
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయంటూ దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ... సాక్షాత్తు ముఖ్యమంత్రి ఓటు వేసి వచ్చిన ఈవీఎం పనిచేయలేదని ప్రచారం చేయడం దారుణమన్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని విఙ్ఞప్తి చేశారు. ఓటమి భయంతో తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి.. వార్డు కన్వీనర్ రాజు పై దాడి చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో బడేటి బుజ్జిని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా కడపలోని పొద్దుటూరులో సీఎం రమేష్ కూడా పోలింగ్ ఏజెంట్లపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. పచ్చ చొక్కాలు వేసుకుని మరీ పోలింగ్ బూత్లోకి రావడమే కాకుండా.. ఈవీఎంలు మొరాయిస్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు చంద్రబాబు ఫ్యామిలీ పచ్చ చొక్కాలు వేసుకుని ఓటు వేశారని.. ఎల్లో మీడియా సహకారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గుత్తిలో జనసేన అభ్యర్థి ఈవీఎం పగులకొడితే వైఎస్సార్ సీపీ అభ్యర్థుల పేర్లు ఎల్లో మీడియా చానెళ్లలో చెబుతున్నారని ధ్వజమెత్తారు. అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment