ఆగని రచ్చ..కొనసాగుతున్న వాయిదాలు
Published Mon, Aug 10 2015 11:25 AM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM
న్యూఢిల్లీ: యధావిధిగానే సోమవారం పార్లమెంటు ఉభయ సభలు తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. ముందుగా జార్ఖండ్ లోని దేవ్గఢ్ తొక్కిసలాటలో మృతులకు లోక్ సభ సంతాపం తెలిపింది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాక్షించింది.
కాగా, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ, వ్యాపం వివాదాల చిచ్చు రగులుతూనే ఉంది. అయిదు రోజులు సస్పెన్షన్ తరువాత కాంగ్రెస్ ఎంపీలు నిరసనలు, నినాదాలతోనే సభకు హాజరయ్యారు. ప్లకార్డులు, నల్లబ్యాడ్జీలతో తన నిరసనను కొనసాగించారు. ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. లలిత్ మోదీ కుంభకోణంపై చర్చను చేపట్టాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని కోరింది.
ఎంపీ మల్లి ఖార్జున ఖర్గే ఈ అంశంపై చర్చించాల్సిందేనంటూ పట్టుబట్టారు. అయితే దీన్ని తిరస్కరించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ విపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు సభ లో కొనసాగుతున్న ప్రతిష్టంభనపై స్పీకర్ ఆల్ పార్టీ సమావేశం నిర్వహించాలని ములాయం కోరారు. సభలో ప్లకార్డులతో ఆందోళన చేయడం సరికాదని పదే పదే గుర్తు చేశారు. అయినా విపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ వాయిదా పడింది.
అటు రాజ్యసభలో గందరగోళం నెలకొంది. లలిత్ గేట్ వివాదంపై కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. నిరసనకు దిగారు. సభ నిర్వహణకు సహకరించాలని ఉపాధ్యక్షుడు కురియన్ విజ్ఞప్తులను సభ్యులు లక్ష్యపెట్టలేదు. సభ్యుల నిరసనలు నినాదాల మధ్యే సభ ను కొనసాగించడానికి ప్రయత్నించారు దీనిపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిలో మార్పులేకపోవడంతో చివరికి మధ్యాహ్న 12 గంటలకు వాయిదా పడింది.
Advertisement
Advertisement