
జ్యోతి సురేఖకు మరో 2 స్వర్ణాలు
ఆసియా గ్రాండ్ప్రి ఆర్చరీ
బ్యాంకాక్: ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఆసియా గ్రాండ్ప్రి టోర్నీని ఘనంగా ముగించింది. ఈ టోర్నీలో రెండు రోజుల క్రితమే టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించిన సురేఖ కాంపౌండ్ విభాగంలో శనివారం మరో 2 స్వర్ణాలు అందుకుంది. వీటితో పాటు ఒక రజతం, ఒక కాంస్యం కూడా సొంతం చేసుకుంది. ఒలింపిక్ రౌండ్ (మిక్స్డ్ టీమ్)లో అభిషేక్ వర్మతో కలిసి సురేఖ స్వర్ణం గెలుచుకుంది. ఈ జోడి 160 పాయింట్లకు గాను 152 పాయింట్లు సాధించి 2 పాయింట్ల తేడాతో ఇరాన (150)ను ఓడించింది. మిక్స్డ్ టీమ్ ర్యాంకింగ్ రౌండ్లోనూ ఈ జంటకు స్వర్ణం లభించింది.
వీరిద్దరు కలిసి మొత్తం 1440 పాయింట్లకుగాను 1397 పాయింట్లు స్కోర్ చేశారు. ర్యాంకింగ్ రౌండ్ వ్యక్తిగత విభాగం (డబుల్ 50)లో సురేఖకు రజతం దక్కింది. ఇందులో ఆమె 689/720 పాయింట్లు సాధించింది. ర్యాంకింగ్ రౌండ్ మహిళల టీమ్ విభాగంలో కాంస్యం గెలుచుకున్న భారత జట్టులోనూ సురేఖ సభ్యురాలిగా ఉంది. సురేఖ, లిల్లీ చాను, గగన్దీప్ కౌర్లతో కూడిన ఈ టీమ్ 2043/2160 పాయింట్లు స్కోర్ చేసి మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్గా ఆసియా గ్రాండ్ప్రి ద్వారా 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం సురేఖ ఖాతాలో చేరాయి.