జెట్ బ్లాస్ట్.. ఇండిగోకు ప్రమాదం
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి ముంబై వెళ్లడానికి టేకాఫ్కు సన్నద్ధమవుతున్న ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. పార్కింగ్ బేలోకి వచ్చిన స్పైస్జెట్ విమానం జెట్ బ్లాస్ట్ అయింది. దీని ప్రభావంతో ఇండిగో విమానంలో విండో పగిలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని ఇండిగో అధికార ప్రతినిధి చెప్పారు. ఆ బ్లాస్ట్ ప్రభావంతో తమ ఎయిర్క్రాఫ్ట్ కుడివైపు ముందున్న విండో పగిలిపోయినట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయని చెప్పారు. వెంటనే వారిని ఎయిర్పోర్టులోని క్లినిక్కు తరలించి, చికిత్స అందించనట్టు చెప్పారు. ఈ ప్రమాదంపై ఏవియేషన్ వాచ్డాగ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ జరుపుతోంది.
''ఇండిగో కోచ్ నెంబర్ 34 ఈబే 17లో శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు ఢిల్లీ-ముంబై మార్గంలో వెళ్లే బోర్డింగ్ ప్రయాణికులతో సిద్ధంగా ఉంది. అదే సమయంలో స్పైస్జెట్ ఎస్జీ-253 ఎయిర్క్రాఫ్ట్ వచ్చింది. దానికి కేటాయించిన బేలో పార్కింగ్ చేసుకునేందుకు టర్న్ అవుతోంది. ఆ సమయంలో జెట్ బ్లాస్ట్ అయింది. దీంతో ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ముందున్న కుడివైపు విండో గ్లాస్ పగిలిపోయింది'' అని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రమాదంపై స్పైస్జెట్ స్పందించలేదు.