
చాంప్స్ స్మృతి, సంస్కృతి
జూనియర్ టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ఏస్టర్ మైండ్స్ జూనియర్ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్మృతి బాసిన్, సంస్కృతి సింగిల్స్ టైటిళ్లను చేజిక్కించుకున్నారు. బోయిన్పల్లిలోని పల్లవి స్కూల్ గ్రౌండ్స్లో నిర్వహించిన ఈ టోర్నీలో బాలికల అండర్-12 టైటిల్ను స్మృతి, అండర్-14 టైటిల్ను సంస్కృతి గెలుచుకున్నారు.
అండర్-12 ఫైనల్లో స్మృతి బాసిన్ 8-6తో సంస్కృతిపై గెలుపొందగా, అండర్-14 ఫైనల్లో సంస్కృతి 8-5తో లాస్యపై నెగ్గింది. అండర్-10 ఫైనల్లో తనుశిత రెడ్డి 8-3తో వేద వర్షితపై విజయం సాధించింది. బాలుర అండర్-10 ఫైనల్లో సుంకర రుషికేష్ 8-1తో ముకుంద్ రెడ్డిపై, అండర్-12లో ప్రీతమ్ 8-7 (7/4)తో అన్నే ఆకాశ్పై, అండర్-14లో హర్షిత్ కొసరాజు 8-7 (7/1)తో ప్రీతమ్పై గెలుపొందారు. చీఫ్ రిఫరీ ఎ.ఆర్.రావు, నిర్వాహకులు వెంకటరామన్ ట్రోఫీలు అందజేశారు.