Pending cases
-
తాత్కాలిక జడ్జీలను నియమించుకోండి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హైకోర్టులో 18 లక్షలకుపైగా క్రిమినల్ కేసులు పోగుబడటంతో ఆ కేసుల కొండ కరిగించేందుకు హైకోర్టులకు సుప్రీంకోర్టు అదనపు అధికారాలిచ్చింది. సొంతంగా తాత్కాలిక ప్రాతిపదికన న్యాయమూర్తులను నియమించుకునేందుకు హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రెండు లేదా మూడేళ్ల కాలానికి జడ్జీల నియామకానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టుల్లో ఇలా అదనపు జడ్జీల నియాకంపై 2021 ఏప్రిల్ 20వ తేదీన విధించిన షరతుల అమలును తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ‘‘హైకోర్టుల వారీగా ఆ కోర్టులో అనుమ తించిన సామర్థ్యంలో 10 శాతానికి మించి తా త్కాలిక జడ్జీలను తీసుకోవద్దు. ఇద్దరు లేదా ఐదుగురు జడ్జీలను తీసుకోండి. సిట్టింగ్ జడ్జి సూ చించిన ధర్మాసనంలో కొత్త జడ్జీలు కూర్చోవాలి. పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులను మాత్రమే వినాలి. డివిజన్ బెంచ్లో భాగ స్వాములుగా ఉన్నాసరే శాశ్వత జడ్జీలతోపాటు కాకుండా విడిగా కూర్చుని కేసులను పరిష్కరించాలి’’ అని సుప్రీంకోర్టు గురువారం స్పష్టంచేసింది. షరతులను విధిస్తూ గతంలో నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ఏ బోబ్డే ఆ తీర్పు చెప్పారు. రిటైర్ అయిన హైకోర్టు జడ్జీలను కేవలం ఒక్కసారి మాత్రమే రెండు లేదా మూడేళ్ల కాలానికి తాత్కాలిక జడ్జీగా నియమించుకోవచ్చని ఆయన తీర్పు చెప్పడం తెల్సిందే. నేషనల్ జుడీషియల్ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా హైకోర్టులో 62 లక్షల కుపైగా కేసులు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిలో 18 లక్షలకు పైగా క్రిమినల్ కేసులున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224ఏ ప్రకారం గతంలో హైకోర్టులో జడ్జిగా చేసి రిటైర్ అయిన వాళ్లను అవసరమైతే తిరిగి తాత్కాలిక జడ్జీలుగా నియమించవచ్చు. అయితే ఈ నిబంధనను కేంద్రప్రభుత్వం అత్యంత అరుదుగా వినియోగించుకుందని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
జడ్జీలపై పెండింగ్ కేసుల కొండ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని న్యాయస్థానాలన్నీ కేసుల భారం, విపరీతమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నాయి. పెరుగుతున్న కేసుల కొండను కరిగించేంత స్థాయి పరిమాణంలో న్యాయమూర్తులు లేరు. క్రింది స్థాయి కోర్టులు మొదలు హైకోర్టు దాకా చాలా జడ్జీ పోస్టులు ఖాళీలున్నాయి. దీంతో ఉన్న కొద్దిమంది న్యాయమూర్తుల మీదనే విపరీతమైన పని భారం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4,94,907 కేసులు న్యాయస్థానాల్లో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో ఒక్కో న్యాయమూర్తిపై 9,144, ఆంధ్ర ప్రదేశ్లో 8,576 కేసుల భారం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం 4,54,55,345 పెండింగ్ కేసులు ఉండగా.. వాటిలో 57 శాతం సివిల్ కేసులు, 62 శాతం క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టులో 83,410 కేసులు పెండింగ్లో ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కేసులతో పెండింగ్ భారం విపరీతంగా పెరిగిపోతోందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తుత పరిస్థితులపై విచారం వ్యక్తం చేసింది. ‘2005 నాటికి ట్రయల్ కోర్టుల్లోని న్యాయమూర్తుల సంఖ్య ప్రతి 10లక్షల జనాభాకు 50 మంది జడ్జిలుగా ఉండాలని 2002లో ఉత్తర్వులు జారీ చేశాం. ఉత్తర్వులు జారీ చేసి 22 సంవత్సరాలు గడిచినా ఈ నిష్పత్తి 2024 ఏడాదిలో ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 25 మంది న్యాయమూర్తులకు చేరుకోలేదు’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. ఢిల్లీకి చెందిన ఓ సెషన్స్ జడ్జికి ఉపశమనం కలి్పస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. సెషన్స్ జడ్జికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఒక్కో న్యాయమూర్తికి సగటున 2 వేలకు పైగా కేసుల భారం ఉంది. మూడు హైకోర్టుల్లోని జడ్జీలపైనే అత్యధిక పనిభారం రాజస్థాన్, మధ్యప్రదేశ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులపై దేశంలోనే అత్యధిక పనిభారం ఉందని తెలుస్తోంది. 25 హైకోర్టుల్లో 61,09,862 కేసులు పెండింగ్లో ఉన్నాయి. దేశంలో పెండింగ్లో ఉన్న కేసుల విషయంలో ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉందని నివేదిక చూపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 6,56,141 కేసులు పెండింగ్లో ఉండగా కేవలం 32 మంది న్యాయమూర్తులు మాత్రమే ఈ కేసుల పరిష్కారానికి బాధ్యత వహిస్తున్నారు. ఇక్కడ సగటున ప్రతి న్యాయమూర్తి 20,504 కేసుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మొత్తం పాతిక హైకోర్టులలో ఇదే అత్యధికం. దీని తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు రెండో స్థానంలో నిలిచింది. 4,69,462 కేసుల పరిష్కారం బాధ్యత 35 మంది న్యాయమూర్తులపై ఉంది. ఇక్కడి న్యాయమూర్తిపై సగటున 13 వేల 414 కేసుల భారం ఉంది. అలాగే అలహాబాద్ హైకోర్టు దేశంలోనే మూడో స్థానంలో ఉంది. 10,67,614 కేసులను పరిష్కరించే బాధ్యత 82 మంది న్యాయమూర్తులపై ఉంది. -
ఇది ‘న్యాయ’మేనా!
ప్రతిష్టాత్మక న్యాయ సంస్థలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్తలకు సారథులు లేక అనాధలుగా మారాయి. హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ముగిసి ఏడునెలలు గడిచింది. అలాగే, లోకాయుక్త చైర్మన్ పదవి కాలం కూడా సెప్టెంబరు 14తో ముగిసింది. దీంతో రెండు సంస్థలకు సారథులు లేకపోవడంతో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. నిజానికి.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీరి నియామకాలు 90 రోజుల్లో జరపాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో పేదలకు ఉచిత న్యాయ సేవలు అందడంలేదు. –కర్నూలు (సెంట్రల్)ఏడు నెలలు గడిచినా చలనంలేదు..రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా మాంథాత సీతారామమూర్తి, జ్యూడిషియల్ సభ్యుడిగా దండే సుబ్రమణ్యం, నాన్ జ్యూడిషియల్ æసభ్యుడు జి. శ్రీనివాసరావుల మూడేళ్ల పదవి కాలం 2024 మార్చి 23తో ముగిసింది. దీంతో అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15 నుంచి 30 వరకు కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, ఎన్నికలు రావడంతో అప్పట్లో ఈ ప్రక్రియ ఆగిపోయింది. చైర్మన్గా సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తిగా పనిచేసిన వారిని.. జ్యూడిషియల్ సభ్యుడిగా న్యాయ సంబంధ అంశాల్లో పట్టున్న వారు, నాన్ జ్యూడిషియల్ సభ్యుడు ఎన్జీఓల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారిని ఎంపిక చేస్తారు.ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, స్పీకర్, కేబినెట్లో సీనియర్ మంత్రి, శాసనమండలి చైర్మన్, విపక్ష నేత సభ్యులుగా ఉండే ప్యానల్ చైర్మన్, సభ్యులను ఎంపిక చేసి గవర్నర్కు పంపితే ఆయన ఆమోదం తరువాత కమిషన్ మూడేళ్లపాటు అమల్లోకి వస్తుంది. కాగా, హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యుల నియామకం కోసం స్వీకరించిన అర్జీలు న్యాయశాఖ దగ్గర పెండింగ్లో ఉన్నాయి.లోకాయుక్తలో స్తంభించిన కార్యకలాపాలు..ఇక లోకాయుక్త చైర్మన్గా జస్టిస్ పి. లక్ష్మణ్రెడ్డి పనిచేశారు. 2024 సెప్టెంబర్ 14న ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఆ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఈ క్రమంలో లోకాయుక్తలో కార్యకలాపాలు స్తంభించాయి. లోకాయుక్త చైర్మన్ను కూడా సీఎం, ప్రతిపక్ష నేత, స్పీకర్, సీనియర్ మంత్రి, శాసన మండలి చైర్మన్, విపక్ష నేతలతో కూడిన కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ ఎంపిక చేస్తారు. లోకాయుక్త చైర్మన్గా సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులుగా పనిచేసిన వారిని నియమిస్తారు. మూడేళ్ల నుంచి కర్నూలు కేంద్రంగా..రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త సంస్థల ద్వారా ఏటా ఒక్కోదానిలో దాదాపు వెయ్యికి పైగా కేసులు పరిష్కారమవుతాయి. పైగా ఆయా సంస్థల్లో పైసా ఖర్చులేకుండా న్యాయ ఫిర్యాదులు చేసుకునే వీలుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తమ ఫిర్యాదులను పంపుతారు. లెటర్ రాసి పంపినా కేసు నమోదు చేస్తారు. లేదంటే.. ఆయా సంస్థల ఈ–మెయిళ్లు, వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేసినా వాది, ప్రతివాదులకు నోటీసులిచ్చి విచారణలు జరుపుతుండడంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు వీటిని ఆశ్రయిస్తున్నారు.పేదలకు ఉచిత న్యాయ సేవలు..హెచ్ఆర్సీ, లోకాయుక్తల ద్వారా పేదలకు ఉచిత న్యాయ సేవలు అందుతాయి. న్యాయం కోసం పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా హెచ్ఆర్సీ, లోకాయుక్తలను ఆశ్రయించి న్యాయం పొందుతారు. కానీ, ఇప్పుడివి లేకపోవడంతో ఆయా సంస్థల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. – కృష్ణమూర్తి, బార్ అసిసోయేషన్ అధ్యక్షుడు, కర్నూలు -
కేసుల పరిష్కారానికి గడువు పెట్టలేం
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కోర్టుల్లో కేసులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇది అమెరికా సుప్రీంకోర్టు కాదని వ్యాఖ్యానించింది. అలా గడువు పెట్టలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అన్ని కోర్టుల్లో దాఖలయ్యే కేసులను 12 నుంచి 36 నెలల్లోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. విదేశాల్లో కేసుల పరిష్కారానికి నిర్దిష్ట గడువు ఉన్న విషయాన్ని పిటిషనర్ ఎత్తిచూపగా.. ‘మాది అమెరికా సుప్రీంకోర్టు కాదు’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో అన్ని కేసుల్లోనూ 12 నెలల్లో విచారణా పూర్తికావాలని కోరుకుంటున్నారా? అని పిటిషనర్ను ప్రశ్నించింది. ఇది అత్యంత అభిలషణీయమైనా.. ఆచరణసాధ్యం కాదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, జడ్జిల సంఖ్య పెంచడం.. లాంటివెన్నో అవసరమవుతాయన్నారు. అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాల్లో ఒక ఏడాదిలో సుప్రీంకోర్టులు ఎన్ని కేసులు పరిష్కరిస్తాయో మీకు తెలుసా? అని పిటిషనర్ను అడిగారు. కొన్ని పాశ్చాత్యదేశాల సుప్రీంకోర్టులు ఏడాది మొత్తం పరిష్కరించే కేసుల కంటే భారత సుప్రీంకోర్టు ఒక్కరోజు వినే కేసులే ఎక్కువన్నారు. భారత్లో అందరికీ న్యాయం పొందే అవకాశాన్ని మన వ్యవస్థ కల్పిస్తోందని, ఎవరినీ అడ్డుకోలేమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. -
సీబీఐ దర్యాప్తు పూర్తయినా 6,900 కేసులు కోర్టుల్లోనే పెండింగ్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేసిన 6,900కుపైగా అవినీతి కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 361 కేసులు ఏకంగా 20 ఏళ్లుగా కోర్టుల్లోనే మూలుగుతున్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన వార్షిక నివేదికలో ఈ దిగ్భ్రాంతికర నిజాలను వెల్లడించింది. 2023 డిసెంబర్ 31వ తేదీ నాటికి అందిన వివరాలను అందులో పేర్కొంది. సీబీఐ విచారణ కోసం ఎదురు చూస్తున్న 658 అవినీతి కేసుల్లో 48 కేసులు ఐదేళ్లకు పైగా పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. దిగువ కోర్టుల్లోని మొత్తం 6,903 కేసులకు గాను 1,379 కేసులు మూడేళ్ల లోపు, 875 కేసులు మూడు నుంచి ఐదేళ్లుగా విచారణ కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపింది. మరో 2,188 కేసులు ఐదు నుంచి పదేళ్లుగా విచారణకు నోచుకోలేదని పేర్కొంది. దాదాపుగా 2,100 అవినీతి కేసులు దర్యాప్తు ముగిశాక కూడా పదేళ్ల నుంచి 20 ఏళ్లుగా కోర్టుల్లో నానుతున్నాయని, మరో 361 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉండటం మరీ దారుణమని పేర్కొంది. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న మొత్తం 6,903 కేసులకుగాను 2,461 కేసులు 10 ఏళ్లకు పైగా విచారణకు నోచుకోకపోవడం ఆందోళనకర పరిణామమంటూ వ్యాఖ్యానించింది. సీబీఐతోపాటు నిందితులు దాఖలు చేసిన 12,773 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని సీవీసీ వివరించింది. ఇందులోని 501 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు 20 ఏళ్లుగా ఆయా కోర్టుల్లో మూలుగుతున్నాయంది. అధిక పని ఒత్తిడి, సిబ్బంది కొరత, సంబంధిత అధికారుల నుంచి విచారణ అనుమతుల్లో జాప్యం వంటివి దర్యాప్తు సకాలంలో ముగించడానికి అవరోధాలుగా ఉన్నాయని వివరించింది. సీబీఐకి మంజూరైన 7,295 పోస్టులకుగాను 2023 డిసెంబర్ 31వ తేదీ నాటికి 1,610 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీవీసీ నివేదిక తెలిపింది. అదే సమయంలో సీబీఐ అధికారులపై 82 శాఖాపరమైన చర్యలు పెండింగ్లో ఉన్నట్లు కూడా తెలిపింది. -
CJI D Y Chandrachud: వారం రోజుల స్పెషల్ లోక్ అదాలత్
న్యూఢిల్లీ: వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, తద్వారా పెండింగ్ భారాన్ని తగ్గించుకునేందుకు సుప్రీంకోర్టు సోమవారం ప్రత్యేక లోక్ అదాలత్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులోని మొదటి ఏడు ధర్మాసనాలు మధ్యాహ్నం 2 గంటలకు కేసులను విచారిస్తాయి. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వెల్లడించారు. ప్రత్యేక లోక్ అదాలత్ వారం పాటు కొనసాగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్న కక్షిదారులు, లాయర్లు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడంలో కక్షిదారులకు సాయపడితే కలిగే తృప్తి వెల కట్టలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారంలో లోక్ అదాలత్ల ప్రాధాన్యతకు సంబంధించి స్వీయానుభవాన్ని ఉదాహరించారు. ‘‘నా ముందుకు ఒక విడాకుల కేసు వచి్చంది. భార్య నుంచి విడాకులు కోరుతూ భర్త కింది కోర్టుకు వెళ్లాడు. అతడి నుంచి పరిహారం, పాప సంరక్షణ హక్కులు కోరుతూ భార్య కూడా కోర్టుకెక్కింది. వారితో సామరస్యపూర్వకంగా మాట్లాడిన మీదట మనసు మార్చుకున్నారు. కలిసుండేందుకు ఒప్పుకున్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తామని చెబుతూ కేసులు వెనక్కు తీసుకున్నారు’’ అని వివరించారు. ఇలా లోక్ అదాలత్లు ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి! పైగా సోమవారం జరిగిన విచారణల కవరేజీ కోసం మీడియాను కోర్టు రూముల లోపలికి అనుమతించడం విశేషం. -
‘పెండింగ్’కు మంచి దోవ!
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల గురించి ఎవరికీ తెలియనిది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారు గతంలో చాలాసార్లు మాట్లాడారు. రిటైరయ్యే రోజున కూడా ఆ మాట చెప్పి నిష్క్రమించేవారు. తమ పదవీకాలంలో పెండింగ్ బెడదను సాధ్యమైనంత తగ్గించేందుకు పలు విధానాలు అమలు పరిచేవారు. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలంటూ ప్రధానికి బహిరంగ వినతులు చేసినవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మరో అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఈ శనివారం నుంచి వరసగా ఆరురోజులపాటు ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో సుప్రీంకోర్టులో లోక్ అదాలత్లు జరగకపోలేదు. కానీ ఎప్పుడో ఒకసారి జరిగే ఈ అదాలత్లకు పెద్దగా స్పందన ఉండేది కాదు. అందువల్లే ఈసారి వరసగా ఆరురోజులపాటు సాగించాలని ఆయన భావించారు. ఈ కార్యక్రమంలో పదివేల కేసుల్ని పరిష్కరించాలన్నది ఆయన లక్ష్యం. పైగా ఈ కేసుల పరిష్కారానికి లిటిగెంట్లకు పైసా ఖర్చుండదు. వీటిల్లో కార్మిక చట్టాలు, అద్దె, సేవలు, పరిహారం, కుటుంబ తగాదాలు, సాధారణ సివిల్ తగాదాలు, వినియోగదారుల కేసులు ఉంటాయి. జస్టిస్ చంద్రచూడ్ చెబుతున్న ప్రకారం సుప్రీంకోర్టులో ప్రస్తుతం 66,059 సివిల్ కేసులూ, 18,049 క్రిమినల్ కేసులూ ఉన్నాయి. రెండూ లెక్కేస్తే 84 వేల పైమాటే. ఇవిగాక వివిధ హైకోర్టుల్లో 44,03,152 సివిల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ చెబుతోంది. క్రిమినల్ కేసుల సంఖ్య 17,55,946. మొత్తంగా చూస్తే దాదాపు 62 లక్షలు! హైకోర్టుల్లో ఏడాదిగా పెండింగ్లో ఉన్నవి పది లక్షల సివిల్ కేసులు. ఇవిగాక సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో రోజూ దాఖలయ్యే కేసులు, అప్పీళ్లు, కింది కోర్టుల్లో పెండింగ్ పడిన కోట్లాది కేసులు అదనం.న్యాయవ్యవస్థ పుట్టిన నాటినుంచీ అవతలి పక్షాన్ని కోర్టుకీడ్చి ఇరుకున పెట్టాలన్న యావ కక్షిదారులకు సహజంగా ఏర్పడివుంటుంది. రాచరికాల్లో ఇంత చేటు సాహసం ఉండేది కాదు. తప్పనిసరైతే తప్ప, తనవైపే న్యాయం ఉందన్న ధీమా ఉంటే తప్ప ఫిర్యాదు చేయడానికి జంకేవారు. తేడా వస్తే తల తీస్తారన్న భయమే అందుకు కారణం కావొచ్చు. చిత్రమేమంటే వర్తమాన కాలంలో ప్రభుత్వాలే పెద్ద లిటిగెంట్లుగా మారాయి. అసమ్మతి ప్రకటించేవారిపై ఎడాపెడా కుట్ర కేసులు బనాయించటం, ఇతరత్రా కేసుల్లో ఇరికించటం ఇప్పటికీ సాగుతూనే వుంది. ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవటం ఒకపక్క, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలను కోర్టుకీడ్చటం మరోపక్క సమాంతరంగా సాగుతుంటాయి. వలస పాలకుల నాటి చట్టాలనే ఇప్పటికీ నెత్తిన పెట్టుకోవటం, అవకతవకలు జరగలేదని తెలిసికూడా అధికార మదంతో వ్యతిరేకులను అక్రమ కేసుల్లో ఇరికించటం మితిమీరుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల పుణ్యమా అని యూపీ నుంచి ఏపీ దాకా బుల్డోజర్లు నడిపించే సంస్కృతి పెరిగింది. ప్రత్యర్థి పక్షాలకు చెందినవారి ఇళ్లపై, కార్యాలయాలపై దాడులు సరేసరి. సహజంగానే ఇలాంటి కేసులన్నీ న్యాయస్థానాలకు ఎక్కక తప్పదు. దానికితోడు పొలాలు, స్థలాలు, ఇళ్లు వగైరా స్థిరాస్తుల వారసత్వ హక్కుల కోసం దాయాదులు, తామే న్యాయమైన హక్కుదారులమంటూ వచ్చే కక్షిదారులు లెక్కలేనంతమంది. ఎన్డీఏ సర్కారు ఈమధ్య కాలం చెల్లిన చట్టాల్లో కొన్నిటిని రద్దుచేయటంతోపాటు ఐపీసీ, సీపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టం స్థానాల్లో కొత్త చట్టాలు తీసుకొచ్చింది. అవి ఏమేరకు మార్పు తీసుకురాగలవో ఆచరణ తర్వాతగానీ తెలియదు. నీతి ఆయోగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిరుడు ఏపీలో జగన్ సర్కారు తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం కూడా వినూత్నమైనది. 130 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ఈ చట్టం ఉద్దేశం నిజమైన హక్కుదారులను గుర్తించి వారి హక్కులు కాపాడటం, అనవసర వ్యాజ్యాలు నిరోధించటం. అధికార యావతో ప్రత్యర్థులు ఎన్నికల్లో వక్ర భాష్యాలు చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించారు. చివరకు ఎన్డీఏ సర్కారు దాన్ని రద్దుచేస్తోంది. లోక్ అదాలత్ల పనితీరు భిన్నమైనది. ఇందులో సామరస్య పరిష్కారానికి ఇరుపక్షాలనూ ప్రోత్సహిస్తారు. ప్రధాన న్యాయమూర్తి నియమించిన న్యాయనిపుణులు ఆ కేసులో ఉన్న సమస్యను న్యాయమూర్తులకూ, లిటిగెంట్లకూ వివరిస్తారు. పిటిషనర్లు నేరుగా న్యాయమూర్తులతో మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. జస్టిస్ చంద్రచూడ్ తీసుకొచ్చిన మరో మార్పేమిటంటే... పిటిషనర్లు దీనికోసం ఢిల్లీ వరకూ వెళ్లనవసరం లేదు. వారికి హైకోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ఇది పెండింగ్ కేసులకు న్యాయవ్యవస్థ నుంచి వచ్చిన ఒక సృజనాత్మక పరిష్కారం. ఇప్పుడు తమ వంతుగా ఏం చేయవచ్చునో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎప్పటికప్పుడు న్యాయమూర్తుల ఖాళీలు భర్తీచేయటం తక్షణావసరం. వేరే దేశాలతో పోలిస్తే జనాభాకూ, న్యాయమూర్తుల సంఖ్యకూ మధ్య నిష్పత్తి మన దేశంలో చాలా అధికం. అలాగే చట్టాలు చేసేముందు వాటి పర్యవసానంగా ఎన్ని వ్యాజ్యాలు కోర్టు మెట్లెక్కే అవకాశమున్నదో ప్రభుత్వాలు అంచనా వేసుకోవాలి. చెక్ బౌన్స్ కేసులు ఇందుకు ఉదాహరణ. గతంలో సివిల్ తగదాగా ఉన్నదాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చారు. దీనివల్ల అసంఖ్యాకంగా కేసులు పెరిగాయి. పెండింగ్ కేసులు తగ్గించటం కోసం సెలవు రోజుల్లోనూ పనిచేయక తప్పడం లేదని ఆ మధ్య ఒక న్యాయమూర్తి వాపోయారు. సుప్రీంకోర్టు తీసుకున్న తాజా చొరవకు ప్రభుత్వాల వివేకం కూడా తోడైతే ఈ సంక్లిష్ట సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుంది. -
లోక్ అదాలత్లో 10,35,520 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. ఒకేరోజు 10,35,520 కేసులను పరిష్కరించారు. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 5,81,611, వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 4,53,909 ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.743 కోట్లు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్కుమార్ షావిలి రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్లను పర్యవేక్షించారు. ఈ మేరకు కేసుల పరిష్కార వివరాలను సాయంత్రం రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి సీహెచ్.పంచాక్షరి మీడియాకు వెల్లడించారు. రెట్టింపు ఉత్సాహంతో కేసులను పరిష్కరించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టులో 132 కేసులు.. హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఆధ్వర్యంలో జరిగిన జాతీ య లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్, న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్రావు పాల్గొన్నారు. హైకోర్టులో 132 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.9.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లోక్ అదాలత్తో సత్వర న్యాయం.. రంగారెడ్డి కోర్టులు: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ.. లోక్అదాలత్లో పరిష్కారమైన కేసులతో సత్వర న్యాయంతోపాటు కక్షిదారులు చెల్లించిన కోర్టు రుసుమును కూడా తిరిగి పొందవచ్చునని పేర్కొన్నారు.కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్రెడ్డి, జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి పట్టాభిరామారావు, రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కొండల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గులగారి కృష్ణ, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్స్, కక్షిదారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి/సీనియర్ సివిల్ న్యాయమూర్తి పి.శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాలలో 33 లోక్ అదాలత్ ధర్మాసనాలు ఏర్పాటు చేయగా సుమారు లక్షా 27వేల పైచిలుకు క్రిమినల్, సివిల్ ఇతర కేసులు పరిష్కరించారు. కక్షిదారులకు మొత్తంగా 5 కోట్ల 85 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించారు. -
జ్యుడీషియల్ డేటా గ్రిడ్లో ‘సుప్రీం’ సమాచారం
న్యూఢిల్లీ: జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్(ఎన్జేడీజీ)తో సుప్రీంకోర్టు కేసుల వివరాలు అనుసంధానించారు. ఇకపై సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ కేసుల తాజా సమాచారం ఎప్పటికప్పుడు కక్షిదారులుసహా అందరూ చూడొచ్చు. ఈ వివరాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం సర్వోన్నత న్యాయస్థానం కోర్టురూమ్లో వెల్లడించారు. తాలూకా స్థాయి నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టులో ఎన్నెన్ని కేసుల విచారణ పూర్తయింది, ఇంకా ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి అనేదంతా తెల్సిపోతుంది. ‘ ఇదో చిన్న ప్రకటనే. కానీ ఈ రోజు చరిత్రాత్మకమైన రోజు. ఎన్ఐసీ బృందం, సుప్రీంకోర్టు టీమ్ కలిసి ఈ వేదికను అభివృద్ధిచేశాయి. సంవత్సరాలవారీగా, రిజిస్ట్రర్ అయిన, రిజిస్టర్కాని, కోరమ్ వారీగా ఇలా భిన్న విధాలుగా కేసుల వివరాలు పొందొచ్చు. 62,946 సివిల్ కేసులు, 16,555 క్రిమినల్ కేసులు మొత్తంగా 80,501 పెండింగ్ కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణకు ఎదురుచూస్తున్నాయి. అన్ని వివరాలను వెబ్పేజీలు అందిస్తాయి. ఎన్జేడీజీలో సమాచారం అప్లోడ్ ద్వారా న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత ఇనుమడిస్తుంది’ అని సీజేఐ చెప్పారు. 585 కేసులను త్రిసభ్య ధర్మాసనాలకు అప్పజెప్పాల్సి ఉంది. త్వరలోనే ఆయా ధర్మాసనాలను ఏర్పాటుచేస్తానని సీజేఐ పేర్కొన్నారు. ‘స్వేచ్ఛా సమాచార పాలసీ’లో భాగంగానే ఇవన్నీ అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు. ఎన్జేడీజీలో 18,735 జిల్లా, సబార్డినేట్ కోర్టులు, హైకోర్టుల సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఈ–కోర్ట్స్ ప్రాజెక్టు కింద దీనిని ఏర్పాటుచేశారు. కక్షిదారులకు వెబ్ సేవల ద్వారా అన్ని హైకోర్టులు ఎన్జేడీజీతో అనుసంధానమయ్యాయి. వేర్వేరు రకాల కేసులు సంవత్సరాలవారీగా ఈ పోర్టల్లో ఒక్క క్లిక్తో చూసుకోవచ్చు. కేసుల సంబంధ సమస్త సమాచారాన్ని ఈ పోర్టల్ ద్వారా పొందొచ్చు. పారదర్శకతలో పై మెట్టు: మోదీ ‘ సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు సీజే జస్టిస్ చంద్రచూడ్ వేసిన గొప్ప ముందడుగు ఇది. అధునాతన సాంకేతికతతో న్యాయవితరణలో, న్యాయవ్యవస్థలో పారదర్శకత మరో మెట్టు పైకి ఎక్కింది’ అంటూ ఎన్జేడీజీలో సుప్రీంకోర్టు అనుసంధానాన్ని ప్రధాని మోదీ శ్లాఘించారు. -
కోర్టుల సంఖ్య పెంచాలి
హుజూర్నగర్: పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి కోర్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. మంగళవారం సూ ర్యాపేట జిల్లా హుజూర్నగర్ అదనపు జిల్లా కోర్టును హైదరాబాద్ నుంచి వర్చువల్గా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుజూర్నగర్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తమ కేసుల కోసం జిల్లా న్యాయ స్థానాన్ని ఆశ్రయించటానికి పడుతున్న వ్యయ ప్రయాసలను దృష్టిలో పెట్టుకుని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యుల విజ్ఞప్తి మేరకు హుజూర్నగర్కు జిల్లా అదనపు న్యాయస్థానాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజల సౌకర్యార్థమే అదనపు జిల్లా కోర్టు మంజూరు చేశామని, కోర్టు ప్రారంభమైనందున ఈ ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉండటమే కాకుండా సత్వర న్యాయం ల భించడానికి మార్గం సుగమమైందన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, సూర్యాపేట పోర్టుపోలియో జడ్జి జస్టిస్ శ్రీ సుధా, జస్టిస్ సుజన వర్చువల్గా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాంకుమార్, జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షు డు సాముల రాంరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
సా..గుతున్న కేసులు.. సవాలక్ష కారణాలు!
తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. దీనికిముందు దాదాపు 7 దశాబ్దాలుగా ఈ వివాదం కొనసాగింది. ఎట్టకేలకు ఆదివాసీలకు అనుకూలంగా తీర్పు వెలువడింది. పంట నాశనం చేశాడన్న ఆరోపణలతో 1996లో నాగోసింగ్తో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. దీంతో కొంతకాలం పాటు విచారణ ఖైదీలుగా జైలు జీవితం గడిపారు. బెయిల్ రావడంతో బయటకు వచ్చినా మొత్తం మీద 26 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. చివరకు 2022లో కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఆ సంతోషంలో నాగోసింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బిహార్ బంకా జిల్లాలో ఇది జరిగింది. ఒకటికాదు..రెండు కాదు.. లక్షల కేసులు ఏళ్ల తరబడి కోర్టుల్లో మగ్గుతున్నాయి. దాఖలవుతున్న పిటిషన్లకు అనుగుణంగా కేసులు పరిష్కారం కావడం లేదు. 30 ఏళ్లకు పైగా ‘సాగుతున్న’కేసులు ఎన్నో ఉన్నాయి. ‘ఏళ్లకు ఏళ్లు విచారణ సాగిన తర్వాత బాధితుడికి అనుకూలంగా తీర్పు వచ్చినా అది న్యాయం అందినట్లు కాదు’, ‘సత్వర న్యాయం అందనంత కాలం బాధితులకు న్యాయం జరగనట్టే’.. ప్రభుత్వాధినేతలు, న్యాయనిపుణులు పదే పదే చెప్తున్న మాటలివి. అయినప్పటికీ కేసుల పరిష్కారంలో సంవత్సరాల జాప్యం జరుగుతోంది. పెండింగ్ కేసులు కోర్టులకు గుదిబండలా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా పెండింగ్ కేసుల సంఖ్య (కిందికోర్టు, హైకోర్టులు కలిపి) ఈ జూలై 1 నాటికి 5 కోట్లు దాటిందని కేంద్ర న్యాయ మంత్రి గతవారం రాజ్యసభలో ప్రకటించడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ కోర్టుల్లో పెండింగ్ కేసులు మూడేళ్లలో 18 శాతం, అంటే ఏటా 6 శాతం చొప్పున పెరిగాయి. ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులున్న సుప్రీంకోర్టు 70 వేల పెండింగ్ కేసుల భారం మోస్తూ ఏడాదికి సుమారు వెయ్యి తీర్పులిస్తోంది. 2018 నవంబర్ నాటికి సుప్రీంకోర్టులో ఉన్న కేసుల్లో 40 శాతం అయిదేళ్ల కంటే ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్నాయి. 8 శాతం కేసులు పదేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. 2004తో పోల్చినప్పుడు అయిదేళ్లుగా పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 7 శాతం పెరిగింది. ట్రయల్ కోర్టులో మొదలై సుప్రీంకోర్టులో తీర్పు రావడానికి ఒక్కో కేసుకు సగటున 13 సంవత్సరాల 6 నెలల కాలం పడుతోంది. ఇందులో మూడో వంతు కాలం ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టులోనే ఉంటోంది. పెండింగ్కు ముఖ్య కారణాలివే.. ► జడ్జిలు సహా కోర్టు సిబ్బంది లేమి ► న్యాయ వ్యవస్థకు అరకొర నిధుల కేటాయింపు ► కోర్టులు, ఇతర చోట్ల మౌలిక సదుపాయాల కొరత ► చట్టపరమైన ప్రక్రియ దుర్వినియోగం, చట్టంలో లోటుపాట్లు (వాయిదా వేస్తూ వెళ్లడం) ► న్యాయస్థానాల్లో అంతంత మాత్రంగా సాంకేతికత ► చట్టాలపై ప్రజలకు అవగాహన పెరగడం ► ఆర్టీఐ, ఆర్టీఈ లాంటి కొత్త చట్టాలు వస్తుండటం ► జనాభా మేరకు కోర్టుల సంఖ్య లేకపోవడం ► ప్రభుత్వం నుంచి కూడా లిటిగేషన్లు పెరగడం ► పలు చట్టాల్లో ఇంకా అస్పష్టత ఉండటం అవగాహన.. సాంకేతికత అభివృద్ధితో ప్రయోజనం ► ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా కోర్టులకు వచ్చే కేసులను కొంతవరకు తగ్గించవచ్చు. ► కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించాలి. ముఖ్యంగా సాంకేతికతను అభివృద్ధి పరచడంతో పాటు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తే కేసుల సత్వర పరిష్కారం సాధ్యమవుతుంది. అన్ని కోర్టుల్లో వర్చువల్ విచారణ చేపట్టాలి. సాక్షులు, అధికారులు, కక్షిదారులు కోర్టుకు రాకున్నా ఆన్లైన్ ద్వారా వారి వాంగ్మూలాలను స్వీకరించవచ్చు. తద్వారా వాయిదాలను కొంతవరకు తగ్గించొచ్చు. ► టెక్నాలజీతో ఒకే రకమైన కేసులను ఒక్క దగ్గరే విచారణ చేపట్టవచ్చు. ► మోటార్ వెహికిల్ కేసుల్లో చాలా కేసులు హైకోర్టులకే వస్తున్నాయి. వీటిని జిల్లా కోర్టుల్లోనే పరిష్కరిస్తే ఉన్నత న్యాయస్థానాలపై భారం కొంత తగ్గుతుంది. హైకోర్టులో ఈ కేసులను చాలా వరకు సింగిల్ జడ్జికే పరిమితం చేయాలి. ► చిన్న చిన్న కేసుల విచారణకు గడువు పెట్టుకోవాలి. ఆ గడువులోగా ఉత్తర్వులు ఇచ్చేయాలి. ► పలు కారణాల రీత్యా ఒక్కోసారి వాద ప్రతివాదులు, కొన్ని సమయాల్లో న్యాయవాదులు కోర్టుకు హాజరుకాలేపోతుండటంతో కేసులు వాయిదా పడుతున్నాయి. ► ఫ్యామిలీ కేసుల్లో ఎక్కడో ఉద్యోగం చేస్తున్న భర్త, భార్య ప్రతిసారీ కోర్టుకు హాజరు కావడం తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. ► ప్రభుత్వ లిటిగేషన్లు కూడా తగ్గాలి. అధికారులు హాజరుకాలేని పక్షంలో వారు ఆన్లైన్ ద్వారా వివరణ ఇచ్చే వెలుసుబాటు ఉండాలి. దీంతో హాజరు కోసం వాయిదా వేయాల్సి అవసరం ఉండదు. ప్రభుత్వం కూడా ఓ లిటిగేషన్ పాలసీని తీసుకొస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. –జస్టిస్ నవీన్రావు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జడ్జిల రోస్టర్ వేర్వేరుగా ఉండాలి ప్రజలు, పనిచేస్తున్న జడ్జిల నిష్పత్తిలో చాలా తేడా ఉంది. కేటాయించిన సంఖ్యలోనూ పెద్ద ఎత్తున ఖాళీలుంటున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. ఇక చిన్న చిన్న కేసులను వాయిదాలు వేయకుండా నిర్ణీత గడువుతో సత్వరం పరిష్కరించాలి. జడ్జిల రోస్టర్ కూడా క్రిమినల్, సివిల్, రిట్.. ఇలా వేర్వేరుగా ఉండాలి. ఎవరికి ఎందులో నైపుణ్యం ఉందో ఆ సబ్జెక్టును కేటాయిస్తే వేగంగా పూర్తి చేయగలుగుతారు. – సీనియర్ న్యాయవాది, తెలంగాణ హైకోర్టు నేనిక కోర్టుకు రాలేను! మేడమ్.. మా బాబుకు ఐదేళ్లు ఉన్నప్పుడు విడాకుల కోసం కోర్టుకు వచ్చా. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. ఇంకా నేను కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఉద్యోగం చేసుకుంటూ నా పిల్లలను పోషించుకుంటున్నా. వాయిదాల కోసం సెలవులు పెట్టడానికి నానాయాతన పడాల్సి వస్తోంది. మీరు విడాకులు ఇవ్వకపోయినా పర్వాలేదు. నేను ఇకపై కోర్టుకు రాలేను –జడ్జితో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ -
హైదరాబాద్ జిల్లాలో 1,02,611 కేసులు పరిష్కారం
నాంపల్లి: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రేమవతి, డీసీపీ జోయెల్ డేవిస్తో కలిసి ప్రారంభించారు. ఇందులో రాజీ చేసుకోదలచిన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద కేసులు, గృహహింస, చెక్బౌన్స్, ప్రి లిటిగేషన్ కేసులు మొత్తం 1,02,611 పరిష్కారం అయ్యాయి. పార్టీలు, న్యాయవాదులు కలిసి పెండింగ్లో ఉన్న కేసులను లోక్అదాలత్లో సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అనంతరం ప్రేమవతి మాట్లాడుతూ...క్షణికావేశంలో చేసిన తప్పులను, పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి ఈ లోక్ అదాలత్ సరైన వేదిక అన్నారు. ఒకసారి లోక్ అదాలత్లో కేసు రాజీ అయితే మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని చెప్పారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగే బదులు ఒకేసారి లోక్ అదాలత్లో కేసును రాజీ చేసుకుంటే సమయం వృథా అవ్వకుండా ఉంటుందని, ఈ విషయాన్ని న్యాయవాదులు, పోలీసులు పార్టీలకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. న్యాయవాదులు ఈ లోక్అదాలత్లలో ముఖ్య పాత్ర వహిస్తారని, పార్టీలకు సన్నిహితంగా ఉన్న కారణంగా లోక్ అదాలత్ల గురించి పార్టీలకు వివరించి అధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మెట్రోపాలిటన్ సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్, రెండవ అదనపు ట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి భూపతి, ఆరవ అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి జాన్సన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు జోయెల్ డేవిస్, మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్లో కేసులు రాజీ కుదిరిన కొంత మందికి అవార్డు కాపీలను అందజేశారు. 1,02,611 కేసులు పరిష్కారం ఈ లోక్ అదాలత్లో మొత్తం 32 బెంచీలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,02,611 కేసులు పరిష్కారం అయ్యాయి. క్రిమినల్ కోర్టు ప్రాంగణం, సికింద్రాబాద్ కోర్టు ప్రాంగణం, మనోరంజన్ కోర్టు ప్రాంగణం, సికింద్రాబాద్ రైల్వే కోర్టు ప్రాంగణం, పురానీ హవేలీ కోర్టు ప్రాంగణాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో కుటుంబ తగాదా కేసులు–277, చెక్»ౌన్స్ కేసులు–1,615, ఎస్టీసీ కేసులు–98,050, సీసీ ఐపీసీ కేసులు– 2,669 పరిష్కారమయ్యాయి. అలాగే ఈ లోక్ అదాలత్లో రూ.3,61,97000 పరిహారం కింద చెల్లించినట్లు కార్యదర్శి రాధికా జైస్వాల్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో... రంగారెడ్డి కోర్టులు: రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హరేకృష్ణ భూపతి పాల్గొన్నారు. అదాలత్లో కేసు రాజీపడితే ఇరు వర్గాలు గెలిచినట్లే అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 9 సంవత్సరాలుగా ఆస్తి తగాదాలతో సతమతమవుతున్న అన్నదమ్ముల మధ్య రాజీ కుదిర్చి..ఇకపై కలిసి మెలిసి జీవించాలని వారికి సూచించారు. ఇక జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,04,769 కేసులు పరిష్కారమయ్యాయి. కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి డా.పట్టాబి రామారావు, రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రవీందర్, ఎసీపీ శ్రీధర్ రెడ్డి, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కస్తూరి బాయ్ తదితరులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో కోర్టులపై భారం తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఏదైనా వ్యవస్థపై అది భరించే శక్తికి మించి ఒత్తిడి పెంచితే ఆ వ్యవస్థ దెబ్బతింటుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ భారాన్ని తగ్గించడం ‘మధ్యవర్తిత్వం’తోనే సాధ్యమని తెలిపారు. ఇంట్లోని చిన్నచిన్న తగాదాలు కూడా కోర్టుకు చేరడంతో పెండింగ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయన్నారు. ఇలాంటి కేసులన్నీ మధ్యవర్తిత్వంతోనే పరిష్కారం కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ–మీడియేషన్ రైటింగ్స్ (ఈఎండబ్ల్యూ) ఏర్పాటై మూడేళ్లయిన సందర్భంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈఎండబ్ల్యూ మూడేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. ‘అత్తాకోడలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు.. ఇలా చిన్నచిన్న వివాదాలను ఇంటి స్థాయిలోనో లేదా గ్రామ స్థాయిలోనో ఎవరో ఒకరు మధ్యవర్తిత్వంతో పరిష్కరించే ఏర్పాట్లు జరగాలి. పేదలకు కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందే ఆర్థిక స్తోమత తక్కువ. అలాంటి వారి సమస్యల పరిష్కారం కోసం మధ్యవర్తులు ముందుకురావాలి’అని తమిళిసై పిలుపునిచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. భరించే శక్తికి మించి న్యాయవ్యవస్థ భారం మోస్తోందని చెప్పారు. గతంలో గ్రామీణ స్థాయిలో, కుటుంబాల్లో ఉన్న మధ్యవర్తిత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, సత్వర న్యాయం అందుతుందన్నారు. కోర్టు తీర్పు తర్వాత సదరు పార్టీల మధ్య బంధం ఉండకపోవచ్చని, అదే మధ్యవర్తిత్వ పరిష్కారంలో వారి అంగీకారంతోపాటు బంధం బలహీనపడదని చెప్పారు. మీడియేటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని, అది పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు పార్టీలకు సమ న్యాయం.. కోర్టుల్లో వివాదాల పరిష్కారంతో పోలిస్తే మధ్యవర్తిత్వ పరిష్కారం అన్నివిధాలా ఉత్తమమైనదని పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి పేర్కొన్నారు. మధ్యవర్తిత్వంలో పార్టీలు ఇద్దరూ సఫలీకృతం అవుతారని, ఇద్దరికీ సమ న్యాయం అందుతుందని చెప్పారు. ఇంట్లో, ఊరిలో, సమాజంలో మధ్యవర్తులు ఉండి ఎక్కడికక్కడే సమస్యలకు చెక్ పెడితే అది సమాజ పురోభివృద్ధికి దోహదం చేస్తుందని వివరించారు. ప్రపంచమంతా అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న కోవిడ్ సమయంలో ఈఎండబ్ల్యూ ఊపిరిపోసుకుందని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష కోర్టులు లేని సమయంలో కక్షిదారులకు సేవలందించిందని, ఇలా మూడేళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. మధ్యవర్తిత్వం కోసం.. మధ్యవర్తిత్వం చేత.. మీడియేటర్లే నిర్వహిస్తున్న కార్యక్రమం ఈఎండబ్ల్యూ అని మీడియేషన్ ట్రైనర్ పుష్ప్ గుప్తా అన్నారు. అనంతరం మీడియేషన్ ట్రైనర్ థన్కచన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సైనిక బలగాల ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ రాజేంద్ర మీనన్, పలు రాష్ట్రాల న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఈఎండబ్ల్యూ తెలంగాణ కో–ఆర్డినేటర్ మంజీరా వెంకటేశ్, కేఎస్ శర్మ, చిత్రా నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. -
అతీక్, అతని సోదరుడిపై ఉన్న 152 కేసులు క్లోస్!
లక్నో: గ్యాంగ్స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు ఖాలిద్ అజీమ్(అశ్రఫ్) ఏప్రిల్ 15న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరూ మరణించడంతో వీరిపై ఉన్న 152 పెండింగ్ కేసులను క్లోస్ చేయాలని ఉత్తర్ప్రదేశ్ పోలీసులు నిర్ణయించారు. ఈ ఇద్దరి డెత్ రిపోర్టును కోర్టుకు సమర్పించి కేసులన్నీ మూసివేయనున్నారు. 152 కేసుల్లో అతీక్పైనే 102 కేసులున్నాయి. ఉత్తర్ప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈకేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ఒక్క కేసులో మినహా అతీక్ ఎందులోనూ దోషిగా తేలలేదు. బెదిరింపులు, ప్రలోభాలతో శిక్ష పడకుండా చూసుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా అతీక్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇతనితో పాటు అనుచరులపైనా యూపీలోని యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. రౌడీ షీటర్లను ఎన్కౌంటర్లలో కాల్చిపడేసింది. వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేసింది. అతీక్పై 1979లోనే తొలిసారి హత్య కేసు నమోదైంది. అప్పుడు అతని వయసు 15 ఏళ్లే కావడం గమనార్హం. అలాగే అతని సోదరుడు అశ్రఫ్పై 1992లో తొలి కేసు నమోదైంది. వీరిద్దరిపై చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్పాల్ హత్యకు సంబంధించిన కేసు నమోదైంది. కాగా.. అతీక్, అతని సోదరుడిపై ఉన్న కేసులు క్లోస్ చేస్తున్నప్పటికీ వీటిలో ఇతర నిందితులపై అభియోగాలు అలాగే ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. న్యాయపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. చదవండి: బ్రిడ్జిపైనుంచి పడిపోయిన బస్సు.. 14 మంది దుర్మరణం.. 20 మందికి గాయాలు -
పెండింగ్’కు ‘మధ్యవర్తిత్వం’ చక్కటి పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: భరించలేనంత భారం మోపితే ఏ వ్యవస్థ అయినా దెబ్బతింటుందని.. ఆ ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యామ్నాయం అవసరం అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వం అమలు విధానంపై చర్చా కార్యక్రమాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు, రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ నవీన్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం మూడు రోజులు జరగనుంది. ఈ సందర్భంగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. ‘ ఏటికేడు పెరిగిపోతున్న పెండింగ్ కేసులతో న్యాయవ్యవస్థపై విపరీత భారం పడుతోంది. న్యాయమూర్తులపై కూడా తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీనికి చక్కని పరిష్కారమే ‘మధ్యవర్తిత్వం’ అని వెల్లడించారు. అవగాహన పెంచుకోవాలి..: ‘హైకోర్టు న్యాయమూర్తులు కూడా మధ్యవర్తిత్వ విధానంపై మరింత అవగాహన పెంచుకోవాలి. దేశంలో దాదాపు 5 కోట్లు, రాష్ట్రంలో 10 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. రోజూ ఎన్ని కేసులు పరిష్కరిస్తున్నారో.. అంతకు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక ప్రజలకు సత్వర న్యాయం ఎలా అందుతుంది? ఈ పరిస్థితులను అధిగమించేందుకు మధ్యవర్తిత్వం తోడ్పడుతుంది.’అని జస్టిస్ లావు నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ‘జిల్లాస్థాయిల్లోనూ మీడియేషన్ సెంటర్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాం. కుటుంబ వివాదాలు, భూ సమస్యలు, భార్యభర్తల గొడవలకు అక్కడే పరిష్కారం చూపిస్తే.. పెండింగ్ కేసుల భారం తగ్గే అవకాశం ఉంది’ అని జస్టిస్ నవీన్రావు అభిప్రాయపడ్డారు. సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ చైర్మన్ జార్జి లిమ్ వర్చువల్గా మాట్లాడారు. అనంతరం జస్టిస్ చిల్లకూర్ సుమలత, జస్టిస్ అనుమప చక్రవర్తి, జస్టిస్ విజయ్సేన్రెడ్డి, జస్టిస్ వినోద్కుమార్లు అడిగిన ప్రశ్నలకు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జార్జి లిమ్ సమాధానం చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, లీగల్ సరీ్వసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి(జడ్జి) గోవర్ధన్రెడ్డి, జడ్జి రాధిక, ౖహె కోర్టు రిజిస్టార్, అసిస్టెంట్ రిజిస్టార్లు పాల్గొన్నారు. -
ఒకేరోజు 3,30,866 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఒకేరోజు రికార్డు స్థాయిలో 3,30,866 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 9,262.. వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 3,21,604 ఉన్నాయి. బాధితులకు రూ.255.48 కోట్ల పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.నవీన్రావు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ టి.వినోద్కుమార్ రాష్టవ్యాప్తంగా లోక్ అదాలత్ను పర్యవేక్షించారు. హైకోర్టులో 365 కేసులు.. హైకోర్టు పరిధిలో జరిగిన అదాలత్ కార్యక్రమంలో జస్టిస్ జి.అనుపమ చక్రవర్తి, జస్టిస్ జి.శ్రీదేవి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతి పాల్గొన్నారు. హైకోర్టులో 365 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.26.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక జిల్లా కోర్టుల్లో స్థానిక న్యాయమూర్తులు కేసులను పరిష్కరించారు. -
వివాద్ సే విశ్వాస్–2 స్కీము ముసాయిదా
న్యూఢిల్లీ: ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన వివాద్ సే విశ్వాస్ 2 స్కీము ముసాయిదాను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, కాంట్రాక్టర్లు, ప్రజలు దీనిపై మార్చి 8లోగా తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు. ముసాయిదా ప్రకారం వివాదంపై విచారణ దశను బట్టి కాంట్రాక్టర్లకు సెటిల్మెంట్ మొత్తాన్ని ఆఫర్ చేస్తారు. ఒకవేళ న్యాయస్థానం లేదా ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసి ఉంటే .. క్లెయిమ్ అమౌంటులో 80 శాతం లేదా ఉత్తర్వుల్లో పేర్కొన్న దానిలో 60 శాతం మొత్తం ఆఫర్ చేయవచ్చు. ఇక పనులు నిలిపివేసినా లేదా రద్దయిన కాంట్రాక్టులకు సంబంధించి ఇది నికరంగా క్లెయిమ్ చేసిన దానిలో 30 శాతంగా ఉంటుంది. వివాదాస్పద కాంట్రాక్టుపై లిటిగేషన్, పనులు కొనసాగుతుంటే ఇది 20 శాతానికి పరిమితమవుతుంది. ఒకవేళ మొత్తం క్లెయిమ్ అమౌంటు రూ. 500 కోట్లు దాటిన పక్షంలో ఆర్డరు ఇచ్చిన సంస్థలకు కాంట్రాక్టరు ఇచ్చే సెటిల్మెంట్ ఆఫర్ను తిరస్కరించే ఆప్షను ఉంటుంది. కానీ, అందుకు తగిన కారణాన్ని చూపాలి. సంబంధిత శాఖ, విభాగం కార్యదర్శి లేదా కంపెనీ అయితే సీఈవో దీన్ని ఆమోదించాలి. -
దేశంలో 4.90 కోట్ల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపుగా 4.90 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పెండింగ్ కేసుల త్వరితగతి విచారణ కోసం ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలసికట్టుగా కృషి చేయాలన్నారు. అప్పుడే కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని కేసుల విచారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో రిజిజు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఈ–కమిటీ చీఫ్గా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ‘‘4.90 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది చాలా పెద్ద సంఖ్య. అంటే చాలా మంది న్యాయం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. న్యాయం జరగడం ఆలస్యమవుతోందని అంటే న్యాయం చెయ్యడం తిరస్కరించడంగానే భావించాలి. వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడాలి’’ అని రిజిజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాల ఉమ్మడి కృషి కారణంగానే పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించగలమని వివరించారు. -
5 కోట్లకు పెండింగ్ కేసులు!
న్యూఢిల్లీ: దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మరో రెండు నెలల్లో పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్ల మార్కును దాటనుందని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఇలాంటి కేసులు కొంత తగ్గుముఖం పడుతున్నప్పటికీ కింది కోర్టుల్లో మాత్రం పరిస్థితి సవాలుగానే మారిందని పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టులో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కిరణ్ రిజిజు మాట్లాడారు. కింది కోర్టులను మౌలిక వసతుల కొరత వేధిస్తోందని, అందుకే పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. పరిష్కారం కాని కేసులు కొన్ని నెలల క్రితం వరకు 4.83 కోట్లు ఉండేవన్నారు. ఇలాంటి కేసులపై ఎవరైనా తనను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బొల్లినేని గాంధీపై సస్పెన్షన్ వేటు -
ఒకేరోజు 2,76,861 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు భారీ స్పందన వచ్చింది. ఒకేరోజు రికార్డు స్థాయిలో 2,76,861 కేసులను పరిష్కరించారు. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 23,205, వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 2,53,656, ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.145.07 కోట్లు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ పి. నవీన్రావు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్కుమార్ షావిలి రాష్టవ్యాప్తంగా లోక్ అదాలత్ను పర్యవేక్షించారు. హైకోర్టులో 233 కేసులు.. హైకోర్టు పరిధిలో జరిగిన అదాలత్ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ. శ్రవణ్కుమార్, జస్టిస్ కె.శరత్లు పాల్గొన్నారు. హైకోర్టులో 233 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.9.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక జిల్లా కోర్టుల్లో స్థానిక న్యాయమూర్తులు కేసులను పరిష్కరించారు. ‘వినియోగదారుల’కమిషన్ ఆధ్వర్యంలో.. పరస్పర అంగీకారంతో కేసుల పరిష్కారం కోసం చేపట్టిన జాతీయ లోక్ అదాలత్లో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ పరిధిలోని 13 ఫోరంలలో ఈ కేసులను పరిష్కరించినట్లు రాష్ట్ర కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర కమిషన్తో పాటు 10 పాత జిల్లాల పరిధిలోని 12 జిల్లా ఫోరంలలో 355 కేసులను గుర్తించి జాతీయ లోక్ అదాలత్కు రిఫర్ చేశారు. వీటిలో 248 కేసులకు సంబంధించి సమాచారం ఇవ్వగా, 74 కేసులను ఒక్కరోజే పరిష్కరించారు. ఈ కేసుల విలువ రూ.2.11 కోట్లు ఉంటుందని కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా రాష్ట్ర కమిషన్ పరిధిలో 29 కేసులను పరిష్కరించారు. -
వాగ్దానాలు కొంతవరకు నెరవేర్చా
న్యూఢిల్లీ: ఇచ్చిన వాగ్దానాలను కొంత వరకు నెరవేర్చగలిగానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ చెప్పారు. ఎల్లవేళలా పనిచేసే ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం, కేసుల జాబితాను క్రమబద్ధం చేసే వ్యవస్థను నెలకొల్పడం, పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడం వంటి విషయాల్లో తన వంతు కృషి చేశానని తెలిపారు. జస్టిస్ యు.యు.లలిత్ పదవీ కాలం మంగళవారం ముగియనుంది. ఆరోజు సెలవు దినం కాబట్టి సోమవారమే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ యు.యు.లలిత్ మాట్లాడారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే పెండింగ్ కేసులపై దృష్టి పెట్టానని, వేలాది కేసులు పరిష్కరించానని వివరించారు. ఈ వీడ్కోలు సభకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. నా ప్రయాణం సంతృప్తికరం సుప్రీంకోర్టులో 37 ఏళ్ల వృత్తి జీవితంలో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ప్రతి దశను ఆనందించానని జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. తన ప్రయాణం సంతృప్తికరంగా సాగిందన్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి, 16వ సీజేఐ జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ముందు న్యాయవాదిగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఇదే కోర్టులో మొదలైన తన ప్రయాణం, ఇక్కడే ముగుస్తోందంటూ భావోద్వేగానికి గురయ్యారు. పలు రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయడం తనకు మర్చిపోలేని జ్ఞాపకమని అన్నారు. కోర్టులో ఉన్న న్యాయమూర్తులందరినీ రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యులుగా చేశానని తెలిపారు. జస్టిస్ లలిత్ ఆగస్టు 27న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. కేవలం 74 రోజులు పదవిలో కొనసాగారు. -
కోర్టుల సంఖ్య పెంచాలి.. ఎందుకంటే!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోకసభలో, దేశవ్యాప్తంగా జైళ్లలోని ఖైదీలు, పొలీసు కస్టడీలోని నిందితులు 2016 నుండి 2022 వరకు 11,656 మంది మరణించినట్లు వెల్లడించారు. ఇందులో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో, చివరి స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. పొలీసు కస్టడీలో 7 శతం, జైళ్లలో 93 శతం మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1184 మరణాలకు ప్రభుత్వాలు బాధ్యతవహించి సంబంధిత కుటుంబాలకు 28.5 కోట్ల రూపాయలు నష్ట పరిహారం చెల్లించారు. భాద్యులైన అధికారులపై, పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. సంబంధిత మరణాలు సహజ, అసహజ, అనారోగ్య, పొలీసు ఎన్కౌంటర్లు, పోలీసుల చిత్ర హింసలు, జైళ్లలో తోటి ఖైదీలు చంపడం వంటి మొదలగు కారణాలని తెల్పింది. ఆధునిక భారతావనిలో దినదినం పెరుగుతున్న కస్టోడియల్ మరణాలు కల్లోలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 672 న్యాయస్థానాల్లో 4.70 కోట్ల కేసులు విచారణ దశలో పెండింగులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో సుప్రీమ్ కోర్టులో 71 వేలు, హైకోర్టుల్లో 59 లక్షలు మిగితావి క్రింది స్థాయి కోర్టుల్లో, ట్రిబ్యునళ్లలో పెండింగులో ఉన్నాయి. దేశంలో న్యాయమూర్తుల సంఖ్యను దేశ జనాభాతో పోల్చిచూసినప్పుడు ప్రతి 50 వేలమంది పౌరులకు కేవలం ఒక్క న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. దేశంలో ప్రభుత్వాలు మంజూరు చేసిన న్యాయమూర్తుల సంఖ్య 25 వేలు ఇందులో, ఎప్పుడూ సుమారు 30 శాతం పోస్టులు ఖాళీగా ఉంటాయి. 1987లో లాకమీషన్ ప్రతీ 20 వేలమంది పౌరులకు ఒక్క న్యాయమూర్తిని నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కానీ, నేటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రపంచ దేశాల న్యాయవ్యవస్థను పోల్చిచూసినప్పుడు చైనాలో ప్రతీ 3500 మంది పౌరులకు ఒక్క న్యామూర్తి, అమెరికాలో ప్రతీ 7,000 మంది పౌరులకు ఒక్క న్యాయ మూర్తి చొప్పున నియమించారు అందుకే, ఆయా దేశాల్లో పౌరులకు సత్వర న్యాయం లభిస్తుంది. దేశంలోని 1350 జైళ్లలో సుమారు 6 లక్షల 10 వేల మంది ఖైదీలు, శిక్షలు ఖరారైన వాళ్లు మరియు విచారణలో కొనసాగుతున్న వాళ్లు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది నిందితులు న్యాయస్థానాల్లో శిక్షలు ఖరారు కాకుండానే విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును దృష్టిలో పెట్టుకొని, ఇటీవల సుప్రీంకోర్టు సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మధ్య జరిగిన కేసు తీర్పులో, నేరాలను నాలుగు రకాలుగా విభజించి పలు ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేస్తూ, నిందితులు చేసిన నేరానికి విధించే శిక్షలో 50 శాతం జైళు జీవితాన్ని పూర్తిచేసి జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీలను వెంటనే బేయిలుపై విడుదల చెయ్యాలని అన్ని మేజిస్ట్రేట్, జిల్లా, హైకోర్టులను ఆదేశించింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించింది. కానీ, దురదృష్టవశాత్తు మనదేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అనేక క్రిమినల్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ, కొంత మంది పోలీసులు అమాయకులపై తప్పుడు కేసులు పెడుతూ, బ్రిటిష్ కాలంనాటి మూస పద్ధతిలోనే పనిచేస్తున్నారు. పోలీసులు నిందితులను, నిందితులుగా చూడకుండా నేరస్తులుగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి క్రిమినల్ చట్టాల ప్రకారం ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను/అనుమానితులను గుర్తించి, విచారించి సదరు నిందితులను కోర్టు ముందు హాజరపరిచి విచారణలో, వారు నేరం చేసినట్లుగా తగు సాక్ష్యాధారాలతో న్యాయమూర్తుల ముందు పోలీస్ యంత్రాంగం చూపించవలసి ఉంటుంది. అంతిమంగా న్యాయస్థానాలు నిందితులను నేరస్తులుగా గుర్తించి శిక్షలు ఖరారు చేసి జైలుకు పంపిస్తాయి. దేశంలో సుమారు 4 లక్షల 88 వేలకు పైగా విచారణ ఖైదీలు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోయి జైలు జీవితం గడుపుతున్నారు. న్యాయస్థానాలు వీరిలో కొందరిని నిర్దోషులుగా తేల్చినప్పుడు, వీరు కోల్పోయిన జీవితానికి ఎవరు బాధ్యులు?. వీరిలో నూటికి నూరు శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా పేదవారే ఉండడం గమనించతగ్గ విషయం. భారత రాజ్యాంగం నిందితులకు సత్వర న్యాయం పొందే హక్కును కల్పించింది. కానీ, నేడు నిందితులకు విచారణ ఖైదీగా జైలు జీవితం గడపడం అతిపెద్ద శిక్షగా మారింది. అందుకు కారణం ప్రభుత్వాలు దేశ జనాభాకు తగ్గట్లుగా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, న్యాయమూర్తులను నియమించకపోవడం, న్యాయస్థానాలకు కావలసిన భవన సముదాయాలు, వసతులు, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడమే. దేశంలో జైళ్ల సంఖ్యను పెంచి, జైళ్లలో కనీస వసతులతో ఖైదీలకు పౌష్ట ఆహారం, మెరుగయినా వైద్య సదుపాయాలు అందించాలి. అప్పుడే కస్టోడియల్ మరణాలు తగ్గి, రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛగా జీవించే హాక్కును రక్షించనివారిగా పాలకులు చరిత్రలో నిలిచిపోతారు. అదే సమయంలో దేశంలోని పౌరులకు విద్యార్థి దశ నుండి పోలీసు, జైళ్ల వ్యవస్థలపై, నేరాలపై, కేసుల నమోదు ప్రక్రియ నుండి న్యాయవ్యవస్థ విచారణ వరకు ప్రాథమిక అంశాలను విద్యా బోధనలో నేర్పించాలి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్న పోలీసులపై, అవే క్రిమినల్ చట్టాల ప్రకారం వారిపై కేసులు నమోదు చేసే స్థాయికి యువకులు, ప్రజలు ఎదుగవలసి ఉంది. (క్లిక్ చేయండి: విన్నారా? ‘మెదడే’ ప్రమాదకరమట!) – కోడెపాక కుమార స్వామి, హైదరాబాద్ -
6,700 సీబీఐ కేసులు.. కోర్టుల్లోనే పెండింగ్
న్యూఢిల్లీ: సీబీఐ దర్యాప్తు ముగించిన 6,700 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తెలిపింది. ఇందులో 275 కేసులు 20 ఏళ్లు పైబడి న్యాయస్థానాల్లో విచారణ కోసం ఎదురు చూస్తున్నాయని 2021 సంవత్సరం నివేదికలో వెల్లడించింది. వీటితోపాటు 10,974 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్నట్లు వివరించింది. వీటిలో 361 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు 20 ఏళ్లకు పైగా హైకోర్టులు, సుప్రీంకోర్టులో మూలుగుతున్నాయంది. పనిభారం, సిబ్బంది కొరత, అనుమతుల్లో జాప్యం, కరోనా కారణాలతో దర్యాప్తు జాప్యం అవుతోందని సీవీసీ పేర్కొంది. -
కోర్టుల్లో 5 కోట్ల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్లకు చేరువలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఒక న్యాయమూర్తి 50 కేసుల్ని పరిష్కరిస్తే, కొత్తగా మరో 100 కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. వివాదాల పరిష్కారానికి న్యాయస్థానాలను ఆశ్రయించాలన్న అవగాహన ప్రజల్లో బాగా పెరిగిందని అందుకే కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సమక్షంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రబ్యునల్ పనితీరుపై శనివారం జరిగిన సెమినార్కు కిరణ్ హాజరయ్యారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందన్నారు. కింద కోర్టుల్లో 4 కోట్లకు పైగా, సుప్రీం కోర్టులో 72 వేల కేసులకు పైగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే భారం తగ్గుతుందన్నారు. కేంద్రం ప్రతిపాదనలో ఉన్న మధ్యవర్తిత్వంపై చట్టాన్ని త్వరగా తీసుకువస్తే కోర్టులకి కొంత ఊరట లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మరో కార్యక్రమంలో మాట్లాడుతూ కోర్టులో పెరిగిపోతున్న పెండింగ్ కేసులు మోయలేని భారంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వ వ్యవస్థే కేసుల భారాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. -
ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కుటుంబ న్యాయస్థానాల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్లో ఉండటంపై లోక్సభ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. ఈ కేసుల విచారణను త్వరితగతిన ముగించాలని పిలుపునిచ్చారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం లోక్సభలో ఫ్యామిలీ కోర్టుల సవరణ బిల్లు–2022ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జనతాదళ్ (యు)కు చెందిన కౌశలేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఫ్యామిలీ కోర్టుల్లో పెండింగ్ కేసుల భారం ప్రస్తుతం 11.4 లక్షలకు పెరిగిందని, ఈ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 715 కుటుంబ న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి తీసుకునే చర్యలను ప్రభుత్వం వెల్లడించాలని బిజూ జనతాదళ్కు చెందిన మహ్తాబ్ కోరారు. చర్చను ప్రారంభిస్తూ బీజేపీకి చెందిన సునితా దుగ్గల్.. కేసుల విచారణను వేగవంతం చేసేందుకు కుటుంబ న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కుటుంబం, వివాహ సంబంధ సమస్యల పరిష్కారానికి కేంద్రం 1984లో ఫ్యామిలీ కోర్టుల చట్టం ద్వారా ఈ న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా 2008లో నాగాలాండ్లో రెండు, 2019లో హిమాచల్ ప్రదేశ్లో మూడు కుటుంబ న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. గత ఏడాది హిమాచల్ హైకోర్టు విచారణ సందర్భంగా రాష్ట్రంలోని ఫ్యామిలీ కోర్టులకు అధికార పరిధి లేదనే అంశం తెరపైకి వచ్చింది. ఫ్యామిలీ కోర్టు చట్టాన్ని హిమాచల్కు పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయనందునే ఇలాంటి పరిస్థితి వచ్చిందని హిమాచల్ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పేర్కొంది. నాగాలాండ్లోని ఫ్యామిలీ కోర్టులు కూడా 2008 నుంచి ఎలాంటి చట్టపరమైన అధికారం లేకుండా పనిచేస్తున్నాయి. ఈ చట్టంలో తాజాగా చేపట్టిన సవరణల ద్వారా ప్రభుత్వం ఇటువంటి లోపాలను సవరించే ప్రయత్నం చేసింది. కుటుంబ న్యాయస్థానాల ఏర్పాటు, వాటి పరిధిపై సంబంధిత హైకోర్టులతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని తెలిపింది. -
ఏడున్నర లక్షల కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపుతో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ నిర్వహించిన లోక్ అదాలత్కు స్పందన లభించింది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా ఏడున్నర లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో 8,175 ప్రిలిటిగేషన్ కేసులు కాగా, మిగతావి వివిధ రకాలైన పెండింగ్ కోర్టు కేసులు. ఈ కేసుల కింద రూ.109.45 కోట్ల పరిహారం లబ్ధిదారులకు చెల్లించేలా ఆదేశాలిచ్చినట్లు న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రెటరీ, జిల్లా, సెషన్స్ జడ్జి ఎస్.గోవర్ధన్రెడ్డి తెలిపారు. మూడేళ్లలోపు శిక్ష పడే కేసులు, రాజీకి అవకాశమున్న చిన్న కేసులనే లోక్ అదాలత్లో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. మెట్రోపాలిటన్ కోర్టుల్లో 3.55 లక్షల కేసులు: మెట్రోపాలిటన్ కోర్టుల పరిధిలోనే 24 బెంచ్లు ఏర్పాటుచేసి, 3,55,727 కేసులు పరిష్కరించినట్లు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాపిరెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి, సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ తెలిపారు. రూ.2,43,88,400 పరిహారం చెల్లించాలని ఆదేశాలిచ్చామన్నారు. హైకోర్టులో 629 కేసులు రాజీ: హైకోర్టు లోక్అదాలత్లో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జస్టిస్ పి.నవీన్రావు ఆదేశాల మేరకు ప్రత్యక్ష, పరోక్ష విధానాల్లో ఆసక్తి చూపిన కక్షిదారుల కేసుల్ని రాజీ చేశారు. న్యాయ మూర్తులు జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ సాంబశివనాయుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.యతిరాజులు అధ్యక్షతన వేర్వేరుగా 629 కేసుల్ని పరిష్కరించారు. 1150 మంది లబ్ధిదారులకు రూ.36.60 కోట్ల పరిహారం చెల్లింపులకు ఆదేశించినట్లు కమిటీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రాంతానికో ఉప లోకాయుక్త
బి.కొత్తకోట: రాష్ట్ర లోకాయుక్తలో 5 వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని ఏపీ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి చెప్పారు. వీటిని పరిష్కరించి ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు వీలుగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు మూడు ఉప లోకాయుక్తలను నియమించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ వచ్చిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో మూడేళ్లు లోకాయుక్త నియామకం జరగలేదని, దీనితో కేసుల సంఖ్య పెరిగిందని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా, న్యాయవాది అవసరం లేకుండా ఫిర్యాదులకు న్యాయం చేస్తామని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బోగస్ ఫిర్యాదులకు ఆధార్తో చెక్.. బోగస్ ఫిర్యాదుల వల్ల తమ విలువైన సమయం వృథా అవుతోందని, వీటిని నివారించేందుకు ఫిర్యాదుదారు ఫొటో, ఆధార్ నంబర్ జత చేసేలా నిబంధన విధించాలని ఆలోచిస్తున్నామని జస్టిస్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం రూ.50 లక్షలకు మించకూడదనే నిబంధన ఉందని, ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ ఇచ్చే పద్ధతి పాటించకుండా అందరినీ సమంగా చూసే విధంగా నిబంధనలు పాటించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చామని తెలిపారు. పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూములు, ఆస్తుల రక్షణ బాధ్యత రెవెన్యూ శాఖకు ఉందని, దీనిపై 2011లో జారీ అయిన జీవో అమలుకావడం లేదని పేర్కొన్నారు. దీనిపై జిల్లా, డివిజన్ స్థాయి అధికారిక కమిటీలు సమావేశాలు, సమీక్షలు జరిపి ఆస్తులను కాపాడాలని కలెక్టర్లకు లేఖలు రాశామన్నారు. హార్సిలీహిల్స్ సహకార గృహ నిర్మాణ సంఘానికి ప్రభుత్వం విక్రయించిన భూమి ఏ స్థితిలో ఉంది, భూమి కేటాయింపు, ఆక్రమణలపై సమగ్ర విచారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు భూ పరిహారం, నిర్వాసితులకు అందాల్సిన ఆర్థిక సహాయంపై బోగస్ లబ్ధిదారులు పుట్టుకొచ్చినట్టు ఫిర్యాదులు అందాయని, దీనిపై పోలవరంలో క్యాంపు ఏర్పాటు చేసి విచారణ చేపడతామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన భూములు అన్యాక్రాంతమైనట్టు ఆ శాఖ కమిషనర్ నివేదిక ఇచ్చారని, దీనిపై చర్యలకు ఆదేశిస్తామని చెప్పారు. లోకాయుక్తకు చేసే ఫిర్యాదుల విషయంలో దళారులను అశ్రయించవద్దని కోరారు. -
వివాదాలకు ‘ప్రత్యామ్నాయ’ పరిష్కారాలు
శ్రీనగర్: న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఇందుకోసం వివాదాల పరిష్కారానికి కక్షిదారులు ప్రత్యామ్నాయ యంత్రాంగాలను ఎంచుకొనేలా జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థ కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. కక్షిదారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉండే క్షేత్రస్థాయిలోని జిల్లా న్యాయ వ్యవస్థ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. సాధ్యమైనంత వరకు వారిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించాలన్నారు. దీనివల్ల కక్షిదారులకు మేలు జరగడమే కాకుండా, కోర్టులపై పెండింగ్ కేసుల భారం తగ్గిపోతుందని చెప్పారు. జస్టిస్ ఎన్వీ రమణ శనివారం జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో ఓ కార్యక్రమంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. కేసుల పరిష్కారానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలోని లీగల్ సర్వీసెస్ అథారిటీలను సమర్థంగా వాడుకోవాలని కోరారు. కక్షిదారుల్లో నిరక్షరాస్యులు, చట్టాలపై అవగాహన లేనివారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఉంటారని, అలాంటి వారికి ఉపశమనంగా కలిగించేలా సేవలు అందించాలని న్యాయవాదులను కోరారు. వృత్తిపరమైన ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, విలువలకు కట్టుబడి ఉండాలని చెప్పారు. న్యాయాన్ని తిరస్కరిస్తే అరాచకమే.. తమ హక్కులకు, గౌరవానికి గుర్తింపు, రక్షణ లభిస్తున్నాయని ప్రజలు భావించడమే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సూచిక అని జస్టిస్ ఎన్వీ రమణ తెలియజేశారు. న్యాయాన్ని తిరస్కరిస్తే అది అరాచకానికే దారి తీస్తుందన్నారు. న్యాయవాదుల సహాయం లేకుండా కోర్టుల్లో ఉత్తమమైన తీర్పు వెలువడే అవకాశం లేదన్నారు. తీర్పు విషయంలో బెంచ్, బార్ సంబంధం కీలక పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు. కక్షిదారులకు సానుకూల వాతావరణం కల్పించేందుకు న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రయత్నించాలని చెప్పారు. ప్రజల హక్కులను కాపాడితేనే శాంతి పరిఢవిల్లుతుందన్నారు. జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టులో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
లోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కారం
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యాయి. 22,805 కేసులను ఈ లోక్ అదాలత్లో పరిష్కరించగా, రూ.33.60 కోట్ల పరిహారం అందజేశారు. ఈ 22,805 కేసుల్లో 20,489 పెండింగ్ కేసులు కాగా, 2,316 ప్రీ లిటిగేషన్ కేసులున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లో 353 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టులో కూడా లోక్ అదాలత్ జరిగింది. న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్య మూడు బెంచ్లను నిర్వహించారు. మొత్తం 629 కేసులు పరిష్కరించారు. ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, ఏపీ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ ఏవీ శేషసాయి ఆదేశాలు, మార్గదర్శకత్వంలో లోక్ అదాలత్ను విజయవంతంగా నిర్వహించామని న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి చిన్నంశెట్టి రాజు, లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
సమన్యాయం అందించేందుకు సహకరించండి!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అందరికీ సమన్యాయం అందించడానికి ప్రజా ప్రభుత్వాలు సహకారమందించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. వివిధ కోర్టుల్లో ఖాళీల పూరింపునకు కొలీజయం చేసిన సిఫార్సులను సత్వరమే ఆమోదించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సిఫార్సుల సత్వర అమలుతో పెండింగ్ కేసుల సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చన్నారు. ఇప్పటికే పలు సిఫార్సులను ఆమోదించామని, త్వరలో మిగిలినవాటికి అనుమతినిస్తామన్న కేంద్ర న్యాయమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్తో న్యాయవ్యవస్థలో నెలకొన్న లోతైన సమస్యలు బయటపడ్డాయన్నారు. బలహీనవర్గాలకు సత్వర సమన్యాయం అందాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని నల్సా(జాతీయ న్యాయసేవల అథారిటీ) ఆధ్వర్యంలో ఆరువారాలు సాగే ‘పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్, అవుట్రీచ్ క్యాంపెయిన్’ను రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ శనివారం ఆరంభించారు. ఈ కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు. బలహీన వర్గాల సంక్షేమంతోనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమని గాంధీ భావించేవారని రమణ గుర్తు చేశారు. సమ్మిళిత వృద్ధి మాత్రమే స్థిరమైన, శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి దారి తీస్తుందనేది కాదనలేని సత్యమని తెలిపారు. సమన్యాయం తక్షణ అవసరం సమన్యాయం అందించకుండా సామాజిక ఆర్థిక సమానత్వం సాధించడం అసాధ్యమన్నారు. దీన్ని గుర్తించి అందరికీ సమన్యాయం అందించేందుకు కార్యనిర్వాహక, చట్టసభలు, న్యాయవ్యవస్థలు కలిసి పనిచేయాలన్నారు. ప్రజాస్వామ్య నాణ్యత నాణ్యమైన న్యాయంపైనే ఆధారపడి ఉంటుందని, ప్రజాస్వామ్య దేశంలో సంస్థల్ని నిలబెట్టేది ప్రజల విశ్వాసం, నమ్మకమేనని పునరుద్ఘాటించారు. రెండున్నర దశాబ్దాల క్రితం ప్రారంభమైన నల్సా కోట్లాదిమందికి సేవలందించిందన్నారు. గాందీజీ జయంతినాడు మొదలైన ఈ కార్యక్రమం నెహ్రూ జయంతి రోజున ముగుస్తుందన్నారు. న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు చేరుకోవడానికి యతి్నస్తున్నామని, దీనికి అందరి సహకారం కావాలన్నారు. న్యాయవాది అయిన రాష్ట్రపతిని పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు రమణ చెప్పారు. చట్టపరమైన సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్రపతి అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళాభివృద్ధికి పాటుపడాలి సీనియర్ న్యాయవాదులు మహాత్మా గాంధీ ఆదర్శాలను పాటించి, పేదలకు సేవలందించాలని రాష్ట్రపతి కోవింద్ సూచించారు. మహిళాభివృద్ధికి అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళాభివృద్ది భావన నుంచి మహిళల వల్ల అభివృద్ధి అనే భావనకు మరలాలన్నారు. సహేతుకమైన మూల్యానికి ఉత్తమ న్యాయ ప్రతిభ అందుబాటులో ఉండాలని గాంధీ కోరుకునేవారన్నారు. లాయర్లు తమ సమయంలో కొంత బలహీనవర్గాల సేవలకు కేటాయించాలన్నారు. కోర్టు బయట పరిష్కారాలను గాం«దీజీ బలంగా విశ్వసించేవారన్నారు. న్యాయవాద వృత్తిలో మహిళల పాత్ర మరింత పెరగాలన్నారు. స్వాతంత్య్రోద్యమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. అందరికీ న్యాయ సేవలు అందించడానికి నల్సా చేస్తున్న సేవలనుకోవింద్ ప్రశంసించారు. -
కౌశిక్రెడ్డికి కేసుల గండం?
సాక్షి, హైదరాబాద్: నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీ పదవిపై గందరగోళం ముసురుకుంది. ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే రాష్ట్ర మంత్రి మండలి ఈ నెల 2వ తేదీనే తీర్మానం చేసి పంపినా.. ఇప్పటివరకు గవర్నర్ ఆమోదించినట్టుగా ప్రకటనేదీ రాలేదు. వాస్తవానికి కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ఫైలు సీఎం కార్యాలయంలోనే ఉందని.. కౌశిక్రెడ్డిపై పలు పోలీసుస్టేషన్లలో కేసులు పెండింగ్లో ఉండటమే దీనికి కారణమని విశ్వసనీయ సమాచారం. ఆయా కేసుల వివరాలను పూర్తిగా సేకరించాకే.. ఫైలును గవర్నర్ ఆమోదం కోసం పంపే అవకాశం ఉందని తెలిసింది. చాలా పోలీస్స్టేషన్లలో..: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్రెడ్డిపై ఇల్లందకుంట, సుబేదారి పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టారు. ఆ తర్వాత కూడా వీణవంక, హుజూరాబాద్ టౌన్, కరీంనగర్, జమ్మికుంట, సిరిసిల్ల తదితర పోలీస్స్టేషన్ల పరిధిలో వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వాహనం పార్కింగ్ విషయంలో తమ బంధువుపై కౌశిక్రెడ్డి దాడి చేశారని 2019 ఫిబ్రవరిలో సినీనటులు జీవిత, రాజశేఖర్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు కూడా. మొత్తంగా ఆయా కేసులేమిటి, వాటి వెనుక ఉన్న కారణాలేమిటన్న దానిపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ నివేదికను పూర్తిగా పరిశీలించాకే.. కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్కు పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. హడావుడి సిఫారసు నేపథ్యంలో.. టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ నిష్క్రమణ నేపథ్యంలో.. అప్పటికి కాంగ్రెస్లోనే ఉన్న కౌశిక్రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి తానేనంటూ చేసిన ప్రకటన వివాదాస్పమైంది. కౌశిక్రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మొదట్లో భావించినా.. తర్వాత పునరాలోచనలో పడినట్టు సమాచారం. అయితే హుజూరాబాద్లో రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కౌశిక్రెడ్డిని హడావుడిగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ తీర్మానించారు. సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవ తదితర రంగాల్లో అనుభవమున్న వారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అధికారం రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. దేశవాళీ క్రికెట్లో రాణించిన కౌశిక్రెడ్డి.. తన తల్లి పేరిట కరీంనగర్ జిల్లాలో ‘పుష్పమాల దేవి మెమోరియల్ ట్రస్టు’ పెట్టి 2009 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మేరకు క్రీడా, సేవా రంగాల్లో చేసిన కృషి మేరకు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తున్నట్టు కేబినెట్ తీర్మానంలో పేర్కొంది. అయితే కౌశిక్రెడ్డికి పదవి ఇవ్వడంపై హుజూరాబాద్ టీఆర్ఎస్ శ్రేణులతోపాటు రాష్ట్ర నాయకుల్లోనూ అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలిసింది. ఇదే సమయంలో కౌశిక్రెడ్డిపై నమోదైన కేసుల విషయంగా సీఎంకు ఫిర్యాదులు అందాయని, దానితో నివేదిక కోరారని సమాచారం. ఆచితూచి నిర్ణయంపై.. మహారాష్ట్రలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను నామినేట్ చేయడంపై దాఖలైన పిటిషన్ హైకోర్టులో నెలల తరబడి నలుగుతోంది. మన రాష్ట్రంలోనూ గవర్నర్ కోటాలో గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్లను నామినేట్ చేయడంపై ధన్గోపాల్రావు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కౌశిక్రెడ్డి్డ విషయంగా ఆచితూచి అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ వీడటంలోనూ వివాదం పాడి కౌశిక్రెడ్డి కాంగ్రెస్ను వీడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్కు లంచం ఇచ్చారని కౌశిక్రెడ్డి ఆరోపించారు. దీనిపై మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం దావా వేశారు. -
రాష్ట్రవ్యాప్తంగా పాత కేసులపై పోలీసుల దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ కేసుల పరిష్కారం మళ్లీ వేగం పుంజుకోనుంది. వివిధ కారణాలతో దశాబ్దాలుగా నిలిచిపోయిన పాత కేసులను సాధ్యమైనంత త్వరగా తేల్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు డీజీపీ డాక్టర్ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశాలతో అన్ని జిల్లాల పోలీసు కమిషనర్లు, ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్పై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పోలీస్ శాఖను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో 2019 ఆగస్టు నుంచి పోలీసులు ప్రత్యేక ప్రణాళికతో రంగంలోకి దిగారు. గతేడాది మార్చి వరకు పెండింగ్ కేసుల పరిష్కారం బాగానే సాగినా.. ఆ తర్వాత కరోనా కారణంగా నెమ్మదించాయి. గతేడాది జనవరి ఆఖరిలోగా పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్పై నివేదిక ఇవ్వాల్సి ఉన్నా లాక్డౌన్తో బ్రేక్ పడింది. ఇపుడు మళ్ళీ క్రమంగా పాత పరిస్థితులు నెలకొనడంతో తిరిగి కేసుల పరిష్కారంపై పోలీసులు దృష్టి సారించారు.(చదవండి: 'ఆయన మృతికి వ్యాక్సిన్ కారణం కాదు') నేరస్తుల అప్పగింతతో.. నేరం ఆలస్యంగా వెలుగు చూడటం, నిందితులు ఇతర రాష్ట్రాలకు పారిపోవడం, బెయిల్ అనంతరం అదృశ్యమవడం తదితర కారణాల వల్ల కేసులు పెండింగ్లో పడిపోతున్నాయి. ఇలా రకరకాల కారణాలతో 1990 నుంచి 2018 వరకు రాష్ట్రంలో మొత్తం 17వేలకు పైగా పెండింగ్లో ఉన్నాయి. వీటిలో చాలామటుకు కేసుల్ని పోలీసులు క్లియర్ చేశారు. ఏడాదిన్నర కింద జరిగిన దక్షిణ భారత(సదరన్) డీజీల సదస్సులో రాష్ట్రాల మధ్య నేరస్థుల అప్పగింత ప్రస్తావన వచ్చింది. ఒక రాష్ట్రంలో నేరానికి పాల్పడి మరో రాష్ట్రంలో ఊరు, పేరు మార్చుకున్న వారిని అప్పగించేందుకు అందరూ సుముఖం వ్యక్తం చేశారు. ఇది కూడా నిందితులను వెంటనే స్వరాష్ట్రానికి తరలించి, కేసును పరిష్కరించడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో 20 ఏళ్లనాటి పెండింగ్ వారెంట్లలోనూ నిందితులను పట్టుకోవడంలో పోలీసులు సఫలీకృతమవుతున్నారు. నాలుగేళ్లుగా కరీంనగర్ టాప్! పెండింగ్ కేసుల పరిష్కారంలో కరీంనగర్ కమిషనరేట్ మంచి ఫలితాలు సాధిస్తోంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంటూ మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇదే విషయమై తాజాగా సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కరీంనగర్ కమిషనర్ కమలాసన్రెడ్డి, సిబ్బందిని డీజీపీ మహేందర్రెడ్డి అభినందించారు. ఇక కేసుల పరిష్కారంలో రెండో స్థానంలో మహబూబ్నగర్ ఉండగా తర్వాత వరుసగా నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, రామగుండం కమిషనరేట్లు నిలిచాయి. -
కట్టుకథలకు కాలం చెల్లింది
మాజీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులపై ఉన్న పెండింగ్ కేసుల వూర్తి వివరాలను వెంటనే అందించాలి, వీటిని రోజువారీ ప్రాతిపదికన విచారించి, రెండు నెలల్లోగానే పరిష్కరించాలని సుప్రీంకోర్టు.. అన్ని రాష్ట్రాల హైకోర్టులను తాజాగా ఆదేశించింది. వీటిపై త్వరగా విచారణ చేయాలని, హైదరాబాద్లోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీ.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు ప్రత్యేక న్యాయమూర్తినీ, ప్రిన్సిపల్ సీబీఐ జడ్జినీ, ప్రిన్సిపల్ ఏసీబీ జడ్జీలనూ నియమించా లని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, ఎనిమిదేళ్ల క్రితం ఆనాటి సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణను 27–10–2020కి అప్డేట్ చేసింది. – (29–10–2020 వార్తలు) నిజానికి, దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా ప్రస్తావించి, వెంటనే ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలు అందించి, రాష్ట్రాల హైకోర్టులు రెండు నెలల్లోగా వీటిని పరిష్క రించాలన్న ఆదేశం చాలా ఆలస్యంగా వచ్చినా మెచ్చదగింది. అయితే అంతూ పొంతూ లేకుండా ఏళ్లూపూళ్లుగా, దశాబ్దాలుగా ఈ కేసులు నాన్పుడు బేరంగా సాగడానికి గల కారణాలను కూడా పరిశీలించి వెలికి తీయాలని మాత్రం సుప్రీంకోర్టు ఆదేశించలేకపోవడం విచార కరం. కొద్ది రోజుల క్రితమే జాతీయ స్థాయి ఏటీఆర్ రిపోర్టు దేశ వ్యాప్తంగా 4,400 పైచిలుకు ఎంపీలు, ఎమ్మెల్యేలపై.. హత్యలు, బెది రింపులు, మానభంగాలు, వేధింపులు వగైరా అనేక నేరాలకు సంబం ధించిన కేసులు పేరుకు పోయి ఉన్నాయని వెల్లడించి దేశప్రజల్ని తెల్లబోయేలా చేసింది. దాదాపు 74 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత మన దేశం ఇంతటి దుర్భర స్థితిలో ఉండటానికి కారణాలేమిటో, కారకు లెవరో నిర్మొహమాటంగా నిగ్గుదేల్చవలసిన ఘడియలివి. నిజానికి 1970ల నాటికే కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏఎన్ ఓహ్రా.. నవభారత రాజ్యాంగ స్ఫూర్తిని కుమ్మరి పురుగులా నిలువెల్లా తొలచివేస్తున్న మూర్తిత్రయం ఎవరంటే రాజ కీయనాయకులు.. వారు ఆధారపడిన నేరగాళ్లు, బేర గాళ్లు.. వారికి అండగా నిలిచిన పోలీసు యంత్రాంగం అని ప్రకటించారు. ప్రమోషన్ల కోసం లేదా పదవీ విరమణానంతరం పదవులకోసం ఎగబడే కొందరు మాజీ ప్రధాన న్యాయ మూర్తుల వల్ల కూడా వ్రజాస్వామ్య వ్యవస్థా చట్రానికి తెగులు పట్టి పీడిస్తోంది. ఇందులో దుర్భిణీ వేసి ఏరికోరి వెతికి తీయవలసిన వారి సంఖ్య తక్కువ కాదని ఏటీఆర్ తాజా నివేదిక నిరూపిస్తోంది. ఎందుకంటే మనం కాలక్షేపం చేస్తున్నది పైకి ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అయినా, అట్టడుగున పెంచుకున్న పునాది మాత్రం భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థది. దాని తాలూకు అవ లక్షణాలను మూలాల దాకా తొలగించుకోనంత కాలం ఆ లక్ష ణాలు వ్యవస్థని వెన్నాడుతూనే ఉంటాయి. వీటి ప్రభావానికి ప్రస్తుత రాజ కీయపక్షాలు, రాజకీయ నాయకులు, పాలకులు, కేంద్ర రాష్ట్రాల శాసనవేదికలు, న్యాయస్థానాలు తరచుగా లోనవుతూనే ఉంటాయి. ఈ పూర్వరంగంలోనే ఆంధ్రప్రదేశ్ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అర్ధాంతరంగా దివంగతులైన తర్వాత రాష్ట్రంలో ఏర్ప డిన రాజకీయ శూన్యతలో ముందుకు దూసుకువచ్చి కేంద్ర కాంగ్రెస్ అధిష్టానవర్గానికి కంటగింపుగా మారిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు పాదయాత్ర కాస్తా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తునే కాకుండా, అప్పటికే అడుగూడిపోయిన చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టింది. రాష్ట్ర రాజకీయాల్లోకి ఒకవైపున కాంగ్రెస్ కుట్రల మధ్య, కాలుకాలిన పిల్లిలా చంద్రబాబు మరొకవైపు నుంచి జగన్మోహన్రెడ్డిని అడకత్తెరలో పావు చెక్కను చేసి దెబ్బతీసే ఉద్దేశంతో– జమిలిగా పన్నిన కుట్ర ఫలి తమే ఈ క్షణం దాకా జగన్పై మోపి, ఆయనను నిష్కారణంగా జైలుకు పంపడంలోను సీబీఐ ద్వారా అల్లించిన కేసుల కథాకమా మీషూ! జగన్పై మోపిన 22 కేసుల్లో బలం ఉన్న పక్షంలో, స్పెషల్ కోర్టు విచారణ సందర్భంలోనే జగన్ కంపెనీల్లోకి తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిత్వంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు తర లించాయన్న ఆరోపణ వైఎస్సార్ సజీవుడై ఉన్నప్పుడే దూసుకు రావ లసింది. కానీ వైఎస్సార్ చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశాన్ని అడ్డుకోవడానికి ‘కథ’ అల్లిన వైనం కూడా చిత్రమైన కుట్ర. చనిపోయిన ఆయన ఎలాగూ రాడు, కాబట్టి వైఎస్సార్ కేబినెట్ సమష్టి నిర్ణయాలు ఆధారంగా జగన్ తన ఎదు గుదల కోసం తన కంపెనీల్లోకి ‘గుత్త’గా కొన్ని కంపెనీల నుంచి అప్పనంగా రాబట్టుకున్నాడన్న వాదన బయలుదేరడానికి ఎన్నో రోజులు పట్టలేదు. పైగా రోశయ్య తర్వాత ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన కిరణ్కుమార్రెడ్డి నాయకత్వంలో కొనసాగిన వైఎస్సార్ మంత్రివర్గ సభ్యులు ముక్తకంఠంతో కాంగ్రెస్ అధిష్టానం, చంద్రబాబు ఆరోపణ లను ఖండించారు. వారిలో మంత్రివర్గ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు ఇత్యాది మంత్రులూ ఉన్నారు. ఆమాటకొస్తే– వైఎస్సార్ ముఖ్యమం త్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార భాషా సంఘం అధ్యక్షు నిగా నేను 2005 నుంచి 2009 వరకూ సచివాలయంలో పనిచేసిన న్నాళ్లూ– ఏ రోజునా, అందరి ముఖ్యమంత్రుల కొడుకులూ, కూతుళ్లు, అల్లుళ్ల మాదిరిగా జగన్మోహన్రెడ్డి సచివాలయానికి వచ్చినట్లుగానీ, తండ్రిని కలిసివెళ్తున్నట్లుగానీ ఒక్క ఉదాహరణ కూడా లేదు. అనేక మంది మంత్రుల, ముఖ్యమంత్రుల పిల్లలు తరచూ ‘ఆసులో గొట్టాం’లా సచివాలయానికి వస్తూపోతూ ఉండటం ఒక అలవాటుగా మనకు తెలుసు. అదలా ఉంచుదాం. జగన్పై చంద్ర బాబు ముఠా, వాళ్ల ప్రచార బాకాలు చేసిన మరొక విచిత్ర ఆరోపణ– ‘తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారుల్ని రూ. 35 కోట్ల మేర జగన్ మోసం చేశాడట. ఇలాంటి కట్టుకథల ఆధారంగా ‘ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సీబీఐ మోపిన కేసుల్లో విచారణ ఇప్పటికీ కొనసాగుతోంద’ని బీబీసీ తెలుగు ప్రసార వాణి ప్రకటిస్తూ, జగన్పై కేసులు ఏపీలో మోపడం ఎలా ప్రారం భమైందో వివరించింది: ‘తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ ఎర్రన్నా యుడు, నాటి కాంగ్రెస్ నేత శంకరరావు 2010లో రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిషన్లతో ఈ కేసులు నమోదయ్యాయి. నాడు ఎంపీగా ఉన్న జగన్ ‘క్విడ్ ప్రోకో’ పద్ధతిలో కొన్ని సంస్థలకు భూములు, మైనింగ్ లైసెన్సులు, ఇతర అవకాశాలు కల్పించి– బదులుగా జగన్ సొంత సంస్థ ‘జగతి’లో పెట్టుబడులు పెట్టించుకున్నారని ఆరోపణలు నమో దయ్యాయి. ఈ పెట్టుబడుల్ని లంచాలుగా చూపుతూ ఆ డబ్బును హవాలాగా మార్చడంలో జగన్ కీలక పాత్ర పోషించారన్నది అభియోగమని, సీబీఐ విచారణకు పునాది అనీ బీబీసీ చెప్పింది. రుజువులు చూపలేని ఈ కూట రాజ కీయం ఆధారంగానే 2012 మేలో జగన్ను అరెస్టు చేయించి, 16 మాసాలు చంచల్గూడ జైలులో నిర్బంధింపజేయడానికి అటు కాంగ్రెస్, ఇటు చంద్రబాబు పార్టీలు ఎలా కారకులయ్యాయో బీబీసీ నివేదిక చెప్పకనే చెప్పింది. జగన్పై కేసును సీబీఐ విచారణకు హైకోర్టు అప్పగించింది. 2011 ఆగస్టు 10న కేసు నమోదైంది. 2004–2009 మధ్య కాలంలో ‘నేరం జరిగిందన్న’ అనుమానంతో ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ను సీబీఐ నమోదు చేసింది. ఈ కేసులో ముఖ్య నిందితునిగా వైఎస్ జగన్, విజయ సాయిరెడ్డిని ఇరికించగా, కేసులో మొత్తం నిందితులుగా పేర్కొన్న వారు 72 మంది. జగన్పై మోపిన కేసులకు ‘నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, లెక్కలు తారమారు చేయడం’ లాంటి పేర్లు తగిలించింది సీబీఐ. ఇలా అల్లిన డజను అభియోగాల ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐదు అభియోగపత్రాలు తయారీ చేసింది. అయితే 31.3.2012తో ప్రారంభించిన సీబీఐ మొదటి చార్జిషీట్ లగాయతు గత ఎనిమిదేళ్లుగానూ జగన్వల్ల ‘క్విడ్ప్రోకో’ మంత్రం వల్ల లాభించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఏ ఒక్క కంపెనీగానీ లేదా సంస్థగానీ సీబీఐ ప్రత్యేక కోర్టు చర్యకు గురికాలేదు, అరెస్టయిన సంస్థలు, వ్యక్తులు, ప్రతినిధులుగానీ విడుదల అయ్యారేగానీ కోర్టు చర్యకు గురికాలేదు. కాగా, ఈ మధ్య కాలంలో సీబీఐ జగన్పై కేసుల నిరూపణలో సాక్ష్యాలు చూపడంలో తరచుగా విఫలమవుతూ నోరెళ్లబె డుతూ ఉండటం గమనించిన ప్రత్యేక కోర్టు గౌరవ న్యాయమూర్తులు ఎప్పుడు మీ సాక్ష్యాలు, ఎక్కడ మీ సాక్ష్యాలు, ఇంకెన్నాళ్లు తీసుకుం టారు సాక్ష్యాలు చూపడానికి అంటూ పదేపదే ప్రశ్నించవలసి రావడం– సీబీఐ కేసు కాంగ్రెస్, టీడీపీల ప్రత్యక్ష ప్రేరేపిత చర్య అని చెప్పక చెబుతోంది. ఇటువంటి కుట్రలు మరెంత కాలమో సాగవు. చంద్రబాబు నాయుడు హయాంలో వ్యవస్థల్ని, వాటిలోని ప్రధాన అధికారులను, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, కొందరు సీబీఐ స్థానిక అధికారుల్ని సాకడం ద్వారా పలు కేసులనుంచి, బడా కంపె నీలకు వందల ఎకరాల భూమిని దోచిపెట్టిన కేసుల నుంచీ ఈరోజుకీ తప్పించుకు తిరుగుతున్నవాడే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ వాదులుగా, జడ్జీలుగా ప్రమోట్ చేయించి, సుప్రీంకోర్టు దాకా పంపించి, సుప్రీంకోర్టులోనూ, రాష్ట్ర హైకోర్టులోనూ తనకు అనుకూల తీర్పులు పొందడానికి పదవిలో ఉండగానో, పదవి ఊడిన తర్వాత ప్రతిపక్ష నాయక స్థానంనుంచీ చంద్రబాబు ఎటువంటి దుష్టపాత్ర వహిస్తున్నదీ నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇందుకు మహాభారత దుష్ట పాత్రలో దుర్యోధనుడి మాటలే సాక్ష్యం– ‘నిజమేదో నాకు తెలుసు, కానీ దానివైపు నా మనస్సు మళ్లదు, అబద్ధమేదో కూడా నాకు తెలుసు, కానీ దాని నుంచీ నా మనస్సు మళ్లదు’ అన్నాడు. బాబు మనస్సూ అంతే సుమా. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అరెస్ట్ చేయకపోవడం సీరియస్ విషయం!
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న చట్ట సభల సభ్యులను అరెస్ట్ చేయడంలో పోలీసులు ప్రదర్శిస్తున్న అలసత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా సీరియస్ అంశమని వ్యాఖ్యానించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెద్ద సంఖ్యలో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ.. ఒత్తిడికి తలొగ్గి వారిని పోలీసులు అరెస్ట్ చేయడం లేదని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పెండింగ్ కేసుల విచారణకు వీడియో కాన్ఫెరెన్స్ సదుపాయం కల్పించాలని పలు హైకోర్టులు కోరుతున్నాయని తెలిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల పూర్తి వివరాలను తాజాగా తమకు అందించాలని, అలాగే, కేసుల త్వరిత విచారణకు తమ రాష్ట్రంలో ఎన్ని వీడియో కాన్ఫెరెన్స్ సదుపాయాలు అవసరమవుతాయో తెలపాలని హైకోర్టులను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఆదేశించింది. కేసుల విచారణ త్వరితగతిన సాగేందుకు కింది కోర్టులపై హైకోర్టుల కఠిన పర్యవేక్షణ అవసరమని ఈ విచారణలో అమికస్ క్యూరీగా నియమితుడైన సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సూచించారు. (చదవండి: గల్ఫ్దేశాలకు ఆదేశాలు ఎలా ఇస్తాం?) -
హైకోర్టుల్లో కేసుల పరిష్కారం సగమే!
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణ పరిస్థితుల్లోనే పెండింగ్ కేసులు ఎక్కువ, సిబ్బంది తక్కువ కారణంగా న్యాయ వ్యవస్థలో కేసుల పరిష్కారం అంతంత మాత్రంగా కొనసాగుతుండగా, కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తోన్న ‘నేషనల్ జుడీషియల్ డాటా గ్రిడ్’ లెక్కల ప్రకారం హైకోర్టుల్లో కేసుల పరిష్కారం 50 శాతం పడిపోగా, వాటి దిగువ కోర్టుల్లో 70 శాతం పడి పోయాయి. గ్రిడ్లో సుప్రీం కోర్టు డాటా అందుబాటులో లేదు. అయితే లీగల్ ఆర్కివ్స్ వెబ్సైట్ ‘సుప్రీం కోర్టు అబ్జర్వర్’ కథనం ప్రకారం 2018, ఏప్రిల్ నెల నాటికి సుప్రీం కోర్టు 10,586 కేసులను, 2019లో ఏప్రిల్ నెలనాటికి, 12,084 కేసులను పరిష్కరించగా, 2020, ఏప్రిల్ నెల నాటికి కేవలం 355 కేసులను మాత్రమే పరిష్కరించగలిగింది. మార్చి 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో హఠాత్తుగా కోర్టుల కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఆ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు అత్యవసర కేసుల విచారణ చేపట్టి, మిగితా కేసుల విచారణ పెండింగ్లో పడేసింది.. ఆ తర్వాత కేసుల్లో భౌతిక విచారణను పక్కకు పెట్టి వీడియో కాన్ఫరెన్స్ విచారణను చేపట్టింది. ఈ విషయంలో హైకోర్టులు కూడా సుప్రీం కోర్టునే అనుసరించాయి. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్ప్ విచారణలను పక్కకుపెట్టి భౌతిక విచారణను ప్రారంభించాలని హైకోర్టులు నిర్ణయించాయి. అయితే అస్సాం హైకోర్టు సిబ్బంది అందుకు సమ్మెతించడం లేదు. దేశంలో జిల్లా కోర్టులు మార్చి 28 నుంచి ఆగస్టు 28వ తేదీ మధ్య 12 లక్షల కేసులకుపైగా పరిష్కరించాయని, ఇదో మైలురాయని ‘సుప్రీం కోర్టు ఈ కమిటీ’ వెబ్సైట్ ప్రారంభోత్సవంలో డీవై చంద్రచూడ్ తెలిపారు. -
కోర్టులకు సవాలుగా మారిన పెండింగ్ కేసులు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో దాదాపు 37 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీం కోర్టు, హైకోర్టు, జిల్లా, తాలుకా కోర్టుల్లో ఉన్న 3.7 కోట్ల కేసుల్లో 10 శాతం (37 లక్షలు) కేసులు పెండింగ్లో ఉన్నట్లు నేషనల్ జ్యుడీయల్ డేటా గ్రిడ్(ఎన్జేడీజీ) వెల్లడించింది. జాతీయ న్యాయస్థానాల పనితీరును ఎన్జేడీజీ పర్యవేక్షిస్తుంది. దీని ప్రకారం.. జిల్లా, తాలూకా కోర్టుల్లో 28 లక్షల కేసులు, హైకోర్టులలో 9,20,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 6,60,000 కేసులు 20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉండగా.. ఇక 3 దశాబ్దాలకు పైగా 1,31,000 కేసులు పెండింగ్లో ఉన్నట్లు ఎన్జేడీజీ నివేదికలో పేర్కొంది. కేసులు పేరుకుపోవడంపై జూన్ 15న సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా క్రిమినల్ అప్పీల్స్, బెయిల్ పిటిషన్లు ఎక్కువ కాలం పెండింగ్లో ఉన్నట్టు సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది. (రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు నిల్వ చేసుకోండి) వెంటనే పరిష్కారమయ్యే క్రిమినల్ అప్పీళ్లను సుప్రీం కోర్టు గుర్తించి సకాలంలో వాటిని విచారించేందుకు కోర్టులకు అనుమతులు ఇచ్చింది. ఒకవేళ ఈ అప్పీళ్లను పరిమిత సమయంలోపు విచారణ చేపట్టకపోతే అప్పీల్ హక్కు దారులు, జైలు శిక్ష అనుభవిస్తున్న దోషులు (బెయిల్ నిరాకరించబడినవారు) వారిపై అత్యధిక ప్రభావం చూపుతుంది. పెండింగ్లో ఉన్న అలాంటి క్రిమినల్ అప్పీళ్లను పరిష్కరించడానికి సమగ్ర ప్రణాళికను సమర్పించాల్పిందిగా అలహాబాద్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పాట్నా, ఒరిస్సా, రాజస్థాన్, బొంబాయి హైకోర్టులను సుప్రీం కోర్టు కోరింది. -
సుప్రీంలో తొలిసారిగా సింగిల్ జడ్జ్ బెంచ్ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం నుంచి తొలిసారిగా నిర్ధిష్ట పిటిషన్లను ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సహజంగా సుప్రీంకోర్టు బెంచ్ కనీసం ఇద్దరు న్యాయమూర్తులతో కూడి ఉంటుంది. ఏడేళ్ల జైలు శిక్షకు మించని నేరాలకు సంబంధించిన కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ అప్పీళ్లను సింగిల్ జడ్జ్ బెంచ్ విచారిస్తుంది. బెయిల్, ముందస్తు బెయిల్, బదిలీ పిటిషన్ల విచారణకు సింగిల్ జడ్జ్ బెంచ్ను అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు నిబంధనలను సవరించింది. ఇక గత ఏడాది జులై వరకూ 11.5 లక్షల పెండింగ్ కేసులు పేరుకుపోయాయని న్యాయ మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో తక్షణం విచారణ చేపట్టాల్సిన కేసులను స్కైప్, ఫేస్టైం, వాట్సాప్ అప్లికేషన్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు విచారిస్తోంది. కాగా, సంక్షోభ సమయంలో న్యాయస్ధానం పనిచేస్తూనే ఉందని, కేసుల పరిష్కారం దిశగా చొరవ చూపుతోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే అన్నారు. తమ క్యాలెండర్కు అనుగుణంగా ఏడాదికి 210 రోజులు పనిచేస్తామని ఆయన వెల్లడించారు. చదవండి : మద్యం అమ్మకాలకు నో.. సుప్రీంకు సర్కార్ -
రేవంత్ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. రేవంత్పై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63 కేసులు నమోదు అయ్యాయి. డ్రోన్ కెమెరా కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న ఆయన.. విడుదలను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం ఇదివరకే కొట్టివేసింది. ఇదిలావుండగానే పీటీ వారెంట్పై విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు డ్రోన్ కెమెరా కేసులో రేవంత్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. టీఆర్ఎస్ లోక్సభపక్ష నేత నామానాగేశ్వరరావు పార్లమెంట్లో ప్రస్తావించారు. దీనితో స్థానిక వ్యవహారం కాస్తా దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తూ.. సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో టీఆర్ఎస్ నేతలు కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్న పెండింగ్ కేసులో త్వరగతిన విచారణ జరిపించాలని ఆయన ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. (భూ ఆక్రమణ.. వాల్టా ఉల్లంఘన!) రేవంత్పై నమోదైన కేసుల చిట్టా.. ఆర్వోసీ, సీబీఐతో పాటు ఎన్నికల కమిషన్ వద్ద పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటికితోడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన.. ఓటుకు నోటు కేసుతో సహా, ఎస్టీ, ఎస్సీ అట్రాసిటి కేసులు ప్రస్తుతం విచారణలో విచారణ ఉన్నాయి. వాటితో పాటు ప్రత్యర్థులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో.. 32కేసులు ఇప్పటికే ఆయనపై నమోదై ఉన్నాయి. జూబ్లిహిల్స్ హౌజింగ్ సొసైటీలో ఫోర్జరీ చీటింగ్ కేసులు, ట్రెస్పాస్, వివిధ ప్రాంతాల్లో భూకబ్జాలకు సంబంధిన కేసులు రేవంత్పై ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 7 కేసులు, ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘనపై మరో కేసు, కొడంగల్లో 9, సైఫాబాద్ 10, గచ్చిబౌలి 4, జూబ్లిహిల్స్3, బంజారాహిల్స్ 3, అబిడ్స్ 3, సుల్తాన్ బజార్ 3, మద్దూర్ 3, పంజాగుట్ట 3, ఓయు పోలీస్ స్టేషన్లో మరో కేసు రేవంత్పై నమోదై విచారణ దశలో ఉన్నాయి. (రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత) దీంతో రేవంత్రెడ్డిపై నమోదైన కేసులను త్వరితగతిన విచారణ జరపాలని న్యాయవాది రామారావు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీటిల్లో ఏ కేసులో అయినా నేరం రుజువై.. శిక్ష పడితే పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓటుకు నోటు కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలై.. బలమైన సాక్షాధారాలు ఉన్నందున ఈ కేసు నుంచి రేవంత్ తప్పించుకోవడం అంత సులభంకాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన గోపనపల్లి భూకబ్జా కేసులో అనేక అక్రమాలతో పాటు వాటికి సంబంధించిన కీలక ఆధారాలు లభ్యం కావడం తెలిసిందే. మరోవైపు రేవంత్రెడ్డి అరెస్టుపై లోక్సభ జీరో అవర్లో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ సభ్యుడు మాణికం ఠాగోర్ వాయిదా తీర్మానం ఇవ్వగా దానిని సభాపతి అనుమతించలేదు. -
పన్ను వివాదాలకు సత్వర పరిష్కారం చూపాలి
న్యూఢిల్లీ: పన్ను వివాదాలకు వేగంగా పరిష్కారం చూపించాలని, అలా చేస్తే అది పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకంగా మారుతుందని, వివాదంలో ఉన్న నిధులకు విముక్తి కలుగుతుందన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే. దేశ వనరుల సమీకరణలో పన్నుల న్యాయ వ్యవస్థ పాత్ర కీలకమైనదని పేర్కొంటూ, పెండింగ్ కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయపన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ 79వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. దీనికి చీఫ్ జస్టిస్ హాజరై మాట్లాడారు. పరోక్ష పన్నులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులు, సీఈఎస్టీఏటీలోని పెండింగ్ కేసుల్లో 61%(1.05 లక్షల కేసులకు) గత రెండేళ్ల కాలంలో తగ్గించామని చెప్పారు. పన్నుల ఎగవేతను తోటి పౌరులకు చేసే సామాజిక అన్యాయంగా పేర్కొన్నారు. అదే విధంగా ఏకపక్షమైన, అధిక పన్ను విధింపు అన్నది ప్రభుత్వం ద్వారా సామాజిక అన్యాయానికి దారితీస్తుందన్నారు. తేనెటీగలు పువ్వులకు హాని చేయకుండా మకరందాన్ని తోడుకున్నట్టుగానే, ప్రజల నుంచి పన్నులను రాబట్టాలని సూచించారు. న్యాయ ప్రక్రియలోనూ ఏఐ న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధ (ఏఐ) అవసరాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే ప్రస్తావించారు. ముఖ్యంగా వేగవంతమైన పరిష్కారం, ఒకే తరహా కేసుల పునరావృతం, డాక్యుమెంట్ల నిర్వహణలో ఏఐ అవసరపడుతుందన్నారు. అదే సమయలో ఏఐ అన్నది మానవ ప్రమేయాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదన్నారు. -
కేంద్రం ఆమోదిస్తేనే జడ్జిల సంఖ్య పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టుల సంఖ్య పెంపు ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. 24 మంది న్యాయమూర్తుల సంఖ్యను 42కి పెంచాలనే ప్రతిపాదనతోపాటు ఖాళీల భర్తీ ఫైలు కేంద్రం వద్దనే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం 24 మంది న్యాయమూర్తులకుగాను సీజే సహా 13 మందే ఉన్నారని, ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీకి కేంద్రం చొరవ చూపాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని సమక్షంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రిని కోరినట్టు చెప్పారు. కేంద్రం నుంచి అనుమతి రాకుండా సుప్రీంకోర్టు ఏమీ చేయలేదన్నారు. తెలంగాణ హైకోర్టు ఆవిర్భావ వేడుకలు బుధవారం రాత్రి హైకోర్టు ఆవరణలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ.. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడారు. న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు ఆసక్తిగానే ఉందన్నారు. తెలంగాణ హైకోర్టులోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టుల ఖాళీలతోపాటు ఉన్న పోస్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సత్వర న్యాయం జరిగేందుకు మార్గం సులభం అవుతుందని, పెండింగ్ కేసుల భారం తగ్గుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీ కోసం బార్ అసోసియేషన్లు, కేంద్రంలో ఉన్న అదనపు సోలిసిటర్ జనరల్ సూర్యకరణ్రెడ్డి వంటివారు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కూడా పెండింగ్ క్లియరెన్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఫైలు ఏదైనా వస్తే వారం రోజుల్లోనే పరిష్కరిస్తున్నారని చెప్పారు. సత్వర న్యాయం అందించేందుకు కృషి అడ్వొకేట్స్ అకాడమీకి రాష్ట్ర ప్రభుత్వం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం సమీపంలో పది ఎకరాలను కేటాయించడానికి ముందుకు రావడం పట్ల జస్టిస్ ఎన్వీ రమణ హర్షం వ్యక్తంచేశారు. భూమి కేటాయించడానికి అంగీకరించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సత్వర న్యాయం కోసం అందరూ కృషి చేయాలని.. న్యాయ మూర్తుల ద్వారానే సత్వర న్యాయం పూర్తిగా లభించదని, బార్ అసోసియేషన్, న్యాయవాదుల సహకారం అవసరమన్నారు. ఎక్కడా లేనివిధంగా మనదేశంలో లీగల్ ఎయిడ్ కోసం రూ.100 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నామని తెలిపారు. సత్వర న్యాయం అందించేందుకు సుప్రీంకోర్టు సీజే కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనిపై తాను కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానని జస్టిస్ రమణ వెల్లడించారు. పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయ్..: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచాలని, అలాగే ఖాళీగా ఉన్న 11 న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యాయమూర్తులు తక్కువగా ఉన్న కారణంగా పెండింగ్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోతోందని తెలిపారు. శనివారం కూడా కోర్టులు పనిచేస్తూ పెండింగ్ కేసుల్ని తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ.. కేసుల విచారణలో ప్రధాన న్యాయమూర్తి క్రియాశీలక నేతృత్వంలో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. అడ్వొకేట్స్ అకాడమీకి ప్రభుత్వం పది ఎకరాల భూమి ఇచ్చేందుకు ముందుకు రావడం హర్షణీయమని బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సత్వర న్యాయం కోసం న్యాయమూర్తుల పోస్టుల ఖాళీల భర్తీకి అందరూ కృషి చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, దక్షిణాది రాష్ట్రాల హైకోర్టులకు అదనపు సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్రెడ్డి కోరారు. -
లోక్ అదాలత్ల్లో 18,410 కేసుల పరిష్కారం
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లు విజయవంతమయ్యాయి. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న 18,410 కేసులు ఒక్క రోజులో పరిష్కారమయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి లోక్ అదాలత్లు ప్రారంభించారు. హైకోర్టులో 6 బెంచ్లు ఏర్పాటు చేయగా.. 13 జిల్లాల్లో 330 బెంచ్లు విచారణలో పాలు పంచుకున్నాయి. హైకోర్టులో సాయంత్రం 5 గంటల తరువాత కూడా అదాలత్లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 18,410 కేసులు పరిష్కారమయ్యాయి. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బెంచ్లో 638 కేసులు, మిగిలిన బెంచ్ల్లో మరో 328 కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 963 ముందస్తు వివాదాల కేసులు కూడా పరిష్కరించారు. కేసుల పరిష్కారం ద్వారా రూ.38.23 కోట్ల పరిహారాన్ని సంబంధిత కక్షిదారులకు చెల్లిస్తారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ప్రధాన న్యాయమూర్తి పెండింగ్ కేసులపై ప్రధానంగా దృష్టి సారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోక్ అదాలత్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లాల్లోని లోక్ అదాలత్లను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. న్యాయాధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పలు శాఖల అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, పోలీసులు,, ప్రభుత్వ న్యాయవాదులు, న్యాయవాదులతో ముందస్తు సమావేశాలు నిర్వహించారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు తెప్పించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తు బెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 3 నుంచి సాయంత్రం కోర్టు పనివేళలు ముగిశాక లోక్ అదాలత్ కేసులు విచారించారు. మిగిలిన న్యాయమూర్తులు కూడా రాత్రి 8 గంటల వరకు కేసులు విచారించారు. కొన్నిసార్లు కక్షిదారుల్ని కోర్టుకు పిలిపించి, వారి సమక్షంలోనే కేసులు పరిష్కరించి, అక్కడికక్కడే పరిహారం నిర్ణయించారు. ముందస్తు బెంచ్ల ద్వారా ఈ నెల 12 వరకు 849 కేసులను పరిష్కరించారు. ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రాకేష్ కుమార్ల సూచనలు, సలహాలతో లోక్ అదాలత్లు విజయవంతమయ్యాయని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి డాక్టర్ వీఆర్కే కృపాసాగర్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి తెలిపారు. -
పెండింగ్ కేసుల్ని పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: పెండింగ్లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. బుధవారం హైకోర్టు నుంచి ఆయన అన్ని జిల్లాల జడ్జిలు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటెరోపేరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) సర్వీసులను ప్రారంభించారు. ఐసీజేఎస్ సర్వీసులను దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రారంభించినట్లు తెలిపారు. ఆ విధానం ద్వారా క్రిమినల్ కేసుల విచారణ కూడా పూర్తి చేసి పెండింగ్ కేసుల్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
పెండింగ్ కేసుల దుమ్ముదులపండి
సాక్షి, అమరావతి : పెండింగ్ కేసులపై పోలీసు శాఖ దృష్టి సారించింది. జిల్లాలు, సబ్ డివిజన్ల స్థాయిలో ప్రతి నెలా నిర్వహించే నేర సమీక్షా సమావేశం (క్రైమ్ మీటింగ్)లో కేసుల వారీగా వాటి పురోగతిపై ఆరా తీస్తోంది. వివిధ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి, వాటికి ఎదురైన అడ్డంకులు ఏమిటి, వాటిని తొలగించేలా ఇకమీదట ఏ చర్యలు తీసుకుంటున్నారనేవి విశ్లేషిస్తున్నారు. కేసుల నమోదు నుంచి దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాల సేకరణ, విచారణ వంటి అన్ని దశల్లోనూ కాలయాపన లేకుండా చర్యలు తీసుకుంటోంది. కొత్త కేసుల దర్యాప్తుతోపాటు పాత (పెండింగ్) కేసుల దుమ్ము దులిపి వాటిని పరిష్కరించేందుకు నిర్ణయించింది. నేర నియంత్రణ, నిరూపణపై దృష్టి... రాష్ట్రంలో నమోదవుతున్న నేరాలపై దర్యాప్తు, విచారణ, నేర నిరూపణ వంటి దశల్లో జరుగుతున్న వడపోతకు పొంతనలేని పరిస్థితి ఉంది. ప్రతీయేటా లక్షన్నరకు పైగా కేసులు నమోదు అవుతుండగా వాటిలో విచారణ పూర్తి అవుతున్నది కేవలం ఐదు నుంచి పది శాతం కేసులు మాత్రమే. ఆధారాలు లేకపోవడం, తప్పుడు ఫిర్యాదులు తదితర కారణాలతో కొన్ని కేసులు మూసివేస్తున్నారు. విచారణ పూర్తి అయినవి కొన్ని మాత్రమే ఉండటంతో దర్యాప్తులోనే మూడు వంతులకు పైగా కేసులు మిగిలిపోతున్నాయి. అయితే ఇటువంటి లోపాలను గుర్తించిన డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ కేసుల పురోగతిపై అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు అవసరమైన దిశానిర్దేశం చేశారు. పెండింగ్ కేసులతోపాటు అన్ని తరహా కేసుల పురోగతిని నెలనెల నేర సమీక్షలో చర్చించడంలో బద్దకం వద్దని సూచించారు. ప్రతీ కేసులోనూ నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. నేరస్థులకు ఆలస్యం కాకుండా శిక్షలు పడి, నేరం చేయాలంటే వారు భయపడేలా చేయాలని సూచించారు. ఈ చర్యలతో నేర నియంత్రణతోపాటు నేర నిరూపణలోనూ మంచి ఫలితాలు సాధించే దిశగా రాష్ట్ర పోలీసులు నడుం కట్టారు. -
ఆరో విడత అభ్యర్ధుల్లో సగం నేరచరితులే..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ బరిలో ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో దాదాపు సగం మంది అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రధాన పార్టీల్లో బీజేపీ 48 శాతం మంది నేర చరితులకు టికెట్లు ఇవ్వగా, కాంగ్రెస్ 44 శాతం మంది క్రిమినల్ కేసులు నమోదైన వారిని అభ్యర్ధులుగా బరిలో దింపింది. ఇక ఆరో విడత పోలింగ్ బరిలో నిలిచిన 967 మంది అభ్యర్ధుల్లో 20 శాతం మంది అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్టు ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) విశ్లేషణలో వెల్లడైంది. ఇక 54 మంది బీజేపీ అభ్యర్ధుల్లో 26 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండగా, 46 మంది కాంగ్రెస్ అభ్యర్ధుల్లో 20 మంది నేరచరితులే కావడం గమనార్హం. బీఎస్పీ తరపున బరిలో ఉన్న 49 మంది అభ్యర్ధుల్లో 19 మందిపై, 307 మంది ఇండిపెండెంట్ అభ్యర్ధుల్లో 34 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారు. -
రెండు నెలలు దర్యాప్తు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: అసలే ఎన్నికల సమయం, ఆపై బందోబస్తు, తనిఖీలతో పోలీస్ అధికారులు, సిబ్బంది బిజీగా ఉంటారు. ఎన్నికల కోడ్లో భాగంగా డబ్బు, మద్యం సరఫరా, అల్లర్లు, గొడవల నియంత్రణకే సమయం సరిపోతోంది. ఇలాంటి సమయంలో జరిగే భారీ దొంగతనాలు, దోపిడీ కేసులతోపాటు మేజర్ అఫెన్స్ను చేధించడం కొంత కష్టమేనని పోలీస్ అధికారుల్లో చర్చ జరుగుతోంది. శాంతి భద్రతల విభాగంలోని సిబ్బందితో పాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని సైతం బందోబస్తులో నిమగ్నం చేయక తప్పని పరిస్థితి. దీనితో అక్టోబర్, నవంబర్ నెలల్లో నమోదయ్యే కేసుల్లో దర్యాప్తు చాలా మేరకు పెండింగ్లో పడే ప్రమాదం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతినెలా టార్గెట్గా... పోలీస్స్టేషన్ పరిధిలో ప్రతినెలా నమోదయ్యే కేసులను మరుసటి నెల మొదటి వారంలో యూఐ (అండర్ ఇన్వెస్టిగేషన్) మేళా పేరుతో సమీక్ష నిర్వహించి వాటి దర్యాప్తును పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించేవారు. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో అన్ని స్టేషన్ల అధికారులు ఆయా ప్రాంతాల్లో గ్రామాల విజిటింగ్, ఎన్నికల కమిషన్ సమావేశాలు, రిటర్నింగ్ అధికారుల ఆదేశాలు అమలు చేయడం, బైండోవర్లు చేయడం, సున్నితమైన ప్రాంతాల్లో పహారా కాయడం, పారామిలిటరీ బలగాలతో సమన్వయం చేసుకోవడంతోనే రోజువారీ కార్యక్రమాలు ముగిసిపోతున్నాయి. దీనితో ఆ రోజు స్టేషన్లో నమోదయ్యే కేసులపై పెద్దలు దృష్టి సారించలేకపోతున్నారు. చిన్న స్థాయిలోని పెట్టీ కేసుల నుంచి హత్య కేసులు, దోపిడీ కేసుల వరకు అదేరీతిలో దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. అధికారులు దర్యాప్తు చేయాలనుకున్నా తగినంత సమయం లేకపోవడంతో కేసుల దర్యాప్తు పెండింగ్లో పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు చిన్నా, పెద్ద కేసులు మొత్తం కలిపి 714 కేసులు ఈ నెలన్నర నుంచి పెండింగ్లో పడ్డట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ కేసుల్లో తీవ్రత ఎక్కువగా లేకున్నా వీటి ప్రభావం ఎన్నికలు ముగిసిన తర్వాత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని ఎస్పీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలన్నర కావస్తోంది... రాచకొండ కమిషనరేట్లోని కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ జ్యువెల్లరీ దుకాణంలో పట్టపగలు దోపిడీకి యత్నించి దుండగులు గాల్లోకి కాల్పులు జరుపుతూ పారిపోయారు. ఈ కేసు తీవ్రత పెద్దదే. తుపాకులతో వచ్చి బెదిరించి, అడ్డుకుంటుండగా గాల్లోకి ఫైర్ చేయడం ఆందోళన కలిగించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్యాప్తు అధికారులు చేధించేందుకు ప్రయత్నించినా ఎన్నికల సమయం కావడంతో పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోయారని రాచకొండ ఉన్నతాధికారులు తెలిపారు. - ఖమ్మం పట్టణంలోని కమాన్బజార్లో సరిగ్గా పదిహేను రోజుల క్రితం ఓ భవనంలో అర్ధరాత్రి పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన భవనం పూర్తిగా కూలిపోగా, చుట్టుపక్కల ఉన్న మరో ఐదు భవనాలు 50శాతం మేర పగుళ్లు వచ్చాయి. ఈ కేసు ఖమ్మం పట్టణంలో తీవ్ర అలజడి సృష్టించింది. ఇళ్లు ఖాళీ చేసిన తర్వాతరోజు పేలుళ్లు జరగడం పోలీసుల్లో అనేక అనుమానాలకు తావిచ్చింది. పైగా మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిపోవడంతో ఈ ఇంట్లో అర్ధరాత్రి జిలెటెన్స్టిక్స్ డంపు చేయడంతో పేలుళ్లు సంభవించాయని గుర్తించారు. కానీ ఎందుకు డంప్ చేశారు? ఈ సమయంలో పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో వీటిని స్టోర్ చేయడం వెనుకున్న ఆంతర్యాన్ని గుర్తించలేకపోయారు. దీని వెనుక కుట్ర కోణం ఉండి ఉంటుందా అన్న అనుమానాలు పట్టణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ కేసులు..ఆ కేసులు... సాధారణ సమయంలో నమోదయ్యే కేసులపై దృష్టి సారించలేని పోలీసులకు ఇటు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై నమోదవుతున్న కేసులు మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రతిరోజూ రాష్ట్రంలో 20 నుంచి 30 కేసులు నిబంధనల ఉల్లంఘన కింద సిఫారస్ అవుతున్నట్టు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. బందోబస్తులతో కుస్తీలు పడుతుంటే ఈ కేసులతో సబ్ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు ఒత్తిడిలో పడుతున్నారని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
‘పెండింగ్’ సమస్యకు పరిష్కారం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థకు భారంగా మారిన పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరించేందుకు తన వద్ద ఒక ప్రణాళిక ఉందని కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు. యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘సోషల్ ఇంజనీరింగ్లో బార్ అండ్ బెంచ్ పాత్ర’అనే అంశంపై శనివారం ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో గొగోయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొగోయ్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు సంబంధించి న వాటిలో రెండు సమస్యలు తనను తీవ్రంగా కలచి వేస్తున్నాయన్నారు. వాటిలో పెండింగ్ కేసుల సమస్య ఒకటి అని తెలిపారు. ఇది మొత్తం న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బ తీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారు చాలా కాలం పాటు శిక్ష అనుభవించిన తర్వాత తీర్పు రావడం అనేది మరో సమస్య అని పేర్కొ న్నారు. కొన్ని సందర్భాల్లో రెండు మూడు తరాల తర్వాత తీర్పు రావడం జరుగుతుందని తెలిపారు. ఇది తీవ్రమైన సమస్య అయినప్ప టికీ పరిష్కరించడం సులువేనని వెల్లడించారు. ఈ రెండు సమస్యల పరిష్కారానికి తన వద్ద ఉన్న ప్రణాళికలు ఉన్నాయని, త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. దీనికి సంబంధించి తమ మద్దతు ఇవ్వాల్సిందిగా బార్ అండ్ బెంచ్ను కోరారు. జిల్లా కోర్టుల్లో 5,950 పోస్టులు.. దేశంలో ఉన్న జిల్లా కోర్టులన్నింటిలో కలిపి 5,950 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గొగోయ్ తెలిపారు. జడ్జీల పదవీ కాలం తక్కువ ఉండటం వల్ల ఎలాంటి సమస్య లేదని, చీఫ్ జస్టిస్లు మారుతుండటం వల్ల కేసుల ప్రాధాన్యత కూడా మారుతోందని వ్యాఖ్యానిం చారు. దీనికి సంబంధించి న్యాయవ్యవస్థలో ఒక స్థిరమైన విధానాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని, సరైన పాలసీతో కేసులను పరిష్కరిస్తే ఇది పెద్ద సమస్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుత సీజేఐ దీపక్ మిశ్రా పదవీ విరమణ అనంతరం సీజేఐగా గొగోయ్ బుధవారం (3న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
కళంకిత ప్రజా ప్రతినిధుల జాబితాపై సుప్రీం ఆదేశాలు..
సాక్షి, న్యూఢిల్లీ : ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల జాబితాను సమర్పించాలని సర్వోన్నత న్యాయస్ధానం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్స్ను కోరింది. తాను జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేసులను ప్రత్యేక కోర్టుకు బదలాయించారా లేదా అనే వివరాలను తెలిపాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై అక్టోబర్ 12న తదుపరి విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. కళంకిత ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అంశంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. కళంకిత చట్టసభ సభ్యులపై క్రిమినల్ కేసుల పురోగతికి సంబంధించి ఇప్పటివరకూ 11 రాష్ట్రాల నుంచి సమాచారం లభ్యమైందని కేంద్రం తెలిపింది. ఇక కళంకిత చట్టసభ సభ్యులపై నమోదైన 1233 కేసులను 12 స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు మళ్లించగా 136 కేసులు క్లియర్ అయ్యాయని పేర్కొంది. ఈ 11 రాష్ట్రాల్లో 1097 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. బిహార్లో అత్యధికంగా 249 కేసులు ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది. ఇక కేరళలో 233 కేసులు, పశ్చిమ బెంగాల్లో 226 కేసులు చట్టసభ సభ్యులపై విచారణ దశలో ఉన్నాయి. -
3 నెలల్లో 5 శాతం కేసులను పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఉభయ రాష్ట్రాల్లోని కింది కోర్టులకు లక్ష్యాలను నిర్దేశిస్తున్న హైకోర్టు తాజాగా మరో లక్ష్యాన్ని వాటి ముందుంచింది. 2014కు ముందునాటి పెండింగ్ కేసుల్లో కనీసం 5% కేసులను వచ్చే 3 నెలల్లో పరిష్కరించాలని కింది కోర్టులను ఆదేశించింది. పెండింగ్ కేసులను కనీసం 2 వారాలకొకసారి స్వయంగా పర్యవేక్షించాలని జిల్లా స్థాయి కేసుల బకాయిల కమిటీలకు స్పష్టం చేసింది. ఏయే కోర్టుల్లో రోజూ ఎన్ని కేసులు పరిష్కారమయ్యాయో తెలుసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వెంకటేశ్వర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లకు పూర్వం ఉన్న కేసుల సంఖ్యను సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కింది కోర్టుల్లోని పాత పెండింగ్ కేసుల సంఖ్యను సున్నాకు తీసుకొచ్చేందుకు లక్ష్యాలు నిర్దేశిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా 2018 మార్చి, ఏప్రిల్ వరకు పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను హైకోర్టు బకాయిల కమిటీ పరిశీలించింది. అనంతరం 2014కు ముందున్న పెండింగ్ కేసుల్లో కనీసం 5 శాతం కేసులను 3 నెలల్లో సున్నాకు తీసుకురావాలని కింది కోర్టులకు లక్ష్యంగా నిర్దేశిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. -
అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి
వరంగల్ రూరల్ : ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పెండింగ్ అట్రాసిటీ కేసులపై జూన్ 6 లోగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే.జోషి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలతో అట్రాసిటీ కేసులు, రైతు బంధు, పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ, జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈ కేసులను ప్రత్యేకంగా సమీక్షిస్తోందని, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అట్రాసిటీ కేసులపై ప్రత్యేకంగా సమీక్షించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించడంతోపాటు బాధితులకు వెంటనే నష్టపరిహారం అందేలా చూడాలని అన్నారు. కేసులపై జిల్లా స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించి, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అట్రాసిటీ కేసులు నమోదనప్పుడు కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యక్షంగా పర్యటించాలని, ఈ కేసుల నష్ట పరిహారం చెల్లింపులు ట్రెజరీ కంట్రోల్స్లో లేవని తెలిపారు. బాధితుల అకౌంట్ నంబర్లను కలెక్టర్కు ఇవ్వాలని, లేకుంటే తహసీల్దారు ద్వారా వివరాలు సేకరించాలని పేర్కొన్నారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఇటీవల హైదరాబాద్లో పర్యటించిందని, బాధితులకు పరిహారం చెల్లింపులు చèట్ట ప్రకారం జరగాలని ఆదేశించిందన్నారు. ఎస్పీలు ఈకేసులపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఆన్లైన్ ద్వారా మానిటరింగ్ చేయాలని, ఎఫ్ఐఆర్లను వెంటనే నమోదు చేసి, జిల్లా కలెక్టర్లకు కేసుల వివరాలు పంపాలన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్తివారీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 41,09,743 మందికి పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని, ధరణి వెబ్సైట్లో ఆధార్ సీడింగ్, డబుల్ ఖాతా, బ్యాక్ లాగ్ సక్సెస్ కరెక్షన్ మాడ్యూళ్లను సిద్ధం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాల వారీగా పనితీరును ప్రతి రోజు సమీక్షిస్తున్నారని, జూన్ 20లోగా మిగిలిన పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బంధుకు సంబంధించిన 45.13 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఆర్ఓఎఫ్ఆర్కు సంబంధించి 47 వేల చెక్కులు పంపిణీ చేశామని వ్యవసాయశాఖ కమిషనర్ జగన్ మోహన్ తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లాలలో ఘనంగా నిర్వహించటానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా జిల్లా కలెక్టర్లను కోరారు. ఇందుకోసం మార్గదర్శకాలను జారీ చేసినట్టు ఆయన వివరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి బుద్ద ప్రకాష్జ్యోతి మట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీని వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఆర్డీఓలు జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాలపై కలెక్టర్లు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాలన్నారు. కలెక్టర్ ముండ్రాతి హరిత మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 12 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు 6,49,250 రూపాయలను చెల్లించామని అన్నారు. బడ్జెట్ లేనందున 18 కేసులకు ఇంకా చెల్లించలేదని, 11 కేసులకు సంబంధించి బ్యాంకు వివరాలు సరిగ్గా లేవని, 6 కేసులకు క్లారిఫికేషన్ కోసం ప్రభుత్వానికి రాశామని తెలిపారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. డీఆర్వో భూక్యా హరిసింగ్, అధికారులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ లిటిగేషన్?!
ఏళ్లు గడుస్తున్నా న్యాయస్థానాల్లో ఎటూ తెమలని కేసుల తీరుపై ఎవరెంతగా ఆవేదన పడుతున్నా ఫలితం కనిపించని తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం మరోసారి కేంద్ర ప్రభుత్వానికి కాస్త కటువుగానే చెప్పింది. ఒకపక్క న్యాయ సంస్కరణలు అవసరమని న్యాయవ్యవస్థను తొందరపెడుతున్న కేంద్ర ప్రభుత్వం జాతీయ వ్యాజ్య విధాన రూపకల్పనలో అంతులేని జాప్యాన్ని ప్రదర్శిస్తున్నదంటూ వ్యాఖ్యానించింది. సమస్యకు కారణాలేమిటో తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లోపమెక్కడ ఉందో నిర్ధారించుకుని దానికి పరిష్కారాన్ని వెదకాలి. కానీ సమస్య తెలుసు...అందుకు కారణమూ తెలుసు. దానికి పరి ష్కారమూ ఖరారైంది. కానీ ఆచరణ దగ్గరకొచ్చేసరికి నిలువెల్లా నిర్లక్ష్యమే. ఏడె నిమిదేళ్లుగా ఈ నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఇదే వరస. పెండింగ్ కేసులు కొండలా పెరిగిపోవడానికి రెండు ప్రధాన కార ణాలు న్నాయి. అందులో ఒకటి తగినంతమంది న్యాయమూర్తులు లేక పోవ డమైతే...రెండోది అపరిమితంగా వ్యాజ్యాలు పెరిగిపోవడం. ఈ రెండింటికీ ప రిష్కారం కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంది. అవసరమైన సంఖ్యలో న్యాయమూర్తుల్ని నియమించాల్సింది కేంద్రమే. వ్యాజ్యాల నియంత్రణ కూడా దాని చేతుల్లోనే ఉంది. న్యాయస్థానాల్లో పైనుంచి కింది వరకూ ఉండే వ్యాజ్యాలన్నిటిలో ప్రధాన కక్షిదారు పాలక వ్యవస్థే. వాస్తవానికి ఈ వ్యాజ్యాల సంఖ్య ఎంతన్న విషయంలో అధికారిక గణాంకాలు లేవు. జిల్లా కోర్టులు మొదలు సుప్రీంకోర్టు వరకూ 3.14 కోట్ల కేసులుంటే...ఇందులో 46 శాతం కేసుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్షిదారులుగా ఉన్నాయని అంచనా. ‘మనిషికి నూరేళ్లు...వ్యాజ్యానికి వెయ్యేళ్లు’ అన్న నానుడి గాల్లోంచి ఊడిపడలేదు. దశాబ్దాలు గడుస్తున్నా కేసులు తేలక నీరసించినవారి మస్తిష్కంలోనే ఇది పుట్టింది. నిజానికి సుప్రీంకోర్టు 1970 మొదలుకొని ఈ విషయంపైనే తరచుగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తోంది. కేసుల్ని యథాలాపంగా, యాంత్రికంగా నడపడం కాక, వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉందో లేదో సమీక్షించుకోవాలని చెబుతూనే ఉంది. కానీ పాలకులకు వినే తీరిక లేదు. జస్టిస్ డీఏ దేశాయ్ నేతృత్వంలోని లా కమిషన్ 1988లో ఈ సమస్యను లోతుగా సమీక్షించింది. ఇలా నిరవధికంగా వ్యాజ్యాల్ని కొనసాగిస్తూ పోవడం వల్ల ప్రజాధనం వృధా కావడమే కాక, పెండింగ్ కేసులు పెరుగుతాయని, నిజమైన బాధితులకు న్యాయం కలగజేయడం న్యాయవ్యవస్థకు అసాధ్యమవుతుందని ఆ నివేదిక హెచ్చరించింది. కానీ ఆనాటి ప్రభుత్వంగానీ, అనంతర ప్రభుత్వాలుగానీ నిమ్మకు నీరెత్తినట్టున్నాయి. తొలిసారి 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఆ మరుసటి ఏడాదికల్లా జాతీయ వ్యాజ్య విధానం(ఎన్ఎల్పీ) పేరుతో ఒక ముసాయిదాను కూడా రూపొందించింది. ప్రభుత్వాన్ని ఒక బాధ్యతాయుతమైన, సమర్ధవంతమైన కక్షిదారుగా రూపు దిద్దడమే ధ్యేయమని ప్రకటించింది. కానీ విషాదమేమంటే అందులో సమస్యను ఏకరువు పెట్టడం... దాని పూర్వాపరాలను వివరించడం తప్ప పరిష్కారానికి అవసరమైన సూచనల్లేవు. ప్రభుత్వ వ్యాజ్యాల విషయంలో ‘మరింత జవాబుదారీతనం’ ఉండాలని, దాన్ని ఉల్లంఘించిన అధికారులపై ‘తగిన చర్య’ తీసుకోవాలని చెప్పడమైతే చెప్పింది. అందుకోసం జాతీయస్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో ‘సాధికార కమిటీలు’ ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ వాటి స్వరూప స్వభావాలు, విధివిధానాలేమిటో చెప్పలేదు. జవాబుదారీతనం ప్రదర్శించని అధికారులపై తీసుకోవాల్సిన చర్యలేమిటో కూడా వివరించలేదు. విధానాలు పటిష్టంగా, పకడ్బందీగా ఉంటే...అందుకవసరమైన పర్యవేక్షణ యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేస్తే వ్యాజ్యాల శాతం గణనీయంగా తగ్గుతుంది. కావల్సిందల్లా పాలకుల్లో సంకల్పం. అది లోపించిన కారణంగానే ఇప్పటికి ఎనిమిదేళ్లవుతున్నా దిక్కూ మొక్కూ లేదు. మూడేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమస్యపై దృష్టి సారించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యతాయుతమైన, సమర్ధవంతమైన కక్షిదారులుగా ఉండాలని సూచించారు. దాంతో ఇక దిద్దుబాటు చర్యలు మొదలవుతాయని అందరూ ఆశించారు. అందుకు తగ్గట్టే నిరుడు జూన్లో మరో ఎన్ఎల్పీ ఖరారైంది. మళ్లీ ఆ తర్వాత ఏమొచ్చిందో అది అక్కడితో ఆగిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రధాని కార్యాలయం, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ పనికిమాలిన కేసుల కూపీ లాగి, వాటికి ముగింపు పలకమని వివిధ ప్రభుత్వ విభాగాలను అడుగుతూనే ఉన్నాయి. నిరుడు జూన్నాటికి కేంద్రంలోని వివిధ విభాగాలు మొత్తం 1,40,000 వ్యాజ్యాలు నడుపుతున్నాయని తేల్చారు. అందులో సగం రైల్వే శాఖవే. కేంద్ర ఆర్థిక శాఖ, కమ్యూనికేషన్లు, హోం, రక్షణ శాఖలు తర్వాతి స్థానాల్లోకొస్తాయి. చిత్రమేమంటే ఈ విభాగాలు తామంతా ప్రభుత్వంలో భాగమన్న సంగతి మరిచి ఒకదానిపై ఒకటి వ్యాజ్యం దాఖలు చేసుకుంటాయి. సమస్య తలెత్తిన రెండు విభాగాల కార్యదర్శులు కూర్చుని చర్చించుకుంటే అది పరిష్కారం కావడం తేలిక. ఆ స్థాయిలో తేలకపోతే ఆయా శాఖల మంత్రులు వారికి తగిన సూచనలిస్తే సరిపోతుంది. కానీ దేన్నయినా న్యాయస్థానమే తేల్చాలన్న ధోరణి ప్రభుత్వ విభాగాల్లో ఊడలు దిగడంతో సమస్య రాను రాను జటిలమవుతోంది. కొన్ని సందర్భాల్లో వాజ్యాలు పున రావృ తమ వుతున్నాయి. ఉదాహరణకు నిరుడు డిసెంబర్లో కేంద్రం దాఖలు చేసిన కొన్ని అప్పీళ్లను సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్లీ అదే అంశంపై మొన్న మార్చిలో రెండోసారి వ్యాజ్యాలు దాఖలు చేసింది. దాంతో ఆగ్రహించిన సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ గట్టిగా హెచ్చరించింది. ఈ అయోమయాన్ని ప్రభుత్వాలు వదుల్చుకోవాలి. సమగ్రమైన సర్వే జరిపి కేసుల సంఖ్య ఎంతో తేల్చాలి. వాటిని శాస్త్రీయంగా వర్గీకరించుకుని అవసరమైనవేవో, కానివేవో తేల్చాలి. వృథా కేసులకు స్వస్తి పలికి, న్యాయ వ్యవస్థపై ఉన్న భారాన్ని తగ్గించాలి. పౌరులకు సత్వర న్యాయం లభించేందుకు దోహదపడాలి. -
అధికారులున్నా.. దర్యాప్తు సున్నా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక యూనిట్ అది. 4 నెలల కిందటి వరకు అధికారులు, సిబ్బంది కొరతతో తంటాలు పడింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బం ది ఉన్నారు. అయినా ఏం లాభం.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా తయారైంది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) పరిస్థితి. 4 నెలల కిందట అధికారులు, సిబ్బంది కొరతతో సతమతమైన సీఐడీలో ప్రస్తుతం ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు నాన్ క్యాడర్ ఎస్పీ లు, 8 మంది నాన్ క్యాడర్ అదనపు ఎస్పీలు, 42 మంది డీఎస్పీలు, 50 మంది వరకు ఇన్స్పెక్టర్లు, 60 మందికి పైగా సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అయినా కీలక కేసులు ముందుకు కదలడం లేదు. 2016లో లీకైన ఎంసెట్ ప్రశ్నాపత్రం కేసుకు సంబంధించి ఇప్పటివరకు చార్జిషీట్ నమోదు కాలేదు. 2017 ఫిబ్రవరిలో నమోదైన బోధన్ స్కాం ఇప్పటికీ పూర్తి స్థాయి దర్యాప్తునకు నోచుకోలేదు. ఇలాంటి కీలక కేసులు మరో 18 వరకు ఉండగా, ఇతర కేసులు 1,200లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. దీంతో పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బంది ఉన్నా దర్యాప్తు ముందుకు సాగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలలు కాదు.. ఏళ్ల నుంచి కుస్తీ.. ప్రస్తుతం సీఐడీ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది డీఎస్పీల్లో సగం మందికి పెద్దగా కేసులే లేవు. మిగిలిన అధికారులు పాత కేసులతో నెలలు కాదు.. ఏళ్ల నుంచి కుస్తీ పడుతూనే ఉన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ముగ్గురు, నలుగురు అధికారులు మారడంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఎంసెట్, బోధన్, ఇందిరమ్మ ఇళ్లు, సీఎంఆర్ఎఫ్.. ఇలా అన్ని కీలక కేసుల్లోనూ ఇదే పరిస్థితి. కొన్నింటిలో రాజకీయ ఒత్తిడి ఉంటే.. మరికొన్ని దర్యాప్తు అధికారుల వైఖరితో పెండింగ్లో పడుతూ వస్తున్నాయి. ప్రస్తుత దర్యాప్తు అధికారులపై పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలున్నాయి. -
విద్యుత్ బకాయిలు..రూ.167.42 కోట్లు..!
నల్లగొండ : విద్యుత్ బిల్లుల బకాయిల భారం విద్యుత్శాఖకు పెద్ద గుదిబండలా మారింది. ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు వాడుకున్న విద్యుత్కు బిల్లులు చెల్లించడం మానేశారు. నిధుల సమస్యను కారణంగా చూపించి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా మొండికేశారు. దీంతో ఏటికేడు పెరిగిపోతున్న బకాయిలను వసూలు చేయడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. విద్యుత్ శాఖ నుంచి పలుమార్లు నోటీసులు జారీ చేసినా సంబంధిత శాఖల నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు. ప్రతి నెలా విద్యుత్ శాఖ నిర్వహించే నెలవారీ విద్యుత్ శాఖ సమీక్షా సమావేశంలో ఈ బకాయిల పైన ఉన్నతాధికారులు చివాట్లు పెడుతున్నా బిల్లులు మాత్రం వసూలు కావడం లేదు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మేజర్, మైనర్ పంచాయతీల్లో విద్యుత్ బకాయిలు మొత్తం రూ.167.42 కోట్లు అని తేలింది. దీంట్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చెల్లించాల్సిన బకాయిలు రూ.44 కోట్లు. కాగా పాత బకాయిలతో కలుపుకుని మొత్తం రూ.167.42 కోట్లు. వీటిల్లో ప్రభుత్వ శాఖల బకాయిలు రూ.3.21 కోట్లు కాగా, మున్సిపాలిటీలు చెల్లించాల్సిన బకాయిలు రూ.3.74 కోట్లు, మేజర్, మైనర్ పంచాయతీలు చెల్లించాల్సింది రూ.160.47 కోట్లు. పేరుకుపోయిన బకాయిలు.. జిల్లా కేంద్రంలోని 26 ప్రభుత్వ శాఖల్లో బిల్లులు చెల్లించకుండా మొండికేసిన శాఖల్లో విద్యాశాఖ రూ.కోటి 32 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు బిల్లులు చెల్లించడం లేదని అధికారులు అంటున్నారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా పాఠశాలల హెచ్ఎంల నుంచి స్పందన ఉండటం లేదన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నారని విద్యాశాఖ చెప్తోంది. కానీ హెచ్ఎంలు మాత్రం వచ్చిన కొద్దిపాటి నిధులు పాఠశాలల నిర్వహణకే సరిపోతున్నాయని, దాంతో బిల్లులు చెల్లించడం కష్టం మారిందని అంటున్నారు. పోలీస్ క్వార్టర్స్కు సంబంధించి కోటి రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. పోలీస్ హెడ్క్వార్టర్స్లో శిథిలావస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్ బకాయిలు ఇవి. నెలవారీ బిల్లుల చెల్లింపులో పోలీస్ శాఖ మొదటి స్థానంలో ఉంది. కానీ క్వార్టర్స్ బకాయిలను సెటిల్ చేసుకోకపోవడంతో ఏళ్ల తరబడి పెండింగ్లో పడిపోయాయి. వ్యవసాయ శాఖ రూ.3.08 లక్షలు, పశుసంవర్థక శాఖ రూ.లక్షా 92 వేలు, ఉన్నత విద్య రూ.లక్షా 94 వేలు, సాగునీటి పారుదల శాఖ రూ.57.41 లక్షలు, రెవిన్యూ శాఖ రూ.7 లక్షలు, రవాణా శాఖ రూ.5.97 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ శాఖలకు సంబంధించి నిధులు సర్దుబాటుకాకపోవడంతో బిల్లులు చెల్లించడం లేదని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని, వచ్చిన కొద్దిపాటి నిధులు కూడా ఫ్రీజింగ్ల పేరుతో ట్రెజరీ శాఖ నిలిపేస్తుందని అంటున్నారు. ప్రతి నెలా క్రమతప్పకుండా బిల్లులు చెల్లి స్తున్న శాఖల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, వైద్య ఆరోగ్యం, పోలీస్ శాఖలు ఉన్నాయి. బిల్లులు చెల్లించక రెండేళ్లు...! మున్సిపాలిటీలు, మేజర్, మైనర్ పంచాయతీలు బిల్లులు చెల్లించక రెండేళ్లు దాటింది. పంచాయతీలు చివరిసారిగా జనవరి 2016లో చెల్లించారు. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నయాపైసా చెల్లించలేదు. మున్సిపాలిటీల బకాయిలు రూ.3.74 కోట్లు ఉండగా, పంచాయతీలు చెల్లించాల్సింది రూ.160.47 కోట్లు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమచేస్తున్న నాటి నుంచి సర్పంచ్లు బిల్లులు చెల్లించడం లేదని అధికారులు చెప్తున్నారు. స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధుల్లో 30 శాతం విద్యుత్ బిల్లులు చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు పాటించడం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో గ్రామాల్లో, పట్టణాల్లో వీధిలైట్ల విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. తాగునీటి బోర్లకు విద్యుత్ కట్ చేయడం సాధ్యం కానందున చర్యలు తీసుకులేకపోతున్నామని అంటున్నారు. మున్సిపల్ కార్యాలయాలకు విద్యుత్ సర ఫరా నిలిపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయని, ఈ మేరకు కమిషనర్లకు నోటీసులకు కూడా జారీ చేశామని చెప్పారు. సర్చార్జీల భారం... విద్యుత్ బకాయిల పైన సర్చార్జీల పేరుతో 18 శాతం అదనపు భారాన్ని వసూలు చేయడం జరుగుతోంది. ఈ తరహా చార్జీలు అన్ని రకాల కేటగిరీలకు చెందిన బిల్లులకు వర్తిస్తుంది. ప్రతిఏడాది 18 శాతం సర్చార్జీల పేరుతో వినియోగదారులు, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు అదనపు భారాన్ని మోయాల్సిందే. ఎంతకాలం పాటు బిల్లులు చెల్లించకుండా ఉంటే అన్నేళ్ల పాటు పెండింగ్లో ఉన్న బిల్లులపైన 18 శాతం సర్చార్జీ వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. విద్యుత్ బకాయిల పైన ఎస్ఈ కృష్ణయ్య మాట్లాడుతూ...అన్ని శాఖలకు నోటీసులు జారీ చేశామని, ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపేస్తామని చెప్పారు. -
ప్రభుత్వాలే ‘లిటిగెంట్’!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య ఏటా భారీగా పెరిగిపోతోంది.. అందులో సగానికిపైగా కేసుల్లో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలే లిటిగెంట్లుగా ఉంటున్నాయి.. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల తీరు వివాదాలకు కారణమవుతోంది. దీంతో ఆయా శాఖలను ప్రతివాదులుగా చేస్తూ పిటిషన్లు దాఖలవుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో 3.21 లక్షల పెండింగ్ కేసులు ఉండగా.. అందులో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలపై దాఖలైనవే 1.68 లక్షల కేసులు కావడం గమనార్హం. కోర్టుకు వెళ్లమంటున్నారు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు తీసుకుంటున్న పలు నిర్ణయాలు, చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీనిపై ప్రజలు ప్రశ్నిస్తే ‘కోర్టుకు వెళ్లి తేల్చుకోండి’అంటూ అధికారుల నుంచి సమాధానం వస్తోంది. దీంతో చాలా మంది హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. న్యాయమూర్తులు మధ్యంతర ఉత్తర్వుల రూపంలో పిటిషనర్లకు కొంతవరకు ఉపశమనం కల్పిస్తున్నారు. కానీ కేసు విచారణకు వచ్చినా ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయకపోవడం, తగిన వివరణ ఇవ్వకపోవడం, ఆదేశాలను అమలు చేయకపోవడం, పదే పదే వాయిదాలు కోరడం వంటి చర్యలు విచారణలు సుదీర్ఘంగా కొనసాగేందుకు కారణమవుతున్నాయి. కొన్ని కేసుల్లో రెండు సంవత్సరాలకు కూడా కౌంటర్ దాఖలు చేయాలని సందర్భాలున్నాయి. 4 పరిష్కరించేలోపు.. 40 కేసులు ఓ కేసులో తుది విచారణ చేపట్టాలంటే దాని పూర్వాపరాల్లోకి వెళ్లి లోతుగా వాదనలు వినాల్సి ఉంటుంది. ఇందుకు గంటలకు గంటలు సమయం వెచ్చించాల్సి వస్తుంది. అది కూడా ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయడం, సరైన వివరణ ఇవ్వడం వంటివి జరిగిన సందర్భాల్లోనే. దీంతో న్యాయమూర్తులు తొలుత ఉపశమనం కోసం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి తర్వాత ఎప్పుడో తుది విచారణ చేపట్టాల్సి వస్తోంది. ఇక ఓవైపు నాలుగు కేసులను పరిష్కరించే సమయంలోనే.. మరోవైపు ప్రభుత్వ చర్యలపై నలభై కొత్త కేసులు దాఖలువుతున్నాయి. అయితే అవకాశమున్న సందర్భాల్లో మాత్రం న్యాయమూర్తులు ప్రభుత్వాలకు నిర్ధిష్టమైన ఆదేశాలిస్తూ కేసులను వేగంగా పరిష్కరిస్తున్నారు. మళ్లీ మళ్లీ కోర్టు మెట్లెక్కిస్తున్నారు ఇక కోర్టులు ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవటంతో కక్షిదారులు తిరిగి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కోర్టు ధిక్కార పిటిషన్లు వేయాల్సిన పరిస్థితి ఉంటోంది. దీంతో న్యాయమూర్తులపై అదనపు భారం పడుతోంది. కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తేనో, జైలుకు పంపాల్సి ఉంటుందని, జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరిస్తేనో తప్ప అధికారులు స్పందించడం లేదు. ఏకంగా ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులను హాజరుకావాల్సిందిగా ఆదేశించాకే కోర్టుల ఉత్తర్వులు అమలైన ఉదంతాలూ ఉన్నాయి. 2015లో 2,534 కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలుకాగా.. 2016లో 2,651కి పెరిగింది. ఈ ఏడాది నవంబర్ 20 నాటికి 2,398 కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలయ్యాయి. పెరుగుతున్న పెండింగ్ కేసులు ఉమ్మడి హైకోర్టులో రెండు దశాబ్దాల కింద దాఖలైన పలు కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ 30 నాటికి 2.85 లక్షల కేసులు పెండింగ్లో ఉండగా.. ఈ ఏడాది నవంబర్ 17 నాటికి ఆ సంఖ్య 3.21 లక్షలకు చేరింది. ఇందులో ప్రభుత్వ చర్యలపై దాఖలైన రిట్ పిటిషన్లే 1,68,324 ఉన్నాయి. అంటే సగానికిపైగా పెండింగ్ కేసులు ప్రభుత్వాలకు సంబంధించినవే. ‘పెండింగ్’కు సమస్యలెన్నో.. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో ప్రభుత్వాలే అతి పెద్ద లిటిగెంట్ అని స్వయంగా ప్రధాని మోదీ గతేడాది జరిగిన జాతీయ న్యాయ సదస్సులో అంగీకరించడం గమనార్హం. ప్రభుత్వ లిటిగేషన్ను తగ్గించేందుకు నేషనల్ లిటిగేషన్ పాలసీ (ఎన్ఎల్పీ)ని రూపొందిస్తున్నామని ప్రకటించారు. కానీ అది అమల్లోకి రాలేదు. ఇక హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడం పెండింగ్ కేసులు పెరిగేందుకు కారణమవుతోంది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 61 కాగా.. ప్రస్తుతం 31 మంది ఉన్నారు. మిగతా 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ శాఖపైనే ఎక్కువ రిట్ పిటిషన్లలో అత్యధికంగా రెవెన్యూశాఖపైనే దాఖలవుతున్నాయి. గ్రామస్థాయిలో భూ వివాదాలకు సంబంధించి ప్రజలు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో పేర్ల మార్పు, చేర్పులకు నిరాకరించడం, అసలు యజమాని స్థానంలో మరొకరిని చేర్చడం, రికార్డుల్లో పట్టా భూమి ఉంటే దానిని ప్రభుత్వ భూమిగా చూపడం, రీ సర్వే అండ్ రీ సెటిల్మెంట్ రిజిష్టర్ (ఆర్ఎస్ఆర్)లో ఖాళీలపై వివాదం వంటి చిన్న అంశాలపైనా అధికారులు వివాదం సృష్టించడం ఎక్కువైపోయిందనే విమర్శలు ఉన్నాయి. దాంతో ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ రిట్ పిటిషన్లు దాఖలవుతున్నాయి. పాస్ పుస్తకాలు, ఎన్వోసీలు, సేల్డీడ్ల రిజిస్ట్రేషన్లు తదితర వ్యవహారాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలా దాఖలవుతున్న కేసులను పరిష్కరించేందుకు ఎక్కువ సమయం పడుతోంది. దాంతో న్యాయమూర్తులు ఒకే అంశానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ కలిపి ఒకేసారి విచారిస్తూ.. వీలైనంత త్వరగా తీర్పులు ఇస్తున్నారు. అయినా ప్రభుత్వాల తీరుతో ఫలితం లేకుండా పోతోంది. జి.సత్యనారాయణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో లక్షలాది మందికి, ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేలా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయకుండా అప్పీలు చేసి వివాదాన్ని పెద్దది చేసింది. ఇక ఇటీవల భూసేకరణలో ప్రభుత్వాలు అడ్డగోలుగా వ్యవహరిస్తుండడంతో.. దీనిపై దాఖలవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరిగింది. రెండో స్థానం పోలీసుశాఖదే! పోలీసులు, వారు వ్యవహరిస్తున్న తీరుపై దాఖలవుతున్న కేసులు కూడా భారీగా ఉన్నాయి. ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయని సందర్భాల్లో హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇక పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూరుస్తుండటంతో బాధితులు న్యాయం కోసం హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇక తెలంగాణకు పరిపాలనా ట్రిబ్యునల్ లేకపోవడంతో ఉద్యోగ వివాదాలూ హైకోర్టుకే చేరుతున్నాయి. -
సత్వర పరిష్కారానికి పనితీరు సూచీ
పెండింగ్ కేసులపై నీతి ఆయోగ్ సూచన న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థ పనితీరు సూచీను ఏర్పాటు చేయడం ద్వారా కింది కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించ వచ్చని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించింది. దీంతో పాటు ఆన్లైన్ వ్యవస్థ ద్వారానే న్యాయవ్యవస్థలో నియామకాలను చేయాలని కూడా సూచించింది.హైకోర్టులు, హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవ్యవస్థ పనితీరు సూచీలతో పర్యవేక్షించి జిల్లా కోర్టుల్లోనూ, సబార్టినేట్ స్థాయిల్లోనూ జరిగే ఆలస్యాన్ని నివారించవచ్చని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో అభిప్రాయ పడింది. మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సమాచారం, ప్రస్తుతమున్న మౌలిక వసతులు, సూచనలతో పాటు కేసులు ఎంతకాలం నుంచి పెండింగ్ లో ఉంటున్నాయి, ఎంత శాతం కేసులు పెండింగ్లో ఉంటున్నాయి వంటి అంశాలను గత ఏడాది సమాచారంతో పోల్చి చూడవచ్చని నివేదికలో పేర్కొంది. కోర్టు పనితీరులో ప్రపంచశ్రేణి ప్రమాణాలను పాటించేందుకు ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జ్యుడీషియల్ అడ్మినిస్ట్రేషన్, ది ఫెడరల్ జ్యుడీషియల్ సెంటర్ (యూఎస్), ది నేషనల్ ఆఫ్ కోర్ట్స్ (యూఎస్), సింగపూర్లోని సబా ర్డినేట్ కోర్టులను అధ్యయనం చేయాలని కూడా సూచించింది. -
సరైన వాదనలు లేకనే పెండింగ్ కేసులు
► అపరిష్కృత కేసులతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం: హరీశ్ ► ప్రాజెక్టుల నిర్మాణంలో న్యాయపర చిక్కులు త్వరగా అధిగమించాలని సూచన సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కేసుల్లో సమర్థవంతమైన వాదనలు లేకపోవడంతోనే ఈ కేసులు కోర్టుల్లో సుదీర్ఘకాలం కొనసాగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఏళ్లతరబడి ఈ కేసులు అపరిష్కృతంగా ఉండటంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోందని.. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలన్నారు. శనివారం జలసౌధలో ప్రభుత్వ న్యాయవాదులు, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులను త్వరగా అధిగమించాలని కోరారు. జిల్లాల్లోని వివిధ కోర్టు కేసుల్లో ప్రభుత్వం తరఫున సమర్థవంతంగా వాదించేందుకు హైదారాబాద్, ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదులను నియమించుకోవాలని సూచించారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలను నివారించడానికి సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. దేవాదుల, ఏ.ఎం.ఆర్.పి, కల్వకుర్తి తదితర ప్రాజెక్టుల్లో పలు చోట్ల పది, ఇరవై ఎకరాల భూసేకరణ సమస్యలు కోర్టు కేసుల్లో చిక్కుకున్న కారణంగా వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోతున్నట్టు మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్టు వ్యయం రూ.400 కోట్లు కాగా పరిహారం చెల్లింపుల కోసం ఏకంగా రూ.1,400 కోట్లు ఖర్చు చేయవలసి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, లా కార్యదర్శి నిరంజన్ రావు, ఈఎన్సీ మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
కోర్టుల్లో కెమెరా కన్ను!
దేశంలో చాన్నాళ్లుగా అందరూ కోరుకుంటున్నట్టు న్యాయ స్థానాల్లో క్లోజ్డ్ సర్క్యూట్(సీసీ) కెమెరాలు రాబోతున్నాయి. రాష్ట్రానికి రెండు జిల్లాలు చొప్పున ఎంచుకుని అక్కడి జిల్లా న్యాయస్థానాల్లో కెమెరాలు అమర్చాలని మొన్న మార్చిలో ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం సర్వోన్నత న్యాయస్థానం మొదలుకొని దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో, ట్రిబ్యునళ్లలో ఈ ఏర్పాటు చేయాలంటూ మూడు రోజుల క్రితం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై నివేదిక దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి పెండింగ్ పడుతున్న కేసులపై అందరికీ ఆదుర్దా ఉంది. అయితే పరిష్కారంపై న్యాయవ్యవస్థతోసహా ఎవరికీ స్పష్టత లేదు. ఎందుకంటే ఇది ఏదో ఒక్క అంశంతో ముడిపడి ఉన్న సమస్య కాదు. చాలినంతగా న్యాయమూర్తులు లేకపోవడం మొదలుకొని చీటికి మాటికీ కేసులు వేసే ప్రభుత్వ యంత్రాంగం వైఖరి వరకూ ఇందులో ఎన్నో ఉన్నాయి. ఫాస్ట్ట్రాక్ కోర్టులు, వివిధ రంగాలకు ట్రిబ్యునళ్లు, ఫ్యామిలీ కోర్టులు, మొబైల్ కోర్టులు, న్యాయస్థానాల సంఖ్య పెంచడం... ఇలా రకరకాల విధానాల ద్వారా పెండింగ్ సమస్యను దారికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ అందువల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. అయితే పెద్దగా ఎవరి దృష్టీ పడని అతి ముఖ్యమైన అంశం పారదర్శకత. కింది కోర్టుల్లో నిర్దేశించిన విధానాలను పాటించక ఇష్టానుసారం వ్యవహరించడం పెండింగ్ కేసులు కొండలా పెరిగిపోవడానికి కారణమన్న వాదన ఎప్పటినుంచో ఉంది. కేసుల విచారణ తీరు తెన్నులను రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలు అమరిస్తే అన్నీ పద్ధతిగా జరుగు తాయని ఇలా వాదించేవారి అభిప్రాయం. విచారణ దశలో వివిధ అంశాలను లిఖితపూర్వకంగా రికార్డు చేయడం ఎప్పటినుంచో ఉన్నదే. అయితే కేసులో కీల కమైనవని న్యాయమూర్తి భావించి మౌఖికంగా చెప్పే విషయాలు మాత్రమే అందులోకి ఎక్కుతాయి. కేసులో ఏది న్యాయమో, ఏది కాదో నిర్ధారించేందుకు ఆ అంశాలు ఉపయోగపడతాయి తప్ప మొత్తంగా విచారణ ఎలా జరుగుతున్నదో, తరచు వాయిదా పడటానికి దారితీస్తున్న పరిస్థితులేమిటో అవి తేటతెల్లం చేయలేవు. కేసు విచారణల వార్తల్ని సేకరించేందుకు మీడియాను దాదాపు అన్ని దేశాల్లోనూ అనుమతిస్తున్నారు. అయితే దానికుండే పరిమితులు దానికున్నాయి. ఏ వ్యవస్థకైనా గోప్యతనేది అవసరమే కావొచ్చుగానీ అది మోతాదుకు మించి ఉంటే అవరోధంగా మారుతుంది. పకడ్బందీ పర్యవేక్షణ ఉన్నచోట అన్నీ సక్ర మంగా కొనసాగుతాయి. లేనిపోని జాప్యానికి అడ్డుకట్ట పడుతుంది. హైకోర్టుల్లో పోర్టుఫోలియో జడ్జీలుండి తమ తమ పరిధుల్లోని జిల్లాల్లో ఏం జరుగుతున్నదో... కేసుల కదలిక ఎలా ఉంటున్నదో గమనిస్తుండటం, అవసరమైన సూచనలు, సల హాలు ఇవ్వడం ఇందులో భాగమే. అయితే ఇది ఎంతమాత్రమూ సరిపోదన్నది పారదర్శకత కోరుకునేవారి వాదన. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయ లలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఏళ్ల తరబడి సాగిన తీరుపై తీవ్ర విమ ర్శలు చెలరేగాయి. తీరా తుది తీర్పు వెలువడేనాటికి ఆమె కన్నుమూశారు. ఏదో ఒక సాకు చెప్పి న్యాయవాదులు వాయిదాలు కోరడం, న్యాయమూర్తులు ఉదా రంగా అనుమతులీయడం ఒక ధోరణిగా మారింది. విచారణ ప్రక్రియంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేస్తే ఈ ధోరణి ఎంతోకొంత తగ్గుతుంది. ఆమేరకు విశ్వసనీయత పెరుగుతుంది. అయితే అదే సమయంలో కేసును విచారించే న్యాయమూర్తిపై అది ఒత్తిడి కలగజేస్తుందన్నది కూడా నిజం. సాక్ష్యమూ, చట్టమూ తప్ప ఇతరత్రా అంశాల ప్రభావమేదీ కేసుపై పడకుండా చూసుకోవడం ఆ పీఠంపై ఉన్నవారికి ప్రధానమవుతుంది. న్యాయమూర్తి మాత్రమే కాదు... కేసుకు సంబంధించిన ఇరు పక్షాల న్యాయవాదులు, కోర్టు హాల్లో ఉండే సిబ్బంది, పోలీసు అధికారులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరిస్తారు. చాలా దేశాల్లో కోర్టు విచారణలను కెమెరాల్లో రికార్డు చేసే సంప్రదాయం ఉంది. అమెరికాలో 1991లో తొలిసారి ఈ విధానం ప్రవేశపెట్టినప్పుడు అటు విమ ర్శలు, ఇటు ప్రశంసలు కూడా సమానంగా వచ్చాయి. ఆన్లైన్లో లభ్యమయ్యే ఆ వీడియోల వల్ల సొంత పనులపై బయటకు వెళ్లినప్పుడు సమస్యగా మారుతున్న దని న్యాయమూర్తులు కొందరు చెప్పారు. బాధితుల పక్షం న్యాయవాదిగా ఉన్న వారికి పెద్ద ఫర్వాలేదుగానీ... వారిని ఇబ్బందులపాలు చేసినవారి తరఫున వృత్తి ధర్మంతో వాదిస్తే అది తమపై వేరే అభిప్రాయం కలగజేస్తున్నదని వాపోయిన న్యాయవాదులున్నారు. మరోపక్క తమ గురించి అందరికీ తెలిసిపోతుందని సాక్ష్యం చెప్పేవారు భయాందోళనలకు గురికావడం, తడబడటం మామూలే. ఇలాంటి కారణాలు చూపి అమెరికాలోని కొన్ని ఫెడరల్ కోర్టులు కెమెరాల ఏర్పాటును తిరస్కరించాయి. క్రిమినల్ కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసే చానెళ్లు కూడా ఆ దేశంలో ఉన్నాయి. అక్కడి కోర్టు ఆఫ్ అప్పీల్స్ కెమెరాలను అంగీ కరిస్తుంటే సుప్రీంకోర్టు కాదంటున్నది. మన సుప్రీంకోర్టు మాత్రం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయమంటూనే ఆ రికార్డులను సమాచార హక్కు చట్టం కింద బయట పెట్టకూడదన్న ఆంక్ష విధించింది. దీనికితోడు ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల అనుమతి లేనిదే ఎవరికీ రికార్డయిన భాగాలు ఇవ్వకూడదని తెలిపింది. అలాగని సీసీ కెమెరాల ఏర్పాటు ప్రభావంపై అతి అంచనాలకు పోవడం కూడా సరికాదు. కెమెరాల ఏర్పాటు దానికదే కేసుల విచారణను వేగవంతం చేస్తుందని, అంతా పారదర్శకమవుతుందని భావించకూడదు. పెండింగ్ కేసుల సమస్య పరిష్కారానికి తోడ్పడే అనేకానేక అంశాల్లో అదొకటి మాత్రమే. దేన్నయినా కోర్టులో పడేసి చేతులు దులుపుకునే ప్రభుత్వ యంత్రాంగం వైఖరి అటు సాధారణ పౌరులను కోర్టు పక్షుల్ని చేస్తున్నది. ఇటు న్యాయస్థానాలను ఊపిరి సలపనీయడం లేదు. అందుకే అందరికంటే ముందు మారాల్సింది పాలనా వ్యవస్థే. అది మారితేనే ఏ కాస్తయినా ప్రయోజనం కలుగుతుంది. -
నంద్యాల, ఆదోనిలో మహిళా పోలీస్స్టేషన్లు
– జిల్లాలో 4600 కేసులు పెండింగ్ – చోరీ కేసుల రికవరీకి ప్రత్యేక బృందాలు – సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి – జిల్లా ఎస్పీ గోపినాథ్ జట్టి వెల్లడి కోవెలకుంట్ల: జిల్లాలోని నంద్యాల, ఆదోని పట్టణాల్లో మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు జిల్లా ఎస్పీ గోపినాథ్ జట్టి చెప్పారు. సోమవారం సాయంత్రం స్థానిక సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్లకు వచ్చే మహిళా కేసుల ఆధారంగా మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4600 కేసుల పెండింగ్లో ఉండగా వీటిలో 300 మిస్సింగ్ కేసులు ఉన్నాయన్నారు. మూడు నెలల వ్యవధిలో ఈ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు వెల్లడించారు. పెండింగ్లో ఉన్న చోరీ కేసుల్లో పురోగతి సాధించేందుకు సబ్ డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలుఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వీటిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారు ప్రమాదాలకు గురి అవుతున్నారన్నారు. అవగాహన కల్పించడంతో పాటు విస్తృత తనిఖీలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మండల స్థాయిలో ఒక్కో ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను దాతల సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రి బసలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ శ్రీధర్ పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి
నల్లగొండ లీగల్ : జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకారం అందించాలని హైకోర్టు న్యాయమూర్తి డా.షమీమ్ అక్తర్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన సందర్భంగా శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సన్మానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతరం వివిధ కోర్టు తీర్పులను అధ్యయనం చేస్తూ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని కోరారు. తాను నల్లగొండలో న్యాయవ్యాదిగా పనిచేస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి ఎం.ఆర్. సునీత, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కల్లూరి యాదయ్య, కొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏకాగ్రతతో చదువుకోవాలి నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని హైకోర్టు జడ్జి షమీమ్ అక్తర్ అన్నారు. పట్టణంలోని డ్వాబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంధుల పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా మన ప్రయత్నం చేసుకుంటూ పోవాలన్నారు. తాను కూడా ఎంతో కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. అంధులమని బాధపడకుండా కష్టపడి చదవాలని సూచించారు. డ్యాబ్ సంస్థ కోసం తన వంతు సహకారం అందస్తానని తెలిపారు. అంతకు ముందు స్వపరిపాలన దినోత్సవంలో ఉత్తమ ప్రతిభ కనభర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత, ప్రభాకర్రావు, పిన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, యాదయ్య, ఎంఏ. అజీజ్, డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు తదితరులు పాల్గొన్నారు. -
‘సుప్రీం’లో పెండింగ్ కేసుల పెరుగుదల 88%
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) 1950, జనవరి 28న ప్రారంభమైంది. ఆ తర్వాత సరిగ్గా సంవత్సరానికి ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య 690. అప్పటినుంచి పెండింగ్ కేసుల సంఖ్య ఏటా పెరిగిపోతూ వచ్చి గత సెప్టెంబర్ నాటికి 60,938కి చేరింది. అంటే పెండింగ్ కేసుల సంఖ్యలో పెరుగుదల ఏకంగా 88 శాతం. సుప్రీంకోర్టు విడుదల చేసిన ‘భారత న్యాయవ్యవస్థ వార్షిక నివేదిక 2015–16’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆరంభమైన తొలి ఏడాదిలో 1,215 కేసులు దాఖలవగా.. గతేడాది జనవరి– సెప్టెంబర్ కాలంలో 59,386 కేసులు దాఖలయ్యాయంటే దాఖలవుతున్న కేసుల సంఖ్య ఎలా పెరిగిపోతోందో తేటతెల్లమవుతోంది. -
15 వేల మంది జడ్జీలు అవసరం
జిల్లా కోర్టుల్లో 2.8 కోట్ల పెండింగ్ కేసులు జూన్ 2016 నాటికి 1.89 కోట్ల కేసుల పరిష్కారం కిందిస్థాయి కోర్టులపై సుప్రీం నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో ప్రమాదకర స్థాయిలో దాదాపు 2.8 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని సుప్రీం కోర్టు విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అలాగే 5 వేల జడ్జీల పదవులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. ‘భారత్లోని కిందిస్థాయి కోర్టులపై నివేదిక 2016’ పేరిట వివరాలు వెల్లడిస్తూ... జిల్లా కోర్టుల్లో సిబ్బందిని కనీసం ఏడు రెట్లు పెంచాలని, రాబోయే మూడేళ్లలో సంక్షోభం అధిగమించేందుకు దాదాపు 15 వేల మందికి పైగా జడ్జీల్ని నియమించాలని సూచించింది. జిల్లా కోర్టులపై సుప్రీం నివేదిక ప్రకారం... జూలై 1, 2015– జూన్ 30, 2016 మధ్య దేశవ్యాప్తంగా 2,81,25,066 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 1,89,04,222 కేసుల్ని కిందిస్థాయి కోర్టులు పరిష్కరించాయి. జిల్లా కోర్టుల్లో జడ్జీల కొరత వల్లే ఇంత భారీ స్థాయి లో కేసులు అపరిష్కృతంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. 4,954 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉండగా... అనుమతించిన న్యాయాధికారుల సంఖ్య 21,324 మందిగా నివేదిక పేర్కొంది. 10 లక్షల మందికి 50 మంది జడ్జీలు ‘మా అధ్యయనం ప్రకారం, భవిష్యత్తులో కేసుల పెరుగుదల దృష్ట్యా అపరిష్కృత కేసుల పరిష్కారానికి ప్రస్తుతమున్న జడ్జీల సంఖ్య సరిపోదు. అదనపు సిబ్బంది, సహాయక సిబ్బంది అవసరంతో పాటు మౌలిక వసతులు కల్పించి పరిస్థితిని చక్కదిద్దడం తక్షణావసరం’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉండాలని, ప్రతీ 10 లక్షల మందికి 50 మంది జడ్జీలు ఉండేలా చూడాలన్న సుప్రీం తీర్పును పాటించాలని సూచించింది. అలాగే ఐపీసీ కేసుల్లో దాదాపు 13 శాతం మాత్రమే విచారణ పూర్తి చేసుకుంటున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) కూడా పేర్కొందన్న విషయాన్ని సుప్రీం గుర్తుచేసింది. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్తో పాటు, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జడ్జీల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో వరుసగా 794, 792, 624 మంది జడ్జీలు భర్తీ కావాలి. ఉత్తరప్రదేశ్లో 58.8 లక్షల కేసులు పెండింగ్లో ఉండగా, వాటిలో 43.73 లక్షలు క్రిమినల్ కేసులే. -
40.54 లక్షల పెండింగ్ కేసులు
24 హైకోర్టుల్లో 1,079 మంది న్యాయమూర్తులకు గాను 608 మందే... • న్యాయమూర్తుల కొరత 44 శాతం • పెండింగ్ కేసుల్లో సివిల్ 29,31,352, క్రిమినల్ 11,23,178 • హైకోర్టులో జడ్జీల ఖాళీలు, అపరిష్కృత కేసులపై సుప్రీం నివేదిక న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో పెండింగ్ కేసులు, న్యాయమూర్తుల ఖాళీలపై సుప్రీంకోర్టు వార్షిక నివేదికలో విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి. సుప్రీంకోర్టు వెల్లడించిన వివరాల మేరకు మొత్తం 24 హైకోర్టుల్లో 40.54 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉండగా, 44 శాతం న్యాయమూర్తుల కొరతతో కోర్టులు తంటాలు పడుతున్నాయి. న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మధ్య సంఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. ‘భారత న్యాయవ్యవస్థ వార్షిక నివేదిక 2015–16’ పేరిట గతేడాది జూన్30 వరకూ హైకోర్టుల్లోని న్యాయమూర్తుల ఖాళీలు, పెండింగ్ కేసుల వివరాల్ని సుప్రీంకోర్టు ఇందులో పొందుపరిచింది. సుప్రీం నివేదిక ప్రకారం... మొత్తం 24 హైకోర్టులకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 1,079 కాగా, కేవలం 608 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య కంటే ఇది 43.65 శాతం తక్కువ. ఇక 40.54 లక్షల అపరిష్కృత కేసుల్లో సివిల్ కేసుల సంఖ్య 29,31,352 కాగా, క్రిమినల్ కేసులు 11,23,178. మొత్తం కేసుల్లో పదేళ్లకు పూర్వం నుంచి అపరిష్కృతంగా ఉన్న కేసులు 7,43,191. హైదరాబాద్లో 2.78 లక్షల కేసులు: అలహాబాద్ తర్వాతి స్థానం మద్రాసు హైకోర్టుది... అక్కడ అపరిష్కృత కేసులు 3,02,846 కాగా... 75 మంది న్యాయమూర్తులకుగాను 38 మందే ఉన్నారు. బాంబే హైకోర్టులో 2,98,263 కేసులు అపరిష్కృతంగా ఉండగా, అందులో 53,511 కేసులు పదేళ్లకు పూర్వం నాటివి.ఈ కోర్టుకు 94 మంది న్యాయమూర్తుల్ని కేటాయించగా 64 మందితోనే పనిచేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టులో గతేడాది జూన్ 30 నాటికి 40 శాతం మేర న్యాయమూర్తుల కొరత ఉండగా... 60 మందికి గాను కేవలం 35 మంది న్యాయమూర్తులతోనే విధులు నిర్వర్తిస్తోంది. ఏపీ, తెలంగాణల ఉమ్మడి హైకోర్టులో 2,78, 695 కేసులు అపరిష్కృతంగా ఉండగా ఇందులో 24,606 కేసులుS పదేళ్లనాటివి. న్యాయమూర్తుల విషయానికొస్తే 61 మంది అవసరం కాగా కేవలం 25 మందితో నడుస్తోంది. పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టుల్లో కూడా 2.5 లక్షలకు పైగా కేసులు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. గుజరాత్లో 52 మంది న్యాయమూర్తులకు 33 మందే ఉండగా... అపరిష్కృత కేసుల సంఖ్య 92,393గా ఉంది. చత్తీస్గఢ్ హైకోర్టులో 8 మంది న్యాయమూర్తులే దేశంలో చత్తీస్గఢ్ హైకోర్టులో అత్యంత తక్కువగా 37 శాతం మాత్రమే న్యాయమూర్తులున్నారు. ఈ హైకోర్టుకు 22 మంది అవసరం కాగా ప్రస్తుతం 8 మందే పనిచేస్తున్నారు. ఇక పెండింగ్ కేసులు మాత్రం 54 వేలకు పైనే ఉన్నాయి. అలహాబాద్ టాప్ అపరిష్కృత కేసులు, న్యాయమూర్తుల ఖాళీల్లో అలహాబాద్ హైకోర్టు ముందంజలో ఉంది. కేటాయించిన న్యాయమూర్తుల్లో సగం కంటే తక్కువ మందితో పనిచేయడంతో పాటు, దేశం మొత్తం పెండింగ్ కేసుల్లో నాలుగో వంతు ఈ హైకోర్టులోనే ఉండడం విశేషం. మొత్తం 9.24 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉండగా... 3 లక్షలకు పైగా కేసులు 10 ఏళ్లకు ముందటివి. అలహాబాద్ హైకోర్టులో మొత్తం 160 మంది జడ్జీలు ఉండాల్సి ఉండగా 78 మందే ఉన్నారు. -
లోక్ అదాలత్లో పెండింగ్ కేసుల పరిష్కారం
లీగల్ (కడప అర్బన్): దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని,ఈ కార్యక్రమం ద్వారానే ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించే విధంగా చూస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 2015 నుంచి 2016 వరకు 800కు పైగా లోక్ అదాలత్ కార్యక్రమాలను నిర్వహించి కోట్ల రూపాయల్లో నష్టపరిహారాన్ని చెల్లించామన్నారు. ఈ కార్యక్రమంలో నాల్గవ అదనపు జిల్లా జడ్జి అన్వర్బాషా, ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ యూయూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 1598 కేసులకు పరిష్కారం ఈ లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో ఎంతోకాలంగా వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 1998 కేసులకుగాను 1598 కేసులకు పరిష్కారం లభించింది. వీటి ద్వారా కక్షిదారులకు రూ. 5,45,81,581 ఇప్పించారు. -
హైకోర్టులకు ‘రిటైర్డు జడ్జీలు’
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా రిటైర్డు జడ్జీల సేవలను హైకోర్టుల్లో వినియోగించుకునేందుకు కేంద్రం, న్యాయవ్యవస్థ అంగీకరించాయి. ఇందుకోసం రాజ్యాంగంలోని ఓ విశిష్ట నిబంధనను అమల్లోకి తీసుకురానున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224 (ఏ) ప్రకారం.. కోర్టుల్లో పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నప్పుడు వీటిని త్వరిత గతిన పరిష్కరించేందుకు గతంలో హైకోర్టుల్లో జడ్జీలుగా పనిచేసి రిటైరైన వారిని తిరిగి జడ్జీలుగా నియమించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గతంలో జడ్జీగా పనిచేసిన వారిని మళ్లీ బాధ్యతలు తీసుకొమ్మని కోరవచ్చు. ఈ అంశంపై ఏప్రిల్లో జరిగిన సీఎంల, హైకోర్టు చీఫ్ జస్టిస్ల భేటీలో చర్చ జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు మినిట్స్ సిద్ధం చేసినప్పటికీ.. ఇందులో కొన్ని స్పష్టమైన నిర్ణయాలపై కేంద్ర న్యాయ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.కొత్తగా న్యాయశాఖ బాధ్యతలు స్వీకరించిన రవిశంకర్ ప్రసాద్ ఈ మినిట్స్ను కొద్ది రోజుల క్రితమే ఆమోదించి పంపించారు. జడ్జీల ఎంపికపై ఉమ్మడి నిర్ణయానికి వచ్చేందుకు శాసన, న్యాయవ్యవస్థల మధ్య చర్చలు జరుగుతున్న ఈ సమయంలో మినిట్స్కు ఆమోదం తెలపటంతో.. కొలీజియంపై ప్రతిష్టంభన తొలగే అవకాశముంది. -
సయోధ్య మీ దయ కాదు, బాధ్యత!
సమకాలీనం దేశవ్యాప్తంగా మొత్తం పెండింగ్ కేసులు 2.28 కోట్లని కేంద్ర న్యాయశాఖ అధికారికంగా వెల్లడించింది. ఇక మన దేశంలో జనాభా–న్యాయమూర్తుల నిష్పత్తి కూడా ఆశావహంగా లేదు. సగటున ప్రతి పదిలక్షల జనాభాకు 13 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఐక్యరాజ్య సమితి అధ్యయనం జరిపిన 65 దేశాల్లో ఇంతకన్నా తక్కువ నిష్పత్తిలో జడ్జీలున్న దేశాలు గోటమాల, నికరాగువా, కెన్యా ఈ మూడు మాత్రమే! ప్రతి పదిలక్షల జనాభాకు కనీసం 50 మంది జడ్జీలు సగటున ఉండాలని లా కమిషన్ ఏనాడో సిఫారసు చేసింది. ఏ దేశ న్యాయవ్యవస్థ నుంచైనా ఆ దేశస్తులు ఆశించేదేముంటుంది? అమె రికా చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఎర్ల్ వారెన్ (అంతకు ముందు మూడు పర్యా యాలు కాలిఫోర్నియా గవర్నర్) ఆ పదవి చేపట్టడానికి ముందు ఒక గొప్ప మాట చెప్పారు. ‘‘...ఎక్కడ అన్యాయం జరిగినా మనం సరిదిద్దాలి. ఎక్కడ పేదరికం ఉన్నా మనం నిర్మూలించాలి. ఎక్కడ హింస చెలరేగినా మనం శిక్షించాలి. ఎక్కడ నిర్లక్ష్యం పొడచూపినా మనం శ్రద్ధ–భరోసా కల్పించాలి’’ ఇంతకన్నా న్యాయవ్యవస్థ నుంచి ఎవరైనా ఏమాశిస్తారు? కానీ, ఇవేవీ లభించనప్పుడు... పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది? పరిష్కారం నోచక న్యాయస్థానాల్లో కూరుకుపోయిన కోట్లకొలది కేసుల్లోని కక్షిదారులు మన దేశంలో సకాలంలో న్యాయం అందక అలమటిస్తున్నారు. ‘న్యాయ జాప్యం న్యాయ తిరస్కరణ కిందే లెక్క’ అన్న మౌలిక సూత్రం ప్రకారం చూస్తే ఇక్కడ న్యాయమెంత అపురూపమైందో ఊహించవచ్చు. ఎంత అరు దైనదో! అని కూడా అనిపిస్తుంది. ఒక లోతైన సమీక్ష, ఆత్మపరిశీలన, ప్రగతి శీల సంస్కరణలు, ప్రజాసేవకు పునరంకితం కావాల్సిన దిశా నిర్దేశం అవస రమైన పరిస్థితిని భారత న్యాయవ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. న్యాయ మూర్తుల ఖాళీలు–నియామకాలు, కొలీజియం–కమిషన్ స్పర్థలు, సుప్రీం కోర్టు–కేంద్రప్రభుత్వం గిల్లికజ్జాలు వంటివి బయటకు కనిపించే పాలనాపర మైన వివాదాల్లాగున్నా... అంతర్లీనమైన ఎన్నో కారణాలు, ఎత్తులు–పై ఎత్తులూ తలచుకుంటే మనసును కలచివేస్తాయి. వాటి ప్రతికూల ప్రభావం ప్రజాస్వామ్య స్పూర్థికి గండికొట్టడమే కాక, భారత రాజ్యాంగం సంకల్పించిన దేశ సమ పురోగతినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పైపైన కనిపించే న్యాయ– కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య విభేదాలుగానో, న్యాయ–శాసన వ్యవస్థల మధ్య పంతాలుగానో వీటిని చూడలేము. ఇంకొంచెం లోతుకు వెళ్లి, రాజ్యాంగం అమలును సాకారం చేసే మూడు కీలకాంగాల మధ్య సమ న్వయ సాధనకు ప్రతిబంధకమౌతున్న కారణాల్ని అన్వేషించాలి. ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు చీఫ్జస్టిస్ వంటి వారు చిత్తశుద్ధితో కృషిచేయాలి. ఏకాభిప్రాయం ఎందుకు రాదు? ఏ విషయంలోనైనా కాస్త పట్టువిడుపులుంటే ఏకాభిప్రాయం సుసాధ్యమే! న్యాయమూర్తుల్ని న్యాయమూర్తులే ఎంపిక చేయడమేమిటన్న మౌలిక ప్రశ్నతో ‘కొలీజియం’ పద్ధతి వివాదాస్పదమైంది. కొలీజియం భేటీల్లో వెల్ల డయ్యే అభి ప్రాయాల్ని రికార్డు చేయటం లేదని, పారదర్శకత లోపించిందని, జవాబు దారీతనం కోసం వాటిని పొందుపరచడం అవసరమని... అందులో సభ్యు డైన జస్టిస్ చలమేశ్వర్ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ వివాదం మరింత జటిల మైంది. న్యాయమూర్తుల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జాతీయ న్యాయ నియామక కమిషన్’ (ఎన్జేఏసీ) ప్రక్రియ కూడా లోపభూయిష్ఠంగా ఉందనే విమర్శలు వచ్చాయి. దరిమిలా గత సంవ త్సరం సుప్రీంకోర్టు ధర్మాసనం సదరు కమిషన్ చెల్లుబాటునే కొట్టివేసింది. ఫలి తంగా తలెత్తిన ప్రతిష్ఠంభన ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీకి ఆటం కంగా మారింది. ఈ లోపు, నియామకాల కోసం కొంత ప్రత్యామ్నాయ ప్రక్రియ జరిగినా... ప్రతిష్ఠంభన మాత్రం తొలగలేదు. నిజానికి అసాధారణ ఖాళీలకు, కేసుల పరిష్కారంలో జరుగుతున్న విపరీత జాప్యాలకు అదొక్కటే కారణం కాదు. చివరకు పరిస్థితి, ‘న్యాయవ్యవస్థను ధ్వంసం చేసి, న్యాయ స్థానాల్నే మూసివేయాలనుకుంటున్నారా? అది సాగనివ్వం...!’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహించే దాకా వచ్చింది. ‘మా సహనం పరీ క్షించకండి, కార్యనిర్వాహక వ్యవస్థ నిష్క్రియాపరత్వానికి న్యాయవ్యవస్థను బలిపెట్టకండి’ అని కూడా మందలించారు. కమిషన్ రద్దుతో పూర్వపు కొలీ జియం వ్యవస్థ తిరిగి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వపు అభ్యంతరాల దృష్ట్యా కొత్తగా ఒక ‘ప్రక్రియ పత్రం’ (ఎంఓపీ) రూపొందించాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఎంఓపీ పై ఏకా భిప్రాయం కుదరకపోవడంతో అది అమల్లోకి రాలేదు. ‘అయినా నియామక ప్రక్రియ ఏం ఆగిపోలేదు కదా! గడచిన రెండేళ్లలో పెద్ద సంఖ్యలోనే జడ్జీల నియామకాలు, సుప్రీం కొలీజియం ప్రతిపాదించినట్టు జడ్జీల బదిలీలు చేశాం’ అని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ‘86 మంది హైకోర్టు జడ్జీల్ని, నలు గురు సుప్రీంకోర్టు జడ్జీల్ని కొత్తగా నియమించాం, 33 మంది హైకోర్టు జడ్జీల్ని, నలుగురు సుప్రీంకోర్టు జడ్జీల్ని కొలీజియం ప్రతిపాదించినట్టే బది లీలు చేశాం’ అన్నది కేంద్ర వాదన. ‘మేం 77 మంది జడ్జీల జాబితా ఇస్తే, కేవలం 18 మందినే ఖరారు చేశారు. మిగతా పేర్ల జాబితా పెట్టుకొని కూర్చో వడం ఏం పద్ధతి, అందులో ఎవరి విషయంలోనైనా అభ్యంతరాలుంటే వెనక్కి పంపొచ్చు కదా! మేం పరిశీలించి, సరిదిద్ది పంపుతాం’ అనేది సుప్రీం వాదన. ఎదుటివారి ఆధిపత్యాన్ని అంగీకరించరాదన్న ఇరువురి భావనే ప్రస్తుత ప్రతిష్టంభనకు కారణమని న్యాయనిపుణులభిప్రాయపడుతున్నారు. కేంద్రం తాజాగా రూపొందించిన ఎంఓపీలో ఒక ప్రతిపాదన ఉంది. కొలీ జియం ప్రతిపాదనలు ఇష్టం లేకుంటే, దేశ భద్రత కారణాలతో వీటో చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికుంది. అది తుది నిర్ణయమౌతుంది, అలాంటి నిర్ణయాధికారం ఉండటాన్ని ఆధిపత్యంగానే సుప్రీం భావిస్తున్నట్టుంది. గగుర్పాటు కలిగించే గణాంకాలు దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసుల్ని తలచు కుంటే గగుర్పాటు కలుగుతుంది. దేశవ్యాప్తంగా 2.72 కోట్ల కేసులు పెండిం గ్లో ఉండగా, అందులో 2.30 కోట్ల కేసులు కిందిస్థాయి (సబార్డనేట్) న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయని ఒక లెక్క. అన్ని హైకోర్టుల్లో 40 లక్షల కేసుల వరకు, సుప్రీంకోర్టులో 60 వేల వరకు కేసులు, వివాదాలు అపరి ష్కృతంగా ఉన్నాయనేది విశ్వసనీయ సమాచారం. గత సెప్టెంబరు1 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పెండింగ్ కేసులు 2.28 కోట్లని కేంద్ర న్యాయశాఖ అధికారికంగా వెల్లడించింది. ఇక మన దేశంలో జనాభా–న్యాయమూర్తుల నిష్పత్తి కూడా ఆశావహంగా లేదు. సగటున ప్రతి పదిలక్షల జనాభాకు 13 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి అధ్యయనం జరిపిన 65 దేశాల్లో ఇంతకన్నా తక్కువ నిష్పత్తిలో జడ్జీలున్న దేశాలు గోటమాల, నిక రాగువా, కెన్యా ఈ మూడు మాత్రమే! ప్రతి పదిలక్షల జనాభాకు కనీసం 50 మంది జడ్జీలు సగటున ఉండాలని చాలా కాలం కిందటే లా కమిషన్ సిఫా రసు చేసింది. ఇక ఖాళీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇదే నెల ఒకటో తేదీ నాటికి ఉన్నత న్యాయస్థానాల్లో ఈ ఖాళీల సంఖ్య 461 (1079 ఆమోదించిన పోస్టులు) అని న్యాయశాఖ వెల్లడించింది. అంటే, దాదాపు 46 శాతం పైనే ఖాళీలన్నమాట! అందులో అయిదు ఖాళీలు సుప్రీం కోర్టువి కూడా ఉన్నాయి. మన ఉమ్మడి న్యాయస్థానంలో ఆమోదించిన 61 జడ్జీ స్థానాలకు గాను 23 మంది మాత్రమే ఉన్నారు. ఇది సగం కన్నా చాలా తక్కువ. ఇక దేశంలో కింది స్థాయి న్యాయస్థానాల్లో 4,400 జడ్జీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనుమతించిన పోస్టుల్లో ఇది దాదాపు సగం సంఖ్య. ఖాళీ లను భర్తీ చేసేలా జడ్జీల నియామకం పాలనాపరమైన నిర్ణయమే అయినా ఉన్నత న్యాయస్థానాల క్రియాశీల పాత్ర ఉంటుంది. కోర్టుల్లో కేసుల పరి ష్కారం కావడంలో జాప్యాలకు అనేకానేక కారణాలున్నా, జడ్జీల కొరత, ఖాళీలు కూడా ప్రధానమైనదేనని లా కమిషన్ 245వ నివేదిక స్పష్టం చేసింది. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని, మౌలిక/కనీస సదుపాయాల్ని మెరుగు పరచాలని విస్పష్టంగా సిఫారసు చేసింది. అమలు ఆమడ దూరంలోనే ఉంది. ‘కేసు ఓడిన వాడు కోర్టు ప్రాంగణంలో ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడ’న్న నూరేళ్ల కింద పుట్టిన నానుడి కాస్త అటుఇటుగా ఇప్పటికీ వాస్తవం కావడమే దురదృష్టకరం! సంస్కరణ లు, చొరవ అవసరం ‘దేశంలోని న్యాయస్థానాల్లో ప్రభుత్వమే ఓ పెద్ద కక్షిదారు, ఆ పరిస్థితి ఉండ కూడదు, వీలయినన్ని వివాదాల్ని ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కరించుకొని న్యాయస్థానాలపై భారం తగ్గించాల’ని స్వయానా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెలవిచ్చారు. నిజమే! పాలకుల నిర్లక్ష్యం, కార్యనిర్వాహక వ్యవస్థ తోలుమందం వైఖరి వల్ల సమస్యలు, చట్టోల్లంఘనలు తలెత్తి బాధితులైన పౌరులు న్యాయస్థానాలకెక్కాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్టు, పౌరులకు అనుకూలంగా కోర్టులు తీర్పిచ్చిన సందర్భాల్లో కూడా ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి, న్యాయధిక్కార (కంటెప్ట్) కేసులు వేసుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తు న్నారు. ఇది పౌరులకు అదనపు కష్టం, ఓ రకంగా వేధింపే! అభివృద్ధి చెందిన దేశాలు వినియోగిస్తున్నట్టు ఆధునిక శాస్త్ర–సాంకేతికతను ఉపయోగించుకొని న్యాయ విచారణ ప్రక్రియల్లో ఇ–సిస్టమ్స్ అభివృద్ధి చేసుకోవాలి. న్యాయ వ్యవస్థలోనూ బాధ్యత–జవాబుదారీతనాన్ని వ్యవస్థాగతం చేయాల్సిన అవస రాన్ని న్యాయకోవిదులు నొక్కి చెబుతున్నారు. రెండో తరం సంస్కరణలకు వాకిళ్లు తెరవడమే కాకుండా న్యాయమూర్తులు క్రియాశీలంగా వ్యవహరిస్తూ మరింత చొరవ చూపాలి. న్యాయ జాప్యాల నివారణకు తోడ్పడుతూనే సత్వర న్యాయానికి మానవీయ దృక్పథాన్ని కనబరచాలి. యావజ్జీవ శిక్షపడ్డ కేసుల్లో సదరు అప్పీళ్లు ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్నపుడు, సదరు ఖైదీలకు సానుకూల దృక్ప«థంతో బెయిలివ్వాలని హైదరాబాద్ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు ప్రశంసనీయం. అభియోగం ఎదుర్కొం టున్న ఒక వ్యక్తి, సత్యాసత్య నిరూపణతో నిమిత్తం లేకుండా నేరాన్ని స్వయంగా అంగీకరించినా... విధించే పూర్తి శిక్షా కాలానికి మించి, విచారణ ఖైదీలుగానే జైళ్లలో మగ్గే దుస్థితినేమనాలి? విచారణ అనంతరం దోషిగా తేలినా, నిర్దోషిగా విడుదలైనా, మన పాలనాపరమైన నిర్హేతుక కారణాలతో జైల్లో మగ్గిన సదరు కాలాన్ని ఎవరు వెనక్కి తెచ్చిస్తారు? ఖాళీల్ని భర్తీ చేస్తూ సత్వర నియామకాలు జరిపి కోట్లాది పెండింగ్ కేసుల్ని పరిష్కరించాలి. మహ నీయుడు జస్టిస్ కృష్ణ అయ్యర్ చెప్పిన ఒకమాట గుర్తుచేస్తాను. ‘‘...తొమ్మిది మంది జడ్జీల ధర్మాసనం తీర్పుతో, దురదృష్టకరమైన ప్రయోగంగా వచ్చిన కొలీజియం పక్షపాత నియామకాలెంత అసంతృప్తి నిచ్చాయో తెలుసు... అలా అని కార్యనిర్వాహక వ్యవస్థనూ విశ్వసించలేము, ఎందుకంటే, దానివల్ల నియామక ప్రక్రియలోకి రాజకీయాలు జొరబడ తాయి. ప్రధానమంత్రికి నిర్ణయాధికారాన్ని కట్టబెట్టే పద్ధతిని మనం బ్రిటిష్ పార్లమెంటరీ విధానం నుంచి అరువు తెచ్చుకున్నాం, అదెంత లోపభూయిష్ట మంటే, 30 మంది బంధువులు, పార్టీ శ్రేణుల్ని బెంచి మీదకు తెచ్చినట్టు లార్డ్ హల్స్బరీనే విమర్శలెదుర్కోవాల్సి వచ్చింది. అందుకని, సమపాళ్లలో ప్రాతి నిధ్యముండే జాతీయ న్యాయ కమిషన్ నియామకమే మంచిది. జడ్జీల పనితీరును కూడా ఇదే కమిషన్ తనిఖీ చేయాలి, పర్యవేక్షించాలి.’’ ఆయన చెప్పిన బాటలో, ప్రజాస్వామ్య మూల స్తంభాలయిన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు సమన్వయంతో ఆలోచించి పనికొచ్చే పరిష్కారం వెతకాలి. (వ్యాసకర్త : దిలీప్ రెడ్డి ఈ–మెయిల్: dileepreddy@sakshi.com) -
ఆ పెండింగ్ కేసులు ఉమ్మడి హైకోర్టుకు బదిలీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్న తెలంగాణ కేసులను ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్ను ప్రభుత్వం జారీ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్స్ మేరకు ఆర్డినెన్స్ను గవర్నర్ నరసింహన్ జారీ చేశారు. -
'కేసులు క్లియర్ అయితేనే ఎన్నికలు'
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకం ఒంగోలు కార్పొరేషన్లో విలీన పంచాయతీల కోర్టు కేసులు కందుకూరులో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తాజాగా కోర్టుకు... డిసెంబర్లోపే ఎన్నికలంటున్న ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెబుతున్నప్పటికీ జిల్లాలో ఎన్నికలు జరగాల్సిన ఒంగోలు నగరపాలక సంస్థ, కందుకూరు మున్సిపాలిటీలకు సంబంధించి పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు అడ్డంకిగా మారుతున్నారుు. ఎన్నికలలోపు కోర్టు కేసులు క్లియర్ అవుతాయా...? క్లియర్ కాకపోతే ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉందా.. అన్న విషయం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు కోర్టులు అడ్డంకులు చెప్పే అవకాశం తక్కువని, దాదాపు ఎన్నికలు జరగడం ఖాయమని అధికారులు పేర్కొంటున్నారు. నాలుగేళ్లుగా లేని పాలకవర్గం.. ఒంగోలు నగరపాలక సంస్థలో కొప్పోలు, త్రోవగుంట, ముక్తినూతలపాడు, పేర్నమిట్ట, వెంగముక్కపాలెం, చెరువుకొమ్ముపాలెం, పెళ్ళూరు, మంగమూరు, సర్వేరెడ్డిపాలెం, మండువవారిపాలెం పంచాయితీలను విలీనం చేశారు. ఇందులో మంగమూరు, సర్వేరెడ్డిపాలెం, మండువవారిపాలెం పంచాయతీలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లాయి. మండువవారిపాలెం పంచాయతీ కోర్టు తీర్పుతో ఏకంగా ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను సైతం నిర్వహించుకుంది. ఇప్పటికీ కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఎన్నికల సమయానికి కోర్టు క్లియరెన్స్ వస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలా జరగని పక్షంలో పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకం. 2012కు ముందే మున్సిపాలిటీగా ఉన్న ఒంగోలు నగరపాలక సంస్థగా మారింది. విలీన పంచాయితీల కోర్టు కేసుల నేపథ్యంలో నగరపాలకకు ఎన్నికలు జరగలేదు. దీంతో అప్పటి నుంచి పాలకవర్గం ఏర్పడలేదు. ఏడు గ్రామాల ప్రజల పోరాటం.. ఇక కందుకూరు మున్సిపాలిటీకి సైతం ఎన్నికలు జరగాల్సి ఉంది. 2012 నాటికి మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. అప్పటికే కందుకూరు శివారుల్లోని ఆనందపురం, షామీర్పాలెం, దివివారిపాలెం, దనిగుంట, గల్లావారిపాలెం తదితర ఏడు గ్రామాలను కందుకూరు మున్సిపాలిటీలో విలీనం చేశారు. పై గ్రామాలు కందుకూరు పట్టణానికి 5 కి.మీ. పైబడి ఉండటంతో పరిపాలనకు ఇబ్బందులు తలెత్తుతాయని మున్సిపల్ అధికారులు సైతం ఏడు గ్రామాలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లాయి. 2010 నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయి. దీని వెనుక అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రి మహీధరరెడ్డి ప్రోద్బలమే కారణమన్న ప్రచారం ఉంది. కోర్టు కేసులతో కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఆది నుంచి ఏడు గ్రామాలను మున్సిపాలిటీలో కలపాలని ఆయా గ్రామాల ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తూనే విలీనాన్ని వ్యతిరేకిస్తూ గతంలో కోర్టుకె ళ్లిన మున్సిపల్ అధికారులు కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో ఏడు గ్రామాల విలీనానికి ఆమోదం లభించింది. మున్సిపాలిటీలో విలీనం కోసం పంచాయతీ తీర్మానం సరిపోతుంది.పైగా అధికార పార్టీ మద్ధతుదారులు అధికంగా ఉండటంతో ఏడు గ్రామాల విలీనానికి ఎటువంటి అడ్డంకులు ఉండే పరిస్థితి లేదు. దీంతో కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మహీధరరెడ్డి మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ సరిహద్దు నుంచి 3 కి.మీ. పరిధిలో ఉన్న గ్రామాలను మాత్రమే విలీనం చేయాలన్న జీవోను తెచ్చారు. ఈ జీవోను అడ్డుపెట్టి ఇటీవల కందుకూరు మున్సిపాలిటీకి చెందిన కొందరు ఏడు గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తిరిగి కోర్టుకె ళ్లినట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో కోర్టు తీర్పు సైతం ఎన్నికలకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అటు ఒంగోలు నగరపాలక సంస్థకు, కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువేనని తెలుస్తోంది. -
‘జాతీయ సవాలుగా కేసుల పరిష్కారం’
సిమ్లా: దేశ వ్యాప్తంగా పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థకు జాతీయ సవాలుగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ చెప్పారు. సిమ్లాలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన సందర్భంగా మాట్లాడుతూ... కేసుల పెండింగ్ వల్ల న్యాయవ్యవస్థ మొత్తంపై విమర్శలు వస్తున్నాయన్నారు. ‘80 శాతం అపరిష్కృత కేసుల్లో అత్యధికం ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉన్నాయి’ అని చెప్పారు. -
ఎస్సీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో షెడ్యూల్ కులాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ తెలిపారు. శుక్రవారం సివిల్ రైట్స్ డే కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమె స్టేట్ గెస్ట్హౌస్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ కేవీ సత్యనారాయణ, ఎస్పీ పీహెడ్డీ రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, ఆర్డీఓలు, డీఎస్పీలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పౌరహక్కుల దినాన్ని నిర్వహించాలి కడప అర్బన్ : జిల్లాలో ప్రతి నెల 30న జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో పౌర హక్కుల దినాన్ని నిర్వహించుకోవాలనే చట్టం ఉందని, తద్వారా పౌరులు సమాజంలో వారికున్న హెచ్చుతగ్గులను, అసమానతలను తొలగించుకోవడానికి వీలవుతుందని కమలమ్మ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సభా భవనంలో రాయలసీమ ఎస్సీ, ఎస్టీ మానవ హక్కుల సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌరహక్కుల దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాయలసీమ ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు జేవీ రమణ, అంబేడ్కర్ మిషన్ కడప అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపత్కుమార్, దళిత నాయకుడు డి.జయచంద్ర, అమీన్పీరా, సైమన్, ఎల్వీ రమణ, జకరయ్య, సంగటి మనోహర్, స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర సభ్యులు జయచంద్ర, ఎస్సీ సంఘం సభ్యులు శిరోమణెమ్మ, కుమారి, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సా...గుతున్న పోలీసుల దర్యాప్తు!
♦ నమోదవుతున్న కేసులకు, శిక్షలకు భారీ వ్యత్యాసం ♦ నత్తనడకగా దర్యాప్తు, పెండింగ్లో లక్ష కేసులు ♦ కేసుల్లో పెరుగుతున్న రాజకీయ జోక్యం ♦ నేతల ప్రసన్నానికే పోలీసుల ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసుల దర్యాప్తు వేగం మందగించింది. పెండింగ్ కేసుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంది. నమోదవుతున్న నేరాలకు, శిక్ష అనుభవించే వారికి భారీగా వ్యత్యాసం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో కేవలం 36 శాతం మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. జాతీయ సగటు 46 శాతంతో పోల్చితే పదిశాతం వెనకబడి ఉంది. దీంతో నేరగాళ్లు తప్పులు చేసి కూడా.. దర్జాగా బయటే తిరుగుతున్నారు. కేసుల నమోదు, దర్యాప్తు విధానంలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగింది. చిన్న చిన్న కేసుల్లో సైతం నేతలు తలదూర్చడంతో పోలీసులు చేతులెత్తేస్తున్నారు. విధినిర్వహణలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోతోందని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఇటీవల ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి వీకే.సింగ్ చేసిన బహిరంగ ప్రకటన.. ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. పెండింగ్లో లక్ష కేసులు.. నేరగాళ్లకు శిక్ష విధించడంలో ప్రధానంగా కేసు దర్యాప్తు పూర్తిచేసి అభియోగాల్ని దాఖలు చేయడంతోపాటు న్యాయ విచారణలో సైతం పోలీసులు తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. దర్యాప్తు విధానంలో సరైన విధానాలు పాటించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షకుపైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అయితే చాలా కేసుల్లో గడువు దాటినా దర్యాప్తు పూర్తికావడం లేదు. నిబంధనల ప్రకారం నిందితుడి అరెస్టు తర్వాత 90 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి చార్జ్షీట్ దాఖలు చేయాలి. లేనిపక్షంలో నిందితులకు బెయిల్ పొందే అర్హత లభిస్తుంది. దర్యాప్తు సకాలంలో పూర్తికాక అనేకమంది నిందితులు బెయిల్పై బయటకు వస్తున్నారు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు..! పోలీసులపై రాజకీయ నేతల ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు కేసుల నమోదు మొదలుకొని, దర్యాప్తు విధానాన్ని సైతం నాయకులు ప్రభావితం చేస్తున్నారు. కేసుల దర్యాప్తులో వీరి జోక్యం కారణంగా పెండింగ్ కేసుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పేరుకుపోతోంది. ఒకవేళ నేతలను కాదని దర్యాప్తులో ముందుకెళ్తే.. అధికారులపై బదిలీ వేటు పడుతోంది. ప్రొటోకాల్ పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అధిక సమయం వారికే వెచ్చించాల్సి వస్తోంది. దీంతో పోలీసులు కేసుల దర్యాప్తును పక్కన పెట్టేశారు. ఫలితంగా రాష్ట్రంలో నేరగాళ్లకు కట్టడి లేక.. వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అంతిమంగా సామాన్య ప్రజానీకం ఇబ్బందులకు గురవుతున్నారు. -
అన్నింటికీ మేమేనా!
ప్రతి సమస్యకు, చిన్న చిన్న విషయాలకు తమను ఆశ్రయిస్తుండడం మంచి పద్ధతేనా అని మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పుదియ తమిళగం(పీటీ) పార్టీకి చురకలు అంటించింది. సాక్షి,చెన్నై : ఇటీవల కాలంగా ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యల్ని కూడా హైకోర్టుకు పిటిషన్ల రూపంలో చేర వేసే వాళ్లు పెరుగుతూ వస్తున్నారు. ఇప్పటికే పెండింగ్ కేసుల పరిష్కారం భారంగా మారి ఉన్న సమయంలో, తాజాగా దాఖలు అయ్యే కొన్ని పిటిషన్లు కోర్టు సమయాన్ని వృథా చేయడమే కాకుండా, న్యాయమూర్తులకు ఆగ్రహాన్ని సైతం తెప్పిస్తున్నాయి. ప్రజా ప్రతినిధుల్ని కలసి వినతి పత్రం ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని కూడా తమ దృష్టికి తీసుకు రావడంపై ఇది వరకే హైకోర్టు అసహనం వ్యక్తం చేసి ఉంది. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేల్ని కల్గిన రాజకీయ పార్టీ ఎన్నికల కమిషన్ వద్ద పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని తమ ముందుకు తీసుకురావడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక, ఎన్నికల సమయం కావడంతో చీటికి మాటికి హైకోర్టును ఆశ్రయించే వాళ్లు పెరగడం తథ్యం. దీంతో న్యాయమూర్తులకు శిరోభారం తప్పదు. ఈ పరిస్థితుల్లో పుదియ తమిళం దాఖలు చేసిన పిటిషన్తో రాజకీయ పక్షాలకు చురకలు అంటిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ స్పందించడం గమనార్హం. అన్నింటికీ తామేనా : గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పనిచేయడంతో పుదియ తమిళగం రెండు స్థానాల్ని దక్కించుకుంది. ఇందులో ఓ ఎమ్మెల్యే రెబల్ అవతారం ఎత్తినా, పార్టీ నేత కృష్ణ స్వామి ఒంటరిగా అసెంబ్లీలో సమరం సాగిస్తూ వచ్చారు. తాజాగా మళ్లీ ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఈ పరిస్థితుల్లో గత ఎన్నికల్లో తమకు కేటాయించిన టీవీ చిహ్నం ప్రజల్లో పాతుకు వెళ్లడంతో మళ్లీ ఆ చిహ్నం కోసం ప్రయత్నాల్లో కృష్ణ స్వామి పడ్డారు. ఇందు కోసం ఎన్నికల కమిషన్ను ఆశ్రయించకుండా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. తమకు మళ్లీ టీవీ చిహ్నం కేటాయించే విధంగా ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించాలని కృష్ణ స్వామి తరఫున దాఖలైన పిటిషన్ను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. కృష్ణస్వామి తరఫున న్యాయవాదులు తమ వాదన విన్పించారు. పిటిషన్ను పరిశీలించిన బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేసింది. అన్నింటికీ తామేనా అని ప్రశ్నిస్తూ, ఎన్నికల కమిషన్ను ఆశ్రయించి విజ్ఞప్తి చేయాల్సింది పోయి పిటిషన్ దాఖలు చేయడం ఏమిటంటూ న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న విషయాన్ని , ఎన్నికల వ్యవహారాలకు సంబంధించిన విషయాలకు కోర్టును ఆశ్రయించడం మంచి పద్ధతి కాదు అని, ముందుగా సంబంధించి అధికారుల్ని సంప్రదించాలని హితవు పలుకుతూ చురకలు అం టించారు. అక్కడ సమస్య పరిష్కారం కాకుంటే, తమ వద్దకు రావాలే గానీ, నేరుగా కోర్టుల్ని ఆశ్రయించడం మంచి పద్ధతి కాదంటూ పిటిషన్ విచారణను ముగించారు. -
గుట్టలు గుట్టలుగా పెండింగ్ కేసులు!
న్యూఢిల్లీ: దేశంలో న్యాయస్థానాల ముందు పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూనే ఉంది. ఏళ్లకు ఏళ్లుగా సుప్రీంకోర్టు, హైకోర్టుల ముందు పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య చూస్తే విస్తుపోవాల్సిందే. సివిల్, క్రిమినల్ కేసుల వారీగా విచారణ పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించింది. సుప్రీంకోర్టులోనూ భారీగా పెండింగ్.. 2016 ఫిబ్రవరి 19 వరకు తన ముందున్న పెండింగ్ కేసు వివరాలను సుప్రీంకోర్టు వెల్లడించింది. 48,418 సివిల్ కేసులు, 11,050 క్రిమినల్ కేసులు తన విచారణ కోసం నిరీక్షిస్తున్నట్టు తెలిపింది. 19-2-2016 నాటికి పదేళ్లకుపైగా పెండింగ్లో ఉన్న కేసులు సివిల్ కేటగిరీలో 1,132, క్రిమినల్ కేటగిరీలో 84 ఉన్నాయని తెలిపింది. గత మూడేళ్ల కాలంలో తాము పరిష్కరించిన కేసుల సంఖ్యను కూడా సుప్రీంకోర్టు ఈ వివరాల్లో వెల్లడించింది. 2013లో 40,189 కేసులు, 2014లో 45,042 కేసులు, 2015లో 47,424 కేసులు, ప్రస్తుత సంవత్సరం ఫిబ్రవరి 19 వరకు 6,054 కేసులు పరిష్కరించినట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. హైకోర్టులోన్లూ.. ఇక హైకోర్టుల విషయానికొస్తే.. 2014 డిసెంబర్ 31వరకు 31,16,492 కేసులు సివిల్ కేటగిరీలో, 10,37,465 కేసులు క్రిమినల్ కేటగిరీలో పెండింగ్ లో ఉన్నాయి. 2014 డిసెంబర్ 31 నాటికి పదేళ్లకు పైగా విచారణ పెండింగ్లో ఉన్న కేసులు సివిల్ కేటగిరీలో 5,89,631, క్రిమినల్ కేటగిరీలో 1,87,999 కేసులు ఉన్నాయి.. జిల్లా, సబార్డినేట్ న్యాయస్థానాల్లోనూ.. డిస్ట్రిక్ట్, సబార్డినేట్ కోర్టుల్లోనూ చాలా కేసులు పరిష్కారం కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్నాయి. 2014 డిసెంబర్ 31 నాటికి జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో పెండింగ్ కేసులో సివిల్ కేటగిరీలో 82,34,281, క్రిమినల్ కేటగిరీలో 1,82,54,124 కేసులు ఉన్నాయి. ఇక పదేళ్లకుపైగా పెండింగ్ లో ఉన్న కేసులు ఈ న్యాయస్థానాల ముందు సివిల్ కేటగిరీలో 6,11,658, క్రిమినల్ కేటగిరీలో 14,32,079 కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో... తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు 2012 నుంచి 2014 వరకు పరిష్కరించిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. 2012లో 66,130, 2013లో 58,278, 2014లో 66,239 కేసులను ఉమ్మడి హైకోర్టు పరిష్కరించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా, సబార్డినేట్ కోర్టులు 2012లో 6,06,447 కేసులు, 2013లో 5,14,867 కేసులు, 2014లో 6,47,130 కేసులను పరిష్కరించాయి. -
'న్యాయ వ్యవస్థలో నైతిక విలువలే ముఖ్యం'
విజయవాడ: బాధితులకు న్యాయం అందిచలేకపోతే న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలో శనివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'న్యాయ వ్యవస్థలో నైతిక విలువలే ముఖ్యం. తొమ్మిది రాష్ట్రాల్లో కేసుల పరిష్కారాల కోసం సంవత్సరాలపాటు సమయం పడుతుంది. దీనివల్ల న్యాయం కోసం ఎదురు చూసే వారిలో నిరాశ పెరుగుతుంది. బాధితులకు అండగా నిలిచే క్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర అత్యంత కీలకం' అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. -
'న్యాయ వ్యవస్థలో నైతిక విలువలే ముఖ్యం'
-
ఆదాయానికి కేసుల గండం
వివిధ కోర్టుల్లో 902 కేసులు పెండింగ్ నగరపాలక సంస్థ ఆదాయానికి గండి పరిష్కారమైతే కాసుల పంటే అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వెరసి నగరపాలక సంస్థ ఆదాయానికి గండిపడుతోంది. సకాలంలో కోర్టు కేసులను పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. దీంతో కోర్టులో కేసులు పేరుకుపోతున్నాయి. విజయవాడ సెంట్రల్ : కార్పొరేషన్లో రెవెన్యూ, టౌన్ప్లానింగ్, ప్రజారోగ్యశాఖలకు సంబంధించి వివిధ కోర్టుల్లో 902 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిష్కరించగలితే రూ.50 కోట్లపైనే నగరపాలక సంస్థకు ఆదాయం వస్తోందని అంచనా. హైకోర్టులో 556, స్థానిక కోర్టులో 269, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో 31, ఏపీ వినియోగదారుల ఫోరంలో 2, సుప్రీం కోర్టులో ఒకటి, లోకాయుక్తాలో 19, ప్రీలిటిగేషన్ కౌన్సిల్ (పీఎల్సీ)లో 22, హ్యూమన్ రైట్స్ కమిషన్ వద్ద 2 చొప్పున వెరసి 902 కేసులు ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిష్కరించడంలో లీగల్సెల్ శ్రద్ధ చూపడం లేదనే వాదనలు ఉన్నాయి. కొనసా..గుతున్నాయి కార్పొరేషన్కు దండిగా ఆదాయం తెచ్చిపెట్టే టౌన్ప్లానింగ్, రెవెన్యూ, ఎస్టేట్స్, ప్రజారోగ్యశాఖలకు సంబంధించిన కేసులే ఎక్కువ పెండింగ్లో ఉంటున్నాయి. వస్త్రలత నుంచి రూ.11 కోట్లు, ఐవీ ప్యాలెస్ నుంచి రూ.7 కోట్లు రాబట్టాల్సి ఉంది. షాపుల, పార్కింగ్స్టాండ్ల అద్దెలకు సంబంధించి ఆయా యజమానులు ఇస్తున్న చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. ప్రతినెలా సుమారు రెండు వందల చెక్కులు బౌన్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు బాధ్యులపై పోలీసు కేసులు పెట్టకపోవడంతో ఇదో ప్రహసనంలా మారింది. వస్త్రలత బకాయిల పరిష్కారానికి సంబంధించి వ్యాపారులతో ఎంపీ కేశినేని నాని, మేయర్ కోనేరు శ్రీధర్ పలుమార్లు చర్చలు జరిపారు. బకాయిల్లో పది శాతం కంటే మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని కమిషనర్ జి.వీరపాండియన్ స్పష్టం చేయడంతో కేసులు కొనసా..గుతున్నాయి. దృష్టిపెడతాం నగరపాలక సంస్థకు సంబంధించి పెండింగ్ కేసులపై దృష్టిసారిస్తాం. హైకోర్టులో కేసులు వాదించేందుకు ప్రభుత్వం ఇటీవలే ఆర్. సుధీర్ను నియమించింది. పెండింగ్ కేసుల విషయమై త్వరలోనే ఆయనతో చర్చిస్తాం. వివిధ శాఖల అధికారులు సహకరించాలి. పెండింగ్లో ఉన్న కేసుల్ని త్వరితగతిన పరిష్కరించినట్లైతే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. -కోనేరు శ్రీధర్, మేయర్, నగరపాలక సంస్థ -
జైలు గోడల వెనక...
అందరికీ తెలిసిన విషయాలే. ఎప్పటినుంచో పౌర సమాజ ప్రతినిధులు, హక్కుల సంఘాల బాధ్యులూ చెబుతున్నవే. కానీ కొత్తగా అధికారిక సమాచారం సైతం ఆ విషయాలే చెప్పినప్పుడు ఆందోళన కలుగుతుంది. ఇంతమంది ఇన్నేళ్లుగా కృషి చేస్తున్నా పరిస్థితులు కాస్తయినా మారలేదా అన్న నిరాశ ఏర్పడుతుంది. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) జైళ్ల స్థితిగతుల గురించి వెల్లడించిన సమాచారం ఎవరికైనా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నిర్బంధానికీ... నిస్సహాయతకూ, నిర్బంధానికీ... నిరక్షరాస్యతకూ, నిర్బంధానికీ... అణగారిన కులాల్లో, వర్గాల్లో పుట్టకకూ మధ్య సంబంధం ఉన్నదని ఆ సమాచారం మళ్లీ ధ్రువీకరించింది. విచారణ ఖైదీలుగా ఉంటున్నవారిలో, శిక్షలు పడినవారిలో అత్యధికులు నిరుపేదలూ, నిరక్ష రాస్యులూ, అణగారిన కులాలకు, వర్గాలకూ చెందినవారేనని గణాంకాలు చెబుతు న్నాయి. మన దేశంలో జనాభాకు అనుగుణంగా కేసులు విచారించే న్యాయమూర్తుల సంఖ్య లేకపోవడంవల్లనే న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉండిపోతున్నాయని... ఆ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు జైళ్లలో మగ్గుతున్నారని 1987లో లా కమిషన్ నివేదిక తెలిపింది. పది లక్షలమంది జనాభాకు సగటున 10 మంది న్యాయమూర్తులుండే ప్రస్తుత స్థితిని మెరుగుపరిచి 2007 కల్లా పది లక్షల మందికి సగటున 50మంది న్యాయమూర్తులుండేలా చర్యలు తీసుకోవాలని ఆ నివేదిక కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ రెండున్నర దశాబ్దాలు గడుస్తున్నా మారిందేమీ లేదు. దేశంలోని 1,387 జైళ్లలో మగ్గుతున్న ఖైదీల్లో 68 శాతంమంది విచారణలో ఉన్న వారేనని ఎన్సీఆర్బీ తెలిపింది. వారిలో 40 శాతానికి మించి ఆర్నెల్లు అంతకన్నా ఎక్కువగా జైళ్లలో ఉంటున్నారని వివరించింది. ఇలాంటివారిలో మూడు నెలలకు మించి జైళ్లలో ఉండేవారు నిరుటి కంటే పెరిగారని ఆ నివేదిక అంటున్నది. 2013లో అలాంటివారు 62.1 శాతంమంది ఉండగా ఇప్పుడు వారి శాతం 65కి చేరుకుంది. ఇది ప్రపంచ సగటు 32 శాతంకన్నా రెట్టింపు. వాస్తవానికి ఈ శాతం ఆ ఏటికా యేడు పెరుగుతోంది. బెయిల్ తెచ్చుకునే స్తోమత లేనివారు, తమకుండే హక్కులు తెలియని నిరక్షరాస్యులు ప్రధానంగా జైళ్లలో మగ్గుతున్నారు. వారు పాల్పడ్డారం టున్న నేరానికి పడే శిక్షకు మించి అలాంటివారు జైళ్లలో గడుపుతున్నారు. 3 లక్షల 56 వేల 561 మంది ఖైదీలుండటానికి చోటున్న మన జైళ్లలో ఇప్పుడు 4 లక్షల 18 వేల 536 మంది ఉంటున్నారు. అంటే 117.4 శాతంమందితో జైళ్లు కిక్కిరిసి ఉంటు న్నాయన్న మాట. మావోయిస్టు ఉద్యమం జోరుగా ఉన్న ఛత్తీస్గఢ్లో జైళ్లు మరిం తగా కిక్కిరిశాయి. అక్కడి జైళ్లలో 258.9 శాతంమంది ఉంటున్నారని ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో అత్యధికులు ఆదివాసీలేనని వేరే చెప్పనవసరం లేదు. మన జైళ్లలోదళిత, ఓబీసీ కులాలవారు, ఆదివాసీలు 62.3 శాతంమంది ఉండ గా... 31.4 శాతంమంది సాధారణ కేటగిరీకి సంబంధించినవారు. జనాభాలో 14 శాతంగా ఉన్న ముస్లింలు... ఖైదీల్లో మాత్రం 21.1 శాతంగా ఉన్నారు. గత దశాబ్ద కాలంలో మహిళా ఖైదీల సంఖ్య క్రమేపీ పెరుగుతోందని వివిధ నివేదికలు చెబుతు న్నాయి. మొత్తం ఖైదీల్లో మహిళా ఖైదీల శాతం 2003లో 3.9 ఉంటే అదిప్పుడు 4.55 శాతానికి చేరుకుంది. ఈ జాతీయ సగటు కంటే అధికంగా మహిళా ఖైదీలున్న రాష్ట్రాలు మిజోరం(7.58 శాతం), ఆంధ్రప్రదేశ్(6.28శాతం), పశ్చిమబెంగాల్ (6.11శాతం), మహారాష్ట్ర(5.68శాతం), ఛత్తీస్గఢ్(5.18శాతం) ఉన్నాయి. అనవసరమైన కేసులవల్లనే విచారణ ఖైదీల సంఖ్య పెరుగుతున్నదని చాన్నాళ్లక్రితం జాతీయ పోలీస్ కమిషన్ నివేదిక సైతం చెప్పింది. అలాగే పోలీసులు చేసే అరెస్టుల్లో దాదాపు 60 శాతం అనవసరమైనవేనని అభిప్రాయపడింది. ఇలాం టి కేసుల్లో అధిక భాగం గ్రామసీమల్లో పెత్తందార్లు, డబ్బు, పలుకుబడి ఉన్నవారు తమకు అడ్డుగా ఉన్నవారిపైనా, తమ మాట విననివారిపైనా పెడుతున్నవే. జైళ్ల కెళ్లడంవల్ల సాధారణ పౌరులకూ, వారి కుటుంబాలకూ సామాజికంగా, ఆర్థికంగా ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. సమాజం వెలేసినట్టు చూడటం... కుటుం బాన్ని పోషించేవారు జైలుపాలవడంవల్ల సంపాదన లేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడటం, తమవారిని జైలునుంచి విడిపించుకోవడానికి ఏంచేయాలో, ఎవర్ని ఆశ్రయించాలో తెలియకపోవడం ఆ కుటుంబాల్లో పెను తుఫాన్లను సృష్టిస్తాయి. ఈ సమస్య న్యాయస్థానాల దృష్టికి వెళ్లినప్పుడల్లా ఏవో ఆదేశాలు వెలువడుతున్నాయి. నేరం రుజువై పడే శిక్షలో సగం కాలం విచారణ ఖైదీగా జైళ్లలో ఉన్నవారిని గుర్తించి అలాంటివారిని విడుదల చేయాలని నిరుడు సుప్రీంకోర్టు సూచించింది. అలాగే క్రిమినల్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి కావడానికి ఫాస్ట్ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. జనాభాకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని లా కమిషన్ సూచించినా...అసలు ఉన్న ఖాళీలను పూడ్చడమే ప్రభుత్వాలకు చేతగావడం లేదు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. శాంతిభద్రతలకూ, ప్రముఖుల భద్రతకూ అధిక సంఖ్యలో పోలీసుల్ని వినియోగించాల్సి వస్తున్నప్పుడు దర్యాప్తులు సహజంగానే కుంటుబడతాయి. సిబ్బంది తక్కువగా ఉండటం, దర్యాప్తు చేయడానికి అవసరమైన ఆధునిక విధానాల గురించి వారికి అవగాహన లేకపోవడం, అట్టడుగు కులాలవారిపైనా, వర్గాలపైనా అంతరాంతరాల్లో పాతుకుపోయిన అభిప్రాయాలు కేసుల్ని తెమల్చడంలో పెను అడ్డంకిగా ఉంటున్నాయి. దర్యాప్తులో నత్తనడక, అందులో ఉండే లోపాలు న్యాయస్థానాల్లో ఆ జాప్యాన్ని మరింత పెంచుతాయి. ఫాస్ట్ట్రాక్ కోర్టులైనా సాధారణ కోర్టులకు వర్తించే నిబంధనలకు లోబడి పనిచేయాలి గనుక ఆచరణలో వాటివల్ల పెద్దగా ఫలితం ఉండటం లేదు. సమస్య మూలాల్లోకి వెళ్లి చిత్తశుద్ధితో పరిశీలిస్తే తప్ప పరిష్కారం సాధ్యం కాదు. ఈ దిశగా కేంద్రమూ, రాష్ట్ర ప్రభుత్వాలూ పూనుకోవాలి. -
తెలంగాణలో 3.44 లక్షల పెండింగ్ కేసులు
- క్రిమినల్ కేసులదే అగ్రస్థానం - అత్యధిక కేసుల్లో హైదరాబాద్ తొలిస్థానం - రంగారెడ్డి జిల్లాలో సివిల్ కేసులు అధికం - చివరిస్థానంలో నల్లగొండ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలోని వివిధ న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసుల లెక్కలు తేలాయి. తెలంగాణలో ఉన్న మొత్తం 10 జిల్లాల్లోని అన్ని రకాల న్యాయస్థానాల్లో ఈ నెల 2 వరకు అక్షరాలా 3,44,862 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో క్రిమినల్ కేసులదే మొదటిస్థానం. క్రిమినల్ కేసులు 1,85,127 పెండింగ్లో ఉంటే, 1,59,583 సివిల్ కేసులున్నాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 85,132 కేసులు పెం డింగ్లో ఉన్నాయి. ఇందులో క్రిమినల్ కేసులే అత్యధికంగా ఉండటం గమనార్హం. ఈ జిల్లాలో 46,009 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నా యి. అత్యల్పంగా నల్లగొండ జిల్లాలో 11,755 కేసులు పెండింగ్లో ఉన్నాయి. క్రిమినల్ కేసుల్లోనూ ఈ జిల్లాదే చివరి స్థానం. క్రిమినల్ కేసుల పెండింగ్లో హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అత్యధికంగా జరిగే రంగారెడ్డి జిల్లాలో సివిల్ కేసులే ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయి. ఈ జిల్లాలో 39,652 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక అన్ని జిల్లాల్లో కలిపి మహిళలు దాఖలు చేసిన 40,152 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో సివిల్ కేసులే అత్యధికం. మహిళలు దాఖలు చేసిన కేసులు పెండింగ్లో ఉన్న జిల్లాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 10 జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఖాళీలతో సహా మొత్తం 291 న్యాయాధికారులున్నారు. -
పేదలకు న్యాయం అందడం లేదు
- సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ - లాయర్ను నియమించుకునే స్తోమత లేకపోవడమే కారణం సాక్షి, హైదరాబాద్: దేశంలో 80 శాతం మంది నిరుపేదలకు న్యాయం అందడం లేదని, కోర్టుల్లో తమ తరఫున వాదనలు వినిపించేలా న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్తోమత వారికి లేకపోవడమే దీనికి కారణమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ‘న్యాయవ్యవస్థలో సంస్కరణలు’ అనే అంశంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కోట్ల మందికి ఉచిత న్యాయ సహాయం అందించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని, న్యాయవ్యవస్థలో ప్రస్తుత సంక్లిష్టమైన విధానాన్ని సరళతరం చేయాలని సూచించారు. 20 శాతం మంది న్యాయవాదిని నియమించుకుని కోర్టుల్లో పోరాడుతున్నా తీవ్రమైన జాప్యం వల్ల వారికీ సత్వర న్యాయం అందడం లేదన్నారు. కోట్లలో పెండింగ్ కేసులు, సంక్లిష్టమైన విధానంతో ప్రజలకు దూరంగా న్యాయవ్యవస్థ ఉందని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల నమ్మకం కోల్పోయి న్యాయవ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందన్నారు. గ్రామీణ న్యాయాలయాలను విసృ్తతంగా ఏర్పాటు చేసి న్యాయవాది అవసరం లేని సరళమైన విధానాన్ని అమలు చేయాలని, తద్వారా కక్షిదారులే తమ సమస్యలపై నేరుగా వాదనలు వినిపించుకునే పరిస్థితులు కల్పించాలన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి అన్నారు. న్యాయవ్యవస్థలో అవినీతిపోవాలంటే సమూలమైన సంస్కరణలు రావాలని బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొండారెడ్డి అన్నారు. కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, రఘునాథ్, భూపాల్రాజ్, లక్ష్మణ్సింగ్, సంపూర్ణ, తిరుపతివర్మ, గోవర్థన్రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు. -
కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్
- సీనియర్ సివిల్ జడ్జీలు రాధాకృష్ణమూర్తి, భవానీప్రసాద్ - నిర్మల్, అసిఫాబాద్లో పలు కేసుల పరిష్కారం నిర్మల్ అర్బన్/ఆసిఫాబాద్ : ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిర్మల్, ఆసిఫాబాద్ సీనియర్ సివిల్ జడ్జీలు రాధాకృష్ణమూర్తి, భవానీప్రసాద్ తెలిపారు. నిర్మల్, ఆసిఫాబాద్ కోర్టు ల్లో శనివారం వేర్వేరుగా లోక్ అదాలత్ నిర్వహించగా వారు మాట్లాడారు. చిన్నచిన్న గొడవలతో కేసుల్లో చిక్కుకుని ఇబ్బంది పడొద్దని హితవు పలికారు. ప్రతీ నెల రెండో శనివారం లోక్అదాలత్ జరుగుతుందని, పెండింగ్ కేసులు ఉన్న వారు ఇందులో పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే, మండల న్యాయ సే వా సంస్థ ద్వారా అందించే ఉచిత న్యాయ సహాయా న్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంకా కేసుల పరిష్కారం అనంతరం ఇరువర్గాల వా రు సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. ఈ సందర్భంగా కక్షిదారులు, ఫిర్యాదుదారులతో మాట్లాడిన న్యాయమూర్తులు పలు కేసులను పరిష్కరించారు. నిర్మల్లో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్రావు, డీఎస్పీ మనోహర్రెడ్డి, టౌన్, రూరల్ సీఐలు జీవన్రెడ్డి, పురుషోత్తమాచారి, ఏపీపీవోలు శ్యాంసుందర్రెడ్డి, నాగభూషణం, అడ్వకేట్ జేఏసీ నాయకులు లింగయ్య పాల్గొన్నారు. కాగా, ఆసిఫాబాద్ లోక్ అదాలత్లో ఎనిమిది కేసుల తో పాటు కెరమెరి, వాంకడి, రెబ్బెన మండలాలకు పలు కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో సీఐ సతీష్కుమార్, న్యాయవాదులు ఎం.సురేష్, టి.సురేష్, నికోడె రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
31న మొబైల్ లోక్ అదాలత్
బొబ్బిలి: విజయనగరంలో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ఈ నెల 31 న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్. లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం జిల్లాలోని బొబ్బిలి మండల కేంద్రంలోని పోలీసు అతిథి గృహంలో మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ మొబైల్ లోక్అదాలత్ ద్వారా ప్రజల వద్దకే వెళ్లి కేసులను పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో 12 మంది న్యాయవాదులను ఎంపిక చేసి ప్రత్యామ్నాయ న్యాయవ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీరి ద్వారా మధ్యవర్తిత్వం జరిపి కేసులను పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లాలో 17వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు. -
'రిషితేశ్వరి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది'
విశాఖపట్నం: పెండింగ్లో ఉన్న 92 ప్రాజెక్ట్లపై చర్చించడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులతో గురువారం సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, 2 రోజులుగా యూనివర్సిటీలోనే ప్రభుత్వం నియమించిన కమిటీ ఉండి ఆధారాలు సేకరించే పనిలో ఉందన్నారు. యూనివర్సిటీల్లో ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. హాస్టళ్లలో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు అమలు పరిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. హాస్టళ్లలో ఉన్న ఔటర్స్ను నిరోధించేందుకు చర్యలు చేపడుతామన్నారు.