
క్నో: కుర్ర సంచలనం పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో మళ్లీ అదరగొట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అతను, తన తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్లో కూడా శతకం బాదాడు. పృథ్వీ షా (249 బంతుల్లో 154; 18 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత సెంచరీతో పాటు సీనియర్ దినేశ్ కార్తీక్ (155 బంతుల్లో 111; 12 ఫోర్లు) కూడా శతకం సాధించడంతో ఇండియా ‘బ్లూ’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ‘రెడ్’ తొలి రోజు భారీ స్కోరు సాధించింది.
సోమవారం ఆట ముగిసే సమయానికి రెడ్ 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ (17 ఏళ్ల 262 రోజులు) తర్వాత అతి పిన్న వయసులో (17 ఏళ్ల 320 రోజులు) దులీప్ ట్రోఫీలో సెంచరీ సాధించిన ఆటగాడిగా పృథ్వీ షా నిలిచాడు. సచిన్లాగే ఈ ముంబైకర్ కూడా తన తొలి రంజీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్లలో శతకాలు చేయడం విశేషం. బ్లూ బౌలర్లలో భార్గవ్ భట్కు 3 వికెట్లు దక్కాయి.