
భారతీయ యువత ఇంతకు ముందు ఏ తరమూ లోను కానంతటి ఒత్తిళ్లకు లోనవుతోంది. మానసిక అనారోగ్యం బారిన పడే యువత సంఖ్య అంతకంతకూ హెచ్చుతోంది. వారి సమస్యల గురించి చర్చించే / మద్దతుగా నిలిచే వాతావరణం కరువవుతోంది. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆత్మహత్యలకు కారణమవుతోంది.
భారతీయ విశ్వవిద్యాలయాలపై 2016పై జరిగిన సర్వే ప్రకారం – 37.7 శాతం మంది విద్యార్థులు ఒక మోస్తరు డిప్రెషన్తో బాధపడుతున్నారు. 13.1 శాతం మంది ఈ సమస్యతో తీవ్రంగా ; 2.4 శాతం మంది మరింత తీవ్రంగా సతమతమవుతున్నారు. యువకుల కంటే యువతుల్లో డిప్రెషన్ బాధితులు ఎక్కువగా వున్నారు. కుటుంబంలో కొంత సంతోషకర వాతావరణం వున్న చోట డిప్రెషన్ ఛాయలు చాలా తక్కువగా వున్నాయి. పరీక్షల్లో తప్పడం, పాఠాలను అవగాహన చేసుకోలేకపోవడం విద్యార్థుల డిప్రెషన్కు, ఆత్మహత్యలకు ప్రధాన కారణమవుతున్నాయని ఈ అధ్యయనంలో భాగమైన ఎన్ఫోల్డ్ ఇండియా కో – ఫౌండర్ షైబ్యా సల్దనా చెప్పారు. వీరి బలవన్మరణాల వెనుక నిస్సహాయత, విపరీతమైన నైరాశ్యం వున్నాయని ఆమె వివరించారు. విజయానికి నిర్ణీత కొలమానాలను ఏర్పరచడం, సామాజికంగా వేరుపడిపోవడం, విభిన్న సంస్కృతుల తాలూకూ వైవిధ్యాన్ని అంగీకరించకపోవడం, పట్టణీకరణ అంతకంతకూ పెరిగిపోవడం వంటి అంశాలు కుంగుబాటుకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయంటున్నారు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అచల్ భగత్.
గంటకొక విద్యార్ధి..
మానసిక వైద్య నిపుణులు, కౌన్సిలర్లు అందిస్తున్న వివరాల ప్రకారం – సమాజంలో అంతకంతకూ పెరుగుతున్న పోటీతత్వం, స్నేహపూర్వకంగా లేని కుటుంబ వాతావరణం.. మానసిక ఒత్తిడికి, దానితో ముడివడిన అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. పరీక్షల విషయంలో విపరీతమైన ఒత్తిడికి గురవుతుండటం, ఉద్యోగం పొందలేకపోవడం, తమ ఆకాంక్షలకు అనుగుణంగా జీవితాన్ని మలచుకోలేకపోవడం వంటి అంశాలు డిప్రెషన్కు.. ఒక్కోసారి ఆత్మహత్యలకు దారులేస్తున్నాయి. అటు కుటుంబాల నుంచి గానీ, ఇటు విద్యా సంస్థల నుంచి గానీ తగిన మద్దతు లభించకపోవడం, కౌన్సిలింగ్ ఇచ్చే వాతావరణం కరువవడం వల్ల యువతలో ఆత్మహత్యల రేటు పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.
చదువు తాలూకూ ఒత్తిళ్లతో దేశంలో ప్రతి గంటకూ ఒక విద్యార్ధి మరణిస్తున్నట్టు 2015 ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి. 2011 – 15 మధ్య.. 40,000 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వేలాది ఆత్మహత్య కేసులు రికార్డులకు ఎక్కడం లేదు. 2014లో సిక్కింలో నమోదైన ఆత్మహత్యల్లో 27 శాతం ఉపాధి రాహిత్యంతో ముడివడినవేననీ ఒక అధ్యయనం చెబుతోంది. అధిక నిరుద్యోగిత రేటు వున్న సిక్కిం.. తలసరి ఆదాయపరంగా ధనిక రాష్ట్రం. మధ్య ప్రదేశ్లో ఉద్యోగం లేకపోవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడిన వారి శాతం దశాబ్ద కాలం (2005 –15)లో 2000 శాతం పెరిగినట్టు ఎన్సీఆర్బీ లెక్కలు చెబుతున్నాయి. ఉపాధి లేమి తాలూకూ కుంగుబాటు యువత జీవితాలను మింగేస్తుందనడానికి ఇవి బలమైన ఉదాహరణలు.
ఏం చేయాలి?
- నిపుణుల ప్రకారం – డిప్రెషన్ సహా మానసిక ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమైనవిగా భావించగల అనుకూల వాతావరణం చాలా చాలా ముఖ్యం.
- పాఠశాలలు, కాలేజీల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలి. మానసిక ఆరోగ్యం, వెల్నెస్ అంశాల్ని పాఠ్య ప్రణాళికల్లో చేర్పాలి. ఇలా చేసినట్టయితే, సమస్య తలెత్తినప్పుడు విద్యార్థులు సంశయాలను లోను కాకుండా సాయం తీసుకోగలిగే పరిస్థితి వుంటుంది.
- తల్లిదండ్రుల పెంపకంలో మార్పు రావాలి. కుటుంబం అండగా వున్న చోట్ల – పిల్లలు మానసిక సంక్షోభాల నుంచి బయటపడగలుగుతారు.
- పాఠశాలలు, కళాశాలల్లో లైంగికత – జీవన నైపుణ్యాల తాలూకూ విజ్ఞానాన్ని అందించాలి.
- ఉన్నత విద్యా సంస్థల్లో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, సుశిక్షతులైన సైకాలజిస్టులు, కౌన్సిలర్లను నియమించడం, బాధిత విద్యార్థులకు తగిన సాయమందించడం వల్ల – తర్వాత కాలంలో వారు డిప్రెషన్, ఆత్మహత్యల బారిన పడకుండా నివారించవచ్చు.
- బడ్జెట్లో మానసిక ఆరోగ్య అవసరాలకు వెచ్చించే మొత్తాన్ని పెంచాలి.
ఒత్తిడి గుప్పెట్లో..
దీర్ఘ కాలిక మానసిక ఒత్తిడి డిప్రెషన్, గుండెపోటు సహా అనేక శారీరక అనారోగ్యాలకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతటి ప్రమాదకరమైన ఒత్తిడి నుంచి బయటపడటం తమకు సాధ్యం కావడం లేదని సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇటీవల జరిపిన సర్వేలో పాల్గొన్న 95 శాతం భారతీయ యువతీయువకులు చెప్పారు. భారత్, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, బ్రెజిల్, ఇండోనేసియా సహా 23 దేశాలపై జరిగిన ఈ సర్వే ప్రకారం – మన దేశ యువతీ యువకుల్లో (18 – 34 ఏళ్ల వయోశ్రేణి) 95 శాతం మంది ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. 50 శాతం మంది స్నేహితులతో తగినంత సేపు గడపలేకపోతున్నారు. తమ అభిరుచులకు సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. సర్వే ప్రకారం – దాదాపు 75 శాతం మంది తమ సమస్యను డాక్టర్తో చెప్పుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. వైద్య సాయం తీసుకునేందుకు ఆర్థిక పరిస్థితులు పెద్ద అడ్డంకిగా వున్నాయి. ‘పని – పైసలు’ .. ఈ రెండు అంశాలే వారి ఒత్తిడికి ప్రధాన కారణాలవుతున్నాయి. 50 శాతం మంది ఉద్యోగులు పని ప్రదేశాల్లో జరుగుతున్న వెల్నెస్ ప్రోగ్రాముల్లో పాల్గొంటున్నట్టు సర్వే స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment