
న్యూఢిల్లీ: బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలు ఒప్పందాన్ని 27 ఏళ్లుగా పరిశీలిస్తున్న ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)కి చెందిన ఓ ఉప సంఘం.. ఎట్టకేలకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సమయంలోనే తన నివేదికకు తుదిరూపునిచ్చే అవకాశం కనిపిస్తోంది. బోఫోర్స్ ఒప్పందంపై కాగ్ 1989–90లో ఇచ్చిన నివేదిక అప్పటి నుంచి ఆరుగురు సభ్యుల పీఏసీ ఉప సంఘం వద్ద పెండింగ్లోనే ఉంది. కాగ్ తన నివేదికను పార్లమెంటుకు సమర్పించాక, దానిని పరిశీలించడమే పీఏసీ ప్రధాన విధి. బీజేడీకి చెందిన భర్తృహరి మహతబ్ ఈ రక్షణ వ్యవహారాల ఉప సంఘానికి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్నారు.
ఒప్పందం గురించి సమగ్ర వివరాలను సంబంధిత మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు ఇవ్వకపోవడం వల్లనే ఈ అంశం 27 ఏళ్లు ఆలస్యమైందని ఉపసంఘంలోని ఓ సభ్యుడు తెలిపారు. తమ నివేదిక సమగ్రంగా, ఒప్పందం గురించి ఉన్న అపోహలను తొలగించేలా ఉంటుందన్నారు. ఉప సంఘం ఈ నివేదికను రూపొందించిన తర్వాత దాన్ని పీఏసీ ప్రధాన కమిటీకి పంపుతారు. కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రధాన కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment