చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు ఆదివారం సాయంత్రం పూర్తయ్యాయి. చెన్నైలోని అళ్వార్ పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పోలింగ్ ముగిసింది. ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్, జీవ, గౌతమి, సంగీత, కుష్బూ, సుహాసిని, విజయ్లతోపాటు చలన చిత్రారంగానికి చెందిన పలువురు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఏ సమయంలోనైనా ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతుంది. ఈసారి కూడా ఆ బృందమే మళ్లీ పగ్గాలు చేపట్టాలని భావించింది. అయితే ప్రముఖ నటుడు విశాల్ బృందం కూడా పోటీకి దిగడంతో ఎన్నికలు అనివార్యమైనాయి. అటు శరత్కుమార్ వర్గం... విశాల్ వర్గం ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగడంతో సామరస్యంగా జరగాల్సిన ఈ ఎన్నికలు హోరాహోరిగా మారాయి. ఈ రెండు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి నెలకొంది.
దాంతో నడిగర్ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఓ విధంగా చెప్పాలంటే సీనియర్, జూనియర్ నటుల మధ్య పోటీగా మారింది. హీరో విశాల్పై శరత్కుమార్ వర్గీయులు ఆదివారం ఉదయం దాడి చేయడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ దాడిలో విశాల్ ఎడమ చేతికి గాయమైంది. నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓటమి భయంతోనే తనపై దాడికి పాల్పడుతున్నారని విశాల్ ఆరోపించారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శరత్కుమార్ వర్గానికి మద్దతు తెలుపుతున్నట్టు సమాచారం.
ఈ ఎన్నికల్లో రజనీ తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. విజేతలు హామీలు నెరవేర్చకుంటే పదవికి రాజీనామా చేయాలని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పూర్తవగానే ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న పద్మనాభన్ ప్రకటిస్తారు.
నడిగర్ ఎన్నికలు.. సర్వత్రా ఉత్కంఠ
Published Sun, Oct 18 2015 6:00 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement