
సాక్షి, ఇడుపులపాయ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలకు గాను మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన సంచలనానికి తెరలేపారు. ఇప్పటికే 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. అన్ని సామాజిక వర్గాలకు సమప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ జగన్ ఒకేసారి మొత్తం అసెంబ్లీ స్థానాలకు అభ్యుర్థుల్ని ప్రకటించి తండ్రి బాటను అనుసరించారు.
2009 ఎన్నికల సందర్భంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 294 ఎమ్మెల్యే స్థానాలకు 282 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరారు. కేవలం పాతబస్తీ సీట్లను మాత్రమే తర్వాత ప్రకటించారు.ఇక అభ్యర్థుల జాబితా విడుదల అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చాం. బీసీలకు 41 సీట్లు కేటాయించాం. చంద్రబాబు బీసీలను మోసం చేశారు. బలిజలకు ఇచ్చిన సీట్లను బీసీల కోటాలో చూపించారు. తద్వారా బీసీలకు టికెట్ల కోటా పెంచామని మోసం చేస్తున్నారు. ముస్లిం సోదరులకు 5 సీట్లు కేటాయించాం. గతంలో కన్నా ఒక సీటు పెంచాం. ప్రజాభిప్రాయ సేకరణ, సర్వేల మేరకు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్ కేటాయించలేదు. అందరికీ ధన్యవాదాలు’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment