
మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్
సాక్షి, న్యూఢిల్లీ: క్రికెటర్ల వ్యక్తిగత, వైవాహిక విషయాల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకోదని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టం చేసిన నేపథ్యంలో మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో తన భర్త షమీపై నిషేధం విధించాలని కోరిన హసీన్ జహాన్.. ఎలాగైనా సరే అతడిని ఆడకుండా చేయాలంటోంది. ఈ మేరకు శనివారం ఢిల్లీ డేర్డెవిల్స్ సీఈఓ హేమంత్ దువాను షమీ భార్య కలిసింది.
అనంతరం జాతీయ మీడియాతో హసీన్ జహాన్ మాట్లాడుతూ.. 'ఐపీఎల్ ఢిల్లీ ఫ్రాంచైజీ యజమాని హేమంత్ దువాని కలిశాను. నా భర్త షమీని ఈ ఐపీఎల్ సీజన్లో ఆడించవద్దని కోరాను. మా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు, షమీపై నమోదైన కేసుల వ్యవహారం తేలేంతవరకు షమీని ఢిల్లీ జట్టుకు దూరం చేయాలని' ఆ ఫ్రాంచైజీ సీఈఓను కోరినట్లు వివరించింది.
ఇటీవల డెహ్రడూన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డ షమీని కలిసేందుకు హసీన్ జహాన్ వెళ్లగా ఆమెను కలిసేందుకు క్రికెటర్ నిరాకరించిన విషయం తెలిసిందే.
షమీ తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని పలు ఆరోపణలు చేస్తూ హసీన్ జహాన్ ఫిర్యాదు చేయగా టీమిండియా పేసర్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాకిస్తాన్ యువతి నుంచి డబ్బులు తీసుకుని ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధికారులు షమీకి క్లీన్ చిట్ ఇవ్వడంతో ఐపీఎల్కు సిద్ధమవుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment