న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే గాంగిలీని తొలగించాలంటూ రాజ్యసభలో 58 మంది సభ్యులు అభిశంసన నోటీసులు ఇచ్చారు. గ్వాలియర్ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు మహిళా న్యాయమూర్తిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై జస్టిస్ గాంగిలీపై గురువారం విపక్ష సభ్యులు ఈ నోటీసులు ఇచ్చారు. జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ప్రతిపాదనకు కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ సహా పలు ఇతర పార్టీల సభ్యులు మద్దతు ప్రకటించారు. న్యాయరంగానికి చెందిన పలువురు తనను కలసి ఈ అంశాన్ని సభలో లేవనెత్తాల్సిందిగా కోరారని, జస్టిస్ గాంగిలీ వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని అందించారని శరద్యాదవ్ తెలిపారు. దాంతో ఆ జడ్జి అభిశంసనకు అర్హుడని తాను భావించానన్నారు.