
సత్వర పరిష్కారానికి పనితీరు సూచీ
పెండింగ్ కేసులపై నీతి ఆయోగ్ సూచన
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థ పనితీరు సూచీను ఏర్పాటు చేయడం ద్వారా కింది కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించ వచ్చని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించింది. దీంతో పాటు ఆన్లైన్ వ్యవస్థ ద్వారానే న్యాయవ్యవస్థలో నియామకాలను చేయాలని కూడా సూచించింది.హైకోర్టులు, హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవ్యవస్థ పనితీరు సూచీలతో పర్యవేక్షించి జిల్లా కోర్టుల్లోనూ, సబార్టినేట్ స్థాయిల్లోనూ జరిగే ఆలస్యాన్ని నివారించవచ్చని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో అభిప్రాయ పడింది.
మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సమాచారం, ప్రస్తుతమున్న మౌలిక వసతులు, సూచనలతో పాటు కేసులు ఎంతకాలం నుంచి పెండింగ్ లో ఉంటున్నాయి, ఎంత శాతం కేసులు పెండింగ్లో ఉంటున్నాయి వంటి అంశాలను గత ఏడాది సమాచారంతో పోల్చి చూడవచ్చని నివేదికలో పేర్కొంది. కోర్టు పనితీరులో ప్రపంచశ్రేణి ప్రమాణాలను పాటించేందుకు ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జ్యుడీషియల్ అడ్మినిస్ట్రేషన్, ది ఫెడరల్ జ్యుడీషియల్ సెంటర్ (యూఎస్), ది నేషనల్ ఆఫ్ కోర్ట్స్ (యూఎస్), సింగపూర్లోని సబా ర్డినేట్ కోర్టులను అధ్యయనం చేయాలని కూడా సూచించింది.