
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టబోతుందని స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో
భోపాల్ : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టబోతుందని స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో.. బీజేపీ శ్రేణులు అవకాశం ఉన్న ఆయా రాష్ట్రాల్లో అధికారం కోసం కార్యాచరణను మొదలు పెట్టాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో ఉందని పేర్కొంటూ గవర్నర్ ఆనందిబెన్ పటేల్కు సోమవారం బీజేపీ లేఖ రాసింది. వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కోరింది. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కాంగ్రెస్ సరైన పాలనను అందించడంలో విఫలమైందని బీజేపీ నేత హితేష్ బాజ్పై మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమాజ్ వాదీ పార్టీ (1), బీఎస్పీ (2), ఇండిపెండెంట్లు (4) సహకారంతో అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. మొత్తం 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ 114 సీట్లు దక్కించుకుని మ్యాజిక్ ఫిగర్ (116)కు ఒక అడుగు దూరంలో నిలిచింది. బీజేపీ 109 సీట్లతో అధికారాన్ని కోల్పోయింది. కేంద్రంలో తమ ప్రభుత్వమే కొలువుదీరనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చడంతో మధ్యప్రదేశ్లో మళ్లీ పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే గవర్నర్ను కలిసి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కోరినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.