అవిభక్త కవలలకు ‘పునర్జన్మ’ | 'Reborn' for undivided twins | Sakshi
Sakshi News home page

అవిభక్త కవలలకు ‘పునర్జన్మ’

Published Thu, Oct 26 2017 11:53 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

'Reborn' for undivided twins - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశాకు చెందిన రెండున్నరేళ్ల అవిభక్త కవలలకు ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. తలలు అతుక్కుని పుట్టిన హానీ, సింఘ్‌ (వీరికి ఎయిమ్స్‌ వైద్యులు జొగ్గా–బొలియా అని నామకరణం చేశారు)లను వేరుచేయడానికి ఎయిమ్స్‌ వైద్యులు చేసిన అరుదైన శస్త్రచికిత్స విజ యవంతమైంది. బుధవారం ఉదయం 9.30 కి ప్రారంభమైన మారథాన్‌ శస్త్రచికిత్స నిరం తరాయంగా రాత్రి 8.45 గంటల వరకు కొన సాగింది. శస్త్రచికిత్స విజయవంతమైనట్లు గురువారం డాక్టర్లు ప్రకటించారు. ఢిల్లీ ఎయిమ్స్‌ న్యూరో సర్జరీ విభాగం ప్రము ఖుడు డాక్టర్‌ అశోక్‌ మహా పాత్రో ఆధ్వర్యం లో 30 మంది వైద్య నిపుణులు శస్త్రచికిత్సలో పాల్గొని జొగ్గా– బొలియాలను వేరు చేశారు. ఈ శస్త్రచికిత్స భారతీయ వైద్య రంగానికి పెద్ద సవాలని, జంట తలల్ని వేరు చేయడం భారతీయ వైద్య చరిత్రలో ఇదే తొలిసారి అని మహాపాత్రో పేర్కొన్నారు. వారిని వేరు చేసిన తర్వాత తలపై ప్లాస్టిక్‌ సర్జరీ కూడా విజయ వంతంగా ముగించారు. శస్త్రచికిత్సలో 20 మంది సర్జన్లు, 10 మంది అనస్తీషియా విభాగం నిపుణులు పాల్గొన్నారు. 72 గంటల పాటు వారి ఆరోగ్య స్థితిగతుల్ని అనుక్షణం పరిశీలిస్తామని వైద్యులు తెలిపారు. 30 లక్షల ప్రసవాల్లో ఒకరు ఇలా కలసి పుడతారని, వీరిలో 50 శాతం మంది వెంటనే కన్ను మూస్తారని మహాపాత్రో తెలిపారు. కొందరు ప్రసవం తర్వాత 24 గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతారన్నారు. బతికి ఉన్న వారిలో 4వ వంతు మందిని మాత్రమే శస్త్ర చికిత్స ద్వారా వేరుచేయవచ్చని చెప్పారు.

మరింత ఆర్థిక సహాయానికి సిద్ధం
కలహండి జిల్లా మల్లిపడా గ్రామానికి చెందిన జొగ్గా–బొలియా తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. వీరికి ఒడిశా ప్రభుత్వం బాసటగా నిలిచింది. శస్త్రచికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ. కోటి ఆర్థిక సహాయం అందజేశారు. శస్త్రచికిత్స అనంతరం ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్‌ జెనా మాట్లాడుతూ.. వారికి మరింత ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జొగ్గా, బొలియా సంపూర్ణ ఆరోగ్యంతో రాష్ట్రానికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. శస్త్ర చికిత్స విజయవంతం కావాలని ఒడిశా వ్యాప్తంగా సామూ హిక దీపారాధన వంటి ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్ని చేపట్టారు. ఈ ప్రార్థనలు మరో 5 రోజుల పాటు నిరవధికంగా కొనసాగించి పిల్లలిద్దర్నీ ఆరోగ్యవంతులుగా రాష్ట్రానికి తీసుకు వద్దామని మంత్రి పిలుపునిచ్చారు. చికిత్స నిమిత్తం ఈ ఏడాది జూలై 14న జొగ్గా–బొలియాలను న్యూఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. తొలివిడత శస్త్రచికిత్స ఆగస్టు 28న నిర్వహించారు. ఈ విడతలో జపాన్‌ నుంచి వచ్చిన వైద్య నిపుణులు కూడా పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement