
అరెస్టయినవారితో జక్కంపూడి విజయలక్ష్మి
రాజమహేంద్రవరం సిటీ: ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న అన్ ఎయిడెడ్ అధ్యాపకులు, తమ సమస్యలు చెప్పుకోవాలని ప్రయత్నిస్తే.. ప్రభుత్వం వారి గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం దారుణమని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీ దండాలు’ పేరుతో అన్ ఎయిడెడ్ అధ్యాపకులు శుక్రవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తలపెట్టారు. దీనికి బయలుదేరుతున్న సుమారు 62 మందిని వన్టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీసీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి హుటాహుటిన స్టేషన్కు చేరుకుని, అన్ ఎయిడెడ్ అధ్యాపకులకు సంఘీభావం తెలిపారు.
వన్టౌన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి వారిని సొంత పూచీకత్తులపై విడిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలను వినే ప్రయత్నం చేయకుండా, అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతోందన్నారు. అన్ ఎయిడెడ్ స్టాఫ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంజీవరావు మాట్లాడుతూ, ఎయిడెడ్ స్టాఫ్ కోసం ప్రభుత్వం ఏటా రూ.60 కోట్లు మంజూరు చేస్తోందని, అవి ఖర్చు కాకపోవడంతో వేరే కార్యక్రమానికి మళ్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ సిబ్బందికి మంజూరు చేసిన నిధులను అన్ ఎయిడెడ్ సిబ్బంది కోసం వినియోగిస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొంతా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment