
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థపై న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై చర్చ జరగాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి మఖ్దూంభవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. న్యాయ స్థానాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై దళిత, వామపక్ష సంఘాలు ఆందోళనగా ఉన్నాయన్నారు. దీనిపై ఏప్రిల్ 2న దళిత సంఘాలు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయన్నారు.
ఈ నిరసనలకు దేశవ్యాప్తంగా సీపీఐ మద్దతు ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తానంటున్న ఫ్రంట్ గురించి తమతో చర్చించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మతోన్మాదంపై కేసీఆర్ వైఖరి ఏమిటో చెప్పకుండా ఫ్రంట్లో చేరే విషయంపై ఏమీ చెప్పలేమన్నారు. చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి 4 వరకు ఆర్టీసీ కళ్యాణ మండపంలో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, నేడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బహిరంగ సభ జరుగుతుందన్నారు.