youth
-
యవ్వనోత్సవం
జీవితంలో బాల్యం ఆటపాటల్లో శరవేగంగా గడచిపోతుంది. శరీరంలో శక్తులన్నీ ఉడిగిపోయినప్పుడు మీదపడే వార్ధక్యం కుంటినడకన సాగుతుంది. బాల్యంలో ఊహ తెలిసే దశకు వచ్చినప్పుడు త్వరగా యువకులుగా మారిపోవాలని కోరుకోవడం సహజం. నడివయసు కూడలికి వచ్చే సరికి యవ్వనం కొద్దిరోజుల్లోనే కరిగిపోతుందనే బెంగ మనసును పీడించడం కూడా అంతే సహజం. జీవితంలోని బాల్య వార్ధక్యాల మధ్య వచ్చే యవ్వనం ఒక కీలక దశ. అంతేకాదు, ఉత్పాదక దశ కూడా! బాల్య వార్ధక్య దశల్లో జీవనభారాన్ని మోసే శక్తి ఉండదు. ఒంట్లోని జవసత్త్వాలు ఉండే యవ్వనంలోనే జీవితాన్ని ఎంతోకొంత తీర్చిదిద్దుకోవడానికి కుదురుతుంది. జీవితంలో అందుబాటులో ఉన్న స్వేచ్ఛా సౌఖ్యాలను తనివితీరా అనుభవించడానికి వీలవుతుంది.యవ్వనాన్ని సార్థకం చేసుకోగలిగిన మనుషులు లోకంలో తక్కువగానే ఉంటారు. చాలామంది యవ్వనాన్ని నిరర్థకంగా గడిపేసి, వార్ధక్యంలో గడచిపోయిన రోజులను తలచుకుంటూ వగచి వలపోస్తారు. ‘లడక్పన్ ఖేల్ మే ఖోయా/ జవానీ నీంద్భర్ సోయా/ బుఢాపా దేఖ్కర్ రోయా’ అన్నాడు హిందీ సినీకవి శైలేంద్ర. బాల్యాన్ని ఆటపాటల్లో పోగొట్టుకుని, యవ్వనాన్ని ఒళ్లెరుగని నిద్రలో పోగొట్టుకుని, వార్ధక్యంలో వాటిని తలచుకుని రోదించే మనుషుల తీరును ఆయన మూడు ముక్కల్లో తేల్చేశాడు. ఇదే విషయాన్ని శంకరాచార్యుడు ‘బాల స్తావ త్క్రీడాసక్తః తరుణ స్తావ త్తరుణీసక్తః/ వృద్ధ స్తావ చ్చింతాసక్తః పరమే బ్రహ్మణి కో2పి న సక్తః’ అని ఏనాడో చెప్పాడు.బాల్య వార్ధక్యాలను ఎక్కువ కాలం కొనసాగించాలని ఎవరూ కోరుకోరు గాని, యవ్వనాన్ని వీలైనంతగా పొడిగించుకోవాలని, కుదిరితే గిదిరితే జీవితాంతం నిత్యయవ్వనులుగా కొనసాగాలని కోరుకోనివారు ఉండరు. నిత్యయవ్వనం మానవమాత్రులకు అసాధ్యమని అందరికీ తెలుసు. ఇది తీరే కోరిక కాదని తెలిసినా, కోరుకుంటారు. తీరని కోరికలను కూడా కోరుకోవడమే కదా మానవ స్వభావం. శుక్రాచార్యుడి శాపం వల్ల ముదిమి పొందిన యయాతి తన కొడుకు పురుడి ద్వారా పునఃయవ్వనం పొందాడు. సుకన్యను చేపట్టిన చ్యవనుడు అశ్వనీ దేవతల అనుగ్రహంతో పునఃయవ్వనం పొందాడు. జరా మరణాలను జయించి అమరులు కావడానికి దేవతలు అమృతం తాగారు. అమృతం కోసం దానవులతో కలసి క్షీరసాగర మథనం చేశారు. అమృతం దానవులకు దక్కకుండా ఉండటానికి శ్రీమహావిష్ణువు జగన్మోహిని అవతారం దాల్చి, దేవతలకు అమృతం పంచిపెట్టాడు. మన పురాణాల్లో ఉన్న ఈ గాథలు అందరికీ తెలిసినవే! ఇలాంటి గాథలు ప్రాచీన గ్రీకు పురాణాల్లోనూ ఉన్నాయి. గ్రీకుల యవ్వన దేవత హీబీ దేవతలకు ‘ఆంబ్రోజా’ అనే దివ్య ఫలహారాన్ని, ‘నెక్టర్’ అనే అమృతం వంటి పానీయాన్ని పంచిపెట్టిందట! ‘ఆంబ్రోజా’, ‘నెక్టర్’ల మహిమ వల్లనే దేవతలు నిత్య యవ్వనులు కాగలిగారని గ్రీకు పురాణాల కథనం.‘జీవితం మధుశాల యవ్వనం రసలీల/ రేపటి మాటేల? నవ్వుకో ఈవేళ’ అన్నారు వీటూరి. ‘పాడు జీవితము యవ్వనము మూడునాళ్ల ముచ్చటలోయి/ అయ్యయ్యొ నీదు పరుగులెచ్చట కోయి’ అన్నారు ఆరుద్ర. జీవితం క్షణభంగురం అని వేదాంతులు చెబుతారు. కోరికలు దుఃఖ హేతువులని, వాటిని జయించాలని ప్రవచనాలు చెబుతారు. ఎవరు ఎన్ని చెప్పినా, జీవితాన్ని ఆస్వాదించడానికి యవ్వనం ముఖ్య సాధనమనే ఎరుక కలిగినవారే ఏ క్షణానికి ఆ క్షణమే యవ్వనోద్ధృతితో జీవితాన్ని నిండుగా ఆస్వాదిస్తారు. వెర్రి వేదాంతుల మాటలను తలకెక్కించుకునే అర్భకులు– క్షణభంగుర సిద్ధాంతం బుర్రలో బొంగరంలా గింగిరాలు తిరుగుతుంటే, యవ్వనాన్ని అనవసరంగా వృథా చేసుకుని, నిష్ప్రయోజకులుగా బతుకు చాలిస్తారు.పునఃయవ్వనం పొందినవాళ్లు మనకు పురాణాల్లోను, కాల్పనిక సాహిత్యంలోను తప్ప నిజజీవితంలో కనిపించరు. నిత్యయవ్వనం మానవాళి సామూహిక ఆకాంక్ష. దీనిని నెరవేర్చడానికే ఆధునిక వైద్య పరిశోధకులు కూడా శక్తివంచన లేకుండా పరిశోధనలు సాగిస్తున్నారు. వారి వైద్య పరిశోధనలు ఫలించినట్లయితే, పునఃయవ్వనం పొందడానికి జనాలు ఎగబడి మరీ పోటీలు పడతారు. పరిశోధనలు ప్రాథమిక దశలో ఉండగానే, కొందరు అపర కుబేరులు ఖర్చుకు వెనుకాడ కుండా తమ యవ్వనాన్ని పొడిగించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్న ఉదంతాలు అడపాదడపా కథనాలుగా వెలువడుతూనే ఉన్నాయి. యవ్వనం ఉడిగి వయసుమళ్లి వార్ధక్యం ముంచుకు రావడాన్ని సహజ పరిణామంగానే చాలా కాలంగా భావిస్తూ వస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు వార్ధక్యాన్ని వ్యాధిగా గుర్తించ లేదు గాని, వార్ధక్యం కూడా ఒక వ్యాధేనని కొందరు వైద్యపరిశోధకుల వాదన. వార్ధక్యాన్ని నివారించి, వయసును వెనక్కు మళ్లించే దిశగా వైద్య పరిశోధనలు ఇటీవలి కాలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. వయసును వెనక్కు మళ్లించడానికి అమృతం వంటిదేదీ అవసరం లేదని, అసలైన యవ్వన కీలకం మానవ దేహంలోనే ఉందని తాజాగా జపాన్లోని ఒసాకా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ శరీరంలో ఒత్తిడికి లోనయ్యే కణాలకు ‘ఏపీ2ఏ1’ అనే ప్రొటీన్ సరఫరాను నిలిపివేసినట్లయితే, శరీరంలోని ప్రతి కణం పునఃయవ్వనాన్ని పొందగలుగుతుందని చెబుతున్నారు. ‘ఏపీ2ఏ1’ ప్రొటీన్ను నియంత్రించడానికి చేపట్టే చికిత్స పద్ధతులే పునఃయవ్వన చికిత్స పద్ధతులు కాగలవని అంటున్నారు. వారి ప్రయోగాలే గనుక ఫలిస్తే, ముందుండేది ముసళ్ల పండుగ కాదు, మానవాళికి అది యవ్వనోత్సవమే అవుతుంది. -
West Bengal: హోలీ వేళ యువకుని హత్య
కోల్కతా: పశ్చిమబెంగాల్(West Bengal)లోని ఉత్తర 24 పరగణా జిల్లాలో హోలీ వేళ దారుణం చోటుచేసుకుంది. హోలీ ఆడుతున్న 20 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పండుగపూట అందరిలో విషాదాన్ని నింపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీటాగఢ్కు చెందిన ఆకాశ్ చౌదరి(20) ఉరఫ్ అమర్ తన ఇంటికి సమీపంలో స్నేహితులతో పాటు హోలీ(Holi) ఆడుతున్నాడు. ఇంతలో నలుగురు యువకులు అతని మెడ, శరీరంలోని ఇతర భాగాలపై కత్తితో దాడి చేశారు. వెంటనే స్థానికులు ఆకాశ్ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు అతనిని కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ(RG Kar Medical College)కి పంపించారు.అక్కడి వైద్యులు ఆకాశ్ అప్పటికే మృతి చెందాడని నిర్థారించారు. ఈ కేసులో పోలీసులు ఆకాశ్పై దాడికి పాల్పడిన పవన్ రాజ్భర్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఇతను గతంలో ఒక కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. ఆకాశ్పై దాడికి పాల్పడిన మరో ఇద్దరు పరారయ్యారు. ఆకాశ్ బంధువు ఒకరు మాట్లాడుతూ ఆకాశ్ కాలేజీలో చదువుకుంటున్నాడని, తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి పరిషత్ సభ్యునిగా ఉన్నాడని తెలిపారు. ఆకాశ్పై దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇది కూడా చదవండి: New Zealand: హోలీ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని -
భావోద్వేగాల డిజిటల్ బందిఖానా!
ఇటీవలి కాలంలో కౌమార దశ (టీనేజ్)లో ఉన్న పిల్లల ఆత్మహత్యలు పెరిగిపోతుండటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. 8, 9వ తరగతుల వరకు చదువే లోకంగా ఉన్న పిల్లలు... టెన్త్, ఇంటర్లలో చేరిన తర్వాత ఈ స్వీయ హన నానికి పాల్పడుతుండటాన్ని తేలికగా తీసుకోరాదు. సెలవులు, వారాంతాల్లో సోషల్ మీడియాలో గంటల తరబడి రీల్స్ చూస్తూ గడిపిన నవ యువత మళ్లీ స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని వారి మనస్తత్వాన్ని లోతుగా పరిశీలించినవారి మాట. చదువుల ఒత్తిడి కొత్తదేమీ కాకున్నా... ‘రీల్స్’ భూతం వారి మెదడుపై దుష్ప్రభావాలను చూపు తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాలు వెల్లడి స్తున్నాయి. ఇంటి వద్ద రోజూ పదిగంటలకు పైగా స్క్రీన్ చూడటానికి బానిసలైన తర్వాత నియంత్రిత వ్యవస్థలో కళాశాల, పాఠశాల వాతావరణాలకు సర్దుకోలేక చిన్న మనసులు తీవ్ర క్షోభకు గురవుతున్నాయి. ఈ వయసు వారి మెదడు సహజంగా భావోద్వేగాలను నియంత్రించుకోగల శక్తి కలిగి ఉన్నా... స్మార్ట్ఫోన్ అధిక వాడకం ఈ సంతులనాన్ని దెబ్బ తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.కౌమార వయసులో మెదడు అభివృద్ధి చెందే దశలోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్లో రసాయన మార్పులు జరుగుతూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడం, ఉద్వేగాల నియంత్రణ ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ద్వారానే జరు గుతూ ఉంటాయి. ఇదే సమయంలో మన భావోద్వేగాల వ్యక్తీకరణకు ఉపకరించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది. మెదడు లోపలి ఈ వ్యవస్థలో అమిగ్దలా అనే భాగం... భయం, కోపం, ఆనందం వంటి అనుభూతులకు కారణమైతే; ఆకలి, దప్పిక, శరీర ఉష్ణోగ్రత, ఉద్వేగాలకు, స్పందన లకు హైపోథాలమస్ కారణం అవుతుంది. ఇవి మాత్రమే కాకుండా... లింబిక్ వ్యవస్థలో హిప్పోకాంపస్, థాలమస్, హైపోథాలమస్, సింగులేట్ గైరస్, బేసల్ గాంగ్లియా వంటి అనేక మెదడు భాగాలు ఉంటాయి. ఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ వ్యవస్థల మధ్య అసమతౌల్యం ఏర్పడినప్పుడు యువతీ యువకుల్లో భావోద్వేగాలస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. అదే సమయంలో మానసిక క్షోభను, కుంగుబాటును నియంత్రించుకోవడం అంతగా సాధ్యపడదు. అయితే సాధారణంగా ఈ లోటుపాట్లు ఉన్నా కౌమార వయస్కులు మానసిక క్షోభను సమర్థంగానే తట్టుకోగలరు. ప్రకృతిసిద్ధంగా ఉండే న్యూరో కెమికల్స్ వల్ల ఇది సాధ్య మవుతుంది. ఉల్లాసానికి కారణమయ్యే డోపమైన్ వంటి న్యూరో రసాయనాల కారణంగా వీరు ఆనందం, సంతృప్తిని వెతుక్కుంటూ ఉంటారు. అలాగే అభివృద్ధి చెందుతూ ఉండే హెచ్పీఏ (హైపోథాలమిక్–పిట్యూటరీ–ఎడ్రినల్యాక్సిస్) కూడా ఎక్కువ కాలం నిరాశ, నిçస్పృహలో ఉండకుండా చూస్తుంది.అంటే ఎంతో ప్రేమించే కుటుంబ సభ్యులు అకాల మరణం పాలైనా, తల్లితండ్రుల్లో ఎవరైనా రోజూ తీవ్రంగా హింసిస్తున్నా ఆ వయసు పిల్లల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనే రాదు. పిల్లల్లో సహజంగా ఉండే ఈ రక్షణ వ్యవస్థ సుదీర్ఘ స్మార్ట్ఫోన్ల వినియోగంతో ముక్కచెక్కలవుతుంది. ఫలితంగా ఆందోళన, మానసిక ఉద్వేగాలతో అస్థిరతలు ఏర్పడతాయి. మృత్యుకుహరం ఈ డిజిటల్ వలవిద్యార్థులు సెలవు రోజుల్లో రోజుకు పది గంటల కంటే ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లను వాడుతున్నట్లు అంచనా. సామాజిక మాధ్యమాలను వాడినంత సేపూ మెదడులో ఆనందం కలిగించే డోపమైన్ (హ్యాపీ హార్మోన్) అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది కాస్తా కంపల్సివ్ బిహేవియర్ (వద్దని అనుకున్నా కొన్ని పనులు పదే పదే చేయాలనుకోవడం)కు దారి తీస్తుంది. విద్యార్థులు సెలవులు ముగించుకుని కాలేజీలు, పాఠ శాలల్లో అడుగుపెట్టగానే డోపమైన్ ఉపసంహరణ కారణంగా అసహనం పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకే ఆగ్రహం, అకారణ దిగులు ఆవహిస్తాయి. ఈ స్థితిలో ఆత్మహత్య వైపు వారి ఆలోచన మళ్లుతుంది. కాపాడుకోవడం మన చేతుల్లోనే...తల్లితండ్రులు, చదువు చెప్పేవారు, విధాన రూపకర్తలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం సాధించడం కష్టమేమీ కాదు. డిజిటల్ టెక్నాలజీ వాడకానికి సంబంధించి విద్యార్థులకు కొన్ని హద్దులు నిర్ధారించాలి. ఒక క్రమ పద్ధతిలో వారి స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్ల వాడకాన్ని తగ్గించేలా ప్రోత్సహించాలి. అర్థవంతమైన కంటెంట్ను పరిచయం చేయాలి. సెలవుల తర్వాత స్కూళ్లు, కాలేజీలు తెరిచిన వెంటనే సీరియస్గా పాఠాల జోలికి పోకుండా మొదటి రెండు రోజులు ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించాలి. పిల్లలు ఒక రోజు ఆగి కాలేజీకి వెళ్తామంటే వారిని నిందించడం, బెదిరించడం చేయకుండా తల్లిదండ్రులు తమ కాఠిన్యాన్ని తగ్గించు కోవాలి. పాఠశాలల్లో పరిమిత స్థాయిలో డిజిటల్ టెక్నాలజీలను వాడేలా చేయడం ద్వారా వారు సామాజిక మాధ్యమాల వల నుంచి నెమ్మదిగా బయటపడే అవకాశం ఏర్పడుతుంది. విద్యా సంస్థల్లో కౌన్సెలింగ్ ఏర్పాట్లు ఉండాలి.ఆరోగ్యకరమైన హద్దులను నిర్ణయించడం, విద్యాపరంగా, సామాజికంగా అనుకూల వాతావరణాన్ని సృష్టించడం వంటి చర్యల ద్వారా కౌమార వయస్కులు... డిజిటల్ – వాస్తవ ప్రపంచాల మధ్య తేడా తెలుసుకుని సమతుల్యతను సాధించడానికి వీలు కలుగుతుంది. ఇది కేవలం తల్లితండ్రులు, విద్యావేత్తల బాధ్యత కాదు. సమాజం మొత్తానిది. అప్పుడు మాత్రమే యువత భావోద్వేగ సంక్షోభాన్ని నివారించగలం. యువతకు అందమైన భవిష్యత్తును కల్పించగలం!బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్మొబైల్: 90524 72424 -
కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు
జల్గావ్: తన కుమార్తెను వేధించారంటూ కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జల్గావ్ జిల్లా ముక్తాయ్నగర్లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను అక్కడ కొందరు యువకులు వేధించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి వెల్లడించారు.“ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా మా ప్రాంతంలో సంత్ ముక్తాయ్ యాత్ర జరుగుతుంది. రెండు రోజుల క్రితం నా కూతురు యాత్రకు వెళ్లింది. కొందరు యువకులు ఆమెను వేధించారు. వారిపై ఫిర్యాదు చేసేందుకు నేను పోలీస్ స్టేషన్కు వెళ్లాను' అని మీడియాకు కేంద్ర మంత్రి ఖడ్సే చెప్పారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారు. గుజరాత్ పర్యటన నుంచి నేను ఇంటికి రాగానే నా కుమార్తె ఈ విషయం చెప్పింది. కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సాధారణ మహిళల సంగతి ఏంటో అర్థం చేసుకోవచ్చంటూ కేంద్ర మంత్రి ఖడ్సే వ్యాఖ్యానించారు.రక్షా ఖడ్సే మామ ఏక్నాథ్ ఖడ్సే మాట్లాడుతూ.. ఈ యువకులపై గతంలోనూ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. వారు కరుడుగట్టిన నేరస్థులు. మహారాష్ట్రలో నేరస్థులకు పోలీసులంటే భయమే లేదు. రోజురోజుకు మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. బాధిత మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. వారి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెల పేర్లు బయటకు రాకూడదని భావిస్తున్నారు. వేరే మార్గం లేకనే ఫిర్యాదు చేశాం’’ అని ఏక్నాథ్ ఖడ్సే తెలిపారు.పోలీస్ స్టేషన్కు వెళితే రెండు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారని.. అమ్మాయిల విషయం కావడంతో ఆలోచించుకోవాలంటూ పోలీసులు మాకు సలహా ఇచ్చారు. వేధింపులకు పాల్పడ యువకులకు రాజకీయ నాయకుల అండ ఉంది. డీఎస్పీ, ఐజీతో కూడా చెప్పాను’’ అని ఖడ్సే తెలిపారు. -
యువత ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు యుక్తవయస్కుల ఆరోగ్య సంరక్షణ కోసం మరిన్ని నిధులు వెచ్చించాలని, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక సూచించింది. తద్వారా ప్రతీ డాలర్ వ్యయంపై 4.6 నుంచి 71.4 డాలర్ల స్థాయిలో ప్రతిఫలం లభిస్తుందని అంచనా వేసింది. ఇందుకోసం ప్రభుత్వం, ప్రవేటు రంగం నుంచి సహకారం అవసరమని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, మేటర్నల్, న్యూబోర్న్ అండ్ చైల్డ్ హెల్త్ (పీఎంఎన్సీహెచ్) సహకారంతో ఈ నివేదిక రూపొందించింది. యుక్త వయస్కుల (కౌమరదశ/10–19 ఏళ్లు) ఆరోగ్యంపై చేసే పెట్టుబడులతో జీడీపీ ఏటా 10 శాతం మేర పుంజుకుంటుందని అంచనా వేసింది. హెచ్పీవీ టీకా, టీబీ చికిత్స, మయోపియా గుర్తింపు–చికిత్సకు 2024–2035 మధ్య ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. 2024–2050 మధ్య కాలంలో విద్య, ఉపాధి, బాల్య వివాహాల తగ్గింపు, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని సూచించింది. ఇలా యుక్త వయసు్కల ఆరోగ్యంపై చేసే పెట్టుబడులతో పెద్ద ఎత్తన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని అభిప్రాయపడింది. దేశ భవిష్యత్తులో కీలక పాత్ర.. ‘‘ఈ తరహా భవిష్యత్ పెట్టుబడులు దేశ జీడీపీని సగటున ఏటా 10 శాతం మేర పెరిగేలా చేస్తాయి.ప్రభుత్వం, ప్రైవేటు రంగం, పౌర సమాజం, కమ్యూనిటీలు, కుటుంబాలు కలసి ఏటా ఇందుకోసం చేసే 33 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఏటా 476 బిలియన్ డాలర్ల ప్రయోజనాలు ఒనగూడతాయి’’అని ఈ నివేదిక తెలిపింది. ఆరోగ్యం, విద్య, బాల్య వివాహాలను అరికట్టడంపై చేసే ప్రతీ డాలర్ పెట్టుబడికి 4.6 డాలర్ల నుంచి 71.4 డాలర్ల వరకు ప్రతిఫలం వస్తుందని పేర్కొంది. -
ఆక్సిజన్ ఛాంబరే అతని ఆఫీస్
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడు బ్రియాన్ జాన్సన్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కలుషిత గాలికి బదులు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో లభ్యమయ్యే ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆక్సిజన్ ఛాంబర్నే తన కార్యస్థలిగా మార్చుకున్నారు.ఆక్సిజన్ సరఫరా ట్యూబ్లు పెట్టుకుని డెస్క్ టాప్పై పనిచేస్తున్న వీడియోను తాజాగా ‘ఎక్స్’ఖాతాలో షేర్చేశారు. ‘‘హైపర్బారిక్ ఆక్సీజన్ ఛాంబర్లోకి ఆఫీస్కు తీసుకొచ్చా’’అని ఆయన రాసుకొచ్చారు. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ(హెచ్బీఓటీ) తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఊపిరితిత్తుల్లోకి తగు పీడనంతో ఆక్సిజన్ వెళితే అంతర్గత కణజాలం ఏదైనా అతిసూక్ష్మస్థాయి రిపేర్లు ఉంటే వేగంగా చేసుకుంటుంది. హెచ్బీఓటీ అనేది ప్రపంచంలోనే చర్మ సంబంధ అత్యంత అధునాతన థెరపీ. ఈ థెరపీతో చర్మంలోని కణజాలం సాంద్రత 12.8 శాతం పెరుగుతుంది. సాగి, మళ్లీ యథాస్థానానికి వచ్చే ఎలాస్టిక్ గుణం 144 శాతం మెరుగుపడుతుంది. చర్మంలో అతిసూక్ష్మ రక్తనాళాల సంఖ్య 40.9 శాతం పెరుగుతుంది. సీడీ31 అనే రక్తనాళం సామర్థ్యం 84.3 శాతం మెరుగవుతుంది. కణక్షీణత 21 శాతం తగ్గుతుంది’’అని బ్రియాన్ చెప్పుకొచ్చారు. సముద్రజలాల్లో 33 అడుగుల లోతులో ఉన్నప్పుడు ఎంత పీడనం అయితే ఉంటుందో అంతే పీడనంతో గాలిని ఈ ఛాంబర్లో పీల్చే వెసులుబాటు ఉంది. ఈ ఛాంబర్లో 95 నుంచి 100 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ను పీలుస్తా’’అని చెప్పారు. పీడనంతో అంతా సమతుల్యం ‘‘సరైన పీడనంతో ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరితే అక్కడి నుంచి అన్ని శరీరభాగాలకు ఖచ్చితమైన సమయానికి ఆక్సీజన్ అందుతుంది. దీంతో అన్ని అవయవాల్లో ఆక్సిజన్ స్థాయిలు సవ్యంగా ఉంటాయి. కణజాలాల్లో ఆక్సీజన్ లభ్యత పెరిగి శరీరం ఏదైనా గాయాలు, రిపేర్లు ఉంటే ఆ పనిని త్వరగా పూర్తిచేస్తుంది. అతిసూక్ష్మ రక్తనాళాలు పాతబడిపోతే వాటి స్థానంలో కొత్త రక్తనాళాలు త్వరగా పుట్టుకొస్తాయి’’అని బ్రియాన్ చెప్పారు.వయసు తగ్గింపు చర్యలపై స్పందించిన నెటిజన్లు 18 ఏళ్ల యువకుడిలా కనిపించేందుకు బ్రియాన్ పడుతున్న తాపత్రయాన్ని చూసి మెచ్చుకునే వాళ్లతోపాటు విమర్శించే వాళ్లూ పెరిగారు. ‘‘వాహనాలు, ఇతర కాలుష్య ఉద్గారాలతో కలుషితమైన గాలితో పోలిస్తే ఇలాంటి ఆక్సిజన్ చాంబర్లో కూర్చుని కాస్తంత స్వచ్ఛమైన గాలి పీల్చడం బాగానే ఉందిగానీ ఇది ఏమంత సురక్షితం కాదు. ఆక్సిజన్ అగ్నిని మరింత రాజేస్తుంది. పూర్తిగా ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ వైర్లమయమైన ఛాంబర్లో పొరపాటున ఒక్క నిప్పురవ్వ అంటుకున్నా మీకే ప్రమాదం. పైగా వేగంగా వేడెక్కే కంప్యూటర్ వాడుతున్నారు’’అని ఒక నెటిజన్ హెచ్చరించారు. హాలీవుడ్ సినిమా మ్యాడ్మ్యాక్స్లో మృత్యుంజయునిగా ఉండేందుకు తాపత్రయపడే ‘ఇమ్మోరా్టన్ జోయ్’పాత్రధారి వేషంలో బ్రియాన్ భలేగా ఉన్నాడని మరో నెటిజన్ వ్యంగ్య పోస్ట్చేశారు. దీనిని నటుడు కీస్ బైర్న్ ఫొటోను జతచేశారు. ‘‘చిన్నతనంలో కార్టూన్ సినిమాలో చూసిన క్యాప్సూల్ లాగా ఈయన గారి ఛాంబర్ ఉంది’’అని ఇంకొకరు వెటకారంగా పోస్ట్చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
World Thinking Day: ‘మన ప్రపంచం.. మన భవిష్యత్’ థీమ్తో..
‘ఏ దేశంలోని ప్రజలు సదాలోచనలతో మెలుగుతారో, ఆ దేశ భవిష్యత్ బంగారుమయం అవుతుంది’ అని అంటారు. దీనికి ప్రతీకగా ‘వరల్డ్ థింకింగ్ డే’(World Thinking Day) అంటే ప్రపంచ ఆలోచనా దినోత్సవాన్ని ప్రతీయేటా ఫిబ్రవరి 22న నిర్వహిస్తుంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సదాలోచనల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అలాగే ప్రపంచ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించేందుకు ప్రేరణ కల్పిస్తుంది.ఈ రోజు స్కౌట్ అండ్ గైడ్స్(Scout and Guides)కు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. దేశానికి యువశక్తే వెన్నెముకలాంటిదని అంటారు. 1926లో తొలిసారిగా ‘వరల్డ్ థింకింగ్ డే’ను నిర్వహించారు. నాటి నుంచి ప్రపంచ ఆలోచనా దినోత్సవం రోజున యువతకు గల అధికారాలు, వారి బాధ్యతలపై నిపుణులు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. స్కౌట్ అండ్ గైడ్స్ అంతర్జాతీయ సదస్సు నిర్వహణపై ఈరోజునే ప్రస్తావనకు వచ్చింది. ‘వరల్డ్ థింకింగ్ డే’ తొలిసారిగా లండన్లో ప్రారంభమయ్యింది. స్కౌట్ అండ్ గైడ్స్ విభాగం ప్రపంచ సోదరభావాన్ని, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుకే ఈ రోజు స్కౌట్ అండ్ గైడ్స్ సభ్యులు ప్రపంచంలో ఐక్యతకు గల ప్రాధాన్యత, పాజిటివ్ థింకింగ్ గురించి చెబుతుంటారు.2025 ‘వరల్డ్ థింకింగ్ డే’ విషయానికొస్తే ఈరోజును ‘మన ప్రపంచం- మన భవిష్యత్’(‘Our World - Our Future’) థీమ్తో నిర్వహిస్తున్నారు. దీని ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలో పలు అంశాల్లో చైతన్యం తీసుకురావడం. అలాగే ప్రపంచాన్ని మరింత అభివృద్ధిదాయకంగా తీర్చిదిద్దడంలో ఐక్యతకు గల అవసరాన్ని చాటిచెప్పడం. వివిధ అంశాలపై యువతరానికి అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ప్రపంచంలోని వివిధ సమస్యలపై ఆలోచించేందుకు, యువత తమ పాత్రను చక్కగా పోషించడానికి ఈరోజు ప్రేరణ కల్పిస్తుంది. ప్రపంచ ఆలోచనా దినోత్సవం నాడు పలుచోట్ల సదాలోచనలపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సమాజంలో సానుకూల మార్పులు తీసుకువచ్చేందుకు మేథావులు చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రపంచాన్ని మరింత మెరుగైనదిగా మార్చేందుకు ఉపకరించే పర్యావరణం, విద్య, లింగ సమానత్వం లాంటి సామాజిక అంశాలపై చర్చించేందుకు ‘వరల్డ్ థింకింగ్ డే’ వేదికకానుంది.ఇది కూడా చదవండి: Mahakumb: నేడు, రేపు జనప్రవాహం.. పర్యవేక్షణలో సీఎం యోగి -
పెళ్లి నిర్ణయం పెద్దలకేనా? యువత ఏమంటున్నారో తెలుసా?
కరీంనగర్ సిటీ: నేటి యువత చదువుకుంటూనే.. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ముందుకు సాగుతున్నారు. విద్య, ఉద్యోగం, జీవితంలో స్థిరపడడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ప్రేమ పెళ్లి వద్దు..పెద్దలు కుదిర్చిన పెళ్లి ముద్దు అంటున్నారు. మరికొందరు సరైన సమయంలో వివాహం జరగాలని చెబుతున్నారు. ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం డిబేట్ నిర్వహించగా.. వారి అభిప్రాయాలు వెల్లడించారు.అర్థం చేసుకుంటే బెటర్ప్రేమ వివాహాలతో ఎదుటి వారి వ్యక్తిత్వం, ప్రవర్తన ముందుగానే తెలుసుకోవచ్చు. వారిపై మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వారితో వివాహబంధం ముందుకు సాగుతుందా లేదా తెలుస్తుంది. కొంతవరకూ ప్రేమపెళ్లిలు మంచివే. ఏ బంధం అయినా అర్థం చేసుకుని సర్దుకుపోతే నిలుస్తుంది.– శ్రీజ, విద్యార్థినిపెద్దలు కుదిర్చినదే..పెద్దలు అన్ని రకాలుగా మంచిగానే ఆలోచిస్తారు కాబట్టి వారి నిర్ణయం బలంగా ఉంటుందని నా నమ్మకం. వివాహ బంధంలో ఏదైనా సమస్యలు వచ్చినా పెద్దలు ముందుకు వచ్చి పరిష్కరిస్తారు. జీవితంలో మంచి సపోర్టుగా ఉంటారు. పెద్దలను విస్మరించి కొందరు ప్రేమ పేరుతో మోసపోతున్నారు.– వినోద, విద్యార్థినిప్రేమ వివాహాలపై 110మంది యువతులను వివిధ ప్రశ్నలు అడుగగా.. వెల్లడించిన అభిప్రాయాలుటీనేజీ ప్రేమపై మీ అభిప్రాయం65- ఆకర్షణ మాత్రమే45 -టీనేజ్లో ప్రేమ అవసరం లేదు85- కెరియర్ ఫస్ట్సరైన సమయంలో పెళ్లి అవసరం ప్రేమపై సోషల్ మీడియా ప్రభావం ఉందా?80-చాలా ఉందిఎలాంటి ప్రభావం లేదు-3060 - పెద్దలు కుదిర్చిందిప్రేమ వివాహం ప్రేమించి పెద్దలను ఒప్పించాలి- 30ఇదీ చదవండి: Valentine's Day పబ్లిక్ టాక్.. లవ్లో పడితే జాగ్రత్త.. భయ్యా!ఒప్పించి.. మెప్పించాలిఒక మనిషి గురించి పూర్తిగా అర్థం చేసుకుని, వారి గురించి పెద్దలకు వివరించి ఒప్పించాలి. ప్రేమించి పెద్దల సహకారంతో వివాహం చేసుకుంటే జీవితం అనందంగా ఉంటుంది. ఉన్నత చదువులతో జీవితం ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే ఏదైనా సాధ్యం. పెద్దలు చేసిన పెళ్లిలు సైతం విడిపోతున్నాయి కదా.– భానుమతి, విద్యార్థినికుటుంబ జోక్యంతోనేపెద్దలు కుదిర్చిన, ప్రేమ పెళ్లి ఏదైనా దంపతుల మధ్య కుటుంబాల జోక్యంతో విడిపోతున్నాయి. చాలా వరకూ అమ్మాయి ఇంటి వద్ద పెరిగిన విధంగానే అత్తవారింట్లో ఉండాలని అనుకుంటారు. కాని అలా ఉండదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు కావాలి. అబ్బాయిలు కూడా నమ్మి వచ్చిన వారిని మంచిగా చూసుకోవాలి. – సిరిచందన, విద్యార్థిని -
ఆంగ్ల భాషా నైపుణ్యం తప్పనిసరి!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన యువతకు ఆంగ్లంలో సరైన నైపుణ్యం లేకపోవడం వారి పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. యువతలో భాషా నైపుణ్యాలు పెంపొందించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులు ఆంగ్లం, ఇతర విదేశీ భాషలపై పట్టుసాధించేలా అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఇటీవల ‘రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్య విస్తరణ’పేరిట విడుదల చేసిన నివేదికలో ఆంగ్ల భాష అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘అనేక రాష్ట్రాల్లో, స్థానిక పరిశ్రమలలో పనిచేసే నైపుణ్యం గల వ్యక్తులు, ఇతర మానవ వనరులు ప్రధానంగా రాష్ట్రం బయటి నుంచే వస్తున్నారు. ఈ ధోరణికి ముఖ్య కారణం స్థానిక యువతకు ఆంగ్ల భాషలో నైపుణ్యం తగినంతగా లేకపోవడమే. సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది. విద్యార్థుల ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, తద్వారా వారు రాష్ట్రంలోనే ఉంటూ జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడం అత్యవసరం’అని తన నివేదికలో పేర్కొంది. ముందున్న రెండు రాష్ట్రాలు ఆంగ్ల భాష అవసరాన్ని గుర్తించడంలో పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు ముందున్నాయని నివేదికలో పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం 2023లో బ్రిటిష్ కౌన్సిల్ సహకారంతో ఈ దిశగా ప్రయత్నాలను ప్రారంభించిందని తెలిపింది. ఆరు నెలల పాటు ఇంటెన్సివ్ 18–సెషన్ల కోర్సును నిర్వహించడం ద్వారా ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టిందని వివరించింది. దాదాపు 5వేల మంది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఈ పైలట్ ప్రాజెక్ట్తో లాభం కలిగిందని వెల్లడించింది. విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో అభివృధ్ధి చెందేందుకు విద్యార్థులకు అవసరమైన భాషా సామర్థ్యాలను పెంపొందించడంలో పంజాబ్ చొరను నీతిఆయోగ్ ప్రశంసించింది. అదేవిధంగా, కర్ణాటక ప్రభుత్వం 2024లో ప్రారంభించిన కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, భాషా నైపుణ్యాలను పెంచడం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేసింది. మైక్రోసాఫ్ట్ ఇండియాతో భాగస్వామ్యంతో ‘ఇంగ్లిష్ స్కిల్స్ ఫర్ యూత్’కార్యక్రమం ద్వారా 16 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో 5,795 మంది విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాభివృధ్ధికి తోడ్పాటునందిస్తోంది. ‘స్కాలర్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ టాలెంట్’కార్యక్రమం ద్వారా ఆరు విశ్వవిద్యాలయాల నుంచి అర్హులైన విద్యార్థులకు లండన్లోని విశ్వవిద్యాలయాలకు రెండు వారాల పాటు పంపి, వారితో అభ్యసించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆంగ్ల విద్యను ప్రోత్సహించిందని నీతిఆయోగ్ ప్రశంసించింది. -
మానసిక ఆరోగ్యమే మన భాగ్యం
‘‘మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే ఏ విషయమైనా విషపూరితంగా భావించి తిరస్కరించండి’’. – స్వామి వివేకానంద నూరు శాతం ఆచరించి, అనుసరించి తీరాల్సిన వ్యాఖ్యలివి. మనల్ని క్రిందికి లాగి, ప్రతికూలతను వ్యాప్తి చేసే ఈ విషయంపైనైనా లోతైన ఆత్మపరిశీలన అవసరం. ఇక్కడ, ఇప్పుడు వివేకానందుని పిలుపును యువత తమ మానసిక ఆరోగ్యానికి కూడా వర్తింపజేయాల్సిన సమయమిది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంశం అయినందునే 2024–25 ఆర్థిక సర్వేలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ యువ భారత్ దారి ఎటు..? భారత్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ పురోగతి గురించి చర్చించేటప్పుడు దేశంలో అధికంగా ఉన్న యువశక్తి గురించి ప్రస్తావనకు వస్తుంది. అయితే ఈ యువత మెజారిటీ ఎటువైపు అడుగులు వేస్తోందన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. సోషల్ మీడియాలో ఖాళీ సమయాన్ని గడపడం లేదా అరుదుగా వ్యాయామం చేయడం లేదా కుటుంబాలతో తగినంత సమయం గడపకపోవడం, గంటల కొద్దీ కూర్చున్నచోటు నుంచి లేవకుండా కంప్యూటర్ల ముందు పనిచేయడం యువత మానసిక ఆరోగ్యాన్ని దిగజార్చుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యమన్న మన పెద్దల అనుభవ సారానికి తూట్లు పొడుస్తోంది. మన మూలాలవైపు ఇప్పుడు యువత తిరిగి చూడాల్సిన అవసరం ఉంది. ఇది యువతను అత్యున్నత స్థానానికి చేర్చడానికి వీలుకల్పిస్తుంది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి యువత మానసిక ఆరోగ్యం కీలకమైనదంటూ తాజా ఆర్థిక సర్వే విశ్లేషణను నిజం చేస్తుంది. జంక్ ఫుడ్.. ‘పాయిజన్’అల్ట్రా–ప్రాసెస్డ్ లేదా ప్యాక్డ్ జంక్ ఫుడ్ను చాలా అరుదుగా తినే వ్యక్తులు రెగ్యులర్గా తీసుకునే వారి కంటే మెరుగైన మానసిక స్థితిని కలిగి ఉంటారని ఆర్థిక సర్వే పేర్కొనడం గమనార్హం. సంపాదించిన డబ్బు.. వైద్యానికి సరిపోని పరిస్థితికి ఆహారపు అలవాట్లు కారణంగా మారుతుండడం గమనార్హం. మన సమాజంలో సంపాదన పెరుగుతున్నా, ఆరోగ్య సమస్యలతో చికిత్స ఖర్చులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నిత్యం ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న ఆహార పదార్థాల వినియోగం పెరుగుతోంది.ఇవి ఊబకాయాన్ని, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యలను పెంచుతున్నాయి. ఆరోగ్య సమస్యలు పెరగడంతో వైద్య ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఫలితంగా, సంపాదించిన డబ్బు చాలాచోట్ల వైద్య ఖర్చులకే వెళ్లిపోతోంది. దీని వల్ల కుటుంబ ఆర్థిక స్థితి కూడా దెబ్బతింటోంది. సమతులమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం తప్పనిసరి. సంపాదనను వైద్య ఖర్చులకు కాకుండా, మంచి జీవన విధానానికి ఉపయోగించుకోవడం మంచిది. మానసిక ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక అంశం. కింకర్తవ్యం..పిల్లలను, యుక్తవయసు్కలను ఇంటర్నెట్కు దూరంగా ఉంచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాల్సిన తక్షణ తరుణమిది. స్నేహితులతో కలవడం, బయట ఆడుకోవడం, సన్నిహిత కుటుంబ బంధాలను ఏర్పరచుకోవడంలో సమయాన్ని వెచి్చంచడం వంటి ఆరోగ్యకరమైన కాలక్షేపాలను ప్రోత్సహించడానికి పాఠశాల, కుటుంబ–స్థాయి జోక్యాల తక్షణ అవసరం ఉంది. మానవ సంక్షేమం, మానసిక ఆరోగ్యం ఆర్థిక ఎజెండాలో కేంద్రంగా ఉండాలి. యువ జనాభా అధికంగా ఉండడం వల్ల ఎకానమీకి ఒనగూడే ప్రయోజనాలు ఊరికే ఊడిపడవు. విద్య, శారీరక ఆరోగ్యం, ముఖ్యంగా యువత మానసిక ఆరోగ్యం ఇక్కడ చాలా కీలకం. ఇందుకు ఆచరణీయమైన, ప్రభావవంతమైన వ్యూహాలు, చొరవలపై దృష్టి పెట్టాల్సిన తక్షణ అవసరం ఉంది. వినియోగం వివేకంతో ఉండాలి... రెండు దశాబ్ధాల క్రితం సెల్ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగం చాలా తక్కువ. ఇప్పుడు పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అన్ని స్థాయిల్లో ఎంతో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే సాంకేతికత అతి, విచక్షణా రహిత వినియోగం అనర్థాలకు దారి తీస్తోంది. ఇప్పుడు పసితనం నుంచే పిల్లలకు సెల్ఫోన్లు, సోషల్ మీడియాను తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ అలవాటు వ్యసనంగా మారుతోంది. పెద్దలు సైతం సెల్ఫోన్, సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు.ఈ వ్యసనం.. చేసే పని మీద ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. పిల్లల చదువుల్లో, పెద్దలు చేసే పనుల్లో నాణ్యత, ఉత్పాదకత తగ్గిపోతోంది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కంటెంట్ ప్రతికూల ప్రభావం చూసి చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. బలహీన మనస్కులు మరింత బలహీనంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫోన్, సోషల్ మీడియా అతిగా వినియోగించడాన్ని ‘బిహేవియరల్ అడిక్షన్’ అనే మానసిక రుగ్మతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది.దీనికి చికిత్స అవసరం అని సైతం సూచించింది. తల్లిదండ్రులు చిన్న వయస్సు నుంచే పిల్లల ప్రవర్తనను నియంత్రిస్తుండాలి. పిల్లల్లో మానసిక పరిపక్వత వచ్చే వరకూ సెల్ఫోన్లు ఇవ్వద్దు. 18 ఏళ్ల లోపు పిల్లలకు సెల్ఫోన్ ఇవ్వాల్సి వస్తే స్కీన్ర్ సమయంపై నియంత్రణ ఉంచాలి. – డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, జాతీయ మానసిక వైద్యుల సంఘం పూర్వ అధ్యక్షులు ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం పిల్లలు, యుక్తవయసు్కలలో మానసిక ఆరోగ్య సమస్యల పెరుగుదల తరచుగా ఇంటర్నెట్ ప్రత్యేకించి సోషల్ మీడియా మితిమీరిన వినియోగంతో ముడిపడి ఉందన్నది కాదనలేని విషయం. స్మార్ట్ఫోన్ల వ్యాప్తి, సోషల్ మీడియా, ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంటింగ్ వంటి అంశాలు భావి భారత బాల్యాన్ని నిరాశాజనకంగా మార్చుతాయనడంలో సందేహం లేదు. బొమ్మరిల్లు సినిమాలో ఒక సందర్భంలో తండ్రితో హీరో ‘‘అంతా నువ్వే చేశావు’’ అన్న డైలాగ్ను ఇక్కడ మనం గుర్తుచేసుకోవాల్సిందే. ‘ది యాంగ్జియస్ జనరేషన్: హౌ ది గ్రేట్ రివైరింగ్ ఆఫ్ చి్రల్డన్ ఎపిడెమిక్ ఆఫ్ మెంటల్ డిసీజ్’ శీర్షికన ప్రఖ్యాత సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్త జోనాథన్ హైద్ట్ రాసిన పుస్తకాన్ని ఎకనమిక్ సర్వే రిఫర్ చేయడం గమనార్హం. ‘‘ఫోన్ ఆధారిత బాల్యం’’ పిల్లల ఎదుగుదల అనుభవాలను అడ్డదారి పట్టిస్తుంది. ఇక చిన్న పిల్లలు ఏడుస్తుంటే చాలు.. వారికి మొబైల్ ఫోన్ ఇచ్చి బుజ్జగిస్తున్నాం. ఇది వారి మానసిక ఆరోగ్య అధోగతి పట్టడానికి తొలి మెట్టు. సమాజ పురోగతికి పునాది జీవితంలోని సవాళ్లను అధిగమించగలిగిన సామర్థ్యాన్ని మానసిక ఆరోగ్యం అందిస్తుంది. ప్రతి రంగంలో ఉత్పాదకత పురోగతికి దోహదపడే అంశం ఇది. ఇంతేకాదు, మానసిక–భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, విజ్ఞాన సముపార్జన, సమాజ పురోగతికి వినియోగం, శారీరక సామర్థ్యాల సాధన... వంటి ఎన్నో ప్రయోజనాలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. జీవనశైలి ఎంపిక, అరమరికలు లేని స్నేహపూర్వక కార్యాలయ పని సంస్కృతి, కుటుంబ పరిస్థితులు దేశ ఎకానమీ పురోభివృద్ధికి మార్గాలు. ఇంత ప్రాముఖ్యత ఉన్న అంశం కాబట్టే భారత్ ఆర్థిక ఆశయాలు నెరవేరాలంటే బాల్యం, యవ్వనం దశ నుంచే జీవనశైలి ఎంపికలపై తక్షణ శ్రద్ధ ఉంచాలని ఎకనమిక్ సర్వే గుర్తుచేసింది. -
ఐర్లాండ్లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
డబ్లిన్:ఐర్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఒకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ (25) కాగా మరొకరిని పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్ (26)గా గుర్తించారు. యువకుల మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్(25) ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్ళాడు. భార్గవ్ శుక్రవారం(జనవరి31) రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్తో పాటు పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెరుకూరి సురేశ్(26) కూడా ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అందివచ్చిన కుమారులు చనిపోవడంతో వారి తల్లిదండ్రులు రోదిస్తున్నారు.ఇటీవలి కాలంలో అమెరికా సహా విదేశాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల మరణాలు ఎక్కువవడం కలవరం కలిగిస్తోంది. విదేశాల్లో చదువులు, ఉద్యోగాలకు పిల్లలను పంపాలంటే ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. విదేశాల్లో రోడ్డు ప్రమాదాలతో పాటు దుండగుల కాల్పుల్లో విద్యార్థులు చనిపోతున్న ఘటనలు తరచుగా జరుగుతుండడం వారి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. -
ఆధ్యాత్మిక మేళాలో యువ తరంగాలు
నవతరం యువత ఆధ్యాత్మిక బాట పడుతోంది. మహా కుంభమేళాలో ఎక్కడ చూసినా యువోత్సాహం వెల్లివిరుస్తోంది. పీఠాధిపతులు, సన్యాసులు, నాగా సాధువులు, పెద్దవాళ్లకు దీటుగా జెన్ జెడ్ (కొత్త తరం) యువతీ యువకులు కూడా మేళాకు పోటెత్తుతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్, చంకన లాప్టాప్తోనే తమదైన శైలిలో ఆధ్యాత్మికాన్వేషణలో మునిగి తేలుతున్నారు. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక వేడుకలు మధ్యవయసు్కలు, వృద్ధులకు మాత్రమే పరిమితం కాదని నిరూపిస్తున్నారు.ఎందుకొస్తున్నారు? గత కుంభమేళాతో పోలిస్తే ఈసారి యువత రాక బాగా పెరగడం విశేషం. తమను పలకరించిన మీడియాతో వారు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు, తాతయ్యల నోట పంచతంత్ర కథలతోపాటు ఆధ్యాత్మిక విషయాలు, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్ల గురించి ఎంతో విన్నాం. వాటినే స్వయంగా వచ్చి పాటిస్తున్నామంతే’’ అని త్రివేణి సంగమం వద్ద కొందరు యువతీ యువకులు చెప్పారు. ‘‘మా తాత, అమ్మమ్మ, నాన్నమ్మ కుంభమేళా గొప్పతనం గురించి ఎంతగానో చెప్పారు. ప్రత్యక్షంగా తెలుసుకుందామని వచ్చాం’’ అని సంస్కృతి మిశ్రా అనే యువతి చెప్పింది. ‘‘గంటగంటకు లక్షలాది మంది వచ్చిపోయే సంగమ స్థలిలో పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తరలిస్తూ పరిశుభ్రతను కాపాడుతున్న తీరు అద్భుతం. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాఠాలను ప్రత్యక్షంగా నేర్చుకునేందుకు వచ్చా’’ అని అమీషా అనే అమ్మాయి చెప్పింది. అక్షరాలా అద్భుతమే ‘‘కుంభమేళా గురించి ఎవరో చెబితే వినడం వేరు. ఆ భక్తి పారవశ్యాన్ని కళ్లారా చూడడం వేరు. నాకు ఇన్స్టాలో 18,000 మంది ఫాలోవర్లున్నారు. ఇన్ఫ్లూయెన్సర్గా ఇతరులను ప్రభావితం చేయడానికి ముందు నేనే స్వయంగా చూడాలని వచ్చా. అప్పుడే మహా కుంభమేళా మహిమ ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. ఈ ఆధ్యాత్మికతను, కోట్లమందితో కలిసి పుణ్యస్నానం చేస్తే వచ్చే అనుభూతి, ప్రశాంతతను మాటల్లో వర్ణించలేం. కుంభమేళా విషయంలో ప్రయాగ్రాజ్ నిజంగా సాంస్కృతిక రాజ్యమే’’ అని 23 ఏళ్ల జ్యోతి పాండే చెప్పారు. ‘‘ఇంతమందిని ఒక్కచోట చూస్తే ఎంతో సుందరంగా ఉంది. ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు గొప్పవి. నాకైతే ఇక్కడికొస్తున్న వాళ్లలో సగం మంది యువతే కనిపిస్తున్నారు. మేళాకు వచ్చి సనాతన భారతీయ సంస్కృతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని అక్షయ్ అనే 20 ఏళ్ల హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి అన్నాడు. అతను ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ క్యాంప్లో భాగస్వామిగా పనిచేస్తున్నాడు. ‘‘తల్లిదండ్రులతో కలిసి మూడ్రోజులు ఇక్కడే మేళా మైదానంలో ఉండేందుకు వచ్చా. తెల్లవారుజామునే చలిలో పుణ్యస్నానాలు చేసేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. భక్తుల అచంచల విశ్వాసం కుంభమేళాలో అణువణువుగా కనిపిస్తుంది’’ అని 23 ఏళ్ల ఢిల్లీ వర్సిటీ సైకాలజీ విద్యార్థిని సంస్కృతి చెప్పారు. ‘‘భక్తుల గేయాలు, నినాదాలతో సంగమ క్షేత్రమంతా హోరెత్తిపోతుంది. ఢిల్లీలాంటి కాంక్రీట్ వనం నుంచి ఇలాంటి పుణ్యతీర్థాలకు వచ్చినప్పుడే మన మూలాలేమిటో స్మరణకు వస్తాయి’’ అన్నారు. ‘‘కోట్లాది మంది ఒకే విశ్వాసంతో ఒక్కచోట చేరడాన్ని 144 ఏళ్లకొకసారి వచ్చే ఇలాంటి కుంభమేళాలోనే చూడగలం. ఇది నిజంగా అరుదైన విషయమే. నేను చిత్రలేఖనం చేస్తా. పసుపు, కుంకుమ, విభూతి, రంగులతో అలరారే మేళా పరిసరాలను చిరకాలం నిలిచిపోయేలా సప్తవర్ణ శోభితంగా నా కుంచెతో చిత్రిస్తా’’ అని దరాబ్ చెప్పాడు. అనుభవైకవేద్యమే ‘‘ఎవరో చేసే వీడియోలో, రీల్స్లో కుంభమేళాను చూడడం కాదు. మీరే స్వయంగా వచ్చి పుణ్యస్నానం ఆచరించి దాన్ని వీడియోలు, రీల్స్ చేసి చూడండి. ఈ స్థలం విశిష్టతేమిటో అప్పుడు తెలుస్తుంది! యువతకు ఆధ్యాత్మిక కనువిందే కాదు, కడుపునిండా భోజనమూ ఉచితంగా అందిస్తారు. ఇక్కడ రెండు నెలలపాటు ఉచిత భండార్లు అందుబాటులో ఉంటాయి. ఆధ్యాత్మికత, ఆనందాల మేళవింపు ఈ మేళా’’ అని ‘ది లలన్టాప్’ వార్తా సంస్థ ఉద్యోగి అభినవ్ పాండే చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యువత బలమే దేశానికి కలిమి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మన యువత బలమే మన దేశాన్ని అగ్రగామిగా మారుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యువతీ యువకుల శక్తి సామర్థ్యాలతో భారత్ ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందడం ఖాయమని చెప్పారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం ఢిల్లీలో ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చా కార్యక్రమం’లో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్’ అనేది మన లక్ష్యమని గుర్తుచేశారు. ఆ లక్ష్యం సాధించడం కష్టం కావొచ్చేమో గానీ అసాధ్యం మాత్రం కాదని తేల్చిచెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన సత్తా మన యువతలో ఉందన్నారు. మనది యువదేశమని, పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంచేశారు. మనం వేసే ప్రతి అడుగులో, ప్రతి విధానంలో, ప్రతి నిర్ణయంలో వికసిత్ భారత్ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో వేర్వేరు కీలక రంగాల్లో ఎన్నో విజయాలను మన దేశం సాధించబోతోందని మోదీ వెల్లడించారు. దేశం ముందుకు పరుగులు తీయాలంటే గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, మనం ఇప్పుడు అదే పనిలో నిమగ్నమై ఉన్నామని వివరించారు. ప్రభుత్వానికి యువత భుజం కలపాలి 2030 నాటికి పెట్రోల్లో 20 శాతం బ్లెండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాస్తవానికి అంతకంటే ముందే అది సాధించబోతున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వం ఒక్కటే అన్ని పనులూ చేయలేదని, యువత సైతం భుజం కలపాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్కు యువతే యజమానులని ఉద్ఘాటించారు. మన విధాన నిర్ణయాల్లో యువత ఆలోచనలు కూడా ఒక భాగమని చెప్పారు. వారి దిశానిర్దేశం దేశానికి అవసరమని అన్నారు. మనం అనుకున్నది సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరి సమ్మిళిత కృషి అవసరమన్నారు. 1930లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికా అగ్రదేశంగా ఎదిగిందని, ఒకప్పుడు ఎంతో వెనుకబడిన దేశమైన సింగపూర్ ప్రస్తుతం బలీయమైన ఆర్థిక శక్తిగా మారిందని మోదీ గుర్తుచేశారు. గొప్ప లక్ష్యాలు పెట్టుకోవడం, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యమని ఉద్బోధించారు. రాబోయే 25 ఏళ్లు మనకు అమృతకాలమని వివరించారు. వికసిత్ భారత్ కలను యువత సాకారం చేస్తుందన్న విశ్వాసం తనకు పూర్తిగా ఉందని పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో మన దేశంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేలా యువత సన్నద్ధం కావాలని మోదీ పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చా కార్యక్రమానికి 3 వేల మందికిపైగా యువతీ యువకులు హాజరయ్యారు. -
భవిత ‘ఏఐ’తుందో..?
సాక్షి, హైదరాబాద్: ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శరవేగంగా దూసుకొస్తోంది. అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తోంది. ఈ టెక్నాలజీ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కొన్ని సంస్థలు చెబుతుంటే మరికొన్ని సంస్థలు మాత్రం ఏఐ రాకతో ఉపాధికి గండి తప్పదని వాదిస్తున్నాయి. అయితే వృత్తి నైపుణ్యం, సాంకేతికతతో పోటీపడే సామర్థ్యం పెంపొందించుకోవడం ద్వారానే యువత ఉపాధికి ఢోకా ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ భాషా విధానంపై విశ్వవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు పలు సంస్థలు రంగంలోకి దిగాయి.ఏఐ స్పీడ్ ఎంత?గ్లోబల్ సిస్టమ్ అనే సంస్థ రూపొందించిన తాజా నివేదిక ప్రకారం ఏఐ వేగం కోసం భారత్ పరుగులు పెడుతోంది. తెలంగాణ సహా దేశంలోని అన్ని ప్రధాన ఐటీ నగరాలు ఏఐ టెక్నాలజీపై విస్తృతంగా పనిచేస్తున్నాయి. ఏఐ స్టార్టప్స్లో బెంగళూరు 21వ స్థానంలో, ఢిల్లీ 24, ముంబై 37, హైదరాబాద్ 41వ స్థానంలో ఉందని ఆ సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు ఏఐపై 40 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు స్కిల్ ఇండియా పేర్కొంది. మొత్తం 67200 కృత్రిమ మేధ సంస్థలున్నాయి. అందులో 25 శాతం అమెరికాలోనే ఉన్నాయి. భారత్లో 1,67,000 స్టార్టప్స్ ఉంటే వాటిలో 6,636 సంస్థలు ఏఐపైనే పనిచేస్తున్నాయి. ఇవి ఈ రంగంపై రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టాయి. దేశంలోని ఆరోగ్య సేవా సంస్థలు ఏఐను ఉపయోగించి టెలి మెడిసిన్, వ్యక్తిగత ఆరోగ్య సేవలు, ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ చేస్తున్నాయి. దేశీయ వైద్య సాంకేతికతల రంగంలో సుమారు 12 వేల స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. ఫిన్టెక్ రంగంలో ఉన్న ఏఐ పెట్టుబడుల విలువ 90 వేల కోట్ల డాలర్లు. 2021లో దేశంలో 2,100 ఫిన్టెక్ కంపెనీలు ఉండగా ఇప్పుడు 10,200కు చేరాయి. స్టార్టప్ రంగంలో వ్యవస్థాపక పెట్టుబడులు 2021లో 53 వేల కోట్ల డాలర్లు. 2023 నాటికి భారీగా పెరిగింది.ఉపాధికి విఘాతమా?స్కిల్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలో 2026 నాటికి 10 లక్షల మంది ఏఐ నిపుణుల అవసరం ఉంది. దాదాపు 152 సంస్థల అవసరాలు, 3.88 లక్షల మంది నిపుణుల అభిప్రాయాలతో ఈ నివేదిక రూపొందింది. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మంది ఏఐ నిపుణులు ఉండగా ప్రస్తుతం 6.29 లక్షల మంది అవసరం ఉందని నివేదిక అంచనా వేసింది. ప్రపంచ మేధో సంపత్తి ఆర్థిక నవీకరణ సూచీ–2024 ప్రకారం 133 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 39వ స్థానంలో ఉంది. 2015లో 81వ స్థానంలో ఉంది. అంటే ఏఐ ఎంత వేగంగా దూసుకెళ్తుందో అర్థం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. అయితే ఏఐలో కీలకమైన లార్జ్ లాంగ్వేజీ మోడల్స్ (ఎల్ఎల్ఎం)పైనే యువతలో ఆందోళన ఉంది. ఇవి మానవ మేధస్సును మించి పనిచేస్తాయని.. దీనివల్ల మానవ వనరుల అవసరం ఉండదని భావిస్తున్నారు. కానీ ఈ భావనను నీలమ్ కర్న్ అనే ఏఐ నిపుణుడు తోసిపుచ్చుతున్నారు. ఎల్ఎల్ఎంలకు సరికొత్త ప్రోగ్రామ్ ఇవ్వగల స్థాయికి మన యువత ఎదగడం సాధ్యమేనని అంటున్నారు. అప్పుడు ఏఐని మించిన మేధోశక్తి మనకు ఉంటుందని చెబుతున్నారు. ఏఐతో పోటీ తప్పదు సర్విస్ సెక్టార్లో మార్పులొస్తున్నాయి. ఇప్పటివరకు డెవాబ్స్పై పనిచేశా. ఏఐ టెక్నాలజీ అంతర్లీనంగా ప్రభావం చూపిస్తోంది. టెక్నాలజీ మార్పు అనివార్యమని గుర్తించా. పదేళ్ల సీనియారిటీ ఉన్న నాకు ఏఐతో పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఇది అనివార్యమనే భావిస్తున్నా. –శ్రీరాంకుట్టి (ఏఐ స్టార్టప్ ఉద్యోగి) ఆందోళన తొలగించాలి టెక్నాలజీ వేగాన్ని అందుకోవాలంటే ఇప్పుడున్న మానవ వనరులకు శిక్షణ అవసరం. కొత్త సాంకేతికతపై ఆందోళన చెందుతుంటే మార్పు ఎలా సాధ్యం? కాకపోతే శిక్షణపై ప్రభుత్వాలు, ఐటీ సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏఐతో ఉద్యోగాలు పోతాయనే భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. – నవీన్ చావ్లా (ఐటీ నిపుణుడు) -
మొదట కొనేది ఇల్లే.. ఆ తర్వాతే పెళ్లి, ఫ్యూచర్
చదువు పూర్తయ్యిందా.. మంచి ఉద్యోగం, తర్వాత పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్ నాటికి ఓ సొంతిల్లు.. మన నాన్నల ఆలోచనలివే కదూ! కానీ, ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులూ మారాయి. చదువు కొనసాగుతుండగానే ఉద్యోగావకాశాలు నడిచొస్తున్నాయి. దీంతో యువత ముందుగా స్థిరమైన నివాసానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి, విదేశీ ప్రయాణాలు, ఫ్యూచర్ ఇతరత్రా వాటి కోసం ప్లానింగ్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోవిరివిగా రుణాల లభ్యత, బహుళ ఆదాయ మార్గాలు, మంచి ప్యాకేజీతో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు ఉండటంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు యువత ఆసక్తి చూపిస్తోంది. 2018లో గృహ కొనుగోలుదారుల్లో మిలీనియల్స్ (25–35 ఏళ్ల వయస్సు గలవారు) వాటా 28 శాతంగా ఉండగా.. గతేడాదికి 37 శాతానికి పెరిగింది. 2030 నాటికి 60 శాతానికి చేరుతుందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది.ఇటీవల కాలంలో దేశీయ స్థిరాస్తి రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయి. గతంలో రిటైర్డ్, సీనియర్ సిటీజన్స్, సంపన్న వర్గాల గృహ కొనుగోళ్లు, పెట్టుబడులు ఉండేవి. కానీ, కొన్నేళ్లుగా మిలీనియల్స్, జెన్–జెడ్ కస్టమర్ల వాటా పెరిగింది. జీవితం ప్రారంభ దశలోనే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. తొలి కారు, డిజైనర్ హ్యాండ్ బ్యాగ్లాగే ప్రాపర్టీకి నేటి యువత ప్రాధాన్యత ఇస్తోంది. అందుబాటులో టెక్నాలజీ.. మ్యాజిక్బ్రిక్స్.కామ్, హౌసింగ్.కామ్, 99 ఎకర్స్ వంటి రియల్ ఎస్టేట్ యాప్స్ యువ కొనుగోలుదారుల ప్రాపర్టీ శోధనను మరింత సులువు చేశాయి. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే భౌతికంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడం, పరిసర ప్రాంతాల వాకబు వంటివి పెద్ద ప్రయాస ఉండేది. కానీ, నేటి యువతరానికి అంత టైం లేదు. దుస్తులు, ఫుడ్ ఆర్డర్ చేసినంత సులువుగా ప్రాపర్టీ కొనుగోళ్లు జరిగిపోవాలని కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టు ప్రాపర్టీ సమీక్ష, రేటింగ్ యాప్స్, త్రీడీ వ్యూ, వర్చువల్ టూర్ వంటి సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి. గృహ రుణాలకు పోటీ.. యువ గృహ కొనుగోలుదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం పోటీపడి హోమ్లోన్స్ అందిస్తున్నాయి. రుణాల మంజూరులో వేగం, తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. క్రౌడ్ ఫండింగ్, ప్రాపర్టీ షేరింగ్ వంటి పాక్షిక యాజమాన్య ప్లాట్ఫామ్లు పరిమిత మూలధనంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో భారీ ముందస్తు చెల్లింపులు అవసరం లేకుండానే నేటి యువ కస్టమర్లు లక్ష కంటే తక్కువ ప్రారంభ పెట్టుబడితో యువ ఇన్వెస్టర్లు ఖరీదైన, విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఐటీ హబ్లలో యువ పెట్టుబడులు.. బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ హబ్లలో యువ ఐటీ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ మార్కెట్లో గణనీయమైన ప్రభావం చూపుతున్నారు. రూ.80 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర కలిగిన 2 బీహెచ్కే అపార్ట్మెంట్ల కొనుగోళ్లలో వీరి ప్రాధాన్యత అధికంగా ఉంది. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్తో యువ ఉద్యోగులకు నిత్యం ఆఫీస్కు వెళ్లాలనే టెన్షన్ లేదు. దీంతో ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు ఉండాలనుకోవడం లేదు.ఇదీ చదవండి: హైదరాబాద్లో లక్ష ఇళ్లు @సేల్!మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటే సిటీకి కాస్త దూరమైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ప్రధాన ప్రాంతంలో కొనుగోలు చేసే ధరతోనే శివార్లలో పెద్ద సైజు ఇళ్లు, వసతులను పొందవచ్చనేది వారి అభిప్రాయం. అయితే గ్రీనరీతో పాటు విద్యుత్, నీటి వినియోగాన్ని ఆదా చేసే ప్రాజెక్ట్లు, సౌర ఫలకాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పర్యావరణ అనుకూల ఫీచర్లు ఉండే ఇళ్లను కోరుకుంటున్నారు.పెరిగిన పట్టణ గృహ యజమానులు.. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్ విధానంతో యువ ఉద్యోగులు ఆఫీసులో కూర్చొని పనిచేసే అవసరం లేదు. వారు ఇప్పుడు తమ పనికి కాకుండా జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వారికి నచ్చిన ప్రాంతంలో నివసించే స్వేచ్ఛ కోరుకుంటున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, వినియోగదారుల అభిరుచులతో గృహ కొనుగోలుదారుల్లో మార్పులు వచ్చాయి.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కీలకమైన వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 2020లో పట్టణ గృహ యజమానుల రేటు 65 శాతంగా ఉండగా.. 2025 నాటికి 72 శాతానికి పెరుగుతుందని జేఎల్ఎల్ అంచనా వేసింది. సరసమైన గృహ రుణాలు, నివాస సముదాయంలో యువ కొనుగోలుదారుల ప్రాధాన్యతే ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. -
ప్రాణాలు తీసిన సరదా!
సాక్షి,హైదరాబాద్/గజ్వేల్/ముషిరాబాద్/బన్సీలాల్పేట్/ఖైరతాబాద్: పండుగ సెలవుల్లో సరదాగా గడుపుదామని వెళ్లిన ఆ యువకులకు.. అదే చివరి ప్రయాణమైంది. ఆట విడుపే ఆఖరి క్షణమైంది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లో మునిగి శనివారం ఐదుగురు యువకులు మృతి చెందారు. హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ఇందిరానగర్కు చెందిన ధనుష్ (20), లోహిత్ అలియాస్ లక్కీ (17) సోదరులు. బన్సీలాల్పేటలోని కవాడిగూడకు చెందిన చీకట్ల దినేశ్వర్ (18), ఖైరతాబాద్కు చెందిన జతిన్ (17), రాంనగర్కు చెందిన మృగాంక్ (17), ఎండీ ఇబ్రహీం (20), అత్తాపూర్కు చెందిన సాహిల్ వీరికి స్నేహితులు. శనివారం సెలవు కావడంతో సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి ఆలయం, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సందర్శనకు వెళ్లారు. నేరుగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కు చేరుకొన్న వీరంతా సరదాగా గడిపేందుకు కట్టపై నుంచి కిందికి దిగారు. సెల్ఫీలు దిగుతున్న సమయంలో లోహిత్ కాలుజారి నీళ్లలో పడ్డాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ధనుష్, సాహిల్, దినేశ్వర్, జతిన్ సైతం నీళ్లలో పడి మునిగిపోయారు. భయకంపితులైన మృగాంక్, ఇబ్రహీంలు గట్టిగా కేకలు వేస్తూ కట్టపైకి పరుగులు తీశారు. 100 నంబర్కు డయల్ చేసి విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో ములుగు, మర్కూక్ పోలీసులు వెంటనే స్పందించారు. గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సిద్దిపేట సీపీ అనురాధ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో మరింత అప్రమత్తమై గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రెస్క్యూ టీమ్ను, గజ ఈతగాళ్లను రప్పించి డ్రోన్ల సాయంతో మృతదేహాలను గుర్తించి వెలికితీసే ప్రక్రియను చేపట్టారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రమించి నీటిలో 30 అడుగుల లోతులో మునిగిన ఐదు మృతదేహాలను వెలికితీశారు. లోహిత్, దినేశ్వర్, జతిన్లు మీర్పేటలోని టీకేఆర్ కళాశాలలో డిప్లొమా చేస్తున్నారు. సాహిల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, ధనుష్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఘటనా స్థలానికి డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. తండ్రి జన్మదినం రోజే కొడుకు మృతి కొండపోచమ్మ సాగర్లో మునిగి చనిపోయిన చీకట్ల దినేశ్వర్ (17) తండ్రి కిషన్దాస్ జన్మదినం శనివారమే. తన పుట్టినరోజు నాడే కుమారుడు చనిపోవటంతో ఆ తండ్రి బాధ వర్ణాతీతంగా ఉంది. మరోవైపు చేతికంది వచ్చిన ఇద్దరు కొడుకులూ ఒకేసారి చనిపోవటంతో ధనుష్, లోహిత్ల తల్లిదండ్రుల రోదనలు ఆపటం ఎవరితరం కాలేదు. ‘తండ్రి లేని బిడ్డ.. చదివిస్తే బాగుపడతాడని అనుకుంటే ప్రాణాలు పోగొట్టుకుండు..అంటూ సాహిల్ తల్లి అనిత గుండెలవిసేలా రోదించింది. అత్తాపూర్ ముష్క్ మహల్ ప్రాంతానికి చెందిన సాహిల్ దీపక్ సుతార్ (18) చిన్నతనంలోనే అతడి తండ్రి మృతి చెందాడు. తల్లి అనిత స్థానికంగా చిన్నచిన్న పనులు చేస్తూ జీవిస్తోంది. అనిత ఇద్దరు కొడుకుల్లో పెద్ద కుమారుడు డిగ్రీ చదువుతుండగా, సాహిల్ ఇంటరీ్మడియట్ చదువుతున్నాడు. కుమారుడి మృతితో ఆమె తల్లడిల్లిపోయింది. సీఎం రేవంత్ విచారం కొండపోచమ్మ సాగర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. యువకులు గల్లంతైన విషయం తెలియగానే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలకు ఆయన ఆదేశించారు. అనంతరం యువకుల మరణవార్త తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. యువకుల మృతి కలిచి వేసింది:హరీష్రావు కొండపోచమ్మ సాగర్లో యువకుల మృతి తనను కలచివేసిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు అకాల మరణం చెందటం మనస్సును కలిచి వేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పట్టాలపై పబ్జీ..రైలు ఢీకొని యువకులు మృతి
పాట్నా:సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ ప్రపంచాన్ని మర్చిపోయి ప్రమాదానికి గురైన వాళ్లను చూశాం.. కానీ బీహార్లో ఏకంగా రైలు పట్టాలపైనే కూర్చొని ముగ్గురు యువకులు పబ్జీ ఆడారు. చెవుల్లో ఇయర్ఫోన్స్ పెట్టుకుని మరీ గేమ్ ఆడారు. ఇంకేముంది పట్టాలపై దూసుకువస్తున్న రైలు శబ్దాన్ని ఆ యువకులు వినలేకపోయారు.వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన బీహార్లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో జరిగింది.జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు నార్కటియాగంజ్-ముజఫర్పుర్ రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా అదే మార్గంలో వచ్చిన రైలు వారిపై నుంచి వెళ్లింది.దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మృతులను ఫర్కాన్ ఆలం,సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను పోస్ట్మార్టంనకు తరలించామని దర్యాప్తు కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి భీకర ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండడంపై తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని పోలీసులు సూచించారు.ఇదీ చదవండి: స్పీడ్ బ్రేకర్ ప్రాణం పోసింది -
యువ 'కలం'..! ట్రెండ్ సెట్టర్స్గా యంగ్ రైటర్స్
రచన, సాహిత్యాన్ని అభిరుచిగా మలుచుకుంటే చాలు.. మన భవిష్యత్ ప్రయాణ మార్గాన్ని, అత్యుత్తమ లక్ష్యాలకు అదే చేర్చుతుందని ప్రముఖ సాహిత్యకారులు చెప్పే మాట. ఆనాటి తరం యువ రచయితలకు సాహిత్యాభిలాష ఎంత వరకూ తోడ్పాటునందించిందో అటుంచితే.. ఈ తరం యువ రచయితలకు మాత్రం గౌరవ ప్రస్తానాన్ని ప్రసాదిస్తోంది. ఈ తరం యువత సాహిత్యంలో విశేషంగా రాణించడమే దీనికి నిదర్శనం. అధునాతన పంథాతో, వినూత్న ఆలోచనలతో, సామాజిక అంశాలను ప్రస్తుత భాషా అనుకరణ పరిమితుల్లో రచిస్తూ.. తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. యువ రచనలకు ఈ దశాబ్ద కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాదీ యువ రచయితల కొత్త పుస్తకాలు, నవలలు, కథానికలు, కవిత్వ సంపుటిలు విరివిగా ప్రచురితమవుతున్నాయి. ఇందులోనూ వినూతనత్వం ఏంటంటే.. ఈ అభిరుచి ఉన్న యువ ఔత్సాహికులకు అటు సినిమా రంగంలో, ఇటు కంటెంట్ డెవలప్మెంట్ వేదికల్లో ప్రధాన్యత పెరగడం. ఈ సందర్భంగా వీరంతా సోషల్ సెలబ్రెటీలుగా మారుతున్నారు. హైదరాబాద్ నగరం వేదికగా కొనసాగుతున్న నేషనల్ బుక్ ఫెయిర్(National Book Fair) నేపథ్యంలో అటువంటి యువ సాహిత్య కారులను ‘సాక్షి’ ప్రత్యేకంగా పలకరించింది. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రశ్నించే గొంతుకగా ఉండాలని..ర చన, సాహిత్యం అనేది నా ఆలోచనలను ప్రతిబింబించే సామాజిక వేదికలుగా భావిస్తాను. రాసే కథ అయినా, నవల అయినా సమాజహితమై, అసమానతలను ప్రశ్నించే గొంతుకగా ఉండాలని భావిస్తాను. అందులో భాగంగానే ఎర్రమల్లెలు అనే పుస్తకం రాశాను. మ్యారిటల్ రేప్ల పై ఈ రచన రాశాను. సాధారణంగా మల్లెలు తెల్లగా ఉంటాయి. కానీ అవి ఎందకు ఎర్రగా మారాయనే నిజజీవిత సామాజిక అంశాన్ని ప్రస్తావించాను. సాధారణంగా పెళ్లి జరిగిన తరువాత అందరి ఆడవారి జీవితాలూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్పై అవగాహన లేకపోవడం దీనికి కారణం. నా పుస్తకానికి అన్ని వయసుల ఆడవారు, ముఖ్యంగా మగవారి నుంచి స్పందన లభిస్తోంది. నిజ జీవితంలో భార్యల విషయంలో భర్తలు ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశంలో చాలా మంది రియలైజ్ అయ్యామని స్పందించడం చాలా సంతోషాన్నిచ్చింది. నేను సినిమాలకు రచనా సహకారం అందిస్తున్నాను. ఆల్ ఇండియా రేడియోలో డ్రామాలు రాస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని కథలు, నవలలు రాయనున్నాను. – రోజా రాణి దాసరి స్క్రీన్ రైటర్ అవ్వాలనే లక్ష్యంతో..మనుషుల్లోని సున్నితమైన భావోద్వేగాలైన ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయత వంటి అంశాల్ని స్పృశిస్తూ రచనలు చేయడం నాకు ఇష్టం. ప్రస్తుతం ఈ ప్రపంచానికి వీటి అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. ఇందులో భాగంగానే ‘సరిజోడి’ అనే స్వచ్ఛమైన అచ్చ తెలుగులో ఒక నవల రాశాను. సిటీలో కొనసాగుతున్న బుక్ ఫెయిర్లో ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది పాకిస్తానీ ముస్లిం అమ్మాయికి, హైదరాబాదీ వ్యాపారవేత్తకి మధ్య జరిగిన హృద్యమైన ప్రేమ కావ్యం. ఇది నా మొదటి నవల. భవిష్యత్తులో స్క్రీన్ రైటర్ అవ్వాలనే లక్ష్యంతో ఉన్నాను. ప్రస్తుతం నగరంలోని ఇఫ్లూ యూనివర్సిటీలో ఫిల్మ్ స్టడీస్ పై పీహెచ్డీ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో యువ రచయితల పుస్తకాలు పెరగడం సంతోషాన్ని ఇవ్వడంతో పాటు, పోటీతత్వాన్ని పెంచుతోంది. ఇందులో బాధ్యతాయుతమైన రచనలు, భాషను, సామాజిక, మానసిక విలువలను స్పృశించే రచనలు కూడా ఉండటం శుభపరిణామం. – దిలీప్. స్నేహితుల సహకారంతో..రచనల పరంగా 2012లో మొదలైన నా ప్రయాణం కేంద్ర యువ సాహిత్య అకాడమీ అవార్డు పొందే వరకూ సాగింది. మొదట్లో ఈ రచనా రంగంలోని స్నేహితుల సహకారంతో మొదటి పుస్తకాన్ని ప్రచురించాను. ఆ తరువాత ఆ కష్టాలను దాటుకుని అస్థిత్వం, కుల వృత్తులను, సామాజిక అంశాలను ప్రతిబింబించే కవిత్యం, కథలు రాశాను. నా రచనలు హిందీ, తమిళం, అస్సామీ, బంగ్లా వంటి భాషలతో పాటు ఫ్రెంచ్, స్పేయిన్ వంటి భాషల్లోకి తర్జుమా చేయడం గొప్ప గౌరవంగా భావిస్తాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల కోసం సిలబస్ చేర్చడం కూడా మరింత సంతృప్తినిచ్చింది. ఈ ప్రయాణంలో వివిధ రాష్ట్రాల్లో దాదాపు 13 లిటరరీ ఫెస్టివల్స్లో వేదిక పంచుకోవడం, ఈ వేదికల పైన జాతీయ, అంతర్జాతీయ సాహిత్యకారులను కలుసుకోవడం, వారి అనుభవాలను ఆలోచనలను పంచుకోవడం నా విజయాలుగా భావిస్తాను. మరి కొద్ది రోజుల్లో ఇంగ్లిష్ కవిత్వం, కవిత్వ అనువాదం, మరో సంపాదకత్వంతో రానున్నాను. – రమేష్ కార్తీక్ మహిళా సాధికారత దిశగా..నా వృత్తి ప్రభుత్వ రంగ సంస్థలో మహిళా సాధికారత కోసం కృషి చేయడం. నా వృత్తిలో ఎదురైన అనుభవాలను ప్రవృత్తి అయినటువంటి రచనల ద్వారా సమాజానికి చేరువ చేస్తున్నాను. మొదటి సామాజిక సమస్యలపై కథలు రాస్తున్నాను. నా మొదటి పుస్తకం ఇసుక అద్దం. ఇది నా ప్రయాణానికి మంచి బాట వేసింది. ఈ మధ్యనే విడుదల చేసిన 2వ కథల పుస్తకం బల్కావ్ కూడా నా సామాజిక బాధ్యతను అక్షరాలుగా, పదాలుగా వివరిస్తుంది. ఒక సామాజిక అంశంపై లోతుగా పరిశోధించాకే, అందులోని నిజాలను నిక్కచ్చిగా చెప్పడానికే నా కలాన్ని వాడతాను. నా రచనలు నాకు సంతృప్తితో పాటు గౌరవాన్ని, గుర్తింపును ఇచ్చాయి. యండమూరి వీరేంద్రనాథ్ ఉగాది పురస్కారంతో పాటు, వాయిస్ ఆఫ్ తెలంగాణ వంటి అవార్డులు సైతం లభించాయి. ముఖ్యంగా 50 ఇన్స్పైరింగ్ ఉమెన్స్లో నాకు అవార్డు రావడం, దీని కోసం ప్రత్యేకంగా ప్రచురించిన పుస్తకంలో నా గురించి ప్రచురించారు. మరికొన్ని అద్భుతమైన కథలతో రానున్నాను. – శ్రీ ఊహ(చదవండి: వామ్మో..! అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా..? వింటే వెన్నులో వణుకురావాల్సిందే..!) -
యువకుడిని ముక్కలుగా చేసి హత్య.. ఏడుగురికి మరణశిక్ష
కోల్కతా:పశ్చిమబెంగాల్లో 2020లో యువకుడిని ముక్కలుముక్కలుగా చేసి హత్య చేసిన కేసులో ఏడుగురికి కోర్టు మరణశిక్ష విధించింది. ఇది అత్యంత క్రూరమైన రీతిలో జరిగన హత్య కావడం వల్లే నిందితులకు మరణశిక్ష విధిస్తున్నట్లు చిన్సూర సెషన్స్కోర్టు తెలిపింది. ఓ ముక్కోణపు ప్రేమకథలో బిష్ణుమాల్(23) అనే యువకుడిపై బిశాల్ అనే యువకుడు కోపం పెంచుకున్నాడు.స్నేహితుల సహకారంతో బిష్ణును అతడి ఇంటివద్ద నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఓ ఇంట్లో బిష్ణు శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి హత్యచేశారు. బిష్ణుమాల్ను ముక్కలుగా చేసిన తతంగాన్ని మొత్తం నిందితులు వీడియో చిత్రీకరించారు. అనంతరం శరీరభాగాలను పలు ప్రాంతాల్లో పారవేశారు. ఈ కేసులో బిష్ణు ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న యువతి సాక్ష్యం కీలకంగా పనిచేసిందని ప్రాసిక్యూటర్ తెలిపారు.బిష్ణు హత్యలో నేరుగా పాల్గొన్న ఏడుగురు నిందితులకు మరణశిక్ష పడగా నిందితులకు సహకరించిన మరొకరికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. కేసులో అందరు నిందితులను హత్యజరిగిన వెంటనే పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ప్రధాన నిందితుడు బిశాల్ మాత్రం నెల రోజుల తర్వాత పోలీసులకు చిక్కాడు. బిశాల్ అరెస్టయిన తర్వాతే మృతుడి తల భాగాన్ని పోలీసులు రికవర్ చేయగలిగారు. తలను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి బిశాల్ తన ఇంట్లో దాచుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. -
రూ. 40 వేలతో మినీ ట్రాక్టర్ , ఇంట్రస్టింగ్ స్టోరీ
పెద్దగా చదువుకోకపోయినా సృజనాత్మక ఆలోచన, పట్టుదలతో కూడి కృషితో అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పటానికి ఈ మినీ ట్రాక్టర్ ఓ ఉదాహరణ. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన పెంచల నారాయణ (25) వెల్డింగ్ పనిచేస్తూ జీవిస్తున్నారు. 9వ తరగతి వరకు చదువుకున్న నారాయణ చిన్న రైతుల కోసం కేవలం రూ.40 వేల ఖర్చుతో మినీ ట్రాక్టర్ను తయారు చేసి ప్రశంసలు పొందుతున్నారు. ఆటో ఇంజన్ తదితర విడిభాగాలను జత చేసి మినీ ట్రాక్టర్ను రూపొందించారు. 2 లీటర్ల డీజిల్తో ఎకరా పొలం దున్నేయ వచ్చునని నిరూపించారు. ΄ పొలం దున్నడంతో పాటు నిమ్మ, జామ వంటి పండ్ల తోటల్లో అంతర సేద్య పనులను ఈ మినీ ట్రాక్టర్తో అవలీలగా చేసుకోవచ్చని నారాయణ వివరించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులకు తక్కువ ఖర్చుతో కూడిన మినీ ట్రాక్టర్ను అందిస్తానని పెంచల నారాయణ అంటున్నారు. కాన్సెప్ట్ బాగుంది: గణేశంపల్లెసృజన అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేశం మాట్లాడుతూ.. ‘కాన్సెప్ట్ బాగుంది. ఏమీ తెలియని ఒక అబ్బాయి నడిచే మోటరు వాహనాన్ని తయారు చేయడం సులభం కాదు అన్నారు. ‘రోడ్డు మీద బాగానే నడుస్తోంది. చిన్న ఇంజన్తో దుక్కిచేయటం వంటి శక్తితో కూడుకున్న పనులను ఏయే రకాల భూముల్లో ఈ చిన్న టాక్టర్ ఎంతవరకు చేయగలుగుతుందో చూడాలి’ అన్నారాయన. – కే.మధుసూధన్, సాక్షి, పొదలకూరు -
వికసిత భారత్లో యువత పాత్ర కీలకం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఆదివారం)తన రేడియో కార్యక్రమం ‘మన్కీ బాత్’లో మాట్లాడారు. ప్రధాని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇది 116వ ఎపిసోడ్. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వికసిక బారత్లో యువత పాత్ర కీలకమని అన్నారు.‘మన్ కీ బాత్’ కార్యక్రమం ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ .. మన్ కీ బాత్ అంటే దేశానికి సంబంధించిన సమిష్టి కృషి గురించి మాట్లాడటమన్నారు. దేశం సాధించిన విజయాలు ఇక్కడి ప్రజల శక్తితో ముడిపడివున్నాయన్నారు. తాను ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ కావడానికి మన్ కీ బాత్ కార్యక్రమం కోసం ఎదురు చూస్తుంటానని, వీలైనన్ని ఎక్కువ సందేశాలను అందించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాని, ప్రజలు అందించే సూచనల కోసం ఎదురుచూస్తుంటానని అన్నారు.'मन की बात' के 116वें एपिसोड में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "मैंने लाल किले की प्राचीर से ऐसे युवाओं से राजनीति में आने का आह्वान किया है, जिनके पूरे परिवार की कोई राजनीतिक पृष्ठभूमि नहीं रही है। ऐसे एक लाख युवाओं को, नए युवाओं को राजनीति से जोड़ने के लिए देश में कई विशेष… pic.twitter.com/xcU1doulIi— ANI_HindiNews (@AHindinews) November 24, 2024ఈరోజు(ఆదివారం) చాలా ప్రత్యేకమైన రోజని, ఈరోజు ఎన్సీసీడీ అని ప్రధాని గుర్తుచేశారు. ఎన్సీసీ పేరు వినగానే మనకు స్కూల్-కాలేజీ రోజులు గుర్తుకొస్తాయని, తాను ఎస్సీసీ విద్యార్థిని అని, నాడు తాను పొందిన అనుభవం అమూల్యమైనదని మోదీ పేర్కొన్నారు. ఎన్సీసీ అనేది యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా స్ఫూర్తిని పెంపొందిస్తుందన్నారు. విపత్తుల సమయంలో సహాయం చేయడానికి ఎన్సీసీ అభ్యర్థులు ఎల్లప్పుడూ ముందు ఉంటారని, ప్రతీ విద్యార్థి ఎన్సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో యువత పాత్ర ఎంతో కీలకమని, యువత ఒక్కతాటిపైకి వచ్చి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, ఖచ్చితంగా అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందన్నారు.కార్యక్రమంలో స్వామి వివేకానందను స్మరించుకున్న ప్రధాని మోదీ 'వచ్చే ఏడాది స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహించనున్నామని అన్నారు. జనవరి 11, 12 తేదీల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో ‘యంగ్ ఐడియాస్ మహాకుంభ్’ జరగనుందని, ఈ కార్యక్రమానికి రెండు వేల మంది యువత తరలిరానున్నారని తెలిపారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువతను రాజకీయాల్లోకి రావాలని ఎర్రకోట ప్రాకారాల నుంచి తాను పిలుపునిచ్చానని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: శంకర నేత్రాలయ అట్లాంటాలో శాస్త్రీయ నృత్య కార్యక్రమాలతో నిధుల సేకరణ -
ఏపీ బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు మొండిచేయి. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులకు కేటాయింపులు నిల్
-
‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!
కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న జెన్ జీ(1995-2010 మధ్య జన్మించిన వారు) పంపిన లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గతంలో లీవ్ లెటర్ అంటే ‘శ్రీయుత గౌరవనీయులైన..’ అని మొదలుపెట్టేవారు. కానీ పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టు ఆలోచనలు మారుతున్నాయి. అతిశయోక్తులకు తావు లేకుండా చెప్పాలనుకునే విషయాన్ని సూటిగా చెప్పే మనస్తత్వాన్ని జెన్జీ అలవరుచుకుంటోంది. ఏ విషయాన్ని వెల్లడించాలన్నా ఈ విధానాన్ని వీరు పాటిస్తున్నారు.ఇటీవల ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్న జెన్జీ లీవ్ కోసం తన పైఅధికారికి లీవ్ లెటర్ సబ్మిట్ చేశాడు. ఆ మెయిల్ చూసిన అధికారి దాన్ని స్కీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దాంతో ఇది వైరల్గా మారింది. తనకు లీవ్ కావాలంటూ ‘Respected Sir..’ అంటూ సంప్రదాయ పద్ధతితో లెటర్ రాయడం మొదలు పెట్టకుండా నేరుగా ‘హాయ్ సిద్దార్థ్. నేను 8 నవంబర్ 2024న సెలవులో ఉంటాను. బై’ అని మెయిల్ చేశాడు. ఇదీ చదవండి: ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!ఈ మెయిల్కు సంబంధించి సోషల్ మీడియాలో చర్చసాగుతోంది. చాలా మంది నెటిజన్లు ఆ జెన్జీ ధైర్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ మెయిల్ చూసి ఇంకొందరు రానున్న రోజుల్లో కార్యాలయ పనితీరు మారుబోతుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో జెన్జీ కమ్యునికేషన్ శైలి ఎలా ఉండబోతుందో ఈ మెయిల్ ద్వారా తెలుస్తుందని ఇంకొందరు కామెంట్ చేశారు. ‘నేను ఈ లీవ్ లెటర్ను నా మేనేజర్కు పంపితే వెంటనే అతను నా ప్రవర్తనపై చర్చించడానికి హెచ్ఆర్తో సమావేశాన్ని ఏర్పాటు చేసేవాడు’ అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. -
ప్రాణహిత నదిలో ముగ్గురు యువకులు గల్లంతు
సాక్షి,కొమురంభీంఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ మండలం సోమిని సమీపంలో ప్రాణహిత నదిలో శనివారం(అక్టోబర్ 26) ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి నదిలో స్నానానికి వెళ్లగా ముగ్గురు గల్లంతు కాగా ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు.గల్లంతైన వారిని బెజ్జూరుకు చెందిన జహార్ హుస్సేన్(24), ఇర్షద్ (20), మోయిసిధ్(22)గా గుర్తించారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏనుగుతో సెల్ఫీకి యత్నం..యువకుడి దుర్మరణం
నాగ్పూర్: సెల్ఫీ సరదా మరో నిండు ప్రాణం తీసింది. 23 ఏళ్ల ఓ యువకుడు ఏకంగా ఏనుగుతో అడవిలో సెల్ఫీ తీసుకునే సాహసం చేశాడు. ఇంకేముంది ఆ అడవి గజరాజుకు కోపం కట్టలు తెంచుకుది. శశికాంత్ రామచంద్ర అనే ఆ యువకుడిని తొండంతో కొట్టి కిందపడేసి కాళ్ల కింద తొక్కి నలిపేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం(అక్టోబర్ 24) జరిగింది. శశికాంత్ అతని స్నేహితులతో కలిసి అడవిలో కేబుల్ వేసే పని కోసం వెళ్లాడు. ఫారెస్ట్ సిబ్బంది ఎంత చెబుతున్నా వినకుండా ఏనుగులుండే ప్రదేశానికి వెళ్లి దానితో ఆటలాడి ప్రాణాలు కోల్పోయాడు. శశికాంత్ స్వస్థలం మహారాష్ట్రలోని చంద్రపూర్.ఇదీ చదవండి: ప్రాణం తీసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ -
యువతపై కృత్రిమ మేధ ప్రభావం!
అమెరికాలో ఓ యువకుని జీవితంలో అలాంటి ఘటనే జరిగింది. తన కొడుకు ఆత్మహత్యకు ఏఐ చాట్బాట్ కారణమంటూ ఫ్లోరిడాలో ఓ తల్లి కోర్టుకెక్కారు. తన 14 ఏళ్ల కొడుకు చాట్బాట్తో మానసికంగా అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడని, దాన్నుంచి భావోద్వేగపూరితమైన మెసేజ్ వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. కృత్రిమ మేధ యాప్లతో పొంచి ఉన్న కొత్తతరహా పెను ప్రమాదాలు, ఆయా యాప్లపై ఇంకా సరైన నియంత్రణ లేకపోవడాన్ని ఈ అంశం మరోసారి తెరపైకి తీసుకొచి్చంది. పట్టభద్రుడైన థెరపిస్ట్లా ప్రభావం చూపింది: తల్లి 14 ఏళ్ల సెవెల్ సెట్జర్ తరచుగా ‘క్యారెక్టర్.ఏఐ’అనే చాట్బాట్ యాప్ను ఉపయోగిస్తున్నాడు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’పాత్ర డేనెరిస్ టార్గేరియన్ను పోలిన పాత్రను సృష్టించుకుని సంభాషిస్తున్నాడు. చాట్బాట్తో వర్చువల్ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. క్యారెక్టర్.ఏఐ చాట్బాట్ టీనేజర్ అయిన తన కొడుకును లక్ష్యంగా చేసుకుందని, అతను ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత ఆ యాప్ అదేపనిగా ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తి పిల్లాడు ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలి్పందని అతని తల్లి అమెరికాలోని ఓర్లాండోలో ఫిర్యాదుచేశారు. చాట్బాట్ తన పిల్లాడిపై ఒక పట్టభద్రుడైన థెరపిస్ట్గా తీవ్ర ప్రభావం చూపించిందని ఆమె ఆరోపించారు. చనిపోవడానికి ముందు ఏఐతో జరిగిన చివరి సంభాషణలో సెవెల్ చాట్బాట్ను ప్రేమిస్తున్నానని, ‘మీ ఇంటికి వస్తాను’అని చెప్పాడని దావాలో పేర్కొన్నారు. తన కుమారుడి మరణంలో క్యారెక్టర్.ఏఐ చాట్బాట్ ప్రమేయం ఉందని తల్లి మేగన్ గార్సియా ఆరోపించారు. మరణం, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభను కలిగించినందుకు నిర్దిష్ట నష్టపరిహారాన్ని కోరుతూ గార్సియా దావా వేశారు. గూగుల్పై దావా ఈ దావాలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆగస్టులో క్యారెక్టర్.ఏఐలో గూగుల్ భారీ స్థాయిలో వాటాలను కొనుగోలుచేసింది. గూగుల్ ఆగమనంతో ఈ యాప్ అంకురసంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయిఏత క్యారెక్టర్.ఏఐ అభివృద్ధిలో తమ ప్రత్యక్ష ప్రమేయం లేదని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తమ యాప్ వినియోగదారుల్లో ఒకరిని కోల్పోవడం హృదయవిదారక విషయమని సంస్థ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక ప్రకటన చేసింది. సెవెల్ కుటుంబానికి సంతాపం తెలిపింది. ‘కృత్రిమ మేధ అనేది నిజమైన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని వినియోగదారులకు మరోసారి స్పష్టంగా గుర్తుచేస్తున్నాం. ఈ మేరకు డిస్క్లైమర్ను సవరిస్తున్నాం. భద్రతను పెంచడానికి అదనపు ఫీచర్లను జోడిస్తాం’అని సంస్థ తెలిపింది. అయితే చాట్బాట్ కారణంగా వ్యక్తి మరణం అమెరికాలో పెద్ద చర్చను లేవనెత్తింది. ఇలాంటి కృత్రిమమేథ కారణంగా ఎవరికైనా హాని జరిగితే దానికి బాధ్యులు ఎవరు?. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్న చర్చ మొదలైంది. ఇతర నియంత్రణ చట్టాల వంటి సెక్షన్ 230 అనేది కృత్రిమ మేథకు వర్తిస్తుందా అనే అంశమూ డిజిటల్ నిపుణుల చర్చల్లో ప్రస్తావనకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని, పౌర కేంద్రీకృత విధానాలను అనుసరించాలని ప్రధాని మోదీ అధికారులను కోరారు. ఇందుకు మిషన్ కర్మయోగి ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్పారు. కొత్తకొత్త ఆలోచనల కోసం స్టార్టప్లు, పరిశోధన విభాగాలు, యువత నుంచి సలహాలను స్వీకరించాలని సూచించారు. శనివారం ప్రధాని మోదీ డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నేషనల్ లెర్నింగ్ వీక్(కర్మయోగి సప్తాహ్)ను ప్రారంభించి, అధికారులనుద్దేశించి మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మరింత సులువుగా మారుతుందంటూ ఆయన..పౌరులకు సమాచారం అందించడంతోపాటు ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిపై నిఘాకు ఏఐతో వీలు కలుగుతుందన్నారు. అధికారులు వినూత్న ఆలోచనలు కలిగి ఉండాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే యంత్రాంగం అన్ని స్థాయిల్లోనూ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగుల సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా 2020లో మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. నారీ శక్తి ఆశీర్వాదమే స్ఫూర్తిమహిళల ఆశీర్వచనాలే తనకు దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు ప్రేరణను అందిస్తాయని మోదీ పేర్కొన్నారు. ‘మోదీకి కృతజ్ఞతగా అందజేయా’లంటూ ఓ గిరిజన మహిళ పట్టుబట్టి మరీ తనకు రూ.100 ఇచ్చారంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా శనివారం ‘ఎక్స్’లో షేర్ చేసిన ఫొటోలపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇది నా హృదయాన్ని కదిలించింది. నన్ను సదా ఆశీర్వదించే నారీ శక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి ఆశీస్సులే నాకు నిత్యం ప్రేరణగా నిలుస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు.నేడు వారణాసికి ప్రధాని మోదీ ప్రధాని ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు. శంకర నేత్రాలయం సహా రూ.6,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. -
‘నెట్టింట’ యువతరం
స్మార్ట్ఫోన్ సాయంతో యువతకు ఇంటర్నెట్ చేరువ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో 82 శాతం మంది (15–24 ఏళ్ల వయసులోని వారు), పట్టణాల్లో 92 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ సర్వేలో తెలిసింది. 15–24 ఏళ్ల వయసులోని 95.7 శాతం గ్రామీణ యువత మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. పట్టణాల్లో ఇది 97 శాతంగా ఉంది. కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ ‘కాంప్రహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే’ (సీఏఎంఎస్) వివరాలను విడుదల చేసింది. 79వ జాతీయ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్)లో భాగంగా ఇది జరిగింది. ఇదీ చదవండి: గాల్లో ఎగిరిన ‘టాటా సుమో’.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..సర్వే వివరాలు..15–24 ఏళ్లలోని 78.4 శాతం యువత అటాచ్డ్ ఫైల్స్తో మెస్సేజ్లు పంపుకుంటున్నారు. 71.2 శాతం మంది కాపీ–పేస్ట్ టూల్స్ వాడుతున్నారు. 26.8 శాతం మంది సమాచారం కోసం శోధిస్తున్నారు. అలాగే, మెయిల్స్ పంపడం, ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. 95.1 శాతం ఇళ్లల్లో టెలిఫోన్/మొబైల్ ఫోన్ సదుపాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 94.2 శాతంగా ఉంటే, పట్టణాల్లో 97.1 శాతం ఇళ్లకు ఈ సదుపాయం ఉందని సర్వేలో తెలిసింది.9.9 శాతం ఇళ్లల్లోనే డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ సదుపాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 4.2 శాతం ఇళ్లకే ఈ సదుపాయం ఉంటే, పట్టణాల్లో 21.6 శాతంగా ఉంది.96.9 శాతం మంది యువతీ యువకులు సులభంగా ఉండే ప్రకటనలు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం చేస్తున్నారు. సులభమైన లెక్కలు వేయగలుగుతున్నారు. పురుషుల్లో ఇలాంటి వారు 97.8 శాతంగా ఉంటే, మహిళల్లో 95.9 శాతంగా ఉన్నారు.ఆస్పత్రిపాలైనప్పుడు వైద్యం కోసం జేబులోంచి చేస్తున్న ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కో కుటుంబం నుంచి ఏడాదికి రూ.4,129గా ఉంటే, పట్టణాల్లో రూ.5,290గా ఉంది. అదే ఆస్పత్రిలో చేరకుండా పొందే వైద్యం కోసం గడిచిన 30 రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటివారు రూ.539 ఖర్చు చేయగా, పట్టణ ప్రాంతాల్లో ఇది రూ.606గా ఉంది.బస్సు, కారు, ట్యాక్సీ, ఆటో వంటి చౌక ప్రజా రవాణా సాధనాలను పట్టణాల్లోని 93.7 శాతం మంది సౌకర్యవంతంగా పొందుతున్నారు. విద్య, ఉపాధి, శిక్షణ పొందని యువత గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం మేర ఉంటే, పట్టణాల్లో 19 శాతం ఉన్నారు. -
గ్యారెంటీలపై నిలదీయండి: యువతకు హరీశ్రావు పిలుపు
సాక్షి,హైదరాబాద్:గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. ఈ మేరకు ఆదివారం(అక్టోబర్6) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.‘గ్యారెంటీలు అమలు చేయలేకపోగా,మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు,రైతు బంధును నిలిపివేశారు,రైతు భరోసా దిక్కులేకుండా పోయింది,బోనస్ను బోగస్ చేశారు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు,పది నెలలు గడిచాయి వాటికి అతీ గతి లేదు.నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారు.ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు,స్నేహితులతో అలయ్-బలయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండి.మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు,రైతు డిక్లరేషన్,యూత్ డిక్లరేషన్,ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్,మైనారిటీ డిక్లరేషన్,బీసీ డిక్లరేషన్లపై ఎక్కడిక్కడ నిలదీయండి’అని హరీశ్రావు యువతకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూఠిఫికేషన్: కేటీఆర్ -
అకడమిక్ ప్రెజర్తో తస్మాత్ జాగ్రత్త!
యవ్వనం అంటేనే ఒక తుఫాను. అనేకానేక శారీరక, మానసిక, భావోద్వేగ, హార్మోన్ల మార్పులు ఒక్కసారిగా చుట్టుముడతాయి. వాటిని అర్థం చేసుకోలేక యువత ఒత్తిడికి లోనవుతుంటారు. ఇవి చాలవన్నట్టు పదోతరగతి, ఇంటర్మీడియట్లలో చదువుల ఒత్తిడి పెరుగుతోంది. అది ప్రాణాలు బలికోరేంత ప్రమాదకరంగా మారుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (Nఇఖఆ) డేటా ప్రకారం 2020లో సుమారు 10,500 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల్లో 40 శాతం చదువుల ఒత్తిడితో ముడిపడి ఉన్నవేనని విద్యా మంత్రిత్వ శాఖ నివేదికలో పేర్కొంది. మరికొందరు తీవ్ర మానసిక సమస్యలకు లోనవుతున్నట్లు తేలింది. తల్లిదండ్రులు, కార్పొరేట్ కాలేజీలు..తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తూ తల్లిదండ్రులు చదువు విషయంలో పిల్లల మీద వాళ్ల స్థాయికి మించిన ఒత్తిడి పెడుతున్నారు. ఇంట్లో ఉంటే చదువుకు ఇబ్బంది పడతారని హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. ఇక కార్పొరేట్ కళాశాలలు కల్పించే ఒత్తిడి చెప్పనలవికాదు. వారం వారం పరీక్షలు నిర్వహిస్తూ, వాటిలో వచ్చే మార్కులను బట్టి క్లాసులు మారుస్తూ మరింత ఒత్తిడి పెంచుతున్నారు.‡ తూతూమంత్రంలా ఏడాది చివర స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారు. మొదటిసారి ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉండటం, ఆటపాటలు, వ్యాయామం లేకుండా నిరంతరం పరీక్షలు, గ్రేడ్ పాయింట్లు, ర్యాంకులు వంటివన్నీ విద్యార్థుల ఆత్మవిశ్వాసంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. పర్ఫెక్షనిజం ప్రభావం.. ఇన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో ఎలాగైనా సక్సెస్ సాధించాలని టీనేజర్లు భావిస్తారు. అందుకోసం అసాధ్యమైన టార్గెట్స్ పెట్టుకుంటారు. వాటిని సాధించేందుకు నిద్రమాని చదువుతుంటారు. కానీ పర్ఫెక్షనిజం ఫిక్స్డ్ మైండ్సెట్కు దారితీస్తుంది. చదువుకూ, వ్యక్తిత్వానికీ తేడా తెలుసుకోలేరు. పర్ఫెక్షనిజం వల్ల తమ తెలివితేటలు, సామర్థ్యాలు స్థిరంగా ఉంటాయని టీనేజర్లు నమ్ముతారు. ఇది వైఫల్యాలు శాశ్వతమని భావించేట్లు చేస్తుంది. దీంతో చిన్న ఫెయిల్యూర్ ఎదురైనా తట్టుకోలేక ఆందోళన, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలకు లోనవుతున్నారు. ఇష్టంలేని చదువులు..చాలామంది విద్యార్థులు క్రీడలు, సంగీతం, డిస్కష¯Œ ్స, వాలంటీరింగ్ లాంటి భిన్న రంగాల్లో రాణించాలనుకుంటారు. కానీ ఆ వైపుగా ప్రోత్సహించే తల్లిదండ్రులు తక్కువ. దాంతో ఇష్టంలేని చదువులు టీనేజర్లలో ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు వారం వారం పరీక్షలు, మార్కులు, గ్రేడ్లు– టీనేజర్లను మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాలపరంగా పూర్తిగా అలసిపోయేలా చేస్తున్నాయి. ప్రతి పనికీ వంద శాతం సమయం ఇవ్వలేకపోతున్నామనే అపరాధభావానికి లోనుచేస్తున్నాయి.బ్యాలెన్స్ ముఖ్యం.. అకడమిక్ ప్రెజర్ తగ్గాలంటే టీనేజర్లను తమకు నచ్చింది చదవనివ్వాలి. ఏం చదివామనేది కాదు, ఎలా చదివామనేది ముఖ్యమని తల్లిదండ్రులు గ్రహించాలి. ఇష్టంగా చదివినప్పుడు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. చదువుతో పాటు స్పోర్ట్స్ లేదా వ్యాయామానికి అవకాశం కల్పించాలి. కేవలం మార్కులు, ర్యాంకులు సాధించడం మాత్రమే సక్సెస్ అని భావించకుండా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆనందమే అసలైన సక్సెస్ అని నిర్వచించాలి.చదువుల ఒత్తిడికి కారణాలు.. 👉తమ పిల్లలు అత్యున్నత కెరీర్లో ఉండాలనే తల్లిదండ్రుల అంచనాలు · ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలు, ఉన్నత విద్యాసంస్థల కోసం తీవ్ర పోటీ · క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ కన్నా మార్కులు, ర్యాంకులపైనే ఎక్కువ దృష్టి పెట్టడం · పాఠశాలల్లో, కళాశాలల్లో కౌన్సెలింగ్ సౌకర్యాలు తక్కువగా ఉండటం 👉 ఆటపాటలకు అవకాశం లేకపోవడం, కోచింగ్, ట్యూషన్ల వల్ల అదనపు భారం · తగిన వనరుల్లేకుండానే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణ విద్యార్థులతో పోటీ 👉 అకడమిక్స్ను, ట్రెడిషనల్ జెండర్ రోల్స్ను బ్యాలెన్స్ చేయడానికి యువతులపై అదనపు ఒత్తిడిఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యూహాలు.. 👉 మీ బలాలను అర్థం చేసుకుని వాస్తవిక లక్ష్యాలను పెట్టుకోండి · తప్పులు, వైఫల్యాలను అర్థం చేసుకుని, వాటిని సవాళ్లుగా తీసుకుని ముందుకు సాగే గ్రోత్ మైండ్ సెట్ను పెంపొందించుకోండి · చదువు ఎంత ముఖ్యమో నిద్ర, వ్యాయామం, విశ్రాంతి కూడా అంతే ముఖ్యమని గుర్తించండి · సరైన టైమ్ మేనేజ్మెంట్ పద్ధతులు నేర్చుకుని, అమల్లో పెట్టండి · ఒత్తిడిని ఎదుర్కోలేకపోతున్నప్పుడు మీలో మీరే బాధపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సైకాలజిస్టుల సహాయం తీసుకోండి. -
యువత... మరింత క్రియాశీలంగా!
కౌమారదశ అనేది మానవ అభివృద్ధిలో ప్రత్యేకమైన, క్లిష్టమైన దశ. మంచి ఆరోగ్యానికి దీర్ఘకాలిక పునాదులు వేయడానికి కీలకమైన దశ. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ‘ఫ్యూచర్ సమ్మిట్’లో ‘ట్రెండ్స్ ఇన్ అడల్సెంట్ హెల్త్: సక్సెస్ అండ్ చాలెంజెస్ ఫ్రమ్ 2010 టు ది ప్రజెంట్’ పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేశారు. కౌమరుల ఆరోగ్యం, అలవాట్లౖను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన నివేదిక ఇది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... కౌమారదశలో ఉన్న ఏడుమందిలో ఒకరు మానసిక రుగ్మతతో బాథపడుతున్నారు. నిరాశ, ఆందోళన అనేవి వారిలో తీవ్రంగా కనిపిస్తున్నాయి.కౌమార బాలికలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంది. కౌమారదశలో ఉన్న పదిమందిలో ఒకరు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. యువతలో లైంగిక సంక్రమణ అంటువ్యాధులు పెరుగుతున్నాయని, హింసాత్మక ఘటనలు యువత శారీరక, మానసిక ఆరోగ్యంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని ఈ నివేదిక చెబుతుంది. కౌమారుల ఆరోగ్యం, హక్కులను పరిరక్షించే చట్టాలను అమలు చేయాలని, పరిశోధన, విధాన రూపకల్పనలో యువత నిమగ్నం కావాలని అధ్యయన కర్తలు కోరుతున్నారు. యువత ఏం కోరుకుంటున్నారో నాయకులు వినాలని, వారు క్రియాశీల భాగస్వాములుగా, నిర్ణయాలు తీసుకునేవారిగా ఉండేలా చూడాలన్నారు.ఇవి చదవండి: Intips: ఈ పదార్థాలకు పురుగు పట్టకుండా.. ఇలా చేయండి! -
రైతులు, మహిళలకు సంక్షేమ పథకాలు
శ్రీనగర్: త్వరలో జరిగే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సోమవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే రైతులు, మ హిళలు, యువత కోసం పలు సంక్షేమ పథకాల ను అమలు చేస్తామని ప్రకటించింది. ప్రకృతి వైపరీ త్యాలతో నష్టపోయే అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం, యాపిల్కు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ ) కిలోకు రూ.72 అమలు చేస్తామంది. శ్రీనగర్లోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్ర మంలో ఏఐసీసీ ప్రతినిధి పవన్ ఖేరా, పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా మేనిఫెస్టోను విడుదల చేశారు. కౌలు రైతులకు సాయంభూమిలేని, కౌలుదార్లకు ఏటా అదనంగా రూ.4 వేల ఆర్థిక సాయం. రైతులకు సాగు భూములను 99 ఏళ్లకు లీజుకివ్వడం. సాగు భూములను 100 శాతం సాగులోకి తెచ్చేందుకు జిల్లా స్థాయి సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2,500 కోట్లతో నిధి ఏర్పాటు.నిరుద్యోగ యువతకు..జమ్మూకశ్మీర్లోని అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,500 చొప్పున ఏడాదిపాటు అలయెన్స్. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల. ఖాళీగా ఉన్న లక్ష ప్రభుత్వ పోస్టుల భర్తీ. పోలీసు, ఫైర్, ఫారెస్ట్ పోస్టుల భర్తీకి ప్రత్యేక రిక్రూట్మెంట్ కార్యక్రమం. నిర్మాణ రంగ పనుల్లో నిరుద్యోగ ఇంజినీర్లకు 30 శాతం ఇచ్చే పథకం పునరుద్ధరణ. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమయంలో, పాస్పోర్టులు, ఇతర అవసరాల కోసం ధ్రువీకరణ పత్రాల పరిశీలన సులభతరం చేయడం.మహిళలకు నెలకు రూ.3 వేలుభారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ, ఇతర నేతలు ఇచ్చిన హామీల మేరకు మహిళా సమ్మాన్ కార్యక్రమం అమలు. ఇందులో భాగంగా కుటుంబ యజమాని అయిన మహిళకు నెలకు రూ.3 వేలు చొప్పున సాయం అందజేత. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మైనారిటీ కమిషన్ ఏర్పాటు. కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పిస్తామంటూ గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీ అమలు. -
Uttar Pradesh: మెట్రో స్టేషన్ వద్ద కాల్పులు.. యువకుని మృతి
నోయిడా: యూపీలోని నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. సెక్టార్ 137 మెట్రో స్టేషన్ దిగువన ఒక యువకునిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో కలకలం చెలరేగింది. నిందితులను పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం నోయిడా సెక్టార్ 137 మెట్రో స్టేషన్ దిగువన ఉన్న ఫుడ్ కోర్టులో ఒక యువకునిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడిని నవేంద్ర కుమార్ ఝాగా పోలీసులు గుర్తించారు.ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశామని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ ఘటన గురించి అదనపు సీపీ శివ హరి మీనా మాట్లాడుతూ ఆస్తి విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోందని, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరువర్గాలు మెట్రో స్టేషన్ 137 కింద సమావేశమయ్యాయన్నారు. అయితే ఇంతలోనే ఒక వర్గానికి చెందిన వారు నవేంద్ర కుమార్ ఝాపై కాల్పులు జరిపారన్నారు.బుల్లెట్ నవేంద్ర తలకు తగిలిందని, ఆసుపత్రిలో చేర్పించాక అక్కడ మృతి చెందాడన్నారు. నవేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాల్పులు జరిపినవారిని గుర్తించామని, ఇరువర్గాలు వారు ఘజియాబాద్కు చెందినవారని పోలీసులు తెలిపారు. సెక్టార్ 82లోని ఆస్తి విషయంలో వీరి మధ్య వివాదం నడుస్తోందన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: విదేశీయుల్లా ఉన్నారంటూ బాలికలకు వేధింపులు -
అపస్మారక స్థితిలో రాత్రంతా రోడ్డుపైనే..
భవానీపురం(విజయవాడ పశ్చిమ): మందుల కోసం వెళ్లి వరద నీటిలో మునిగిన ఓ యువకుడు.. రాత్రంతా రోడ్డుపైనే ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. విజయవాడలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నక్కా ప్రభుదాస్ తన కుటుంబసభ్యులతో కలిసి వైఎస్సార్ కాలనీ బ్లాక్ 129లో నివసిస్తున్నాడు. బుడమేరుకు వరద రావడంతో సమీపంలో నివసిస్తున్న ఆయన అత్త సామ్రాజ్యం కూడా వారి వద్దకే వచ్చింది. ప్రభుదాస్ కుమారుడు ప్రశాంత్(24) గత ఆదివారం సాయంత్రం అమ్మమ్మ మందుల కోసం వరద నీటిలో ఆమె ఇంటికి వెళ్లాడు. మందులు తీసుకుని తిరిగి వస్తూ నీళ్లలో పడిపోయిన ప్రశాంత్ను స్థానికులు కాపాడి.. ఓ పడవలో ఎక్కించారు. ఆ పడవ నడిపే వ్యక్తి ప్రశాంత్ను నైనవరం ఫ్లై ఓవర్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అప్పటికే స్పృహ తప్పిన ప్రశాంత్ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. సోమవారం ఉదయం పది గంటలకు తెలిసిన వ్యక్తి.. ప్రశాంత్ను గుర్తించి ఇంటికి చేర్చాడు. ప్రశాంత్ పరిస్థితి సీరియస్గా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్కు తరలించారు. తన కుమారుడికి వైద్యం కోసం దాతలు సాయం చేయాలని ప్రభుదాస్ కోరుతున్నాడు.పడవలోనే ప్రసవంతల్లీబిడ్డ క్షేమంనిండు గర్భిణికి నొప్పులు వస్తున్నాయని..ఆమెకు సహాయం అందించాలని వీఎంసీ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంకు సమాచారం వచి్చంది. ఆమెను బోటులో ఆస్పత్రికి తరలిస్తుండగానే అందులోనే డెలివరీ అయ్యింది. వాంబే కాలనీకి చెందిన షకీనాబీకి శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు నొప్పులు వచ్చాయి. ఆమెను సింగ్నగర్ ఫ్లై ఓవర్ వరకు తరలించే దారిలో, నొప్పులు అధికంగా రావటంతో విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన బోటులోనే షకీనాబీకి ప్రసవమైంది. విజయవాడ నగర పాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ వారి బృందం అజిత్ సింగనగర్ ఫ్లై ఓవర్ వద్దకు బోటును తీసుకువచ్చాక అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. –పటమట (విజయవాడ తూర్పు) -
లోన్యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య
సాక్షి,కుత్బుల్లాపూర్: లోన్యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కుత్బుల్లాపూర్కు చెందిన విద్యార్థి భానుప్రకాష్(22) పేట్బషీరాబాద్ పీఎస్ పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం శుక్రవారం(సెప్టెంబర్6) వెలుగులోకి వచ్చింది. భానుప్రకాష్ మృతిపై గురువారం జీడిమెట్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. భానుప్రకాష్ ఆరోరా కళాశాలలో పీజీ చదువుతున్నాడు. మొబైల్ఫోన్ లొకేషన్ ద్వారా భానుప్రకాష్ ఆచూకీ కనుక్కున్నారు. చెరువు వద్దకు వెళ్లి చూడగా అతని దుస్తులు,వాహనం గట్టుపై ఉండటంతో పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు చెరువు నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి మొబైల్లో లోన్ యాప్ కు సంబంధించిన చాటింగ్ లభ్యమైంది. -
రీల్స్ పిచ్చి: పాము కాటుకు యువకుడు బలి
సాక్షి,కామారెడ్డిజిల్లా: సోషల్మీడియాలో పాపులర్ అవ్వాలన్న కోరిక మరో ప్రాణాన్ని బలిగొన్నది. సాహసం చేసి పేరుతెచ్చుకునే మాట అటుంచితే యుక్త వయస్సులోనే ఆయుష్షు పూర్తయిపోయింది. కామారెడ్డి జిల్లా దేశాయిపేటలో శుక్రవారం(సెప్టెంబర్6) విషాద ఘటన జరిగింది. సోషల్మీడియాలో వైరల్ అయ్యేందుకు శివరాజు అనే యువకుడు ఏకంగా విష సర్పాన్నే నోటితో కరిచి పట్టుకున్నాడు. ఈ దృశ్యాలను వీడియో తీయాల్సిందిగా స్నేహితులకు చెప్పాడు. ఇంకేముంది షరామామూలుగానే పాము తన సహజ స్వభావంతో యువకున్ని కాటు వేసింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శివరాజును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివరాజు తుద్విశ్వాస విడిచాడు. యువకుడు అకారణంగా చనిపోవడంపై కుటుంబసభ్యులు కనీరుమున్నీరవుతున్నారు. పాముకాటుతో మృతిచెందిన శివరాజు ఇటీవల పాములు పట్టడంలో శిక్షణ పొందుతున్నట్లు తెలిసింది. -
లావోస్లో సైబర్ బానిసలు..
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగం అంటే ఎవరికైనా సంబరమే. మంచి జీతం, జీవితం లభిస్తాయన్న నమ్మకంతో విదేశాలకు వెళ్తుంటారు. ఇండియా నుంచి చాలామంది ఇలాగే లావోస్కు చేరుకొని, సైబర్ నేరాల ముఠాల చేతుల్లో చిక్కుకొని అష్టకష్టాలు పడుతున్నారు. సైబర్ బానిసలుగా మారుతున్నారు. కొన్ని ముఠాలు ఉద్యోగాల పేరిట యువతపై వల విసిరి లావోస్కు తీసుకెళ్తున్నాయి. అక్కడికెళ్లాక వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నాయి. ఇండియాలోని జనానికి ఫోన్లు చేసి, ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టడమే ఈ సైబర్ బానిసల పని. మాట వినకపోతే వేధింపులు, దాడులు తప్పవు. లావోస్లో బొకియో ప్రావిన్స్లోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో ఏర్పాటైన సైబర్ స్కామ్ సెంటర్లలో చిక్కుకున్న 47 మంది భారతీయులను అక్కడి అధికారులు శనివారం రక్షించారు. వీరిని లావోస్లోని భారత రాయబార కార్యాలయంలో అప్పగించారు. బాధితుల్లో 30 మందిని క్షేమంగా స్వదేశానికి తరలించినట్లు రాయబార కార్యాలయం అధికారులు చెప్పారు. మిగిలినవారిని సాధ్యమైనంత త్వరగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉచ్చులోకి యువత ఉద్యోగం కోసం ఆశపడి ఉచ్చులో చిక్కుకున్న యువకులను సైబర్ నేరగాళ్లు లావోస్కు పంపిస్తున్నారు. అక్కడికి చేరగానే పాస్పోర్టు లాక్కుంటారు. బయటకు వెళ్లనివ్వరు. స్కామ్ సెంటర్లలో ఉండిపోవాల్సిందే. యువతుల మాదిరిగా గొంతు మార్చి ఫోన్లలో మాట్లాడాల్సి ఉంటుంది. నకిలీ యాప్లలో, ఫేక్ సోషల్ మీడియా ఖాతాల్లో అందమైన యువతుల ఫొటోలు పెట్టి జనాన్ని బురిడి కొట్టించాలి. రోజువారీ లక్ష్యాలు ఉంటాయి. నిర్దేశించినంత డబ్బు కొల్లగొట్టకపోతే కఠినమైన శిక్షలు విధిస్తారు. జాబ్ ఆఫర్ అంటే గుడ్డిగా అంగీకరించొద్దు ఉద్యోగాల కోసం లావోస్ వెళ్లి, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న 635 మంది భారతీయులను అధికారులు గతంలో రక్షించారు. గత నెలలో ఇండియన్ ఎంబసీ 13 మందిని కాపాడింది. వారిని భారత్కు తిరిగి పంపించింది. లావోస్, కాంబోడియా జాబ్ ఆఫర్లు వస్తే గుడ్డిగా అంగీకరించవద్దని, చాలావరకు సైబర్ మోసాలకు సంబంధించినవే ఉంటాయని, యువత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గత నెలలో లావోస్లో పర్యటించారు. నేరగాళ్ల ముఠాలు భారతీయ యువతను లావోస్ రప్పించి, బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తుండడంపై లావోస్ ప్రధానమంత్రితో చర్చించారు. సైబర్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
బాలుడిపై యువకుల పాశవిక దాడి
చుండూరు (కొల్లూరు): కొందరు యువకులు మద్యం మత్తులో ఓ బాలుడిపై అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొడుతూ వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు... బాపట్ల జిల్లా చుండూరు మండలం చినపరిమికి చెందిన బాలుడు(17) ఒంగోలు వెళ్లి తన పెదనాన్న వద్ద ఉంటూ కుట్టుపని నేర్చుకుంటున్నాడు. అతను కొన్ని రోజుల కిందట గ్రామానికి వచ్చి అనారోగ్యం వల్ల ఒంగోలు వెళ్లలేదు.గత నెల 31న ఆ బాలుడి వద్దకు తనతో కలిసి చదువుకున్న స్నేహితుడు సూర్య, మరో యువకుడు బైక్పై వచ్చి సరదాగా బయటకు వెళదామని చెప్పి మండూరు చర్చి డొంక రోడ్డులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడున్న మరో ముగ్గురు యువకులు మద్యం తాగి ఆ బాలుడిని కూడా బీరు తాగాలని ఒత్తిడి చేశారు. అందరూ మద్యం తాగుతుండగా, చినగాదెలవర్రుకు చెందిన దయా, ఆలపాడుకు చెందిన చిన్ను అనే వ్యక్తులు వచ్చి వారితో కలిశారు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా యువకులందరూ కలిసి ఆ బాలుడిని దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. కాళ్లు, చేతులు, కర్రలు, బెల్టులతో పైశాచికంగా కొడుతూ అతని చొక్కా చింపేశారు. సుమారు రెండు గంటలు దాడి చేస్తూ వీడియోలు తీశారు. ప్రమాదమని చెప్పి ఆస్పత్రిలో చేర్పించేందుకు ప్రయత్నం.. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఇద్దరు యువకులు ఆటోలో తెనాలి తీసుకువెళ్లి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి ఆస్పత్రిలో చేరి్పంచేందుకు ప్రయతి్నంచారు. అయితే, ఇది ప్రమాదం కాదని, కొట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని వైద్యులు సూచించారు. దీంతో బాధితుడిని ఆ యువకులు బయటకు తీసుకురాగా, బాలుడికి తెలిసిన వ్యక్తి చూసి ఏమైందని ప్రశి్నంచడంతో యువకులు పారిపోయారు. అతను బాధిత బాలుడిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చేరి్పంచాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు చుండూరు ఎస్ఐ మహ్మద్ రఫీ ఈ నెల ఒకటో తేదీన కూచిపూడి, తెనాలి, పరిమి, గాదెలవర్రు, ఆలపాడుకు చెందిన ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారిపై 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే, దాడికి పాల్పడిన యువకులు అధికార పారీ్టకి చెందినవారు కావడంతో రాజీ చేయాలని వేమూరుకు చెందిన ముఖ్య నేత, పార్లమెంట్ స్థాయి నేత ఒకరు పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో దాడికి పాల్పడినవారికి స్టేషన్ బెయిల్ ఇచ్చేంత చిన్న కేసులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.బైక్ల చోరీ కేసులలో పట్టించానని కొట్టారు జూలై 31వ తేదీన నడుచుకుంటూ ఇంటికి వెళుతుంటే చినపరిమి గ్రామానికే చెందిన నా స్నేహితుడు సూర్య బైక్పై ఎక్కించుకెళ్లాడు. మండూరు గ్రామం సమీపంలోకి తీసుకెళ్లి బీరు తాగించి కొట్టడం ప్రారంభించారు. సూర్యతోపాటు చినగాదెలవర్రుకు చెందిన యువకుడు దయ, మరో ఐదుగురు ఉన్నారు. తెనాలిలో నన్ను కాల్వలో పడేద్దామని తీసుకెళుతుంటే మా ఊరి వ్యక్తి కనిపించాడు. ఆయన సాయంతో వైద్యశాలలో చేరాను. గతంలో బైక్ల చోరీ విషయంలో దయా అనే వ్యక్తిని పోలీసులకు పట్టించానన్న కక్షతో నన్ను కొట్టారు. – బాధిత బాలుడు -
వయనాడ్ : ప్రాణాలకు తెగించి ఎంతోమందిని కాపాడిన ‘దేవుడు’ మాయం!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలోని వయనాడ్లో ప్రకృతి ప్రకోపం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వందలాదిమందిని పొట్టన పెట్టుకుంది. సర్వం కోల్పోయిన అభాగ్య జనం బిక్కుబిక్కు మంటున్నారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుండగానే, తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఎంతోమంది బాధితులను రక్షించిన యువకుడు మరిన్ని ప్రయత్నాల్లో ఉండగానే కనిపించకుండా పోవడం ఆందోళన రేపుతోంది. దీంతో మా సూపర్ హీరో, మా రక్షకుడు, మా దేవుడు ఏమయ్యాడు అంటూ స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.వయనాడ్లోని కొండచరియలు విరిగిపడటంతో స్థానిక కుర్రాడు ప్రజీష్ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. తనజీపులో రెండుసార్లు ప్రమాదకరమైన కొండ మార్గం గుండా వెళ్లి కొంతమందిని ప్రాణాలతో కాపాడాడు. ఈ క్రమంలోనే మూడో సారి వెళ్లి కనిపించకుండా పోయాడు. మరోవైపు చూరల్మల వద్ద పాడైపోయిన అతని జీప్ కనిపించింది. దీంతో మరింత ఆందోళన రేపింది. వరద నీరు , బురద , దొర్లి పడిన భారీ బండరాళ్ల మధ్య ఎక్కడ చిక్కుకుపోయాడో అని బాధపడుతున్నారు. పలుమార్లు తమ కష్టనష్టాల్లో తోడుగా నిలిచి "సూపర్ హీరో"గా పేరుతెచ్చుకున్న తమ ప్రజీష్ క్షేమంగా తిరిగి రావాలంటూ బరువెక్కిన హృదయంతో, కన్నీటితో ఆ దేవుడ్ని వేడుకుంటున్నారు.కొండపైకి వెళ్లవద్దని ఎంత హెచ్చరించినా, అక్కడ ఎంతోమంది చిక్కుకుపోయారు, వాళ్లని రక్షించాలన్న ప్రయత్నాల్లో అవన్నీ పట్టించుకోలేదని ప్రజీష్ స్నేహితులు తెలిపారు. ముండక్కై కుగ్రామంలో కొండ చరియలు విరిగిపడటం గురించి విన్న తర్వాత, ప్రజీష్ రెండుసార్లు కొండపైకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన చాలా మందిని రక్షించాడని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లబోతుండగా మరో ఫోన్ కాల్ రావడంతో మళ్లీ కొండపైకి వెళ్లాడు. ఈసారి మాత్రం తిరిగి రాలేదని వాపోతున్నారు.పెళ్లి, చావైనా మొదటి నుంచి చివరి వరకూ అండగా ఉండేవాడని, గ్రామంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఉండేవాడు, తలలో నాలుకలో ఉండేవాడు, అందరికీ ఇష్టమైన వ్యక్ అంటూ తి మరో గ్రామస్థుడు గుర్తు చేసుకున్నారు. "ప్రజీష్ మా భూమికి సూపర్ హీరో.. కానీ ఇప్పుడు అతడే కనిపించడం లేదు" అని ఒక గ్రామస్థుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఏ క్షణానఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో అని వణికిపో తున్నారు.ఇదీ చదవండి : వయనాడ్ విలయం : గుండెల్ని పిండేస్తున్నమహిళ ఫోన్ రికార్డింగ్ -
దేశాన్ని కమ్మేస్తున్న మత్తు మబ్బులు.. సినిమా ప్రభావమా?.. వ్యవస్థలో లోపమా ?
-
పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకులు మృతి
సాక్షి,సంగారెడ్డిజిల్లా: మహారాష్ట్రలోని పుణె నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు యువకులు అజ్మీర్ దర్గా సందర్శన కోసం వెళ్లారు. దర్గా సందర్శించుకుని తిరిగి వస్తుండగా పుణె శివారులోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, ఖురేషి, రఫిక్, ఫిరోజ్ కురేషి, మజీద్ పటేల్ ప్రమాద స్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ అమర్ను పుణెలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు. -
Rambabu Muppidi: జ్యూట్ బ్యాగులపైన భారతీయ కళ
కళాకారులు మనదైన ఆత్మను కళ ద్వారా జీవం పోస్తారు. ఆ కళను నలుగురికి పరిచయం చేయడమే కాకుండా దానిని ఉపాధి వనరుగా మార్చి మరికొంత మందికి చేయూతగా నిలుస్తున్నారు డాక్టర్ ముప్పిడి రాంబాబు. హైదరాబాద్ రాయదుర్గంలో ఉంటున్న ఈ కళాకారుడు ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైనింగ్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరేళ్లుగా మహిళలకు, యువతకు జ్యూట్ బ్యాగ్ల తయారీలో ఉచితంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలోని మహిళలకు శిక్షణ ఇస్తున్న సందర్భంగా భారతీయ కళను జ్యూట్ బ్యాగుల మీదకు ఏ విధంగా తీసుకువస్తున్నారో తెలియజేశారు.‘‘జ్యూట్ బ్యాగుల తయారీ సాధారణమే కదా అనుకుంటారు. కానీ, ఇండియన్ ఆర్ట్ మోటిఫ్స్ కలంకారీ, చేర్యాల, వర్లీ, గోండు, పటచిత్ర, మధుబని... డిజైన్స్ను ఉపయోగిస్తూ, స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా జ్యూట్ మీదకు తీసుకువస్తున్నాం. దీని ద్వారా జ్యూట్కి కొత్త కళ వస్తుంది. అలాగే, మొన్నటి ఏరువాక పౌర్ణమిని దృష్టిలో పెట్టుకొని రైతు పొలం పనులకు వెళ్లే డిజైన్ని తీసుకువచ్చాను. ఈ కళ ద్వారా పర్యావరణ హితం, మనదైన ఆత్మను పరిచయం చేస్తున్నాం.ఉపాధికి మార్గంకరీంనగర్, ఏలూరు, జంగారెడ్డి గూడెం, పార్వతీ పురం, బొబ్బలి.. మొదలైన ప్రాంతాలలో ఉచితంగా శిక్షణ ఇస్తూ వచ్చాను. నేషనల్ జ్యూట్ బోర్డ్ వాళ్లునన్ను సర్టిఫైడ్ డిజైనర్గా తీసుకున్నారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ స్కిల్ క్రాఫ్ట్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ప్రస్తుతం మన్యం జిల్లా పార్వతీపురంలో 24 మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. 45 రోజుల శిక్షణ కార్యక్రమంలో బ్యాగుల తయారీ, స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకుంటున్నారు. ఇప్పటికే బ్యాగుల తయారీ నేర్చుకున్నవారు, సొంతంగా ఉపాధి మార్గాలను పొందుతున్నారు. ఈ స్కిల్ ప్రోగ్రామ్లో పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్నవారు ఉన్నారు. బ్యాగులే కాకుండా పాదరక్షలు, లెదర్ బ్యాగులు, వైర్లతో చెయిర్లు, ఇతర యాక్సెసరీస్ తయారుచేస్తుంటాను. వీటితో కంప్యూటర్ ఆధారిత త్రీడీ సాఫ్ట్వేర్ డిజైన్లు కూడా ΄్లాన్ చేస్తుంటాను.కళాకారులను కలిసి...మా ఊరు పశ్చిమగోదావరి దగ్గరిలోని జంగారెడ్డి గూడెం. సినిమా నటుల బ్యానర్లను సృజనాత్మకంగా తయారు చేసి, అందించిన కుటుంబం మాది. నాకున్న పెయింటింగ్ ఆసక్తిని మా అన్నయ్య శ్రీనిసవాసరావు గుర్తించాడు. దీంతో ఇంటర్మీడియెట్ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పైన పూర్తి దృష్టి పెట్టాను. ముంబయ్ నిప్ట్ నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ చేశాను. స్కూల్ చదువు నుంచి డాక్టరేట్ చేసేవరకు మా అన్నయ్యప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎఫ్డిఐలో ఉద్యోగం చేస్తున్నాను. సాంకేతికంగానూ భారతీయ కళను క్రాఫ్ట్ తయారీలో ఎలా మేళవించవచ్చో పరిశోధన, ్రపాక్టీస్ చేస్తుంటాను. రాబోయే తరాల కోసం క్రాఫ్ట్స్ని డిజిటలైజేషన్ చేసే పనిలో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న హస్తకళాకారులను నేరుగా కలుసుకొని చేసిన పరిశోధనకు బంగారు పతకాన్ని అందుకున్నాను. నా పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలను జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో మన కళ, కళాకారుల ప్రత్యేకతను తెలియ జేయడం అదృష్టంగా భావిస్తాను. ఏటి కొ΄్పాక కొయ్యబొమ్మల కళాకారులతో కలిసి, బొమ్మల తయారీ నేర్చుకున్నాను. నేను తయారు చేసిన కొయ్య బొమ్మలకు డిజైన్లకు, పేపర్ బాస్కెట్ డిజైన్స్కి పేటెంట్ హక్కులు ΄పొందాను. కళను భవిష్యత్తు తరాలు గుర్తించేలా మరింత సృజనతో మెరుగ్గా తీర్చిదిద్దాలని.. దీని ద్వారా యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నాను’ అని చె΄్పారు రాంబాబు. ఈ కళాకారుడు తన పనిలో సంపూర్ణ విజయాన్ని సాధించాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
Social Media: ఈ వ్యసనం ప్రాణాంతకం
15 సెకన్ల రీల్స్ కోసం నూరేళ్ల జీవితాన్ని పణంగా పెడుతోంది నేటి యువత. రీల్స్ను ప్రవేశపెట్టిన ఇన్ స్టాగ్రామ్కు నేడు మన దేశంలో 24 కోట్ల మంది ఖాతాదార్లు ఉన్నారు. వీరిలో యువతీ యువకులే ఎక్కువ. ఆన్ లైన్ ఫేమ్ కోసం చిత్ర విచిత్రమైన రీల్స్ చేయడానికి ప్రాణాలతో రిస్క్ చేస్తున్నారు. గొడవలు, మర్డర్లు జరుగుతున్నాయి. మంచి ఫోన్ల కోసం దొంగలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం ఈ వ్యసనాన్ని ఇలాగే వదిలేయాలా?పూణెలో పోలీసులు వెంటనే స్పందించారు. మిహిర్ గాంధీ (27), మీనాక్షి సలూంఖే (23)లను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐ.పి.సి 336 సెక్షన్ కింద కేసు పెట్టారు. దీని ప్రకారం ఆరు నెలలకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉంటాయి. ఎందుకు వీరిని అరెస్ట్ చేశారు. ప్రాణాంతకమైన రీల్ చేశారు కనుక.ఏం జరిగింది?పూణెకు చెందిన మిహిర్ గాంధీ, మీనాక్షి వారం క్రితం ఒక రీల్ విడుదల చేశారు. అందులో ఎత్తయిన భవంతి మీద మిహిర్ ఉంటే అతని చేయి ఆధారంగా మీనాక్షి గాల్లో వేలాడింది. అతను వదిలేసినా ఆమె చేయి జారినా మీనాక్షి కచ్చితంగా చనిపోయి ఉండేది. ఈ రీల్ బయటకు రాగానే అందరూ మండి పడ్డారు. ఈ రీల్స్ పిచ్చికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు స్పందించారు. వాటర్ ట్యాంక్ ఎక్కి...ఇటీవల లక్నోలోని వాటర్ ట్యాంక్ ఎక్కి రీల్ చేయబోయిన శివాంశ్ అనే కుర్రాడు కాలు జారి పడి మరణించాడు. దాంతో లక్నోలో పెద్ద ఎత్తున రీల్స్ అడిక్షన్ మీద చర్చ జరిగింది. ఇలా రీల్స్ చేస్తున్న వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం మానేయాలని తల్లిదండ్రులు, సమాజం అందరూ కోరారు. ఇలాగే రాజస్థాన్లోని పాలిలో ఒక యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక రీల్ చేయాలనుకున్నాడు. తల్లిదండ్రులు వారించేసరికి కోపమొచ్చి వారిని చంపేశాడు. టీనేజ్ యువతీ యువకులు ఇలా మతిలేని పనులు చేస్తున్నారనుకున్నా వైవాహిక జీవితంలో ఉన్న స్త్రీలు, పురుషులు కూడా రీల్స్కు బలవుతున్నారు. చత్తిస్గఢ్లోని భిలాయ్కి చెందిన ఒక మహిళ రీల్స్ చేయడానికి అడిక్ట్ అయ్యి భర్త వారించాడని ఆత్మహత్య చేసుకుంది. కర్నాటకలో ఒక భార్య రీల్ కోసం కన్నడ గీతానికి గంతులేసిందని మనసు నొచ్చుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్లో రీల్స్ వద్దన్నందుకు భర్తనే చంపేసింది మరో మహిళ. రీల్స్ కోసం యువతీ యువకులు రకరకాల డ్రస్సులు వేసుకోవడం, ప్రాంక్లు చేయడం, ట్రాఫిక్లో ప్రమాదకరమైన ఫీట్లు చేయడం చివాట్లు తినడం ఆనవాయితీగా ఉంది. సమర్థమైన మంచి కంటెంట్తో కొందరు గుర్తింపు పొంది లాభపడుతున్నా మరెందరో ఈ రీల్స్ అనే వధ్యశిలపై తలలు తెగిపడుతున్నారు.గుర్తింపు కోసం పోరాటం...గతంలో డార్విన్ మనుగడ కోసం పోరాటం అన్నాడు. ఇవాళ ప్రభుత్వ పథకాల వల్ల మనుగడకు ఢోకా లేదు. ఇక మిగిలింది గుర్తింపు. టీనేజ్లో ఉన్న యువతీ యువకులకు గుర్తింప బడాలన్న కోరిక విపరీతంగా ఉంటుంది. గతంలో బాగా చదివి, ర్యాంక్ తెచ్చుకుని, మంచి ఉద్యోగం తెచ్చుకుంటే గుర్తింపు వచ్చేది. ఇప్పుడు ఒక్క రీల్తో గుర్తింపు వస్తోంది. ఫాలోయెర్ల వల్ల ఇదంతా ‘తమ కుటుంబం’ అనే భావన వారిలో కలుగుతుంది. ఎప్పుడూ కల్పిత ప్రపంచంలో ముక్కూ మొహం ఎరగని వారి కామెంట్ల ద్వారా వారు సంతృప్తి ΄÷ందుతుంటారు. మరిన్ని కామెంట్ల కోసం మరిన్ని రీల్స్ చేయాలి. మరిన్ని రీల్స్ కోసం మరిన్ని రిస్క్లు తీసుకోవాలి అనే భావన బలపడుతుంది.253 కోట్ల మంది...ప్రపంచ వ్యాప్తంగా రోజూ 253 కోట్ల మంది రీల్స్ చూస్తున్నారని ఒక అంచనా. 2020లో టిక్టాక్ బ్యాన్ అయ్యాక ఇన్స్టాగ్రామ్ రీల్స్ను ప్రవేశ పెట్టింది. 15 నుంచి 30 సెకండ్ల వీడియోలు పోస్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. దాంతో ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ల పేరుతో కంటెంట్ క్రియేటర్ల పేరుతో గుర్తింపు కోసం అందరూ రంగంలో దిగారు. మన దేశంలో 8 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారంటే (కంటెంట్ ద్వారా ఆదాయం పొందాలని చూస్తున్నారంటే) అంతమందికి మంచి కంటెంట్ దొరికే అవకాశం లేదు. అందుకే పిచ్చి స్టంట్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒకప్పుడు సెల్ఫీ పిచ్చితో చాలామంది ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు రీల్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.సిసలు ప్రపంచంలో...యువతీ యువకులు సిసలైన ప్రపంచంలో ఉండేలా చేస్తే వారిని ఈ రీల్స్ నుంచి బయటకు తేవచ్చు. ‘సోషల్ మీడియా అడిక్షన్ వల్ల ఆత్మహత్య ఆలోచనలతో ఉన్న వారు పెరుగుతున్నారు’ అని సైకియాట్రిస్ట్లు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులతో దూరం, నిరుద్యోగం, ఈజీ మనీ కోసం వెంపర్లాట, క్షణిక గుర్తింపుతో వస్తున్న మానసికానందం, విలువల శూన్యత ఇవన్నీ యువతను రీల్స్ వైపు నెడుతున్నాయి. స్నేహితులతో ఆటలు, మాటలు కూడా లేనంతగా (అవతలివారు కూడా ఫోన్లతో బిజీగా ఉండటం వల్ల) ఒంటరితనానికి విరుగుడును సోషల్ మీడియాలో వెతుక్కుంటూ మరింత ఒంటరి ఔతున్నారు. తల్లిదండ్రులు.ఏం చేయాలి?→ కుటుంబం కూచుని సోషల్ మీడియా అడిక్షన్ గురించి మాట్లాడుకోవాలి.→ మనం చేసే రీల్స్ వల్ల కుటుంబానికి మంచిదా చెడ్డదా చర్చించుకోవాలి.→ ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో నిజాయితీగా చెప్పే మిత్రుల సలహా అడగాలి.→ పిల్లలు చేసే ప్రతి పనికీ అంగీకారం ఉండదని తల్లిదండ్రులు వారిని ఒప్పించేలా చె΄్పాలి.→ సైకియాట్రీ సాయం పొందాలి.→ విలువలతో కూడిన గుర్తింపు, గౌరవం మాత్రమే శాశ్వతమని తెలుసుకోవాలి. -
యువత.. తన కాళ్లపై తాను నిలవాలి!
మనుషులు తప్ప జీవ ప్రపంచంలోని ఏ జీవి అయినా పెరిగి పెద్దదైన తరువాత తల్లితండ్రులపై ఆధారపడటం తగ్గిస్తుంది. తన కాళ్లమీద తాను స్వతంత్రంగా నిలబడడానికి ప్రయత్నిస్తుంది. మనుషుల్లో కూడా చాలా సమాజాల్లో యువత టీనేజ్ దాటే సమయానికి బతకడం నేర్చుకుంటుంది. మన భారతీయుల్లోనే తల్లి తండ్రులపై ఎక్కువకాలం ఆధారపడుతున్నారు.అమెరికాలో ఒకవ్యక్తికి 15 ఏళ్లు వచ్చాయంటే, తల్లి తండ్రులకు అతన్ని ఇక పెంచి పోషించాల్సిన బాధ్యతల నుండి విముక్తి లభించినట్లే. ఒకసారి కళాశాలలో అడుగు పెడితే, వారి ఖర్చులకు డబ్బు వారే సంపాదించుకోవాలి. చదువుకుంటూ, పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ వారి అవసరాలకు వాళ్ళే సంపాదించుకోవటం విదేశాలలో చూస్తుంటాము. కానీ మన దేశంలో ఉద్యోగం వచ్చేంత వరకు తల్లి తండ్రులే పోషించాల్సిన దుఃస్థితి ఏర్పడింది. వృద్ధులైన తల్లి తండ్రులను పోషిస్తూ, ఇటు ఎదిగి వచ్చిన పిల్లలను కూడా పోషించటం వల్ల మధ్యతరగతి వర్గం చితికి పోతున్నారన్నది వాస్తవం. అదే ఎదిగి వచ్చిన పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడటం నేర్చుకుంటే, కొంతైనా భారం తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు అమెరికా వంటి దేశాలకు ఉన్నత చదువుకై వెళ్లే యువత అక్కడ చిన్న చిన్న ఉద్యాగాలు చేసుకుంటూ... తమ ఖర్చులకు తాము సంపాదించుకుంటూ చదువుకునే వాళ్ళు. అక్కడి యువతను చూసి మనవాళ్లూ అదే దారిలో నడిచేవాళ్లు. కాని, ఇప్పుడు అక్కడ కూడా తల్లితండ్రుల మీద ఆధారపడే యువత ఎక్కువ అవుతోంది. 30 ఏళ్లు వచ్చినా ఇంకా తల్లి తండ్రుల మీద ఆధారపడే యువత సంఖ్య పెరిగిపోతోంది. జంతువుల్లో కంగారూలు పిల్లల్ని చాలా కాలం మోస్తూ ఉంటాయి. అటువంటి తల్లి తండ్రులు మన దేశంలో ఎక్కువ ఆవుతున్నారు. దీనికి కొంత కారణం మన సంస్కృతిలో భాగమైన కుటుంబ వ్యవస్థ, కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న అనుబంధాలు కారణం. ఎదిగి వచ్చినా బతకలేని బిడ్డలను నెత్తి మీద మోస్తూ అప్పుల పాలవుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కనీసం పెళ్ళి చేస్తేనన్నా బాధ్యతలు తెలిసివస్తాయని లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసినా వీరి ధోరణిలో మార్పు రావటం లేదు. పైపెచ్చు కొడుకుతో పాటు కోడలిని కూడా పోషించాల్సి వస్తోంది. ఒకప్పుడు 1970వ దశకంలో చదువు లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతూ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికే వాళ్ల సంఖ్య ఎక్కువగా వుండేది. లండన్, జపాన్ వంటి దేశాల్లో సైతం వీరి సంఖ్య ఎక్కువగా వుండేది. వీళ్ళను ‘ఫీటర్’ అని పిలిచే వాళ్ళు. ఎప్పుడు అయితే కంప్యూటర్ సెన్స్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెరిగాయో వీరి సంఖ్య తగ్గుతూ వచ్చింది. కాని, మళ్ళీ ఇప్పుడు వారి సంఖ్య పెరుగుతోంది. ఉన్నత చదువులు చదువుతున్న వారి సంఖ్య పెరిగినంతగా ఉద్యోగాలు పెరగకపోవటం, చదివిన చదువులు బతకటం ఎలాగో నేర్పక పోవటం, విలాస జీవనానికి అలవాటు పడటం, ధరల పెరుగుదల వంటివి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. చిన్నదైనా పెద్దదైనా సిగ్గుపడకుండా ఏదో ఒక పనిలో చేరి యువత తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. ‘శ్రమ విలువ తెలిసిన వాళ్ళు తాము కష్టపడి సంపాదించిన డబ్బులతో బతకాలని కోరుకుంటారు. కాని, పరాన్న జీవులే వయసు మీద పడుతున్నా తల్లితండ్రుల దగ్గర చెయ్యి చాస్తూవుంటారు. నేటి ఇంటర్నెట్ యుగంలో... సామాజిక మాధ్యమాలు, చలన చిత్రాల వల్ల చెడు అలవాట్లకు గురై తమ శ్రమ విలువను గుర్తించ లేకపోతున్నారు. ఇటువంటి వాళ్లు మధ్యతరగతి కుటుంబాల్లోనే ఎక్కువగా కనబడుతుంటారు. దేశంలో అంత కంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగం కూడా దీనికి కారణమే. ప్రభుత్వాలు ఉపాధి కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేకపోత మనదేశానికి వరంగా భావిస్తున్న యువశక్తి శాపంగా మారి పరాన్న జీవుల సమాజంగా తయారవుతుంది అనటంలో ఏ సందేహం లేదు.ఈదర శ్రీనివాస రెడ్డి వ్యాసకర్త ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ -
సెల్ఫీ జోష్.. డేంజర్ బాస్
సాక్షి, హైదరాబాద్: సెల్ఫీ.. బాగా ప్రాచుర్యం పొందిన, ఎవరికి వారు స్వయంగా తీసుకునే సెల్ ఫోన్ ఆధారిత ఫొటో. దీనికోసం ప్రత్యేక సెల్ ఫోన్లు, స్టిక్కులతో పాటు కోర్సులు కూడా అందు బాటులోకి వచ్చాయంటేనే వాటికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకో వచ్చు. ముఖ్యంగా కొంతమంది యువ తలో ఈ క్రేజ్ విపరీత స్థాయిలో ఉంటోంది. అయితే ఈ క్రేజ్ కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలనే హరి స్తోంది. ఈ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నాల్లో అనేక మంది ప్రమాదాలకు గురై చనిపోతున్నారు.ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు అధిక సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. దేశంలో గత ఏడాది సెల్ఫీ సంబంధిత మరణాలు 190 నమోద య్యాయి. తీవ్రంగా గాయపడిన ఉదంతాలు 55 చోటు చేసుకున్నట్లు వికీపీడియా గణాంకాలు చెప్తు న్నాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రమాదాలు భారత్లోనే ఎక్కువని స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్లోనూ ఇలాంటి మరణాలు ఎక్కువ గానే జరుగుతున్నాయి. నగరంలో 2016లో తొలి సెల్ఫీ డెత్ నమోదైంది. జూ పార్క్లో సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో కాలుజారి పడటంతో జియాగూడ వాసి మంజీత్ చౌదరి కన్నుమూశాడు.2024 జనవరి 7ఉత్తరప్రదేశ్కు చెందిన బాలుడు (16) అల్వాల్లో ఉంటున్న తన బాబాయి ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు. ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఈ బాలుడు బొల్లారం బ్యారెక్ సమీపంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ వద్దకు చేరుకున్నాడు. వెనుక నుంచి రైలు వస్తుండగా సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే రైలు దూసుకు రావడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.2024 జనవరి 29హైదరాబాద్ బహదూర్పురకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ (23) అబిడ్స్ లోని కళ్లజోళ్ల దుకాణంలో పనిచేస్తు న్నాడు. తనస్నేహితులతో కలిసి ఉప్పుగూడ–యాకత్పుర రైల్వే స్టేష న్ల మధ్య రైల్వే ట్రాక్ల వద్దకు వెళ్లా డు. అక్కడ సెల్ఫీ తీసుకునే ప్రయ త్నాల్లో రైలు పట్టాల మీదకు చేరుకు న్నాడు. అదే సమయంలో దూసుకు వచ్చిన ఎంఎంటీఎస్ ఢీ కొట్టడంతో తీవ్రగాయాలతో చనిపోయాడు.2024 ఏప్రిల్ 5ఏపీకి చెందిన ఎస్.అనిల్ కుమార్ (27) భార్యతో కలిసి హైదరా బాద్లోని మాదాపూర్లో ఉంటూ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అర్ధ రాత్రి వేళ తన స్నేహితుడు అజ య్తో కలిసి కేబుల్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. తమ ద్విచక్ర వాహనాన్ని వంతెనపై నిలిపిన ఈ ద్వయం సెల్ఫీలు తీసుకుంటోంది. ఇంతలో ఇనార్బిట్ మాల్ వైపు నుంచి వచ్చిన కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అనిల్ చికిత్స పొందుతూ అసువులు బాశాడు.2024 జూన్ 15హైదరాబాద్కు చెందిన ఉదయ్కుమార్ (17), శివదీక్షిత్ (17) మరో బాలుడు (17) ఇంటర్ పూర్తి చేశారు. బాలుడి పుట్టినరోజు కావడంతో శుక్రవారం అర్ధరాత్రి కేకుకోసిన అనంతరం మాదాపూర్ కేబుల్ బ్రిడ్జికి బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున 2.18 ప్రాంతంలో ముగ్గురూ స్కూటీపైనే ఉండి రీల్స్ చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ను వెనుక నుంచి ఢీకొట్టారు. ఉదయ్, దీక్షిత్ అక్కడిక్కడే మరణించగా.. బాలుడు గాయపడ్డాడు. అత్యుత్సాహంతోనే చేటు..సెల్ఫోన్లు వచ్చినప్పటి నుంచే ఈ సెల్ఫీల జాఢ్యం మొదలవలేదు. ఎప్పుడైతే వాటిల్లో ఫ్రంట్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయో అప్ప ట్నుంచీ సెల్ఫీ క్రేజ్ ప్రారంభమై, క్రమంగా మంచి రెజుల్యూషన్ (ఫొటో స్పష్టంగా కన్పిస్తుంది)తో కూడిన ఫొటోలు వచ్చే ఫ్రంట్ కెమెరాలు కూడా వస్తుండటంతో ఈ సెల్ఫీల పిచ్చి మరింత ముదిరి పోయింది. సెల్ఫీ మోజులో ఉంటున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటు న్నారు. ఏదో రకంగా విభిన్నమైన సెల్ఫీని తీసుకో వాలనే తాపత్రయంలో ప్రమాదకర పరిస్థితుల్ని పట్టించుకోకుండా సెల్ఫీలు దిగేందుకు ప్రయత్ని స్తున్నారు. వెనుక నుంచి రైలు వస్తుండగానో, వాహనాలు డ్రైవ్ చేస్తూనో, జలపాతాల వద్దో, బీచ్ ల్లోనో, ఎత్తైన ప్రదేశాల్లోనో సెల్ఫీలకు ప్రయత్నిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.సోషల్ మీడియా ప్రాచుర్యం పొందిన తర్వాత..ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలు ప్రాచుర్యం పొందిన తర్వాత సెల్ఫీ ఫీవర్ మరింత ఎక్కువైంది. ఆయా సోషల్ మీడియాల్లో ఎవరి ప్రొఫైల్ పిక్ చూసినా, అప్లోడ్ చేసిన ఫొటోలు పరిశీలించినా సగానికి సగం సెల్ఫీలే కనిపిస్తు న్నాయి. ఒకరిని చూసి మరొకరు, ఒకరి ప్రొఫైల్స్ చూసి ఇంకొకరు... ఇలా అంతా సెల్ఫీల బాటపడుతున్నారు. ఇటీవలి కాలంలో వీటితో పాటు రీల్స్ (షార్ట్ వీడియోలు) కూడా సోషల్ మీడియాల్లో ఎక్కువగా కన్పిస్తుండటం గమనార్హం. మరోపక్క ఈ సెల్ఫీలను మార్ఫింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడే సైబర్ నేరాలు పెరుగుతుండటం గమనార్హం.‘నో పార్కింగ్’ తరహాలో..ప్రజల్లో ముఖ్యంగా యువతలో మితిమీరి పోతున్న ఈ సెల్ఫీ పిచ్చి ప్రభుత్వ విభాగాలకూ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేప థ్యంలోనే ‘నో పార్కింగ్’ ప్రాంతాల తరహాలో మహారాష్ట్రలో ‘నో సెల్ఫీ’ ప్రాంతాలు అమల్లోకి వచ్చాయి. కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలోని నాసిక్లో జరిగిన కుంభ్మేళాలో సెల్ఫీ ప్రియుల కారణంగా అనేక ప్రాంతాలు ఇరుకైన ప్రదేశాలుగా మారిపోయి ఇతరులకు ఇబ్బందులు కలిగించాయి. ఆయా ప్రాంతాలను దాటి వెళ్లడానికి భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో కుంభమేళాను అధికారులు ‘నో సెల్ఫీ జోన్’గా ప్రకటించాల్సి వచ్చింది. సెల్ఫీలను నిరోధించడం కోసం ముంబై పోలీసులు నగరంలోని 16 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్స్’గా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ సైతం ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యలు హైదరాబాద్లోనూ తీసుకోవాలనే అభిప్రాయంగా గట్టిగా వ్యక్తమవుతోంది.సెల్ఫీకి ముందు సప్త ప్రశ్నలుసెల్ఫీలు, రీల్స్ వల్ల ప్రమాదాలకు గురికాకుండా ఉండటం, అవి ఇతరులకు ఇబ్బందికరంగా మారకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికి వారు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 1. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతాల్లో ఫొటోగ్రఫీకి అనుమతి ఉందా?(మ్యూజియాలు, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, విద్యా సంబంధ వ్యవహారాల్లో)2. ఈ ప్రదేశంలో సెల్ఫీ కారణంగా తనకు కానీ తన చుట్టు పక్కల వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉందా? (జూ పార్కులు, థీమ్ పార్కులు, జనసమ్మర్థ ప్రాంతాలు, మాల్స్, సబ్వేస్, విమానా శ్రయాలు, రైల్వే ట్రాక్లు, వాహనాలు నడుపుతూ)3. సెల్ఫీ తీసుకుంటూ నేను ఎదుటివారు చూస్తున్న వాటికి అడ్డం వస్తున్నానా? ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నానా? (థీమ్ పార్కులు, సినిమా హాళ్లు, సందర్శనీయ ప్రాంతాలు, కొన్ని కార్యక్రమాలు)4. సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో మరో వర్గా నికి చెందినవారి మనోభావాలు దెబ్బతీస్తు న్నామా? (ప్రార్థనా స్థలాలు)5. సెల్ఫీ తీసుకుంటున్న ప్రాంతంలో కంటికి కనిపించని ముప్పు పొంచి ఉందా?(జూ పార్క్లు, జాతీయ పార్కులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎత్తైన భవనాలు/ప్రాంతాలు, ఓడలు, సబ్ వేస్, కదులుతున్న వాహనాలు, రహదారులు)6. సెల్ఫీ తీసుకోవడం సమంజసమేనా?(ప్రమాదం జరిగిన ప్రాంతాలు, అంతిమ యాత్రలు)7. నేను తీసుకుంటున్న సెల్ఫీ ఇతరులకు అభ్యంతకరం అవుతుందా?(పార్టీలు, రెస్ట్రూమ్స్ సమీపంలో, బీచ్ల్లో) -
18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్: అదిరిపోయిన ఆరంభం!
ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ జూన్ 7న బ్యాంకెట్తో మొదలయ్యి..మూడు రోజులు వివిధ కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. జార్జియా వరల్డ్ కాంగ్రె సెంటర్ ప్రాంగణం ఈ వేడుకుల కోసం అంత్యంత సుందరంగా ముస్తాబయ్యింది. అట్లాంటాలో ఈ వేడుకలు 2000, 2012లో జరగగా మళ్లీ ఇన్నేళ్లకు జరగడం విశేషం. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించిన అనంతరం కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం, అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఇంతలా దిగ్విజయంగా చేసుకునేందుకు సహకరించిన స్పాన్సర్లను కోర్ కమిటీ తోపాటు ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, బోర్డు అఫ్ ట్రస్టీలు ఘనంగా సత్కరించారు. ఇక ఆటా అవార్డ్స్ కమిటీ వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించిన వారికి అవార్డులు ప్రదానం చేసింది. ఈ వేడుకలో జరిగిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, సినీ నటులు శ్రీకాంత్, మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ రెడ్డి వంగా వంటి పలువురు విశిష్ట అతిథులు ఆటా వారి ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలియ జేసి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనూప్ రూబెన్స్ బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూతలూగించింది. రుచికరమైన భోజనాలు అందరి జిహ్వ చాపల్యాన్ని తీర్చాయి. ఇక ఈ వేడుకలో యూత్ కాన్ఫరెన్స్ హైటెట్గా నిలిచింది. ఎక్కడెక్కడ నుంచే పెద్ద ఎత్తున యువతీయువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ ఆటా నవత, యువత, భవితకు ఆటా పెద్ద పీట వేస్తుందంటూ దీని ప్రాముఖ్యత గురించి వివరించారు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఇంకా ఎన్నో ఆకట్టుకునే అలాగే అట్లాంటా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి పలు నాన్ ప్రాఫిట్ సంస్థల నుంచి ఎంతో మంది వచ్చారు. వారందరికీ కన్వీనర్ కిరణ్ పాశం అభినందనలు తెలిపి, ఈ కన్వెన్షన్ ఎలా మొదలయ్యిందీ, ఎంత మంది పాటుపడ్డారు, వాలంటీర్ల కృషి మున్నగు వివరాలు గురించి వివరించారు. ఆటా టీం గౌరవ అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసి, సముచితంగా సత్కరించారు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసుకుని అందరం కలిసి పాల్గొని ఆనందిద్దాం అని అన్నారు కన్వీనర్ కిరణ్ పాశం.(చదవండి: 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!) -
18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!
ఇక్కడ రెండు మూడు రోజులుగా వార్ రూమ్ అంటుంటే అర్థం కాలేదు. వెళ్లి చూస్తే, ఆటా నాయకులు కూర్చుని, రకరకాల కమిటీలతో, వెండర్లతో, వేరే టీంలతో మాట్లాడుతున్నారు, చర్చించుకుంటున్నారు, ఫోనుల్లో మాట్లాడుతున్నారు, వీడియో కాన్ఫరెన్సులు నడుస్తున్నాయి... అప్పుడు అర్థం అయ్యిందేమంటే.. జనతా గ్యారేజ్ సినిమాలాగా, 'ఇచ్చట అన్ని రకముల సమస్యలకు పరిష్కారం చూపబడును' అని. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఆటా వారు ఏ లెవెల్లో రెడీ అవుతున్నారో. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్యులు శ్రీధర్ బాబు దుద్దిళ్ల, భద్రాద్రి పండితులు, సినిమా వారు మెహ్రీన్, థమన్, అనూప్ రూబెన్స్, అంకిత, రోహిత్, సత్య మాస్టర్ వంటి ఎందరో విచ్చేశారు. మరి కొందరు బయలుదేరి, విహంగ వీక్షణ చేస్తున్నారు. వేరే ఊర్ల నుంచి ఆటా నాయకులు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, అజయ్, నర్సిరెడ్డి గడ్డికొప్పుల ఏతెంచారు. మిగతా వాళ్లు ఆన్ ది వే. అలానే, దూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి, హోటళ్ళలోనో, బంధువుల ఇళ్లలోనో ఉంటున్నారు. కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, అట్లాంటా మేయర్, కాంగ్రెస్ మెన్, సెనేటర్స్, ఇక్కడి దేశీయ నాయకులు ఇలా చాలా మంది వేంచేయబోతున్నారు. వేరే వేరే నాన్ ప్రాఫిట్, సంస్థలు, మీడియా సంస్థల నుంచి చాలా మంది ప్రతినిధులు వస్తున్నారు. 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ అట్లాంటాలో ఈ శుక్రవారం, జూన్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ శుక్రవారం సాయంత్రం బ్యాంకెట్లో వివిధ రంగాలలో నిష్ణాతులకు ఆటా సాఫల్య అవార్డులు ప్రధానం చేస్తారు. ఇక శని, ఆదివారాలలో ఝుమ్మంది నాదం అంటూ పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ పోటీలు, ఆత్మ విశ్వాసం కోసం పెజంట్, ధ్యానం గురు దాజి ఉపన్యాసం, భద్రాద్రి కళ్యాణం, షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ పోటీలు, దడదడలాడించే అనూప్ రూబెన్స్, థమన్, త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్లు, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, ఉమెన్స్ ఫోరమ్, అమెరికా, భారత దేశాల పొలిటికల్ ఫోరంలు, అల్యూమిని మీటింగులు, బిజినెస్ ఫోరంలు, సాహిత్య విభావరి, అష్టావధానం, లైఫ్ టైం అవార్డులు, ఆత్మీయ సత్కారాలు, వెండర్ స్టాల్ల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యువత గురించి సరే సరి.. వారికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే..మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆటా వారు. మరి ఇన్ని వినోదాలు, విశేషాలు ఒకే చోట ఉంటే, ఆలస్యం ఎందుకూ..? టిక్కెట్ల గడువు కూడా ముగియనుంది. వివిధ కాన్ఫరెన్స్ వివరాల కోసం www.ataconference.orgని, టిక్కెట్లకు https://ataconference.org/Registration/Attendee-Registrationని సందర్శించండి. ఆటా కమ్యూనిటీ రీచ్ సందర్భంగా అట్లాంటాతో పాటు వేర్వేరు నగరాలలో సమావేశాలు నిర్వహించారు, ఎంతోమంది రావడానికి ఉత్సాహం చూపించారు. అలానే, టాలీవుడ్ తారలతో కమ్యూనిటీ వార్కు 300 మందికి పైగా విచ్చేయడం హర్షణీయం. విశిష్ట అతిథులతో ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పటికే మొదలయ్యాయి. కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం, అధ్యక్షురాలు మధు బొమ్మకంటి, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో దాదాపు 70 కమిటీలలో 500 మందికి పైగా వాలంటీర్లు అవిశ్రాంత కృషికి తగ్గ అజరామర ఫలితాలు త్వరలో చూడనున్నాం. కన్వీనర్ కిరణ్ పాశం మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా పనులు పూర్తి అయ్యాయి., ప్రపంచమంతా ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ముఖ్యంగా యువత ఆటాకి ఎంతో ముఖ్యమనీ, వారికి చాలా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. కావున అందరూ ఈ కార్యక్రమానికిచ్చేసి జయప్రదం చేయాలని అన్నారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని జార్జియా గవర్నర్ సందేశం అందరికీ వినిపించి.. జరగబోయే స్పిరిట్యుయల్, కంటిన్యూయస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత వివరించారు. ఎంతో మంది ఈ కార్యన్ని జయప్రదం చేసేందుకు ఆహర్నిశలూ కష్టపడుతున్నారనిన్నారు. అలాగే చాలా వెండర్ స్టాల్ల్స్, ఎన్నో ఫోరమ్స్ వంటి ఉపయుక్త కార్యక్రమాలు ఉన్నాయనీ చెప్పారు. అందువల్ల ఈ మహా పండుగకు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. (చదవండి: నాట్స్ నాయకుడి సేవలకు నీతి ఆయోగ్ గుర్తింపు!) -
యువతను ఆకర్షిస్తున్న ఫేస్బుక్
మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్ సంస్థ తన బేస్ వినియోగదారుల్లో యువతను అధికంగా ఆకర్షిస్తోంది. పాత యూజర్ బేస్తో పోలిస్తే యువకుల సంఖ్యను పెంచుకుంటున్నట్లు ఫేస్బుక్ తెలిపింది.టిక్టాక్తో పోటీపడేలా ఫేస్బుక్లో తీసుకొచ్చిన మార్పులు, గ్రూప్ ఫీచర్ల ద్వారా యూజర్లను పెంచుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. యూఎస్, కెనడాకు చెందిన 18 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న 40 మిలియన్ల మంది యువత రోజూ ఫేస్బుక్ను వాడుతున్నారని చెప్పింది. ప్రాంతాలవారీగా డెమోగ్రఫిక్ వినియోగదారుల సమాచారాన్ని మొదటగా ఫేస్బుక్ సంస్థే విడుదల చేసినట్లు తెలిపింది.ఇదీ చదవండి: తగ్గనున్న ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ నివేదికయువత యాప్ను ఎలా ఉపయోగిస్తుందో తెలియజేసేలా న్యూయార్క్లో ఒక కార్యక్రమం నిర్వహించారు. అందులో ఫేస్బుక్ మెటా హెడ్ టామ్ అలిసన్ మాట్లాడుతూ..‘చైనాకు చెందిన బైట్డాన్స్ యాజమాన్యంలోని స్మాల్ వీడియో యాప్ టిక్టాక్ వైపు మొగ్గు చూపుతున్న యువత దృష్టిని తిరిగి తనవైపు ఆకర్షించడానికి కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రయత్నించింది. తరువాతి తరానికి ఉపయోగపడేలా ఉండేందుకు ఎంతో అభివృద్ధి చెందాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మార్కెట్ప్లేస్, గ్రూప్లు, స్మాల్ వీడియా ఫీచర్లను తీసుకొచ్చాం. ప్రస్తుతం ఎక్కువగా యువత ఫీడ్ లేదా రీల్స్ను వాడుతున్నారు. సంస్థను స్థాపించిన 2004నుంచి మూడేళ్లలో 50 మిలియన్ల వినియోగదారులను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ యూజర్లను కలిగి ఉంది’ అన్నారు. -
పట్టణ యువతలో 61శాతం మందికి కంప్యూటర్ నైపుణ్యం
సాక్షి, అమరావతి : దేశంలో కంప్యూటర్ నైపుణ్యం పట్టణ యువతలో 61 శాతం ఉండగా అదే గ్రామీణ యువతలో కేవలం 34 శాతమే ఉందని ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్–24 వెల్లడించింది. కంప్యూటర్ నైపుణ్యాల సామర్థ్యం రాష్ట్రాల మధ్య వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆ నివేదిక తెలిపింది. కెమెరా, మోడమ్, ప్రింటర్ వంటి పరికరాలు ఇన్స్టాల్ చేసే సామర్థ్యం పట్టణ యువతలో ఉందని.. అయితే గ్రామీణ యువతలో అది ఎనిమిది శాతమేనని పేర్కొంది.ఇలా వివిధ రకాల కంప్యూటర్ నైపుణ్యాల్లో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాయని వివరించింది. ఇక ఫైళ్లను బదిలీచేసే సామర్థ్యం మినహా చాలా నైపుణ్యాల్లో కర్ణాటక ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఫైల్ లేదా ఫోల్డర్ను కాపీ చేయగల లేదా తరలించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 45.56 శాతం ఉంటే కేరళ యువతలో 90.28 శాతం.. తమిళనాడు యువతలో 72.28 శాతం, కర్ణాటక యువతలో 64.36 శాతం, తెలంగాణలో 53.83 శాతం ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది.అలాగే, డూప్లికేట్ లేదా టూల్స్ను కాపీచేసి పేస్ట్ చేయగల సామర్థ్యంతో పాటు సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేయగల నైపుణ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 43.30 శాతం ఉందని ఆ నివేదిక తెలిపింది. ఇది కేరళ యువతలో 89.30 శాతం, తమిళనాడు యువతలో 70.45 శాతం, కర్ణాటక యువతలో 60.24 శాతం, తెలంగాణలో 50.40 శాతం ఉంది.ప్రెజెంటేషన్ల సామర్థ్యం కేరళలో ఎక్కువ..ఇక జోడించిన ఫైల్తో ఈ–మెయిల్ పంపగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 36.38 శాతం ఉంటే కేరళ యువతలో అత్యధికంగా 73.34 శాతం, తమిళనాడులో 55.33 శాతం, కర్ణాటకలో 45.04 శాతం, తెలంగాణలో 45.46 శాతం సామర్థ్యం ఉంది. ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్తో ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్లను సృష్టించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 10.18 శాతం ఉండగా కేరళ యువతలో 40.33 శాతం, తమిళనాడులో 26.10 శాతం, కర్ణాటకలో 22.33 శాతం, తెలంగాణలో 14.27 శాతం ఉందని రిపోర్ట్ వెల్లడించింది.గ్రామీణంలో ‘నెట్’ వినియోగం 25 శాతమే..అలాగే, దేశంలో 15 ఏళ్ల వయస్సు నుంచి 29 ఏళ్లలోపు యువత ఇంటర్నెట్ వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 25.30 శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో 57.53 శాతం ఉందని తెలిపింది. వర్గాల వారీగా ఇంటర్నెట్ వినియోగాన్ని పరిశీలిస్తే.. ఎస్టీ వర్గాల్లో 20.39 శాతం, ఎస్సీల్లో 24.96 శాతం, వెనుకబడిన వర్గాల్లో 34.28 శాతం, సాధారణ వర్గాల్లో 50.15 శాతం ఇంటర్నెట్ ఉందని రిపోర్ట్ తెలిపింది. మెజారిటీ యువత మాధ్యమిక లేదా ఉన్నతస్థాయి విద్యను అభ్యసిస్తున్నారని, దీంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ నైపుణ్యాల యాక్సెస్ యువత జనాభాలో కూడా పెరిగిందని.. అయితే సాంకేతిక నైపుణ్యాలను, సామర్థ్యాన్ని పెంచేందుకు యువతకు తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. -
హైపర్టెన్షన్కు కారణమేంటి? జీవనశైలిలో మార్పే పరిష్కారమా?
రక్తపోటు బాధితులు తరచూ తమ బీపీని చెక్ చేసుకుంటుండాలి. లేదంటే ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. మనం ఏదైనా వ్యాధితో బాధపడుతూ వైద్యుని దగ్గరకు వెళ్లినప్పుడు ఆ వైద్యుడు ముందుగా మన రక్తపోటును పరీక్షిస్తారు. ప్రస్తుతం హైపర్టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్య దాదాపు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తున్నది.చాలా మంది అధిక రక్తపోటును సాధారణమైనదిగా తీసుకుంటారు. బహుశా ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలియకనే ఇలా చేస్తుంటారు. నిజానికి హైపర్టెన్షన్ అనేది ఒక ‘సైలెంట్ కిల్లర్’. ఇది అంతర్గతంగా శరీరానికి ఎంతో హాని కలిగిస్తుంది. రక్తపోటుపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ మే 17 నుండి 25 వరకు ‘హైపర్టెన్షన్ వీక్’నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ హైపర్టెన్షన్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపధ్యంలోనే హైపర్టెన్షన్ నుంచి బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఎయిమ్స్ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నదని పేర్కొన్నారు.పలు గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపు 22 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అస్తవ్యస్త జీవనశైలే దీనికి ప్రధాన కారణం. ఎయిమ్స్ సీసీఎం విభాగం హెచ్ఓడీ డాక్టర్ కిరణ్ గోస్వామి మాట్లాడుతూ నేటి కాలంలో యువతలో హైపర్టెన్షన్ ఎక్కువగా కనిపిస్తున్నదని, 18 ఏళ్లలోపు పిల్లల్లో కూడా హైపర్టెన్షన్ సమస్య తలెత్తుతున్నదన్నారు.అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు ధూమపానం, పొగాకు వినియోగం, అధికంగా ఉప్పు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, వేయించిన ఆహారం, ఒత్తిడి కారణంగా రక్తపోటు పెరుగుతోంది. అధిక రక్తపోటు నివారణకు ఆహారంలో పచ్చి కూరగాయలు, శుభ్రమైన పండ్లను చేర్చుకోవాలి. పొగాకు తీసుకోవడం మానివేయాలి. జీవనశైలిలో వ్యాయామం, శారీరక శ్రమలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీంతో అధిక రక్తపోటును నివారించవచ్చు. దీనితో పాటు 30 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ రక్తపోటును తరచూ చెక్ చేసుకోవాలి. తద్వారా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. -
ఆనందమే జీవిత మకరందం!
ఉద్యోగరీత్యా హైదరాబాద్ సిటీ వదిలి నాలుగేళ్లు పనిచేసాకనే నాకు మళ్ళీ రాజధాని నగరంలో ఒక పోస్ట్ లభించింది. భాగ్యనగర నివాస భాగ్యం, సొంత ఇంట్లో ఉండే అవకాశం రెండూ ఒకేసారి కలిసి వచ్చిన ఆ రోజు మేం పొందింది మహదానందం. నేను అప్పుచేసి మరీ కొన్న మొట్టమొదటి టీవీ ( EC ) మా ఇంటికి చేరిన రోజు ( 1984 మార్చ్ 17 ) వాళ్లకు కలిగింది బ్రహ్మానందం. ఎందుకంటే ఆ రోజుల్లో దూరదర్శన్లో వచ్చిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి కామెడీ షో ‘ఆనందో బ్రహ్మ’ మా పిల్లలను ఆనందపరవశులను చేసేది. ఆనందం ( Happiness ) ఒక భావోద్వేగం. నచ్చిన ఆహార విహారాలు, ఆటా పాటలు, ప్రేమ స్నేహాలు, సిరి సంపదలు, మంచి వాతావరణం, ప్రకృతి సౌందర్యం వంటివి మనిషికి ఎంతో సంతోషాన్ని కలిగించడం సహజం.అయితే ఇది దేశాలకు కూడా వర్తిస్తుందని, అక్కడి మనుషుల జీవన ప్రమాణాలు, వారికున్న స్వేచ్చా స్వాతంత్య్రాలు, అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, లంచగొండితనం ఆధారంగా 2012 నుంచి ప్రతి ఏటా ‘అంతర్జాతీయ హ్యాపీనెస్ డే ( మార్చి 20 ) ’ సందర్బంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రచురిస్తున్న ప్రపంచ సంస్థ ఐక్యరాజ్య సమితి. వీరి 2024 సంవత్సరం రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని 143 దేశాల్లో ముందున్న అత్యంత సంతోషకరమైన 10 దేశాలు ఫిన్లాండ్, డెన్మార్క్ , ఐస్లాండ్ , స్వీడెన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్, నార్వే , లక్సంబెర్గ్ , స్విడ్జెర్లాండ్ , ఆస్ట్రేలియాలు కాగా చివర్లో బిక్కుబిక్కు మంటున్నవి లెబనాన్, అఫ్గనిస్థాన్ లు.ఇందులో విశేషం ఏమిటంటే సంతోషకరమైన దేశాల్లో భారత్ ర్యాంక్ 126 . ఆధ్యాత్మిక చింతనతో మనం ఎంతో ఆత్మానందాన్ని పొందుతున్నా మనుకుంటూ ఇలా కిందికి జారిపోవడమే మింగుడుపడని విషయం. మనకన్నా ఆనందడోలికల్లో తెలుతున్నవి లిబ్యా , ఇరాక్ , పాలస్తినా, నైగర్ వంటి దేశాలు ,అంతేకాదు పాకిస్థాన్ కూడా . నిరంతర యుద్ధ జ్వాలలతో రగిలిపోతున్న రష్యా , ఉక్రైన్ లు కూడా మనపైనే ఉన్నాయి. ఆసియా వరకే చూస్తే సింగపూర్, తైవాన్, జపాన్ , సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్ ప్రజలు ఆనందంలో ముందున్నారట. మనదేశంలో మిజోరాం రాష్ట్రవాసులు ఎక్కువ ఆనందంగా ఉన్నారట. ఈ విషయంలో కేరళను క్యూట్ స్టేట్ అన్నారు. సిటీల్లో కాన్పూర్, జైపూర్, చెన్నై, మంగళూర్, మైసూర్ల తర్వాతనే మన హైదరాబాద్ స్థానం. భారత్లో యువతరం హ్యాపీగానే ఉన్నారట, బోలెడంత నిరుద్యోగం ఉన్నా కూడా ( బహుశా అంతర్జాలంలో తేలిపోతూ కావచ్చు ). వృద్ధతరం కూడా పర్వాలేదు అంటున్నారు, వీరిలో జీవనసాఫల్య సాధనలో మాత్రం మహిళామణులే ఓ అడుగు ముందున్నారట, సంతోషం. మధ్య వయస్కులు మాత్రం ( సంసార సాగరాన్ని ఈదలేకనేమో ) కాస్త విచారంలో ఉంటున్నారట. మరో విశేషం ఏమిటంటే ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికాలో హ్యాపీనెస్ అంతంతే అంటున్నారు. ఆనందకరమైన మొదటి 20 దేశాల్లో వీరు లేకుండా 23 వ స్థానానికి పడిపోవడం. అందుకు ముఖ్యమైన కారణాల్లో ఆ దేశ యువతలోని అసంతృప్తి, అక్కడున్న ఒంటరితనం అంటున్నారు. ఫలితంగా వారు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కుంటున్నారట. అందుకే యుక్తవయసు రాగానే పెళ్లిళ్లు చేసేసుకుంటే గొడవే లేదు, ఇంటిపోరుతో బోలెడంత టైమ్ పాస్ కదా అంటున్నారు పెద్దలు !వేముల ప్రభాకర్(చదవండి: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
యువతరం ఎకో–యాంగ్జయిటీ! క్లైమెట్ ఛేంజ్’పై ఆందోళన..!
‘ఈ నెట్ఫ్లిక్స్, ఐపీఎల్ మ్యాచ్ల కాలంలో వాతావరణ మార్పులపై యూత్ దృష్టి పెడుతుందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని చెబుతుంది డెలాయిట్ తాజా నివేదిక. ‘డెలాయిట్ 2024 జెన్ జెడ్, మిలీనియల్స్ సర్వే’ ప్రకారం వీరిలో ఎక్కువమంది ‘క్లైమెట్ ఛేంజ్’పై ఆందోళన చెందుతున్నారు. పర్యావరణ సంరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యత మాట ఎలా ఉన్నా ఎకో–యాంగ్జయిటీ అనేది వారిలో కనిపించే మరో కోణం.ఢిల్లీలో ఒకరోజు...‘ఇల్లుదాటి బయటికి వెళ్లవద్దు అని పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. అయినా సరే వారి కనుగప్పి ఇంటి నుంచి బయటికి వచ్చి అనుకున్నట్లుగానే అక్కడికి వెళ్లాను’ అంటుంది యశ్న ధృరియా. ఇంతకీ ఇరవై సంవత్సరాల యశ్న వెళ్లింది ఎక్కడికి? ఆరోజే విడుదలైన సినిమాకు కాదు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి కాదు. మహానగరంలో జరుగుతున్న గ్లోబల్ క్లైమెట్ స్ట్రైక్లో పాల్గొనడానికి. ‘వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్’ అంటూ పర్యావరణ సంక్షోభం గురించి యశ్న కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులకు ఆశ్చర్యంగా అనిపించింది.‘పరీక్షలో ఫెయిలైనట్లు ఏడుస్తున్నావేమిటి?’ అని అడిగారు ఒకరు. కానీ ఆ ఒకరికి తెలియనిదేమిటంటే వాతావరణానికి సంబంధించిన కీలకమైన పరీక్షను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ సంక్షోభ నేపథ్యంలో యశ్నలాంటి వాళ్లు ఆశాదీపాలై వెలుగుతున్నారు. తాము వెలుగు దారిలో పయనిస్తూ ఎంతోమందిని తమ తోపాటు తీసుకువెళుతున్నారు. ‘తెలిసో తెలియకో, ఏమీ చేయలేకో పర్యావరణ సంక్షోభంలో భాగం అవుతున్నాం’ అనే బాధ. పశ్చాత్తాపం బెంగళూరుకు చెందిన శ్రీరంజనిలో కనిపిస్తుంది. గ్లోబల్ స్ట్రైక్ మూమెంట్ ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్(ఎఫ్ఎఫ్ఎఫ్) ఇండియా’లో భాగంగా ఎన్నో కార్యక్రమాల్లో శ్రీరంజని పాల్గొంది. పర్యావరణ సంక్షోభం తాలూకు ఆందోళన తట్టుకోలేక యూత్ క్లైమెట్ యాక్టివిస్ట్లలో కొందరు ట్రీట్మెంట్కు కూడా వెళుతున్నారు. ఎన్విరాన్మెంట్ యాక్షన్ గ్రూప్ ‘దేర్ ఈజ్ నో ఎర్త్ బి’తో కలిసి పనిచేసిన దిల్లీకి చెందిన సైకోథెరపిస్ట్ అగ్రిమ ఛటర్జీ పర్యావరణ సంక్షోభంపై యూత్ ఆందోళనను దగ్గరి నుంచి గమనించింది. ‘తమ పరిధిలో వారు చేయగలిగింది చేస్తున్నారు. మరోవైపు సమస్య పెద్దగా ఉంది. కొన్నిసార్లు తాము చేస్తున్న ప్రయత్నం అర్థరహితంగా అనిపించి ఆందోళనకు గురవుతున్నారు. నిస్సహాయ స్థితిలోకి వెళుతున్నారు’ అంటుంది అగ్రిమ. బెంగళూరుకు చెందిన సైకోథెరపిస్ట్ మోహినీ సింగ్ ఎంతోమంది యువ క్లైమెట్ యాక్టివిస్ట్లతో కలిసి పనిచేసింది. ‘పరీక్షల్లో ఫెయిల్ కావడం, లవ్ ఫెయిల్యూర్స్, బ్రేకప్స్ సందర్భంగా ఇతరుల నుంచి సానుభూతి, ఓదార్పు దొరికినట్లు క్లెమెట్ యాంగ్జయిటీ విషయంలో దొరకదు. ఎందుకంటే అది చాలామందికి అనుభవం లేని విషయం’ అంటుంది మోహిని. శివానీ గోయల్ తన స్వరాష్ట్రం అస్సాంలో వాతావరణ విధ్వంసంపై పరిశోధన చేస్తోంది. పత్రికలకు వ్యాసాలు రాస్తుంది. సోషల్ మీడియాలో కంటెంట్ను క్రియేట్ చేస్తుంటుంది. ‘నా ప్రయత్నం ఏ కొంచమైనా ఫలితాన్ని ఇస్తుందా?’ అనేది తనకు తరచుగా వచ్చే సందేహం.‘చేయాల్సింది చాలా ఉంది’ అంటున్న గోయల్ ‘ఇక ఏమీ చేయలేం’ అనే నిస్సహాయ స్థితిలోకి వెళ్లి ఆందోళన బారిన పడి ఉండవచ్చుగానీ దాని నుంచి బయటపడడానికి క్లైమెట్ యాక్టివిస్ట్గా తిరిగి క్రియాశీలం కావడానికి ఎంతో సమయం పట్టదు. అలా తొందరగా ఆందోళన నుంచి బయటపడడమే వారి బలం. సమాజానికి వరం.ఐడియాలు ఉండగా ఆందోళన ఏలనోయి!‘పర్యావరణంపై మన ప్రేమ ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటున్న నయన ప్రేమ్నాథ్ డే–టు–డే సస్టెయినబుల్ లైఫ్స్టైల్ ప్రాక్టీసెస్కు సంబంధించిన వీడియోలు, రీల్స్ను యువతరం ఇష్టపడుతోంది. ఆచరిస్తోంది. ‘ధరించకుండా మీరు మూలకు పడేసిన దుస్తులతో ఏంచేయాలి?’ ‘పీసీఆర్ ప్లాస్టిక్ గురించి తెలుసుకుందాం’ ‘జీరో–వేస్ట్ లైఫ్ స్టైల్’... మొదలైన వాటి గురించి బెంగళూరు చెందిన నయన ప్రేమ్నాథ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో పాపులరయ్యాయి. ‘పర్యావరణ పరిరక్షణకు నా వంతుగా కొంత’ అనే భావనకు మద్దతును, బలాన్నీ ఇస్తున్నాయి.పశ్చిమ కనుమల పరిమళంనా మూలాలు పశ్చిమ కనుమలలలో ఉన్నాయి. ఇల్లు బెంగళూరులో ఉంది. ప్రకృతి అంటే ఇష్టం. ‘ఇండియన్ యూత్ క్లైమెట్ మూవ్మెంట్’లో కమ్యూనిటీ ఆర్గనైజర్ని. ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్తో నా ప్రయాణం మొదలైంది. ‘నేచర్ అండ్ ఫ్లూరివర్శిటీ’కి ఫౌండర్ని. అధిక జీతం, పెద్ద సంస్థ అనే దృష్టితో కాకుండా విలువలతో కూడిన ఉద్యోగాలు చేయడం వల్ల ఎకో యాంగ్జయిటీ తగ్గుతుంది. ఎక్కువ జీతం వచ్చే సంస్థలో పనిచేయడం కంటే, పర్యావరణ సంరక్షణకు ఉపయోగపడే సంస్థలో పనిచేస్తున్నందుకు నాకు తృప్తిగా ఉంది. పర్యావరణ సంక్షోభాన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... తుఫాను ఒక్కటే. అయితే మనం వేరు వేరు పడవల్లో ఉన్నాం. పర్యావరణ సంక్షోభాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా చేయాల్సింది ఎంతో ఉంది.– శ్రీరంజని రమణ్, క్లైమెట్ యాక్టివిస్ట్ (చదవండి: కేన్స్ ఫెస్టివల్లో నిదర్శన గోవాని నవరత్న హారం! ఏకంగా 200 మంది కళాకారులు,1800 గంటలు..) -
Lok Sabha Election 2024: పెరిగేదే లే!
ఓటెయ్యండి బాబూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండమ్మా.. ఓటు విలువ తెలుసుకో యువతా అంటూ ఒకవైపు ఎన్నికల సంఘం, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు చెవిలో ‘ఈవీఎం’ కట్టుకుని పోరుతున్నా ఓటర్లలో మాత్రం ఉత్సాహం పెద్దగా కనిపించడం లేదు! ఇప్పటిదాకా జరిగిన మూడు విడతల పోలింగ్లో ఓటింగ్ మందకొడిగానే నమోదైంది. 2019తో పోలిస్తే తగ్గింది కూడా. సుదీర్ఘ షెడ్యూల్, మండుటెండలతో పాటు పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటివి ఇందుకు కారణాలుగా కని్పస్తున్నాయి. తక్కువ ఓటింగ్ మన దేశంలో కొత్తేమీ కాదు. ఈ పరిణామంతో అధికార, ప్రతిపక్షాల్లో ఎవరికి నష్టం, ఎవరికి లాభమన్న చర్చ ఊపందుకుంది...ఈసారి సుదీర్ఘ లోక్సభ ఎన్నికల ప్రక్రియలో మూడు అంకాలు ముగిశాయి. మే 7న మూడో విడతలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 93 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 65.68 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ స్థానాల్లో 2019లో నమోదైన 67.33 శాతంతో పోలిస్తే 1.65 శాతం తగ్గినట్లు ఈసీ డేటా చెబుతోంది. తొలి రెండు విడతల్లోనూ ఇదే తంతు. 102 లోక్సభ స్థానాల్లో ఏప్రిల్ 19న జరిగిన తొలి విడతలో 66.14 శాతం ఓట్లు పడ్డాయి. 2019లో ఈ స్థానాల్లో 69.4 శాతం ఓటింగ్ నమోదైంది. 88 సీట్లకు ఏప్రిల్ 26న రెండో విడత పోలింగ్లో 66.71 శాతం ఓటింగే నమోదైంది. 2019లో ఆ స్థానాల్లో వీటికి 69.2 శాతం ఓటింగ్ జరిగింది. మరో నాలుగు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. అందులో మే 13న జరిగే నాలుగో దశలో అత్యధికంగా 96 సీట్లున్నాయి. చివరి మూడింట్లో పోలింగ్ జరగాల్సిన స్థానాలు 164 మాత్రమే. 2019లో రికార్డు ఓటింగ్... 2019లో 67.4 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటిదాకా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రికార్డు. 1951–52 తొలి లోక్సభ ఎన్నికల్లో నమోదైన 45.67 శాతం ఓటింగ్తో పోలిస్తే ఓటర్లలో చైతన్యం పెరుగుతూ వస్తోందనే చెప్పాలి. అయినా ఇప్పటికీ కనీసం 70 శాతాన్ని కూడా చేరకపోవడం మాత్రం ఆందోళనకరమే. రికార్డు పోలింగ్ నమోదైన గత ఎన్నికలనే తీసుకుంటే జనాభా భారీగా ఉన్న రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఓటింగ్ నమోదవడం గమనార్హం. బిహార్ (57.33%), ఉత్తరప్రదేశ్ (59.21), ఢిల్లీ (60.6%), మహారాష్ట్ర (61.02), ఉత్తరాఖండ్ (61.88%), తెలంగాణ (62.77%), గుజరాత్ (64.51%), పంజాబ్ (65.94%), రాజస్థాన్ (66.34%), జమ్మూ కశీ్మర్ (44.97%), జార్ఖండ్ (66.8%) వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. 2014లో 66.44 శాతం ఓటింగ్ నమోదైంది. 2009లో నమోదైన 58.21 శాతంతో పోలిస్తే ఏకంగా 8.23 శాతం పెరిగింది! మన దేశంలో ఓటింగ్ ఒకేసారి అంతలా ఎగబాకడం కూడా రికార్డే.ఎందుకు తగ్గుతోంది...! ఈ లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికైతే ఓటింగ్ సరళి నిరాసక్తంగానే ఉంది. మిగతా నాలుగు విడతల్లో ఓటర్లు భారీగా బాగా బారులు తీరితేనే కనీసం 2019 స్థాయిలోనైనా ఓటింగ్ నమోదయ్యే అవకాశముంటుంది. లేదంటే భారీగా తగ్గే సూచనలే కనిపిస్తున్నాయి... ⇒ పట్టణ ఓటర్లు ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం ఓటింగ్ శాతం పడిపోవడానికి ముఖ్య కారణాల్లో ఒకటి. మూడు విడతల్లో పట్టణ నియోజకవర్గాల్లో పేలవ ఓటింగే ఇందుకు నిదర్శనం. ⇒ యూపీలోని గాజియాబాద్లో 2019లో 55.88 శాతం ఓట్లు పడగా ఈసారి 49.88 శాతానికి దిగజారింది. కర్నాటకలోని బెంగళూరు సెంట్రల్లో 54.31 శాతం నుంచి 54.06 శాతానికి; బెంగళూరు సౌత్లో 53.69 శాతం నుంచి 53.17 శాతానికి తగ్గింది. ⇒ 2019లో కూడా పట్టణ ఓటర్లలో ఇదే ధోరణి కనబడింది. అత్యంత తక్కువ ఓటింగ్ నమోదైన 50 లోక్సభ స్థానాల్లో 17 మెట్రోపాలిటన్, పెద్ద నగరాల్లోనే కావడం గమనార్హం. ⇒ తక్కువ ఓటింగ్కు వలసలు కూడా కారణమే. పొట్టకూటి కోసం వలస వెళ్లేవాళ్లు ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఓటింగ్ తగ్గుతున్నట్లు తేలింది. ⇒ వచ్చి ఓటేసేంత స్థోమత లేకపోవడం, కూలి డబ్బులను వదులుకోలేని అశక్తత వల్ల వారు ఓటింగ్కు దూరంగా ఉండిపోతున్నారు. ⇒ దేశంలో అత్యధిక ఓటర్లున్న ఉత్తరప్రదేశ్లో అతి తక్కువ ఓటింగ్ నమోదవడం దీనికి నిదర్శనం. ⇒ మండుటెండలు కూడా ఓటింగ్కు గండికొడుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ⇒ రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత మరింత పెరిగేలా ఉండటంతో మిగతా నాలుగు విడతల ఓటింగ్పైనా తీవ్ర ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు.ఫలితాలపై ప్రభావం.. ఎప్పుడెలా...?! 1951 నుంచి 2019 వరకు లోక్సభ ఎన్నికల ఫలితాలను చూస్తే భారీగా ఓటింగ్ పెరిగినప్పుడు, తగ్గినప్పుడు అనూహ్య ఫలితాలే వచ్చాయి. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 ఎన్నికల్లో ఓటింగ్ 5 శాతం పైగా పెరిగి 60 శాతం దాటింది. ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఘోర పరాజయం పాలై జనతా కూటమికి అధికారం దక్కింది. 1980లో ఓటింగ్ మళ్లీ భారీగా పడిపోయింది. అధికార జనతా పార్టీ ఓడి కాంగ్రెస్ విజయం సాధించింది. 1984 ఎన్నిక్లలో ఓటింగ్ 7 శాతం పైగా పెరగడం ఇందిర మరణంపై వెల్లువెత్తిన సానుభూతికి నిదర్శనంగా నిలిచింది. రాజీవ్గాంధీ ఘన విజయం సాధించారు. 1989లో మళ్లీ ఓటింగ్ తగ్గింది. కాంగ్రెస్ ఏకంగా సగానికి పైగా సీట్లను కోల్పోయింది. 1991 ఎన్నికల్లోనూ ఓటింగ్ 6 శాతానికి పైగా తగ్గింది. మళ్లీ అధికార పక్షానికి షాక్ తగిలి కాంగ్రెస్ గద్దెనెక్కింది. 2004లో ఓటింగ్ స్వల్పంగానే తగ్గినా ఐదేళ్ల వాజ్పాయి సర్కారు ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కారు కొలువుదీరింది. 2009 ఓటింగ్ స్వల్పంగా పెరిగింది. యూపీఏ ప్రభుత్వమే కొనసాగింది. 2014లో ఓటింగ్ రికార్డు స్థాయిలో 8 శాతానికి పైగా పెరిగింది. బీజేపీ తొలిసారి ఘనవిజయం కొట్టింది. పెరిగిన ఓటింగ్ మోదీ వేవ్కు అద్దం పట్టింది. 2019లోనూ 1 శాతం అధికంగా ఓట్లు పోలయ్యాయి. బీజేపీ మెజారిటీ మరింత పెరిగింది. ఆ లెక్కన ఈసారి ఓటింగ్ భారీగా తగ్గితే కచి్చతంగా అనూహ్య ఫలితాలే రావచ్చంటున్నారు రాజకీయ పండితులు.అధికార పార్టీకే నష్టమా? 2019లో 67.4 శాతం ఓటింగ్ జరిగినా వాస్తవంగా చూసుకుంటే 30 కోట్ల మంది ఓటే వేయలేదు! ఇదే నిరాసక్తత ఈసారి కూడా కొనసాగితే ఓటింగ్కు దూరంగా ఉండేవారి సంఖ్య 35 కోట్లకు పెరగవచ్చు. ఓటింగ్ భారీగా తగ్గడం దేనికి సంకేతమన్న దానిపైనా పలు రకాలు వాదనలున్నాయి. ఓటింగ్ పడిపోవడం అధికార పారీ్టకే ఎక్కువ నష్టమని చరిత్ర చెబుతోంది, అయితే ఇది అన్నివేళలా నిజం కాదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘‘ఓటింగ్ తక్కువగా నమోదైనప్పుడు ఓటర్ల మనోగతాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓటింగ్ తగ్గుదల 5 శాతం లోపుంటే ప్రజలు మార్పు కోరుకోవడం లేదని, పెద్దగా స్తబ్ధత లేదని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో స్థానికాంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన ఫలితాలు రావచ్చు. ఏదైనా జరగొచ్చు’’ అంటున్నారు రాజీకీయ విశ్లేషకుడు నోమిత పి.కుమార్. ఓట్ల శాతం భారీగా తగ్గడం వల్ల మెజారిటీలకు గండిపడి ఒక్కోసారి ఫలితాలు భారీగా తారుమారవుతాయన్నది మరికొందరి వాదన.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
యువ సంగీతాభిమానులకు అచ్చంగా సరిపోయే మాట... మ్యూజిక్ మేక్స్ ఎవ్రీ థింగ్ బెటర్. ఇట్టే మరిచిపోయే లక్షణం నుంచి జ్ఞాపకశక్తి పెరగడం వరకు, క్రియేటివిటీని ఎంజాయ్ చేయడం నుంచి క్రియేటివ్ పవర్ పెంచుకోవడం వరకు, జడత్వం నుంచి నిత్యజీవనోత్సాహం వెల్లివిరియడం వరకు, అనామకత్వం నుంచి ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగడం వరకు ఎన్నోరకాలుగా సంగీతం యువతకు బలం అయింది. సంగీత రత్నాలను వెదుకుతూ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలోకి అడుగు పెట్టిన యువతరం ఆ ప్లాట్ఫామ్లలోనే మ్యూజిక్ స్టార్లుగా మెరవడం ఈ తరంలో కనిపిస్తున్న ప్రత్యేకత.∗ స్పాటిఫైతో ప్రయాణం ప్రారంభించి స్టార్గా ఎదిగిన ఆర్టిస్ట్లలో జస్లీన్ రాయల్ ఒకరు. సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్గా మంచి పేరు తెచ్చుకుంది. హిట్ బాలీవుడ్ ట్రాక్స్ కంపోజ్ చేసింది. ‘ప్రపంచ ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి, శ్రోతల అభిప్రాయాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా మ్యూజిక్ కంపోజింగ్లో మార్పులు చేయడానికి స్పాటిఫై ఉపయోగపడింది’ అంటుంది జస్లీన్ రాయల్.∗ ఆరు సంవత్సరాల వయసులో పాటల కోసం గొంతు సవరించింది బెంగళూరుకు చెందిన దియా వదిరాజ్. రకరకాల మ్యూజిక్ జానర్లలో టాలెంటెడ్ సింగర్గా పేరు తెచ్చుకుంది. కోల్కతాకు చెందిన రనితా బెనర్జీ అయిదు సంవత్సరాల వయసులో ‘సింగింగ్ స్టార్’ షోలో పాల్గొంది. ‘స రే గ మ ప’ లిటిల్ ఛాంప్స్లో ఫస్ట్ రన్నర్–అప్గా నిలిచింది. ‘స్వీట్ వాయిస్’ రనిత గొంతు నుంచి వచ్చిన ‘జరాసీ ఆహట్’ పాట 6.2 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది.∗ మల్టీ టాలెంటెడ్ సింగర్గా పేరు తెచ్చుకుంది అంకిత కుందు. రియాల్టీ షోలలో పాడడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిహార్కు చెందిన మిథాలీ ఠాకూర్ ‘రైజింగ్ స్టార్’ షోతో ఫేమ్ అయింది. భోజ్పూరి, క్లాసికల్, ఫోక్ సాంగ్స్ను పాడడంలో మంచి పేరు తెచ్చుకుంది. యూట్యూబ్లో ఆమె వీడియోలు మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకున్నాయి. ఇండియన్–అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ లిశా మిశ్రా పాటలను రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేది. బాలీవుడ్ సినిమాలలో కూడా పాడింది. ఇండియన్ ఐడల్ జూనియర్గా 2015లో సంగీత ప్రపంచానికి పరిచయం అయింది భువనేశ్వర్కు చెందిన అనన్య నందా. బాలీవుడ్ పాటల్లోనే కాదుక్లాసికల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. మెలోడియస్ వాయిస్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.∗ బోస్టన్ (యూఎస్)లో పుట్టిన అవంతి నగ్రల్కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. ముంబైకి వచ్చిన తరువాత తన పాషన్నే కెరీర్గా చేసుకుంది. మ్యూజిక్లో రకరకాల జానర్స్ను మిక్స్ చేయడంలో గట్టి పట్టు సాధించిన అవంతికి యూట్యూబ్ చానల్ కూడా ఉంది. ఇందులో తన లైవ్ పర్ఫార్మెన్స్ వీడియోలను అప్లోడ్ చేస్తుంది. అవంతికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.∗ ఆర్ అండ్ బీ, హిప్–హాప్, సోల్, పాప్ మ్యూజిక్లలో బహుముఖ ప్రజ్ఞ చాటుకుంటోంది ఇలీన హ్యాట్స్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ముంబైకి చెందిన సాచి రాజాధ్యక్ష ఆల్ట్–పాప్ మ్యూజిక్లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఆమె పవర్ఫుల్, సోల్ వాయిస్కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.∗ దియ నుంచి అవంతి వరకు ఎందరో, ఎందరెందరో యంగ్ మ్యూజిషియన్స్ సంగీతం పట్ల అంకితభావంతో సెల్ఫ్–మేడ్ సూపర్స్టార్లుగా ఎదిగారు. ఎంతోమంది ఔత్సాహికులకు రోల్ మోడల్స్గా మారారు. -
హత్య చేసి.. ఆపై ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేసి
నిజాంపేట్: ప్రతీకారంతో రగిలిపోతున్న ఓ గ్యాంగ్ ప్రత్యర్థి కోసం కాపు కాసి పక్కా స్కెచ్తో అదును చూసి అంతమొందించింది. ఆపై హత్యకు ఉపయోగించిన కత్తులు పట్టుకొని నృత్యాలు చేస్తూ రక్తంతో తడిసిన చేతులతో రీల్స్ చేసి లెక్క సరిపోయింది..పగ తీర్చుకున్నామంటూ ఇన్స్ట్రాగామ్లో పోస్టు పెట్టి సంచలనం సృష్టించింది. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్రావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలోని బోరబండలో నివాసముండే షేక్ షరీఫ్ గ్యాంగ్స్టర్. చిన్నచిన్న నేరాలకు పాల్పడుతుండేవాడు. ఓ కేసు విషయంలో షేక్ షరీఫ్ జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన దగ్గర నంబర్–2గా ఉన్న తరుణ్రాయ్ గ్యాంగ్ మొత్తానికి తన ఆదీనంలోకి తీసుకున్నాడు. దీంతో షరీఫ్, తరుణ్రాయ్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. 2023లో దసర పండగరోజున రావణ దహనం సందర్భంగా షరీఫ్ గ్యాంగ్ తరుణ్రాయ్ను హత్య చేసింది. ఈ ఘటనలో ఏడుగురు పాలుపంచుకోగా, ప్రగతినగర్లో హత్యకు గురైన తేజస్ అలియాస్ తేజు అలియాస్ డీల్ ఏ3గా ఉన్నాడు. రెండు నెలల క్రితం బెయిల్పై వచ్చిన తేజస్ బెయిల్పై బయటకు వచ్చాక తేజస్ ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ముందే గ్రహించి బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్లోబతుకమ్మకుంట వద్ద ఓ అపార్ట్మెంట్లో తల్లితో కలిసి ఉంటున్నాడు. తన గ్యాంగ్ స్నేహితులతో మాట్లాడటం, కలిసి పార్టీలు చేసుకోవడం జరిగేది. అయితే ఈ క్రమంలో తేజస్ తన స్నేహితులతో నెక్ట్స్ టార్గెట్ సమీర్ అని..అతడిని కూడా లేపేస్తామంటూ మాట్లాడినట్టు ప్రత్యర్థులకు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం తేజస్ తల్లి ఇంట్లో లేకపోవడంతో బోరబండ నుంచి స్నేహితులు మహేశ్, శివప్ప, మహేశ్లు ప్రగతినగర్కు వచ్చారు. తేజస్ ఇంట్లో నలుగురు కలిసి మద్యం సేవిస్తున్నారు. వచ్చిన ముగ్గురు స్నేహితుల్లో శివప్ప రెండు గ్యాంగ్లకు కామన్ ఫ్రెండ్. దీంతో ప్రత్యర్థులు శివప్పతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న తేజస్ను హత్య చేయాలని పథకం వేసి, శివప్పతో లోకేషన్ షేర్ చేయించుకున్నారు. దాని ఆధారంగా ప్రగతిగనగర్లోని తేజస్ ఇంటి సమీపంలోకి చేరుకున్నారు.. తెల్లవారుజామున ఫుల్గా తాగిన తేజస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బైక్ ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తేజస్పై కత్తులతో సమీర్, శివప్ప, సిద్దేశ్వర్, జయంత్లు విచక్షణరహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం కత్తులు చూపుతూ రీల్స్ చేసి ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. ఈ రీల్స్కు రక్తచరిత్ర సినిమాలోని పాటను జత చేశారు. హత్యకు పాల్పడిన వారిని, తేజస్తో మద్యం సేవించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
J-బ్యూటీకి సై అంటున్న యువత, అసలేంటీ జే బ్యూటీ?
చర్మం జిడ్డుగా లేకుండా ఉండడానికి ఏంచేయాలి? కంటి కింద నల్ల వలయాలను ఎలా తప్పించాలి? ఎండ నుంచి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి? చర్మం మెరవాలంటే ఏం చేయాలి? చర్మసంరక్షణ నుంచి సౌందర్యం వరకు సందేహాల సముద్రంలో ఈదులాడుతున్న యువతరానికి నిన్నా మొన్నటి వరకు ‘కె–బ్యూటీ’ లేదా కొరియన్ బ్యూటీ చుక్కానిగా కనిపించింది. అయితే ఇప్పుడు యూత్ దృష్టి జె–బ్యూటీ(జపనీస్ బ్యూటీ)పై మళ్లింది. ఇది జపాన్ బ్యూటీ బ్రాండ్ల మార్కెటింగ్ మాయాజాలమా? సహజమైన పరిణామమా? అనే చర్చను పక్కనపెడితే ‘జె–బ్యూటీ’లోని సహజత్వాన్ని, వాబీ–సాబీ తత్వాన్ని యువతరం బాగా ఇష్టపడుతోంది... మృదువైన చర్మం కోసం కలలు కనే యువతరానికి చిరపరిచితమైన ట్రెండ్ కె–బ్యూటీ( కొరియన్–బ్యూటీ) బ్యూటీ ఇండస్ట్రీపై భారీ ప్రభావాన్ని చూపించింది. మైండ్ – బాగ్లింగ్ ప్రొడక్ట్స్, మల్టీ–స్టెప్ రొటీన్స్తో ‘కె–బ్యూటీ’ గ్లోబల్ సెన్సేషన్గా నిలిచింది. యువ ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకుంది. తాజా విషయానికి వస్తే ‘జె–బ్యూటీ’ లేదా జపనీస్ బ్యూటీ యువతరం ఫేవరెట్గా మారింది. ‘పవర్ఫుల్ సిస్టర్ ఆఫ్ కె–బ్యూటీ’ గా పేరు తెచ్చుకున్న ‘జె–బ్యూటీ’ కె–బ్యూటీని అధిగమించేలా దూసుకుపోతోంది. ఇండియన్ ఇన్ఫ్లూయెన్సర్లతో కలిసి జపనీస్ బ్యూటీ బ్రాండ్లు కలిసి పనిచేయడం కూడా మన దేశంలో ‘జె–బ్యూటీ’ పాపులారిటీకి కారణం అయింది. ‘జె–బ్యూటీ’కి ఎందుకు ఇంత పాపులారిటీ వచ్చింది... అనే విషయానికి వస్తే... నిపుణుల మాటల్లో చెప్పాలంటే...‘జె–బ్యూటీ’లోని ప్రధాన ఆకర్షణ సింప్లిసిటీ, ఎఫెక్టివ్నెస్. ‘ప్రివెన్షన్ రాదర్ దేన్ కరెక్షన్ ’ తత్వంతో కూడిన ఈ విధానం హ్యాపీగా, హెల్తీగా ఉండేలా చర్మ సంరక్షణతో΄ాటు పర్యావరణ ఒత్తిళ్ల నుంచి రక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది, గ్రీన్ టీ, రైస్ బ్రాన్, సీవీడ్లాంటి ΄ ఇన్గ్రేడియెంట్స్ ‘జె–బ్యూటీ’లో భాగం అయ్యాయి. ‘ఘుమఘుమలతో కూడిన ఖరీదైన వంటకాల కంటే సాదాసీదా పప్పన్నం ఎంచుకోవడం లాంటిదే జె–బ్యూటీ. దీనిపై జపనీస్ తత్వం వాబీ–సాబీ ప్రభావం ఉంది. ఇంపర్ఫెక్షన్, సింస్లిపిటీ నుంచి అందాన్ని దర్శించడమే వాబీ –సాబీ తత్వం. జె–బ్యూటీ ప్రాథమికంగా రెండు విషయాలపై దృష్టి పెడుతుంది. వర్తమానంలో చర్మ సౌందర్యం. రెండోది భవిష్యత్తులో చర్మ సమస్యలు రాకుండా నివారించడం’ అంటుంది ముంబైకి చెందిన డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శిఖా షా. జపనీస్ కల్చర్ అండ్ లైఫ్స్టైల్పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరగడం కూడా మన దేశంలో ‘జె–బ్యూటీ’పై ఆసక్తి కలిగించే కారణాలలో ఒకటి. ‘ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం 11–12 స్టెప్ స్కిన్కేర్ రొటిన్ అవసరం అనే అ΄ోహను జె– బ్యూటీ బ్రేక్ చేసింది’ అంటుంది డాక్టర్ మోనికా బాంబ్రూ. ‘కె–బ్యూటీ’తో పోల్చితే ‘జె–బ్యూటీ’ని ప్రత్యేకంగా ఉంచుతున్నదేమిటి? అనే విషయానికి వస్తే... చర్మసంరక్షణ విషయంలో రెండిటికీ పేరు ఉన్నప్పటికీ వాటి విధానాలు, తత్వం వేరు. ‘కె–బ్యూటీ’ అనేది ఇన్నోవేషన్, ఎక్స్పెరిమెంటేషన్పై దృష్టి పెడుతుంది. మల్టీ–స్టెప్ రొటిన్స్, ట్రెండ్–డ్రైవన్ ఫార్ములేషన్స్ ఉంటాయి. ఇక ‘జె–బ్యూటీ’ అనేది సింప్లిసిటీ, మినిమలిజం, సహజపదార్థాలపై దృష్టి పెడుతుంది. ‘జె–బ్యూటీకి తిరుగులేదు’ అని అంటుంది ముంబైకి చెందిన అద్విక శ్రీవాస్తవ. ‘జె–బ్యూటీ’పై కొండంత ఇష్టంలోనూ ఆచితూచి ఆలోచించేవారు లేకపోలేదు. ఇందుకు ఉదాహరణ బెంగళూరుకు చెందిన చైత్ర. ‘కె–బ్యూటీతో పోల్చితే జె–బ్యూటీ ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలా అని వేలంవెర్రిగా జె–బ్యూటీ ప్రొడక్ట్స్ కొనాలనుకోవడం లేదు. జె–బ్యూటీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటుంది చైత్ర. క్లీన్ బ్యూటీ ట్రెండ్ గతంలో పోల్చితే జపనీస్ బ్యూటీ కంపెనీలపై యువత ఆసక్తి పెరిగింది. దీనికి అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు మారుతున్నాయి...అంటుంది గ్లోబల్ డేటా ర రిపోర్ట్ ‘కె–బ్యూటీ అనేది ట్రెండీ ఇన్గ్రేడియెంట్స్, ఆకర్షణీయమైన ప్యాకింగ్, క్విక్ రిజల్ట్కు ప్రాధాన్యత ఇస్తుంటే జె–బ్యూటీ ఇందుకు భిన్నంగా సహజమైన పదార్థాలతో శాశ్వత ప్రభావంపై దృష్టి పెడుతుంది’ అంటున్నాడు ‘గ్లోబల్ డేటా’ కన్జ్యూమర్ అనలిస్ట్ మణి భూషణ్ శుక్లా. ‘సహజ’ ‘సేంద్రియ’ ‘అలెర్జీరహిత’ మాటలతో ‘జె–బ్యూటీ’ ‘క్లీన్ బ్యూటీ’ ట్రెండ్గా పేరు తెచ్చుకుంది. -
యువతకు జాక్పాట్.. భారీ వేతనంతో ఉద్యోగాలు!
హర్యానాకు చెందిన యువతకు ఇజ్రాయెల్లో అత్యధిక వేతనంలో కూడిన ఉద్యోగాలు లభించాయి. దీంతో 530 మంది యువకుల బృందం హర్యానా నుండి ఇజ్రాయెల్కు బయలుదేరింది. వీరిని హర్యానా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంపిక చేసింది. ఇంతకుముందే వీరికి ఇంటర్వ్యూలు పూర్తికాగా, ఇప్పుడు వీరంతా ఇజ్రాయెల్కు పయనమయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మంగళవారం 530 మంది యువకులు న్యూఢిల్లీ నుండి ఇజ్రాయెల్కు వెళ్లారు. దీనికి ముందు హర్యానా సీఎం నయాబ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఈ యువకులతో మాట్లాడారు. ఇజ్రాయెల్లో ఉద్యోగాల భర్తీకి హర్యానా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ క్రమంలో గత జనవరిలో రోహ్తక్లో ఆరు రోజుల పాటు జరిగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. మొత్తం 8,199 మంది యువకులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరు ఇజ్రాయెల్ వెళ్లే ముందు హర్యానా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ ఈ యువకులను అభినందించారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్లో కార్మికుల కొరత తలెత్తింది. దీంతో కార్మికులను తమ దేశానికి పంపాలని ఇజ్రాయెల్ భారతదేశాన్ని అభ్యర్థించింది. ఇజ్రాయెల్లో 10 వేల మంది నిర్మాణ కార్మికుల అవసరం ఉంది. వీరికి నెలకు రూ.1,37,000 జీతం లభించనుంది. దీంతో పాటు వైద్య బీమా, ఆహారం, వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. -
నేడు వరల్డ్ థియేటర్ డే
పెద్దలు ఇష్టపడే కళగా గుర్తింపు పొందిన ‘నాటక కళ’పై యువత ఆసక్తి ప్రదర్శించడమే కాదు అందులో ఇష్టంగా భాగం అవుతోంది. పాశ్చాత్య నాటకాల పరిశీలన నుంచి మన నాటకాలలో ప్రయోగాల వరకు నాటకరంగంపై యువ సంతకం మెరుస్తోంది.... తిరువనంతపురంలోని ‘నిరీక్షణ ఉమెన్స్ థియేటర్’ వారి నాటకమహోత్సవానికి హాజరైన రోజు నుంచి నందినికి నాటకరంగంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. దేశ నలుమూలల నుంచి ఎనిమిది మంది మహిళా దర్శకుల నాటకాలను ఈ నాటక మహోత్సవంలో ప్రదర్శించారు. ఇందులో మూడు స్ట్రీట్ప్లేలు కూడా ఉన్నాయి. ఇరవై నాలుగు సంవత్సరాలుగా కళాప్రియులను ఆకట్టుకుంటున్న ‘నిరీక్షణ’ నిర్వహించే వర్క్షాప్లకు యువతరం నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘నాటకాలు చూడడం తప్ప ఎప్పుడూ ఆడలేదు. స్వాతి తిరునాల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో నిరీక్షణ నిర్వహించిన వర్క్షాప్కు హాజరైన తరువాత నటనపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మనీష. ఎంబీఏ చేస్తున్న మనీష రంగస్థల పాఠాలపై కూడా దృష్టి పెడుతోంది.నాటకరంగంపై యువతకు ఆసక్తి కలిగించడానికి భూపేష్ రాయ్, ప్రియాంక సర్కార్లు లక్నోలో నిర్వహించిన థియేటర్ ఫెస్టివల్కు మంచి స్పందన లభించింది. ‘ఒకప్పుడు థియేటర్ ఫెస్టివల్ అంటే పెద్దవాళ్లు ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు యూత్ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నాటకాలపై చర్చించుకుంటున్నారు’ అంటున్నాడు భూపేష్ రాయ్. బెంగళూరులోని ఆల్–ఉమెన్ ట్రూప్ ‘ది అడమెంట్ ఈవ్స్’ యువతలో నాటకరంగంపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ట్రూప్లో సభ్యురాలైన బాలశ్రీ యూఎస్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు నాటకాలకు సంబంధించిన ఒక వర్క్షాప్కు హాజరైంది. ఇక అప్పటినుంచి నాటకరంగం ఆమెకు ఇష్టంగా మారింది. ఒకవైపు అనలిస్ట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే నాటకాల్లో నటిస్తోంది. పిల్లల నుంచి యువతకు వరకు ఎంతోమందిలో నాటకరంగంపై ఆసక్తి కలిగిస్తోంది కావ్య శ్రీనివాసన్. ఆమె థియేటర్ యాక్టర్, ప్లేరైటర్, స్టోరీ టెల్లర్. మధు శుక్లా థియేటర్ ప్రాక్టీషనర్, కోచ్, స్టోరీ టెల్లర్. వృత్తిరీత్యా అనలిస్ట్ అయిన లక్ష్మీ ప్రియా మంచి నటి. ఉద్యోగ సమయం తరువాత ఈ బృందం రిహార్సల్స్, ప్లానింగ్, ఇంప్రూవ్డ్ షోలు చేస్తుంది. ప్రతి మంగళ, గురువారాల్లో ఏదో ఒక మెంబర్ ఇంట్లో రిహార్సల్ కోసం సమావేశం అవుతారు. ‘వేదికపై ఉన్నప్పుడు సౌకర్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండడానికి తమ నైపుణ్యాలను నటులు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం అవసరం’ అంటుంది బాలశ్రీ. కావ్య శ్రీనివాస్ నుంచి బాలశ్రీ వరకు ఎంతోమంది నాటకరంగ కళాకారులు యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు.నాటకరంగంలో చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు క్వాసర్ ఠాకూర్ పదంసీ. ఇరవై సంవత్సరాల వయసులో సెక్యూర్డ్ జాబ్ను వదిలేసి నాటకరంగానికి అంకితం అయ్యాడు ‘వ్యక్తుల జీవిత కథలను మరింత శక్తిమంతంగా చెప్పే దిశగా భారతీయ నాటకరంగం ప్రయాణిస్తోంది. మన నాటకం కాలంతోపాటు పయనిస్తూ ఎప్పటికప్పుడూ కొత్త సాంకేతికతను సొంతం చేసుకుంటుంది. లైవ్ కెమెరాలు, ప్రొజెక్షన్లు నాటకరంగంలో భాగం అయ్యాయి’ అంటాడు పదంసీ. మన నాటకరంగ విశిష్ఠతను ఒకవైపు చెబుతూనే మరోవైపు... ‘కష్టాలు ఉంటాయి. ఇదేమీ లాభసాటి వృత్తి కాదు’ అంటాడు. అయితే అభిరుచులు, ఆసక్తులను వాణిజ్య కొలమానాలతో చూడడానికి ఇష్టపడని యువత నాటకరంగాన్ని అమితంగా ప్రేమిస్తోంది. నాటక సమాజాలతోపాటు అవి చేస్తున్న ప్రయోగాల గురించి కూడా ఆసక్తిగా తెలుసుకుంటోంది. రేపటి నాటకానికి తమ వంతుగా సన్నద్ధం అవుతోంది. తమాషాగా సంతోషంగా... ముంబైకి చెందిన సపన్ శరణ్ పోయెట్, రైటర్, యాక్టర్. థియేటర్ కంపెనీ ‘తమాషా’ ఫౌండింగ్ మెంబర్లలో ఒకరు. కొత్త రకం ఐడియాలకు ‘తమాషా’ పుట్టిల్లుగా మారింది. శరణ్ మొదటి నాటకం క్లబ్ డిజైర్. క్రమం తప్పకుండా నాటకాలు ప్రదర్శించే శరణ్ మోడలింగ్ చేస్తుంది, సినిమాల్లో నటిస్తుంది. కవితలు కూడా రాస్తుంటుంది. నాటకరంగానికి సంబంధించి కొత్త ప్రయోగాలు చేయడంలో యువతరానికి స్ఫూర్తి ఇస్తున్న వారిలో సపన్ శరణ్ ఒకరు. తోడా ధ్యాన్ సే... సమకాలీన సామాజిక అంశాలను చర్చించడానికి నాటకాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటున్న వారిలో దిల్లీకి చెందిన థియేటర్ ప్రాక్టీషనర్ మల్లికా తనేజా ఒకరు. పురుషాధిక్యత నిండిన కళ్లతో స్త్రీని ఎలా చూస్తారు? స్త్రీ భద్రతకు వస్త్రధారణకు ఎలా ముడిపెడతారు? అదృశ్య అణచివేతరూపాలు... మొదలైన అంశాలను తన సోలో నాటకం ‘తోడా ధ్యాన్ సే’ ప్రతిబింబిస్తుంది. మల్లిక వ్యక్తిగత అనుభవాలే ఈ నాటకానికి పునాది. రంగస్థలమే పాఠశాల మన దేశంలోని ప్రతిభావంతులైన యువనటులలో ఐరా దూబే ఒకరు. ‘యేల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చదువుకుంది. ‘9 పార్ట్స్ ఆఫ్ డిజైర్’ లో ఆమె సోలో పెర్ఫార్మెన్స్కు మంచి పేరు వచ్చింది. దూబే కుటుంబంలో చాలామంది నటులు ఉన్నారు. అందుకే సరదాగా ‘నాటకాల ఫ్యామిలీ’ అని పిలుస్తారు.‘‘థియేటర్ ఆర్ట్స్పై యంగ్ పీపుల్ ఆసక్తి ప్రదర్శించడమే కాదు నాటకకళ పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. యువనటులకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. మనం ఒక నాటకం చేస్తే ఏ కారణం కోసం చేస్తున్నామో, ఏ ప్రేక్షకుల కోసం చేస్తున్నామో తెలుసుకోవాలి. టార్గెట్ ఆడియెన్స్ గురించి అవగాహన కూడా ముఖ్యం. యాక్టింగ్ స్కూల్ ద్వారా మాత్రమే నటన వస్తుంది అనే దాన్ని నేను నమ్మను. రంగస్థలమే పాఠశాల. అక్కడే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు’’ అంటుంది ఐరా దూబే. -
మోదీ భజన చేసే యువత చెంప పగలగొట్టాలి: కర్ణాటక మంత్రి
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల కర్ణాటక రాష్ట్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని, ప్రధానిని పొగిడే యువత చెంప పగలగొట్టాలని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి అన్నారు. కారటగిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి శివరాజ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మరోసారి ప్రజలను మోసం చేయవచ్చని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. ‘రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. ఇచ్చారా? మోదీ మోదీ అని నినాదాలు చేస్తూ ఆయనకు మద్దతిచ్చే యువత సిగ్గుపడాలి. వాళ్ల చెంప పగలగొట్టాలి. పదేళ్లుగా అబద్ధాలతోనే నడిపించారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘దేశంలో 100 స్మార్ట్ సిటీలు ఇస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. అవి ఎక్కడ ఉన్నాయి? ఒక్కటైనా చెప్పండి’ అని ప్రశ్నించారు. ‘ఆయన (ప్రధాని మోదీ) తెలివైనవాడు. బాగా దుస్తులు ధరిస్తాడు. స్మార్ట్ ప్రసంగాలు చేస్తాడు. సముద్రపు లోతుల్లోకి వెళ్లి పూజలు చేస్తూ స్టంటులు చేస్తాడు. ఒక ప్రధానమంత్రి చేయవలసిన పని ఇదేనా?’ అన్నారు. -
హోలీ రాకుండానే యువకుల హంగామా!
రంగుల పండుగ హోలీ మరికొద్ది రోజుల్లో రానుంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే హోలీ రాకుండానే కొందరు యువకులు రోడ్డుపై వెళ్తున్న వారిపై వాటర్ బెలూన్లు విసురుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుల చేష్టలకు బలైనవారితో పాటు ఈ వీడియో చూసిన వారంతా ఆ కుర్రాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటివారిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు నీరు నింపిన కొన్ని బెలూన్లను పట్టుకున్నట్లు కనిపిస్తుంది. కారులో వెళుతున్నవారు సన్రూఫ్ నుండి ఆ బెలూన్లను రోడ్డుపై వెళుతున్న వారిపైకి విసరడం వీడియోలో కనిపిస్తుంది. కాగా అదే రోడ్డుపై ఆ కారును వెంబడిస్తున్న మరో కారులోని వ్యక్తి ఈ ఉదంతాన్ని ఈ వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో @gharkekalesh అనే పేజీలో షేర్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటి వరకూ 9 లక్షల 94 వేల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ఇలా చేయడం తప్పు. వీరిపై చర్య తీసుకోవాలి’ అని రాశారు. మరొక యూజర్ ‘ఆ కారు నంబర్ను చూసి, పోలీసులకు ట్యాగ్ చేయాలి’ అని కోరాడు. Water-Balloon Kalesh (On 16.03.24 in vasant kunj New Delhi, these two boys throwing random water balloons on people and ladies too on the street) pic.twitter.com/2rU5jLe4f6 — Ghar Ke Kalesh (@gharkekalesh) March 19, 2024 -
శ్రీరాంసాగర్ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు
సాక్షి, నిజామాబాద్: మహాశివరాత్రి పండుగపూట నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్సీ లక్ష్మీ కాలువ హెడ్రెగ్యులేటర్ వద్ద శుక్రవారం జరిగింది. గల్లంతైన యువకులను సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. వీరంతా జక్రాన్పల్లి మండలం గున్యా తండా వాసులుగా గుర్తించారు యువకులు మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: మహాశివరాత్రి నాడు విషాదం.. కరెంట్ షాక్తో 14 మంది చిన్నారులకు గాయాలు -
యువతరానికి దిక్సూచి ‘భవిత’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు పారిశ్రామికవేత్తలు ఫిదా అయ్యారు. ‘భవిత’ పేరుతో ప్రారంభించిన స్కిల్ కాస్కేడింగ్ కార్యక్రమం.. యువత భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మ్యాన్ పవర్ దొరుకుతోందని.. ఇక్కడ విద్యార్థుల్ని సానబెడితే అన్ని రంగాల్లోనూ రాణించగల సత్తా ఉందని సూచించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం.. తమలాంటి ఎందరో యువతీ యువకుల జీవన స్థితిగతుల్ని మార్చేసిందని ఉద్యోగాలు పొందిన యువత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నేను కోరుకున్న ఫీల్డ్లో స్థిరపడ్డాను మాది విశాఖపట్నం పెదగంట్యాడ. మా నాన్న లిఫ్ట్ ఆపరేటర్, అమ్మ గృహిణి, నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్లో స్ధిరప డాలని సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు గురించి తెలుసుకొని రిజిస్టర్ చేసుకొని ట్రైనింగ్ తీసుకున్నాను. మాకు టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్కు ఎంపికయ్యాను. చెన్నైలోని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో 4 రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను. – దీపిక, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ, చెన్నై స్కిల్లింగ్ ఎకో సిస్టమ్ని అభివృద్ధి చేసిన ఏపీ.. ఏపీలో యంగ్ సీఎం ఉన్నారు. అందుకే యువతకి అవకాశాలు ఎక్కువగా కల్పించాలన్న ఆలోచనలతో అడుగులు వేస్తున్నారు. సింగపూర్లో స్కిల్లింగ్కి ఏజ్ బార్ లేదు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. దేశంలో స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ని అభివృద్ధి చేసిన రాష్ట్రం ఆంధప్రదేశ్ మాత్రమే. పదిస్థాయిల్లో శిక్షణ అందించేలా స్కిల్ పిరమిడ్ను కూడా సీఎం జగన్ రూపొందించారు. యువతకి నైపుణ్యాన్ని పెంపొందించే ప్రోగ్రామ్ని కూడా తయారు చేశారు. పరిశ్రమలతో అనుసంధానం చేయడంతో వారికి కావాల్సిన సాంకేతిక నైపుణ్యం ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. – బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ఆర్థిక, స్కిల్డెవలప్మెంట్ శాఖ మంత్రి ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం మా సంస్థని, పెట్టుబడుల్ని ఎంతగానో ప్రోత్సహి స్తోంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు రావాలని ఆశిస్తున్నాం. స్కిల్ సెక్టార్ కు ఇది గొప్ప అడుగు. స్కిల్ ఎకో సిస్టమ్ని అభివృద్ధి చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం చర్యలకు నిజంగా అభినందనలు. కియా మోటార్స్ ఇండియా ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ని శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం. స్కిల్ డెవలప్మెంట్ సంస్థల ద్వారా అద్భుత అవకాశాలు ఏపీలో ఉన్న యువతకు అందుతున్నాయి. –కె.గ్వాంగ్లీ, కియా మోటర్స్ ఎండీ కమిట్మెంట్ ఉన్న సీఎం జగన్ దేశంలో ఇప్పటి వరకూ చాలా స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలకు హాజరయ్యాను. ఇలాంటి కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వాన్ని ఇంతవరకూ చూడలేదు. యువత ముందే పారిశ్రామికవేత్తల్ని కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పడం అద్భుతం. మా సంస్థ విమానాలు తయారు చేస్తుంది. భవిష్యత్తులో విమానయానంలో ఎన్నోరకాల ఉపాధి అవకాశాలున్నాయి. లెర్నింగ్ వింగ్స్ ఫౌండేషన్ అనే స్కిల్లింగ్ భాగస్వామితో పని చేస్తున్నాం. మా సంస్థ సామర్థ్యం మేరకు స్కిల్ ఎకో సిస్టమ్కు మద్దతు అందిస్తాం. – ప్రవీణ యజ్ఞంభట్, బోయింగ్ ఇండియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ కెమికల్ ఇంజినీర్స్ అవసరం చాలా ఉంది ఏపీ సెజ్ అచ్యుతాపురంలో మా సంస్థని ఏర్పాటు చేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆటమిక్ రీసెర్చ్ ఉత్పత్తుల్లో ఎంతో ఉన్నతి సాధించాం. కెమికల్ ప్రాసెసింగ్ వైపు కూడా మా సంస్థ అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో మాకు కెమికల్ ఇంజినీర్స్ అవసరం ఎంతో ఉంది. నేరుగా నియామకం చేసుకోవాలని భావిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాం. విద్యార్థులకు మాకు అవసరమైన రీతిలో శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తాం. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల్ని అందించడంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కృషి అనిర్వచనీయం. – కొయిచీ సాటో, టొయేట్సు రేర్ ఎర్త్ ప్రై.లి., ఎండీ సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశాను. అప్పుడు ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. శిక్షణలో నేను చాలా నేర్చుకున్నాను. మెషిన్ ఆపరేటింగ్, సాఫ్ట్స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పారు. 2021లో ఏషియన్ పెయింట్స్ వారి ఇంటర్వ్యూలకు హాజరై ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఏడాదికి రూ. 5 లక్షల ప్యాకేజ్లో సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్గా ఏడాదికి రూ. 7.2 లక్షల ప్యాకేజీ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరాగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎంకు నా కృతజ్ఞతలు. – భార్గవ్, విశాఖపట్నం మానవవనరుల్లో మనమే ముందంజ.. అత్యధికంగా నైపుణ్యంతో కూడిన మానవ వనరులున్న రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దడంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరసలో ఉంది. స్కిల్ ట్రైనింగ్ అనేది కేవలం ఉపాధి అవకాశాల్ని అందిస్తోంది. ఐదేళ్లలో 15 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వగా.. 3.8 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇంకొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు. సీఎం జగన్ 27 స్కిల్ కాలేజీలు, 192 స్కిల్ హబ్స్, 55 స్కిల్ స్కోప్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. భవిత పేరుతో శిక్షణని అప్గ్రేడ్ చేస్తున్నాం. – సురేష్కుమార్, ఏపీ స్కిల్డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ -
రోల్మోడల్ స్టేట్గా ఏపీ.. జగనన్నకు థ్యాంక్స్
సాక్షి, విశాఖపట్నం: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే ‘భవిత’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. పాలిటెక్నిక్ ఐటిఐ విద్యార్థులతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన యువత ఏమన్నారంటే.. వారి మాటల్లోనే మధ్య తరగతి కుటుంబం నుంచి.. అందరికీ నమస్కారం.. మాది విశాఖపట్నం పెదగంట్యాడ.. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను.. మా నాన్న ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్. అమ్మ గృహిణి. నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నేను నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్ రంగంలో స్ధిరపడాలని భావించాను. సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు నేర్చుకున్నాను. మాకు అక్కడ మంచి శిక్షణ ఇచ్చారు. మాకు టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్కు ఎన్నికయ్యాను. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ జరిగింది. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ఆ కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను. మా బ్యాచ్లో అనేకమంది వివిధ కంపెనీలకు సెలక్ట్ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, ఏపీ ప్రభుత్వానికి, స్కిల్ డెవలప్మెంట్కు సీడాప్కు అందరికీ కృతజ్ఞతలు. -దీపిక, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ, చెన్నై ఏడాదికి రూ.7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నా.. అందరికీ నమస్కారం.. నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశాను.. అప్పుడు ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. ఆ శిక్షణలో నేను చాలా నేర్చుకున్నాను. మెషిన్ ఆపరేటింగ్, సాప్ట్స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పారు. ఆ తర్వాత 2021లో ఏషియన్ పెయింట్స్ వారి ఇంటర్వ్యూకు హాజరయ్యాను, అందులో నేను ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఏడాదికి రూ.5 లక్షల ప్యాకేజ్లో సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ వన్గా ఏడాదికి రూ.7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎం గారికి నా కృతజ్ఞతలు. ఏపీ రోల్మోడల్ స్టేట్గా ఉందని నేను నమ్ముతున్నాను. నాలాగా మరింత మంది యువత ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ -భార్గవ్, విశాఖపట్నం ఇదీ చదవండి: ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్.. కేడర్కు గూస్ బంప్స్ -
చంపడానికొచ్చి.. హతమయ్యాడు
మల్యాల(చొప్పదండి): ప్రేమ పేరుతో మూడేళ్లుగా వేధిస్తున్న యువకుడు.. నేరుగా ఆ యువతి ఇంటికే వెళ్లి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. యువతి కుటుంబ సభ్యులు ఆత్మరక్షణ కోసం ఆ యువకుడిపై దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్ తన దూరపు బంధువైన తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ మూడేళ్లుగా ఫోన్లో వేధిస్తున్నాడు. భరించలేని ఆ యువతి ఈనెల 2న మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కక్ష పెంచుకున్న మహేశ్ ఆ యువతిని చంపేందుకు కత్తితో సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు తక్కళ్లపల్లిలోని యువతి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయానికి మొదట యువతి తల్లి కనపడగా. ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు. తప్పించుకునే క్రమంలో కత్తి ఆమె కాలికి తగిలింది. అనంతరం అక్కడే మంచంలో పడుకున్న యువతి తాతపైనా దాడి చేసి కత్తితో పొడవగా ఆయనకూ గాయాలయ్యాయి. ఈ క్రమంలో యువతి తల్లి అక్కడే ఉన్న తన తమ్ముడు నర్సయ్యతో కలిసి మహేశ్ని ఆపే ప్రయత్నం చేస్తుండగానే మరోసారి దాడికి యత్నించాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య జరిగిన ఘర్షణలో మహేశ్ కింద పడిపోయాడు. అక్కడే ఉన్న బండరాయితో మహేశ్పై యువతి తల్లి దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దాడిలో గాయపడిన నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తరలించారు. పంచాయితీ పెట్టించినా మారని తీరు యువతికి దూరపు బంధువు కావటంతో పరిచయం పెంచుకున్న మహేశ్.. ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ప్రేమించాలంటూ మూడేళ్లుగా వెంటపడి వేధిస్తున్నాడు. విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో రెండేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి కొంతకాలం యువతికి ఫోన్ చేయకుండా దూరంగా ఉన్న మ హేశ్.. ఇటీవల కొద్దిరోజులుగా ఫోన్లో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీ పెట్టించారు. పెద్దలతో నూ హెచ్చరించారు. అయినా అతడిలో మాత్రం మార్పు రాలేదు. యువతి జన్మదినాన్ని డెత్ డేగా మారుస్తానంటూ పోస్టులు యువతి జన్మదినం ఈనెల 6న ఉండగా.. డెత్డేగా మా రుస్తానంటూ మహేశ్ పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఈనెల 2న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా మని సదరు యువతి తెలిపింది. కాగా, మహేశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో యువతితోపాటు తల్లి, అన్న, వది న, అమ్మమ్మ, తాతయ్యపై కేసు నమోదు చేసినట్లు మల్యా ల ఎస్సై అబ్దుల్ రహీం తెలిపారు. సంఘటన స్థలాన్ని డీ ఎస్పీ రఘుచందర్ స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించా రు. యువతి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మేమొస్తే ‘అగ్నిపథ్’ రద్దు: ఖర్గే
న్యూఢిల్లీ: తాత్కాలిక ప్రాతిపాదికన యువతను సైన్యంలో చేర్చుకునే ‘అగ్నిపథ్’ పథకాన్ని తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రకటించేనాటికే భర్తీ ప్రక్రియలో ఉత్తీర్ణులై నియామక పత్రాల కోసం ఎదురుచూసిన రెండు లక్షల మందికి తక్షణం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన లేఖ రాశారు. ‘సాయుధదళాల్లోకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఆగిపోవడంతో లక్షలాది మంది యువత భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. అగ్నివీర్లు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలు కోల్పోయి నడి రోడ్డుపై నిల్చుంటారు. సామాజికంగానూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు’’ పేర్కొన్నారు. సైనిక అభ్యర్థుల పోరాటానికి మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ అన్నారు. సైన్యంలో చేరేందుకు యువత కన్న కలలను అగ్నివీర్ పథకంతో బీజేపీ చిదిమేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ‘‘కేంద్రానికి కొంత జీతభత్యాల చెల్లింపులు ఆదా అవుతాయి తప్పితే ఈ పథకంతో ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలెట్ అభిప్రాయపడ్డారు. అగ్నివీర్ కింద సైన్యంలోకి తీసుకునే యువతలో నాలుగేళ్ల తర్వాత అత్యంత ప్రతిభ కనబరిచిన 25 శాతం మందినే 15 ఏళ్ల శాశ్వత కమిషన్లోకి తీసుకుంటామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. -
తెగిన గాలిపటం జీవిత భాగస్వామిని చేరుతుందట!
నేడు ఫిబ్రవరి 14.. ఒకవైపు వసంత పంచమి. మరోవైపు ప్రేమికుల రోజు. ఉత్తరప్రదేశ్లో వాలెంట్సైన్స్ డే సందర్భంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పతంగులను ఎగురవేయడం ద్వారా తమ ప్రేమను చాటుతున్నామని యూపీలోని మీరఠ్కు చెందిన యువత చెబుతోంది. యువతీ యువకులు తాము గాలిపటం ఎగురవేసినప్పుడు దాని దారం తెగితే.. అది నేరుగా వారి జీవిత భాగస్వాముల దగ్గరికి చేరుతుందని అంటుంటారు. మీరఠ్లో వాలెంటైన్స్డే సందర్భంగా ఆకాశమంతా గాలిపటాలతో నిండిపోయింది. ఈసారి ప్రత్యేకమైన గాలిపటాలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా గుండె ఆకారంలోని గాలిపటాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొన్ని గాలిపటాలలో అబ్బాయి, అమ్మాయిల రూపురేఖలు చిత్రీకరించారు. వాటి మధ్యలో హృదయాకారాన్ని తీర్చిదిద్దారు. -
పాక్ యువతకు ఇమ్రాన్ ‘అవినీతి’ పట్టలేదా?
పాకిస్తాన్లో నేషనల్ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం పలు అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు కలిగిన స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్లుగా కనిపిస్తున్నారు. నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మూడో స్థానంలో ఉంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. వీటిలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పలు వార్తా సంస్థల కథనాల ప్రకారం పాకిస్తాన్ యువ ఓటర్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మద్దతు పలికారు. దీని వెనుకనున్న కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇమ్రాన్ఖాన్ జైల్లో ఉన్నారు. ఈ నేపధ్యంలో అతని పార్టీ పేరు, గుర్తును రద్దు చేశారు. అయితే ఈ పార్టీకి చెందిన నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగారు. వీరు స్వతంత్ర అభ్యర్థుల కంటే మెరున ఫలితాలు దక్కించుకోవడం విశేషం. 2022లో ఇమ్రాన్ఖాన్ను అధికారం నుంచి తొలగించారు. ఆయనపై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. 2023 ఆగస్టులో ఇమ్రాన్ను జైలుకు తరలించారు. దీనితోపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ ఖాన్పై కొన్నాళ్ల పాటు నిషేధం విధించారు. అయితే ఈ ఎన్నికల్లో పాక్ యువత ఇమ్రాన్కు మద్దతు పలికింది. పాక్లో సైనిక మద్దతుతో అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువ ఓటర్లు ఇమ్రాన్కు అండగా నిలిచారు. అయితే ఈ వాదనను పాక్ ఆర్మీ ఖండించింది. మరోవైపు రాజకీయాలలో మిలటరీ ప్రమేయంపై పాక్ యువతకు అవగాహన ఏర్పడిన కారణంగా వారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు ఓటు వేశారని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం పెరగడం, ఇమ్రాన్ఖాన్ను జైలుకు పంపడంపై పాక్ యువత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. పాక్కు చెందిన న్యాయ విద్యార్థి నైలా ఖాన్ మార్వాత్ మాట్లాడుతూ ‘నేను 2016లో పీటీఐ పార్టీలో చేరాను. 2018లో నా మొదటి ఓటు ఈ పార్టీకే వేశాను. ఇమ్రాన్ ఖాన్ మాటలు నన్ను, నా సహోద్యోగులను ఎంతగానో ఉత్సాహపరిచాయి. నెల్సన్ మండేలా లాంటి పలువురు నేతలు జైలులో ఉంటూనే తమ సత్తా చాటారు’ అని పేర్కొన్నారు. -
CJI Chandrachud: నేటి యువత సామర్థ్యం అద్భుతం
వడోదర: అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ఎన్నో సవాళ్లను పరిష్కరిస్తున్న నేటి యువత సామర్థ్యం చూసి తనకు ఆశ్చర్యం కలుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ఓటమిని అభివృద్ధికి బాటగా మలుచుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. జీవితమంటే మారథాన్(సుదీర్ఘ 42 కిలోమీటర్ల పరుగు పందెం) వంటిదే తప్ప 100 మీటర్ల స్ప్రింట్(స్వల్ప దూరం పరుగు పందెం) కాదని ఆయన పేర్కొన్నారు. బరోడా లోని మహారాజా శాయాజీరావ్ యూనివర్సిటీ 72వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆదివారం జస్టిస్ డీవై చంద్రచూడ్ వర్చువల్గా ప్రసంగించారు. ఈ ఏడాది యూనివర్సిటీ ప్రదానం చేసిన మొత్తం 346 బంగారు పతకాల్లో అత్యధికంగా 336 పతకాలు మహిళలు అందుకోవడాన్ని మన దేశం మారుతోందనడానికి నిజమైన గుర్తుగా ఆయన అభివరి్ణంచారు. ‘చరిత్రలో ఇది ఒక ప్రత్యేకమైన సమయం. మునుపెన్నడూ లేనంతగా టెక్నాలజీ నేడు ప్రజలను అనుసంధానం చేస్తోంది. అదే సమయంలో వారిలో భయాలు, ఆందోళనలకు సైతం కారణమవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వృత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇవి సంప్రదాయ వృత్తులతో సంబంధం లేనివి. వీటిల్లో ఎవరికి వారు తమ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమయంలో పట్టభద్రులుగా బయటికి వస్తున్న మీ అందరికీ ఇది ఉత్తేజకర సమ యం. అదే సమయంలో అనిశి్చతిని, గందరగోళాన్నీ సృష్టిస్తాయి’అని హెచ్చరించారు. -
‘ఆక్సిజన్ మ్యాన్’ ఎవరు? ఎందుకాపేరు వచ్చింది?
నిస్వార్థంగా సేవ చేయడానికి సిద్ధమయ్యే యువత చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే దీనికి భిన్నంగా ప్రకృతిని అమితంగా ప్రేమిస్తూ, పర్యావరణ పరిరక్షణకు నిరంతరం పాటుపడుతున్న సునీల్ యాదవ్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఒకవైపు జాతీయ స్థాయి కబడ్డీలో రాణిస్తూ, మరోవైపు పర్యావరణ పరిరక్షణలోనూ తన భాగస్వామ్యం ఉందంటున్న సునీల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సునీల్ తన 25 ఏళ్ల వయసుకే పదివేలకు పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించాడు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన సునీల్ యాదవ్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. 2018-2019లో ఉత్తరప్రదేశ్ నుండి కబడ్డీ జూనియర్ జట్టులో ఆడి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆ తర్వాత 2020లో రెండోసారి రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ఆడాడు. ఓవరాల్గా ఇప్పటి వరకు ఐదుసార్లు రాష్ట్ర స్థాయిలో ఆడాడు. ఒకవైపు క్రీడారంగంలో ఎదుగుతూనే మరోవైపు ప్రకృతిని కాపాడేందుకు కృషి సాగించాడు. లాక్డౌన్ సమయంలో జనమంతా ఇంట్లో ఉన్నప్పుడు సునీల్ ఉదయాన్నే నిద్రలేచి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటేవాడు. తరువాత వాటిని సంరక్షించేవాడు. ఈ నేపధ్యంలోనే సునీల్ వినూత్న ప్రచారాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎవరినైనా అభినందిస్తూ పుష్పగుచ్ఛాలు ఇచ్చేందుకు బదులుగా ఔషధ మొక్కలు బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన అందరిలో కల్పించాడు. తద్వార పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని భావించాడు. ఈ నేపధ్యంలో సునీల్ యాదవ్ ‘ఆక్సిజన్ మ్యాన్’గా గుర్తింపు పొందాడు. సునీల్ ఇప్పటివరకూ దేశంలోని మూడు రాష్ట్రాలలో సైకిల్ యాత్ర చేపట్టి, జనం మరింతగా మొక్కలు నాటేలా చైతన్యపరిచారు. సునీల్ చేపడుతున్న ప్రచారం నిరంతరం కొనసాగుతోంది. సునీల్ సుమారు 20 నుంచి 30 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాడు. -
నవతరం యువత దేశభక్తిని ఎలా చాటుకుంటున్నారంటే..
కొన్ని తరాల వెనక్కి వెళితే...యువతలో దేశభక్తి వ్యక్తీకరణ పద్యం, పాట, కవిత, నినాదాల రూపంలో కనిపించేది. ఇక నేటి యువత విషయానికి వస్తే... సోషల్ మీడియా క్యాంపెయిన్స్, డిజిటల్ ఎంగేజ్మెంట్, వర్చువల్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ద్వారా తమలోని దేశభక్తిని చాటుకుంటున్నారు... దేశభక్తి భావాలను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకువచ్చింది యువత. ఒకప్పుడు మన దేశానికి మాత్రమే పరిమితమైన దేశాభిమాన భావాలు ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమ వీరోచిత పోరాటగాథలను సోషల్ మీడియా వేదికగా యువత గుర్తు తెచ్చుకుంటుంది. కంటెంట్ క్రియేషన్ ద్వారా కూడా తమలోని దేశభక్తి భావాలను సృజనాత్మకంగా ఆవిష్కరిస్తున్నారు. ‘జెన్–జెడ్ ఆర్టిస్టులు తమలోని దేశభక్తి భావాలను పాటలు, చిత్రాల రూపంలో ఆవిష్కరిస్తున్నారు. ప్రపంచ ధోరణులను గమనిస్తూ, విశ్లేషిస్తూనే కంటెంట్ క్రియేషన్కు సంబంధించి దేశీయతకు ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటుంది కంటెంట్ క్రియేటర్ జాహ్నవి తివారి. బెంగళూరుకు చెందిన 23 సంవత్సరాల ప్రణవ్ స్కూల్ రోజుల్లో ‘హిస్టరీ రొస్టు కంటే రెస్టు మేలు’ అన్నట్లుగా ఉండేవాడు. బోర్గా ఫీలయ్యేవాడు. అయితే ఇప్పుడు హిస్టరీ అనేది అతడి ఫెవరెట్ సబ్జెక్ట్. హిస్టరీ పుస్తకాలను ఇష్టంగా చదువుతుంటాడు. ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్, ది లాస్ట్ మొఘల్, ది వండర్ దట్ వాజ్ ఇండియా...మొదలైనవి అతడి అభిమాన పుస్తకాలు. ‘ఒక దేశ గొప్పదనం గురించి తెలుసుకోవాలంటే ఆ దేశచరిత్ర తెలుసుకోవాలి అనే మాట విని చరిత్ర పుస్తకాలపై ఆసక్తి పెరిగింది. బుక్లెట్లాంటి చిన్న పుస్తకాలతో మొదలు పెట్టి ఇప్పుడు వందల పేజీలు ఉన్న పెద్ద పుస్తకాలు కూడా చదువుతున్నాను’ అంటున్నాడు ప్రణవ్. ‘దేశాన్ని ముందుకు నడిపించే ప్రతి మంచిపని దేశభక్తిగానే పరిగణించాలి. పర్యావరణ స్పృహ నుంచి స్టార్టప్ల వరకు ఏదైనా కావచ్చు’ అంటున్న ముంబైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ తేజస్వీ పర్యావరణ హిత, సామాజిక స్పృహకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఇక సినిమాలకు సంబంధించి ‘యే జో దేశ్ హై తేరా, స్వదేశ్ హై తేరా’ (స్వదేశ్), ఆప్నీ అజాదీ కో (లీడర్–1964), యే మేరా ఇండియా–ఐ లవ్ మై ఇండియా (పర్దేశ్)...మొదలైన పాటలను ఎక్కువగా షేర్ చేస్తుంటారు. జీ మ్యూజిక్ కంపెనీ ‘సలామ్ ఇండియా’ ‘భారత్ సలామ్’ టీ–సీరిస్ ‘ఇండిపెండెన్స్ డే స్పెషల్’ టిప్స్ ‘ఇండిపెండెన్స్ డే సాంగ్స్’ సారేగామా మ్యూజిక్ ‘రిపబ్లిక్ డే స్పెషల్’ నైంటీస్ గానే ‘ఐ లవ్ మై ఇండియా–రిపబ్లిక్ డే సాంగ్స్’ ఆల్బమ్లకు యూట్యూబ్లో యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సింగర్–సాంగ్ రైటర్ వినీత్ సింగ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో రికార్డ్లు బ్రేక్ చేయడంలో ఘనాపాఠీ. ‘యూరోపియన్ టాప్ 100 రేడియా చార్ట్స్’లో అతడి పాటలు టాప్లో నిలిచాయి. కొత్త దేశభక్తి గీతం ‘బార్న్ ఇన్ భారత్, బార్న్ ఫర్ ఇండియా’తో ముందుకు వచ్చాడు వినిత్. డైనమిక్ వోకల్స్, ఎనర్జిటిక్ బేస్లైన్తో కూడిన ఈ పాట నవభారతాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. ‘దేశభక్తి పాటలు స్ఫూర్తిని ఇస్తాయి. దేశానికి నా వంతుగా ఏదైనా చేయాలనే సంకల్పాన్ని ఇస్తాయి’ అంటున్న దిల్లీకి చెందిన అద్విక్ దేశభక్తి పాటలు పాడడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘దేశభక్తి గీతాలు కొన్ని రోజులకు మాత్రమే పరిమితమైనవి కావు. అన్ని రోజుల్లో వినాల్సిన విలువైన గీతాలు’ అంటాడు 24 సంవత్సరాల అద్విక్. (చదవండి: ఈసారి 'కర్తవ్య పథ్'లో దేశంలోని 'నారీ శక్తి'తో చారిత్రాత్మక కవాతు!) -
మంటల్లో శునకం.. ప్రాణాలకు తెగించిన యువకుడు!
ఇటీవలి కాలంలో పెంపుడు జంతువులను పెంచుకునేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వాటిని ఇంటిలోని మనుషుల్లానే భావిస్తూ, వాటిపై ప్రేమ కురిపిస్తుంటారు. వాటి రక్షణ కోసం ఏమి చేసేందుకైనా సిద్ధపడుతుంటారు. తాజాగా వైరల్గా మారిన ఒక వీడియో జంతు ప్రేమకు ఉదాహరణగా నిలిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించడాన్ని గమనించవచ్చు. ఈ నేపధ్యంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో ఒక వ్యక్తి పరుగున వచ్చి , మంటలు వ్యాపించిన ఆ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అతనిని అగ్నిమాపక సిబ్బంది వారించినా, అతను వారి మాటను పట్టించుకోడు. మంటలు చుట్టుముట్టిన ఇంటిలోకి దూరిన ఆ వ్యక్తి కొద్దిసేపటి తరువాత ఒక శునకాన్ని తీసుకుని బయటకు వస్తాడు. ఆ శునకాన్ని కాపాడే ప్రయత్నంలో ఆ వ్యక్తి చేతికి స్వల్పంగా కాలిన గాయం అవుతుంది. ఈ కుర్రాడి జంతు ప్రేమను చూసిన వారంతా అతనిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో @HumansNoContext అనే ఖాతాలో షేర్ చేశారు. వీడియోతో పాటుగా ఉన్న క్యాప్షన్లో ‘తన పెంపుడు శునకాన్ని రక్షించడానికి ఒక వ్యక్తి తగలబడుతున్న ఇంట్లోకి ప్రవేశించాడు’ అని రాశారు. ఇప్పటి వరకు 2 లక్షల 85 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. వీడియోను చూసిన యూజర్స్ ఆ యువకుడని నిజమైన హీరో అంటూ మెచ్చుకుంటున్నారు. Man runs into burning home to save his dog pic.twitter.com/BOMk1nBDiU — NO CONTEXT HUMANS (@HumansNoContext) January 25, 2024 -
శిఖరాలూ.. సలాం కొట్టాయ్!
బోణం గణేష్, సాక్షి ప్రతినిధి: సముద్రమట్టానికి వేల మీటర్ల ఎత్తు.. సహకరించని వాతావరణం.. అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదాలు.. గజగజలాడించే మంచు.. కానీ అతని సంకల్పానికి ఆ మహామహా శిఖరాలే తలవంచాయి. మార్షల్ ఆర్ట్స్లో అతని పట్టుదలకు అంతర్జాతీయ పతకాలు వరించాయి. ప్రపంచంలోని ఏడు అతిపెద్ద శిఖరాలను అధిరోహించిన అతని పేరు.. భూపతిరాజు అన్మీష్ వర్మ. విశాఖపట్నానికి చెందిన అన్మీష్ వర్మ తాను అధిరోహించిన ప్రతి పర్వతంపైనా జాతీయ జెండాతో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాల జెండాను ఎగురవేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అన్మీష్ గురించి విశేషాలు ఆయన మాటల్లోనే.. సరదాగా మొదలై.. శిఖరాల అంచులకు ఎగసి చిన్నప్పుడు విశాఖపట్నంలోని కొండలను సరదాగా ఎక్కేవాడిని. ఆ ఆసక్తే ఎవరెస్ట్ గురించి తెలుసుకునేలా చేసింది. దానిపైకి ఎక్కడం కష్టమని.. అధిరోహించడానికి వెళ్లిన వారు చనిపోతే శవాన్ని తేవడం కూడా కష్టమేనని తెలుసుకున్నాక దానిపైకి ఎలాగైనా ఎక్కాలని నిర్ణయించుకున్నాను. ఎవరెస్ట్ను అధిరోహించేందుకు విజయవాడలో ప్రభుత్వం సెలక్షన్స్ నిర్వహిస్తోందని తెలుసుకుని.. నేనూ వెళ్లాను. అప్పుడు వందల మంది వచ్చారు. కానీ నాతో పాటు ఐదుగురే ఎంపికయ్యారు. లేహ్, లడఖ్లో ప్రాక్టికల్ టెస్ట్ పూర్తి చేసి.. ఎవరెస్ట్ను అధిరోహించడానికి అర్హత సాధించాను. మన దేశంలోనే అత్యంత వేగవంతమైన పర్వతారోహకుడిగా గుర్తింపు సంపాదించాను. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించిన ఏకైన వ్యక్తిగా గుర్తింపు లభించింది. నవరత్నాలతో పేదలకెంతో లబ్ధి.. అలాగే తొమ్మిదేళ్లకే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నాను. ప్రపంచ చాంపియన్షిప్లలో మెడల్స్ సాధించాను. వరుసగా మూడు మెడల్స్ సాధించి రికార్డ్ సృష్టించాను. మా నాన్న వేణుగోపాలరాజు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కొన్నాళ్లు విధులు నిర్వర్తించి.. ఆ తర్వాత లారీ డ్రైవర్గా పనిచేశారు. 2014లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నాన్న పోయిన 18 రోజులకు ఇంగ్లండ్లో కరాటే ప్రపంచ చాంపియన్షిప్కు వెళ్లి పతకం సాధించాను. ఇప్పుడు నేనే మన దేశ కరాటే టీమ్కు కోచ్గా ఉన్నాను. రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలు నాకెంతో నచ్చాయి. ఎంతోమంది పేదలకు వాటి ద్వారా లబ్ధి చేకూరుతోంది. అందుకే ఆ పథకాల లోగో ఉన్న జెండాను మన దేశ జెండాతో పాటు ప్రపంచ శిఖరాలపై ఎగురవేస్తుంటాను. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో గ్రామీణ యువత, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం. బతికిరావడమూ కష్టమే.. అడ్వెంచర్ గ్రాండ్ స్లామ్.. అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన వారికి ఆ గ్రాండ్ స్లామ్ టైటిల్ లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ టైటిల్ దక్కించుకున్న వారి సంఖ్య 30లోపే ఉంటుంది. అంత గొప్ప టైటిల్ నాకు లభించింది. ఎవరెస్టు, ఎల్బ్రస్, కిలీమంజారో, దెనాలి, అకాంగువా, మౌంట్ విన్సన్, కోస్కియోస్కోను అధిరోహించాను. అలాగే మైనస్ డిగ్రీల సెల్సియస్లలో.. భూమి నార్త్, సౌత్ పోల్ 90 డిగ్రీల అక్షాంశానికి చేరుకున్నాను. అదో పెద్ద సాహసం. తేడా వస్తే బతికిరావడం కష్టం. ఆ చలికి రక్తం గడ్డకడుతుంది. ఒకసారి ఎవరెస్ట్ను అధిరోహిస్తున్నప్పుడు నా సహ పర్వతారోహకుడికి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టింది. ఆ పరిస్థితిలో అతన్ని వదిలేసి వెళ్లలేకపోయాను. అతన్ని కాపాడటం కోసం వెనక్కి తిరిగొచ్చేశాను. ఆ తర్వాత ఏడాది మళ్లీ ప్రయత్నించాను. ప్రాణాలకు తెగించి లక్ష్యాన్ని చేరుకున్నాను. -
ఏటా 2 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ
మాదాపూర్ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా స్కిల్డెవలప్మెంట్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో శుక్రవారం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి న్యాక్ ప్రతినిధులతో కలసి సంస్థలో కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు వివరించారు. మండల, జిల్లా స్థాయిలో ఒక్కో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి అనంతరం వాటిని విస్తరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి సంబంధించిన న్యాక్ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.భిక్షపతి, న్యాక్ వైస్ చైర్మన్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. -
కోచింగ్ సెంటర్లో కుప్పకూలిన యువకుడు.. కాసేపటికే మృతి
భోపాల్: ప్రమాదం ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పటి వరకు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్న సందర్భాలు ఇటీవల అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సడెన్ హార్ట్ ఎటాక్ ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న ఈ గుండెపోటు మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఓ యువకుడు గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. 18 ఏళ్ల ఓ విద్యార్ధి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతూ ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు అసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో యువకుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బుధవారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. క్లాస్ రూమ్లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. చదవండి: Tammineni: వెంటిలేటర్పైనే తమ్మినేని.. విషమంగా ఆరోగ్యం ఇండోర్లోని భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన మాధవ్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్సీ) ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నాడు. రోజులాగే బుధవారం కోచింగ్ సెంటర్కు వెళ్లాడు. తరగతి గదిలో కూర్చొని క్లాస్లు వింటున్న సమయంలో అతనికి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి కలగడంతో టేబుల్పై ఒరిగాడు. గమనించిన పక్కనే కూర్చున్న యువకుడు మాధవ్ వీపు మీద రుద్దడం ప్రారంభించాడు. అతనికి ఇంకా నొప్పిగా ఉండటంతో వెంటనే ఈ విషయాన్ని ట్రైనర్కు తెలియజేశాడు. ఆలోపే మాధవ్ పూర్తిగా కుప్పకూలి తన డెస్క్ నుంచి జారీ కింద పడిపోయాడు. అప్రమత్తమైన మిగతా విద్యార్ధులు మాధవ్కు సాయం చేసేందుకు వచ్చారు. అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. అయితే కొంత సేపటికే యువకుడు మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. Tragic news from #Indore MPPSC aspirant dies from fatal heart attack during coaching class. CCTV footage from classroom shows Raja Lodhi sitting upright focused... Suddenly begins clutching his chest, expressing visible distress. Loses balance within seconds & falls off. Hospital… pic.twitter.com/Xf3ni3fitC — Nabila Jamal (@nabilajamal_) January 18, 2024 -
వేస్ట్ నుంచి ‘బంగారం’: అదిరిపోయే కళ
‘వ్యర్థాల గురించి మాట్లాడుకోవడం పరమ వ్యర్థం’ అనుకోవడం లేదు యువతరం. ఎలక్ట్రానిక్స్ నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల వరకు రకరకాల వ్యర్థాలను కళాకృతులుగా రూపొందించి పర్యావరణ సందేశాన్ని అందించడం ఒక కోణం అయితే, ఎలక్ట్రానిక్ వ్యర్థాలలోని విలువైన వాటితో నగలు రూపొందించే ఎమర్జింగ్ ఆర్ట్ ట్రెండ్ లోతుపాతులు తెలుసుకోవడం మరో కోణం... కోల్కతాలోని శ్రీశ్రీ అకాడమీ విద్యార్థులు తమ పాఠశాల అవరణలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలతో అద్భుతాన్ని సృష్టించారు. ‘ట్రాష్ ఇన్స్టాలేషన్’ ప్రాజెక్ట్లో భాగంగా స్టూడెంట్స్ యుతిక, ఇషాని, రజనీష్, మంజరీ, అదిత్రిలు ప్లాస్టిక్తో తయారుచేసిన డాల్ఫిన్ స్టాచ్యూను పాఠశాల ఆవరణలోని వర్టికల్ గార్డెన్లో ఏర్పాటు చేశారు. నెలరోజుల వ్యవధిలో తయారు చేసిన ‘డాల్ఫిన్ ఇన్ పెరిల్’ అనే ఈ ఆర్ట్ ఇన్స్టాలేషన్ పాఠశాలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, సముద్ర జీవులకు తీవ్రహాని కలుగుతుందనే విషయాన్ని ప్రచారం చేయడానికి కళను ఒక మాధ్యమంలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. భవిష్యత్లో ఇలాంటివి మరిన్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అంటుంది అదిత్రి. కేరళలోని తిరువనంతపురంలో ‘కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’కు చెందిన యంగ్ టీమ్ 20,000 ప్లాస్టిక్ బాటిల్స్ను ఉపయోగించి 90 అడుగుల పాము ఇన్స్టాలేషన్ను రూపొదించింది. ప్లాస్టిక్ అనే విషసర్పం భూగోళాన్ని కాటు వేస్తున్నట్లుగా కనిపించే ఈ ఇన్స్టాలేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ‘ఫ్యాషన్ ఆఫ్ ది న్యూ ఎరా 100 శాతం ట్రాష్ అండ్ ప్లాస్టిక్!’ అంటూ ఒక యువ ఆర్టిస్ట్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ముంబైలో ఉంటున్న హరిబాబు ఇ–వేస్ట్ కళలో ఎంతోమంది యూత్కు ఇన్స్పైరింగ్గా నిలుస్తున్నాడు. ఇ–వేస్ట్ కళారూపాలతో ప్రముఖ ఆర్ట్ గ్యాలరీలలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. కేరళలో పుట్టిన హరిబాబు చెన్నైలో పెరిగాడు. చెన్నై గవర్నమెంట్ ‘కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’లో చదువుకున్నాడు. ఇ–వ్యర్థాలతో కళాకృతుల తయారీకి ప్రశంసల మాట ఎలా ఉన్నా బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం ఎప్పటికప్పుడూ ఖాళీ అవుతుండేది. ‘నీకేమైనా పిచ్చి పట్టిందా?’ అని తిట్టేవారు మిత్రులు. అయితే బజాజ్ ఆర్ట్ గ్యాలరీ ఫెలోషిప్ అవార్డ్ అందుకున్న తరువాత హరిబాబుకు బ్రేక్ వచ్చింది. ఏడాది తరువాత ‘స్టేట్–ఆఫ్–ది–ఆర్ట్ స్టూడియో’ ముంబైలో ప్రారంభించాడు. టన్నుల కొద్దీ ఇ–వ్యర్థాల నుంచి ఎన్నో శిల్పాలు రూపొందించిన హరిబాబు దగ్గరికి సలహాలు, సూచనల కోసం ఎంతోమంది యంగ్ ఆర్టిస్ట్లు వస్తుంటారు. భువనేశ్వర్కు చెందిన మ్యూరల్ ఆర్టిస్ట్ దిబూస్ జెనా, ఆర్టిస్ట్ సిబానీ బిస్వాల్ ఆర్గానిక్ స్క్రాప్, రీయూజ్డ్ మెటల్లతో ఆర్ట్ ఇన్స్టాలేషన్లను సృష్టించారు. మానవ తప్పిదాల వల్ల సముద్రానికి జరుగుతున్న హాని గురించి తెలియజేసేలా ఉంటుంది జెనా రూపొందించిన తిమింగలం. ‘ఒషాబా బ్రాండ్ గురించి తెలుసుకున్న తరువాత ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై ఆసక్తి పెరిగింది. వృథా అనుకునే వాటి నుంచి ప్రయోజనం సృష్టించాలి అనే వారి ఫిలాసఫీ నాకు నచ్చింది’ అంటుంది భో΄ాల్కు చెందిన ఇరవై రెండు సంవత్సరాల రీతిక. కళ తప్పి మూలన పడ్డ ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి గత సంవత్సరం లండన్ కేంద్రంగా ఒషాబా బ్రాండ్కు అంకురార్పణ జరిగింది. వాడి పారేసిన స్మార్ట్ఫోన్ సర్క్యూట్ బోర్డులు, ప్లగ్, యూఎస్బీ కేబుల్స్, చార్జింగ్ కేబుల్స్..మొదలైన వాటిలోని విలువైన వాటిని ఈ బ్రాండ్ ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. నిజానికి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఆభరణాల తయారీలో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. 2018లో అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ‘డెల్’ కాలం చెల్లిన తమ కంప్యూటర్ విడి భాగాల నుంచి సేకరించిన విలువైన వాటితో నగలు రూపొదించడానికి లైఫ్స్టైల్ బ్రాండ్ ‘బాయూ విత్ లవ్’తో కలిసి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విలువైన పదార్థాల వృథాను నివారించడానికి, ఎలక్ట్రానిక్ వ్యర్థాల గురించి వినియోగదారులలో అవగాహన కలిగించే సృజనాత్మక విధానాన్ని ‘డెల్’ ఎంచుకుంది. ‘జువెలరీ బ్రాండ్స్ రీ–సైకిల్డ్ అల్టర్నేటివ్స్పై ఆసక్తి చూపుతున్నాయి. వాడిపాడేసిన స్మార్ట్ఫోన్లు, లాప్టాప్లు... మొదలైన వాటిలో గోల్డ్ మైన్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూలకు పడి ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో దాగి ఉన్న విలువైన లోహలు, ఒక టన్ను ఇ–వేస్ట్ నుంచి ఎన్ని గ్రాముల బంగారం వస్తుంది... లాంటి వివరాలు నాకు ఆసక్తికరంగా మారాయి’ అంటుంది ముంబైకి చెందిన నవీన. 23 సంవత్సరాల నవీనకు పాత, కొత్త అనే తేడా లేకుండా నగల డిజైనింగ్ ఐడియాలపై ఆసక్తి. ఈ ఆసక్తి ఆమెను ఎలైజా వాల్టర్లాగే నలుగురు మెచ్చిన డిజైనర్గా మార్చవచ్చు. నగ దరహాసం ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి నగలు తయారు చేసే బ్రాండ్గా బ్రిటన్లో మంచి పేరు సంపాదించింది లైలీ జువెలరి. ఎలైజా వాల్టర్ 24వ యేట ఈ బ్రాండ్ను ప్రారంభించింది, యువతలో ఎంతోమందిలాగే ఇ–వ్యర్థాలలోని అపురూప అంశాలపై ఆసక్తి పెంచుకుంది. ‘ప్రపంచంలోని బంగారంలో ఏడు శాతం నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్స్లో దాగి ఉన్నందున ఆభరణ బ్రాండ్లు వాటిని ముఖ్యమైన వనరుగా చూస్తున్నాయి’ అంటున్న ఎలైజా వాల్టర్ ప్రయాణం యువతలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇ–వ్యర్థాల నుంచి రూపొందించిన ఈ ఆభరణాన్ని ఎలైజా వాల్టర్ డిజైన్ చేసింది. -
మొదలైన జల్లికట్టు.. తమిళనాట సందడే సందడి!
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల నిర్వహణకు అవనియాపురంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మదురైలో జల్లికట్టు నిర్వహణకు ముందుగా పోటీలో పాల్గొనే ఎద్దులకు హెల్త్ చెకప్ చేశారు. జల్లికట్టును తమిళనాట ఇరుతఝువుతాల్ అని కూడా పిలుస్తారు. జల్లికట్టు అనేది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే సంప్రదాయక క్రీడ. దీనిలో ఎద్దులకు మనుషులకు మధ్య పోరాటం జరుగుతుంది. జల్లుకట్టును తమిళనాడు సంస్కృతికి చిహ్నంగా పరిగణిస్తారు. #WATCH | Tamil Nadu: Jallikattu competition begins in Avaniyapuram of Madurai. pic.twitter.com/CqRrInypX9 — ANI (@ANI) January 15, 2024 అయితే జల్లికట్టు పోటీలలో పాల్గొనేవారు ఒక్కోసారి తీవ్రంగా గాయపడుతుంటారు. ఇటువంటి పరిస్థితులను గమనించిన సుప్రీంకోర్టు జల్లికట్టు నిర్వహణకు మార్గదర్శకాలను జారీ చేసింది. స్థానిక అధికారులు కట్టుదిద్దమైన ఏర్పాట్లు చేసినప్పటికీ జల్లికట్టు పోటీల సమయంలో పలువురు గాయపడుతున్నారు. గత ఏడాది సంక్రాంతి సమయంలో అవనియాపురంలో నిర్వహించిన జల్లికట్టుపోటీల సమయంలో 60 మంది గాయపడ్డారు. #WATCH | Tamil Nadu: Health check-up of bulls held in Madurai for the Jallikattu competition. pic.twitter.com/nvfJQVMaIn — ANI (@ANI) January 15, 2024 ఇది కూడా చదవండి: దేశవ్యాపంగా సంక్రాంతి సందడి -
కిమ్కు ఉన్న పిచ్చి ఏంటంటే.?.. నటిని కిడ్నాప్ చేసి..
ప్రస్తుత ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 1994 జూలై నుంచి 2011 డిసెంబర్లో తానుమరణించే వరకు ఉత్తర కొరియా నియంతగా కొనసాగారు. కొరియన్ యువతపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చూపే ప్రతీ అంశాన్ని కిమ్ జోంగ్ ఇల్ నిషేధించారు. విదేశీ సినిమాలు చూడటం మొదలుకొని బ్లూ జీన్స్ ధరించడం వరకు అన్నింటినీ నిషేధించారు. జోంగ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్కు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. తన దేశంలో సినిమాలు తీయడానికి ఒక ప్రముఖ దక్షిణ కొరియా నటిని, ఆమె భర్తను కిడ్నాప్ చేశాడు. కిమ్ జోంగ్ ఇల్ నాటి ప్రముఖ దక్షిణ కొరియా నటి చోయ్ యున్ హీని కిడ్నాప్ చేసి, రెండున్నరేళ్లు నిర్బంధించి, ఆమె చేత 17 సినిమాలు చేయించాడు. ఈ సంఘటన 1978 నాటిది. ఆ కాలాన్ని దక్షిణ కొరియా చిత్రాలకు గోల్డెన్ పీరియడ్ అని అంటారు. అప్పట్లో చాలా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా విడుదలయ్యేవి. చోయ్ యున్ హీ 60వ దశాబ్ధం నుండి 70ల తొలినాళ్ల వరకు గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె భర్త షిన్ జియోంగ్ గ్యున్ సినిమా దర్శకుడు. వీరు సెలబ్రిటీ జంటగా పేరుగాంచారు. ఓ జూనియర్ నటితో ఆమె భర్తకు అక్రమ సంబంధం ఏర్పడిన కారణంగా వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ సమయంలో నటి చోయ్ యున్ హీ ఒక వ్యాపార ఒప్పందం కోసం హాంకాంగ్ వెళ్లారు. ఇంతలో ఉత్తర కొరియా ఏజెంట్ ఆమెను కిడ్నాప్ చేశాడు. అతను ఆమెను స్పీడ్బోట్లోకి ఎక్కించి, తమ నియంత కిమ్ జోంగ్ ఇల్ వద్దకు తీసుకెళ్లాడు. హాంకాంగ్లో జరిగిన వ్యాపార ఒప్పందం అనేది తనను కిడ్నాప్ చేయడానికి జరిగిన కుట్ర అని ఆ నటికి అప్పుడు అర్థమైంది. అయితే తాము ఆమెను కిడ్నాప్ చేయలేదని, ఆమె ఇష్టానుసారమే ఇక్కడికి వచ్చినట్లు కిమ్ జోంగ్ ఇల్ ప్రచారం చేయించాడు. ఉత్తర కొరియాలో రూపొందే సినిమాలు అంతర్జాతీయ ప్రశంసలు పొందాలని కిమ్ జోంగ్ ఇల్ తపించిపోయాడు. చోయ్ యున్ హీ భర్తను కూడా తమ ప్రాంతానికి బలవంతంగా తీసుకువచ్చాడు. అయితే ఆ దర్శకుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతనిని జైలుకు తరలించారు. ఐదేళ్లపాటు జైలులో ఉంచి వివిధ శిక్షలు విధించారు. నార్త్ కొరియా కోసం సినిమాలు తయాలని ఆదేశించారు. షిన్ జియోంగ్ గ్యున్ ఒక డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను, తన భార్య చోయ్ యున్ హీ కలసి రెండేళ్లలో మొత్తం 17 సినిమాలు చేశామని చెప్పారు. రాత్రిపూట మూడు గంటలకు మించి నిద్రపోకూడదని, నిరంతరం పని చేయాలని, అప్పుడే మా ప్రాణాలు నిలబడతాయని కిమ్ జోంగ్ ఇల్ ఆదేశించారని షిన్ జియోంగ్ గ్యున్ తెలిపారు. అయితే 1986లో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా కిమ్ నటి చోయ్ యున్ హీ, దర్శకుడు షిన్ జియోంగ్ గ్యున్లను ఉత్తర కొరియా ప్రతినిధులుగా పంపారు. వారికి కిమ్ గట్టి కాపలా ఏర్పాటు చేశాడు. గదుల్లో కూడా గార్డులను మోహరించాడు. అయితే ఆ దంపతులు ఎలాగోలా తప్పించుకుని, అమెరికా చేరుకుని అక్కడ ఆశ్రయం పొందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
జమల్ జమలు కుదు... యానిమలు!
‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్ ‘జమల్ జమలు కుదు’ సూపర్హిట్ అయింది. ఈ పాటలో ఒక్క ముక్క అర్థం కాకపోయినా యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాట యూత్ ఫ్రేవరెట్ రింగ్ టోన్గా మారింది. ‘జమల్ జమలు కుదు’ అనేది 1950 నాటి ఇరానీ పాట. ఇరానీ కవి బిజన్ స్మందర్ ఈ పాట రాశారు. ఖటరెహ్ మ్యూజిక్ గ్రూప్ ట్యూన్ కంపోజ్ చేసింది. తొలిసారిగా 1950లో టెహ్రాన్లోని ఖరజెమీ హైస్కూల్లో పాడారు. ‘జమల్ జమలు కుదు’ అంటే ఆంగ్లంలో ‘వో మై లవ్, మై స్వీట్ లవ్’ అని అర్థం. ఈ పాటలో కనిపించిన తనాజ్ దావూది సోషల్ మీడియాలో వైరల్ గర్ల్గా మారింది. టెహ్రాన్లో పుట్టి పెరిగిన తనాజ్ డ్యాన్సర్, మోడల్. ‘యానిమల్’ షూటింగ్ సమయంలో తనాజ్ ముంబైలో ఉంది. ఈ పాటకు సంబంధించిన ఓల్డ్ వెర్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘యానిమాల్ సినిమాలోని పాట కంటే ఓల్డ్ వెర్షన్ బాగా ఎంజాయ్ చేసే విధంగా ఉంది’ అంటూ స్పందిస్తున్నారు నెట్లోకవాసులు. -
వికసిత్ భారత్ను నిజం చేయండి: మోదీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ యువతలో అద్భుత ప్రతిభాపాటవాలు దాగున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందడంలో తమ వంతు కృషిచేయాలని వారికి పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్లో ప్రతి జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు చెందిన దాదాపు 250 మంది విద్యార్థులతో మోదీ ఆదివారం ఢిల్లీలో మాట్లాడారు. క్రీడల పట్ల కశ్మీర్ ప్రజలు చూపే అమితాసక్తిపై విద్యార్థులను ఆయన అడిగి తెల్సుకున్నారు. హంగ్జూలో ఆసియాన్ పారా గేమ్స్లో కశ్మీర్ యువత ఆర్చర్ శీతల్ దేవి సాధించిన మూడు మెడల్స్ గురించి వారితో మాట్లాడారు. ‘‘రోజూ యోగా చేయండి. మీరంతా బాగా చదివి, కష్టపడి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు శక్తివంచన లేకుండా కృషిచేయండి. 2047 కల్లా వికసిత భారత్ కలను నిజం చేయండి’’ అని వారికి పిలుపునిచ్చారు. -
AP: భారీగా పెరిగిన ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలతో రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఏటా పెరుగుతున్న కొత్త ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలే ఇందుకు నిదర్శనం. 2018–19తో పోలిస్తే 2022–23లో రాష్ట్రంలో ఈపీఎఫ్ ఖాతాలు 35 శాతం మేర పెరిగినట్టు ఇటీవల రాజ్యసభలో కేంద్ర కారి్మక, ఉపాధి కల్పన శాఖ వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వం ఉండగా 2018–19లో రాష్ట్రంలో 44,85,974 పీఎఫ్ ఖాతాలు ఉండేవి. 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయి. ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగాలు, మరోపక్క ప్రైవేటు రంగంలోనూ ఉపాధి పెరిగేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. దీంతో 2020–21లో రాష్ట్రంలో పీఎఫ్ ఖాతాల సంఖ్య 52.39 లక్షలకు పెరిగింది. అంతే సుమారు 5.5 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. 2021–22లో వీటి సంఖ్య 56.34 లక్షలకు పెరిగాయి. 2022–23లో 60.73 లక్షలకు చేరుకున్నాయి. జాతీయ స్థాయిలో 2018–19లో 22.91 కోట్లుగా ఉన్న పీఎఫ్ ఖాతాలు 2022–23 నాటికి 29.88 కోట్లకు చేరుకున్నాయి. జాతీయ స్థాయిలో ఐదేళ్లలో 30.38 శాతం ఖాతాలు పెరిగాయి. ఈ లెక్కన జాతీయ స్థాయి కన్నా రాష్ట్రంలోనే పీఎఫ్ ఖాతాల పెరుగుదల ఎక్కువ. తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లలో 31 శాతం, కర్ణాటకలో 32 శాతం, తమిళనాడు, పుదుచ్చేరిలో 27 శాతం మేర ఖాతాలు పెరిగాయి. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ వైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తూనే, మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. అధికారం చేపట్టిన వెంటనే గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి, భారీ సంఖ్యలో యువతకు ఉద్యోగాలిచ్చారు. ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే ఏకంగా 1,25,110 మంది యువతకు శాశ్వత ఉద్యోగాలిచ్చారు. మరోపక్క ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చారు. ఇలా వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మిగిలిన ప్రభుత్వ శాఖల్లోనూ శాశ్వత, కాంట్రాక్టు పద్ధతుల్లో నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు అండగా నిలిచారు. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా ప్రైవేటు రంగంలోనూ రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. ఈ చర్యల ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గుముఖం పట్టింది. ఈ విషయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదికల్లోనూ వెల్లడైంది. 2018–19లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి గ్రామాల్లో 45 మంది, పట్టణాల్లో 73 మంది నిరుద్యోగులు ఉండగా 2022–23లో గ్రామాల్లో 33, పట్టణాల్లో 65కు నిరుద్యోగిత తగ్గినట్టు ఆర్బీఐ తెలిపింది. -
యువత ఫిట్నెస్ మంత్ర
సాక్షి, అమరావతి : మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. ఈ కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలకు యువత ప్రాధాన్యం ఇస్తోంది. ఆ వరుసలో ఫిట్నెస్కు మొదటి స్థానం కల్పిస్తోంది. తాజాగా ఫోర్బ్స్ హెల్త్, వన్పోల్ 2024 సర్వేలో అమెరికన్లతో పాటు యావత్తు ప్రపంచ యువత వైఖరి ఆసక్తిని రేకెత్తిస్తోంది. 48 శాతం మంది తమ ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవడానికి ఓటు వేశారు.ఇందులో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం. ఇక 36శాతం మంది మానసిక ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు, 55 శాతం మంది శారీరక, మానసిక ఆర్యోగానికి సమాన ప్రాముఖ్యత కల్పించారు. ఇక వచ్చే ఏడాదైనా మేలైన ఆరి్థక స్థితి పొందాలని 38శాతం మంది కోరుకున్నారు. ‘బరువు’పైనే దృష్టి ప్రపంచాన్ని పీడిస్తున్న ఊబకాయ సమస్యను ఎదురించాలని యువత నిశ్చయించుకుంది. వయసుతో సంబంధం లేకుండా అధిక బరువును తగ్గించుకోవాలని 34శాతం మంది దృఢంగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం జంక్ఫుడ్కు దూరంగా ఉండాలని, పౌష్టికాహారం తినేలా జీవన విధానంలో మార్పు చేసుకోవాలని తీర్మానించుకున్నారు. 20శాతం లక్ష్యాన్ని చేరుకోవడం, జవాబుదారీతనం పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ఇది చాలా వరకు తగ్గింది. పనితీరుపై... కేవలం 3శాతమే దృష్టి.. ఇక...అతి స్వల్పంగా 6శాతం మంది ప్రయాణాలను ఎంపిక చేసుకోగా 5శాతం క్రమం తప్పకుండా యోగ, 3శాతం మద్యపానం తగ్గించడం, మరో 3శాతం పనిలో మెరుగైన తీరును ప్రతిబింబించేలా తీర్మానాలు చేసుకున్నారు. ఇక్కడ విచిత్రమైన విషయమేమంటే... ఆయా తీర్మానాలకు ఎక్కువ కాలం కట్టుబడి ఉండట్లేదు. ఇది సగటున కేవలం 4 నెలలు మాత్రమే కొనసాగుతోంది. 8శాతం మంది మాత్రమే నెల పాటు తమ లక్ష్యాల దిశగా ఆలోచిస్తున్నారు. 22 శాతం మంది రెండు/మూడు నెలలు, 13 శాతం మంది నాలుగు నెలలు కొనసాగిస్తుంటే, 6శాతం మాత్రమే ఏడాది పొడవునా అమలు చేస్తున్నారు. ఫిట్నెస్ యాప్లపై నజర్ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యువత ఫిట్నెస్ యాప్లను ఆశ్రయించనున్నారు. 30 శాతం మంది తమ తీర్మానాలు ఒకటి నుంచి రెండేళ్లలోనే ప్రభావాన్ని చూపిస్తాయని నమ్మితే.. 57శాతం మంది మూడేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. -
కొత్త ఏడాది యువతరం ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే..?
కొత్త సంవత్సరం దగ్గరలో ఉంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ‘హ్యాపీ న్యూ ఇయర్’ పాట పాడగానే సరిపోతుందా? ‘పాటతోపాటు ప్రణాళిక కూడా ఉంది’ అంటుంది మన జెన్ జెడ్. కొత్త సంవత్సరంలో జెన్ జెడ్ లక్ష్యాలు, ప్రణాళికలు, అభిరుచులకు సంబంధించి ‘ట్రెండ్ టాక్ రిపోర్ట్–2024’ అద్దం పడుతోంది. ఇండియా, యూఎస్, యూకే, బ్రెజిల్, సౌత్ కొరియా దేశాలలోని జెన్ జెడ్ ట్రెండ్స్కు సంబంధించి ‘ట్రెండ్ టాక్ రిపోర్ట్’ను విడుదల చేసింది ఇన్స్టాగ్రామ్. వర్త్ గ్లోబల్ స్టైల్ నెట్వర్క్ (డబ్ల్యూజీఎస్ఎన్)తో కలిసి నిర్వహించిన ఈ సర్వేలో 2024 సంవత్సరానికి సంబంధించి ఫ్యాషన్, బ్యూటీ, సోషల్ మీడియా, ఫ్రెండ్షిప్కు సంబంధించిన ప్రశ్నలు జెన్ జెడ్ను అడిగారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఫ్యాషన్ ట్రెండ్స్, బ్యూటీ అండ్ ఫుడ్ విభాగాలలో మన దేశం ట్రెండ్ సెట్టర్గా ఉంది. ఫుడ్ విషయానికి వస్తే కొత్త రుచులను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇతరుల కంటే భిన్నంగా కనిపించే వస్త్రధారణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త హెయిర్స్టైల్ను ఎంపిక చేసుకుంటున్నారు. 2024కు సంబంధించి ‘జెన్ జెడ్’ ప్రాధాన్యతలలో హెల్త్, ట్రావెల్, కెరీర్లు మొదటి స్థానంలో ఉన్నాయి. తమ కెరీర్పై ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నట్లు 43 శాతం మంది తెలియజేశారు. ఇతర దేశాలతో పోల్చితే మన ‘జెన్ జెడ్’ వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. సంపద సృష్టికి వ్యాపారమే మార్గం అని చెబుతోంది. మన దేశంలో ‘జెన్ జెడ్’లో ఎక్కుమంది స్పోర్ట్స్కు సంబంధించి సూపర్ఫ్యాన్స్ ఉన్నారు. లైఫ్ అడ్వైజ్, తమ ప్రొఫెషన్కు సంబంధించి కంటెంట్కు ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. జీఆర్డబ్ల్యూఎం(గెట్ రెడీ విత్ మీ)లాంటి క్రియేటివిటీతో కూడిన ఫ్యాషన్ ట్రెండ్స్పై అమిత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మన దేశంలో జెన్ జెడ్లో 44 శాతం మంది సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చే డీఐవై(డూ–ఇట్–యువర్సెల్ఫ్) విధానాన్ని ఇష్టపడుతున్నారు. సంగీతం విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్, శ్రేయా ఘోషల్, అనిరుథ్ నుంచి సౌత్ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ ‘బీటీఎస్ ఆర్మీ’ వరకు ఇష్టపడుతున్నారు. వారికి నచ్చిన వీడియో గేమ్స్లో ఫోర్ట్నైట్, కాల్ ఆఫ్ డ్యూటీ, రాబ్లక్స్... మొదలైనవి ఉన్నాయి. జెన్ జెడ్లోని పదిమందిలో తొమ్మిదిమంది వారు ఇష్టపడే రంగాలకు సంబంధించి సెలబ్రిటీల అభిమానగణంలో ఉన్నారు. తమ అభిమాన సెలబ్రిటీలు, అథ్లెట్లు, క్రియేటర్ నుంచి జెన్ జెడ్ రాబోయే కాలంలో ఆశిస్తున్నది ఏమిటి? అనే ప్రశ్నకు వినిపించే జవాబు... లైఫ్ అడ్వైజెస్, వారి ప్రొఫెషన్కు సంబంధించిన కంటెంట్... ఇక మీమ్స్ విషయానికి వస్తే మూడింట ఒక వంతుమంది ‘బ్యాడ్ టేస్ట్ మీమ్స్’ను తమ ‘టాప్ టర్న్ ఆఫ్’గా ఎంచుకున్నారు. గతం సంగతి ఎలా ఉన్నా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో యువతరం ముందు ఉంటుంది. అభిరుచుల నుంచి కెరీర్ ఆప్షన్స్ వరకు కొత్తగా ఆలోచిస్తోంది. ‘కాలేజీ చదువు పూర్తయిన తరువాత వైట్–కాలర్ జాబ్ తెచ్చుకోవాలి’ అనేది సంప్రదాయ ఆలోచన. అయితే యువతరంలో అందరూ ఇలాగే ఆలోచించడం లేదు.‘కంఫర్టబుల్ లైఫ్స్టైల్’కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీనికి కారణం జెనరేటివ్ ఏఐ. జెనరేటివ్ ఏఐ ప్రభావంతో వైట్–కాలర్ జాబ్స్కు ఉద్యోగభద్రత తక్కువ అనే అభిప్రాయం ఉంది. పియర్సన్ రిపోర్ట్ ప్రకారం జెనరేటివ్ ఏఐ వల్ల వైట్–కాలర్ ఉద్యోగాలలో 30 శాతం రిప్లేస్మెంట్ జరుగుతుంది. వైట్–కాలర్ జాబ్లతో పోల్చితే బ్లూ–కాలర్ జాబ్లకు అధిక ఉద్యోగ భద్రత ఉంది. రోబోట్స్ చేయలేని పనులు వీటిలో ఉండడమే కారణం. ఈ పనులు చేయడానికి ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం అవసరం. అయితే జెన్ జెడ్లో ఎక్కువమంది ఈ హై–డిమాండ్ ఫీల్డ్పై ఆసక్తి ప్రదర్శించడం లేదు. వైట్–కాలర్ జాబ్, బ్లూ–కాలర్ జాబ్ అనేదానితో సంబంధం లేకుండా ప్రతి ఉద్యోగికి విశ్లేషణాత్మక ఆలోచన విధానం, సమస్య పరిష్కార నైపుణ్యం, సమర్థవంతమైన కమ్యూనికేషన్, స్ట్రెస్ మెనేజ్మెంట్ స్కిల్స్... మొదలైన వాటికి సంబంధించి ప్రొఫెషనల్ స్కిల్స్ అవసరం. వీటిపై జెన్ జెడ్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. నిర్ణయాలు తీసుకోవడంలో ‘లైఫ్స్టైల్’ అనేది కీలకపాత్ర పోషిస్తోంది. డబ్బు నుంచి ఫ్రీ టైమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ వరకు ఎన్నో విషయాలను దృష్టిలో పెట్టుకుంటుంది జెన్ జెడ్. గుడ్ ప్లానింగ్ 2024లో యువతరం ఆసక్తి చూపుతున్న రంగాలలో ట్రావెల్ ఒకటి. ట్రావెల్ ప్రేమికులకు టాన్యాలాంటి ట్రావెల్ వ్లోగర్ల సలహాలు ఉపయోగపడుతున్నాయి. అడ్వర్టైజింగ్ రంగంలో ఉద్యోగం చేసిన టాన్యా సోలోగా ట్రావెలింగ్ మొదలుపెట్టి తాను వెళ్లిన ప్రదేశాలకు సంబంధించి వ్లోగింగ్ మొదలు పెట్టింది. యూట్యూబ్, ఎయిర్టెల్లాంటి పెద్ద కంపెనీలతో కలిసి పనిచేసింది. ట్రావెలింగ్పై ఆసక్తి ఉన్నవారికి గుడ్ ప్లానింగ్ అనేది ముఖ్యం అంటుంది టాన్యా. ‘గుడ్ ప్లానింగ్’కు సంబంధించి టిప్స్ చెబుతుంటుంది. ప్రణాళిక ఉండాలి దిల్లీకి చెందిన మౌనికా మాలిక్ బిజినెస్ అండ్ ఫైనాన్స్కు సంబంధించి కంటెంట్ క్రియేటర్గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుంది. పర్సనల్ ఫైనాన్స్ నుంచి స్టాక్మార్కెట్ వరకు ఎన్నో విషయాలను సులభంగా అర్థమయ్యేలా చెబుతోంది. ‘ఒక రంగంపై ఇష్టం ఉన్నంత మాత్రాన విజయం చేరువ కాదు. భవిష్యత్ ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. పరిశ్రమకైనా, వ్యక్తికైనా ఇది ముఖ్యం’ అంటుంది మాలిక్. (చదవండి: జుట్టు లేకపోయినా మోడల్గా రాణించి శభాష్ అనిపించుకుంది! హెయిర్లెస్ మోడల్గా సత్తా చాటింది) -
YSRCP:యువజన, మహిళా విభాగం అధ్యక్షుల నియామకం
తాడేపల్లి: వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం నూతన కమిటీ నియామకం జరిగింది. కొత్తగా కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీచేశారు. యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్గాంధీ, పిన్నెళ్లి వెంకట్రామిరెడ్డిని నియమించారు.మొత్తం 64 మందితో నూతన కమిటీని నియమించినట్టు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగానికి కూడా నూతన కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగానికి అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కళ్యాణిలు ఇద్దరినీ నియమించారు. అలాగే ఉపాధ్యక్షులుగా మంతెన మాధవీవర్మ, బండి పుణ్యశీల, డాక్టర్ శశికళను నియమించారు. మొత్తం 64 మందితో నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి జాబితా కోసం ఇక్కడి క్లిక్ చేయండి -
భారత్ పురోగతిపై యువత అభిప్రాయాలకు పెద్దపీట
న్యూఢిల్లీ: భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై యువత అభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తుందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల ద్వారా ఈ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. భారతదేశం 2047 నాటికి దాదాపు 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారవుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిని వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ‘‘భారతదేశం తన చరిత్రలో కీలక మలుపులో ఉంది’’ అని ఆయన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ పేర్కొన్నారు. యథాతథ విధానాలు వ్యాపార రంగం పురోగతికి దోహదపడవని అన్నారు. యువతసహా ప్రతిఒక్కరూ తమ అభిప్రాయాలను పంపడానికి ఒక వెబ్ పేజీ ఒక నెలపాటు లైవ్లో ఉంటుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. -
యువకుడి సెల్ఫ్ ‘రిప్’ పోస్టు..వెంటనే సూసైడ్
కొచ్చి: ఓ ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు బతికుండగానే తనకు తానే శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. అనంతరం కొద్దిసేపట్టికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ విషాదకర ఘటన కేరళలోని ఆలువాలో చోటు చేసుకుంది. ‘అజ్మల్ షరీఫ్(28) అనే యువకుడు తన ఫొటోకు రిప్(రెస్ట్ ఇన్ పీస్)అని క్యాప్షన్ పెట్టుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. తర్వాత కాసేపటికి ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అజ్మల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 14 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. సరైన ఉద్యోగం రాలేదన్న కారణంగా అజ్మల్ డిప్రెషన్తో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. యువకుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశాం’ అని పోలీసులు తెలిపారు. ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసు: 15 ఏళ్లు పోరాడిన తండ్రి మృతి -
అయోధ్యలో లక్షల్లో తులసి మాలల విక్రయాలు!
శ్రీరాముడు కొలువైన నగరమైన అయోధ్య(యూపీ)లో రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. ఆలయ నిర్మాణంలో యువత భాగస్వాములవుతున్నారు. వారంతా సనాతన సంస్కృతి వైపు ఆకర్షితులవుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రత్యేక సందర్భాలలో యువత ఆలయాలకు చేరుకుని, పూజలు చేస్తుండటం మరింతగా కనిపిస్తోంది. కార్తీకమాసంలో అయోధ్యకు దాదాపు 30 లక్షల మంది రామభక్తులు తరలివచ్చారు. వీరిలో గరిష్ట సంఖ్యలో యువత ఉన్నారు. మరోవైపు అయోధ్యలో తులసి మాలల వ్యాపారం జోరుగా సాగుతోంది. లక్షల సంఖ్యలో తులసి మాలలు విక్రయమవుతున్నాయి. యువత తులసి మాలలు ధరించేందుకు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలు, భక్తుల రద్దీ మరింతగా పెరిగిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే యువత తులసిమాల వేసుకోవాలని భావిస్తున్నారన్నారు. కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు తులసి మాలలను కొనుగోలు చేశారని వ్యాపారులు చెబుతున్నారు. తులసి మాలలను చేతితో తయారు చేసే భువన్ దేవి మాట్లాడుతూ తన భర్తతో పాటు చాలా కాలంగా తాను ఈ పనిలో నిమగ్నమయ్యానని, ఇప్పుడు యువత అమితంగా తులసిమాలలకు ఆకర్షితులు కావడం చూస్తున్నానని అన్నారు. గత ఏడాది కాలంగా తులసి, రోజా, రుద్రాక్ష మాలలను యువతీయువకులు కొనుగోలు చేస్తున్నారన్నారు. తులసి మాల ధారణతో మనస్సు, వాక్కు రెండింటికీ స్వచ్ఛత లభిస్తుందని చెబుతారు. తులసి మాల ధరించడం వలన ఆధ్యాత్మిక శక్తి పెంపొందుతుందని, భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని అనుభూతి చెందుతారని భక్తులు నమ్ముతారు. తులసి మాల మనశ్శాంతిని అందిస్తుందని కూడా అంటారు. తులసి మాల ధరించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: భారత్ పొరుగు దేశాల్లో మరోమారు భూ ప్రకంపనలు -
యువత కోసమే తొలి అడుగు
సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని యువతను ఆదుకోవడమే లక్ష్యంగా తొలిఅడుగు వేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహు ల్గాంధీ వెల్లడించారు. అక్కడి నిరుద్యోగులు, యువతతో ముచ్చటించిన సందర్భంలో తాను చూసిన, విన్న విషయాలు తీవ్రంగా కలచివేశాయ ని పేర్కొన్నారు. తెలంగాణలోని పరిస్థితులను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల హైదరాబాద్ అశోక్నగర్లో నిరుద్యోగులు, విద్యార్థులతో భేటీ అయిన వీడియో ను సోమవారం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ‘నేను ఒకసారి తెలంగాణ యువతతో సమావేశమయ్యాను. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకవడం, ఈ లీకేజీల్లో కేసీఆర్ బంధువుల పాత్ర ఉండడం సిగ్గుపడాల్సిన విషయం. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులతో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. యువతకు ఉపాధి, విద్యావకాశాలు కల్పించే దిశలో మేం మొదటి అడుగు వేస్తాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా జాబ్ కేలండర్ ఇప్పటికే విడుదల చేశాం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. యువ వికాసంలో భాగంగా విద్యాభరోసా కార్డుల ద్వారా విద్యార్థులు.. కళాశాల, యూనివర్సిటీ, కోచింగ్ ఫీజులు కట్టుకునేందుకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తాం. అది తెలంగాణ యువత కోసం మేం వేయబోయే ముందడుగు..’అని ఆ వీడియోలో రాహుల్ చెప్పారు. దొరల సర్కారులో తెలంగాణ యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని అశోక్నగర్లో తన తాజా భేటీతో స్పష్టమైందని, తమ పార్టీ ఇచ్చిన జాబ్ కేలండర్ వారికి ఉపశమనం కలిగిస్తుందని, త్వరలో కాంగ్రెస్ నేతృత్వంలో రాబోయే ప్రజల సర్కారులో తెలంగాణ యువత భవితవ్యం పదిలంగా ఉంటుందని, ఇది తన గ్యారంటీ అని పేర్కొన్నారు. నేడు కార్మిక సంఘాలతో భేటీ: చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్గాంధీ మంగళవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10:30–11 గంటల వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆటో వర్కర్లు, జీహెచ్ఎంసీ, జిగ్ కార్మికుల సంఘాలతో సమావేశమవుతారని, మధ్యాహ్నం 11:30–12:30 గంటల వరకు నాంపల్లి నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించి కార్నర్ మీటింగ్లో మాట్లాడతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ జహీరాబాద్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. -
రాజకీయ నిరుద్యోగి రాహుల్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నిరుద్యోగంతో బాధ పడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యువతను రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. ఉద్యోగాల కల్పన విషయంలో తాము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము రాహుల్కి ఉందా అని సవాల్ చేశారు. ఈ మేరకు శనివారం కేటీ రామారావు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో గడిచిన పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. తొమ్మిదిన్నరేండ్లలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, 1.60లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని, కాంగ్రెస్ పాలనలో 2004 –14 నడుమ తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 10,116 మాత్రమేనని పేర్కొన్నారు. జీవితంలో ఏనాడూ ఉద్యమాలు, ఉద్యోగాలు చేయని రాహుల్ గాం«దీకి యువత ఆకాంక్షలు తెలియవని, ఉద్యోగార్థుల ఇబ్బందులు ఆయనకు అర్దం కావని నిందించారు. 95శాతం ఉద్యోగాలు స్థానికులకేనంటూ కొత్త జోనల్ వ్యవస్థను తాము నిబద్ధతతో తెచ్చామని, 1972లో ముల్కీ నిబంధనలను రద్దు చేసి స్థానికతకు సమాధి కట్టింది కాంగ్రెస్ పార్టియేనని విమర్శించారు. ఆరు సూత్రాల పథకం, 610 జీవో, గిర్గ్లానీ నివేదికలు తుంగలో తొక్కి హైదరాబాద్ను ఫ్రీజోన్గా ప్రకటించి యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను కొల్లగొట్టి తీరని అన్యాయం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. సోనియాను రేవంత్ బలిదేవత అన్నారు 1952, 1969లో తెలంగాణ కోసం ఉద్యమించిన వారిని కాంగ్రెస్ పార్టీ తుపాకీ కాల్పులతో బలితీసుకుందని, మలిదశ ఉద్యమంలో పదేండ్లు కాలయాపన చేసి యువతీ యువకుల ఆత్మబలిదానాలకు కారణమైన సోనియాగాందీని అప్పట్లో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ఆరు నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ కేలండర్ పచ్చి మోసమని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండే 2024 మార్చి, ఏప్రిల్, మే నెలలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎలా సాధ్యమని కేటీఆర్ ప్రశ్నించారు. -
ప్రభుత్వోద్యోగ గణాంకాలతో వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగ వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్సైట్ www.telanganajobstats.in ను మంత్రి కె. తారక రామారావు మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వోద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించిన కేటీఆర్... దీనిపై వాస్తవ సమాచారాన్ని వెల్లడించేందుకే ఈ వెబ్సైట్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉద్యోగాల భర్తీ వివరాలను అందులో పొందుపరిచినట్లు వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతీ యువకులు ఈ వెబ్సైట్ను సందర్శించి నిజాలు తెలుసుకోవాలని కోరారు. గత తొమ్మిదిన్నరేళ్లలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించామని, వాటిలో 1.60 లక్షలకుపైగా ప్రభుత్వోద్యోగాల భర్తీని పూర్తి చేశామని కేటీఆర్ తెలిపారు. జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. -
యూత్పై కేటీఆర్ ఫోకస్..
-
ఫలితాల మరుసటి రోజే మిమ్మల్ని కలుస్తా!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజున డిసెంబర్ నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ అశోక్నగర్లో యువతతో సమావేశమవుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు హామీనిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు తాము భరోసాగా ఉంటామని ప్రకటించారు. పలు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న కొందరు విద్యార్థులు సోమవారం కేటీఆర్తో భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన సుమారు రెండు గంటల పాటు విస్తృతంగా సంభాషించారు. నోటిఫికేషన్ల ఫలితాల జారీపై ఉన్న కేసుల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని, యువత ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. పదేళ్ల పాటు ఉద్యోగం చేసిన యువకుడిగా, సోదరుడిగా యువత ఆకాంక్షలను అర్ధం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల తాలూకు వివరాల జాబితాను, ప్రస్తు తం భర్తీ చేస్తున్న ఉద్యోగాల ప్రక్రియ తాలూకు వివరాలను గణాంకాలతో సహా వివరించారు. మా నిబద్ధతను ప్రశ్నించే అవకాశం లేదు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమ నిబద్ధతను ప్రశ్నించే అవకాశం ఎవరికీ లేదని కేటీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా వేయి ఉద్యోగాలు కూడా కల్పించని కాంగ్రెస్ పార్టీకి తమను ప్రశ్నించే కనీస అర్హత లేదన్నారు. 2లక్షల30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటికే 1,62,000కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలను ఇస్తే లెక్కలతో సహా వివరించాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయాల కోసం చేస్తున్న అసత్య పూరిత ప్రచారాన్ని యువత తెలుసుకుని తిప్పికొట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పోస్టుల సంఖ్యను పెంచండి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను పెద్ద ఎత్తున ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియకు సంబంధించిన కొన్ని సమస్యల వల్ల యువతలో కొంత ఆందోళన నెలకొందని కేటీఆర్తో భేటీ అయిన యువకులు తెలిపారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. పోస్టుల భర్తీ ప్రక్రియ, రోస్టర్ పాయింట్ల కేటాయింపు, విద్య అర్హతల విషయంలో ఉన్న కొన్ని సమస్యలను సులభంగా పరిష్కరించే అవకాశం ఉందంటూ ఇందుకు సంబంధించిన కొన్ని సలహాలు, సూచనలను అందించారు. కేవలం సాంకేతికపరమైన అంశాల ఆధారంగా అనేక న్యాయపరమైన కేసులు ఎదురవుతున్నాయని, వీటి వలన భర్తీ ప్రక్రియకు ఆటంకం కలుగుతోందని చెప్పుకొచ్చారు. ఇందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందిస్తూ, వివిధ నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియ పై ఉన్న కోర్టు కేసుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. -
వరల్డ్ కప్ రాలేదని యువకుడి ఆత్మహత్య
కోల్కతా : ఇండియా వరల్డ్ కప్ గెలవలేదన్న బాధను జీర్ణించుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లాలో ఈ ఘటన జరిగింది. చీరలు అమ్మే దుకాణంలో పనిచేసే రాహుల్ లోహర్(23) టీమ్ ఇండియాకు వీరాభిమాని. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఓటమిని రాహుల్ తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాత్రి 11 గంటలకు రాహుల్ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బావ ఉత్తమ్ సుర్ తెలిపారు. ఆదివారం రాహుల్ షాప్కు వెళ్లలేదని,ప్రొజెక్టర్లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూశాడని ఉత్తమ్ చెప్పాడు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. విషయం తెలిసిన వెంటనే తాను వెళ్లి రాహుల్ను ఆస్పత్రికి తీసుకెళ్లానని, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పినట్లు తెలిపాడు. ఇదీచదవండి..వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి.. షాహీన్ షా అఫ్రిది పోస్ట్ వైరల్ -
రష్మిక డీప్ ఫేక్ వీడియో: కీలక పరిణామం, ఇది వాడి పనేనా?
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఘటనలో కీలక పరిణామంచోట చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు బిహార్కు చెందిన 19 ఏళ్ల యువకుడిని ప్రశ్నించారు. విచారణలో భాగంగా ఆ యువకుడిని ప్రశ్నించినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. నిందిత యువకుడి సోషల్ మీడియా ఖాతానుండే అప్లోడ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తరువాత ఇతర ప్లాట్ఫామ్స్లో షేర్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడికి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. మరోవైపు విచారణ సందర్భంగా వేరే ఇన్స్టా ఖాతానుంచి ఆ వీడియోను తాను డౌన్లోడ్ చేసుకున్నట్లు యువకుడు చెప్పినప్పటికీ, విచారణ కొనసాగుతుందని సంబంధిత సీనియర్ అధికారులు తెలిపారు. (వర్క్ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే:ఆ దిగ్గజాలు ఇపుడేమంటాయో?) మొబైల్ ఫోన్తో సహా బిహార్కు చెందిన యువకుడిని ఐఎఫ్ఎస్ఓ యూనిట్ ముందు హాజరుకావాలని పోలీసులు అదేశించారు. అలాగే FIR నమోదు చేసిన వెంటనే, IFSO యూనిట్ కూడా నిందితుడిని గుర్తించడానికి URL ఇతర వివరాల కోసం సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు లేఖ రాసింది. ఇది ఇలా ఉంటే ఈ ఘటనలో నవంబర్ 10న, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO)లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 465 (ఫోర్జరీకి శిక్ష) , 469 (పరువుకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్లు 66C , 66E కింద ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. (దీపావళి తరువాత పసిడి పరుగు: డాలర్ ఢమాల్) కాగా నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో ఆన్లైన్లో మహిళల సెక్యూరిటీపై ఆందోళన రేపింది. బిగ్బీ అమితాబ్ సహా పలువురు నటీ నటులు, ఇతర సెలబ్రిటీలు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చివరికి కేంద్ర ఐటీ శాఖ కూడా స్పందించి మరోసారి సోషల్ మీడియా సంస్థలు ఐటీ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని గుర్తు చేసింది. (చాలా బాధ కలిగింది, ప్రతీదీ నిజం కాదు..ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!) -
మరిన్ని పెట్టుబడులు
సాక్షి, అమరావతి: స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.19,037 కోట్ల విలువైన 10 పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో ఏడు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు కాగా.. మూడు విస్తరణ కార్యక్రమాలకు చెందినవి ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 69,565 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికరంగంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. వీటన్నింటినీ అధికారులు తెలుసుకుంటూ ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అర్థంచేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. అత్యంత పారదర్శక విధానాల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చా మని.. ఈ క్రమంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచామని ముఖ్యమంత్రి జగన్ గుర్తుచేశారు. పరిశ్రమలపట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయడం ద్వారా ఈ ప్రయాణం మరింతగా ముందుకు సాగించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే అనుమతులు, తదితర అంశాల్లో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోందని, ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్కాల్ దూరంలో ఉన్నామన్న భరోసాను వారికి కల్పిస్తున్నామన్నారు. కానీ, అనుమతులు, క్లియరెన్స్ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతంగా పెంచాల్సిన అవసరం ఉందని, పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలపట్ల చురుగ్గా వ్యవహరించడంతో పాటు, వాటికి త్వరగా అనుమతులు మంజూరు చేసే ప్రక్రియ వేగాన్ని ఇంకా పెంచాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జీఐఎస్ ఒప్పందాల అమలును వేగవంతం చేయండి.. ఇక విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున మేలు చేకూర్చామని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల రంగానికి పునరుజ్జీవం కల్పించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇస్తూ వారికి చేదోడుగా నిలవడం ద్వారా ఎంఎస్ఎంఈల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలతతో ముందుకు సాగుతోందన్నారు. ఈ రంగంపై ఎక్కువమంది ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి.. వీటిని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతన్నారు. ఈ సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. పురపాలక, పట్టణాభివద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్భార్గవ్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె. విజయానంద్, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ (చేనేత, జౌళి) ముఖ్యకార్యదర్శి కె. సునీత, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్ఐపీబీ ఆమోదం పొందిన కంపెనీల వివరాలు.. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయనున్న పెప్పర్ మోషన్ కంపెనీ. రూ.4,640 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 8080 మందికి ఉద్యోగాలు రానున్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం. దీనిద్వారా రూ.531 కోట్ల పెట్టుబడి, 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు లభిస్తాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.1,750 కోట్ల పెట్టుబడితో శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు. ఇందులో 2,000 మందికి ప్రత్యక్షంగానూ, మరో 500 మందికి పరోక్షంగా ఉద్యోగాలు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో స్మైల్ (సబ్స్ట్రేట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్) కంపెనీ ఆధ్వర్యంలో రూ.166 కోట్ల పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్ ఏర్పాటు. దీనిద్వారా దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలు. నెల్లూరు జిల్లా కష్ణపట్నం వద్ద కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ (రిలయెన్స్ పవర్) తన పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు ఎస్ఐపీబీ ఆమోదం. థర్మల్ పవర్ స్థానంలో రూ.6,174 కోట్ల పెట్టుబడితో కొత్త తరహా, సాంప్రదాయేతర పర్యావరణహిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటుకు ఆమోదం. దీనిద్వారా 600 మందికి ప్రత్యక్షంగానూ, 2,000 మందికి పరోక్షంగానూ ఉద్యోగావకాశాలు. తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద ఆంధ్ర పేపర్ లిమిటెడ్ రూ.4వేల కోట్ల పెట్టుబడితో సంస్థను విస్తరించనుంది. తద్వారా 3వేల మందికి ఉద్యోగాలు. విశాఖ జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ లిమిటెడ్ కూడా రూ.679 కోట్ల పెట్టుబడితో విస్తరణ. తద్వారా 300 మందికి ఉద్యోగాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ సైతం రూ.933 కోట్ల పెట్టుబడి సంస్థను విస్తరించనుంది. 2,100 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద రూ.114 కోట్ల పెట్టుబడి పెట్టనున్న శ్రీ వెంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్కు ఎస్ఐపీబీ ఆమోదం. దీనిద్వారా 310 మందికి ఉద్యోగాలు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఓరిల్ ఫుడ్స్ లిమిటెడ్. దాదాపుగా 550 మందికి ఉద్యోగాలు వస్తాయి. -
గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి ఉరి
జునాగఢ్: గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లా చార్వాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విమల్ చుదాసామా ఇంట్లో ఓ యువకుడు(28) అనుమాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ శవమై కనిపించాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించిందని, తన ఆత్మహత్యకు ఎమ్మెల్యే విమల్తోపాటు అతడి అత్త, మామ వేధింపులే కారణమంటూ ఆ లేఖలో ఉందని వివరించారు. బలవన్మరణానికి పాల్పడిన యువకుడిని నితిన్ పర్మర్గా పోలీసులు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఇంటి పైకప్పునకు ఉరి వేసుకొని చనిపోయినట్లు చెప్పారు. చనిపోయిన యువకుడు నితిన్ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువేనని తెలిసిందని అన్నారు. అయితే, ఎమ్మెల్యే విమల్ వాదన మరోలా ఉంది. నితిన్ను ఎవరో హత్య చేశారని, తనను అప్రతిష్టపాలు చేయడానికే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని, నకిలీ సూసైడ్ నోట్ను సృష్టించారని ఆరోపించారు. నితిన్ చావుకు తానే కారణం అంటూ రాజకీయ ప్రత్యర్థులు నిందలు మోపుతున్నారని వాపోయారు. -
Mann ki Baat: పటేల్ జయంతి నాడు... మేరా యువ భారత్
న్యూఢిల్లీ: జాతి నిర్మాణ కార్యకలాపాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా మేరా యువ భారత్ పేరుతో జాతీయ స్థాయి వేదికను అందుబాటులోకి తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సర్దార్ వల్లభ్ బాయి పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న దీన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆ సందర్భంగా మేరా యువ భారత్ వెబ్సైట్ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. MYBharat.Gov.in సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని యువతకు సూచించారు. దీన్ని యువ శక్తిని జాతి నిర్మాణానికి, ప్రగతికి వినియోగపరిచేందుకు తలపెట్టిన అద్భుత కార్యక్రమంగా మోదీ అభివర్ణించారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతినుద్దేశించి మాట్లాడారు. అక్టోబర్ 31 దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కూడానని గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. నవంబర్ 15న ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు కూడా మోదీ నివాళులర్పించారు. విదేశీ పాలనను ఒప్పుకోని ధీర నాయకునిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. తిల్కా మహరాజ్, సిద్ధూ, కాన్హు, తాంతియా భీల్ వంటి వీర గిరిజన నాయకులు దేశ చరిత్రలో అడుగడుగునా కనిపిస్తారన్నారు. గిరిజన సమాజానికి దేశం ఎంతగానో రుణపడిందన్నారు. స్థానికతకు మరింతగా పెద్ద పీట వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి రోజున ఖాదీ వస్తువుల అమ్మకం రికార్డులు సృష్టించిందని గుర్తు చేశారు. ఢిల్లీలో అమృత్ వాటిక రెండున్నరేళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అక్టోబర్ 31న ఘనంగా ముగియనుందని మోదీ చెప్పారు. ‘‘దీనికి గుర్తుగా ఢిల్లీలో అమృత్ వాటిక నిర్మించనున్నాం. ఇందుకోసం అమృత్ కలశ్ యాత్రల పేరుతో దేశవ్యాప్తంగా మట్టిని సేకరించి పంపుతుండటం హర్షణీయం’’అన్నారు. వ్యర్థాల నుంచి సంపద అన్నది మన నూతన నినాదమని మోదీ అన్నారు. గుజరాత్ల అంబా జీ మందిర్లో వ్యర్థౠల నుంచి రూపొందించిన పలు కళాకృతులు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. దీన్ని దేశవాసులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బెర్లిన్లో తాజాగా ముగిసిన ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్లో భారత్ 75 స్వర్ణాలతో పాటు ఏకంగా 200 పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. గిరిజన వీరుల ప్రస్తావన ప్రధాని నరేంద్ర మోదీ మన్కీ బాత్లో గిరిజన వీరుల గురించి ప్రస్తావించారు. గిరిజన యుద్ధ వీరుల చరిత్రను ప్రశంసించారు. తెలంగాణలోని నిర్మల్, ఉట్నూరు, చెన్నూరు, అసిఫాబాద్ ప్రాంతాలను పరిపాలించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేంగా పోరాడి ఉరికొయ్యకు ప్రాణాలరి్పంచిన రాంజీ గోండు, ఛత్తీస్గఢ్లో బస్తర్ప్రాంతానికి చెందిన వీర్ గుండాధుర్, మధ్యప్రదేశ్కు చెందిన ప్రథమ స్వాతంత్య్ర సమర యోధుడు భీమా నాయక్ల వీర చరిత్రను కొనియాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన తిల్కా మాంఝీ, సమానత్వం కోసం పోరాడిన సిద్ధో–కన్హూ, స్వాతంత్య్ర యోధుడు తాంతియా భీల్లు ఈ గడ్డపై పుట్టినందుకు గరి్వస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గిరిజన ప్రజల్లో అల్లూరి సీతారామరాజు నింపిన స్ఫూర్తిని దేశం ఇప్పటికీ గుర్తుంచుకుందని పేర్కొన్నారు. గిరిజన సమాజానికి స్ఫూర్తినిచి్చన రాణి దుర్గావతి 500వ జయంతిని దేశం జరుపుకొంటోందని, గిరిజన సమాజానికి స్ఫూర్తినిచ్చిన వారి గురించి యువత తెలుసుకొని వారి నుంచి స్ఫూర్తి పొందాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
ఈ ఎన్నికల్లో అభ్యర్ధుల తలరాతలు మార్చబోయేది వీరే..!
యాదాద్రి: అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కాబోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం ఓటర్లలో 18 ఏళ్ల నుంచి 39 వారే సగానికంటే ఎక్కువమంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల భవిత ఈ యువ ఓటర్లపైనే ఆధారపడి ఉంది. దీంతో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారి నుంచి మొదలుకొని 39 ఏళ్లలోపు ఉన్న వారిపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను వారే ప్రభావితం చేయనుండడంతో వారిని ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. 40 ఏళ్ల పైబడిన వారు ఎలాగూ ఓ కచ్చితమైన అభిప్రాయంతో ఉంటారనే అంచనాతో 40 ఏళ్లకంటే తక్కువ వయస్సు ఉన్న వారిపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. జిల్లాల వారీగా యూత్ ఓట్లు ఇలా.. నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తం 14,26,480 మంది ఓటర్లు ఉన్నారు. అందులో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న 18–19 ఏళ్ల వారు 48,909 మంది ఉండగా, 20 నుంచి 29 ఏళ్ల వారు 2,91,768 మంది ఉన్నారు. అంటే 29 ఏళ్లలోపు ఉన్న ఓటర్లే జిల్లాలో 3,40,677 మంది (23.89 శాతం) ఉన్నారు. ఇక 30 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 4,10,842 మంది ఉన్నారు. ఈ రెండు కేటగిరీలు కలిపితే 7,51,519 మంది (52.69 శాతం) ఓటర్లు వీరే ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 9,63,701 మంది ఓటర్లు ఉండగా.. 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్లు 4,89,118 మంది ఉన్నారు. జిల్లా ఓటర్లలో 50.75 శాతం వీరే ఉన్నారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4,39,100 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18 నుంచి 29 ఏళ్ల లోపు ఓటర్లు 1,02,159 మంది ఉన్నారు. వీరిలో కొత్త ఓటర్లు 14,512 మంది ఉన్నారు. 30 నుంచి 39 ఏళ్లలోపు వారు 1,22,738 మంది ఉన్నారు. జిల్లాలో 39 ఏళ్లలోపు వారు మొత్తం 2,24,897 (51.21 శాతం) మంది ఉన్నారు. బీఆర్ఎస్.. వంద మందికి ఒక ఇన్చార్జి క్షేత్రస్థాయిలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నిత్యం వారికి అందుబాటులో ఉండేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని క్షేత్రస్థాయిలోకి పంపించింది. ముఖ్యంగా వారు కొత్త ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించి తమవైపు తిప్పుకునే కార్యాచరణను అమలు చేస్తున్నారు. నిరుద్యోగులను ఆకర్షించేలా.. ఉద్యోగాలు రాక, వచ్చినా నోటిఫికేషన్లు వాయిదా పడి తీవ్ర నిరాశలో ఉన్న నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ అడుగులు వేస్తున్నాయి. నియోజవర్గాల్లో తమ టికెట్ కన్ఫర్మ్ అనుకున్న అభ్యర్థులు వారిపై ప్రత్యేక దృష్టి సారించేలా తమ బృందాలను రంగంలోకి దింపారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. -
యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్ మృతి
నూజివీడు : వినాయక నిమజ్జనాల సందర్భంగా విధులు నిర్వహిస్తూ ఓ యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర(32) ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో శనివారం రాత్రి డీజే ఆపమని చెప్పిన కానిస్టేబుల్ నరేంద్రపై ఉలాస రామకృష్ణ అనే యువకుడు తలపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నరేంద్రను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని సోమవారం తెల్లవారుజామున నూజివీడు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీంతో ఏరియా ఆస్పత్రి వద్దకు నూజివీడు సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది, అధికారులు, మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు చేరుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కొద్దిసేపు ఆందోళన చేశారు. కాగా, ఏరియా ఆస్పత్రిలో ఉన్న నరేంద్ర భౌతికకాయాన్ని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఏలూరు డీఐజీ జీవీజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి కూడా నివాళులర్పించారు. అనంతరం నరేంద్ర స్వగ్రామమైన ఎనీ్టఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం పోలిశెట్టిపాడులో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
గ్రామీణ పేదలకు ‘ఉన్నతి’
సాక్షి, అమరావతి:గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనులపై ఎక్కువగా ఆధారపడే పేద కుటుంబాల్లో యువతకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘ఉన్నతి’ పేరుతో వివిధ రకాల ఉపాధి, వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ద్విచక్ర వాహనాలు, ఏసీ మెషిన్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపేర్ అండ్ సర్వీసింగ్, ఇంటర్నెట్ సేవలకు సంబంధించి టెక్నికల్ సర్వీస్ తదితర 192 రకాల ఉపాధి, వృత్తి విద్య కోర్సుల్లో పేద కుటుంబాల్లోని దాదాపు 25 వేల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. నిబంధనల ప్రకారం.. ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా వంద రోజులపాటు పనులు కల్పిస్తున్నారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో ముగ్గురు పనిచేసే వ్యక్తులు ఉండి.. ఆ ముగ్గురు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకోవాలనుకుంటే.. ఒక్కొక్కరికి గరిష్టంగా 33 పని దినాల చొప్పున కేటాయిస్తున్నారు. ఉపాధి కూలీల కుటుంబాలు గరిష్ట వంద రోజుల పరిమితి వినియోగించుకున్న అనంతరం కూడా ఆ కుటుంబం ఏ పనిలేక ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా.. ఉన్నతి పథకం కింద శిక్షణ ఇస్తారు. ఏడాదిలో వంద రోజుల పనులు పూర్తి చేసుకున్న కుటుంబాలను గుర్తించి ఆయా కుటుంబాల్లో యువతకు శిక్షణ కార్యక్రమాలు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో గరిష్టంగా 18–45 ఏళ్ల మధ్య, ఇతర సామాజిక వర్గాల్లో 18–35 ఏళ్ల మధ్య వయసు గలవారు ఈ శిక్షణ కార్యక్రమాలకు అర్హులుగా నిర్థారించారు. ఉచిత శిక్షణతోపాటు రోజూ కూలి జమ శిక్షణ కార్యక్రమాలను పూర్తి ఉచితంగా అందజేయడంతో పాటు శిక్షణకు హాజరయ్యే యువతకు రోజు వారీ కూలి డబ్బులను స్టైఫండ్ రూపంలో ప్రభుత్వం అందజేస్తుంది. గరిష్టంగా వంద రోజులు పాటు స్టైఫండ్ అందజేస్తారు. సంబంధిత యువత శిక్షణ కాలంలో కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. గరిష్టంగా వంద రోజుల పాటు ఉపాధి హామీ పనులకు వెళ్లిన కుటుంబాల్లో యువత ఉన్న కుటుంబాలు 4,75,327 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఎస్ఈఈడీఏపీ (సీడాప్), ఆర్ఎస్ఈటీఐ, కేవీకే సంస్థల ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించారు. ఆయా సంస్థలు క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధి హామీ పథకం సిబ్బంది సాయంతో సంబంధిత కుటుంబాలను ప్రత్యక్షంగా సందర్శించి శిక్షణ పొందేందుకు ఆసక్తి గల యువత పేర్లను నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత అర్హులైన వారికి శిక్షణ అందజేస్తారు. -
నిమజ్జనంలో విషాదం.. చావును ఏరికోరి తెచ్చుకోవడం అంటే ఇదే!
సాక్షి, అన్నమయ్య: రాజంపేటలో శనివారం జరిగిన వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. విన్యాసాలు చేయబోయి ఓ వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అప్పటిదాకా సంతోషంగా గంతులేసిన వ్యక్తి.. అరక్షణంలో రక్తపు మడుగులో పడిపోవడంతో అక్కడున్నవాళ్లంతా దిగ్భ్రాంతికి లోనయయారు. రాజంపేట పట్టణంలో శనివారం కిరణ్ అనే వ్యక్తి గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నాడు. అయితే అప్పటికే ఫుల్గా తాగేసి ఉన్న కిరణ్.. రకరకాల విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో విగ్రహం తీసుకెళ్తున్న ట్రాక్టర్ బంపర్పై నుంచి దూకి విన్యాసం చేయాలనుకున్నాడు. అయితే.. ఆ ఊపులో తల సరాసరిగా రోడ్డుకు బలంగా తగిలింది. దీంతో స్పృహ కోల్పోయాడు. పక్కన ఉన్నవాళ్లు కడప ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు తలలో నరాలు దెబ్బ తిన్నాయని.. ఆపరేషన్ అవసరమని, పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి మద్యం మత్తులో వినోదానికి పోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఆ యువకుడు. -
పటిష్ట విద్యా వ్యవస్థతో యువత ప్రగతి
సాక్షి, అమరావతి: ఒక దేశం ఆర్థికంగా, శక్తివంతంగా ఎదగాలంటే ఉన్నత విలువలు గల యువత పాత్ర ఎంతో కీలకమని ఐక్యరాజ్య సమితి సదస్సులో ఏపీ విద్యార్థులు తెలిపారు. యువత ప్రగతికి పటిష్టమైన విద్యా వ్యవస్థ అవసరమని, ఇది భారతదేశంలోను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోను బలంగా ఉందని చాటిచెప్పారు. ఏపీ నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఎస్డీజీ సమ్మిట్కు వెళ్లిన విషయం తెలిసిందే. వీరు ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన కొలంబియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ విభాగంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్కు వీరు హాజరయ్యారు. యూఎన్ఓ స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్కుమార్ నేతృత్వంలో సదస్సుకు హాజరైన విద్యార్థినులు రాజేశ్వరి, షేక్ అమ్మాజాన్ తమ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆర్థిక ప్రగతిలో యువత పాత్ర, భారతదేశంలో సుస్థిరాభివృద్ధి, ప్రజావైద్యం అంశాలపైన, రాష్ట్రంలో ప్రజా వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్పై వారు ప్రసంగించారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలు సుస్థిరాభివృది్ధకి ఏ విధంగా తోడ్పడుతున్నాయో, ఏపీ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన స మూల మార్పులు పేద కుటుంబాలకు చెందిన తమను అంతర్జాతీయ వేదికలపై ఎలా నిలి పాయో అంతర్జాతీయ ప్రతినిధులు, మేధావుల ముందు వారు వివరించారు. ఏఐ టెక్నాలజీ వినియోగించుకోవాలి.. ఇక ఐక్యరాజ్య సమితి భాగస్వామ్య సంస్థలైన యూఎన్ హాబిటాట్, యూఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్, సివిల్ సొసైటీ యూనిట్, యునిసెఫ్, ఏఎస్ఎఫ్, యూత్ అసెంబ్లీ ఆధ్యర్యంలో రెండ్రోజులుగా యూత్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న రాజేశ్వరి, అమ్మాజాన్ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని ఉన్నతంగా మార్చడంలో యువత చురుౖకైన పాత్ర పోషించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, శాంతిస్థాపన, రాజకీయాలు, విధాన రూపకల్పనలో యువత నిమగ్నం కావాలని, విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వినియోగించుకోవాలన్నారు. ఏపీలో పాఠశాల విద్యలో ఈ తరహా పరి జ్ఞానం అమలు చేస్తున్నారని వివరించారు. అలాగే, పాలనలోనూ, విధానపరమైన నిర్ణయాల్లోనూ యువత అభిప్రాయాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్–పేరెంట్ కమిటీలు వేసి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు రాజేశ్వరి వివరించింది. ఏపీలో విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారని అమ్మాజాన్ తెలిపింది. షకిన్కుమార్ మాట్లాడుతూ.. భారత్లో యువతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ వారికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇందుకు 10 మంది విద్యార్థులను ఐరాస సదస్సుకు పంపడమే నిదర్శనమన్నారు. -
‘గ్రాంట్’ ముసుగు..‘కైండ్’ మిస్టరీ!
సాక్షి, అమరావతి: యువత శిక్షణ కోసం భారీగా ఆర్థిక సహాయం అందిస్తామని అప్పటిదాకా నమ్మబలికిన ప్రైవేట్ కంపెనీ ప్లేటు ఫిరాయించింది! భారీ లాభాన్ని వేసుకుని మరీ ప్రాజెక్టును దక్కించుకుని ప్రజాదనాన్ని కాజేసింది. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత జీవోలు, ఒప్పందాల్లో ఉన్న ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఆర్థిక సహకారం) అనే పదం స్థానంలో తరువాత ‘గ్రాంట్ ఇన్ కైండ్ (వస్తు సహకారం) చేరింది. చివరకు ‘గ్రాంట్ ఇన్ కైండ్’ సైతం అదృశ్యమైంది. ఈ మాయాజాలంతో చివరకు టెండర్ల ప్రక్రియ అనేదే లేకుండా పోయింది. తద్వారా డిజైన్టెక్కు ఏకపక్షంగా కట్టబెట్టేసి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బాబు గూటికి చేరవేశారు. 34.88 శాతం లాభంతో.. ఏపీ ఎస్ఎస్డీసీ ప్రాజెక్టు ముసుగులో నిధులను కొల్లగొట్టాలని ముందుగానే నిర్ణయించుకున్న మాజీ సీఎం చంద్రబాబు ఆరు క్లస్టర్లుగా అంచనా వ్యయం నివేదికను రూపొందించాలని ఆదేశించారు. వివిధ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని అధికారులు ఏడు నివేదికలు రూపొందించారు. వాటిల్లో ప్రాజెక్టు కనిష్ట వ్యయం రూ.214 కోట్లు కాగా గరిష్ట వ్యయం రూ.282 కోట్లుగా మాత్రమే ఉంది. బినామీ సంస్థ డిజైన్ టెక్ లాభం 34.88 శాతాన్ని కూడా కలిపి ఒక్కో క్లస్టర్కు రూ.55 కోట్లు చొప్పున మొత్తం ఆరు క్లస్టర్లకు రూ.330 కోట్లు అవుతుందని నివేదిక రూపొందించారు. అందులో 90 శాతం సీమెన్స్–డిజైన్ టెక్ భరిస్తాయని, మిగతా 10 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అసలు ఈ ప్రాజెక్టు గురించే సీమెన్స్ కంపెనీకి తెలియదు. ఆ కంపెనీ 90 శాతం నిధులను సమకూర్చదని చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. 34.88 శాతం అంటే భారీ లాభమే. మరి లాభం ప్రస్తావన ఉన్న ప్రాజెక్టుకు ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ఎలా వస్తుందనే ప్రాథమిక అంశాన్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఆ కంపెనీ పేరును వాడుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం రూ.330 కోట్లు వ్యయం అవుతుంది అని రూపొందించిన నివేదిక.. కానీ ప్రాజెక్ట్ వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేసి ప్రజాధనం కొల్లగొట్టారు అంచనాలు పెంచి వాటా నిధులు స్వాహా ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేస్తే అందులో ప్రభుత్వం వాటా 10 శాతం కింద వెచ్చించాల్సిన నిధులు కూడా ఆ మేరకు పెరుగుతాయి. తద్వారా ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించేలా చంద్రబాబు పథకం వేశారు. అందుకే ఆరు క్లస్టర్లకు కలిపి రూ.330 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ను ఏకంగా రూ.3,300 కోట్లకు అమాంతం అంచనాలు పెంచేసి ఖరారు చేశారు. సిమెన్స్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా చెల్లించేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు చెల్లించినట్లు ఆర్థిక శాఖ అధికారులు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అందులో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబు గూటికి చేరాయి. అదే విషయం సీఐడీ దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైంది. ఎయిడ్ లేదు.. కైండ్ అంత కంటే లేదు ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం నిధులను సీమెన్స్ కంపెనీ ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’గా సమకూరుస్తుందని టీడీపీ సర్కారు జీవోలో పేర్కొంది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ గురించి సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియదు. ఢిల్లీలో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్ ద్వారా చంద్రబాబు ముఠా గూడుపుఠాణి నడిపించింది. జీవో జారీ చేసిన తరువాత డిజైన్ టెక్ కంపెనీని రంగంలోకి తెచ్చారు. సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలు కథ ఇక్కడే మొదలైంది.సీమెన్స్ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. చంద్రబాబు వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను డిజైన్టెక్కు చేరవేశారు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు! గ్రాంట్ ఇన్ కైండ్ అంత కంటే లేదు! చివరికి చంద్రబాబు దోపిడీ మాత్రమే మిగిలిందని స్పష్టమైంది. టెండర్లు లేకుండా కట్టబెట్టడానికే... సుమన్ బోస్ నాటి సీఎం చంద్రబాబుతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ అనే పదాన్ని ఎక్కడా వాడలేదు. చంద్రబాబు మాత్రం సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు 90 శాతం నిధులను ఆర్థిక సహాయంగా సమకూరుస్తాయని ఎందుకు చెబుతూ వచ్చారన్నది కీలకంగా మారింది. ఎందుకంటే...? గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. ఓ ప్రాజెక్టులో ప్రైవేటు కంపెనీలు లాభం తీసుకుంటే నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలి. టెండర్లు పిలిస్తే అర్హత ఉన్న ఎన్నో కంపెనీలు పోటీ పడతాయి. ప్రాజెక్ట్ను యధాతథంగా అమలు చేయాల్సి ఉంటుంది. అందుకే టెండర్ల ప్రక్రియ లేకుండా ఏకపక్షంగా నామినేషన్ విధానంలో డిజైన్టెక్కు ఈ ప్రాజెక్టు కట్టబెట్టడానికే చంద్రబాబు ఈ పథకం వేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే ముసుగులో డిజైన్ టెక్కు కట్టబెట్టేశారు. తరువాత నిబంధనలకు విరుద్ధంగా ఆ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేశారు. కమీషన్లు పోనూ అందులో రూ.241 కోట్లను హైదరాబాద్లోని తన బంగ్లాకు తరలించారు. -
తలకిందులుగా వేలాడదీసి..కింద మంట పెట్టి...
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకలు దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తలకిందులుగా వేలాడదీసి, కింద మంటపెట్టి నరకం చూపించారు. అవమానం భరించలేక ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్కు చెందిన చాకలి రాములుకు కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు. అయితే మేకల షెడ్డు వద్ద ఉన్న ఓ పైపు, ఒక మేక ఇటీవల చోరీ అయ్యాయి. అదే ఏరియాకు చెందిన కిరణ్ ఈ పని చేసి ఉంటాడన్న అనుమానంతో రాములు పిలిచి ప్రశ్నించాడు. దీంతో తడబడిన కిరణ్ పైపు దాచిన చోటు చూపించాడు. తర్వాత చోరీ అయిన మేక గురించి కూడా ఆరా తీయగా స్థానికులు మేకను కూడా కిరణే ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన రాములు నిందితుడిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కింద మంట పెట్టాడు. చిత్రహింస భరించలేక కిరణ్, తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పాడు. దీంతో అతడిని కూడా తీసుకువచ్చి షెడ్డులో కట్టేసి రాములు, అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. తర్వాత పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టగా మేకకు రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు నిందితులు అంగీకరించారు. కిరణ్ చిన్నమ్మ ఫిర్యాదుతో.. ఘటన అనంతరం అవమాన భారంతో కిరణ్ కనిపించకుండాపోయాడు. దీంతో రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్ రెండు రోజుల క్రితం తన అక్క కొడుకు కిరణ్ను తీవ్రంగా హింసించారని కిరణ్ చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అవమానం భరించలేక తన అక్క కొడుకు కిరణ్ కనిపించకుండా పోయాడని తెలిపింది. కిరణ్ దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య శనివారం పరిశీలించారు. -
Rozgar Mela: వేగవంతమైన వృద్ధి బాటలో మన ఆర్థికం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి బాటలో పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. సోమవారం రోజ్గార్ మేళాలో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. కేంద్ర పారామిలటరీ దళాలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగాలు పొందిన 51,000 మందికిపైగా యువతకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, పర్యాటకం, ఆహార శుద్ధి రంగాల్లో మరింత వృద్ధి నమోదవుతుందని, యువతీ యువకులకు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు మోదీ తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని పునరుద్ఘాటించారు. అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు అందుతాయని అన్నారు. అన్ని రంగాల అభివృద్ధితోనే ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని చెప్పారు. కోట్లాది కొత్త కొలువులు దేశంలో 2030 నాటికి టూరిజం రంగంలో కొత్తగా దాదాపు 14 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం వాటా రూ.20 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ వివరించారు. ఫార్మాస్యూటికల్ రంగం వాటా రూ.4 లక్షల కోట్లుగా ఉందని, 2030 నాటికి ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఫార్మా రంగంలో యువత అవసరం ఎంతో ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంలోనూ యువ శక్తి భాగస్వామ్యం కీలకమని చెప్పారు. ఆహార శుద్ధి రంగం విలువ ప్రస్తుతం రూ.26 లక్షల కోట్లుగా ఉందని, మరో మూడున్నరేళ్లలో ఇది ఏకంగా రూ.35 లక్షల కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు. ఆహార శుద్ధి పరిశ్రమ విస్తరిస్తున్నకొద్దీ కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. ఇక ‘మేడ్ ఇన్ ఇండియా’ ల్యాప్టాప్లు, కంప్యూటర్లు సుపరిపాలన, చట్టబద్ధ పాలన ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, అందుకు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు ఉండాలన్నారు. వేగవంతమైన అభివృద్ధి కనిపించాలన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలన్నారు. నేరాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలకు పెట్టుబడులు పెద్దగా రావడం లేదని, ఉద్యోగ అవకాశాలు పడిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల మార్పు కనిపిస్తోందన్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగాయన్నారు. వస్తూత్పత్తి ఊపందుకుందని, ఉద్యోగాల సంఖ్య పెరగడంతో కుటుంబాల ఆదాయం పెరిగినట్లు మోదీ తెలిపారు. ఎల్రక్టానిక్ పరికరాల తయారీపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా ల్యాప్టాప్లు, వ్యక్తిగత కంప్యూటర్లు ప్రపంచ మార్కెట్లను ముంచెత్తే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. పారా మిలటరీ దళాల్లో కొత్తగా చేరిన వారిని మోదీ ‘అమృత్ రక్షకులు’గా అభివరి్ణంచారు. -
మేకలు, పావురాలు చోరీ?.. దళిత యువకులను తలకిందులుగా వేలాడదీసి..
మహరాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో మానవత్వం మంటగలిసే ఉదంతం చోటుచేసుకుంది. మేకలను, పావురాలను చోరీ చేశారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీడియాకు అహ్మద్నగర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తాము విచారణ చేపట్టి, ఈ దుశ్చర్యకు పాల్పడిన ఒక వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. మిగిలిన ఐదుగురు పరారయ్యారని తెలిపారు. ఈ ఘటన దరిమిలా దీనికి నిరసనగా హరేగావ్లో బంద్ పాటించారు. స్థానిక విపక్ష కాంగ్రెస్ ఈ ఘటనకు బీజేపీ వ్యాపింపజేస్తున్న విద్వేషమే కారణమని ఆరోపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 25న గ్రామానికి చెందిన నలుగురు దళితయువకుల ఇళ్లలోకి చొరబడిన ఆరుగురు యువకులు బలవంతంగా వారిని బయటకు తీసుకువచ్చారు. బాధిత యువకుల వయసు 20 ఏళ్లకు అటునిటుగా ఉంటుంది. ఆ యువకులు మేకలు, పావురాలు దొంగిలించారని ఆరోపిస్తూ, వారిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో విపరీతంగా కొట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను యువరాజ్, మనోజ్, పప్పు పార్ఖే, దీపక్, దుర్గేష్, రాజులుగా గుర్తించారు. ఈ నిందితులలో ఒకరు ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. తరువాత దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాధితులను స్థానికులు సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. బాధితులలో ఒకరైన శుభం మగాడే జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు నిందితులపై సెక్షన్ 307 (హత్యాయత్నం),360 (కిడ్నాప్), ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడుతూ ఈ ఉదంతం మానవత్వానికే మాయనిమచ్చ అని అన్నారు. నిందితులు ఎంతటివారైనా వారిని వెంటనే అరెస్టు చేయాలని, వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అధికార బీజేపీ దళితులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యిందని ఆరోపించారు. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
ఏపీఎల్ నిర్వహణ భేష్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నిర్వహణ చాలా బాగుందని.. యువ క్రికెటర్లకు ఇదొక మంచి వేదిక అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఏపీఎల్ రెండో సీజన్ ఫైనల్ మ్యాచ్ను టాస్ వేసి ప్రారంభించడానికి ముందు ఆదివారం ఆయన విశాఖలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. ‘విశాఖపట్నం చాలా అందమైన నగరం. నాకెంతో ఇష్టమైన ప్రదేశమిది. ఇక్కడి వాతావరణం బాగుంటుంది. విశాఖ వేదికగా అనేక టోర్నిల్లో ఆడాను. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనితీరు అద్భుతం. ఏపీలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వారిని ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏపీఎల్ తరహా టోర్నిల ద్వారా క్రికెటర్లకు అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ఏపీ నుంచి దేశానికి మరింత మంది ప్రాతినిధ్యం వహించేలా ఏసీఏ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి’ అని సూచించారు. ‘టెస్ట్, వన్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలోనూ రాణించేవిధంగా యువ క్రికెటర్లు తమను తాము మలుచుకోవాలి. సచిన్ ప్యాషన్తో ఆడితే.. కోహ్లి ప్యాషన్తో పాటు అగ్రెసివ్గా ఆడుతాడు. అది వారి స్టయిల్. నేను కూడా అగ్రెసివ్గానే ఆడేవాడిని. జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఆటతీరుతో పాటు చిత్తశుద్ధి, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. నాకు మీడియాతో మంచి అనుబంధం ఉంది. మీడియా ఒక ఆటగాడిని ఎలివేట్ చేసేందుకు చాలా దోహదపడుతుంది. అది ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం’ అని శ్రీకాంత్ అన్నారు. ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఎల్ సీజన్–2కు మంచి ఆదరణ లభించిందని చెప్పారు. కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్, ఏసీఏ ఉపాధ్యక్షుడు పి.రోహిత్రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. వెంకట్రావు పేరుతో ‘స్టాండ్’ గర్వకారణం అనంతరం విశాఖ స్టేడియంలోని ఓ స్టాండ్కు ఏసీఏ మాజీ కార్యదర్శి ఎన్.వెంకట్రావు పేరు పెట్టగా.. దానిని కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసీఏ కార్యదర్శిగా వెంకట్రావు సేవలందిస్తున్న రోజుల్లోనే తాను క్రికెటర్గా ఎదిగానని చెప్పారు.ఆయన పేరుతో స్టాండ్ ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా వెంకటరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. అప్పట్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, అంపైర్ కమిటీ చైర్మన్గా, క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా, 2003 వరల్డ్కప్లో పాల్గొన్న టీమిండియా జట్టు మేనేజర్గా తాను అందించిన సేవలకు ఇదో జ్ఞాపికగా భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రమణమూర్తి ఏపీఎల్లో తలపడుతున్న బెజవాడ టైగర్స్ జట్టుకు యజమానిగా ఉన్నారు. కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్రారెడ్డి, కార్యదర్శి గోపినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం పిచ్చి రా బాబోయ్.. మొహాలకు న్యూస్ పేపర్లు చుట్టుకొని..
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: రీల్స్ పిచ్చిలో పడి కొందరు యువకులు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ పట్టణంలో ముగ్గురు యువకులు బైక్పై మొహాలు కనబడకుండా న్యూస్ పేపర్లు చుట్టుకొని వేములవాడ వీధుల గుండా పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ తిరగడంతో.. పట్టణ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు యువకులు వారిని వెంబడించి పట్టుకొని ప్రశ్నించగా తాము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించామని, ప్రమోషన్ కోసం వీడియో షూట్ చేశామని తెలిపారు. ఆ మాటలు విన్న పట్టణ వాసులు ఒక్కసారిగా అవాక్కై.. ఒకింత చిరాకు పడ్డారు. ఇదేం పిచ్చి రా బాబోయ్ అంటూ తలలు పట్టుకున్నారు. చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
సాంస్కృతిక సంబంధాల మెరుగుతోనే ఆర్థిక వృద్ధి
(వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడటం ద్వారా దేశాల మధ్య ఆర్థిక, దౌత్యపరమైన పురోభివృద్ధి సాధ్యమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. భారత్ నుంచి ఎన్నో విలువైన పురాతన విగ్రహాలు, వెలకట్టలేని అతి పురాతన విగ్రహాలు దేశం దాటి వెళ్లాయని, వాటిని తిరిగి భారత్కు తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వారణాసిలో జరుగుతున్న జీ20 సాంస్కృతిక శాఖల మంత్రులు, అధికారుల సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2014 ముందు ప్రభుత్వాలు విదేశాల నుంచి కేవలం 13 పురాతన విగ్రహాలను దేశానికి తిరిగి రప్పిస్తే, మోదీ అధికారంలోకి వచ్చాక దాదాపు 400 పురాతన విగ్రహాలను రప్పించి ఆయా రాష్ట్రాలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వనిత దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయని, అందరి సమ్మతితో శనివారం వారణాసి జీ20 డిక్లరేషన్ ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ, ఆ శాఖ కార్యదర్శి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. యూత్ టూరిజం క్లబ్స్దే కీలకపాత్ర విద్యార్థుల్లో వివేకం పెంపొందించేందుకు యూత్ టూరిజం క్లబ్స్ కీలకపాత్ర పోషిస్తాయని కిషన్రెడ్డి అన్నారు. ‘సాంస్కృతిక విరాసత్ స్పర్ధ –2023’లో భాగంగా యువ టూరిజం క్లబ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత భవిష్యత్తు అంతా విద్యార్థులదేనని, అందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అందిస్తున్న కృషి ఎనలేనిదన్నారు. 99 శాతం విద్యపై దృష్టి పెడితే.. కనీసం ఒక్క శాతమైనా పాఠ్యేతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్లో గానీ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో గానీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సేవా తత్పరతతోపాటు దేశం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతోనే ‘యువ టూరిజం క్లబ్స్’ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీ ఇంట్లో కుటుంబసమేతంగా పర్యాటక క్షేత్రాలను సందర్శించాలంటే.. ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించేది ఆ కుటుంబంలోని చిన్నారులు, విద్యార్థులేనని అన్నారు. అందుకే వారికి దేశంలోని, సమీపంలోని పర్యాటక క్షేత్రాలపై, ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
‘తిండి పెట్టరు.. టాయిలెట్ నీళ్లే గతి’.. లిబియాలో నరకం చూసిన హరియాణా యువకులు
డాలర్లు సంపాదించాలనే కోరికతో హరియాణా, పంజాబ్కు చెందిన యువత ఇటలీకి తరలివెళుతుంటుంది. అయితే వారు ఊహించిన వాతావరణం అక్కడ ఉండదు. జైళ్లలో మగ్గిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. ఇటువంటి నరకాన్ని చవిచూసిన హరియాణాకు చెందిన ఇద్దరు యువకులు ఆరు నెలల అనంతరం భారత్లోని తమ ఇంటికి తిరిగివచ్చారు. ఇక్కడికి చేరుకోగానే వారు తాము లిబియాలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఢిల్లీలో మీడియా ముందు వెళ్లగక్కారు. ఒక ఏజెంట్ తమను ఇటలీ పంపిస్తామని చెప్పి రూ. 13 లక్షలు తీసుకుని లిబియాకు పంపించాడన్నారు. కొన్నాళ్లు లిబియాలో పనిచేశాక ఇటలీ పంపిస్తామని అ ఏజెంట్ నమ్మబలికాడన్నారు. అయితే తమకు లిబియాలో ఎవరికో అమ్మివేశాడన్నారు. వారు తమ చేత అన్నిరకాల పనులు చేయించారని, తరువాత ఏవో ఆరోపణలతో తమను జైలుకు పంపించారన్నారు. లిబియా జైలులో రెండుమూడు రోజుల పాటు ఎటువంటి ఆహారం ఇచ్చేవారు కాదని తెలిపారు. తాము చనిపోకుండా ఉండేందుకు టాయిలెట్ నీటిని అందించేవారన్నారు. లిబియాలో తమ లాంటి వారు చాలా మంది ఉన్నారని, వారంతా భారత్తో పాటు పలు దేశాలకు చెందినవారున్నారని తెలిపారు. తామంతా జైలులో నరకం చూశామన్నారు. అయితే తమలోని ఒక యువకుని దగ్గర ఫోన్ ఉందని, ఆ ఫోను సాయంతో రహస్యంగా భారత ఎంబసీకి ఫోన్ చేసి, తమ గోడు వెళ్లబోసుకున్నామన్నారు. ఎట్టకేలకు తమ ప్రయత్నాలు ఫలించి భారత ఎంబసీ సాయంతో 6 నెలల అనంతరం భారత్కు చేరుకోగలిగామన్నారు. బాధితుడు రాహుల్ సోదరి సోనియా మాట్లాడుతూ తన సోదరునికి ఇప్పుడు మరో జీవితం లభించినట్లయ్యిందన్నారు. తమ సోదరుడు తిరిగి రావడం వెనుక ప్రభుత్వం చొరవ ఉందన్నారు. ఇది కూడా చదవండి: చికెన్, పిజ్జా, వేడి ఆహారం కావాలంటూ ఖైదీల ఆందోళన.. జైలు గార్డును బంధించి.. -
Shradha Khapra: సలహాల అక్క
శ్రద్ధా కాప్రాను అందరూ ‘మైక్రోసాఫ్ట్ వాలీ దీదీ’ అని పిలుస్తారు. శ్రద్ధ బంగారంలాంటి మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని వదిలేసింది. ‘యువత కెరీర్ కోసం గైడెన్స్ అవసరం’ అని ‘అప్నా కాలేజ్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. రెండేళ్లలో 40 లక్షల మంది సబ్స్క్రయిబర్స్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ జీతం కన్నా ఎన్నో రెట్ల ఆదాయం శ్రద్ధకు వస్తోంది. ఏ కోర్సు చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి లాంటి సలహాలు ఎప్పటికప్పుడు ట్రెండ్కు తగినట్టు ఇవ్వడమే శ్రద్ధ సక్సెస్కు కారణం. ‘హరియాణలోని చిన్న పల్లెటూరు మాది. మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగైనా నేను ఏం చదవాలో గైడ్ చేయడం ఆయనకు తెలియదు. టీచర్లు కూడా గైడ్ చేస్తారనుకోవడం అంత కరెక్ట్ కాదు. ఇప్పటికీ కాలేజీ స్థాయి నుంచి యువతకు తమ కెరీర్ పట్ల ఎన్నో డౌట్లు ఉంటాయి. వారికి గైడెన్స్ అవసరం. ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుని గైడ్ చేయాలి. నేను కొద్దోగొప్పో చేయగలుగుతున్నాను కాబట్టే ఈ ఆదరణ’ అంటుంది శ్రద్ధా కాప్రా. ఈమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఈనాటి కాలేజీ విద్యార్థుల్లో. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో. వీరంతా శ్రద్ధను ‘శద్ధ్రా దీదీ’ అని,‘మైక్రోసాఫ్ట్ వాలీ దీదీ’ అని పిలుస్తారు. ఆమె చేసే వీడియోలను వారు విపరీతంగా ఫాలో అవుతారు. ఆ వీడియోల్లో ఆమె చెప్పే సలహాలను వింటారు. డాక్టర్ కాబోయి... శ్రద్ధ తన బాల్యంలో టీవీలో ఒక షో చూసేది. అందులో డాక్టర్లు తాము ఎలా క్లిష్టమైన కేసులు పరిష్కరించారో చెప్పేవారు. ఆ షో చూసి తాను డాక్టర్ కావాలనుకుని ఇంటర్లో ‘పిసిఎంబి’ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్, బయాలజీ) తీసుకుంది. కాని జూనియర్ ఇంటర్ పూర్తయ్యే సరికి డాక్టర్ కావడం చాలా కష్టమని అర్థమైంది. అందుకే మేథ్స్వైపు దృష్టి సారించింది. ‘చిన్నప్పటి నుంచి రకరకాల పోటీ పరీక్షలు ఎక్కడ జరిగినా రాసేదాన్ని. ఇంటర్ అయ్యాక ఎంట్రన్స్లు రాస్తే ర్యాంక్ వచ్చింది. కాని ఏ బ్రాంచ్ ఎన్నుకోవాలో తెలియలేదు. వరంగల్ ఎన్.ఐ.ఐ.టి.లో సివిల్కు అప్లై చేస్తే సీట్ వచ్చింది. సివిల్ ఎందుకు అప్లై చేశానో నాకే తెలియదు. అయితే దాంతో పాటు ఎన్.ఎస్.ఐ.టి. (నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ద్వారకా)లో కంప్యూటర్ సైన్స్ అప్లై చేస్తే ఆ సీటు కూడా వచ్చింది. దీనికంటే అదే మెరుగనిపించి కంప్యూటర్ సైన్స్ చదివాను’ అని తెలిపింది శ్రద్ధ. ఉద్యోగం, టీచింగ్ చదువు చివరలో ఉండగానే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్లో ఇన్టెర్న్ వచ్చింది శ్రద్ధకు. అది పూర్తయ్యాక ఉద్యోగమూ వచ్చింది. అయితే శ్రద్ధ ఇన్టెర్న్ చేస్తున్నప్పటి నుంచే గచ్చిబౌలిలో కంప్యూటర్ కోర్సులను బోధించసాగింది. ఉద్యోగం వచ్చాక కూడా కంప్యూటర్ కోర్సులకు ఫ్యాకల్టీగా పని చేసింది. ‘ఉద్యోగంలో కంటే ఎవరి జీవితాన్నయినా తీర్చిదిద్దే బోధనే నాకు సరైందనిపించింది. అదే సమయంలో యూట్యూబ్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పడం, కోర్సులు తెలియచేయడం, వారి స్కిల్స్ పెరిగేలా గైడ్ చేయడం అవసరం అనుకున్నాను. మైక్రోసాఫ్ట్లో నాది మంచి ఉద్యోగం. కాని ఏదైనా కొత్తగా చేయాలనుకోవడం కూడా మంచిదే అని జాబ్కు రిజైన్ చేశాను’ అంది శ్రద్ధ. అప్నా కాలేజ్ శ్రద్ధ ‘అప్నా కాలేజ్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచింది. ఇంటర్ స్థాయి నుంచి విద్యార్థులకు ఏయే కోర్సులు చదివితే ఏం ఉపయోగమో, ఏ ఉద్యోగాలకు ఇప్పుడు మార్కెట్ ఉందో, ఆ ఉద్యోగాలు రావాలంటే ఏ కోర్సులు చదవాలో తెలిపే వీడియోలు చేసి విడుదల చేయసాగింది. 2020లో ఈ చానల్ మొదలుపెడితే ఇప్పుడు 40 లక్షల మంది సబ్స్క్రయిబర్లు తయారయ్యారు. కోట్లాది వ్యూస్ ఉంటాయి. అందుకు తగ్గట్టుగా లక్షల్లో శ్రద్ధ ఆదాయం ఉంది. ‘ముప్పై ఏళ్ల క్రితం డిగ్రీల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేవారు. ఎందుకంటే డిగ్రీలు తక్కువ ఉండేవి. ఇవాళ డిగ్రీలు అందరి దగ్గరా ఉన్నాయి. కావాల్సింది స్కిల్స్. ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు ముందుకు దూసుకెళ్లవచ్చు. నా వీడియోలు ఆ మార్గంలో ఉంటాయి’ అని తెలిపింది శ్రద్ధ అలియాస్ సలహాల అక్క. -
పాపం చైనా యువతకు ఎంత కష్టం వచ్చింది!
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా (China)లో నిరుద్యోగం (Unemployment) తాండవిస్తోంది. అక్కడ యువత ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఫ్రెషర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాజాగా సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన జాంగ్ అనే యువతి ఉద్యోగం కోసం వేలకొద్దీ రెజ్యూమ్లను చైనీస్ కంపెనీలకు పంపినప్పటికీ, ఆమె ఎంచుకున్న మార్కెట్ పరిశోధన రంగంలో జాబ్ దొరకలేదు. నెలల తరబడి అన్వేషించినా ఉద్యోగం దొరక్కపోవడంతో నిరాశ నిస్పృహలకు గురైన 23 ఏళ్ల జాంగ్.. తాను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువత మానసిక స్థితి ఎలా ఉంటుందన్నదానిపై ఓ సర్వే కూడా గమనార్హం. గ్రాడ్యుయేషన్ తర్వాత యువతపై ఎంత మానసిక ఒత్తిడి ఉంటుందో తనకూ అనుభవంలోకి వచ్చినట్లు ఇటీవల బీజింగ్లో జరిగిన రిక్రూట్మెంట్ ఫెయిర్లో ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీతో జాంగ్ పేర్కొంది. తాను పంపే ప్రతి పది రెజ్యూమ్లకు ఒక స్పందన మాత్రమే వస్తున్నట్లు ఆమె చెప్పింది. యువత నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్న సమయంలో చైనా జాబ్ మార్కెట్ (China Job Market) లోకి ప్రవేశించిన మిలియన్ల మంది గ్రాడ్యుయేట్లలో జాంగ్ ఒకరు. 16 నుంచి 24 సంవత్సరాల వయసున్న యువతలో నిరుద్యోగం జూన్ నెలలో రికార్ట్ స్థాయిలో 21.3 శాతానికి చేరింది. తమ దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నట్లు ప్రపంచానికి తెలియకుండా వయసు ఆధారిత ఉపాధి డేటా ప్రచురణను నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. సవాలుగా మారిన ఉద్యోగ సాధన అనుభవం లేని అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం సవాలుగా మారిందని బీజింగ్లో జరిగిన కెరీర్ ఫెయిర్లకు హాజరైన యువత పేర్కొన్నారు. యాంగ్ యావో మీడియాలో అనుభవం ఉన్న 21 ఏళ్ల నిరుద్యోగి. సెంట్రల్ బీజింగ్లో జరిగిన ఒక జాబ్ ఫెయిర్లో ప్రకటనలను చూసి నిరాశకు గురయ్యాడు. కారణం అక్కడ కంపెనీలు కేవలం సేల్స్, అడ్మినిస్ట్రేటివ్ జాబ్లు ఆఫర్ చేశాయి. అది కూడా తక్కువ జీతానికి పనిచేసేవారికే. బీజింగ్లోని తన కుటుంబానికి దగ్గరగా వెళ్లడం కోసం తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లో తన మునుపటి ఉద్యోగాన్ని మానేసిన అతను ఇప్పుడు నెలల కొద్దీ వెతుకుతున్నా ఉద్యోగం దొరక్కపోవడంతో తీవ్ర ఆందోళన పడుతున్నాడు. ‘తలచుకుంటే రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. ఉద్యోగం దొరకకపోతే జీవనం గడిచేదెలా?’ అని ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీతో వాపోయాడు. -
యువతలో పెరుగుతున్న హైపర్ టెన్షన్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): హైపర్ టెన్షన్ (బ్లడ్ ప్రెజర్).. యువత గుండెలను సైలెంట్గా పట్టేస్తోంది. మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తోంది. పక్షవాతంతో పాటు జ్ఞాపకశక్తి సన్నగిల్లేలా చేస్తోంది. క్యాన్సర్లకూ కారణం అవుతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే హైపర్టెన్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రక్తపోటుతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి తోడు కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమం ఇలా... ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగా రక్తపోటు బాధితులను గుర్తించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మూడేళ్ల క్రితం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తొలుత ఉమ్మడి కృష్ణాను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా.. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రక్తపోటుపై విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు. రక్తపోటు ఉన్న వారిని గుర్తించి వారికి సరైన చికిత్స అందేలా చూడటం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. పట్టణ ప్రజలు ఎక్కువగా రక్తపోటుకు గురవుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం తొలుత పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అమలు చేసింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పీహెచ్సీలు సీహెచ్సీల్లో అమలు చేస్తున్నారు. వరంలా మారిన వెల్నెస్ సెంటర్లు.. ఒకప్పుడు రక్తపోటును పరీక్షించుకోవాలంటే గ్రామీణులు దూర ప్రాంతంలో ఉన్న ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వారి ఇంటి సమీç³ంలోనే వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లు (వెల్నెస్ సెంటర్స్) అందుబాటులోకి వచ్చాయి. దీంతో బీపీ చెక్ చేయించుకునేందుకు ఎప్పుడైనా వెళ్లవచ్చు. అంతేకాదు రక్తపోటు ఉందని నిర్ధారణ అయితే కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా నెలలో రెండుసార్లు వారి గ్రామానికే వస్తున్న వైద్యులతో పరీక్షలు చేయించుకుని మందులు వాడుతున్నారు. దీంతో గ్రామీణులు రక్తపోటును అదుపులో ఉంచుకునే అవకాశం లభించింది. పట్టణ వాసులు సమీపంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎప్పుడైనా వెళ్లి పరీక్ష చేయించుకుని మందులు వాడుకోవచ్చు. రక్తపోటుకు కారణాలివే.. ♦ జీవన శైలిలో మార్పులు, మాంసాహారం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్ తీసుకోవడం. ♦ శారీరక శ్రమ లేక పోవడం, ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం రక్తపోటు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ♦ ఇటీవల 30 ఏళ్ల వయసు వారు కూడా తీవ్రమైన రక్తపోటుతో బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటుకు గురైన సందర్భాలు ఉన్నట్టు వైద్యులు చెపుతున్నారు. అదుపులో ఉండాలంటే... ♦ రక్తపోటు అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ 45 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజులు వ్యాయామం, వాకింగ్ లాంటివి తప్పక చేయాలి. ♦ ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా చేయడం మంచిది. ♦ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ♦ ప్రతి మనిషి నెలలో 500 గ్రాములకు మించి వంట నూనెలు వాడరాదు. అధికంగా నూనెలు వినియోగించడం చాలా ప్రమాదకరం ♦ ఒకే నూనె కాకుండా మార్చి మార్చి వాడటం మంచిది. సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు వైద్యం గ్రామాలకే వెళ్లి అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో రక్తపోటును పరీక్షించి మందులు అందచేస్తున్నాం. విలేజ్ హెల్త్ క్లినిక్స్లో ఉంటే ఎంఎల్హెచ్పీల వద్ద బీపీ పరీక్షించుకోవచ్చు.రక్తపోటును అదుపులో ఉంచుకోకుంటే ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది. రక్తపోటుపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నాం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్వో, ఎన్టీఆర్ జిల్లా -
నా విజన్తో యువత ఆకాశానికి
సాక్షి అమలాపురం: తన విజన్తో యువత ఆకాశానికి ఎగిరిపోతారని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. తన సైన్యం యువతని.. వారికి ఉపాధి కల్పించే బాధ్యత తనదేనన్నారు. అమలాపురంలో వర్క్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని.. ఇక్కడే ఉంటూ అమెరికాలో పనిచేసేలా చేస్తానని వెల్లడించారు. బీసీల్లో 150 కులాలకు మేలు చేసి వారి రుణం తీర్చుకుంటానన్నారు. కాపులకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లో ఐదు శాతం కేటాయిస్తానని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. జగన్కు ఎక్స్పెయిరీ డేట్ వచ్చిందన్నారు. ఆయనలా తాను అప్పులు చేయనని.. సంపద సృష్టించి సంక్షేమం వైపు నడిపిస్తానని తెలిపారు. జిల్లా పేరుతో పచ్చని కోనసీమలో అమాయకులపై తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, మద్యం అమ్మకాలతో దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమలలో చిరుతలు ఉంటే మీకు కర్రలు ఇస్తారంట.. ఇంటికొక కర్ర పట్టుకుని వైఎస్సార్సీపీ దొంగలను కొట్టండని ప్రజలను రెచ్చగొట్టారు. వైఎస్సార్సీపీ నేతలు ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం తెచ్చారా అని నిలదీశారు. కోనసీమలో కొబ్బరి, ఆక్వాలకు ప్రత్యేక పాలసీ తెస్తానని చెప్పారు. ఈ సభలో పార్టీ నేతలు గంటి హరీష్ మాధుర్, అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. అమలాపురం సభ అట్టర్ ఫ్లాప్ కాగా అమలాపురంలో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అనుకున్న దానిలో మూడో వంతు కూడా జనం రాలేదు. తొలి నుంచి జనం రాక మీద నమ్మకం లేని పార్టీ నేతలు గడియారస్తంభం సెంటర్లో సమావేశ వేదికను రివర్స్లో ఏర్పాటు చేశారు. జనం రాకపోతే సెంటర్కు ఆనుకుని ఉన్న రోడ్లు ఖాళీగా కనిపించే ప్రమాదముందని ఇలా చేశారు. ఫ్లెక్సీలు కట్టి రోడ్డును ఇరుకుగా చేసినా జనం రాకపోవడంతో పార్టీ నేతలు డీలా పడ్డారు. -
శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే!
ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో మూఢనమ్మకాలకు సంబంధించిన ఉదంతమొకటి సంచలనంగా మారింది. మహాశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆలయంలో ఒక యువకుడు వృక్షాలను కట్ చేసే యంత్రంతో తన గొంతు కోసుకున్నాడు. సమాచారం తెలియగానే అతని కుటుంబ సభ్యులు పరుగుపరుగున ఆలయానికి చేరుకుని, బాధితుడిని చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. బాధిత యువకుని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన రఘునాథ్పురా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన పల్టూ రామ్ కుమారుడు దీపక్ కుశ్వాహ్(30) కూలీనాలీ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు. దీపక్ తండ్రి పల్టూరామ్ తెలిపిన వివరాల ప్రకారం దీపక్కు ఇద్దరు పిల్లలు. దీపక్ మహాశివుని భక్తుడు. గత కొంతకాలంగా దీపక్ ఉదయం, రాత్రివేళల్లో మహాశివునికి పూజలు చేస్తుంటాడు. ఇటీవల దీపక్ తాను మెడ కోసుకుని మహాశివుని ప్రసన్నం చేసుకుంటానని కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పల్టూ రామ్ తన కుమారుతో అటువంటి పని చేయవద్దని చెప్పాడు. అయితే కుమారుడు అతని మాట వినలేదు. కాగా దీపక్ ఒక నోట్బుక్లో మహాశివుని మంత్రాలను, శివునితో సాగించిన సంభాషణను రాస్తుంటాడు. దానిలో దీపక్ మహాశివునికి తనను తాను అర్పించుకుంటానని రాశాడు. దానిలో పేర్కొన్న విధంగా ఉదయం 4 గంటలకు ఆలయానికి వెళ్లాడు. అక్కడ చెట్లు కట్ చేసే యంత్రంతో మహాశివుని సమక్షంలో తన మెడను కట్ చేసుకుని జయజయధ్వానాలు చేశాడు. దీనిని అక్కడున్నవారు గమనించారు. వెంటనే ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు వెంటనే ఆలయానికి చేరుకుని భాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దీపక్ చిన్నాన్న ప్రసాద్ మాట్లాడుతూ దీపక్ మెడ కట్ చేసుకున్న సమయంలో ‘జై భగవాన్ శంకర్’ అనే నినాదాలు చేశాడని తెలిపారు. బాధితునికి చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్ సచిన్ మాహుర్ మాట్లాడుతూ దీపక్ అనే యువకుడు స్వయంగా తన మెడ కోసుకున్నాడని, అతనికి వైద్య చికిత్స జరుగుతున్నదని, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు. ఇది కూడా చదవండి: సీమా హైదర్, అంజూ తరహాలో రాజస్థాన్ దీపిక.. భర్త, పిల్లలను వదిలేసి విదేశాలకు.. -
పోలీస్ స్టేషన్ పైనే యువకుల ట్రెండింగ్ వీడియో.. చివరికి..
తిరువనంతపురం: సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం తెగ పరితపిస్తుంటారు. వినూత్న రీతిలో వీడియోలు పెడుతూ లైకులు, వ్యూస్ చూసుకుని సంబరపడిపోతుంటారు. ఈ మైకంలోపడి ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటారు. ఇలాగే సోషల్ మీడియా పిచ్చి కేరళ యువకులను కటకటాలపాలు చేసింది. ఇంతకూ వారు ఏం చేశారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..? ఖాలీగా ఉన్న సమయాన్ని ఏం చేయాలో తెలియని ఐదుగురు యువకులు ట్రెండ్ అయ్యే వీడియో చేయాలనుకున్నారు. అందుకు ఏకంగా పోలీసు స్టేషన్నే ఎంచుకున్నారు. తమకు తెలిసిన యానిమేషన్ స్కిల్స్ ఉపయోగించి స్టేషన్లో బాంబు పేలుడు సంభవించినట్లు ఓ వీడియో తయారు చేశారు. అంతేకాకుండా సినిమాల్లోని వచ్చే పాపులర్ డైలాగ్లను ఉపయోగించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది కాస్త ఇన్స్టా, యూట్యూబ్లలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో అది పోలీసుల కంట పడింది. దర్యాప్తు చేపట్టిన స్థానిక మేలట్టూరు పోలీసులు.. మహ్మద్ రియాజ్(25), మహ్మద్ ఫావేజ్(22), మహ్మద్ జాష్మైన్(19), సాలిమ్ జిషాజియాన్(20), సాల్మానుల్ పారిస్(19)లను నిందితులుగా గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమే ఇదంతా చేశారని పోలీసులు గుర్తించారు. ఐదుగుర్ని అరెస్టు చేశారు. ఇదీ చదవండి: విరిగిపడిన కొండచరియలు.. కుప్పకూలిన ఇళ్లు.. వీడియో వైరల్.. -
ఓరి.. దుర్మార్గుడా..! చలానాకు భయపడి..
Viral Video: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంత హితభోద చేసినా.. వాహనదారులు పెడచెవిన పెడుతుంటారు. తమ జీవితాలతో పాటు తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెడుతుంటారు. ప్రయాణించే ముందే హెల్మెట్, సరైన ద్రువపత్రాలు వెంట తెచ్చుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ అవేవీ లేకుండా రోడ్లపై వాహనాలను నడుపుతూ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నానాపాట్లు పడుతుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. చలానా తప్పించుకోవడానికి ఓ యువకుడు చేసిన పని తన లవర్ కిందపడిపోయేలా చేసింది. ఓ యువకుడు తన ప్రేమికురాలితో బండిపై ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది. యువకుడు బండిని నెమ్మదిగా స్లో చేశాడు. అంతలోనే అక్కడికి ఓ కానిస్టేబుల్ వచ్చాడు. అతన్ని చూడగానే యువకుడు చాలానా వేస్తాడేమోననే భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా బండి స్పీడ్ పెంచేసి సిగ్నల్ను దాటేయబోయాడు. అంతే వెనక ఉన్న యువతి అమాంతం కిందపడిపోయింది. ఆమెను పట్టించుకోకుండానే ఆ యువకుడు తప్పించుకున్నాడు. लड़की को breakup में देर नहीं करनी चाहिए ऐसे बहुत आयेंगे जाएँगे यह लड़का गर्लफ़्रेंड के लिये एक चालान नहीं भर सका बीच सड़क बाइक से उतार दिया pic.twitter.com/BkUdzNq4Ls — Abhishek Anand Journalist 🇮🇳 (@TweetAbhishekA) August 14, 2023 అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆ అమ్మాయిని పైకి లేపి ఆస్పత్రికి తరలించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను ప్రముఖ జర్నలిస్టు అభిషేక్ ఆనంద్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ట్రాఫిక్లో ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకూడదని సూచనలు చేశారు. ఓరి దుర్మార్గుడా..! లవర్ కంటే చలానానే ఎక్కువై పోయిందా అంటూ ఫన్నీగా మరికొందరు కామెంట్ పెట్టారు. ఇదీ చదవండి: Indian Laws: ఆ వెసలుబాటు పురుషులకు లేదు.. అమ్మాయిల్ని దత్తత తీసుకోలేరు -
విలయం.. యువ హృదయం!
విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన 40 ఏళ్ల యువకుడు వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల ఓ రోజు ఉదయం ఛాతిలో నొప్పి అని చెప్పి కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు విడిచాడు. తీవ్రమైన గుండెనొప్పి కారణంగా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తేల్చారు. విజయవాడ వన్టౌన్ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల యువకుడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ఛాతిలో నొప్పి అని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో యువతలో గుండె పోటు మరణాలు ఎక్కువగా సంభవించడం వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. మరీముఖ్యంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. మారుతున్న జీవన శైలి, దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రౖమెన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగానే చిన్న వయస్సులో గుండె జబ్బుల మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ని యంత్రించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాల్సిన అవసరముందంటున్నారు. అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించుకుని గుండె సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఆకస్మిక మరణాలు గుండె ఆగిపోవడం వల్ల సంభవిస్తున్న మరణా లకు వైద్యులు పలు కారణాలు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు. ధూమపానం, మద్యపానం,ఊబకాయం, వ్యాయామం లేకపోవడం పోస్టు కోవిడ్ గుండె రక్తనాళాల్లో పూడికలు, గుండె కండరాలు ఉబ్బడం(మయోకార్డిటైస్) పల్మనరీ ఎంబోలిజం(గుండె నుంచి ఊపిరి తిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) ముందు జాగ్రత్తే మందు గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిళ్లకు దూరంగా ఉండటం నీరు ఎక్కువగా తీసుకోవడం యువతలో అధికమవుతున్నాయ్.. గుండెపోటుకు గురవుతున్న యువతను ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి వారిలో 80 శాతం మందికి గుండెపోటు రావడానికి పొగతాగడం, మద్యం తీసుకోవడం, ఒత్తిడే కారణాలు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడిన వారిని గుర్తించి స్టెంట్స్ వేస్తున్నాం. పోస్టు కోవిడ్ వారిలో కూడా గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. రక్తపోటు, మధుమేహం ఉన్న వారు ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా, మెడిటేషన్ను అలవర్చుకోవాలి. – డాక్టర్ బొర్రా విజయ్చైతన్య, కార్డియాలజిస్ట్ -
ప్రియురాలికి చివరి కాల్ చేసి.. నేను పోతున్నా, నువ్వు పెళ్లి చేసుకో
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు చావు తథ్యమని తెలుసుకుని, ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు, తన అంత్యక్రియలకు ఆహ్వానించిన కొంతసేపటికి ప్రాణం వదిలిన హృదయ విదారక సంఘటన నెలమంగలలో వెలుగు చూసింది. నెలమంగలకు చెందిన కిరణ్ అనే యువకునికి కొన్నిరోజుల కిందట కుక్క కరవడంతో పెద్దగా పట్టించుకోలేదు, దీంతో రేబిస్ వ్యాధి సోకింది. తల్లిదండ్రులు అతన్ని బెంగళూరు నిమ్హాన్స్ ఆస్పత్రిలో చేర్చగా బతకడం కష్టమని వైద్యులు నిర్ధారించారు. కిరణ్ ప్రియురాలికి వీడియో కాల్ చేసి.. తాను ఇక బ్రతకనని తన అంత్యక్రియలకు తప్పక రావాలని, మీ నాన్న చూపించిన యువకుడినే పెళ్లి చేసుకుని, పుట్టే బిడ్డకు నా పేరు పెట్టాలని కోరాడు. తరువాత కొన్ని గంటలకు అతడు చనిపోయాడు. ఆగస్టు 9న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి నిజాయితీకి నిలువుటద్దం కలాం: ఆ చెక్కను జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి -
ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి... నది అంచుకు వెళ్లి
శివమొగ్గ: సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీసేస్తున్నా యువతలో మార్పు రావడం లేదు. తాజాగా శివమొగ్గ తాలకా గాజనరులోని తుంగా జలాశయం పవర్ హౌజ్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ ఓ యువకుడు జారి నీటిలో పడిగల్లంతయ్యాడు. ఈ ఘటన శనివారం వెలుగుచసింది. వివరాలు...మిళఘట్ట లేఔట్కు చెందిన హరీష్ (26) శుక్రవారం సాయంత్రం సెల్ఫీ తీసుకోవడానికి పవర్హౌజ్ వద్దకు వెళ్లాడు. అంచుకు వెళ్లి తీసుకుందామని అనుకున్నాడు. అంతలోనే కాలు జారి నదిలో పడిపోయాడు. తుంగా నగర పోలీసులు కేసు నవెదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతని కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. చదవండి ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత? -
ఇదేందిది.. ఒక్క బైక్పై ఏడుగురా?.. ఆఖరోడు అలా కూర్చున్నాడేంటి?
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ లేక్కలేనన్ని చర్యలు చేపడుతోంది. అయినా కొందరు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, వాహనాలను ఇష్టమొచ్చినట్లు నడుపుతున్నారు. తాజగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఈ బైక్పై ఒకరో, ఇద్దరో కాదు ఏకంగా ఏగుగురు కుర్రాళ్లు రయ్యిమని దూసుకుపోతున్నారు. పైగా వారు తామేదో ఘనకార్యం చేశామన్నట్టు ఫీలవుతున్నారు. ఈ వీడియో యూపీలోని హాపూర్కు చెందినదని తెలుస్తోంది. ఏడుగురు కుర్రాళ్లు నిర్భయంగా బైక్పై కూర్చుని ప్రయాణించడాన్ని వీడియోలో చూడవచ్చు. వారిలో చివరనున్న కుర్రాడు ముందునున్న కుర్రాడిపై ఎక్కి కూర్చున్నాడు. 22 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో బైక్పై కూర్చున్న కుర్రాళ్ల తీరు చూస్తే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. అయితే ఆ బైక్పై ఉన్నవారితో కించిత్తు ఆందోళన కూడా లేకపోవడం విశేషం. ఈ వీడియోను చూసినవారంతా ఆ కుర్రాళ్లపై పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను @Akshara117 అనే ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఇది కూడా చదవండి: పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్ ఇలా.. Video of 7 people riding a bike in #Hapur goes viral, raising questions on the working style of Hapur police. #Viralvideo pic.twitter.com/wfMfjkOkdF — Akshara (@Akshara117) August 9, 2023 -
అయ్ బాబోయ్...ఏఐ! రేకెత్తిస్తున్న వేల భయాలు..!
అయ్ బాబోయ్...‘వేవ్ ఆఫ్ ది ప్యూచర్’గాచెబుతున్న ఏఐ సాంకేతికత యువతలోని ఒక వర్గంలో వేల భయాలను రేకెత్తిస్తోంది. భూతంలా భయపెడుతోంది. ఏఐ టెక్నాలజీ వల్ల ఉన్న ఉద్యోగాలు పోతాయనీ, ఉద్యోగావకాశాలు ఉండవనే ఆందోళనకు ‘ఏఐ యాంగ్జైటీ అని పేరు పెట్టారు.... ఈ భయం ఈనాటిది కాదు. ‘ఈ యంత్రాలు మన ఉపాధిని మింగేస్తాయి’ అనే భయం పారిశ్రామిక విప్లవం రోజుల నుంచి ఉన్నదే. చాట్ జీపీటీ విజయవంతం అయిన తరువాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది ఇప్పుడు యువతను భూతమై భయపెడుతోంది. ఒక సర్వే ప్రకారం పద్దెనిమిది నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల మధ్య వయసు వాళ్లు తమ కెరీర్కు సంబంధించిన భయాలతో ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా ప్రకారం 2025 కల్లా 85 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ సాంకేతికతతో భర్తీ అవుతాయి. ఈ నేపథ్యంలో కంపెనీలలో ఉద్యోగుల భవిష్యత్ పనితీరు ఎలా ఉండబోతున్నది అనేది హాట్ టాపిక్గా మారింది. ఇది ఎంత పాపులర్ టాపిక్ అయిందంటే మూడు సంవత్సరాల వ్యవధిలో దీనిపై పదుల సంఖ్యలో పుస్తకాలు వచ్చాయి. ఆర్థికవేత్త రిచర్డ్బాల్డ్ విన్ తన పుస్తకం ‘ది గ్లోబటిక్స్ అప్హీవల్’లో ఏఐ ద్వారా ఏయే రంగాలు ఎలాంటి ప్రభావానికి గురవుతాయో విశ్లేషించారు. కొన్ని పుస్తకాలు మాత్రం ‘భయం అక్కర్లేదు’ అంటూ యువతను ఆశావహ మార్గం వైపు నడిపిస్తున్నాయి. యంత్రాలతో చెలిమి తప్పదు, తప్పు కాదు అంటున్నాయి. సాంకేతిక శక్తి ప్రభావితం చేయని, అంటే ఉద్యోగాలకు ప్రమాదం లేని కొన్ని రంగాలు ఉండేవి. ఉదా: ఎకౌంటింగ్, న్యాయశాస్త్రం...మొదలైనవి. అయితే తాజాగా వెల్–ఎడ్యుకేటెడ్ ప్రొఫెషన్స్కు సంబంధించిన వారిలో కూడా ఆందోళన మొదలైంది. లా ప్రాక్టీస్లో ఏఐ చాట్బాట్ కూడా భాగం కానుంది కెరీర్ అభద్రతకు సంబంధించిన ఆలోచనల నేపథ్యంలో ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా ‘ఏఐ యాంగై్జటీ’ అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటి పదాలు పుట్టడం కొత్త కాదు. సాంకేతిక పురోగతికి సంబంధించిన ప్రతి సందర్భంలో ఇలాంటి పదాలు ఎన్నో పుట్టాయి. 1980లలో ‘కంప్యూటర్ ఫోబియా’ ‘కంప్యూటర్ యాంగై్జటీ’ ‘టెక్నో స్ట్రెస్’లాంటివి పుట్టాయి. ఏఐకి సంబంధించి రెండు వర్గాలు కనిపిస్తాయి. మొదటి వర్గానికి చెందిన వారిలో ‘ఆటోమేషన్ ఆందోళన’ కనిపిస్తుంది. రెండో వర్గం వారిలో ఆశాభావం కనిపిస్తుంది. మనుషులు, యంత్రాలతో చేయికలిపితే మెరుగైన ఫలితాలు వస్తాయనేది రెండో వర్గం నమ్మకం. టామ్ క్రూజ్ ‘మైనార్టీ రిపోర్ట్’లాంటి సినిమాలలో, పర్సనల్ ఇంట్రెస్ట్లాంటి టీవీ షోలలో మనిషి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో జత కడితే జరిగే అద్భుతాలు కనిపిస్తాయి. వివిధ రంగాలపై ఏఐ ఎలాంటి మార్పును తీసుకురానుంది? ఆ మార్పు మనపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఎలా జాగ్రత్త పడాలి? ఏం నేర్చుకోవాలి?... ఈ విషయాలు చెప్పడానికి ఆన్లైన్ కోర్సులు వచ్చాయి. ఏఐ సాంకేతికత రీప్లేస్ చేయలేని ఇంటర్పర్సనల్ స్కిల్స్ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అవి నొక్కి చెబుతున్నాయి. డిజిటల్తో పాటు సాఫ్ట్స్కిల్స్ను కలగలిపి పాఠాలుగా చెబుతున్నాయి. ఈ కోర్సులపై యువత ఆసక్తి ప్రదర్శిస్తోంది. ‘ఉద్యోగాలపై ఏఐ టెక్నాలజీ ప్రభావం గురించి ఫ్రెండ్కు నాకు మధ్య చర్చ జరిగింది. ఏటీఎం మెషీన్లు వచ్చిన కొత్తలో బ్యాంకింగ్ రంగంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతారు, కొత్త ఉద్యోగాలు ఉండవు...ఇలా ఎన్నో మాటలు వినిపించేవి. కాని అది నిజం కాలేదు. ఉద్యోగుల పనితీరు మాత్రం మారింది. ఏఐ టెక్నాలజీ విషయంలోనూ జరిగేది ఇదే’ అంటుంది ముంబైకి చెందిన అక్షర. ఏఐ...అయితే ఏంటీ! యువతలో ఏఐ ఫోబియాను తొలగించడానికి ‘ఫోర్బ్స్ కోచెస్ కౌన్సిల్’ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. వాటిలో కొన్ని... ఏఐ అంటే భయం కాదు, ఇష్టం పెంచుకోండి. ఏఐకు సంబంధించి ప్రతిదీ నేర్చుకోండి. నిపుణులతో మాట్లాడండి. ఉద్యోగ నైపుణ్యానికి ఏఐ ఎలా ఉపయోగపడగలదు అనే కోణంలో ఆలోచించండి. మనిషికి ఉండే సహజ నైపుణ్యాలను ఏఐ ఎప్పుడూ రీప్లేస్ చేయలేదు. మనిషికి ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రేరణశక్తి, ఎత్తుగడలు, సమయస్ఫూర్తి...యంత్రం అనుకరించలేనివి. ‘ఈ ఉద్యోగం మాత్రమే చేస్తాను. ఇది మాత్రమే చేయగలను’ అని ఫిక్స్ కావద్దు. బీ ఫ్లెక్సిబుల్. ఏ ఉద్యోగమైనా చేసే నైపుణ్యాన్ని సొంతం చేసుకోండి. ఒకే దారిలో నడిచే వారికి ఆ దారి మాత్రమే తెలుస్తుంది. కొత్త దారుల్లో నడవడం నేర్చుకుంటే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఒత్తిడి దరి చేరని, సమస్యలను పరిష్కరించే, సానుకూలతను శక్తిగా మార్చుకునే, ఇతరులతో మంచి స్నేహసంబంధాలతో ఉండగలిగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను మెరుగుపరుచుకోండి. ఏఐ ఎలాంటి పాత్ర అయినా పోషించగలదు...అని విశ్వసించే సందర్భంలో ఉన్నాం. ఇలాంటి సమయంలోనే ఏఐ కంటే భిన్నంగా, మెరుగ్గా పనిచేసే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. (చదవండి: విచిత్రమైన వాహనం! రోడ్డుపై ఉంటే వ్యాను..నీటిలో ఉంటే బోటు!) -
యువతలో అనాసక్తి .. సింగరేణిలో ఈ గనుల్లోనే గైర్హాజరీలు ఎక్కువ
చిన్నచిన్న అనారోగ్య కారణాలు సాకుగా చూపుతూ విధులకు డుమ్మా. వీరిలోనూ ఉన్నత విద్యావంతులే అధికం.. ఒక్క వకీల్పల్లిగనిలోనే 60 మంది దాకా గైర్హాజరుతో ఉద్యోగాలు కోల్పోవద్దంటున్న అధికారులు గోదావరిఖని: సింగరేణి భూగర్భగనుల్లో పనిచేసేందుకు యువత ఎక్కువగా మక్కువ చూపడం లేదు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందినవారే గైర్హాజరు అవుతున్న వారిలో అధికంగా ఉన్నారు. బీటెక్, ఎంటెక్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ లాంటి ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం వచ్చిన ఉద్యోగాన్ని నామోషిగా భావించేవారు కొందరయితే, ఇక్కడ వర్క్ కల్చర్ ఇష్టం లేక, సిగరేణి ఆఫీసుల్లో అవకాశం రాక, లైట్ జాబ్ల కోసం పరుగులు తీసేవారు మరికొందరు. మూడు షిఫ్ట్ల విధానానికి ఇష్టపడినవారు ఇంకొందరు. సింగరేణిలో చేరిన కొద్దిరోజులకే విధులకు డుమ్మా కొట్టేవారి సంఖ్యా క్రమక్రమంగా పెరుగుతోంది. పలువురు కుటుంబసభ్యులు,తల్లిదండ్రుల అనారోగ్య కారణాలు సాకుగా చూపుతూ గైర్హాజరవుతున్నారు. ఒక్క వకీల్పల్లిగనిలో గైర్హాజరు అయిన వారు 60 మంది దాకా ఉన్నారు. ఆర్జీ–1 ఏరియా జీడీకే–11గనిలో ఓ యువ కార్మికుడు 2022 ఏప్రిల్లో ఉద్యోగంలో చేరాడు. 15 నెలల్లో 19రోజులు మాత్రమే డ్యూటీ చేశాడు. గైర్హాజర్ కౌన్సెలింగ్కు హాజరై తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేక డ్యూటీకి రావడం లేదని కారణంగా చెప్పాడు. దీంతో గైర్హాజర్ కార్మికుల జాబితాలో ఆయన చేరాడు. జీడీకే–11గనిలో బదిలీ వర్కర్గా 2015లో సింగరేణి విధుల్లో చేరాడు. ఐదేళ్ల నుంచి కనీసం వంద మస్టర్లు చేయలేదు. దీంతో ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసే పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగోలేకే తాను డ్యూటీకి రావడం లేదని చెబుతున్నాడు. ‘ఆర్జీ–2 ఏరియా వకీల్పల్లిగనిలో పనిచేస్తున్న యువ కార్మికుడు 2015లో కారుణ్య నియామకం ద్వారా సంస్థలో చేరాడు. డిగ్రీ పూర్తి చేసిన యువకుడికి సంబంధించి గడిచిన 8 ఏళ్లలో వంద మçస్టర్లు మాత్రమే నమోదయ్యాయి. తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే డ్యూటీకి రాలేకపోతున్నానని అంటున్నాడు. ..ఆర్జీ–2 లో వకీల్పల్లిగనికి చెందిన ఒకరు 2018లో ఉద్యోగంలో చేరారు. కనీసం అతను 60 డ్యూటీలు కూడా చేయలేదు. దీంతో సింగరేణి యాజమాన్యం గైర్హాజర్ కౌన్సెలింగ్కు హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. ఇటీవల గనిలో నిర్వహించిన కౌన్సెలింగ్కు హాజరయ్యాడు. కారుణ్య నియామకాలు ఇలా సింగరేణిలో పనిచేసే కార్మికుడు మెడికల్ ఇన్వాలిడేషన్ (అనారోగ్య కారణం)తో విధుల నుంచి తప్పుకుంటే వారి స్థానంలో కొడుకుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇస్తున్నారు. తెలంగాణ వచ్చాక 2015 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 11,541మంది యువత ఉద్యోగాల్లో చేరారు. విధుల్లో చేరిన నాటి నుంచి మూడేళ్ల పాటు పనిచేస్తే వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. అయితే సింగరేణిలో 12 ఏరియాల్లో గత మూడేళ్లలో కనీసం 100 మస్టర్లు కూడా చేయని కార్మికులు 1377 మంది ఉన్నారు. పూర్తిస్థాయి యాంత్రీకరణ ఉన్నా.. పదేళ్ల కిందట అయితే భూగర్భగనిలోకి దిగి పైకి ఎక్కడమే ఎంతో శ్రమగా ఉండేది. తట్టాచెమ్మస్ పూర్తిగా కనుమరుగైపోయింది. సెమీ మెకనైజ్డ్, ప్రస్తుతం పూర్తిస్థాయి యాంత్రీకరణ కొనసాగుతోంది. మ్యాన్రైడిండ్, చైర్కార్, చైర్లిఫ్ట్లాంటి విధానం ద్వారా భూగర్భగనిలోని పనిస్థలాల వద్దకు కార్మికులను తీసుకెళ్లి, తిరిగి తీసుకొస్తున్నారు. దీంతో కార్మికులకు నడక శ్రమ చాలా తగ్గింది. అయినా చాలామంది యువ కార్మికులు ఆఫీస్ కార్యాలయాలు, ఓసీపీలు, గనిపైన ఉన్న లైట్జాబ్ కోసం పైరవీలు చేస్తున్నారు. ఏటా వంద మస్టర్లు తప్పనిసరి సంస్థలో బదిలీ వర్కర్లుగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు ఏటా భూగర్భ గనుల్లో అయితే 190 మస్టర్లు, సర్ఫేజ్లో అయితే 240 మస్టర్లు ఉండాలి. అవి ఉంటేనే వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. ఏటా వంద మస్టర్ల చొప్పున మూడేళ్ల పాటు 300 మస్టర్లుంటే ఉద్యోగానికి గ్యారెంటీ. లేనిపక్షంలో యాజమాన్యం నిబంధనల ప్రకారం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తుంది. వాస్తవ కారణాలు ఉంటే సంస్థ సహకరిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఏర్పడింది. సింగరేణిలో చేరిన యువత చిన్నకారణాలతో విధులకు గైర్హాజరవుతూ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. ఏవైనా వాస్తవ కారణాలుంటే సంస్థ కూడా సహకరిస్తుంది. సంస్థలో యువకార్మికులు పెరుగుతున్న క్రమంలో సంస్థ మరింత లాభాల బాటలో పయనించాలి. కారణాలేవైనా సంస్థ ఉద్యోగం పోగొట్టుకుని ఉద్యోగితో పాటు కుటుంబం వీధిన పడటం సరికాదు. –బలరాం, డైరెక్టర్(పా), సింగరేణి -
ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపి.. తియ్యగా మాట్లాడి, అప్పటి నుంచి అసలు కథ మొదలు!
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఫేస్బుక్ ప్రొఫైల్లో యువతి ఫొటో పెట్టి యువకులతో చాటింగ్ చేసి అనంతరం బ్లాక్మెయిల్ చేసి లక్షలు దోచుకున్న దాసరహళ్లికి చెందిన రవికుమార్(24) అనే నిందితుడిని రామనగర సీఈఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కుణిగల్ తాలూకా కగ్గేరికి చెందిన రవికుమార్ బెంగళూరు దాసరహళ్లిలో ఉంటూ సెకెండ్ పీయూసీ చదివి ప్రైవేటు డాటాబేస్ కంపెనీలో పనిచేసేవాడు. యువతి ఫొటోతో ఫేస్బుక్ ఖాతా ఓపెన్ చేశాడు. రామనగరకు చెందిన రాజేశ్ అనే యువకుడు రిక్వెస్ట్ పంపాడు. అతనితో తీయగా మాట్లాడుతూ వ్యక్తిగత సమాచారం సేకరించాడు. అనంతరం బ్లాక్మెయిల్ చేసి పలు విడతలుగా రూ.41 లక్షలు వసూలు చేశాడు. ఇలా చాలా మందిని బ్లాక్మెయిల్ చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి పెళ్లి చేసుకొమ్మంటే.. ప్రాణం తీశాడు -
విశాఖలో శారీ వాక్థాన్
బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో అతి ముఖ్యమైన వస్త్రధారణపై నేటి యువతకు అవగాహన కల్పించేందుకు ఆదివారం విశాఖ ఆర్కేబీచ్లో హ్యాండ్లూమ్ శారీ వాక్థాన్ (చేనేత చీర నడక) నిర్వహించారు. భారీగా హాజరైన మహిళలతో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి వైఎంసీఏ వరకు సాగిన వాక్థాన్ను ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి, విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ట్రేడిషనల్ వాక్, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
జనాదరణ కోసం పిచ్చి పనులా?.. వైరల్ వీడియోపై సజ్జనార్ ట్వీట్..
అందరూ తమను గుర్తించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఏదైనా గొప్పగా సాధించి మంచి పేరు సాధించాలని కోరుకుంటారు. కానీ ఈ మధ్య దీనికి భిన్నమైన సోషల్ మీడియా సంస్కృతి విస్తరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వైరల్ అయ్యే పనులు చేసి పేరు తెచ్చుకోవాలని కొందరు పిచ్చి పనులు చేస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వీడియోనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ యువకుడు రైలు పట్టాలపై నిలిచి ఉంటాడు. రైలు రాక కోసం తీక్షణంగా ఎదిరి చూస్తుంటాడు. రైలు వచ్చే ముందే పట్టాల మధ్యలో పటుకుంటాడు. అతి వేగంగా వెళ్తున్న రైలు క్షణాల్లోనే అతన్ని దాటుకుని వెళ్లిపోతుంది. పట్టాల మధ్యలో పడుకున్న యువకుడు సేఫ్గా బయటపడతాడు. కానీ రైలు వేగానికి యువకుడు ఏమాత్రం పైకి లేచినా.. ఇంకమన్నా ఉందా..? ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిపిపోయేవి. ఈ వీడియోని తెలంగాణ ఆర్టీసీ బాధ్యతలు చేపడుతున్న ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? అంటూ రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/wc3BSQVhA1 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 2, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ బాధిత యువకున్ని ఫూలిష్గా పేర్కొన్నారు. కేవలం ఎవరో గుర్తుంచాలని ప్రాణాలకు తెగించడం పిచ్చి పనిగా పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు ఇలాంటి పిచ్చి పనుల్ని చేయొద్దంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారు మరొకొందరు. ఆ యువకుడు చేసిన పిచ్చి పనేంటో మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: కునోలో మరో చీతా మృతి.. ఐదు నెలల్లోనే తొమ్మిది.. -
''ఐఏఎస్ కొడుకు టైలర్ అవుతాడా? కనీసం ఇంజనీర్ అవ్వాల్సిందే''
యువతలోని ఒక వర్గం నుంచి బలంగా వినిపిస్తున్న నినాదం... జాయిన్ ది జోమో క్లబ్! ఒకప్పుడు ఫోమో(ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) క్లబ్లో ఉన్నవారు కూడా జోమో (జాయ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) లోకి వచ్చేస్తున్నారు. మెయిన్స్ట్రీమ్ ధోరణికి భిన్నంగా కలలు కనే ‘జోమో’ ట్రెండ్ యువతరం ‘సక్సెస్తో సంతోషం వస్తుందో లేదో గాని సంతోషంతో మాత్రం తప్పనిసరిగా సక్సెస్ వస్తుంది’ అంటోంది... రాజస్థాన్లోని కోట నగరం ‘కోచింగ్ హబ్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచింది. తియ్యటి భవిష్యత్ కలలతో పాటు పీడకలలలాంటి ఒత్తిడి, భయం, ఆందోళన ఆ గాలిలోనే తేలియాడుతుంటాయి.ఉత్తర్ప్రదేశ్కు చెందిన అజిత్ కిశోర్ ఐఐటీ కోంగ్ కోసం ఇక్కడికి వచ్చాడు. తండ్రికి చెరుకుకు సంబంధింన ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉంది. ఐఐటీ–కాన్పూర్లో చదివిన అజిత్ సోదరుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తనకు మరో ‘ఐఐటీ పుత్రుడు’ కావాలనుకున్నాడు తండ్రి. ఫలితంగా అజిత్ కిశోర్ కోట నగరానికి అనివార్యంగా రావాల్సి వచ్చింది.అజిత్ కిశోర్కు ఐఐటీ అంటే బొత్తిగా ఇష్టం లేదు.‘ఆసక్తి లేకపోవడం కాదు, అందుకు తగిన ప్రతిభాసామర్థ్యాలు నాలో లేవు. నాకు సంబంధం లేని విషయానికి నేనేందుకు బాధ పడాలి?’ అంటాడు అజిత్. తరచు కోచింగ్ క్లాసులు ఎగ్గొట్టే బిహార్లోని పట్నాకు చెందిన రక్షిత్ కుమార్ ‘నాకు ఐఐటీ సీటు కచ్చితంగా రాదు. అయినా సరే, నటించక తప్పదు’ అని నవ్వుతూ అంటాడు. ‘దీనివల్ల టైమ్, డబ్బు వృథా కదా?’ అని అడిగితే రక్షిత్ ఇలా జవాబు ఇస్తాడు...‘నేను చదువులో యావరేజ్ స్టూడెంట్ని. మా నాన్నకేమో నేను ఇంజినీర్ కావాలని పట్టుదల. ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది నా కల. ఈ విషయాన్ని నాన్నకు చెబితే ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు టైలర్ కావాలనుకుంటాడా? అని వెటకారంగా మాట్లాడారు. నిన్ను ఇంజినీర్గా చూడాలనేది నా కల. ఏం చేస్తావో, ఎలా చేస్తావో తెలియదు అని ఆర్టర్ జారీ చేశారు. కాబట్టి ఆయన మనసు నొప్పించకుండా ఇక్కడకు రావాల్సి వచ్చింది’ మధ్యప్రదేశ్ నుంచి కోట నగరానికి వచ్చిన అదితిశర్మ తండ్రి డెంటిస్ట్. తల్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్. ‘నా తల్లిదండ్రుల కలల బాధితురాలిని’ నవ్వుతూ అంటుంది అదితి. ‘ఎందుకలా?’ అని అడిగితే... ‘నా తల్లిదండ్రులు చదువులో బ్రైట్. నేను మాత్రం బ్రైట్ స్టూడెంట్ కాలేకపోయాను. అందుకు నేనేమీ బాధ పడడం లేదు. చెఫ్ కావాలనేది నా కల’ అంటుంది అదితి.అదితి శర్మలాగే ‘కోట మాత్రమే ప్రపంచం కాదు. దీనికి అవతల పెద్ద ప్రపంచం ఉంది. అక్కడ మనకు తగిన అద్భుత అవకాశాలు ఉంటాయి’ అనుకునే విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. కోట లాంటి కోంగ్ సెంటర్లకు ప్రసిద్ధిగాంచిన నగరాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అదితిశర్మలాంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అదితి శర్మలాంటి వాళ్లను ఆకట్టుకుంటున్న ట్రెండ్... జోమో. ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–తప్పిపోతుందేమో అనే భయం) పాత విషయం అయిపోయింది. జోమో (జాయ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–తప్పిపోయినందుకు ఆనందం) అనేది కొత్త ట్రెండ్గా మారింది. యూత్లో కొంతమంది నుంచి వినిపిస్తున్న ‘జాయిన్ ది జోమో క్లబ్’ నినాదాన్ని ఎలా చూడాలి?పలాయనవాదమా? కాలహరణమా? ‘చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఆదేశించగానే ఓకే చెబుతారు. తాము సాధించగలం అనుకుంటారు. ఒకసారి వృత్తంలోకి వచ్చిన తరువాత పేరెంట్స్, ఉపాధ్యాయులు, ఇతరుల నుండి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వచ్చే ఒత్తిడితో సతమతమవుతారు. ఆ తరువాత పరిణామాలు ఎటో వెళతాయి. మొదటికే మోసం వస్తుంది. తల్లిదండ్రుల కలను నెరవేర్చలేకపోతున్నాను అనే బాధతో ఆత్మహత్యకు పాల్పడే వాళ్లు కూడా ఉన్నారు. దీని కంటే జోమో నయం కదా! జోమో బాయ్స్ అండ్ గర్ల్స్ తమ బలాలు, బలహీనతల విషయంలో చాలా స్పష్టంగా ఉంటున్నారు. ఇఫ్ ఐయామ్ హ్యాపీ ఐయామ్ సక్సెస్ఫుల్. సక్సెస్ అంటే అకాడమిక్, ప్రొఫెషన్ సక్సెస్ మాత్రమే కాదు’ అంటూ జోమోవాదులను సమర్థించేవాళ్లు ఎంతోమంది ఉన్నారు.‘జోమో’ కెరీర్కే పరిమితమైన ట్రెండ్ కాదు. సోషల్మీడియాలోని అనేక అంశాలు ఈ ట్రెండ్ బలపడడానికి కారణం.‘సోషల్ మీడియాలో భాగం కాకపోతే, చురుగ్గా ఉండకపోతే అందరిలా ఎగై్జట్మెంట్ను మిస్ అవుతాను, ఒంటరిని అవుతానేవె అనే భయం... ఫోమో. మరోవైపు జోమో మాత్రం అలాంటి భయాలను పక్కనపెడుతుంది. టెక్–ఫ్రీ బ్రేక్స్ను ఇష్టపడుతుంది’ అంటుంది దిల్లీకి చెందిన సీనియర్ క్లినికల్ సైకాలజిస్ట్ భావనా బర్మీ. రెండు సంవత్సరాల క్రితం ట్రావెల్ ఇండస్ట్రీలో ‘జోమో’ ట్రెండ్ గట్టిగా వినిపించింది, ఈ ట్రెండ్లో భాగంగా ఆఫ్ సీజన్, జనసమూహాలు ఎక్కువగా కనిపించని, పెద్దగా జనాదరణ లేని ప్రదేశాలను ఎంచుకునేవారు. స్థూలంగా చెప్పాలంటే ఇది ఒకే రంగానికి, ఒకే అంశానికి పరిమితమైన ట్రెండ్ కాదు. సోషల్ మీడియాలో భాగం కాకపోతే, చురుగ్గా ఉండకపోతే అందరిలా ఎగై్జట్మెంట్ను మిస్ అవుతాను, ఒంటరిని అవుతానేమో అనే భయం... ఫోమో. మరోవైపు జోమో మాత్రం అలాంటి భయాలను పక్కనపెడుతుంది. టెక్–ఫ్రీ బ్రేక్స్ను ఇష్టపడుతుంది. – భావనా బర్మీ, క్లినికల్ సైకాలజిస్ట్ -
ఇదేందిది.. కారు కాని కారు.. బానే పోతోందే..!
ఎక్కడ ఏకాస్త ప్రతిభ ఉన్నా అది సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. కొందరు కార్లు, హెలికాప్టర్ల తయారు చేస్తుండగా, మరికొందరు స్కూటర్లు, ఇటుకలతో కూలర్లు తయారు చేస్తున్నారు. ఇదే కోవలోకి చెందిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో నాలుగు చక్రాలతో కూడిన విచిత్ర వాహనం కనిపిస్తుంది. వాహనానికి బైక్ ఇంజిన్ అమర్చారు. స్టీరింగ్ కోసం ప్రత్యేక డిజైన్ చేశారు. పాత వస్తువులతో వాహనం బాడీ తయారు చేశారు. అలాగే పాత టైర్లను అమర్చి వాహనానికి ఫినిషింగ్ ఇచ్చారు. దీనిని చూసినవారికి మొదట నవ్వు వస్తుంది. తరువాత ఈ వినూత్న వాహన తయారీదారులను మెచ్చుకోకుండా ఉండలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోను ట్విట్టర్లో @being_happyyy అనే పేరు కలిగిన అకౌంట్లో పోస్ట్ చేశారు. క్యాప్షన్లో దేశీయ ఆవిష్కరణ అని రాశారు. 29 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు, ఇద్దరు పిల్లలు వాహనం మీద కూర్చుని కనిపిస్తారు. ఈ వీడియోకు వేలకొద్దీ లైక్స్ లభిస్తున్నాయి. ఇది కూడా చదవండి: 10 ఏళ్ల క్రితం మాయమై.. బిచ్చగానిగా భర్త కనిపించడంతో.. Desi jugaad or desi innovation? #jugaad #innovation pic.twitter.com/CwxFCmjjsD — Neeraj M (@being_happyyy) July 27, 2023 -
ఏమైందో తెలియదు..! నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్ని చితక్కొట్టారు..
అమెరికాలోని న్యూయార్క్లో దారుణం జరిగింది. ఐదుగురు యువకులు కలిసి వృద్ధుడైన ఓ క్యాబ్ డ్రైవర్ను దారుణంగా కొట్టారు. నడిరోడ్డులో 60 ఏళ్ల వృద్ధునిపై విచక్షణా రహితంగా పిడిగుద్దులు కురిపించారు. బూటు కాలుతో తంతూ ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులు కలిసి దాడి చేశారు. నగరంలోని సిక్స్త్ అవెన్యూ 34 వ కూడలికి సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఫైరవుతున్నారు. వీడియో ప్రకారం ఐదుగురు కలిసి క్యాబ్ డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి చేశారు. వారి దెబ్బలను తట్టుకోలేక ఆ వృద్ధుడు తనను తాను రక్షించుకోవడానికి తలపై చేతులు పెట్టుకుని దీనంగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఓ మహిళ పిడిగుద్దులను భరించలేక క్యాబ్ వైపు వంగి పడిపోయాడు. ఈ దృశ్యాలు సదరు వీక్షకున్ని ఆలోచింపజేశాయి. ఈ వీడియో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట క్యాబ్ డ్రైవర్కు యువకులకు మధ్య వాగ్వాదం నడిచిందని తెలిపారు. అనంతరం దాడి జరిగినట్లు పేర్కొన్నారు. Just another day in NYC.... A group of thugs beat up a 60 year old taxi cab driver in Manhattan in broad daylight. Last year a 52 year old NYC cab driver was beaten to death by a group of teens. pic.twitter.com/v9SQAkCWcN — Leftism (@LeftismForU) July 28, 2023 తీవ్రంగా గాయపడిన వృద్ధున్ని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. హోవార్డ్ కొలీ, నటాలీ మోర్గాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ బ్రూక్లిన్కు చెందినవారిగా గుర్తించారు. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్ప్రెస్ ట్రైన్ -
బైక్పై ప్రియురాలిని వదిలేసి.. రాత్రి స్నేహితుడితో కలిసేందుకు వెళ్లి
అన్నానగర్(చెన్నై): నెల్లై జిల్లా దిసైయాన్ విలై తాలూకా స్వామిదాస్ పట్టణంలో చెప్పులు కుట్టే కార్మికుడు కన్నియప్పన్ కుమారుడు ముత్తయ్య (19). సంగనాన్ కుళం గ్రామంలో వివాహ ఆహ్వాన పత్రికలు తయారు చేసే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీలో ఓ యువతి పని చేస్తోంది. వేర్వేరు కులాలకు చెందిన చెందిన ముత్తయ్య, సదరు యువతి ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ముత్తయ్య ఇంటికి ప్రియురాలు వచ్చింది. అనంతరం 4.30 గంటలకు ముత్తయ్య తన బైకులో యువతిని ఇడమొళిలో వదిలేసి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాత్రి 8 గంటల సమయంలో స్నేహితుడిని కలిసేందుకు వెళుతున్నానని చెప్పి వెళ్లిన ముత్తయ్య చాలా సేపటి వరకు ఇంటికి రాలేదు. సోదరులు అతన్ని వెతకగా ఆ ప్రాంతంలో మృతదేహమై పడివున్నాడు. దిసైయాన్విలై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముత్తయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. నెల్లై ఎస్పీ శిలంబరసన్, వల్లీయూరు డీఎస్పీ యోగేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారం వల్లే ఈ హత్య చోటు చేసుకుందని భావిస్తున్నారు. చదవండి Hyderabad IIT Student Commits Suicide: హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతం -
ఇన్స్టాలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. చివరికి బాలిక తల్లిదండ్రులు వెళ్లి
తిరువొత్తియూరు(చెన్నై): ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన ఓ బాలిక వీడియో, ఫొటోలను సామాజిక మాధ్యమంలో ఉంచుతానని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. కళ్లకురిచ్చి జిల్లా ఊలందూర్పేట ఉలుందాండవర్ ఆలయం వీధికి చెందిన సతీష్ కుమార్ (21)కు తేని జిల్లాకు చెందిన బాలిక (17)తో ఇన్స్ట్రాగామ్లో పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాలికకు మాయ మాటలు చెప్పి ఊలందూరుపేటకు రమ్మని పిలిచాడు. దీంతో ఈ ఏడాది మే 3వ తేదీ అక్కడికి వెళ్లింది. ఇద్దరూ కలిసి తిరిగినట్లు తెలిసింది. బాలిక తల్లిదండ్రులు మే 5వ తేదీ ఊలందూరుపేటకు వెళ్లి సతీష్ కుమార్ వద్ద నుంచి బాలికను తీసుకెళ్లారు. ఈ క్రమంలో బాలిక బంధువులతో మాట్లాడిన సతీష్ కుమార్ రూ.70 వేలు ఇవ్వాలని.. లేకపోతే వీడియోలను, ఫొటోలను సామాజిక మాధ్యమంలో విడుదల చేస్తానని బెదిరించాడు. దీనిపై బాలిక బంధువులు, తల్లిదండ్రులు పెరియకులం మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సతీష్ కుమార్ను గురువారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చదవండి కారు పార్కింగ్ వివాదం.. కర్రతో చితక్కొట్టుకున్న రెండు కుటుంబాలు.. -
ఛీ.. ఇదేం పాడు బుద్ధి.. తనని పెళ్లి చేసుకోవాలని చెల్లికి వేధింపులు.. రోజూ కాల్ చేసి
తిరువళ్లూరు(చెన్నై): తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేస్తున్న పెద్దనాన్న కొడుకును గుమ్మిడిపూండి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఎడూర్ కాలనీకి చెందిన సుమిత(22), అదే ప్రాంతానికి చెందిన పెద్దనాన్న కొడుకు త్యాగరాజన్(27) ఇద్దరూ వరుసకు అన్న చెల్లెలు. పెద్దనాన్న కొడుకు కావడంతో సుమిత చనువుగా మెలిగింది. సుమితకు ఇటీవల పెళ్లిచూపులు ఏర్పాటు చేసి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో యువతికి పెద్దనాన్న కొడుకు త్యాగరాజన్ రోజూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేసేవాడు. తనను పెళ్లి చేసుకోవాలని వేధించినట్టు తెలిసింది. తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సుమిత కాబోయే భర్తకు పంపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత యువతి గుమ్మిడిపూండి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. చదవండి తెలంగాణలో టమాటాలు చోరీ.. తెల్లారేసరికి బాక్స్లు మాయం -
యువత సంకల్పం అత్యంత బలమైంది
తిరుపతి ఎడ్యుకేషన్: నేటి యువతే రేపటి దేశం. యువతకు మించిన గొప్ప శక్తి లేదు. యువత సంకల్పం అన్నింటి కన్నా బలమైనదని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్వీ వెటర్నిటీ వర్సిటీ) 12వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆ యువత సరైన దిశలో గమ్యం వైపు పయనిస్తే బలమైన భారత్గా ఎదుగుతుందన్నారు.పశుపోషణ, పాడి పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పాల ఉత్పత్తిని పెంచడంలో, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. అమూల్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుని గ్రామీణ మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శ్రీవారి నైవేద్యాలకు, భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీతో పాటు అన్ని అవసరాలకు సేంద్రియ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడం శుభసూచకమన్నారు. రైతులు సహజసిద్ధమైన ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించేలా వారిని ప్రోత్సహించేందుకు ఎద్దులు, ఆవులను విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశీయ గోజాతులను రక్షించేందుకు టీటీడీ తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు.గురువుల మార్గనిర్దేశంలో క్రమశిక్షణతో విద్యనభ్యసించిన వెటర్నరీ విద్యార్థులు పశువైద్య నీతి సూత్రాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ దేశం గర్వించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఎస్వీ వెటర్నరి వర్సిటీ దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఏడాదికి ప్రకటించిన ర్యాంకింగ్లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 31వ స్థానంలో నిలవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు 35 బంగారు పతకాలు, రెండు రజతం, ఒకరికి నగదు బహుమతిని అందించారు. కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎంఆర్ శశీంద్రనాథ్, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అరుణాచలం రవి పాల్గొన్నారు. -
బస్సు దిగి వెళ్తున్న యువతి.. హఠాత్తుగా వెనుక వచ్చి
తిరువళ్లూరు(చెన్నై): నడిరోడ్డుపై అందరు చూస్తుండగా యువతిపై యువకుడు దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై యువతి తల్లి గుమ్మిడిపూండి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.తిరువళ్లూరు జిల్లాకు చెందిన శ్రీనివాసన్ కుమార్తె గుమ్మిడిపూండిలోని ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. గురువారం సాయంత్రం యథావిధిగా కళాశాల ముగించుకుని బస్సులో ఇంటికి బయలుదేరింది. గుమ్మిడిపూండిలోని పెరియార్ బస్టాండ్ వద్ద బస్సు దిగి ఇంటికి వెళ్లే క్రమంలో కమ్మవారిపాళ్యం గ్రామానికి చెందిన రఘుపతి కుమారుడు అన్బు(21) వెనుక వచ్చి హఠాత్తుగా యువతిపై విచక్షణరహితంగా దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటనపై యువతి తల్లి గుమ్మిడిపూండి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. యువతిపై దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చదవండి బీహార్లో అమానుషం.. విద్యార్థినిపై మాష్టారు లైంగిక వేధింపులు.. -
ఎంత విషాదం.. జిమ్లో వర్కౌట్లు చేస్తూ కుప్పకూలిన యువకుడు
న్యూఢిల్లీ: యువతలో ఆకస్మిక మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ఎటాక్లు.. కారణాలేవైనా నూరేళ్ల జీవితం అనుభవించాల్సిన యంగ్స్టర్స్.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అర్ధాంతరంగా ఎంతో ఆరోగ్యంగా ఉండే వారు సైతం ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. జిమ్లో ట్రెడ్మిల్పై వ్యాయామం చేస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. నగరంలోని రోహిని ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బీటెక్ పూర్తి చేసిన 24 ఏళ్ల యువకుడు సాక్షం పృథి.. గురుగ్రామ్కు చెందిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోహిణి సెక్టార్ 19లో నివాసముంటున్నాడు. ఇతడు స్థానికంగా సెక్టార్ 15లో ఉన్న జిమ్ప్లెక్స్ ఫిట్నెస్ జోన్లో తరుచుగా వ్యాయామానికి వెళ్తుంటాడు. ఇదే క్రమంలో గత మంగళవారం జిమ్కు వెళ్లాడు. ఉదయం 7.30 సమయంలో ట్రెడ్మిల్పై పరుగెత్తుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటివారు, సిబ్బంది.. యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో విద్యుదాఘాతమే బాధుతుడి మృతికి కారణమని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జిమ్ మేనేజర్ అనుభవ్ దుగ్గల్ను అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. చదవండి: యాక్సిడెంట్ను చూడబోతే.. 9 మంది మృతి -
కుక్కపిల్లలను భయపెట్టాలనుకున్నారు.. కానీ.. తల్లి కుక్క ఎంట్రీతో సీన్ రివర్స్..
కొత్త వ్యక్తులు కనిపిస్తే కుక్కలు మొరగడం ప్రారంభిస్తాయి. ఇంకా కోపం ఎక్కువ ఉన్న కుక్కలైతే అస్సలు ఊరుకోవు. వెంబడించి మరీ దాడి చేసే ప్రయత్నం చేస్తాయి. అలాంటి సమయాల్లో బెదిరిస్తే కొన్నికుక్కలు భయంతో పారిపోతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఎదురైంది ఇద్దరు యువకులకు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వీడియోలో చూపిన విధంగా.. ఇద్దరు యువకులు దారి వెంట మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వారిని చూసిన రెండు కుక్క పిల్లలు దాడి చేసే ప్రయత్నం చేశాయి. కుక్క పిల్లలే కదా..! అన్నట్లు ఒక్కసారిగా ముందుకు వచ్చి వాటిని బెదిరించే ప్రయత్నం చేశారు యువకులు. అంతే.. భయంతో వెనక్కి పరుగులు పెట్టాయి. కానీ అసలు ట్విస్టు ఇక్కడే ఎదురైంది ఆ యువకులకు. వెనక్కి వెళ్లిన కుక్క పిల్లలు తన తల్లిని తీసుకువచ్చాయి. తల్లి కుక్క భారీ ఆకారంలో ఉండటంతో యువకులు.. చచ్చాం.. రా.. బాబోయ్.. అన్నట్లు భయంతో వెనక్కి పరుగులు పెట్టారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. Don't underestimate anything, there is always something stronger than you! Made me laugh a lot! 🤣🤣pic.twitter.com/r8WWEP5NSA — Figen (@TheFigen_) July 8, 2023 వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. కుక్క పిల్లలే కదా..! అని తక్కువ అంచనా వేయకూడదని కామెంట్ చేశారు. దేన్ని అండర్ ఎస్టిమేట్ వేయకూడదని.. దాని వెనకాల ఎంత పెద్ద బలం ఉంటుందో తెలియదని చెప్పుకొచ్చారు. ఈ వీడియోను చూసి మరికొంతమంది నవ్వులు కురిపించారు. కానీ కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు మరికొందరు. ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని.. -
రైల్వే ప్లాట్ఫాంపై యువకుడి స్టంట్స్.. వాళ్ల రాకతో సీన్ రివర్స్!
పాట్నా: ఇంటర్నెట్ వాడకం పెరగడంతో సోషల్ మీడియాలో యూజర్ల సంఖ్య నానాటికీ పెరుగుతూ పోతోంది. ఇక నెట్టింట తమ టాలెంట్ను ప్రదర్శించి కొందరు రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిన ఘటనలు బోలెడు ఉన్నాయి. కరోనా లాక్డౌన్ నుంచి ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. దీంతో సోషల్మీడియాలో వైరల్గా మారేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని చిరాకు తెప్పించేలా ఉంటున్నాయి. ఇంకొంత మంది మరో అడుగు మందుకేసి ప్రమాదకరమైనవి కూడా ప్రదర్శిస్తూ ప్రజలకు ఇబ్బంది కూడా కలిగిస్తున్నారు. ఎందుకీ స్టంట్స్... తాజాగా ఓ యువకుడు రైల్వేస్టేషన్లో జిమ్నాస్టిక్స్ విన్యాసాలు ప్రదర్శించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే,ఆ యువకుడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు అతనికి ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఘటన బిహార్లోని మాన్పుర్ జంక్షన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రైల్వేస్టేషన్లోని ఓ ప్లాట్ఫాంపై రైలు ఆగి ఉంది. అంతలో ఓ యువకుడు అక్కడికి వచ్చి జిమ్నాస్టిక్స్ విన్యాసాలు చేయడం చేయడం ప్రారంభించాడు. ఈ తరహా ఘటనలో ఇటీవల ఎక్కవ కావడంతో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ఆర్పీఎఫ్.. అతడిని అరెస్టు చేసింది. అనంతరం అతని వీడియో షేర్ చేసి.. ఈ మేరకు ట్వీట్ చేసింది..‘మాన్పుర్ జంక్షన్లో ఓ యువకుడు తన నిర్లక్ష్యపూరిత విన్యాసాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించాడు. స్టేషన్లోకి అనధికారికంగా ప్రవేశించడంతోపాటు గందరగోళం సృష్టించే యత్నం చేశాడన్న ఆరోపణలపై అతడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో లైక్లు, షేర్ల కోసం తెగించేవారికి ఇదొక గుణపాఠంగా నిలుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు దీనిపై మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది అతడి ప్రవర్తనను వ్యతిరేకించినప్పటికీ.. యువకుడి అరెస్టు చేయడాన్ని తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసి ఉండాల్సిందిగా అభిప్రాయపడ్డారు. మరికొందరు ఆర్పీఎఫ్ తీసుకున్న నిర్ణయం సరైందేనని కామెంట్లు పెడుతున్నారు. A young man who gained fame for his reckless stunts at Manpur Junction, was arrested by #RPF for creating nuisance and unauthorized entry. We hope this will serve as a lesson for others who put their lives at risk for likes and shares in social media. #SafetyFirst pic.twitter.com/qDCj9H9mFK — RPF INDIA (@RPF_INDIA) July 10, 2023 చదవండి: Video: బట్టతల దాచి రెండో పెళ్లికి రెడీ.... విగ్గు ఊడదీసి చితకబాదారు -
Khammam: జిమ్కు వెళ్లొచ్చాక గుండెపోటు.. కాంగ్రెస్ నేత కుమారుడి మృతి
సాక్షి, ఖమ్మం: ఇటీవల పెరిగిన గుండెపోటు మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎంతో ఆరోగ్యంగా ఉండే యువకులు సైతం సడెన్ హార్ట్ఎటాక్తో కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. కాగా ఖమ్మం నగరం అల్లీపురంలో గరికపాటి నాగరాజు అనే యువకుడు ఆదివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఖమ్మంలో హార్ట్స్ట్రోక్తో మరో యువకుడు మరణించాడు. కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్ కుమారుడు శ్రీధర్(31) గుండెపోటుతో మృతిచెందాడు. సోమవారం ఉదయం జిమ్కు వెళ్లి వచ్చిన కాసేపటికే శ్రీధర్ ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే శ్రీధర్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు. అయితే ఆదివారమే (జులై 9న) శ్రీధర్ సోదరుడు కుమారుడి బారసాల జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రేణుకచౌదరి కూడా హాజరయ్యారు. కాగా రాధా కిషోర్ రేణుకచౌదరికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల వ్యవధిలో ఖమ్మం జిల్లాలో ఇద్దరు యువకులు గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదం నింపింది. ఆయన కుటుంబాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శిస్తున్నారు. చదవండి: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శామ్ కోషీ! -
బైక్ డ్రైవింగ్ చేస్తూ.. పిస్టల్తో హల్చల్ చేసిన యువకులు..
యశవంతపుర(బెంగళూరు): పిస్టల్ చేతపట్టి బైక్పై వీలింగ్ చేస్తున్న ఇద్దరు యువకులను హాసన పోలీసులు అరెస్ట్ చేశారు. హాసన రింగ్రోడ్డులో ఇద్దరు యువకులు బుల్లెట్ బైకుపై వీలింగ్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కాగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే ప్రీతంగౌడ మద్దతుదారులు సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్ పెట్టారు. చదవండి: పూణే రైల్వే స్టేషన్లో దారుణం.. కనుమరుగైన మానవత్వం.. -
ప్లాట్ఫామ్పై పిచ్చి చేష్టలు..వీడియో వైరల్
-
యువత ఐక్యతకే క్రీడా పోటీలు
తాండూరు టౌన్: యువతలో సమైక్యతా భావాలను పెంపొందించేందుకే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. పీఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ క్రీడా పోటీలకు, ఎన్నికలకు ఎలాంటిసంబంధం లేదని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీ ముగింపు సందర్భంగా బుధవారం పట్టణంలో సుమారు 6వేల మందితో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆయన తనయుడు రినీష్రెడ్డితో కలిసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. పట్నం ఫ్యామిలీకి క్రీడా పోటీలు నిర్వహించడం కొత్తేమీ కాదన్నారు. పీఎమ్మార్ ట్రస్టు తరఫున తన తనయుడు రినీష్రెడ్డి నేతృత్వంలో సామాజిక కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని ప్రకటించారు. జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సామూహిక వివాహాలు జరిపించనున్నట్లు చెప్పారు. యువత సన్మార్గంలో నడవాలి అనంతరం ఎమ్మెల్సీ తనయుడు రినీష్రెడ్డి మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని, యువత తలుచుకుంటే సాధించనిదంటూ ఏదీ లేదని తెలిపారు. అలాంటి యువతను ప్రోత్సహించడంలో భాగంగానే పీఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. తాను తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ పని చేసి చూపిస్తానన్నారు. యువత మత్తుకు బానిసలు కాకూడదని, తాండూరులో కొందరి వల్ల యువత పెడదోవ పడుతోందని తెలిపారు. యాగాలు, పూజలు జరిపించినంత మాత్రాన చేసిన తప్పులను దేవుడు క్షమించడని వ్యాఖ్యానించారు. భవిష్యత్లో యువతకు అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. అనంతరం నియోజకవర్గ స్థాయి టోర్నీ విజేతలకు రూ.2 లక్షలు, రన్నరప్స్కు రూ.లక్ష అందజేశారు. పట్టణం, మండల స్థాయి విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.25 వేలతో పాటు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ము న్సిపల్ చైర్పర్సన్ స్వప్న, బీఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, లక్ష్మారెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, నర్సింహులు, రజాక్, రవిగౌడ్, పరిమళ, శోభారాణి, నీరజా బాల్రెడ్డి, నారాయణరెడ్డి, సిద్రాల శ్రీనివాస్,అజయ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వైట్హౌస్లో పాటలతో హుషారు! ఎవరీ కుర్రాళ్లు?
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్.. వేలాది మంది భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఎదురు చూస్తున్నారు. వైట్ హౌస్ మెట్ల వద్ద నలుపు రంగు కోట్లు ధరించిన కొందరు కుర్రాళ్లు "చయ్య చయ్య", "దిల్ సే", "జాష్న్-ఎ-బహారా" బాలీవుడ్ పాటలతో అక్కడున్నవారందరినీ ఉర్రూతలూగించారు. ఇంతకీ ఎవరీ కుర్రాళ్లు అంటే.. స్వరాలే వాద్యాలుగా.. ‘పెన్ మసాలా’.. ప్రపంచంలో మొట్టమొదటి దక్షిణాసియా ఎ క్యాపెల్లా (A Capella) గ్రూప్. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన 19 మంది విద్యార్థులతో ఇది ఏర్పాటైంది. ఎ క్యాపెల్లా అంటే వాద్య సహకారం లేకుండా పాటలు పాడే బ్యాండ్. స్వయంగా తమ స్వరంతోనే వాద్య శబ్ధాలను వీరు అనుకరిస్తారు. 1996 నుంచి ఈ బ్యాండ్ ఉనికిలో ఉంది. ఈ బృందం దేశాధినేతలు, ఇతర ప్రముఖులు పర్యటనలకు వచ్చినప్పుడు పాడటం ద్వారా పేరు తెచ్చుకుంది. ఇటీవల వైట్ హౌస్లో అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోదీ కోసం ఇచ్చిన విందు సందర్భంగా ప్రదర్శన ఇవ్వడానికి తమకు అవకాశం, గౌరవం దక్కిందని పెన్ మసాలా గ్రూప్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వైట్ హౌస్లో వేలాది మంది భారతీయుల సమక్షంలో ప్రదర్శన ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ బ్యాండ్ ఇంతకుముందు అప్పటి ప్రెసిడెంట్ ఒబామా కోసం వైట్ హౌస్లో, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చింది. పిచ్ పర్ఫెక్ట్ 2 అనే హాలీవుడ్ చిత్రానికి సౌండ్ట్రాక్ అందించింది. దీనికి 2015లో ఉత్తమ సౌండ్ట్రాక్గా అమెరికన్ మ్యూజిక్ అవార్డు లభించడం విశేషం. -
ఫేస్బుక్ పరిచయం.. నాతో శారీరకంగా కలవకపోతే, నీ బండారం బయటపెడతా
సాక్షి, వెంగళరావునగర్(హైదరాబాద్): గత కొంతకాలంగా ఓ యువతిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న యువకుడిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన యువతికి, అదే జిల్లాకు చెందిన గోపీ అనే యువకుడితో ఫేస్బుక్లో పరిచయం అయింది. అదికాస్త ప్రేమకు దారితీసింది. తనకు ఉద్యోగం లేదని, నగరంలో ఉద్యోగం ఉంటే ఇప్పించాలని కోరాడు. దాంతో ఆమె తాను పని చేస్తున్న కనకనదుర్గా స్టీల్స్ కంపెనీలోనే ఉద్యోగం కూడా ఇప్పించింది. ఈ క్రమంలో ఇరువురు దగ్గరయ్యారు. అతనికి అనేకమార్లు వేలాదిరూపాయలు నగదును కూడా సహాయం చేసింది. అయితే కొంతకాలంగా గోపి మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో స్నేహంలో ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన ఫేస్బుక్ స్నేహితురాలు గోపీని దూరం చేసింది. తన వద్దకు రావద్దని, మాట్లాడవద్దని తిరస్కరిస్తూ వస్తుంది. దీనికి ఆగ్రహించిన గోపి తనతో గతంలో మాదిరిగా ఉండాలని, డబ్బులు ఇవ్వాలని, శారీరకంగా కలవాలని బెదిరించడం ప్రారంభించాడు. దీనికి ఒప్పుకోకుండా అతనిని ఆమె తిరస్కరించడంతో గతంలో ఇరువురు కలిసి ఉన్న ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించడంతో ఆమె శనివారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధురానగర్ పోలీసులు గోపీపై 354 (డి), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుని కోసం గాలిస్తున్నారు. చదవండి: వివాహితపై కన్నేసి.. కోరిక తీర్చమన్నాడు.. ఇద్దరూ వెళ్లి -
ఛీ.. వీళ్లేం స్నేహితులు.. బర్త్డే అని పిలిచి గొడ్డుని బాదినట్లు
మానవ సంబంధాలలో స్నేహానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక దీని గొప్పతనాన్ని చూపిస్తూ సినిమాలు కూడా బోలెడు ఉన్నాయి. రక్త సంబంధం ఉన్న వారితో పంచుకోలేనివి కూడా స్నేహ బంధం ఉన్నవారితో పంచుకుంటాం. అంతటి ప్రత్యేక గుర్తింపు ఉంది కనుకే... దీనికి గుర్తుగా ఫ్రెండ్షిప్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటుంటాం. అయితే ప్రస్తుత రోజుల్లో ఇలాంటివి మాటలు వినడమే తప్ప.. కంటికి కనిపించే ఘటనలు చాలా అరుదనే చెప్పాలి. ఇటీవల రోజుల్లో చాలా మంది అవసరం, అవకాశం కోసం మాత్రమే స్నేహం చేస్తున్నట్లు అనిపిస్తుంటుంది. చిన్న చిన్న కారణాలతో స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టేవాళ్లు కొందరైతే.. దెబ్బలాడుకునే వాళ్లు ఇంకొందరు ఉన్నారు. వీళ్లంతా ఒకవైపు అయితే మరికొందరు స్నేహితులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని వాళ్లున్నారు. ఈ తరహాలోనే పుట్టినరోజు అని పిలిచి తమ ఫ్రెండ్ని చితకబాదారు కొందరు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ దారుణ ఘటన మదనపల్లెలో చోటు చేసుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. ఓ కుర్రాడిని తన స్నేహితులు.. పుట్టిన రోజు పార్టీ ఉందని పిలిపించారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆ కుర్రాడు వెళ్లగానే.. అతనిపై తన మిత్రులు దాడికి దిగారు. ఫ్రెండ్ అని మరిచి విచక్షణారహితంగా చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక ఆ కుర్రాడు... తనను కొట్టద్దు అని కాళ్లావేళ్లా పడ్డా, వాళ్లు కనికరం లేకుండా అతడిని గొడ్డుని బాదినట్లు బాదారు. కాగా ఆ బ్యాచ్ తమ ఫ్రెండ్పై ఈ రకంగా దాడి చేయడానికి కారణం.. మరో స్నేహితుడిని కొడుతుంటే వద్దు అని చెప్పాడంట. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. వీడియో లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆరో తరగతిలోనే పెళ్లి.. చదువు వద్దన్న తండ్రి.. తగ్గేదేలేదన్న భార్య
'పట్టు పట్టరాదు పట్టి విడువరాదు.. పట్టెనేని బిగియ పట్టవలయు..' అనే వేమన పద్యం అందరికీ తెలిసే ఉంటుంది. రాజస్థాన్కు చెందిన ఓ యువకునికి వేమన చెప్పిన మాటలు సరిగ్గా సరిపోలుతాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రయత్నాన్ని విడువకుండా తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ఈ కుర్రాడు. ఇంతకీ ఇతను ఏం సాధించాడు. విజయ సాధనలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటో తెలుసుకుందాం పదండి.. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల ఫలితాలు గత వారం విడుదలయ్యాయి. డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకోవడానికి చాలా మంది అభ్యర్థులు పోటీ పడి విజయం సాధించారు. ఇందులో రాజస్థాన్కు చెందిన యువకుడు రామ్లాల్ కూడా ఉన్నాడు. ఏకంగా 490 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అయితే.. నీట్లో పాస్ అయినవాళ్లందరి ప్రయత్నం ఓ వైపు.. రామ్లాల్ కృషి మరో వైపు.. 11 ఏళ్లకే బాల్య వివాహం.. రామ్లాల్ చిత్తోర్గఢ్లోని ఘోసుండా ప్రాంతంలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ యువకునికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఏదైనా గొప్పగా సాధించాలనే కలలు కనేవాడు. చదువుల్లో మంచిగా రాణిస్తున్న ఇతనికి 11 ఏళ్లకే బలవంతంగా బాల్య వివాహం చేశారు కుటుంబ సభ్యులు. అప్పుడు అతను కేవలం 6వ తరగతి చదువుతున్నాడు. 11 ఏళ్లకు పెళ్లిపీటలెక్కిన రామ్లాల్ భార్య సహకారంతో.. తన కల నీరుగారిపోయిందనుకున్న రామ్లాల్కు భార్య సహకారం తోడయింది. ఆయన భార్య పదో తరగతి వరకు చదువుకుంది. పుస్తకం విలువ తెలిసిన ఆమె భర్తకు అండగా నిలబడింది. రామ్లాల్ తండ్రికి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా.. తన భర్త చదువుకోవడానికి పూర్తి తోడ్పాటును అందించింది. దీంతో రామ్లాల్ 10వ తరగతిలో 74 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం తనకు ఇష్టమైన సైన్స్ విభాగాన్ని ఎంచుకున్నాడు. నీట్ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. అలుపెరుగని ప్రయత్నం.. 2019లో మొదటి సారి నీట్ పరీక్షను రామ్లాల్ రాశాడు. 720 మార్కులకు గాను 350 వచ్చాయి. మెరుగైన ఫలితాలు రాలేదు. కానీ ఏ మాత్రం క్రుంగిపోకుండా ప్రయత్నాన్ని మళ్లీ మొదలుపెట్టాడు. కోటా నగరానికి చేరుకుని కోచింగ్ సెంటర్లో చేరి మెలుకువలు నేర్చుకున్నాడు. ఈ సారి 632 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎంబీబీఎస్ కలను సాకారం చేసుకున్నాడు. 350 మార్కుల నుంచి ఐదో సారికి 632కి చేరుకున్నానని రామ్లాల్ చెబుతున్నాడు. కృషి ఉంటే మనుషులు ఏదైనా సాధించవచ్చని అంటున్నాడు. తన భార్య ఇచ్చిన సహకారాన్ని కొనియాడుతున్నాడు. ఇక నీట్ 2023 పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలోనే రామ్లాల్ దంపతులకు పాప పుట్టడం మరో విశేషం. ఇదీ చదవండి: 5 తరాలు, 85 మంది కుటుంబ సభ్యులు.. 102 ఏళ్ల బామ్మకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు -
హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు!
సాక్షి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, వాటి పరిసరాల్లో వివాహాలు చేసుకోకూడదన్న నిబంధనను ధిక్కరించి మరీ వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన హిజ్రా పింకి, హైదరాబాద్కు చెందిన యువకుడు శ్రీనివాస్ ఒకరినొకరు ఇష్టపడి శనివారం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఐదేళ్లుగా కలిసే ఉంటున్న వీరి పెళ్లికి ఇరువురు పెద్దలూ అంగీకరించడంతోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, అమావాస్య పేరుతో అధికారులెవరూ విధులకు హాజరుకాకపోవడం కూడా ఈ జంటకు కలిసొచ్చింది. చదవండి: బస్సులోనే చనిపోయిన ప్రయాణికుడి మృతదేహాన్ని అదే బస్సులో ఇంటికి చేర్చిన సిబ్బంది -
మన సంస్కృతితో యువత బంధం బలీయం: ప్రధాని
న్యూఢిల్లీ: మన దేశ అద్భుతమైన వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం, గౌరవించడం కోసం కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా చేపట్టిన అనేక చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. ఘనమైన మన సాంస్కృతిక వారసత్వ సంపద మనకు గర్వకారణమన్నారు. తమ ప్రభుత్వం సాగించిన ప్రయత్నాల ఫలితంగానే మన యువతకు సంస్కృతితో బంధం బలపడిందని అన్నారు. శనివారం ఆయన ట్విట్టర్లో ‘9ఇయర్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ కల్చర్’పేరుతో హాష్ట్యాగ్ చేశారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆయన పలు ట్వీట్లు చేశారు. దేశ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. -
యువకుల పిచ్చిచేష్టలు.. స్నేహితుడిని నగ్నంగా చేసి
శివాజీనగర(బెంగళూరు): తాగిన మత్తులో యువకుల బృందం తోటి స్నేహితుడిని నగ్నంగా చేసి పట్టణంలో పరుగెత్తించారు. ఈ కేసులో పోలీసులు రంజిత్, దయానంద్, ఆనంద్లను అరెస్ట్ చేశారు. వీరు హాసన్ జిల్లా అరకలగూడుకు చెందినవారు. ఈ యువకులు ఇటీవల అరకలగూడులో పార్టీ చేసుకున్నారు. తరువాత సహచరుడు డ్యాన్స్ చేయలేదన్న కోపంతో అతడిని నగ్నంగా చేసి పట్టణంలో పరుగెత్తించారు. యువకుల పిచ్చి చేష్టలు సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ముగ్గురి అరెస్ట్ చేశారు. చదవండి: సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు! -
హిందూ యువకుని ‘ముస్లిం వ్యవహారం’.. తండ్రి ఫిర్యాదుతో..
దేశంలో హిందూ- ముస్లిం వివాదాలకు సంబంధించిన ఉదంతాలు తరచూ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఇదే కోవలో తాజాగా డెహ్రాడూన్లో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ పరిధిలోని డోయీవాలా ప్రాంతంలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక యువకుని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమారుడు ఇంటిలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. తన 24 ఏళ్ల కుమారుడు ఇంటిలో ఉన్నట్టుండి నమాజ్ చేస్తున్నాడని, అలాగే అతని లాప్టాప్, మొబైల్ ఫోన్లలో ఆశ్చర్యకరమైన డేటా ఉందని తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం వైభవ్ బిజ్లవాణ్(24) గత మూడేళ్లుగా డిప్రెషన్లో ఉన్నాడు. అతనికి ఇస్లాంపై విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. పోలీసుల విచారణలో అతని ల్యాప్ టాప్, మొబైల్ ఫోను నుంచి సేకరించిన సమాచారం ప్రకారం వైభవ్ ముస్లిం మతానికి సంబంధించిన ఆచారవ్యవహారాలను నేర్చుకుంటున్నాడు. ప్రతీరోజూ వీటిని అనుసరిస్తున్నాడు. పోలీసుల దర్యాప్తులో.. వైభవ్ తన గది నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదని, గత మూడేళ్లుగా డిప్రెషన్తో బాధపడుతున్నాడని వెల్లడయ్యింది. పోలీసులు వైభవ్కు సైకలాజికల్ టెస్ట్ చేయిస్తున్నారు. డెహహ్రాడూన్ పోలీసు అధికారి దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఆ యువకుడు నిత్యం గదిలోనే ఉంటున్నాడని, దీనిపై అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. తమ బృందం పరిశీలనలో ఆ యువకుడు డిప్రెషన్లో బాధపడుతున్నాడని తెలిసిందన్నారు. ఆన్లైన్లో ఇస్లాం ఆచారాల గురించి తెలుసుకుంటున్నాడని, ఉర్దూ నేర్చుకుంటున్నాడని తెలిపారు. ఆ యువకునికి సంబంధించిన మెడికల్ రిపోర్టు రాగానే తదుపరి చర్యలు చేపడతామన్నారు. చదవండి: జులై 1 నుంచి అమర్నాథ్ యాత్ర -
ఆన్లైన్ గేమ్లతో ఆనందం ఆవిరి.!
విశాఖ విద్య: ‘పెదవాల్తేరుకు చెందిన అవినాష్ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. రాత్రి వేళ నిద్రలో కూడా వింత వింత శబ్దాలు చేస్తున్నాడు. బాలుడి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు ఏమైందోననే ఆందోళనతో వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. రెండు పర్యాయాల పరిశీలన అనంతరం బాలుడి అసలు సమస్యను వైద్యులు గుర్తించారు. గంటల తరబడి సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్లు ఆడడం వల్ల అబ్బాయి మొదడుపై ప్రభావం చూపిందని తేచ్చిచెప్పారు. స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంచి, కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు’. విశాఖ నగరంలోని ఒక్క అవినాషే కాదు.. వందలాది మంది విద్యార్థులు, యువత ఆన్లైన్ గేమ్లతో రేయింబవళ్లు కాలక్షేపం చేస్తూ మానసిక ఆనందానికి దూరమైపోతున్నారు. స్మార్ట్ ఫోన్తో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగం బాగా పెరిగింది. పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సిందే. దీంతో స్మార్టు ఫోన్లు వినియోగం తప్పనిసరైంది. అయితే స్మార్ట్ ఫోన్తో ఎంతటి లాభం ఉందో, అదే స్థాయిలో నష్టాన్ని చేకూరిస్తోంది. బెట్టింగ్కు బలైపోతున్న యువత గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. విశాఖ కేంద్రంగా సాగుతున్న బెట్టింగ్ మాఫియాను పోలీసులు సైతం గుర్తించారు. వివిధ యాప్స్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ పేకాటకు అన్ని వర్గాల వారు బానిసలైపోతున్నారు. దీంతో పాటు డ్రీమ్ యాప్ ద్వారా క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ ఆటలు ఉన్నాయి. గేమ్లో కొంత మందిని ఎంపిక చేసుకుని బెట్టింగ్ పెడతారు. వారు బాగా ఆడినట్లైతే వచ్చే పాయింట్లు బట్టి గెలుపును నిర్ధారిస్తారు. ప్రైజ్ మనీగా రూ.10 నుంచి రూ.లక్ష వరకు ఉండడంతో ఎక్కువ మంది ఈ గేమ్లోనే మునిగి తేలుతూ డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, సమయం వృథా చేస్తూ వాటికి బానిసలైపోతున్నారు. పబ్జీతో మొద్దుబారుతున్న మెదడు కొన్నేళ్లు బ్యాన్ చేసిన పబ్జీగేమ్ మళ్లీ సరికొత్త గా స్మార్ట్ఫోన్లోకి వచ్చి చేరింది. పబ్జీతో పాటు, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ఆన్లైన్ ఆటలు ఎక్కువ మంది ఆడుతున్నారు. వీటిని నలుగురు కలసి ఒకేసారి ఆడవచ్చు. వేర్వేరు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా సరే నలుగురు మాట్లాడుకుంటూ గేమ్లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఎక్కువగా పాఠశాల, కాలేజీ స్థాయి విద్యార్థులు పబ్జీ గేమ్లకు బానిసలవుతున్నారు. ఆన్లైన్ గేమ్లతో ప్రమాదం పిల్లలు, అందులోనూ చదువుకునే వారు ఆన్లైన్ గేమ్లు ఆడటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఆన్లైన్ గేమ్ల వల్ల మానసిక ఆనందం కోల్పోతారు. మొదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శారీరకంగా అలసట కలిగే ఆటలు ఆడుకోవాలి. పుస్తక పఠనం మంచి పద్ధతి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమైనదే. – డాక్టర్ రమేష్బాబు, మానసిక వైద్య నిపుణులు, విశాఖపట్నం తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి ఏదో కాలక్షేపం కోసమని కొద్దిసేపు ఆన్లైన్ గేమ్ ఆడితే పరవాలేదు. కానీ అదే పనిగా గంటల తరబడి స్మార్ట్ఫోన్కు అతుక్కుపోతుంటే, ఓ కంట కనిపెట్టాల్సిందే. ఈ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లాడి ఆనందం కోసమని స్మార్ట్ఫోన్ ఇచ్చేసి, వదిలేయకూడదు. వారితో రోజులో కొద్దిసేపు అయినా గడిపి, కబుర్లతో కాలక్షేపం చేయాలి. – డాక్టర్ జి.సీతారాం, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు -
వెబ్ సిరీస్ చూసి ముగ్గురు మిత్రుల దోపిడీ యత్నం
కోరికలనేవి అందరికీ ఉంటాయి. అయితే అవి తీరనివిగా మారినప్పుడు కొందరు పెడదారి పడుతుంటారు. కోరికలు తీర్చుకునేందుకు అవసరమైన డబ్బుల కోసం కొందరు ఎంతకైనా దిగజారుతుంటారు. ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే లక్నోకు చెందిన ముగ్గురు స్నేహితులకు బర్త్డే పార్టీ చేసుకునేందుకు రూ. 25 వేలు అవసరం అయ్యాయి. వారు చూసిన ఒక వెబ్ సిరీస్లోని కథనాన్ని అధారంగా చేసుకుని దోపిడీకి పథకం వేసుకున్నారు. తరువాత వీరు ముఖానికి ముసుగులు ధరించి స్థానికంగా ఉన్న ఒక జ్యూయలరీ దుకాణానికి వెళ్లారు. తరువాత వారు ఒక తుపాకీ తీసి, దుకాణం యజమానిని బెదించారు. అయితే వారి ప్రయత్నం విఫలమయ్యింది. వెంటనే వారు అక్కడి నుంచి పరారయ్యారు. దుకాణం యజమాని ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దీని ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నిందితులలో ఇద్దరు ఖదరా, ఒకరు మండియావ్ ప్రాంతానికి చెందినవారన్నారు. వీరిలో ఇద్దరు మాస్క్ ధరించారని, ఒకరు రుమాలు ముఖానికి చుట్టుకున్నాడన్నారు. మే 30 వీరు స్థానికంగా ఉన్న మహేశ్వరి జ్యూయలర్స్లో దోపిడీకి ప్రయత్నించారని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీరిని పట్టుకున్నామన్నారు. నిందితులను కోర్టుకు అప్పగించామని, వారి దగ్గర నుంచి నంబరు ప్లేటులేని స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చదవండి: ఉంగరం కావాలని మొండికేసిన వరుడు.. అలా అతని తిక్క కుదిర్చిన వధువు