
సాక్షి, ఏలూరు : అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేశారని, గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చిన ఆయన వాటిని అమలు చేయలేదని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ, సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం జరిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తల బూత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 15 నెలలుగా ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేపట్టారని, వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నల పథకాలు ద్వారా మరలా వైఎస్సార్ పాలన వస్తుందని అన్నారు. నవరత్నల పథకంతో ప్రతి పేదవాడికీ, అన్ని వర్గాల ప్రజలకూ లబ్ధి చేకూరుతుందని, కాబట్టి బూత్ కమిటీ సభ్యులు ఈ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు ఐదుకోట్ల మంది ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర డీజీపీ, సీఎం చంద్రబాబు సహకారంతోనే వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిందన్నారు. అందుకే అప్పటికప్పుడు డీజీపీ మీడియా సమావేశం నిర్వహించారని గుర్తుచేశారు. చంద్రబాబు కింద పనిచేసే అధికారులే ఇది హత్యాయత్నంగా చెప్పారని, కానీ ఇప్పుడు ఈ కేసును నీరు గారుస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ప్రతి బూత్ కమిటీ సభ్యుడు ఈ మూడు నెలలు సైనికుడిగా పనిచేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఆళ్లనాని, వైవీ చౌదరి, కోటగిరి శ్రీధర్, కొఠారు అబ్బయ్య చౌదరి సహా పలువురు జిల్లా నేతలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment