
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఉభయ రాష్ట్రాల్లోని కింది కోర్టులకు లక్ష్యాలను నిర్దేశిస్తున్న హైకోర్టు తాజాగా మరో లక్ష్యాన్ని వాటి ముందుంచింది. 2014కు ముందునాటి పెండింగ్ కేసుల్లో కనీసం 5% కేసులను వచ్చే 3 నెలల్లో పరిష్కరించాలని కింది కోర్టులను ఆదేశించింది. పెండింగ్ కేసులను కనీసం 2 వారాలకొకసారి స్వయంగా పర్యవేక్షించాలని జిల్లా స్థాయి కేసుల బకాయిల కమిటీలకు స్పష్టం చేసింది. ఏయే కోర్టుల్లో రోజూ ఎన్ని కేసులు పరిష్కారమయ్యాయో తెలుసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వెంకటేశ్వర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఐదేళ్లకు పూర్వం ఉన్న కేసుల సంఖ్యను సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కింది కోర్టుల్లోని పాత పెండింగ్ కేసుల సంఖ్యను సున్నాకు తీసుకొచ్చేందుకు లక్ష్యాలు నిర్దేశిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా 2018 మార్చి, ఏప్రిల్ వరకు పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను హైకోర్టు బకాయిల కమిటీ పరిశీలించింది. అనంతరం 2014కు ముందున్న పెండింగ్ కేసుల్లో కనీసం 5 శాతం కేసులను 3 నెలల్లో సున్నాకు తీసుకురావాలని కింది కోర్టులకు లక్ష్యంగా నిర్దేశిస్తూ సర్క్యులర్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment