణులు మరో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇప్పటి వరకు అన్ని రంగాల్లో రాణిస్తున్నవారు ఇకపై భారత వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్ పైలెట్లుగా అడుగుపెట్టనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఎయిర్ చీఫ్ మార్షల్ అరుప్ రహా మంగళవారం ఈ విషయం స్పష్టం చేశారు.
'ప్రస్తుతం ముగ్గురు మహిళలు స్వచ్ఛందంగా ఫైటర్ జెట్లలో పైలెట్లుగా పనిచేసేందుకు ముందుకొచ్చారు. వారు ఇప్పుడు రెండో దశ శిక్షణలో ఉన్నారు. ఆ శిక్షణను కూడా పూర్తి చేస్తే జూన్ 18న పురుష పైలెట్లతో కలిసి పరేడ్కు వస్తారు. ఈ అద్బుతాన్ని ఆవిష్కరించేందుకు అనుమతిచ్చిన కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను' అని ఆయన అన్నారు. దీంతో ఈ ఏడాది జూన్ 18 నుంచి భారత వైమానిక దళంలోకి తొలి మహిళా పైలెట్లు అడుగుపెట్టనున్నారు.