
పట్నా : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పట్నాలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని రోడ్లనే కాకుండా నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ను కూడా వరద నీరు ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న జనరల్ వార్డుతో పాటు, ఐసీయూలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పెషేంట్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఐసీయూలోకి వచ్చిన నీటిలో చేపలు కూడా దర్శనం ఇవ్వడంతో వారు షాక్కు గరయ్యారు. వరద నీటితో పాటు విష సర్పాలు, ఇతర హానికర కీటకాలు వస్తే తమ పరిస్థితేంటని పెషేంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన నీటిని వెంటనే బయటకు పంపేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై పెషేంట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై ఆస్పత్రి సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. తాము కూడా పెషేంట్ల సేవలు అందించడం కష్టం మారిందన్నారు. ఆస్పత్రి పరిసరాల్లో పూర్తిగా వరద నీరు చేరిందని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిని ఈ ఘటన తెలియజేసేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రాజధానిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment