
సాక్షి, అమరావతి: 12వ రోజు సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ లోకాయుక్త సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు దిశగా ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల సవరణ బిల్లును ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రవేశపెట్టారు. మార్కెట్ కమిటీ సవరణ బిల్లును మంత్రి మోపిదేవి వెంకటరమణ సభ ముందుకు తీసుకొచ్చారు. ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక నిర్వహక అథారిటీ (ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ) బిల్లు 2019ను మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, నిర్వహణ కమిషన్ బిల్లు, ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, నిర్వహణ బిల్లును విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై చర్చ అనంతరం ఏపీ శాసనసభ వీటిని ఆమోదించనుంది.
అవినీతిరహితంగా టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి శ్రీకారం చుట్టేందుకు, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకు జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జ్ అద్వర్యంలో టెండర్ల పరిశీలన చేపట్టనున్నారు. రూ. 100 కోట్ల పైబడిన ప్రాజెక్టులు ఈ కమిషన్ పరిధిలోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment