
క్వార్టర్స్లో సైనా, సింధు
► లీ చోంగ్ వీ, లిన్ డాన్ ఓటమి
► ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ
న్యూఢిల్లీ: మరోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న సైనా... కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉన్న పీవీ సింధు... ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో సైనా 21-19, 21-14తో నిచావోన్ జిందాపోల్ (థాయ్లాండ్)పై గెలుపొందగా... సింధు 17-21, 21-19, 21-16తో బుసానన్ ఒంగ్బుమ్రుంగ్ఫన్ (థాయ్లాండ్)ను ఓడించింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్లో బే యోన్ జు (దక్షిణ కొరియా)తో సింధు; సుంగ్ జి హున్ (దక్షిణ కొరియా)తో సైనా తలపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులందరూ తొలి రౌండ్లోనే నిష్ర్కమించగా... పురుషుల, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత జోడీలన్నీ ప్రిక్వార్టర్ ఫైనల్ను దాటలేకపోయాయి. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మొహిత సహదేవ్-సంజన సంతోష్ జంట 21-16, 21-7తో సీహెచ్ పూర్ణిమ-రచిత సహదేవ్ జోడీని ఓడించింది.
పురుషుల డబుల్స్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జంట 19-21, 12-21తో చెన్ హంగ్ లింగ్-చీ లిన్ వాంగ్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో... జిష్ణు సాన్యాల్-శివమ్ శర్మ ద్వయం 17-21, 15-21తో లీ షెంగ్ ము-సై చియా సిన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో... ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ జోడీ 18-21, 15-21తో కిమ్ జీ జంగ్-కిమ్ సా రంగ్ (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయాయి. మిక్స్డ్ డబుల్స్లో వెంకట్ గౌరవ్ ప్రసాద్-జూహీ దేవాంగన్; ప్రణవ్ చోప్రా-సిక్కి రెడ్డి; మనూ అత్రి-అశ్విని పొన్నప్ప జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి చవిచూశాయి.
మరోవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) 19-21, 19-21తో వీ నాన్ (హాంకాంగ్) చేతిలో, నాలుగో సీడ్ లిన్ డాన్ (చైనా) 13-21, 20-22తో సన్ వాన్ హో (కొరియా) చేతిలో అనూహ్యంగా ఓడిపోయి ఇంటిదారి పట్టారు.